women rights
-
గెలిచిన దారులు మిగిలిన ఆకాంక్షలు
రాజ్యాంగం... దేశ పాలనావ్యవస్థకు పరమగ్రంథం. ప్రతి పౌరునికి శిరోధార్యం. బలహీనులకు వజ్రాయుధం. బలవంతులను అదుపు చేసే అంకుశం. పురుషస్వామ్య పెత్తందారీ నుంచి స్త్రీలు అడుగు ముందుకు వేయడానికి రాజ్యాంగం పరిచిన దారులు వారిని నేడు ఆత్మగౌరవంతో నిలబెట్టి స్వయం సమృద్ధి వైపు నడిపిస్తున్నాయి. సాధించింది ఎంతో. సాధించాల్సింది మరెంతో. ఆకాంక్షలను అలాగే నిలబెట్టుకుంటూ ముందుకు సాగాలని అంటున్నారు సీనియర్ రచయిత్రి.భారత రాజ్యాంగాన్ని స్త్రీల దృష్టితో చూడటానికి ఈరోజొక వజ్రోత్సవ సందర్భం. వాలుకి కొట్టుకుపోయే యాంత్రికత నుంచి బైటకి వచ్చి, దాటి వచ్చిన కాలాలను, నడుస్తున్న సమయాలను నిమ్మళంగా చూస్తున్నప్పుడు కొంత సంతోషం, మరికొంత బాధ. ఈ రోజుల్లో భర్త చనిపోతే భార్య చితిలోకి దూకనవసరం లేదు, అతి బాల్య వివాహాలు చేసుకోనవసరం లేదు, వితంతువులు రహస్య గర్భవిచ్చిత్తిలో ప్రాణాలు పోగొట్టుకోనవసరం లేదు. గడపచాటున నిలబడి మాట్లాడటం, ముట్టుగదుల్లో మగ్గడం, అవిద్య, అజ్ఞానం, మూఢనమ్మకాల నుంచి స్త్రీలు చాలావరకూ బైటపడ్డారు. రాజ్యాంగంలో స్త్రీలకి సమానహక్కులు పొందుపరచడానికి ముందుతరాల వారు చేసిన సంఘసంస్కరణ చాలావరకూ మూలకారణం. దీనికి సమానమైన చేర్పుని రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ ఆలోచనలు ఇచ్చాయి. స్త్రీలని వాహికలుగా చేసుకుని కులం, మతం వ్యాప్తి చెందుతాయని, ఈ సమాజాన్ని కొందరి చెప్పుచేతుల్లోనే ఉంచుతాయన్నది అంబేద్కర్ అవగాహన. అందుకే దళిత, కార్మికవర్గాల కోసం ఆలోచించినంతగా స్త్రీ సమానత్వం కోసం కూడా పాటుబడ్డారు. రాజ్యాంగానికి మూలాధారమైన ‘అందరికీ సమానమైన విలువ’ అనే అంబేద్కర్ ప్రతిపాదన పైకి కనిపించే సాధారణ విషయం కాదు. ఆ కాలానికే కాదు, ఇప్పటికీ మనుషులు సమానంగా లేరు. స్త్రీలు చాలా విషయాల్లో రెండవ తరగతి పౌరులుగానే ఉన్నారు. ఆ స్థితిని పోగొట్టి, స్త్రీల జీవితాల్లో విప్లవాత్మక మార్పుల కోసం అంబేద్కర్ ప్రవేశపెట్టిన ‘హిందూ కోడ్ బిల్’ ఒక సంచలనం. అంతవరకూ స్త్రీలకి సామాజిక, రాజకీయ, కుటుంబహక్కుల వంటివి లేవు. సమానత్వప్రాతిపదిక మీద రాజ్యాంగం ద్వారా వారు ఆ హక్కులను మిగతావారితో పాటు సహజంగానే పొందారు. ఉదాహరణకి రాజ్యాంగ ఏర్పాటుకి మునుపు సార్వత్రిక ఓటుహక్కు లేదు. తొంభైశాతం పైగా స్త్రీలకి ఓటువేయడం అంటే ఏమిటో తెలీదు. కానీ రాజ్యాంగం ద్వారా స్త్రీలంతా ఓటు వేయడమే కాదు, రాజకీయ పార్టీలలో చేరి, ఎన్నికలలో పాల్గొని, శాసనసభలకి చేరారు. ‘బిఎ చదివినా బియ్యంలో రాళ్లేరక తప్పుతుందా’ అన్నవారికి– ఉద్యోగాలు చేసి, ఊళ్ళేలి చూపించారు స్త్రీలు. బ్రిటిష్ పాలనకి భిన్నంగా భారత రాజ్యాంగం స్త్రీల ఉనికిని నిరూపించింది. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను వాడుకుని చేసిన అనేక పోరాటాల ఫలితంగా స్త్రీలకి అనుకూలమైన కొన్ని చట్టాలు రూపొందాయి. వివాహానికి సరైన వయసుప్రాతిపదిక అయింది. అబార్షన్ హక్కులు ఉన్నాయి. విడాకులు పూర్వమంత కఠినం కావు. స్త్రీలపై సాగే గృహహింస, లైంగిక వేధింపులు, అత్యాచారాలకి కఠినశిక్షలు ఉన్నాయి. ఆస్తి, వారసత్వ హక్కుల విషయంలో కూడా ప్రగతి కనబడుతోంది. ముఖ్యంగా స్త్రీల సామాజిక, రాజకీయ భాగస్వామ్యం మెరుగుబడింది. అయితే, స్త్రీల హక్కులన్నిటికీ కాపాడగల రక్షణ వ్యవస్థలు నిష్పక్షపాతంగా లేవు. అవి మగ స్వభావాన్ని, మగ పెత్తనాన్ని తెలియక, తెలిసి ప్రదర్శిస్తాయి. దానివల్ల మొగ్గు పురుషుడి వైపు ఉండి స్త్రీ సమానత్వాన్ని సూచించే రాజ్యాంగస్ఫూర్తిని భగ్నం చేస్తాయి. అందుకే ‘అందరికీ ఒకే విలువ’ సూత్రం ఆచరణలో విఫలం అయింది. స్త్రీలు అన్ని ఉద్యోగాలకి అర్హులు. కానీ సైనికులుగా, భారీ వాహన చోదకులుగా, పెద్దపెద్ద హోదాలు కల ఉద్యోగులుగా, మంత్రులుగా, వ్యాపారవేత్తలుగా వారి ఉనికి ఎంత? ఇటీవలి అంచనాలు కార్మిక వర్గంలో, ‘బాస్’ స్థానాలలో స్త్రీల నిష్పత్తి పతనమవుతున్నదని హెచ్చరిస్తున్నాయి. ఇక కొన్ని ప్రత్యేక రంగాల్లో స్త్రీలు అడుగు పెట్టాల్సే ఉంది. సంసిద్ధత లేకపోవడం సమాజానికే కాదు, సమాజం తయారు చేసే స్త్రీలది కూడా కావొచ్చు. అందరినీ ఒక చోటికి చేర్చాలంటే వెనుకబడి ఉన్నవారిని ముందుకు చేర్చడానికి రిజర్వేషన్లు కావాలి. విద్యా ఉద్యోగ రంగాలలో స్త్రీలకి 33 శాతం రిజర్వేషన్లని అంగీకరించిన రాజ్యాంగం– చట్టసభలకి ఆ హక్కుని వర్తింపజేయలేక పోయింది. 33 శాతం రిజర్వుడ్ స్థానాల్లోనూ, జనరల్ స్థానాల్లో మరి కొందరు స్త్రీలు కలిసి చట్టసభలకి చేరి విధాన నిర్ణయాలు చేయడమన్న ఆలోచనకే రాజకీయపార్టీలు వ్యతిరేకం కనుకనే ఇంతవరకూ మహిళా రిజర్వేషన్ల బిల్లు ముందుకు పోవడం లేదు. స్త్రీల శరీరాల మీద పురుషులకి ఉండే హక్కులకి, స్త్రీల గౌరవానికి భంగకరంగా ఉన్న అడల్టరీ చట్టం ఎత్తి వేయడానికి రాజ్యాంగం ఏర్పడ్డాక కూడా దాదాపు ఏడు దశాబ్దాలు పట్టింది. తల్లికి బిడ్డల మీద ఉండాల్సిన సహజ బాధ్యతలు, హక్కుల విషయంలో కూడా చాలా వివక్ష ఇప్పటికీ ఉంది. పురుషుని ఇంటిపేరుతో స్త్రీ, ఆమె పిల్లలు గుర్తింపు పొందడం– పితృస్వామ్యం బలంగా ఉండడాన్నే సూచిస్తుంది. రాజ్యాంగంలో కూడా స్త్రీలహక్కులకి సంబంధించి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఆచరణలో చాలా లోటుపాట్లు కూడా ఉన్నాయి. అయినాసరే స్త్రీలు తాము పోరాడి సాధించుకున్న చైతన్యాన్ని నిలుపుకోవడానికి తమ హక్కులకి రక్షణ ఉండాలని గట్టిగా అడగడానికి రాజ్యాంగమే ఆసరాగా ఉంది. దానికి తోడు మహిళాపోరాటాల సాధించుకున్న, సాధించుకోబోయే మార్పులు– ‘అందరికీ ఒకే విలువ’ సూత్రానికి స్త్రీలని మరింత దగ్గర చేస్తాయని నమ్మిక. ఈ నమ్మకాన్ని సడలనివ్వకుండా మనం ముందుకు సాగాలి.– కె.ఎన్.మల్లీశ్వరి, రచయిత -
అవును.. వైవాహిక అత్యాచారం నేరమే.. కాదు!
ఆమె అతనికి ఓ ఆట బొమ్మ మాత్రమే... ప్రతి రాత్రి ఆమెతో ఆమె జీవితంతో ఆడుకోవాలని చూస్తాడు.. చిన్నదైనా..పెద్దదైనా ఇద్దరి మధ్యా ఎప్పుడైనా గొడవ జరిగితే... ఆ ప్రతీకారాన్ని రాత్రి మంచంపై తీర్చుకోవడం అతనికి అలవాటు. ఆమె ఆరోగ్యం బాగోలేకున్నా అతనికి ఏమీ పట్టదు. కేవలం కోరికలు తీర్చే ఓ యంత్రంలా మాత్రమే ఆమెను చూస్తాడు. ఆరోగ్యం బాగోలేదు.. ఇవాళ శారీరంగా కలిసే శక్తి లేదని ఎప్పుడైనా చెబితే... ఇక ఆ రాత్రి పిడి గుద్దులు కురిపించి.. నరకం చూపిస్తాడు.. బలవంతంగా అనుభవించి పక్కకు జరుగుతాడు.." తన వైవాహిక జీవితానికి సంబంధించి ఇటీవల ఓ మహిళ సుప్రీంకోర్టు ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పిన మాటలివి. ఆమె చెప్పినదంతా వింటే మీకేం అనిపిస్తుంది? ఓ అత్యాచార బాధితురాలి మాటలు లాగా అనిపించడంలేదా? అయితే కేంద్రానికి మాత్రం దీన్ని రేప్ లాగా భావించడంలేదు.. కారణం ఒక్కటే.. వారిద్దరూ భార్యభర్తలు! అదేంటి.. దంపతులైతే మాత్రం బలవంతంగా భార్యపై ఓ మృగంలా పడిపోవచ్చా అని అడిగితే మాత్రం కేంద్రం దగ్గర సమాధానం ఉండదు.. ఈ తరహా వైఖరి కేవలం కేంద్ర ప్రభుత్వానిది మాత్రమే కాదు .. భార్య శరీరాన్ని సొంత ఆస్తిగా భావించే భర్తలకు కూడా వైవాహిక అత్యాచారం ఓ నేరంలా అనిపించదు..! ఇంతకీ మ్యారిటల్ రేప్ను కేంద్ర ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తోంది? ఈ వైవాహిత అత్యాచార బాధితుల బాధ ఎలాంటిది? దేశంలో మ్యారిటల్ రేప్ బాధితులు ఎంతమంది ఉన్నారు?'పురుషుడు పురుషుడే.. చట్టం చట్టమే.. స్త్రీపై పురుషుడు అత్యాచారం చేసినా, భార్యపై భర్త అత్యాచారం చేసినా అది అత్యాచారమే..' కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగప్రసన్న రెండేళ్ళ క్రితం ఒక కేసులో ఇచ్చిన తీర్పులో భాగంగా చేసిన వ్యాఖ్యలు ఇవి! అయితే చట్టాలు మాత్రం ఆయన మాటలకు విరుద్ధంగా ఉన్నాయి. అటు కేంద్రం కూడా మ్యారిటల్ రేప్ను నేరంగా అసలు అంగీకరించడంలేదు. భార్యతో ఆమె ఇష్టానికి విరుద్ధంగా భర్త సంభోగంలో పాల్గొనడాన్ని నేరంగా పరిగణించే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా మరోసారి స్పష్టం చేసింది. భార్య వయసు 18 ఏళ్లు దాటి ఉంటే ఆమెతో భర్త బలవంతంగా లైంగిక కార్యం జరిపినా నేరం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 👉ఇక భారత న్యాయ సంహిత-BNS ప్రకారం వైవాహిక అత్యాచారం నేరం కాదు. ఈ మ్యారిటల్ రేప్ను నేరంగా గుర్తించడం కారణంగా వివాహ వ్యవస్థ దెబ్బతింటుందని కేంద్రం అనేకసార్లు కోర్టుల్లో వాదిస్తూ వచ్చింది. వైవాహిక అత్యాచారాన్ని క్రిమినలైజ్ చేయడం వివాహబంధాలకు హాని కలుగుతుందన్నది వారి ప్రధాన వాదన. అయితే వివాహ వ్యవస్థను ఓ sacred institutionగా భావించడం కారణంగానే కేంద్రం ఈ విధంగా మాట్లాడుతోందని మహిళా సంఘాలు చెబుతుంటాయి. Consent.. అంటే అనుమతి లేకుండా శృంగారంలో పాల్గొనడం మహిళా హక్కులకు పూర్తి వ్యతిరేకమంటారు. నిజానికి కేవలం భార్య అయినంతా మాత్రనా ఏ మహిళా కూడా తన హక్కులను కోల్పోదు. అందుకే Marriage is not an excuse for any kind of rape అని చెబుతారు మహిళా సంఘాల నేతలు!👉అయితే కేంద్రం మాత్రం వివాహ వ్యవస్థ రక్షణ కోసమే మ్యారిటల్ రేప్ను క్రిమినలైజ్ చేయడం లేదని పదేపదే చెబుతుంటుంది. ఒకవేళ వైవాహిక అత్యాచారాన్ని నేరంగా గుర్తిస్తే ఫేక్ కేసులు పెట్టేవారు పెరుగుతారని.. ఇది ఓవరాల్గా వివాహ వ్యవస్థకు హాని చేస్తుందని వాదిస్తుంటుంది. అటు ఈ మ్యారిటల్ రేప్ని నేరంగా పరిగణించాలని పోరాడే వారు మాత్రం కేంద్రం వాదనలో ఎలాంటి హేతుబద్ధత లేదంటారు. చట్టాల చాటున ఫేక్ కేసులు పెట్టే వారూ ఎక్కడైనా ఉంటారని.. అలాంటి ఘటనలు జరుగుతున్నాయని అసలు మొత్తానికే చట్టం లేకుండా చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. 👉నిజానికి అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, దక్షిణ ఆఫ్రికా లాంటి అనేక దేశాలు మ్యారిటల్ రేప్ను నేరంగా గుర్తించాయి. ఇటు ఇండియాలో మాత్రం మ్యారిటల్ రేప్ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 2018లో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లెక్కల ప్రకారం, వివాహితులలో 29శాతం మంది శారీరక లేదా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారు. వైవాహిక అత్యాచారం కారణంగా మహిళలు ఎదుర్కొనే బాధ భరించరానిది. మానసికంగా ఎంతో కుంగిపోతారు. డిప్రెషన్ లాంటి సమస్యలు వేధిస్తాయి. అటు శారీరక హింస ఎలాగో ఉంటుంది. ఇటు సామాజికంగానూ ఎన్నో సవాళ్లు ఫేస్ చేయాల్సి వస్తుంది. 👉గృహ హింస, మహిళలపై లైంగిక వేధింపుల కట్టడికి సంబంధించిన చట్టాలను తీసుకురావడంలో ఇండియా కాస్త పురోగతిని సాధించింది కానీ ఈ వైవాహిక అత్యాచార విషయంలో మాత్రం సాంప్రదాయ ఆలోచనలతో అసలు నేరాన్ని నేరంకాదని చెబుతుండడం బాధకరమని బాధితులు వాపోతుంటారు. నిజానికి గృహ హింస వివిధ రూపాల్లో ఉంది. భర్తకు భార్య పగలంతా ఒక యంత్రంలా పని చేయాలి. రాత్రికి కోరికలు తీర్చే బొమ్మలా సిద్ధం కావాలి. నిద్ర, అలసట ఉండకూడదు. పీరియడ్స్, జ్వరం ఏమీ అనకూడదు. ఇవే చాలా మంది మ్యారిటల్ రేప్ బాధితులు చెప్పే మాటలు..! వాస్తవానికి ఇలాంటి కేసులు బయటకు రావడమే చాలా అరుదు. కుటుంబం విచ్ఛిన్నమవుతుందనే భయాలు, బెదిరింపులు వల్ల వైవాహిక హింస భారతీయ సమాజంలో ఎక్కువగా బహిర్గతం కాదు. అటు కేంద్రం మాత్రం ఇది అసలు నేరమే కాదంటోంది..!:::త్రినాథ్ బండారు, సాక్షి డిజిటల్ -
