
న్యూజిలాండ్ ప్రధామంత్రి జసిండా అర్డెర్న్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. గతవారం క్రైస్ట్చర్చ్ మసీదులో కాల్పుల మారణహోమం ఉదంతాన్ని సీరియస్గా తీసుకున్న ప్రధాని జసిండా అసాల్ట్ రైఫిల్స్, సెమీ ఆటోమెటిక్ రైఫిళ్ల అమ్మకాలపై నిషేధం విధిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు. సెమీ ఆటోమెటిక్ రివాల్వర్లతోపాటు బ్రెంటన్ వాడిన అన్ని రకాల ఆయుధాలపైనా నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఆదేశించింది.
ఈ నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందంటూ ప్రధాని ఒక అధికారిక ప్రకటన జారీ చేశారు. అలాగే కఠినమైన తుపాకీ చట్టాల చట్టం ఏప్రిల్ 11 నాటికి తీసుకురానున్నామని చెప్పారు. ఈ తుపాకీ చట్టం అమల్లోకి రావడానికంటే ముందు మధ్యంతర చర్యగా ఆయుధాల అమ్మకాలపై బ్యాన్ విధించినట్టు జసిండా వివరించారు.
మార్చి 15న క్రైస్ట్చర్చ్లోని మసీదుల్లో బ్రెంటన్ అనే ఆస్ట్రేలియా యువకుడి విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 50మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే త్వరితగతిన స్పందించిన న్యూజిలాండ్ ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది. ఇకపై రైఫిళ్లను ఎవరు బడితే వాళ్లు కొనే ఛాన్స్ లేకుండా కట్టడి చేసింది. ఇందుకు సంబంధించి మిలిటరీలో వాడే అన్ని రకాల తుపాకులనూ బయటి మార్కెట్లో అమ్మడాన్ని నిషేధిస్తున్నట్లు ఆమె తెలిపారు. అసాల్ట్ రైఫిల్స్, ఎక్కువ శక్తిమంతమైన రైఫిళ్లతో పాటూ ఫైర్ ఆర్మ్ను మిలిటరీ తరహా ఆటోమేటిక్ తుపాకులుగా మార్చే పరికరాలను కూడా ఇకపై ఎవరూ అమ్మడానికి వీల్లేదన్నారు. ఈ చర్యలతో న్యూజిలాండ్లో ఉగ్రవాద చర్యలను దాదాపు పూర్తిగా అడ్డుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment