ప్రపంచంలోనే అత్యంత బరువు ఉన్న బాలుడిగా రికార్డుల్లోకెక్కిన ఆర్య పర్మానా(10) తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు.
పదేళ్లకే 192 కిలోల బరువు...
Published Wed, Jun 29 2016 7:29 PM | Last Updated on Thu, Mar 28 2019 6:33 PM
ప్రపంచంలోనే అత్యంత బరువు ఉన్న బాలుడిగా రికార్డుల్లోకెక్కిన ఆర్య పర్మానా(10) తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. వయస్సుకు తగ్గ బరువుకన్నా మరీ అధికంగా ఉండటంతో బాలుడి ప్రాణానికేమైనా ప్రమాదముందేమోనని బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పదేళ్లకే 192 కిలోల బరువు పెరగడంతో బాలుడికి వేయడానికి దుస్తులు కూడా లభించడం లేదు. దీంతో లుంగిలాంటి వస్త్రాలనే ధరిస్తున్నాడు.
'ఆర్య రోజుకు ఐదుసార్లు ఆహారం తీసుకుంటాడు. అన్నం, బీఫ్, చేపలు, కూరగాయల సూప్ వంటివి ఎక్కువగా తింటాడని' తల్లి రోకయ తెలిపింది. రోకయ(35)కి ఆర్య రెండో సంతానం. తండ్రి సోమంత్రి(45) వ్యవసాయం చేస్తూ కుటుంబపోషణ చూసుకుంటున్నాడు.

ఇండోనేషియాలోని పశ్చిమ జవ ప్రావిన్స్కు చెందిన ఆర్య ఊబకాయంతో నడవడం ఇబ్బందికరంగా మారడంతో ఆఖరికి స్కూల్కి కూడా వెళ్లడం లేదని అతని తల్లి రోకయ తెలిపింది. బాలుడు నిరంతరం ఆకలితోనే ఉంటాడని ..దీంతో చేసేదేమీలేక బరువు తగ్గడం కోసం క్రాష్ డ్రైటింగ్లో భాగంగా ఆర్యకు బ్రౌన్ రైస్ను మాత్రమే పెడుతూ, రోజువారి ఆహారంలో కోత పెడుతున్నామని తల్లిదండ్రులు తెలిపారు.

'నార్మల్ డెలివరీ ద్వారానే జన్మించిన ఆర్య పుట్టినప్పుడు మాములుగానే 3.8 కిలోలతో జన్మించాడు. కానీ, రెండేళ్లు పూర్తవగానే ఆర్య బరువు అసాధారణంగా పెరగడం ప్రారంభమైంది. మొదటి కుమారుడు ఆర్దీ కన్నా ఆర్యనే బరువు ఎక్కువ...గ్రామంలో కూడా మిగతా పిల్లలకన్నా ఎక్కువ బరువున్నా ఏమీ కాదులే అనుకున్నాం. కానీ, ఏకంగా మరీ ఎక్కువ బరువు పెరగడంతో ఆందోళన మొదలైంది. ఆర్యను మా గ్రామం సిపువార్సిలోని చాలా మంది వైద్యుల దగ్గరికి తీసుకు వెళ్లాం. కానీ, వారందరూ ఆర్య ఆరోగ్యంగానే ఉన్నాడని చెప్పారు. అవసరం అనుకుంటే మెరుగైన వైద్యం కోసం పట్నం లోని పెద్ద ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు' అని తండ్రి సోమంత్రి తెలిపారు.

'ఆర్య ఎప్పుడూ అలసిపోయినట్టు ఉంటాడు. నడవలేకపోతున్నాను, నడుస్తుంటే ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది అంటూంటాడు. తినడం పడుకోవడం మాత్రమే చేస్తాడు. ఇవి రెండు కాకుండా బాత్ టబ్లో దూకి గంటలకొద్ది అందులోనే ఉంటాడు. ఇద్దరు పెద్దవాళ్లు ఒక పూటకు తినే ఆహారాన్ని అతను ఒకేసారి తింటాడు. ఆర్య అలా ఇబ్బందిపడుతుంటే తట్టుకోలేక పోతున్నాం. నా కుమారుడు అందరిలా స్కూల్కు వెళ్లి తొటి విద్యార్థులతో చదువుకుంటూ, ఆటల్లో కూడా ముందుండాలని కోరుకుంటున్నా' అని తల్లి రోకయ ఆవేదనతో ఆంటోంది.

'నేను ఒక సాధారణమైన రైతును. నా స్తోమతకు మించి బాబును పెద్ద ఆసుపత్రుల్లో చూపించాను. అప్పు తెచ్చిన డబ్బుతో వాడి ఆకలి తీర్చుతున్నానని వాడికోసం నాకు చేతనైనంత చేసి అలసిపోయాను. ఖరీదైన ఆసుపత్రుల్లో వైద్యం అందించలేకపోతున్నాను..కానీ, నా కుమారుడు తప్పకుండా ఏదో ఒకరోజు అందరిలానే మామూలువాడిలా అవుతాడని ఆశిస్తున్నాను అని' తండ్రి సోమంత్రి అంటున్నాడు.


Advertisement
Advertisement