స్త్రీ ధనంపై మహిళకే హక్కు : సుప్రీంకోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ: తప్పు చేసిన వారికి తగు శిక్ష పడేలా చేయడానికే నేర విచారణ జరుగుతుందని, అంతే తప్ప ప్రతీకారం తీర్చుకోవడానికి కాదని సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. తన కూతురికి వివాహ సమయంలో ఇచ్చిన స్త్రీ ధనాన్ని ఆమె మాజీ అత్తమామలు తిరిగి ఇవ్వడం లేదంటూ తెలంగాణకు చెందిన పడాల వీరభద్రరావు సుప్రీంకోర్టులో నమ్మకద్రోహం కేసు వేశారు. పెళ్లి సమయంలో తల్లిదండ్రులు, బంధువులు కానుకల రూపంలో ఇచ్చే నగదు, ఆస్తులను స్త్రీ ధనంగా పరిగణిస్తారు. స్త్రీ ధనంపై భార్య లేదా మాజీ భార్యకు మాత్రమే పూర్తి హక్కు ఉంటుందని జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ సంజయ్ కరోల్ పేర్కొన్నారు. ఇదివరకే న్యాయస్థానాలు దీన్ని స్పష్టం చేశాయన్నారు.వ్యక్తిగత కక్ష్యలు మనసులో పెట్టుకొని.. ప్రతీకారం తీర్చుకోవడానికి న్యాయ విచారణ ప్రక్రియను ఉపయోగించుకోకూడదని వీరభద్ర రావుకు ధర్మాసనం సూచించింది. 1999లో తన కూతురికి పెళ్లి సమయంలో బంగారు నగలు, ఇతర కానుకలు ఇచ్చానని, తర్వాత దంపతులు అమెరికాకు వెళ్లారని రావు కోర్టుకు తెలిపారు. 2016లో అమెరికాలో విడాకులు తీసుకున్నారని, తన కూతురికి ఇచి్చన నగలు ఆమె మాజీ అత్తమామల దగ్గరే ఉన్నాయని వాదించారు. అయితే స్త్రీ ధనంపై భర్తకు గాని, తండ్రికి గాని ఎలాంటి హక్కులు ఉండవని, స్త్రీ ధనాన్ని తిరిగి రాబట్టుకోవడానికి కేసు పెడితే ఆమె పెట్టాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
ఇది మాయని ‘మరక’ : లైంగిక వేధింపులపై వినూత్న నిరసన
ప్రపంచవ్యాప్తంగా బాలికలు,మహిళలు నిత్యం ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై జర్మనీలో మహిళా హక్కుల సంఘం వినూత్నం ప్రచారాన్ని చేపట్టింది. వేధింపులను అరికట్టేందుకు ‘అన్సైలెన్స్ ది వయలెన్స్’ అని పిలుపునిస్తూ ఓ ప్రదర్శన ఏర్పాటు చేసింది. మహిళలు, బాలికపై వేధింపుల హింస ఎన్నటికీ మాయని మచ్చ అనే అంశాన్ని విగ్రహాల రూపంలోప్రదర్శించడం విశేషం. మహిళలపై జరుగుతున్న హింసను నిర్మూలించాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ ప్రదర్శన చర్చ నీయాంశంగా నిలుస్తోంది. ముగ్గురిలో ఇద్దరు స్త్రీలు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో లైంగిక వేధింపులను ఎదుర్కొంటు న్నారని జర్మన్ మహిళా హక్కుల సంఘం టెర్రే డెస్ ఫెమ్మెస్ పేర్కొంది. ఈ లైంగిక వేధింపులపై చాలామంది మౌనంగా ఉంటారని, ఈ మౌనమే మరో మహిళ వేధింపులకు దారి తీస్తోందని సంస్థ ప్రతినిధి సినా టాంక్ చెప్పారు. ఇప్పటికైనా నిశ్శబ్దాన్ని బద్దలు గొట్టాలని మహిళలకు ఆమె పిలుపునిచ్చారు. “ప్రతీ నేరస్థుడు వేలమందికి కారణమవుతున్నాడు ఇకపై మహిళలపై లైంగిక వేధింపులను ఉపేక్షించవద్దు అప్రమత్తంగా ఉందాం. బాధితులకు అండగా నిలుద్దాం. కలిసికట్టుగా ఈ నిశ్శబ్దాన్ని బద్దలు కొడదాం’’ సినా టాన్ టెర్రే డెస్ ఫెమ్మెస్ బాలికలు ,మహిళలపై మానవ హక్కుల ఉల్లంఘనలు, లింగ-నిర్దిష్ట వివక్షకు వ్యతిరేకంగా, మహిళల హక్కుల కోసం 40 సంవత్సరాలుగా పోరాడుతోంది. మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులకు సజీవ సాక్ష్యాలని హక్కుల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ విగ్రహాల్లో పేర్కొన్న మాదిరిగా లైంగిక వేధింపుల మరక కూడా బాధిత మహిళను జీవితాంతం వదలదని టెర్రే డెస్ ఫెమ్మెస్ పేర్కొంది. -
అమ్మాయిలను కాపాడుకుందాం...
గ్రామీణ మహిళలను నిత్యం కలుస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తూ పరిష్కారాలను సూచిస్తూ మహిళా రైతుల అభివృద్ధికి చేయూతనిస్తున్నారు డాక్టర్ రుక్మిణీ రావు. ఏళ్ల తరబడి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఆమె. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ డైరెక్టర్గానూ, వందకు పైగా మహిళా రైతు సంఘాలతో కూడిన జాతీయవేదిక మకాం సహ వ్యవస్థాపకులుగానూ ఉన్నారు. నారీ శక్తి పురస్కార గ్రహీత, హైదరాబాద్ వాసి, సామాజిక కార్యకర్త రుక్మిణీరావుతో మాట్లాడినప్పుడు స్త్రీ సంక్షేమానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఆమె ఇలా మనముందుంచారు. ‘‘ఒక మార్గాన్ని ఎంచుకున్నప్పుడు ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా, ఆపకూడదు, ఆగకూడదు. ఈ రోజుల్లో మన అమ్మాయిలను కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మేం తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో 50 గ్రామాల్లోని 8 నుంచి 17 ఏళ్ల వయసు లోపు అమ్మాయిల సంక్షేమానికి గ్రామ్య రిసోర్స్ సెంటర్లో భాగంగా వర్క్ చేస్తున్నాం. మహిళల సంక్షేమానికి కృషి చేద్దామని చేసిన ప్రయత్నంలో ఎన్నో సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల 15–16 ఏళ్ల లోపు అమ్మాయిలు తెలిసిన, తెలియని అబ్బాయిల మాటలు నమ్మి ఇల్లు వదిలి వెళ్లిన ఘటనలను ఎక్కువ చూస్తున్నాం. దీంతో స్కూల్ నుంచి డ్రాపౌట్ అయిన వాళ్లకు, ఇల్లు వదిలి బయటకు వెళ్లిన వాళ్లను తిరిగి వచ్చేలా, కౌన్సెలింగ్స్ చేస్తున్నాం. ఇద్దరు చిన్నపిల్లలను వారి తల్లిదండ్రులు అమ్మడం గురించి తెలిసి మా స్నేహితురాలు జమునతో కలిసి నేనూ అక్కడకు వెళ్లాను. ఆ అమ్మకం కార్యక్రమాన్ని అడ్డుకుని, వారికి సహాయం చేయాలనుకున్నప్పుడు ‘గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్స్’’ని ప్రారంభించాం. ఈ సంస్థకు 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఆరు మండలాల్లో దాదాపు 800 మంది మహిళలు తమ జీవనోపాధిని మెరుగుపరచుకోవడానికి, ఆడపిల్లల పట్ల వారి వైఖరిని పునరాలోచించడానికి వర్క్ చేస్తున్నాం. ఏళ్లుగా ఆడ శిశుహత్యలతో పాటు అంతర్జాతీయ దత్తత ద్వారా కూడా ఆడపిల్లల అక్రమ రవాణాకు విస్తృతమైన నెట్వర్క్ ఉందని కనుక్కొన్నాం. ప్రచార పద్ధతిలో పని చేస్తూ, అనేక అక్రమ దత్తత కేంద్రాలను మూసివేయించాం. వివక్ష లేని చోట పెంపకం నా చిన్నతనంలో మా అమ్మమ్మ, అమ్మ, అత్తల మధ్య పెరిగాను. ఆ విధంగా ఇంటిని నడిపే సమర్థ మహిళల గురించి నాకు తెలుసు. మా ఇంట్లో అబ్బాయిలు, అమ్మాయిలు అనే వివక్ష ఉండేది కాదు. నేను బాగా చదువుకోవాలన్నది అమ్మ ఆలోచన. ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కాలేజీ నుండి సైకాలజీలో మాస్టర్స్ పూర్తి చేశాను. చదువు చెప్పాలనే ఆలోచనతో హైదరాబాద్లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ లో టీచింగ్ చేశాను. ఆ తర్వాత ఢిల్లీలో సైకాలజీలో పీహెచ్డీ చేశాను. 1970 – 1980ల మధ్య వరకు ఢిల్లీలోని నేషనల్ లేబర్ ఇన్స్ స్టిట్యూట్, పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్స్ లో కెరియర్ స్టార్ట్ చేశాను. అప్పుడే జీవితం ఒక మలుపు తీసుకుందనిపిస్తుంది. వరకట్న మరణాలు తీవ్ర సమస్యగా ఉన్న రోజులవి. ఇది సమాజానికే అనారోగ్యం అనిపించేది. మా స్నేహితులతో కలిసి ఎడతెగని చర్చలు జరిపేవాళ్లం. వరకట్న వ్యతిరేక ప్రదర్శనలలో విస్తృతంగా పాల్గొన్నాం. అప్పుడు 1981లో మహిళల కోసం ‘సహేలీ రిసోర్స్’ సెంటర్ను ఏర్పాటు చేశాం. అక్కణ్ణుంచి ఈ మార్గంలో ఏళ్లుగా ప్రయాణిస్తున్నాను. నాతో పాటు ఎన్నో అడుగులు తోడయ్యాయి. సేవా కార్యక్రమాలు చేసేవారితో నేనూ కలుస్తున్నాను. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా... పదేళ్లక్రితం ఒక విషయం మమ్మల్ని కదిలించింది. కౌమార దశలో గ్రామాల్లో ఉన్న అమ్మాయిలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇచ్చారు. దానివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ మీద ఎవరూ దృష్టి పెట్టలేదు. అక్కడ ఆ అమ్మాయిలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో మేం స్వయంగా చూశాం. దీంతో ఇది సరైన పద్ధతి కాదని మా ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి సుప్రీం కోర్టులో కేసు వేశాం. విదేశాలలో ఒక వ్యాక్సిన్ గురించి నిర్ణయం తీసుకుంటే వాళ్లు సెంటర్ను ఏర్పాటు చేస్తారు. అలాంటిది మన దగ్గర లేదు. ఇప్పుడు వ్యాక్సిన్ ఖరీదు తగ్గిందన్నారు. వ్యాక్సిన్ వేయాలంటున్నారు. డాక్టర్లు చెప్పిన ఆలోచన కూడా బాగుంది. అయితే, ఆ తర్వాత వచ్చే సమస్యలపైన కూడా దృష్టి పెట్టమని, మెడికల్ సిస్టమ్ను కరెక్ట్ చేయమని ప్రభుత్వాలను కోరుతున్నాం. అప్పుడే, ఈ డ్రైవ్ను ముందుకు తీసుకెళితే బాగుంటుంది’’ అని తన అభిప్రాయలను వెలిబుచ్చారు రుక్మిణీరావు. గ్రామీణ మహిళలతో కలిసి... 1989లో ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాద్కు వచ్చేశాను. పుట్టిపెరిగిన ప్రాంతం, పరిచయమున్న సాంçస్కృతిక నేపధ్యంలో సమర్థంగా పని చేయగలనని భావించాను. న్యాయం కోసం కోర్టులకు వచ్చే మధ్యతరగతి మహిళలకు సహాయం చేయడం ప్రారంభించాం. వారి స్థితి చూశాక ఇంకా ఎంతో చేయాల్సింది ఉందనిపించింది. అక్కణ్ణుంచి గ్రామీణ మహిళల సంక్షేమానికి శ్రద్ధ వహించాల్సిన అవసరం గుర్తించి అటువైపుగా అడుగులు వేశాం. 30 ఏళ్లుగా మహిళా రైతుల హక్కులను ప్రోత్సహించడానికి డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీతో కలిసి పనిచేస్తున్నాను. సంస్థలో మహిళా నాయకత్వాన్ని అభివృద్ధి చేయడం, వర్క్షాప్ల నిర్వహణ ముఖ్యంగా తీసుకున్నాను. సొసైటీలో డైరెక్టర్, బోర్డ్ మెంబర్గా ఉన్నాను. ఇవి కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న మహిళా రైతులతో ‘మకాం’ అనే వేదిక ద్వారా విస్తృత కార్యక్రమాలు చేస్తున్నాం. రైతు అనగానే ట్రాక్టర్పైన మగవాళ్లు ఉండటమే కనిపిస్తుంది. కానీ, ఇప్పుడు ఆడవాళ్లు కూడా ట్రాక్టర్లు నడపడం, వ్యవసాయం, ఆహార ఉత్పత్తుల తయారీలో అగ్రభాగాన ఉండేలా కృషి చేస్తున్నాం. ఒంటరి మహిళల కోసం సమాఖ్యను ఏర్పాటు చేశాం. ఇందులో సంఘాలున్నాయి. తెలంగాణలోని 10 జిల్లాల నుంచి కో ఆర్డినేషన్ చేస్తున్నాం. లెప్రసీ వ్యాధి అనేది దాదాపుగా కనుమరుగైందని అంతా అనుకుంటున్నారు. కానీ, లెప్రసీతో బాధపడుతున్న వారిని మేం గుర్తించాం. ఈ వ్యాధి ముదరకుండా ముందస్తు నివారణకు సాయం అందిస్తున్నాం. – నిర్మలా రెడ్డి ఫొటో: అనిల్ కుమార్ మోర్ల -
ఫైనాన్షియల్ లిటరసీతో మహిళా ప్రపంచాన్ని మార్చేస్తోంది!
