
పోంగ్యాంగ్ : అమెరికాకు కొరకరాని కొయ్యగా మారిన కిమ్ జాంగ్ ఉన్ కొత్త ఏడాదిని తనదైన స్టైల్లో జరుపుకొన్నారు. ఏ శక్తీ ఛేధించలేని అణ్వస్త్రదేశంగా ఉత్తరకొరియా మారాలంటూ ప్రజలకు సందేశమిచ్చారు. అదే సమయంలో శత్రుదేశాల ఒళ్లుగగుర్పొడిచేరీతిలో హెచ్చరికలు చేశారు.
‘‘నా టేబుల్పై ఎప్పుడూ ఒక బటన్ ఉంటుంది. నొక్కితే అంతా బుగ్గిపాలే. అది.. న్యూక్లియర్ వెపన్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా. ఇక ముఖ్యమైన విషయం.. అణ్వస్త్రాల తయారీని మనం ఇంకా వేగవంతం చేయాలి. ఖండాంతర క్షిపణులను పెద్ద ఎత్తున మోహరింపజేయాలి. ప్రపంచంలోని ఏ శక్తీ మన(ఉత్తరకొరియా) జోలికి రాకుండా చూసుకోవాలి’’ అని కింమ్ జాంగ్ నూతన సంవత్సర సందేశంలో చెప్పారు.
ప్రపంచ దేశాల అభ్యర్థనను, ఐక్యరాజ్యసమితి ఆంక్షలను పెడచెవినపెడుతూ ఉత్తరకొరియా తన అణ్వస్త్రాలను పెంపొందించుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ దేశం గత ఏడాది అణుబాంబులతోపాటు హైడ్రోన్ బాంబును కూడా పరీక్షించింది. దారికి రాకుంటే యుద్ధం తప్పదన్న అమెరికా హెచ్చరికల నేపథ్యంలో కొరియా ఇంకాస్త రెచ్చిపోయి ఆయుధసంపత్తిని కూడబెట్టుకుంటోంది. అమెరికా, దాని మిత్ర దేశాలు తమను భయపెడుతూ సైనిక విన్యాసాలు నిర్వహించినంత కాలం అణు కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉంటామని కిమ్ దేశం స్పష్టం చేసింది.