
సాక్షి, ముంబయి : అభ్యంతరకర అంశాలు ఏవీ కూడా పద్మావత్ చిత్రంలో లేవని కావాలంటే ఆ సినిమాను ముందే చూడొచ్చని చిత్ర దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ఇచ్చిన ఆఫర్కు శ్రీ రాజ్పుట్ కర్ణిసేన అంగీకరించింది. ఎట్టి పరిస్థితుల్లో పద్మావత్ చిత్రాన్ని విడుదలకానివ్వబోమని ప్రకటించిన కర్ణిసేన చీఫ్ లోకేంద్ర సింగ్ కల్వి మరికొద్ది సేపటికే తాను పద్మావత్ చూసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. తనతోపాటు తన ఉద్యమ బృందంలో పనిచేస్తున్నవారు కూడా ఈ సినిమాను చూస్తారని తెలిపారు.
'మాకు ఓ లేఖ అందింది. మేం ఆ చిత్రాన్ని చూడాలని కోరుతూ ఆ లేఖలో భన్సాలీ రాశారు. బహుశా మేం తిరస్కరిస్తామని ఆయన అనుకోవచ్చు.. కానీ మేం అంగీకరిస్తున్నాం. సినిమా చూసేందుకు సిద్ధంగా ఉన్నాం. మేం చూశాకే ఆ సినిమా దేశ వ్యాప్తంగా విడుదల చేసుకోవచ్చా లేదా కొంతమందే ఈ సినిమా చూడాలా అనే విషయం చెబుతాం. అలాగే, సెన్సార్ బోర్డు ముగ్గురు మాత్రమే ఈ సినిమా చూడాలని మరో ఆరుగురుని పక్కన పెట్టింది. అయితే, ఆ ఆరుగురితోపాటు జర్నలిస్టులు కూడా ఈ సినిమాను చూడాలి' అని కల్వి అన్నారు.