
భర్తల లైంగిక దాడులు ఎన్ని రోజులు భరిస్తారు: కత్రినా
న్యూఢిల్లీ: తమపై జరుగుతున్న నేరాల విషయంలో మహిళలు ఏమాత్రం మౌనంపాటించరాదని, ఖచ్చితంగా తమ గొంతు విప్పాలని ప్రముఖ బాలీవుడ్ నటి కత్రానా కైఫ్ అన్నారు. ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం ఐఎంసీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సంయుక్తంగా నిర్వహించిన ‘వీ యునైట్’ అనే సదస్సులో ఆమె మహిళల ఔన్నత్యాన్ని గురించి, మహిళల ప్రాధాన్యత గురించి మాట్లాడారు. బ్రిటీషు పాలన కంటే ముందే భారత దేశంలో ఓ మహిళ దేశాధినేతగా కొనసాగిందని, అది అమెరికాలో ఇప్పటి వరకు సాధ్యం కాలేదన్నారు.
మహిళలు మౌనంగా ఉంటే బలహీనులనుకునే వారి ఆలోచనలకు బలాన్ని చేకూర్చినట్లవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బలహీనులమని ఏ పరిస్థితుల్లో భావించకూడదని కత్రినా చెప్పారు. ముఖ్యంగా సమాజంలోకి కొన్ని కట్టుబాట్లు తమను వేలెత్తి చూపుతాయేమోనని భయపడుతూ తమ ఆందోళనను, ఆలోచనలను, తమపై జరుగుతున్న నేరాలను ముఖ్యంగా మారిటల్ రేప్స్ (ఇష్టం లేకపోయిన బలవంతంగా భర్త లైంగికదాడి చేయడంవంటివి)ను బయటకు చెప్పలేకపోతున్నారని, విద్యావంతులైన మహిళల పరిస్థితి కూడా ఇలాగే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మారిటల్ రేప్స్ను ఈ సమాజంలో ఎవరూ నేరంగా పరిగణించడంలేదని, ఇది దురదృష్టం అని వాపోయారు. అందుకే అలాంటివాటిని సహించకుండా ధైర్యంగా ప్రతి మహిళ తన గొంతు విప్పాలని ఆమె కోరారు.