ఏమీ తెలియకపోవడం వల్ల కలిగే నష్టం సంక్షోభ సమయంలో, కష్టసమయంలో భయపెడుతుంది. బాధ పెడుతుంది. సమస్యల సుడిగుండంలోకి నెట్టి ముందుకు వెళ్లకుండా సంకెళ్లు వేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అనన్య పరేఖ్ ‘ఇన్నర్ గాడెస్’ అనే సంస్థను ప్రారంభించింది. ‘ఇన్నర్ గాడెస్’ ద్వారా ఫైనాన్షియల్ లిటరసీ నుంచి మెంటల్ హెల్త్ వరకు అట్టడుగు వర్గాల మహిళల కోసం దేశవ్యాప్తంగా వర్క్షాప్లు నిర్వహిస్తోంది. చెన్నైలోని మైలాపూర్లో ఉమ్మడి కుటుంబంలో పెరిగిన అనన్య పెద్దల నుంచి ఎన్నో మంచి విషయాలు తెలుసుకుంది. ఆరు సంవత్సరాల వయసు నుంచే పుస్తకాలు చదవడం అలవాటైంది. ‘పుస్తకపఠనం అలవాటు చేయడం అనేది నా కుటుంబం నాకు ఇచ్చిన విలువైన బహుమతి’ అంటున్న∙ అనన్య పెద్దల నుంచి విన్న విషయాలు, పుస్తకాల నుంచి తెలుసుకున్న విషయాల ప్రభావంతో సమాజం కోసం ఏదైనా చేయాలనే ఆలోచన చేయడం ప్రారంభించింది. సోషల్ ఎంట్రప్రెన్యూర్గా వడివడిగా అడుగులు వేయడానికి ఈ ఆలోచనలు అనన్యకు ఉపకరించాయి. అనేక సందర్భాలలో లింగ విక్ష ను ఎదుర్కొన్న అనన్య ‘ఇది ఇంతేలే’ అని సర్దుకుపోకుండా ‘ఎందుకు ఇలా?’ అని ప్రశ్నించేది. కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి చర్చించేది. తమ ఇంటికి దగ్గరగా ఉండే ఒక బీద కుటుంబానికి చెందిన పిల్లల కోసం క్లాసు పుస్తకాలు కొనివ్వడం ద్వారా సామాజిక సేవకు సంబంధించి తొలి అడుగు వేసింది అనన్య. ఏరో స్పేస్ ఇంజనీరింగ్ చేసిన అనన్య ఉన్నత ఉద్యోగాలపై కాకుండా మహిళల హక్కులు, మహిళా సాధికారత, చదువు... మొదలైన అంశాలపై దృష్టి పెట్టింది. చెన్నై కేంద్రంగా ‘ఇన్నర్ గాడెస్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ తరపున అట్టడుగు వర్గాల మహిళల కోసం ఫైనాన్షియల్ లిటరసీ, ఫైనాన్షి యల్ యాంగై్జటీ, మెంటల్ హెల్త్, పర్సనల్ ఇన్వెస్టింగ్... మొదలైన అంశాలపై దేశవ్యాప్తంగా డెబ్భైకి పైగా వర్క్షాప్లు నిర్వహించింది. సరైన సమయంలో ఆర్థిక విషయాలపై అవగాహన కలిగిస్తే అది భవిష్యత్ కార్యాచరణకు ఉపయోగపడుతుందనే నమ్మకంతో పదహారు నుంచి ఇరవైనాలుగు సంవత్సరాల మధ్య ఉన్న యువతులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ఇన్నర్ గాడెస్. ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడం కలిగే ఇబ్బందులు, ఉండడం వల్ల కలిగి మేలు, జీరో స్థాయి నుంచి వచ్చి విజయవంతమైన మహిళా వ్యాపారవేత్తల గురించి ఈ వర్క్షాప్లలో చెప్పారు. షాపింగ్ నుంచి బ్యాంక్ వ్యవహారాల వరకు ఒక మహిళ తన భర్త మీద ఆధారపడేది. దురదృష్టవశాత్తు అతడు ఒక ప్రమాదంలో చనిపోయాడు. ఆమె ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? ఇలాంటి మహిళలను దృష్టిలో పెట్టుకొని వ్యవహార దక్షత నుంచి వ్యాపార నిర్వహణ వరకు ఎన్నో విషయాలపై ఈ వర్క్షాప్లలో అవగాహన కలిగించారు. ‘ఇన్నర్ గాడెస్’ నిర్వహించే వర్క్షాప్ల వల్ల పర్సనల్ ఫైనాన్స్కు సంబంధించిన ఎన్నో విషయాలపై మహిళలకు అవగాహన కలిగింది. సరిౖయెన నిర్ణయాలు తీసుకోవడంలో ఇది వారికి ఉపకరించింది. ఇరవై సంవత్సరాల వయసులో ‘ఇన్నర్ గాడెస్’ను ప్రారంభించిన అనన్య తన ప్రయాణంలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొంది. ‘అవరోధాలు అప్పుడే కాదు ఏదో ఒక రూపంలో ఇప్పుడు కూడా ఉన్నాయి. అయితే వాటికి ఎప్పుడూ భయపడలేదు. ప్రారంభంలో ఫైనాన్షియల్ లిటరసీ అనే కాన్సెప్ట్పై నాకు కూడా పరిమిత మైన అవగాహనే ఉండేది. కాలక్రమంలో ఎన్నో నేర్చుకున్నాను. కెరీర్కు ఉపకరించే సబ్జెక్ట్లకు తప్ప పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్పై మన విద్యాప్రణాళికలో చోటు లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో వర్క్షాప్లు నిర్వహించాం. వీటిలో ఎంతోమంది వాలంటీర్లు, స్కూల్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఈ వర్క్షాప్లో పాల్గొన్న ఒక అమ్మాయి మ్యూచువల్ ఫండ్స్ గురించి అవగాహన చేసుకోవడమే కాదు, తన అమ్మమ్మకు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో సహాయపడింది. ఇలాంటివి విన్న తరువాత మరింత ఉత్సాహం వస్తుంది’ అంటుంది అనన్య పరేఖ్. -
లింగ సమానత్వానికి మరో 300 ఏళ్లు పడుతుంది: గుటేరస్
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న లింగ అసమానతలపై ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆవేదన వ్యక్తం చేశారు. లింగ సమానత్వం మన కళ్ల ముందే కనుమరుగు అవుతోందని పేర్కొన్నారు. మహిళలు, పురుషుల మధ్య అంతరాలు తగ్గడానికి ఇంకో 300 ఏళ్లు పడుతుందని, ఇది బాధాకరం అన్నారు. మహిళల హోదా విషయంపై ఐరాస సెషన్లో సోమవారం మాట్లాడుతూ గుటేరస్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళల హక్కులను అవహేళన చేస్తూ, ప్రమాదంలోకి నెడుతూ, ఉల్లంఘిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. లింగసమానత్వంపై సాధించిన దశాబ్దాల పురోగతి మన కళ్ల ముందే కనుమరుగు కావడం ఆలోచించాల్సిన విషయమన్నారు. అఫ్గానిస్తాన్లో మహిళల హక్కులను తాలిబన్ ప్రభుత్వం కాలరాస్తున్న విషయాన్ని కూడా గుటెరస్ ప్రస్తావించారు. సాధారణ ప్రజా జీవితానికి వాళ్లను దూరం చేశారని చెప్పారు. చాలా దేశాల్లో మహిళల లైంగిక, పునరుత్పత్తి హక్కులను కూడా హరించివేస్తున్నారని తెలిపారు. కొన్ని దేశాల్లో పాఠాశాలకు వెళ్లే చిన్నారులను కిడ్నాప్ చేసి దాడులు చేస్తున్నారని, మరికొన్ని దేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే వాళ్లపై దారుణాలకు పాల్పడుతున్నారని వివరించారు. లింగ సమానత్వ అంతరం రోజురోజుకు మరింత పెరుగుతోందన్నారు. చదవండి: అంటార్కిటికా కరిగిపోతోంది! -
అమ్మాయిలంటే ఎందుకంత ద్వేషం.. ఆడ బొమ్మల మొహాలకు కవర్లా?
కాబూల్: 2021 ఆగస్టులో అఫ్గానిస్తాన్ను తాలిబన్లు హస్తగతం చేసుకున్నప్పటి నుంచి అక్కడ అరాచక పాలన కొనసాగుతోంది. ఈ ప్రభుత్వం ముఖ్యంగా మహిళల హక్కులను కాలరాస్తోంది. వాళ్లపై అనేక ఆంక్షలు విధిస్తూ అణగదొక్కుతోంది. అమ్మాయిలు హైస్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుకోకుండా నిషేధం విధించింది. జిమ్లు, పార్కులకు వెళ్లకుండా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. తాజాగా తాలిబన్లు తీసుకున్న మరో నిర్ణయం నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇప్పటివరకు అమ్మాయిలపై ఆంక్షలు విధించిన తాలిబన్ సర్కార్.. తాజాగా ఆడ బొమ్మలపై కూడా వివక్ష చూపుతోంది. వస్త్ర దుకాణాల్లో కస్టమర్లను ఆకర్షించేందుకు ఏర్పాటు చేసే అమ్మాయిల బొమ్మల మొహాలు కన్పించొద్దని ఆదేశించింది. ఈ మేరకు దుకాణ యజమానులకు హుకుం జారీ చేసింది. దీంతో షాపింగ్ మాల్స్లోని అమ్మాయిల బొమ్మల మొహాలకు వస్త్రం లేదా పాలిథీన్ కవర్లను కట్టారు యజమానులు. ఆడ బొమ్మల మొహాలు కన్పించకుండా జాగ్రత్త పడ్డారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. తాలిబన్ల నిర్ణయంపై నెటిజన్లు మండిపడుతున్నారు. మొదట అసలు షాపింగ్ మాల్స్లో అమ్మాయిల బొమ్మలను పూర్తిగా తొలగించాలని, లేదా వాళ్ల మొహాలను తీసేయాలని తాలిబన్లు ఆదేశించారని దుకాణ యజమానులు వాపోయారు. ఆ తర్వాత నిర్ణయం మార్చుకుని మొహాలు కన్పించకుండా కవర్లు చుట్టాలని చెప్పారని వివరించారు. దీంతో తాము కొన్ని బొమ్మలకు వాటి దస్తులకు మ్యాచ్ అయ్యే వస్త్రాన్ని కట్టామని, మరి కొన్నింటింకి స్కార్ఫ్, లేదా పాలిథీన్ కవర్లు చుట్టామని చెబుతున్నారు. షాపింగ్ మాల్స్లో ఆడ బొమ్మల మొహాలకు కవర్లు చుట్టిన ఫొటోలను అఫ్గాన్ మానవతావాది సారా వాహేది ట్విట్టర్లో షేర్ చేయగా.. అవి కాసేపట్లోనే వైరల్గా మారాయి. అఫ్గాన్లో తాలిబన్ల పాలనలో మహిళల జీవితం ఎంత దయనీయంగా ఉందో చెప్పేందుకు ఈ ఫొటోలే నిదర్శనమని ఆమె అన్నారు. ఇది అత్యంత బాధాకరం అని ఓ నెటిజన్ స్పందించాడు. తాలిబన్లు నీచులంటూ మరొకరు మండిపడ్డారు. The Taliban’s hatred of women extends beyond the living. It is now mandatory for store owners to cover the faces of mannequins. These dystopian images are a sign of how much worse life is going to become for Afghan women if the world doesn’t stand with them. pic.twitter.com/p2p0b0QGRR — Sara Wahedi (@SaraWahedi) January 18, 2023 చదవండి: సీట్ బెల్ట్ వివాదం.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు జరిమానా -
మహిళల హక్కులను పట్టించుకోం.. మాకు అదే ముఖ్యం: తాలిబన్లు
కాబూల్: అఫ్గానిస్తాన్లో అమ్మాయిలను హైస్కూల్, కాలేజీ, యూనివర్సిటీల్లో చదవకుండా తాలిబన్ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. అంతటితో ఆగకుండా మహిళలు ఎన్జీఓల్లో కూడా పనిచేయకుండా కొత్త రూల్ తీసుకొచ్చారు. దీంతో తాలిబన్ ప్రభుత్వం తీరును ప్రపంచ దేశాలు తప్పుబడుతున్నాయి. మహిళల హక్కులను కాలరాయొద్దని సూచిస్తున్నాయి. ఈ విషయంపై తాలిబన్ అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ స్పందించాడు. అసలు మహిళల హక్కులు తామ ప్రాధాన్యమే కాదని చెప్పాడు. తమకు ఇస్లామిక్ చట్టమే ముఖ్యమని దాని ప్రకారమే మహిళలు నడుచుకోవాలని పేర్కొన్నాడు. వాళ్లపై విధించిన ఆంక్షలను ఎత్తివేసే ఉద్దేశమే తమకు లేదని తేల్చిచెప్పాడు. ఇస్లాం చట్ట ప్రకారమే తమ పాలన ఉంటుందన్నాడు. అఫ్గానిస్తాన్లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల హక్కులను కాలరాస్తోంది. ఉన్నత విద్య, కాలేజీలు, యూనివర్సీటీల్లో అమ్మాయిలపై నిషేధం విధించింది. వాళ్లు అబ్బాయిలతో కలిసి చదువుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. చివరకు మహిళలు ఎన్జీఓల్లో కూడా ఉద్యోగం చేయకుండా ఆంక్షలు విధించింది. హిజాబ్ ధరిచంకుండా, మగ తోడు లేకుండా బయటకు వెళ్లొద్దని నిబంధనలు తీసుకొచ్చింది. ప్రపంచదేశాలు నుంచి తీవ్ర విమర్శలు ఎదరువుతున్నా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకెళ్తోంది. చదవండి: కీవ్పై మరోసారి పేట్రేగిన రష్యా -
‘మా తల తీసేయమన్నా బాగుండేది’.. అఫ్గాన్ మహిళల ఆవేదన
కాబుల్: అంతర్జాతీయంగా వస్తున్న అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ, అఫ్గాన్ మహిళలు కన్న కలల్ని కల్లలు చేస్తూ వారి హక్కుల్ని నిర్దాక్షిణ్యంగా కాలరాస్తున్నారు తాలిబన్లు. యూనివర్సిటీల్లో ఇక మహిళలకి ప్రవేశం లేదని హుకుం జారీ చేశారు. ఆ ఆదేశాలను వ్యతిరేకిస్తూ అమ్మాయిలు నిరసన ప్రదర్శనలకు దిగితే వాటిని ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు. యూనివర్సిటీల దగ్గర భారీగా బలగాలను మోహరించి వారిని అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో తమ హక్కులను కాలరాయడంపై అక్కడి మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశ్వవిద్యాలయానికి వెళ్లేందుకు మార్వా అనే యువతికి కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. కానీ, ఇప్పుడు ఆమె సోదరుడు ఒక్కడే వెళ్తాడని తెలిసి మనోవేదనకు గురైంది మార్వా. మహిళలపై నిషేధం విధించటం వారి తల నరకడం కన్నా చాలా బాధకారమని పేర్కొంది. ‘ఒకవేళ వారు మహిళలను శిరచ్ఛేదం చేయమని ఆదేశిస్తే.. అది కూడా ఈ నిషేధం కంటే మెరుగ్గా ఉండేది. మనం ఇంత దురదృష్టవంతులమైతే, మనం పుట్టి ఉండకపోతేనే బాగుండేది. నేను ఈ భూమిపై ఉన్నందుకు బాధపడుతున్నా. మనల్ని పశువులకన్నా హీనంగా చూస్తున్నారు. పశువులు ఎక్కడికైనా వెళ్లగలవు. కానీ, బాలికలకు ఇంట్లోంచి బయట అడుగుపెట్టేందుకు కూడా హక్కు లేదు. ’ అని ఆవేదన వ్యక్తం చేసింది 19 ఏళ్ల మార్వా. కాబుల్లోని మెడికల్ యూనివర్సిటీలో మార్చి నుంచి మెడికల్ డిగ్రీలో చేరేందుకు ఇటీవలే ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది మార్వా. అతన సోదరుడు హమిద్తో పాటు యూనివర్సిటీకి వెళ్లాలని కలలను కంది. అయితే, తాజా నిర్ణయం ఆమె ఆశలను నాశనం చేసింది. తనతో పాటు చదువుకుని తన సోదరి లక్ష్యాన్ని సాధించాలని కోరుకున్నట్లు తెలిపాడు హమిద్. ఎన్నో కష్టాలను దాటుకుని తన సోదరి 12వ తరగతి వరకు చదువుకున్నట్లు తెలిపాడు. 45% బాలికలు డ్రాపవుట్ 2021 సెప్టెంబర్ నుంచి అఫ్గాన్లో సెకండరీ స్కూల్స్లో అబ్బాయిలకే ప్రవేశం లభిస్తోంది. ఏడో తరగతి నుంచి అమ్మాయిల ప్రవేశాలను నిషేధించారు. పాథమిక, సెకండరీ పాఠశాలల నుంచి 45% మంది అమ్మాయిలు డ్రాపవుట్ అయ్యారు. ఇదీ చదవండి: Afghanistan: రెక్కలు విరిచేస్తున్నారు.. అఫ్గాన్ యూనివర్సిటీల్లో అమ్మాయిలకు ఇక నో ఎంట్రీ -
కొత్త స్త్రీలు వస్తున్నారు జాగ్రత్త!
‘ఒక సమాజపు ప్రగతిని, ఆ సమాజంలోని మహిళలు సాధించిన ప్రగతితో కొలుస్తాను’ అన్నారు అంబేద్కర్. ఏ మార్పుకైనా మహిళలు ఎంత కీలకమో చెప్పే అరుదైన వ్యాఖ్య ఇది. మిగతా అన్ని సమూహాల మాదిరిగానే భారత మహిళల ప్రగతికి కూడా భిన్నత్వం ఉంది. ఆధునిక మహిళ చరిత్ర పునర్లిఖిస్తుందని గురజాడ అంటే, ఆ చరిత్ర స్వేచ్ఛా సమానత్వాలతో అత్యంత ప్రజాస్వామికంగా ఉంటుంది అనుకున్నాము, ఆ వైపు కొన్ని ముందడుగులు పడ్డాయి. అయితే గత యాభై ఏళ్లుగా పాక్షికంగా, గత పదేళ్లుగా వడివడిగా కొన్ని మహిళా సమూహాలు కొత్తచరిత్రని వేగంగా నిర్మిస్తూ పోతున్నాయి. ఆ చరిత్ర ఫాసిస్ట్ భావజాలానికి బలమైన చేర్పుని ఇస్తూ ఉండటం కలవరపరిచే అంశం. ‘ఒక దేశపు ఫాసిస్టు భావజాల పురోగతిని, ఆ దేశపు రైట్ వింగ్ మహిళలు సాధించిన పురోగతితో కొలవాల్సి ఉంటుంది.’ ఇట్లా కొలిచినపుడు విభ్రాంతి కలిగించే వాస్తవాలు కనిపిస్తున్నాయి. కూడూ, గూడూ, చదువూ, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళూ– వీటిలో కాసింత స్వేచ్ఛకోసం జీవితమంతా పణంగా పెట్టి కొందరు స్త్రీలు పోరాటాలు చేస్తున్నారు. మరోవైపు దేశాన్ని హిందూవర్ణంతో నింపేయడానికి సాయుధ, భావజాల, ప్రచార శిక్షణలతో మరికొందరు స్త్రీలు దూసుకుపోతున్నారు. భారతదేశంలో ఫాసిజం ప్రధానంగా ‘హిందూత్వ బ్రాహ్మణీయ భావజాలరూపం’లో ఉందని విశ్లేషకుల అంచనా. ‘ఈ దుష్ట ఫాసిస్ట్ రాజ్యం నశించాలి’ అంటూ కేవలం అధికార వ్యవస్థలను శత్రువుల్లా చూస్తూ వచ్చిన కాలాన్ని దాటి ముందుకు వచ్చాము. ఇపుడు ఫాసిస్ట్ భావజాలం రాజ్యంలోనే కాదు... మన ఆఫీసుల్లో, ఎదురింట్లో, మనింట్లో, మనలోపలికి కూడా వచ్చేసింది. మొదటిదశలో రాజ్యవ్యవస్థలు ఎవరినైతే అణచివేస్తాయో, ఆయావర్గాల్లో నుంచే కొందరిని మచ్చిక చేసి, ప్రలోభపెట్టి తమకి అనుగుణంగా మలుచుకోవడం రెండోదశ. పైవర్గాలకి అనధికార బానిసలుగా మారడం, స్వీయవర్గాల మీదనే దాడి చేయడం, ఇదంతా దేశభక్తిగా పరిగణింపబడటం ఒక చట్రం. గుజరాత్ ముస్లిం జాతి హననకాండలో వాఘ్రీస్, చరస్ తెగల ఆదివాసీలు, పట్టణ దళితులు తీవ్రమైన హింసకి, లూటీలకి పాల్పడ్డారు. వారి వల్నరబిలిటీని అక్కడి మతతత్వశక్తులు గురిచూసి వాడుకున్నాయి. అగ్రవర్ణాల హిందూ మహిళలు, నాయకురాళ్ళు కొందరు దగ్గరుండి చప్పట్లు కొట్టి మరీ తమ మగవారు చేసే అత్యాచారాలను ప్రోత్సహించారు. తమలోతాము కొట్లాడుకునే బదులు ప్రతి హిందూ యువకుడూ– ఫలానా మైనార్టీ మతంలోని తలొక పురుషుడినీ చంపితే సంతోషిస్తామని మార్గనిర్దేశం చేశారు. ఉత్తర భారతదేశంలో ‘కొత్తమహిళ’ ఆవిర్భవించింది. మతతత్వపార్టీలకూ, సంస్థలకూ అనుబంధంగా మహిళా విభాగాలు విస్తృతంగా ఏర్పడ్డాయి. ‘మాత్రీ మండలులు’, ‘సేవికా సమితులు’, ‘మహిళా మోర్చాలు’ తమ కార్ఖానాల్లో స్త్రీలకి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాయి. స్త్రీలు మృదువుగా, సుకుమారంగా ఉండాలని భావించే పితృస్వామిక సమాజం వారిని మతసంస్థలు నిర్వహించే పారా మిలిటరీ తరహా సాయుధ శిక్షణకి ఎలా ఒప్పుకుంది? స్త్రీలు ఉద్యోగాల కోసమో, ఇతర సామాజిక కార్యకలాపాల కోసమో అడుగు బైటపెడితే చాలు అనేక అనుమానాలతో వేధించే కుటుంబం, వారిని ధార్మిక కార్యకలాపాల కోసం రోజుల తరబడి పుణ్యక్షేత్రాలకి ఎలా అనుమతిస్తోంది? పర్పుల్ అంచున్న తెల్లచీరలు కట్టుకుని మతప్రచారికలుగా, అధ్యాపికలుగా అవివాహిత స్త్రీలు ప్రతిగుమ్మం స్వేచ్చగా తిరుగుతూ ఎలా ప్రచారం చేయగలుగుతున్నారు? ఎందుకంటే ఫాసిస్ట్ మతవ్యాప్తి కోసం అధికారవ్యవస్థలు స్త్రీలకి కాస్త కళ్ళాలు వదులు చేస్తాయి. తాము నిర్ణయించిన అంశాలలో స్త్రీలకి చరిత్రను పునర్లిఖించే బాధ్యతని అప్పగిస్తాయి. ‘స్త్రీ స్వేచ్ఛ అంటే, తమమీద జరిగే దాడులు, అత్యాచారాల నుంచి విముక్తి పొందడమే తప్ప భార్యలుగా, తల్లులుగా తమ సాంప్రదాయక విధుల నుంచి విముక్తి పొందడం కాద’ని ఒక మతతత్వ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలి వ్యాఖ్యను ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. ఇంతకు ముందు మాత్రం స్త్రీలు అధికారం చలాయించలేదా అంటే చంఘిజ్ ఖాన్ నవలలో చెప్పినట్లు అధికారం వస్తే గడ్డిపరక కూడా తలెత్తి నిలబడుతుంది. రాజకీయ నాయకులు, పెద్ద వ్యాపారస్థు్థలు, సెలబ్రిటీ కళాకారులు, అగ్రవర్ణాలు, పదవులు హోదాల్లో ఉన్నవారి భార్యలు, తల్లులు, కూతుళ్ళు, అప్పచెల్లెళ్ళు కొందరు తమకి సొంతంగా పవర్ లేకపోయినా తమ మగవారి తరఫున వారికన్నా ఎక్కువ చలాయించడం వాస్తవం. ప్రాబల్యకులం, ధనికవర్గం, హోదా, అధికారం అంతిమంగా జత కడతాయి. అందులో స్త్రీలు ముఖ్యపాత్ర పోషిస్తారు. అయితే కనీసం మాటవరసకైనా – కులం అనాగరికం అనీ, పేద ఓటర్లే తమ దేవుళ్ళనీ, ఢిల్లీకి రాజైనా అమ్మకి కొడుకేననీ – ఇలా బహిరంగంగా పవర్ని వ్యతిరేకించడం నైతికవిధిగా ఉండేది. ఇపుడు ఆ భారాన్ని తీసివేస్తూ పైవర్గాల స్త్రీల ఏకీకరణకి మతం అందివచ్చిన సాధనం అయింది. ఈ సాధనం మొదట సాంస్కృతిక రంగంలో బలమైన పునాదులు వేసుకుంటోంది. వర్గాల, కులాల, హోదాలవారీగా కొంతమంది స్త్రీలు ఏర్పాటు చేసుకునే కిట్టీపార్టీల్లో మత సంబంధ కార్యాచరణ ఏదో ఒకమేరకు సాగుతోంది. పట్టణ, ధనిక, మధ్యతరగతి మహిళలు మత కార్యకలాపాలు నిర్వహించడానికి అపార్ట్మెంట్ కల్చర్ చాలా అనువుగా ఉంటోంది. చందాల సేకరణ, ఉత్సవాల నిర్వహణ కమిటీలలో స్త్రీలు చురుకుగా పాల్గొంటున్నారు. దేశభక్తి ముసుగులో మతాన్ని ఉగ్గుపాలతో రంగరించి బిడ్డలకి పోయడానికి తల్లులు సమాయత్తమవుతున్నారు. బాలల వికాసం అంటే కాషాయ దుస్తులు తొడిగి, తలకి కాషాయపట్టీ పెట్టి ప్రతీ పండగలో పిల్లల చేత కోలాటాలు, డీజేలు ఆడించడం విధిగా మారిపోయింది. ఒకప్పుడు శాస్త్రీయ దృక్పథాన్ని అందించడానికి తపన పడిన తల్లులు, ఇప్పుడు పురాణ స్త్రీలను అమ్మాయిలకి ఆదర్శంగా చూపిస్తున్నారు. పాతివ్రత్య నిరూపణ కోసం అగ్నిలో నిలబడి ఉన్న సీత క్యాలెండర్ లక్షలాది కాపీలు అమ్ముడుపోయి ఇంటి గోడలపై ప్రత్యక్షం కావడం ఆడపిల్లలకి ఎటువంటి సంకేతాన్ని ఇస్తుంది? మతం వ్యక్తిగత విశ్వాసంగా ఉన్నంతవరకూ, దానినుంచి ప్రమాదం లేకపోవచ్చు, కానీ రాజకీయ ఆచరణగా ముందుకు వచ్చినపుడు అనేకమతాల భారతదేశంలో లౌకికతత్వం వెనక్కిపోయి మెజార్టీమతం అందరి నెత్తికెక్కి సవారీ చేస్తుంది. ఇంటి వరండా, హాలు వంటివి అందరూ వచ్చి పోవడానికి వీలైన లౌకికస్థలాలు. అక్కడ స్త్రీలు తమ చేతికళా నైపుణ్యాలతో తయారు చేసిన మత ప్రదర్శనా చిహ్నాలు, ఇతర మతస్థులు తమకి ఎంత పరాయివాళ్ళో చెబుతూ ఉంటాయి. రాజకీయాలకి ఏమీ సంబంధం లేదేమో అనిపించేంతగా ఈ కొత్త మహిళలు చుట్టుపక్కల కుటుంబాలతో కలిసిపోతారు. పక్కింటి కొత్త కోడలికి వంట నేర్పడమో, ఎదురింటి పెద్దాయనకి అత్యవసర వైద్యసాయమో; ఆందోళన, అభద్రతల్లో ఉన్నవారికి మాటసాయమో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి చేతిసాయమో చేయడం ద్వారా చుట్టుపక్కల అందరికీ ముఖ్యులు అవుతారు. ఆయా సందర్భాల రోజువారీ చర్చల్లో భాగంగా తమ మత భావజాలాన్ని వ్యాప్తిలోకి తెస్తారు. భార్యాభర్తల సమస్యలకి న్యాయసహాయం తీసుకోకుండా ఈ మహిళలే మతసంఘాల ద్వారా పంచాయితీలు పెట్టి సర్దుకుపోవలసిన భారాన్ని స్త్రీల మీద వేస్తారు. ఎన్నికలు, పార్టీమీటింగుల సమయాల్లో వీరు ప్రచారకర్తలుగా మారి సాయాలు చేయడం ద్వారా తాము పట్టు పెంచుకున్న సర్కి ల్స్ని సమీకరించి రాజకీయ ప్రయోజనాలకి వాడుకుంటారు. నాలుగు దశాబ్దాల కిందట స్త్రీలు తమ పిల్లల్నీ, ఇంటినీ చూసుకుంటే చాలన్న దృష్టితో ఉద్యోగాలలో మహిళా రిజర్వేషన్ను మూడుశాతానికి కుదించిన ఘనత ఉత్తర భారత రాష్ట్రాలకి ఉంది. అనుకరణలో ఆరితేరిన దక్షిణ భారతదేశం అక్కడి మత రాజకీయాలనే కాదు, అక్కడి కొత్త మహిళలను కూడా ఆవాహన చేసుకుంటోంది. మత రాజకీయాలు మనకి వద్దు అనుకుంటే ప్రజలకు అయిదేళ్ళకాలం చాలు. ఈ కొత్త మహిళలు సర్వరంగాల్లో తెస్తున్న తిరోగతి వద్దు అనుకుంటే పోవడానికి యాభై ఏళ్ల కాలం కూడా చాలదు! (క్లిక్: మానవ హక్కుల వకీలు బాలగోపాల్) - కె.ఎన్. మల్లీశ్వరి జాతీయ కార్యదర్శి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక malleswari.kn2008@gmail.com -
Srishti Bakshi: గ్రేట్ ఛేంజ్మేకర్
కొన్ని సంవత్సరాల క్రితం...‘ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలో తల్లీకూతుళ్లు సామూహిక అత్యాచారానికి గురయ్యారు’ అనే వార్త చదివిన తరువాత శ్రీష్ఠి బక్షీ మనసు మనసులో లేదు. కళ్ల నిండా నీళ్లు. బాధ తట్టుకోలేక తాను చదివింది కుటుంబసభ్యులు, స్నేహితులతో పంచుకుంది. ‘ఇలాంటివి మన దేశంలో సాధారణం’ అన్నారు వాళ్లు. ఈ స్పందనతో శ్రీష్ఠి బాధ రెట్టింపు అయ్యింది. ఇలా ఎవరికి వారు సాధారణం అనుకోవడం వల్లే పరిస్థితి దిగజారిపోతుంది. ఒక దుస్సంఘటన జరిగితే దానిపై ఆందోళన, ఆవేదన వ్యక్తం అవుతుంది తప్ప నిర్దిష్టమైన కార్యాచరణ మాత్రం కనిపించడం లేదు’ అనుకుంది. ఆరోజంతా శ్రిష్ఠి అదోలా ఉంది. ఈ నేపథ్యంలోనే తన వంతుగా ఏదో ఒకటి చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. మహిళలకు సంబంధించిన భద్రత, హక్కుల గురించి అవగాహన కలిగించడానికి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకుంది. దీనికి ముందు రకరకాల కేస్స్టడీలు, పరిశోధన పత్రాలు చదివింది. ఆధునిక సాంకేతిక జ్ఞానంతో అపూర్వ విజయాలు సాధించిన సాధారణ మహిళల గురించి అధ్యయనం చేసింది. బెంగాల్లోని ఒక పనిమనిషి సరదాగా యూట్యూబ్లో వంటలకు సంబంధించిన రకరకాల వీడియోలను పోస్ట్ చేసేది. కొద్దికాలంలోనే ఆమె యూట్యూబ్ స్టార్గా ఎదిగి ఆర్థికంగా బాగా సంపాదించడాన్ని స్ఫూర్తిగా తీసుకుంది. ఆశీర్వాదం తీసుకుంటూ... తమిళనాడు గ్రామీణ ప్రాంతానికి చెందిన తల్లీకూతుళ్లు వాట్సాప్ కేంద్రంగా దుస్తుల వ్యాపారం మొదలుపెట్టి ఘన విజయం సాధించారు... ఇలాంటి ఎన్నో స్ఫూర్తిదాయక విజయాల గురించి తెలుసుకుంది. ఇలాంటి ఎన్నో విజయగాథలను తన పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనుకుంది. ‘టెక్నాలజీతో సులభంగా అనుసంధానం అయ్యే ఈరోజుల్లో చాలామంది మహిళలు దానికి దూరంగా ఉంటున్నారు. దీనికి కారణం డిజిటల్ నిరక్షరాస్యత. వారికి డిజిటల్ నాలెడ్జ్ను దగ్గర చేస్తే ఎన్నో అద్భుతాలు సాధించగలరు’ అనుకుంది శ్రిష్ఠి బక్షీ. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల గుండా 3,800 కి.మీల పాదయాత్ర చేసింది. ఈ యాత్రలో ఎంతోమంది మహిళలు ఎన్నో సమస్యలను తనతో పంచుకున్నారు. పరిష్కార మార్గాల గురించి లోతైన చర్చ జరిగిదే. ఎన్నో వర్క్షాప్లు నిర్వహించింది. తాజా విషయానికి వస్తే... హక్కుల నుంచి సాధికారత వరకు వివిధ విషయాల్లో విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన శ్రిష్టి బక్షీని ఐక్యరాజ్యసమితి ప్రతిష్ఠాత్మక ‘ఛేంజ్మేకర్’ అవార్డ్ వరించింది. 150 దేశాలకు చెందిన 3000 మంది మహిళల నుంచి ఈ అవార్డ్కు శ్రిష్ఠిని ఎంపికచేశారు. ‘యూఎన్ ఎస్డీజీ యాక్షన్ అవార్డ్ల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సోషల్ ఛేంజ్మేకర్స్తో మాట్లాడే అవకాశం లభిస్తుంది. వారి అనుభవాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. వ్యక్తిగతంగానే కాదు సమష్టిగా కూడా సమాజం కోసం పనిచేయడానికి అవకాశం దొరుకుతుంది’ అంటుంది శ్రిష్ఠి. ‘సమీకరణ, స్ఫూర్తి, ఒకరితో ఒకరు అనుసంధానం కావడం ద్వారా సుందర భవిష్యత్ను నిర్మించుకోవచ్చు. మనం ఎలా జీవిస్తే మంచిది అనే విశ్లేషణకు ఇవి ఉపయోగపడతాయి. పునరాలోచనకు అవకాశం ఉంటుంది’ అంటుంది ఎస్డీజీ యాక్షన్ క్యాంపెయిన్ కమిటీ. ఇ–కామర్స్ స్ట్రాటజిస్ట్గా మంచి పేరు తెచ్చుకున్న శ్రిష్ఠి హాంకాంగ్లో పెద్ద ఉద్యోగం చేసేది. ‘నా జీవితం ఆనందమయం’ అని ఆమె అక్కడే ఉండి ఉంటే ‘ఛేంజ్మేకర్’గా యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించేది కాదు. టెక్నాలజీతో సులభంగా అనుసంధానం అయ్యే ఈరోజుల్లో చాలామంది మహిళలు దానికి దూరంగా ఉంటున్నారు. దీనికి కారణం డిజిటల్ నిరక్షరాస్యత. వారికి డిజిటల్ నాలెడ్జ్ను దగ్గర చేస్తే ఎన్నో అద్భుతాలు సాధించగలరు. ఆ వార్త చదివిన తరువాత తన కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. ‘నేనేం చేయలేనా!’ అని భారంగా నిట్టూర్చింది. అంతమాత్రాన శ్రిష్ఠి బక్షీ బాధలోనే ఉండిపోలేదు. బాధ్యతతో ముందడుగు వేసింది... -
Hyderabad: ‘పింక్ లీగల్’.. మహిళలకు న్యాయ సమాచారం.. ఏ డౌట్ వచ్చినా..
దేశం ఎంత అప్డేట్ అవుతున్నప్పటికీ.. ఆడవాళ్లపై భౌతిక దాడులు, అత్యాచారాలు, అవమానాలు మాత్రం ఆగడం లేదు. వంటింట్లో మొదలు ఆఫీస్, స్కూల్, కాలేజీ, రోడ్డు మీద... ఇలా ప్రతిరోజూ మహిళ అవమానాలను ఎదుర్కొంటూనే ఉంది. మహిళల కోసం ఉన్న చట్టాలు ఏంటి... ఆ చట్టాలు ఎలా పనిచేస్తున్నాయి, ఎవరైనా ఏదైనా ఇబ్బందిలో ఉంటే ఆ ఇబ్బందికి పరిష్కార మార్గం ఏ సెక్షన్ ద్వారా దొరుకుతుంది, పోలీసు స్టేషన్లో, కోర్టులో, ఆఫీస్లో, బయట అవమానాలు ఎదుర్కొన్న మహిళ ఏయే సెక్షన్ల గురించి తెలుసుకోవడం అవసరం... వంటి వివరాలతో ‘పింక్ లీగల్’ అనే వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చారు హైదరాబాద్కు చెందిన మానసి చౌదరి. ఢిల్లీలోని జిందల్ గ్లోబల్ లా స్కూల్లో మానసి న్యాయశాస్త్రంలో పట్టా పొంది, రాష్ట్రహైకోర్టులో రెండేళ్లపాటు ప్రాక్టీస్ చేశారు. సుప్రీంకోర్టు జస్టిస్ డీవై చంద్రచూడ్ వద్ద అసిస్టెంట్గా చేశారు. ఆ సమయంలోనే సెక్షన్ 377పై తీర్పు, శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల స్త్రీలు ప్రవేశించ వచ్చనే తీర్పు రావడం జరిగింది. సుదీర్ఘ అనుభవం కలిగిన మానసి తనకు వ్యక్తిగతంగా ఎదురైన ఓ పరిణామాన్ని జీర్ణించుకోలేక ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)లో మహిళల హక్కులు తెలిపే సెక్షన్లు ఎన్ని ఉన్నాయి, ఏయే సెక్షన్ల కింద ఏయే హక్కులు మహిళలకు ఉన్నాయనే సమాచారాన్ని సంక్షిప్తంగా అందించేందుకు చేసిన కృషి నేడు ఎందరో స్త్రీలకు ఆసరాగా నిలుస్తోంది. ఫలించిన మూడేళ్ల పోరాటం ఐదేళ్ల క్రితం ఓ రోజు రాత్రి ఆఫీసు పని ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో నలుగురు యువకులు తప్పు తమదే అయినా మానసిపై భౌతిక దాడి చేసేందుకు సిద్ధపడ్డారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన మానసి తన వద్ద ఉన్న సాక్ష్యాలను పోలీసులకు ఇచ్చి ఆ యువకులకు శిక్షపడేలా చేశారు. న్యాయవాదిని కాబట్టి నాకు రూల్స్ తెలుసు. ‘హక్కులు తెలియని మహిళల పరిస్థితి ఏంటి?’ అని ఆలోచించిన మానసి ఆ రోజు నుంచి మూడేళ్లపాటు మహిళలకు న్యాయసమాచారాన్ని అందించేందుకు కసరత్తు చేసింది. ఓ పక్క ఉద్యోగం చేస్తూ.. ఇంకోపక్క సీనియర్ న్యాయవాది వద్ద ప్రాక్టీస్ చేస్తూనే రాత్రివేళల్లో వెబ్సైట్ పనుల్లో నిమగ్నమయ్యేవారు. హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ఉన్న లా బుక్స్ తిరగేశారు. రాజ్యాంగంలో మహిళలకు ఉన్న హక్కుల గురించి తెలుసుకున్నారు. 2018లో తొలుత ‘లైంగిక వేధింపులు, మహిళల ఆస్తిహక్కులు’ అనే అంశాలపై పైలట్ ప్రాజెక్ట్గా వెబ్సైట్ ద్వారా సమాచారాన్ని అందించారు. దీనికి మంచి ఆదరణ, స్పందన వచ్చినప్పటికీ, మహిళకు దక్కాల్సిన న్యాయం, హక్కుల గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనే సంకల్పంతో మరో అడుగు ముందుకేశారు. ఇందుకోసం సుప్రీం, హైకోర్టులకు చెందిన సీనియర్ క్రిమినల్ లాయర్లను సంప్రదించారు, సుమారు పదిమంది లా విద్యార్థుల సాయం తీసుకున్నారు. మూడేళ్లపాటు రాత్రింబవళ్లు కష్టపడి చివరికి మహిళలకు ధైర్యం చేకూర్చేలా, వారి హక్కులు తెలుసుకునేలా ‘లైంగిక వేధింపులు, గృహహింస, వివాహం, విడాకులు, ఆస్తిహక్కులు, బాలల హక్కులు, సైబర్ బెదిరింపులు..’ వంటి వాటిపై అవగాహన కలిగించేలా ఓ వెబ్సైట్ ను రూపొందించారు. తన టీమ్తో మానసి చౌదరి లక్షమంది ముందడుగు 2020 మార్చి 8న వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు దానికి సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని నిర్వహించారు. ‘పింక్ లీగల్’ కాన్సెప్ట్ నచ్చి ఆమెతో కలసి మహిళలకు అండగా నిలిచేందుకు, న్యాయసలహాలు అందించేందుకు లా స్టూడెంట్స్ కొందరు జత కలిశారు. దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీల్లో చదువుతున్న సుమారు 30 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మహిళల హక్కులు, న్యాయ సలహాలను గుర్తుచేస్తున్నారు. దీనిలోనే‘ఫ్రీ హెల్ప్లైన్’ ను ప్రారంభించారు. బాధితులు ఎవరైనా అప్లికేషన్ను పూర్తి చేసి దానిలో ఫోన్ నంబర్ రాసి, సబ్మిట్ చేస్తే వాలంటీర్ సదరు మహిళకు ఫోన్ చేసి న్యాయ సలహా అందిస్తారు. అంతేకాదు, ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు వెన్నంటి ఉంటారు. సాంకేతికంగా ఎటువంటి పరిజ్ఞానం లేని వారిని దృష్టిలో పెట్టుకున్న మానసి గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలతో ఒప్పందమయ్యారు. ఆయాప్రాంతాల్లో మహిళలకు ఏదైనా ఇబ్బంది కలిగితే ‘పింక్లీగల్’ గురించి చెప్పి, వారికి ఏయే సెక్షన్లు ఎలా ఉపయోగపడతాయనే దానిపై అవగాహన కల్పిస్తున్నారు. ఏదైనా అంశంపై వికీపీడియా ఎలా అయితే పూర్తి సమాచారాన్ని అందిస్తుందో.. మహిళలకు చట్టాలు, హక్కులపై ‘పింక్ లీగల్’ అలా ఒక ఎన్సైక్లోపిడియాలా పని చేస్తుందంటున్నారు మానసి. పింక్ లీగల్ కాన్సెప్ట్ నచ్చి మానసితో కలసి మహిళలకు అండగా నిలిచేందుకు, న్యాయసలహాలు అందించేందుకు లా విద్యార్థులు జత కలిశారు. దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీల్లో చదువుతున్న సుమారు 30 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మహిళల హక్కులు, న్యాయ సలహాలను గుర్తుచేస్తున్నారు. – చైతన్య వంపుగాని చదవండి: Miss Universe: చారిత్రక మార్పు! ఇకపై వాళ్లు కూడా పాల్గొనవచ్చు! అయితే.. -
మహిళా ఉద్యోగులకు తాలిబన్ల షాక్! ఆఫీస్కు మగాళ్లను పంపాలని ఆదేశం
కాబూల్: అధికారం చేపట్టినప్పటి నుంచి క్రూర చర్యలు, పురుషాధిక్య విధానాలను అనుసరిస్తూ వార్తల్లో నిలుస్తోంది అఫ్గానిస్థాన్లోని తాలిబన్ ప్రభుత్వం. తాజాగా మరోసారి ఇలాంటి పనే చేసింది. మహిళా ఉద్యోగులను ఆఫీసుకు రావద్దని, వారి స్థానంలో కుటుంబం నుంచి లేదా సమీప బంధువుల్లోని మగాళ్లను పంపాలని ఆదేశించింది. ఈ మేరకు ఓ మహిళా ఉద్యోగి వెల్లడించారు. 'తాలిబన్ అధికారుల నుంచి నాకు కాల్ వచ్చింది. ఆఫీస్లో పని భారం పెరుగుతోంది. మీరు చేయలేరు. మీ స్థానంలో మీకు తెలిసిన పురుషుడ్ని పంపాలి అని చెప్పారు. తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత మా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నా పదవిని తగ్గించారు. 60 వేలు ఉన్న నా జీతాన్ని 12 వేలు చేశారు. ఇదేంటని మా పై అధికారిని అడిగితే దరుసుగా ప్రవర్తించారు. ఆఫీస్ నుంచి బయటకు వెళ్లిపోమన్నారు. ఈ విషయంపై చర్చించవద్దన్నారు. జీతం తగ్గాక నా పిల్లాడికి స్కూల్ ఫీజు కూడా కట్టలేని దుస్థితి వచ్చింది. 15 ఏళ్లుగా నేను ఆర్థిక శాఖలో పని చేస్తున్నా. బిజినెస్ మేనేజ్మెంట్లో పీజీ కూడా చేశా' అని మహిళా ఉద్యోగి తెలిపారు. గతేడాది ఆగస్టులో అధికారం కైవసం చేసుకున్నప్పటి నుంచి మహిళల హక్కుల్ని కాలరాస్తున్నారు తాలిబన్లు. వారిపై కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. తాలిబన్ల తీరును అంతర్జాతీయ సమాజం కూడా తీవ్రంగా తప్పుబట్టింది. మహిళలపై ఆంక్షల వల్ల అఫ్గాన్ ఆర్థికంగా ఒక బిలియన్ డాలర్లు (అఫ్గాన్ జీడీపీలో 5 శాతం) నష్టపోతుందని ఐక్యరాజ్యసమితి మహిళల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిమా బాహౌస్ మే నెలలోనే అంచనా వేశారు. అఫ్గాన్ పేదరికంలోకి వెళ్లిందని, ఒక తరం మొత్తానికి ఆహార భద్రత, పోషకాహార లోపం ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: డెలివరీ బాయ్ కాదు హీరో.. ప్రాణాలకు తెగించి మంటల్లో చిక్కుకున్న ఫ్యామిలీని బయటకు -
ఆ వృత్తులకు గౌరవాలు ఏ సమాజంలోనూ దొరకవు
