
కార్తీక్ విఘ్నేశ్, వేదిక, ఆది సాయికుమార్, కావ్య వేణుగోపాల్
ఆది సాయికుమార్, వేదిక జంటగా కార్తీక్ విఘ్నేశ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ సినిమా హైదరాబాద్లో సోమవారం ప్రారంభమైంది. నిఖిల్తో ‘అర్జున్ సురవరం’ చిత్రాన్ని నిర్మించిన అరా సినిమాస్ బ్యానర్పై కావ్య వేణుగోపాల్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. న్యూ ఏజ్ సినిమా, తిరు కుమరన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలు ఈ చిత్రంలో భాగస్వామ్యం అవుతున్నాయి.
‘‘వైవిధ్యమైన కథతో తెరకెక్కనున్న చిత్రమిది. చిత్తూరు జిల్లాలోని తలకోనలో ఈ నెల 25న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ‘రోబో, 2.0’ చిత్రాలకు అసోసియేట్ కెమెరామేన్గా పనిచేసిన గౌతమ్ జార్జ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సి.సత్య స్వరాలు సమకూరుస్తున్నారు. హీరోయిన్ వేదిక నటిస్తున్న నాలుగో తెలుగు చిత్రమిది. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి.