
పండిన మిర్చి
గత ఐదేళ్లుగా ప్రకటించకుండా జాప్యంలో ఉంచిన నంది అవార్డులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. 2012, 2013 సంవత్సరాలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ‘నంది అవార్డు’లను ప్రకటించింది. 2012కు సీనియర్ నటి జయసుధ, 2013కు ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ అవార్డు కమిటీలకు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ రెండు కమిటీలు ఎంట్రీలను పరిశీలించి, విజేతలను నిర్ణయించాయి. జనరంజక సినిమాలుగా రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన ‘ఈగ’, ‘మిర్చి’ ఉత్తమ చిత్రాలుగా ఎంపిక కావడం గమనార్హం. 2012లో ఉత్తమ జాతీయ సమైక్యత, ఉత్తమ లఘు చిత్రం, ఉత్తమ బాలల చిత్రాల విభాగాల్లో ఎవరికీ అవార్డు దక్కకపోవడం బాధాకరం. 2013లో ఉత్తమ బాలల చిత్రం విభాగంలో మినహా అన్ని విభాగాల్లోనూ విజేతలను ఎంపిక చేశారు.
ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు విభాగాల్లో అవార్డులు గెలుచుకొని ‘మిర్చి’ 2013 సంవత్సరంలో సత్తా చాటింది. పల్నాటి కక్షలు, కార్పణ్యాలను కథావస్తువుగా తీసుకొని వినోదాత్మకంగా కథను నడపటమే ఈ అవార్డుల గెలుపుకు కారణం అని చెప్పుకోవచ్చు.
అమ్మ ఉండి ఉంటే ఆనందపడేది
నమ్మి చేసిన ప్రయత్నానికి ప్రభుత్వం ఇచ్చే అవార్డు తోడైనప్పుడు ఆనందం వేరే స్థాయిలో ఉంటుంది. ‘మిర్చి’ తీసేటప్పుడు అవార్డుల గురించి ఆలోచించే స్థితిలో లేను. డైరెక్టర్గా మొదటి సినిమా కాబట్టి, కమర్షియల్ సక్సెస్ పైనే దృష్టి పెట్టాను. కెరీర్లో మొదటి అడుగు కాబట్టి, టెన్షన్గా ఉండేది. ప్రభాస్ డేట్స్ ఇవ్వడం, యూవీ క్రియేషన్స్ సినిమా తీయడానికి ముందుకు రావడంతో వాళ్ల నమ్మకం వమ్ము కాకూడదనే ఫీలింగ్ ఉండేది. చివరికి నిలబెట్టగలిగాను. నన్ను ఉన్నత స్థానంలో చూడాలనుకున్న మా అమ్మగారు ‘మిర్చి’ షూటింగ్ అప్పుడు చనిపోయారు. ఆవిడ ఉండి ఉంటే ఆనందించేది. నేను డైరెక్టర్ కావడానికి నా భార్య ప్రోత్సాహం చాలా ఉంది.
– దర్శకుడు కొరటాల శివ
ఆరు నందులు... ఎంతో ఆనందం
మా స్నేహితుడు ప్రభాస్ హీరోగా నటించిన ‘మిర్చి’తో మా సంస్థ ప్రయాణం మొదలైంది. తొలి చిత్రంతోనే 6 నందులు రావడం ఆనందంగా ఉంది. ఉత్తమ హీరోగా ప్రభాస్కి పురస్కారం రావడం, అది కూడా మా చిత్రంతో రావడం మరింత సంతోషంగా ఉంది. మరిన్ని మంచి చిత్రాలు, నాణ్యత గలవి నిర్మించడానికి ఈ పురస్కారాలు ఉత్సాహం అందించాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. – నిర్మాతలు వంశీ, ప్రమోద్
ఈ నంది ఆ ఇద్దరిదే!
నంది పురస్కారం రావడం సంతోషం. అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా పురస్కారం ప్రకటించారు. ‘అత్తారింటికి దారేది’ ఎంత ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పేదేముంది. సమిష్టి కృషితో తీసిన చిత్రమిది. హీరో పవన్కల్యాణ్గారు బ్రహ్మాండంగా నటించారు. దర్శకుడు త్రివిక్రమ్గారు అద్భుతంగా తీశారు. ఈ నంది పురస్కారం వాళ్లిద్దరికీ చెందుతుంది.
– నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్
గురువుగారి ఆశీర్వాద ఫలమే..
మంగళవారం నా గురువుగారు మాండలిన్ శ్రీనివాస్కు నివాళిగా ‘గురవ్వే నమః’ పాటను విడుదల చేశాను. తెలుగు చిత్రపరిశ్రమలో విజయం సాధించిన ‘అత్తారింటికి దారేది’ చిత్రానికి సంగీత దర్శకునిగా వ్యవహరించినందుకు ఏపీ ప్రభుత్వం నంది అవార్డు పురస్కారాన్ని బుధవారం నాకు ప్రకటించింది. నా గురువుగారి ఆశీర్వాద ఫలంగానే ఈ అవార్డు వచ్చిందని భావిస్తున్నాను.
– సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్
ప్రేక్షకులకు సలామ్
‘‘20 ఏళ్లుగా నేను ఉద్యమంలో ఉన్నాను. ఎన్నో స్పీచ్లు ఇచ్చినా తీసుకురాలేని చైతన్యం.. రెండు గంటల సినిమా ‘నా బంగారు తల్లి’ తీసుకొచ్చింది. విజువల్ మీడియాకి అంత పవర్, రీచ్ ఉన్నాయి. మసాలా, కమర్షియల్ పేరుతో ప్రేక్షకుల బలహీనతలు సొమ్ము చేసుకుంటున్నారు. అలాంటి టైమ్లో ఓ ఐటమ్ సాంగ్, ఒక యాక్షన్ సీక్వెన్స్ లేని మా సినిమాకు కమర్షియల్ సినిమాలతో సమానంగా గుర్తింపు వచ్చింది. ఓ సామాజిక ఉద్యమకర్తగా ఈ అవార్డుని నేనో గొప్ప విజయంగా, ఉద్యమానికి వచ్చినట్టుగా భావిస్తున్నా. ఈ సినిమా చేయడానికి మా ఇల్లు, మా ఆస్తులన్నీ అమ్మేశాను. మంచి సినిమా చేస్తే... ఇండస్ట్రీ గుర్తిస్తుంది, సులభంగా విడుదల చేసేయొచ్చు అనుకున్నా. కానీ, విడుదలకు చాలా ఇబ్బందులు పడ్డా. ఆ టైమ్లో ఎవరూ గుర్తించలేదు. ఎక్కడ చూసినా తిరస్కరణే ఎదురైంది. ఎన్ని అవమానాలు ఎదురయ్యాయో మాటల్లో చెప్పలేను.
ఇప్పుడు వాటి గురించి ఆలోచిస్తుంటే నా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. ఎందుకంటే... నాతో మంచిగా మాట్లాడేవారు. నాతో ప్రివ్యూ షో వేయించుకుని చూసేవారు. ప్రివ్యూ తర్వాత ‘అమ్మా... సునీత! ఎంత మంచి సినిమా తీశావమ్మా. అద్భుతంగా ఉంది. నాకు నా బిడ్డ గుర్తొచ్చింది’ అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పేవారు. ‘సార్... మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తారా?’ అనడిగితే.. ‘లేదమ్మా. ఇలాంటి సినిమాను మేము డిస్ట్రిబ్యూట్ చేయం’ అనేవారు. ‘మంచి చిత్రానికి కావలసినవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. అద్భుతంగా ఉందంటున్నారు కదా. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద భావించి ఈ సినిమా విడుదల చేయండి’ అని ఓ పెద్ద డిస్ట్రిబ్యూటర్ కాళ్ల మీద పడ్డాను. కానీ, కనికరించలేదు. రివర్స్లో ‘ఎవరన్నా ఇలాంటి సినిమా చూడడానికి వెళతారా?’ అని నన్ను ప్రశ్నించారు. ఇలా ప్రశ్నించిన ప్రతి ఒక్కరి నోరు మూయించిన ప్రేక్షకులకు నేను సలాం చేస్తున్నా. పబ్లిక్ డిమాండ్ మీద టీవీలో 18 సార్లు ప్రదర్శించారు. భవిష్యత్తులోనూ సినిమాల ద్వారా సామాజిక మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తా. ప్రస్తుతం ‘రక్తం’ అనే సినిమా చేస్తున్నా.
