
రవితేజ
నేల టిక్కెట్టు బాల్కనీలోకి షిఫ్ట్ అయ్యారట. మాస్ అబ్బాయి మస్త్ క్లాస్గా మారిపోయారట. ఏం చెబుతున్నామో అర్థం కావట్లేదా? రవితేజ క్యారెక్టర్ షిఫ్ట్ గురించి మాట్లాడుతున్నామండి. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఫేమ్ కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘నేల టిక్కెట్టు’ సినిమాలో రవితేజ పూర్తి మాస్ రోల్లో కనిపిస్తారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో ఆయన పూర్తి క్లాస్ గెటప్లో కనిపించనున్నారట.
క్లాస్ గెటప్లో కనిపించేది అమరా? అక్బరా? ఆంటోనీయా తెలియాలంటే మాత్రం స్క్రీన్ మీదే చూడాలి. ఈ సినిమా రెగ్యులర్ షూట్ సోమవారం అమెరికాలో స్టార్ట్ అయింది. దాదాపు పదేళ్ల తర్వాత రవితేజ, శ్రీను వైట్ల కలిసి సినిమా చేయడం, ఫస్ట్ టైమ్ రవితేజ ట్రిపుల్ రోల్లో కనిపించటం విశేషం. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి సినిమాను నిర్మిస్తున్నారు. ఎక్కువ భాగం అమెరికాలోనే షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాకు సంగీతం: తమన్, కెమెరా: విజయ్ సి.దిలీప్.