కొన్నాళ్ళ కిందట ఒక ఇంటర్వ్యూ చూశాను. సెక్స్ వర్కర్ల సంఘానికి ప్రతినిధిగా వున్న ఒక స్త్రీ ఇచ్చిన ఇంటర్వ్యూ అది. వ్యభిచారాన్ని ఒక పని (వర్క్) గానూ, ఆ పని చేసే వారిని ‘సెక్సు వర్కర్లు’ గానూ, గుర్తించి, వారిని సానుభూతితో కాక గౌరవంగా చూడాలని ఆ ఇంటర్వ్యూ సారాంశం. ఇలాంటి వాదన, కొత్త దేమీ కాదు. పాతికేళ్ళ కిందట (1997లో) కలకత్తా లోని ఒక మహిళా సంఘం వారు ‘‘సెక్స్ వర్కర్స్ మానిఫెస్టో’’ అని ఒక ప్రణాళికనే విడుదల చేశారు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో చేసిన వాదనలు గానీ, చూపిన పరిష్కారాలు గానీ, ఆడ వాళ్ళని మరింత అధోగతికి దిగజార్చేవిగా ఉన్నాయి. క్లుప్తంగా కొన్నిటిని చూద్దాం. (1) ‘సెక్సు’ని ఒక ‘పని’గా, ఒక ‘వృత్తి’గా అనడం పచ్చి వ్యాపార దృష్టి! స్త్రీలని ‘సెక్స్ ఆబ్జెక్ట్స్’గా (‘భోగ్య వస్తువు’గా), తిరుగుబోతు పురుషులకు అందుబాటులో ఉంచడం తప్పులేదనే దృష్టి అది! ఇలాంటి దృష్టిని ‘పితృస్వామ్య’ దృష్టి అనీ, ‘పురుషాధిక్య భావజాలం’ అనీ అనొచ్చు. కానీ, ఇక్కడ ఆ భావాల్ని ప్రకటించినది, పురుషుడు కాదు, ఒక స్త్రీ! అంటే, జీవశాస్త్ర పరంగా స్త్రీలు, పురుషుల నించీ వేరుగా ఉంటారే గానీ, సామాజికంగా స్త్రీల భావాలు, పురుషుల భావాల నించీ తేడాగా ఉండవని అర్ధం! కట్నం కోసం వేధించే వాళ్ళూ, వ్యభిచార గృహాలు నడిపే వాళ్ళూ ప్రధానంగా స్త్రీలే కదా? (2) వ్యభిచారాన్ని ఒక ‘వృత్తి’గా చెప్పే సంస్కర్తలు, సమాజంలో, స్త్రీ పురుషుల సంబంధాలు ఎలా ఉండాలని చెపుతున్నారు? ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య ఉండే సంబంధం కేవలం శారీరక సంబంధమేనా? ఒక కుటుంబంగా ఉండడమూ, పిల్లల పెంపకంలో తల్లిదండ్రులిద్దరూ బాధ్యతలు పంచుకోవడమూ ఉండాలా, అక్కరలేదా? డబ్బు– ఆదాయ దృష్టితో వ్యభిచారాన్ని సమర్ధిస్తే, ఇంకా మానవ సంబంధాల నేవి ఎలా ఉంటాయి? (3) వ్యభిచారిణుల్ని ‘కార్మికులు’గా గుర్తించమని పోరాడుతున్నారట! పోరాటాలు జరగాల్సింది, ‘ఒళ్ళమ్ము కుని’ బ్రతికే నీచ స్థితి నించీ తప్పించి, గౌరవంగా బ్రతికే ఉద్యోగాలు చూపించమనే డిమాండుతో! (4) ఆర్ధిక అవసరాల వల్ల బ్రతుకుతెరువు కోసం ఈ ‘పని’లోకి వస్తున్నారని ఈమె చెపుతున్నారు. అంటే గతి లేకే వస్తున్నట్టు కాదా? మరి, ‘స్వచ్ఛందంగా’ వస్తున్నారని సమర్ధించుకోవడం ఏమిటి? (5) ‘భర్త బాధ్యతగా లేకపోవడం వంటి కారణాల వల్ల ఎక్కువగా వస్తుంటారు’ అని అంటున్నారు. కానీ, భర్తలు బాధ్యతగా లేని సంసారాలు అనేక లక్షలుంటాయి. ఆ స్త్రీలందరూ ఇదే వ్యభిచారాన్ని బ్రతుకుతెరువుగా చేసుకుంటు న్నారా? చేసుకోవాలా? (6) ‘మా వాళ్ళెవరూ, ఈ పనిని బ్రతుకుతెరువుకోసమే గానీ ఆదాయ వనరుగా చూడర’ని ఒక పక్క చెపుతూ, ఇంకో పక్క పాచి పనుల వల్ల వచ్చే ఆదాయం పిల్లల్ని ఇంజనీ రింగూ, మెడిసినూ చదివించడానికి సరిపోదనడం అంటే, వ్యభిచారాన్ని (‘ఈ పనిని’) ఆదాయ వనరుగా చూడ్డం కాదా? (7) ‘పరస్పరం అంగీకారంతో శృంగారంలో పాల్గొనడం నేరం కాదని సుప్రీంకోర్టు చెప్పిందంటున్నారు. పరస్పరం అంగీకారమైతే, ఒకరు మాత్రమే డబ్బులివ్వడం, ఇంకోరు తీసుకోవడమెందుకు? ఇద్దరికీ అది శృంగారమైతే, ఆ మొగవాడే ఆ ఆడదానికి డబ్బు ఎందుకు ఇవ్వాలి? ఆడది కూడా, ఆ మగవాడికి డబ్బు ఇవ్వాల్సిందే కదా? అలా ఎందుకు జరగదు? (8) వ్యభిచారిణులు, ఆ ‘వృత్తి’ ద్వారా డబ్బు చక్కగా సంపాదించి, పిల్లల్ని డాక్టర్లనీ, ఇంజనీర్లనీ చెయ్యగలుగు తున్నారట! ఈ పాతికవేల మందీ, తమ పిల్లల్లో ఒకటి రెండు వందల మంది పిల్లల్ని డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చేశారను కుందాం. అన్ని వేలల్లో, మిగతా పిల్లల సంగతి ఏమిటి? అయినా తమ పిల్లల్ని డబ్బు సంపాదించే ఉద్యోగులుగా చేయడానికేనా ఆ తల్లులు వ్యభిచారం ద్వారా డబ్బు సంపాదించేది? డబ్బు బాగా సంపాదించకుండా, మాములు కూలి పనులతో, పేదరికంతో బ్రతికే స్త్రీలను మూర్ఖులుగా అనుకోవాలా? (క్లిక్: అబార్షన్ హక్కుకు గొడ్డలిపెట్టు) (9) చివరికి చెప్పుకోవాలిసిన మాట, గౌరవాలకు తగిన నడతలకే గౌరవాలు దొరుకుతాయి గానీ, వ్యభిచారాలూ, దొంగతనాలూ, హత్యలూ వంటి ‘వృత్తులకు’ గౌరవాలు ఏ సమాజంలోనూ దొరకవు. దాన్ని డబ్బు పోసి కొనలేరు. వ్యభిచారిణుల పిల్లలైనా, వాళ్ళు కూడా అదే దారిలో వెళితే తప్ప, వాళ్లయినా, తల్లుల్ని గౌరవించరు! గౌరవించలేరు! గౌరవించకూడదు! (క్లిక్: ఆదివాసీలు అందరికీ ప్రయోజనాలు అందాలి) - రంగనాయకమ్మ సుప్రసిద్ధ రచయిత్రి -
అబార్షన్ హక్కుకు గొడ్డలిపెట్టు
ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఒక పసిపాప భూమ్మీదికి వచ్చిన వార్త కంటే సంతోష కరమైన విషయం మరొకటి ఉండదు. భూమ్మీద అన్ని బాధలూ, వ్యాధులూ, మరణాలూ సంభవిస్తున్నప్పటికీ, శిశువు జన్మించడం అంటే ఒక కుటుంబ భవిష్యత్తే కాదు, మానవజాతి భవిష్యత్తుకు కూడా గొప్ప ఆశాభావాన్ని కలిగిస్తుందన్నమాట. అందుకే కడుపులో ఉన్న బిడ్డను అబార్షన్ రూపంలో చంపడం అంటే అది ఘోరమైన హత్య అని చాలామంది విశ్వసిస్తున్నారు. కానీ బిడ్డ పుట్టడం అనేది అంత సులభమైన విషయం కాదు. అత్యంత నిస్పృహలో, నిరాశాజనకమైన పరిస్థితుల్లో పుట్టే బిడ్డ జననం మహిళలను తరచుగా తీవ్రమైన కుంగుబాటుకూ, కొన్నిసార్లు వైద్యపరమైన సంక్లిష్టతల్లోకీ నెడుతుంటుంది. కానీ జన్మనివ్వడం అనేది మహిళలు, వారి కుటుంబాలు చేసుకోవలసిన ఎంపిక. అత్యవసరమైన సమయాల్లో అది వారి హక్కు, ఎంపికగా మాత్రమే ఉంటుంది. స్వచ్ఛంద మాతృత్వం అని కొంత మంది చెబుతున్నది, మహిళల గర్భస్రావ హక్కు. ఇది పునరుత్పత్తి, పనిలో సమానత్వానికి సంబంధించిన సాహసోపేతమైన ఫెమినిస్టు డిమాండుగా మాత్రమే లేదు. ఇది నిజంగానే మహిళ తన సొంత దేహంపై తాను మాత్రమే తీసుకోవలసిన ఎంపిక స్వాతంత్య్రంగా ఉంటుంది. అబార్షన్ అనేది వైద్యపరమైన అవసరమనీ, వైద్య శాస్త్రం స్వీయాత్మకమైన అంశంగా ఉండదనీ అమెరికన్ కాలేజీ ఆఫ్ ఆబ్స్టిట్రీషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (ఏసీఓజీ) చెప్పింది. అబార్షన్ రూపంలో గర్భధారణను తొలగించడానికి వైద్యపరమైన జోక్యం అవసరమైన పరిస్థితులు ఉంటాయి. మహిళ ఆరోగ్యాన్ని ఈ జోక్యమే కాపాడుతుంది. 2012లో సవితా హలప్పనవర్ అనే భారత సంతతి మహిళా డెంటిస్టు ఐర్లండులో రక్తంలో వ్యాధికారక క్రిములు ఉన్న కారణంగా ఆపరేషన్ అవసరమైన పరిస్థితుల్లో దారుణంగా చనిపోయారు. అబా ర్షన్ చేసుకుంటానన్న ఆమె డిమాండును ఐర్లండ్ చట్టాలు తిరస్కరిం చాయి. ఆమె మరణం పెద్ద ఉద్యమానికి దారితీసి, ఐర్లండులో సంస్క రణలు తీసుకొచ్చింది. దీంతో 2018లో ఆరోగ్య బిల్లు (గర్భధారణ తొలగింపు క్రమబద్ధీకరణ చట్టం)ను కూడా ఆ దేశం ఆమోదించింది. 1973 నాటి ‘రో వర్సెస్ వేడ్’ తీర్పును గత వారం అమెరికా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మహిళల అబార్షన్ హక్కును ఎత్తిపట్టిన ఆనాటి తీర్పును అమెరికన్ సుప్రీంకోర్టు రద్దు చేసింది. అదే సమయంలో గర్భస్రావ ప్రక్రియను విడివిడిగా రాష్ట్రాలు ఆమోదించచ్చు లేదా పరిమితం చేయవచ్చునని ఫెడరల్ కోర్టు పేర్కొంది. దీంతో గత పాతికేళ్లలో చట్టపరమైన అబార్షన్కు ఉన్న రక్షణలను తొలగించిన నాలుగు దేశాల్లో అమెరికా ఒకటిగా మారింది. అబార్షన్ చట్టాలపై ఆంక్షలు విధించడం అనేది మహిళలకు వ్యతిరేకంగా వివక్షలో ఒక రూపమని మానవ హక్కుల సంస్థలు విమర్శిస్తున్నాయి. అంతర్జాతీయ న్యాయవాదులు, అడ్వకేట్ల హక్కుల సంస్థ అయిన సెంటర్ ఫర్ రీప్రొడక్టివ్ హెల్త్, అమెరికా సుప్రీంకోర్టు తాజా చర్యను నిశితంగా విమర్శించింది. అబార్షన్లపై తరచుగా జరుగుతున్న చర్చ గర్భస్థ పిండం, పిండంలో రూపు దిద్దుకుంటున్న జీవానికి సంబంధించి మానసిక, వైద్యపరమైన అంశాలపై మాత్రమే దృష్టి సారిస్తోంది. అయితే పిల్లలను కనాలా, వద్దా అనే అంశాన్ని మహిళలు నిర్ణయించుకోవడం ఒక సామాజిక అడ్డంకిగా ఎందుకుందనే ప్రశ్నపై చర్చ జరగడం లేదు. మహిళలు కేవలం గర్భస్థ పిండాన్ని మోసేవారు మాత్రమే కాదు. ఇలాంటి అభిప్రాయంతోనే పిండంలో రూపొందుతున్న మరొక ప్రాణిని కాపాడే బాధ్యతను రాజ్యవ్యవస్థ తీసుకుని నిర్బంధ చట్టాలను అమలు చేస్తోంది. అబార్షన్ హక్కును నిషేధించడం మహిళకు ఎలాంటి అండనూ లేకుండా చేస్తుంది. ఆమె సొంత దేహం, ఆమె ఎంపిక అనేవి ఇంకా పుట్టని బిడ్డ కంటే ద్వితీయ ప్రాధాన్యత కలిగిన అంశాలుగా మారిపోయాయి. కడుపులోని పిండాన్ని కాపాడటానికి మహిళ ప్రవర్తనను క్రమబద్ధీకరిస్తున్నారు, నియంత్రిస్తున్నారు. మహిళ అంటే గర్భాన్ని మోయడం తప్ప ఒక వ్యక్తిగా ఇక ఏమాత్రం ఉండదన్నమాట. తల్లి శారీరక, మానసిక ఆరోగ్యం ప్రమాదంలో పడినప్పడు అబార్షన్ చేసుకోవడాన్ని ప్రపంచంలో మూడింట రెండొంతుల దేశాలు అనుమతిస్తున్నాయి. అత్యాచారం ద్వారా, వివాహేతర సంబంధం ద్వారా గర్భం దాల్చినప్పుడు లేక బలహీనమైన పిండం కారణంగా గర్భస్రావాన్ని సగం దేశాలు అనుమతిస్తున్నాయి. కాగా ఆర్థిక, రాజకీయ కారణాలవల్ల లేక అభ్యర్థించిన కారణంగా గర్భస్రావాన్ని మూడింట ఒక వంతు దేశాలు మాత్రమే అనుమతిస్తున్నాయి. ఆంక్షలతో కూడిన అబార్షన్ విధానాలు ఉన్న దేశాల్లో సంతానోత్పత్తి రేటు అధికంగా ఉంటోంది. అయితే అబార్షన్లపై ఆంక్షలు విధించిన దేశాల్లో అరక్షిత అబార్షన్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ దేశాల్లో ప్రసూతి మరణాలు కూడా చాలా ఎక్కువగా సంభవిస్తున్నాయి. 1973 నాటి రో తీర్పు వల్ల అమెరికాలో వేలాదిమంది టీనేజర్లు బాల్యవివాహాన్ని, చిన్నతనంలోనే మాతృత్వాన్ని అధిగమించడానికి వీలయింది. అలాగే అవాంఛిత, అనూహ్యమైన గర్భధారణల కారణంగా తక్షణం వివాహాలు చేసుకోవలిసిన పరిస్థితినుంచి మహిళలను ఈ తీర్పు కాపాడింది. కానీ ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశంలో ఇలాంటి తీర్పు రావడం అనేది మహిళల హక్కులపై తీవ్ర అఘాతం మాత్రమే కాదు... దశాబ్దాల స్త్రీవాద ఉద్యమం, మహిళల పునరుద్ధరణ, వారి హక్కుల రక్షణ కూడా ఇప్పుడు ప్రమాదంలో పడిపోయింది. అబార్షన్ చేసుకోగలగడానికీ, మహిళలు ఎప్పుడు, ఎక్కడ, ఏ పరిస్థితుల్లో తల్లులు కావాలో నిర్ణయించుకోవడానికీ మధ్య సాధారణమైన లింకు ఉంటోందనీ, ఇది మహిళల జీవితాంతం వారిపై ప్రభావాలు వేస్తోందనీ 2021 బ్రూకింగ్స్ ఇనిస్టిట్యూట్ నివేదిక పేర్కొంది. మహిళల విద్య, ఆదాయం, కేరీర్, తమ పిల్లలకోసం కల్పించాల్సిన జీవితంపై ఇది పెను ప్రభావం చూపిస్తూంటుంది. రో వర్సెస్ వేడ్ తీర్పును రద్దు చేయడం ద్వారా అబార్షన్ని రద్దు చేయడం, లేదా పూర్తిగా ఆ హక్కుకే దూరం చేయడం అనేది మహిళల వ్యక్తిగత, ఆర్థిక జీవితాలను, వారి కుటుంబ జీవితాలను హరింప జేస్తుందని ఈ నివేదిక స్పష్టం చేసింది. అబార్షన్ చేసుకునే రాజ్యాంగబద్ధమైన హక్కును అమెరికన్ మహిళలు ప్రస్తుతం కోల్పోతుండగా, భారతదేశం మాత్రం 1971 నుంచే వైద్యపరంగా గర్భధారణ తొలగింపు చట్టం (ఎంటీపీ)ని కలిగి ఉంది. జనన లేదా కుటుంబ నియంత్రణ సాధనంగా ఇది ఉనికిలోకి వచ్చింది. 