– నిర్మాత సునీతా కృష్ణన్
నంది వస్తుందని నమ్మాను
‘సినిమా గా సినిమా’.. ‘బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్’గా పలు అవార్డులు అందుకుని, పాత్రికేయునిగా, రచయితగా గొప్ప పేరు, ప్రఖ్యాతులు సంపాదించిన నందగోపాల్ నాదెళ్ల రాసిన పుస్తకం ఇది. 61వ జాతీయ ఫిల్మ్ అవార్డ్స్లో ‘ఉత్తమ గ్రంథం’ అవార్డు గెల్చుకున్న పుస్తకం ఇది. ఇప్పుడు 2013 నంది అవార్డులలోనూ ‘తెలుగు సినిమాపై ఉత్తమ పుస్తకం’ విభాగంలో ‘సినిమా గా సినిమా’ ఎంపికైంది. జాతీయ అవార్డుకు దాదాపు 45 పుస్తకాలకు పైగా పోటీ పడగా, నా ‘సినిమా గా సినిమా’కు అవార్డు వచ్చింది. నంది అవార్డు కూడా వస్తుందని నమ్మాను. అది నిజమైంది.
– సీనియర్ పాత్రికేయులు నందగోపాల్
మరిన్ని మంచి సినిమాలొస్తాయి
చిన్న సినిమాలకు అవార్డు వస్తే ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరిన్ని మంచి సినిమాలు రావడానికి కారణమవుతుంది. అందుకని ‘ఉయ్యాల జంపాల’ను ఎంపిక చేసిన ‘నంది అవార్డు’ జ్యూరీకి, ప్రభుత్వానికి ధన్యవాదాలు. సురేశ్బాబు, నాగార్జునల సహకారంతోనే ఈ సినిమా సాధ్యమైంది. ఈ సినిమాలో నటించిన రాజ్తరుణ్, అవికా గోర్ హీరో హీరోయిన్లుగా మంచి స్థాయికి వెళ్లడం పట్ల మీ ఫీలింగ్? అనడిగితే – ‘‘ఆనందంగా ఉంది. ఆ మాటకొస్తే ‘అష్టా చమ్మా’ తర్వాత నాని, ఇందగ్రంటి మోహనకృష్ణల కెరీర్ మంచి స్థాయికి వెళ్లడం, ‘గోల్కొండ హైస్కూల్’లో చైల్డ్ ఆర్టిస్గా చేసి, ‘తను నేను’ ద్వారా మేం హీరోగా పరిచయం చేసిన సంతోష్ శోభన్ ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. అందరూ బాగుంటే ఆనందమే కదా.
