
బాలీవుడ్లో తను శ్రీ దత్తా ప్రారంభించిన మీటూ ఉద్యమాన్ని సౌత్లో ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ముందుండి నడిపించారు. చిన్మయి కూడా స్వయంగా లైంగిక వేధింపుల బాధితురాలే. మీటూ ఉద్యమంలో భాగంగా 18 ఏళ్ల వయసులో వైరముత్తు తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని షాకింగ్ విషయాలను బయటపెట్టి సంచలనం సృష్టించారు చిన్మయి. ఆ తరువాత మరి కొందరు వైరముత్తుపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఇండస్ట్రీ వైరముత్తుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ చిన్మయిని మాత్రం కోలీవుడ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ నుంచి తప్పించారు. అప్పటి నుంచి వైరముత్తుకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నారు చిన్మయి. తాజాగా ఈ విషయం గురించి ట్విటర్ వేదికగా కేంద్ర మంత్రి మేనకా గాంధీకి ఫిర్యాదు చేశారు చిన్మయి.
‘మేడమ్.. వైరముత్తు నన్ను లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేసి నాలుగు నెలలు అవుతోంది. ఈ విషయంలో నాకు న్యాయం జరగకపోగా.. నన్ను తమిళనాడు ఫిలిం ఇండస్ట్రీ నుంచి తప్పించారు. ప్రస్తుతం నేను కేసు పెట్టలేని పరిస్థితిలో ఉన్నాను. మీరే నాకేదన్నా దారి చూపండి’ అంటూ ప్రధాని నరేంద్రమోదీ, మేనకా గాంధీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు చిన్మయి. ఈ ట్వీట్పై మేనకా గాంధీ స్పందించారు. ‘మీ కేసును ఎన్సీడబ్ల్యూ (జాతీయ మహిళా కమిషన్) దృష్టికి తీసుకెళ్లాను. మీ వివరాలను నాకు పంపించండి’ అని రిట్వీట్ చేశారు మేనకా గాంధీ. (తమిళంలో చిన్మయి గొంతు వినిపించదు)
I have taken up your case with @NCWIndia. Kindly DM your contact details. @Chinmayi @sharmarekha https://t.co/louSvb4Ge6
— Maneka Gandhi (@Manekagandhibjp) February 27, 2019