2021లో తీసుకొచ్చిన చట్ట సవరణ ద్వారా 24 వారాలలోపు గర్భస్రావం చేసుకునేందుకు ఈ చట్టం భారత మహిళలకు అనుమతించింది. మహిళల ఆరోగ్యానికి సురక్షితమైన, చట్టబద్ధమైన అబార్షన్లు ఎంతగానో అవసరం అవుతాయి. అయితే గర్భధారణను తొలగించుకోవాలంటే భారత్లో వైద్యుల ఆనుమతి అవసరం. కానీ అవివాహిత మహిళలు గర్భస్రావాన్ని చేయించుకోవడం భారత్లో మహిళలకు కళంకప్రాయంగా ఉంటున్న స్థితి కొనసాగుతోంది. అబార్షన్ హక్కును వెనక్కు తీసుకోవడం అంటే ఆధునికతను మడతపెట్టేయడమే అవుతుంది. చట్టబద్ధమైన పద్ధతులు, వైద్యపరంగా సురక్షితమైన అబార్షన్లు లేకుంటే మహిళలు మరింత ప్రమాదంలో పడతారు. వారి జీవితాలు మరింతగా దుర్భరమవుతాయి. అనూహ్యమైన, అవాంఛితమైన గర్భధారణను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు మహిళలు మరింత ప్రమాదకరమైన, అంధకారయుతమైన స్థానంలోకి నెట్టబడతారు. పైగా నిర్బంధ మాతృత్వం వల్ల వారి జీవిత గమనమే మారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. (క్లిక్: ఆదివాసీలు అందరికీ ప్రయోజనాలు అందాలి) - వినీతా ద్వివేది అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎస్పీజేఐఎంఆర్ (‘మింట్’ సౌజన్యంతో) -
అంతా దైవ నిర్ణయం.. కాదు కాదు నావల్లే: ట్రంప్
వాషింగ్టన్: అమెరికాలో అబార్షన్ హక్కుల రద్దు నిర్ణయంపై సుప్రీం కోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై 50 రాష్ట్రాల్లోనూ నిరసనలు కొనసాగుతున్న వేళ.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అమెరికా సుప్రీం కోర్టు తీర్పును ఆయన స్వాగతించారు. ఇది దైవ నిర్ణయమంటూ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యనించిన ఆయన.. కాసేపటికే ఆ క్రెడిట్ తనకే దక్కాలంటూ కామెంట్ చేశాడు. రాజ్యాంగాన్ని అనుసరించడం అంటే ఇదే. చాలా కాలం క్రితం ఇవ్వాల్సిన హక్కులంటూ.. అంటూ తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. ఇక తాజా తీర్పు ఇచ్చిన న్యాయమూర్తుల్లో ముగ్గురిని ట్రంప్ అధికారంలో ఉండగానే నియమించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. అది తన చేతుల్లో లేదని, అంతా దైవ నిర్ణయమని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. అయితే.. కాసేపటికే మాట మార్చి.. అంతా తనకే దక్కాలంటూ కామెంట్ చేశారు. ‘నేటి నిర్ణయం(కోర్టు తీర్పు).. ఒక తరంలో జీవితానికి అతిపెద్ద విజయం. నేను వాగ్దానం చేసినట్లుగా అన్నింటినీ అందించడం వల్లనే ఇది సాధ్యమైంది. ముగ్గురు బలమైన రాజ్యాంగకర్తలను యునైటెడ్ స్టేట్స్ సుప్రీం కోర్ట్కు నేనే ధృవీకరించాను. అది గౌరవంగా భావిస్తున్నా. నా వల్లే ఇప్పుడు ఇలా తీర్పు రావడం సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నాడు ట్రంప్. సుప్రీం కోర్టులో కన్జర్వేటివ్ మెజార్టీ కృషిలో.. ట్రంప్ ఎంతో కీలకంగా వ్యవహరించారు. నీల్ గోర్సచ్, బ్రెట్ కవానఫ్, అమీ కోనీ బారెట్ట్.. శుక్రవారం నాటి తీర్పులో క్రియాశీలకంగా వ్యవహరించాడు. తాజా తీర్పుతో.. ఇక నుంచి అమెరికా రాష్ట్రాలు అబార్షన్ చట్టం విషయంలో సొంత నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. చదవండి: అబార్షన్ హక్కుల రద్దు.. అమెరికాకు ఇది చీకటి దినం -
అబార్షన్ హక్కుల రద్దు.. కోర్టు తీర్పుపై నిరసన జ్వాలలు
వాషింగ్టన్: అబార్షన్కు రాజ్యాంగ రక్షణ కల్పించే చట్టాన్ని అమెరికా సుప్రీం కోర్టు రద్దు చేసింది. సుమారు యాభై ఏళ్ల కిందటి ఉత్తర్వును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా.. దేశంలోని దాదాపు సగం రాష్ట్రాలు.. అబార్షన్పై నిషేధం విధించేందుకు, కఠిన చట్టాలు చేసేందుకు అధికారం పొందనున్నాయి. దేశవ్యాప్తంగా అబార్షన్ను చట్టబద్ధం చేసిన 1973 నాటి మైలురాయి నిర్ణయం ‘రోయ్ వర్సెస్ వేడ్’ని సుప్రీం కోర్టు రద్దు చేసిన నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్ సహా పలువురు ప్రపంచ నేతలు స్పందించారు ‘‘ఇది అమెరికాకు విచారకరమైన రోజు’’ అని బైడెన్ అభివర్ణించారు. ‘‘రో వెళ్ళిపోవడంతో.. దేశంలోని మహిళల ఆరోగ్యం, జీవితం ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి’’ అని ఒక ప్రకటన విడుదల చేశారాయన. ఇక అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబాబా సైతం సుప్రీం కోర్టును తప్పుబట్టారు. ఈ తీర్పు స్వేచ్ఛపై దాడిగా పేర్కొన్నారాయన. ఇవాళ సుప్రీంకోర్టు దాదాపు 50 సంవత్సరాల పూర్వాపరాలను తిప్పికొట్టడమే కాకుండా, రాజకీయ నాయకులు, సిద్ధాంతకర్తల ఇష్టానుసారంగా ఎవరైనా తీసుకోగల అత్యంత తీవ్రమైన వ్యక్తిగత నిర్ణయాన్ని - లక్షల మంది అమెరికన్ల ఆవశ్యక స్వేచ్ఛపై దాడి చేసింది అంటూ ట్విటర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. తీర్పుపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందిస్తూ.. భయానకంగా ఉందంటూ తీర్పుపై కామెంట్ చేశారు. గర్భస్రావానికి చట్టబద్ధమైన హక్కును కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న మిలియన్ల మంది అమెరికన్ మహిళల భయం, కోపాన్ని నేను ఊహించలేను’ అంటూ ఓ ట్వీట్ చేశారు. అమెరికా మాజీ ప్రథమ పౌరురాలు మిషెల్లీ ఒబామా, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తదితర ప్రముఖులు.. అమెరికా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా మహిళా ఆరోగ్య ప్రాముఖ్యత తగ్గడంతో పాటు వాళ్ల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని పలువురు ప్రముఖులు సైతం వ్యాఖ్యలు చేస్తున్నారు. రోయ్ 1973 ప్రకారం.. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మొదటి రెండు త్రైమాసికాల్లో అబార్షన్లకు అనుమతిస్తారు. అయితే తాజా సుప్రీం కోర్టు రద్దు నిర్ణయంతో.. సగానికి సగం పైగా రాష్ట్రాలు కఠిన అబార్షన్ చట్టం తీసుకొచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తీర్పు ఇచ్చిన జస్టిస్ శ్యామ్యూయెల్ అలిటోకు వ్యతిరేకంగా అమెరికాతో పాటు పలు దేశాల్లో ఇంటర్నెట్ నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. Abortion rights protesters stand in front of city hall in San Francisco, Calif., on Friday, June 24, 2022. People across the country took to the streets to protest after the U.S. Supreme Court overturned Roe v. Wade. #RoeVsWade #abortionrights #sanfrancisco pic.twitter.com/SRYmWuoIPf — Jose Carlos Fajardo (@jcfphotog) June 25, 2022 Today, the Supreme Court not only reversed nearly 50 years of precedent, it relegated the most intensely personal decision someone can make to the whims of politicians and ideologues—attacking the essential freedoms of millions of Americans. — Barack Obama (@BarackObama) June 24, 2022 Reversal of abortion rights #Roe vs Wade horrific indeed. — Deepa Mehta (@IamDeepaMehta) June 25, 2022 Safe #abortion is health care. It saves lives. Restricting it drives women and girls towards unsafe abortions, resulting in complications, even death. The evidence is irrefutable. https://t.co/EB5BsKIxG7 #RoeVsWade — Tedros Adhanom Ghebreyesus (@DrTedros) June 24, 2022 -
International Women's Day 2022: రాజ్యాంగం కల్పించిన హక్కులు ఇవే
సాక్షి, నిర్మల్: మహిళలకు భారత రాజ్యాంగం ఎన్నో హక్కులు కల్పించింది. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. అంతేకాకుండా సఖి కేంద్రం, షీ టీంల ద్వారా ప్రభుత్వాలు మహిళలకు అండగా నిలుస్తున్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కులు ► వారసత్వంలో సమాన వాటా హక్కు ►భ్రూణహత్యల నిరోధక హక్కు ►గృహహింస నిరోధక హక్కు ►ప్రసూతి ప్రయోజనాల హక్కు ► న్యాయ సహాయ హక్కు ►గోప్యత హక్కు ►ఆన్లైన్లో ఫిర్యాదుల హక్కు ►అరెస్ట్ కాకుండా ఉండే హక్కు ►పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఉండే హక్కు ►సమాన వేతన హక్కు ►పని ప్రదేశంలో వేధింపులకు అడ్డుకట్ట ►పేరు చెప్పకుండా ఉండే హక్కు ►కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని పథకాలు ►ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ►బేటీ బచావో బేటీ పడావో ►సురక్షిత మాతృత్వ హామీ సుమన్ యోజన ►ఉచిత కుట్టు యంత్రం ►మహిళా శక్తి కేంద్ర పథకం ►సుకన్య సమృద్ధి యోజన నిర్మల్ జిల్లాలో సఖి కేంద్రం వివరాలు.. ►సఖి కేంద్రం ప్రారంభమైన తేదీ 18 –05 –2019 ►నమోదయిన కేసులు 717 ►పరిష్కారమైన కేసులు 586 ►పెండింగ్ కేసులు 131 ►సఖి కేంద్రం ద్వారా సర్వీసులు.. ►సైకో సోషల్ కౌన్సిలింగ్లు 2065 ►లీగల్ కౌన్సిలింగ్లు 73 ►వసతి కల్పించిన వారు 128 ►ఆరోగ్య పరీక్షలు 29 ►బాహ్య ప్రదేశాలలో కౌన్సిలింగ్ 16 ►ఏమర్జెన్సీ రెస్క్యూ సర్వీస్ 9 ►ఎఫ్ఐఆర్ నమోదు కేసులు 21 ►షీ టీం ద్వారా అందుతున్న సేవలు.. ►జిల్లాలో షీ టీంలు 2: నిర్మల్, భైంసా ►నమోదయిన మొత్తం కేసులు 45 ►ఫోక్సో కేసులు 27 ►నిర్వహించిన కౌన్సిలింగ్లు 120 ►అవగాహన కార్యక్రమాలు 158 ►హాజరైన విద్యార్థులు/ప్రజలు 16182 -
అది వారి హక్కు! వేసే ‘ముష్టి’ కాదు!!