– నిర్మాత పి. రామ్మోహన్
అది నా పూర్వజన్మ సుకృతం
ఎస్వీ రంగారావుగారి పురస్కారం రావడం ఫుల్ హ్యాపీ. సమాజంలో ఓ మార్పు తెచ్చే కథాంశంతో తెరకెక్కిన ‘పరంపర’ చిత్రానికి ‘జకర్తా ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్’లో ప్లాటినమ్ డిస్క్ వచ్చింది. ఇప్పుడు నంది అవార్డు ఇవ్వడం చాలా సంతోషం. నా సినిమా జీవితం ‘పండంటి కాపురం’ చిత్రంలో మహానటుడు ఎస్వీ రంగారావుతో ప్రారంభమైంది. ఎటువంటి పాత్ర అయినా అవలీలగా పోషించే ఎస్వీఆర్ వంటి నటులు భారతదేశంలోనే లేరంటే అతిశయోక్తి కాదు. ఆయన్ను నటనలో నేను ఆదర్శంగా తీసుకున్నా. ఇప్పుడు ‘ఎస్వీ రంగారావు’ పురస్కారం అందుకోవడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. ‘చిత్రం ¿¶ ళారే విచిత్రం’, ‘సొగసు చూడ తరమా’, ముణిమాణిక్యం నరసింహారావు ‘కాంతం కథలు’(టీవీ)... ఇప్పటికి మూడుసార్లు నంది అవార్డులు సొంతం చేసుకున్నా. ఇప్పుడిది నాలుగో నంది. ఈ నంది అవార్డును నా గురువులైన జంధ్యాల, అమ్మ (విజయ నిర్మల)కు అంకితం చేస్తున్నా. నా దర్శకులందరికీ కృతజ్ఞతలు.
– నటుడు ‘సీనియర్’ నరేశ్
నన్ను ‘యాంగ్రీ మేన్’ అని పిలిచేవాళ్లు!
‘అత్తారింటికి దారేది’లో నేను చేసిన క్యారెక్టర్ని అన్ని ఏజ్ గ్రూప్లవాళ్లూ ఇష్టపడ్డారు. అది హ్యాపీ. ఆ పాత్రను త్రివిక్రమ్ అద్భుతంగా రాశారు. ఆర్టిస్టులకు స్వేచ్ఛ ఇచ్చే దర్శకుడు. అందుకే నేను బాగా చేయగలిగాను. పవన్ కల్యాణ్తో పెద్ద స్టార్ అయినప్పటికీ సింపుల్గా, ఫ్రెండ్లీగా ఉండేవారు. ఆయన అలా ఉండటంవల్లే నేను బాగా చేయగలిగాను. క్లైమాక్స్ సీన్లో మా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదరడానికి అదే రీజన్. ఈ సినిమా తాలూకు స్వీట్ మెమరీ ఏదైనా? యాక్చువల్గా ఇందులో నాది టఫ్ ఉమన్ రోల్. రియల్గా కూడా అలానే ఉంటాననుకునేవాళ్లు. కానీ, అంత టఫ్ కాదని తెలుసుకున్నారు. అయినప్పటికీ నేను లొకేషన్లోకి ఎంటర్వ్వగానే ‘రండి.. రండి.. యాంగ్రీ యంగ్ మేన్’ అని పిలిచేవాళ్లు. ఆ పిలుపుని ఎంజాయ్ చేసేదాన్ని.
– నటి నదియా
ఈ అవార్డు ప్రత్యేకం
ఉత్తమ కథా రచయితగా నాకు మొదటిసారి అవార్డు వచ్చింది. ‘అంతకు ముందు ఆ తర్వాత’ రచన, స్క్రీన్ప్లే... పరిపూర్ణంగా నా సొంత కథ. నా జీవితానుభవాల్లో కొన్ని అందులో ఉన్నాయి. ఈ అవార్డు నాకు ప్రత్యేకం.
ఈ సందర్భంగా నటీనటులతో పాటు మా నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్గారికి థ్యాంక్స్.
– దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి.
గొప్ప అదృష్టం
వెరీ హ్యాపీ. తొలి చిత్రానికి (‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’) ఉత్తమ స్క్రీన్ప్లే రచయితగా నంది అవార్డు రావడం అదృష్టంగా ఫీలవుతున్నా. త్రివిక్రమ్ శ్రీనివాస్గారు, కొరటాల శివగారు.. హేమాహేమీలతో వేదికను పంచుకునే అవకాశం దక్కడం గొప్ప అదృష్టం. ‘తాగుబోతు’ రమేశ్కి ఉత్తమ హాస్య నటుడిగా అవార్డు రావడం హ్యాపీ. మరిన్ని మంచి చిత్రాలు తీసి ప్రేక్షకులను నవ్వించాలని కోరుకుంటున్నా.
– దర్శకుడు మేర్లపాక గాంధీ.