జనాభాలో 50 శాతంగా ఉన్న మహిళలకు చట్టసభల్లో ‘ముష్టి’ 30 శాతం సీట్లు ఇవ్వడానికి కూడా పాలకులకు చేతులు రావడం లేదు. ఈ నేపథ్యంలో మహిళలకు న్యాయస్థానాల్లోనూ 50 శాతం దక్కవలసిందేనని, ఇది ‘దానం’ కాదు ‘మహిళల హక్కు’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ వక్కాణించారు. అయితే, భారత సమాజం ప్రగతిశీలకం కావడానికి ఏ మార్పుల్ని ఆశిస్తున్నామో, ఆ మార్పులకు యువ సీఎం వైఎస్ జగన్ నవరత్నాల దీప్తితో ఆంధ్రప్రదేశ్లో పెక్కు ప్రజాహిత సంస్కరణల ద్వారా శ్రీకారం చుట్టి ప్రశంసలు పొందుతున్నారని మరచిపోరాదు. ఈ సంస్కరణలు అట్టడుగు పేదవర్గాలకూ, నిరుపేద మహిళలకూ సానుకూలమైన నిష్పక్షపాత సంస్కరణలుగా కొనసాగుతున్నాయని గుర్తించాలి. భర్త బూర్జువాగా, భార్య శ్రమజీవి అయిన కార్మికురాలిగా ఉంటున్న స్థితి పోవాలంటే ఆకాశంలో సగానికి అన్నింటిలోనూ సగభాగం దక్కాల్సిందే మరి! భిన్నత్వంలో ఏకత్వమంటే అర్థం ఏమిటి? భిన్నత్వమంటే అసమానతా కాదు, ఒకర్ని తక్కువగాను, ఇంకొకర్ని ఎక్కువగానూ చూడడం కాదు. ప్రకృతి ముందు ఏదీ, ఎవరూ ఒకరికన్నా ఎక్కువా కాదు, మరొకరు తక్కువా కాదు గదా! ఆ లెక్కన నిప్పు ఎక్కువా, నీరు ఎక్కువా? ప్రకృతిలోని పక్షులు, సీతాకోక చిలు కలు, జంతువులు, చీమలు, ఏనుగుల్లో ఏది ఎక్కువ, ఏది తక్కువ? అలాగే సముద్రాలు, కొండలు, గ్రామాల్లో ఏది ఎక్కువ, ఏది తక్కువ? చలికాలం, వేసవి, వానాకాలం, వసంత రుతువుల్లో ఏది గొప్పది, ఏది కాదు? ఒక్కముక్కలో పగలు, రాత్రి, ఏది ఎక్కువ, ఏది తక్కువ? అలాగే ఈ కుటుంబాలలో కూడా ప్రతి ఒక్క పురుషునికి, స్త్రీకి ఎవరి స్థానం వారిదే, ఎవరి వ్యక్తిత్వం వారిదే. అందువల్ల సమా జంలో సమానన్యాయం, సమానత్వం లేకపోతే సామూహిక సద్వర్తనం దుర్లభం. అందువల్ల విభిన్న వ్యక్తుల మధ్య ఐక్యత అనేది పరస్పర న్యాయం, సదవగాహన, గౌరవం ఉన్నప్పుడే సాధ్యం. 1970లలో మహిళా హక్కుల కోసం నిరంతరం, పోరుసల్పుతూ వచ్చిన తొలి భారత మహిళా నాయకులలో ఒకరుగా సామాజిక శాస్త్ర వేత్త కమలా భాసిన్ సుప్రసిద్ధురాలు. ఆమె వెలిబుచ్చిన భావాలతో ఏకీభవిస్తూ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ గత కొద్ది రోజులుగా దేశంలోని మహిళా హక్కుల రక్షణ గురించి నొక్కి చెబుతున్నారు. వలస పాలనావశేషంగా మిగిలి పోయిన భారతదేశ ప్రస్తుత న్యాయవ్యవస్థను స్వతంత్ర భారత న్యాయవ్యవస్థగా రూపొందించుకోవలసిన అవసరం గురించి ఆయన ప్రస్తావించడం ప్రజాబాహుళ్యానికి ఎంతో ఉపయోగకారి. గత నెల చీఫ్ జస్టిస్ చేసిన రెండు ప్రకటనలూ, నూతన మార్గంలో దేశ ప్రగతిని ఆశిస్తున్న అభ్యు దయ శక్తులలో మరింత చైతన్యానికి దోహదపడగల అవకాశం ఉంది. దేశం 75 ఏళ్ళ అమృతోత్సవం జరుపుకుంటున్నవేళ, దేశ చట్టసభలలో ఇన్నేళ్లుగా జనాభాలో 50 శాతంగా ఉన్న మహిళలకు కనీసం ‘ముష్టి’ 30 శాతం సీట్లు ఇవ్వడానికి కూడా ఈ రోజుకీ పాల కులకు చేతులు రాని దుస్థితిలో ప్రధాన న్యాయమూర్తి దేశంలోని మహిళలందరికీ న్యాయస్థానాల్లో 50 శాతం దక్కవలసిందేనని, ఇది ‘దానం’ కాదు ‘మహిళల హక్కు’ అని స్థిరంగా ప్రకటించారు! దేశంలోని ప్రస్తుత న్యాయవ్యవస్థను సామ్రాజ్యవాద వలస పాల కులు ప్రవేశపెట్టి, స్వతంత్ర భారత న్యాయవ్యవస్థ పురోగతికి అవ రోధం కలిగించి ‘భారతీయ న్యాయవ్యవస్థ’గా రూపొందకుండా చేశారు. దాని ఫలితంగా భారత సమాజం ఆచరణలో ఎదుర్కొం టున్న పెక్కు సమస్యలను చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ అనేక ఉదాహర ణలతో ప్రజల దృష్టికి, పాలకుల దృష్టికి తీసుకువచ్చారు. ‘‘నేడు ఇన్నేళ్ళ స్వాతంత్య్రం తరువాత కూడా దేశంలోని సామాన్య పౌరులు తమ అభిప్రాయాలకు కోర్టులలో విలువలేదని భావిస్తున్నారు. వాద ప్రతివాదాలు అంతూ పొంతూ లేకుండా సుదీర్ఘంగా కొనసాగడం, సామాన్య కక్షిదారులకు ఖర్చులు తడిసిమోపడవుతుండడం, పైగా ప్రసంగాలు వారి మాతృభాషలో కాకుండా ఇంగ్లిష్లో కొనసాగు తూండడం, ఇక తీర్పులైతే సుదీర్ఘంగా సాగడం లేదా అర్థం కాని అతి సాంకేతిక పదజాలంతో ఉండడం వంటి కారణాలతో ఇవి రొడ్డ కొట్టుడుగా తయారవుతూ వచ్చాయి.’’ అందువల్ల వలస పాలనావ శేషంగా సంక్రమించిన ఈ మైకం నుంచి మన న్యాయస్థానాలు ఇక నైనా మేలుకొని మన న్యాయవ్యవస్థ దేశీయ ప్రయోజనాల రక్షణకు నడుం కట్టవలసిన సమయం వచ్చిందని ప్రధాన న్యాయమూర్తి (19–9–2021) వక్కాణించారు. మన కోర్టుల్ని చూసి, న్యాయమూర్తులను చూసి న్యాయాన్ని ఆశించి వచ్చే పేదలు బెదిరిపోని పరిస్థితులు రావాలనీ, పేదసాదలకు నిర్మొహమాటంగా వాస్తవాల్ని ప్రకటించుకునే భాగ్యం కలగాలనీ ఆయన ఆశిస్తున్నారు! ఎందుకంటే, ఈ రోజు దాకా మనం అనుస రిస్తూ, ఆచరిస్తున్న విధానాలు, న్యాయసూత్రాలూ వలస పాలనా రోజుల నాటివి కనుకనే ఆచరణలో స్వతంత్ర భారత సమాజ పౌరుల వాస్తవ పరిస్థితులకు పరమ విరుద్ధమని ఆయన భావిస్తున్నారు. మహిళా హక్కుల పరిరక్షణ కోసం సరికొత్తగా ఆయన మరో బాంబు వదిలారు. దేశ న్యాయ వ్యవస్థలో కూడా 50 శాతం స్థానాలు మహిళ లకే ఉండాలని, అది వారి హక్కేగాని ‘దానధర్మం’ కాదని మొదటి సారిగా ప్రకటించడమే కాదు... వేలాది సంవత్సరాలుగా అణచివేతకు గురైన మహిళలు ఈ హక్కుకు అర్హులని చెబుతూ శాస్త్రీయ సోషలిజం పితామహుడు, కమ్యూనిస్టు మానిఫెస్టో సిద్ధాంత కర్త కారల్మార్క్స్ ప్రపంచ కార్మిక లోకాన్ని చైతన్యవంతుల్ని చేస్తూ, ‘ఏకమై ఉద్యమిం చండి మీకు సంకెళ్ళు తప్ప కోల్పోయేదేమీలేదు...’ అన్న చరిత్రాత్మక సందేశాన్ని గుర్తు చేశారు. ప్రపంచ మహిళల్లారా ఐక్యంగా ఉద్యమిం చండి, మీరు కోల్పోయేదేమీ లేదు, సంకెళ్లు తప్ప అని మహిళల పరంగా ఉద్బోధించడం ఓ కొత్త మలుపు. ఈ సందర్భంగా ఒక సమకాలీన సత్యాన్ని మరుగున పడకుండా ఉదాహరించాల్సిన అవసరం ఉంది. ప్రధాన న్యాయమూర్తి భారత సమాజం ప్రగతిశీలం కావడానికి ఏ మార్పుల్ని ఆశిస్తున్నారో, ఆ మార్పులకు ఇప్పటికే దేశంలో ఇతర రాష్ట్రాలకన్నా ముందుగానే ముందుచూపుతో యువ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నవ రత్నాల దీప్తితో ఆంధ్రప్రదేశ్లో పెక్కు ప్రజాహిత సంస్కరణల ద్వారా శ్రీకారం చుట్టి, దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నారని మరచి పోరాదు. ఈ సంస్కరణలు కులాలతో, మతాలతో పార్టీలు, ప్రాంతా లతో సంబంధం లేకుండా సకల ప్రజా బాహుళ్యంలోని అట్టడుగు పేదవర్గాలకూ, నిరుపేద మహిళలకూ సానుకూలమైన నిష్పక్షపాత సంస్కరణలుగా నమోదవుతున్నాయని మరిచిపోరాదు. ఈ సంస్కరణలు మార్క్స్, అంబేడ్కర్, మౌలానా ఆజాద్ భావాల మేలుకలయిక. అందుకే మార్క్స్, ఎంగెల్స్లు అన్నారు. ‘ధనిక వర్గసమాజపు కుటుంబ వ్యవస్థలో భర్త ఆనే వాడు భార్యపై దాష్టీకం చెలాయించగల ఒక బూర్జువా అయితే, భార్య శ్రమజీవి అయిన ఒక కార్మికురాలు (ప్రొలిటేరియట్). ఎందుకంటే, ధనికవర్గ సామాజిక వ్యవస్థలో న్యాయచట్టాలనేవి, ఆ వ్యవస్థపై పెత్తనం ఏ వర్గం చెలాయిస్తుం టుందో ఆ వర్గ ప్రయోజనాలనే తు.చ. తప్ప కుండా కాపాడటానికి ఎలాంటి ‘కొత్త’కి చోటివ్వని న్యాయచట్టాన్నే కోరుకుంటాయి. అందుకే ‘ప్రజల హక్కు’ అన్న భావననే అది సహించదు పైగా చంపేస్తుంది’. కనుకనే ‘పెట్టుబడి అనేది ఇతరుల శ్రమ ఆధారంగా బతకజూసే నిర్జీవ పదార్థం. శ్రమజీవుల శ్రమపై బతికేదే పెట్టుబడి. అలా ఎన్నాళ్లు బతికితే అన్నాళ్లూ ఇతరుల శ్రమను దోచుకుని బలుస్తూనే ఉంటుం ద’ని మార్క్స్ సూత్రీకరించారు. అందుకే ఆయనను ఆధునిక అరి స్టాటిల్ అన్నారు. మానవుణ్ణి మార్క్స్ మొత్తం తాత్విక ప్రపంచానికే కేంద్ర బిందువుగా చేశాడు. ఇంతవరకు తత్వశాస్త్రజ్ఞులు ప్రపంచాన్ని భిన్న కోణాల నుంచి రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మన కర్తవ్యం మానవుణ్ణి తాత్వికకోణానికి కేంద్ర బిందువును చేసి యావత్తు మానవాళిని ఉన్నత స్థానంలో నిలిపి మానవ ప్రగతికి అతడినే మూల కారణం చేయాలి. అదొక్కటే... స్వార్థపరులు మాన వాళి అణచివేతకు ఎక్కుపెట్టిన దుష్టశాసనాలను బదాబదులు చేయ గల ‘పాశుపతాస్త్రం’ అని మార్క్స్ 150 ఏళ్లకు ముందే ప్రవచించాడు. ఆ సంగతి మరవరాదు. ‘మహిళా విమోచన’ అనేది యావత్తు మానవాళి స్వేచ్ఛకోసం వేసే తొలి అడుగు అని మార్క్స్ నిర్వచించారు. ఈ సత్యాన్ని మనం గ్రహించడానికి ఏళ్లూ పూళ్లూ గడిపినా దేశ రాజకీయ (వి)నాయకులకు మాత్రం నేటికీ మనసొప్పడం లేదు. ఎందుకని? ‘పుచ్చిపోతున్న విత్త నాలను బతికించలేమ’న్నది సామెత. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
అఫ్గన్ తొలి మహిళా గవర్నర్ను బంధించిన తాలిబన్లు!
కాబూల్: అఫ్గాన్ తొలి మహిళా గవర్నర్ సలీమా మజారీని తాలిబన్లు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తుపాకీ చేతబట్టి తమతో పోరాడిన ఆమెపై పైచేయి సాధించి ఎట్టకేలకు బంధించినట్లు తెలుస్తోంది. కాగా అఫ్గనిస్తాన్లోని బల్ఖ్ ప్రావిన్స్లోని చహర్ కింట్ జిల్లాకు చెందిన సలీమా అఫ్గన్ తొలితరం మహిళా గవర్నర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఓవైపు అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సహా ఇతర నేతలంతా పారిపోతున్నా బల్ఖ్ ప్రావిన్స్ను తాలిబన్లు ఆక్రమించకుండా ఆమె ఎదురొడ్డి పోరాడారు. కానీ.. తాలిబన్లు ఆ ప్రాంతంపై పట్టు సాధించారు. ఈ క్రమంలో సలీమాను వారు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. అఫ్గనిస్తాన్ తాలిబన్ల వశమైన నేపథ్యంలో అక్కడి మహిళలు హక్కుల కోసం పోరాడుతున్నారు. కాబుల్ వీధుల్లో నలుగురు మహిళలు నిరసన తెలిపారు. తమ హక్కులు కాపాడుకుంటామంటూ ఫ్లకార్డుల ప్రదర్శించారు. కాగా తాము మారిపోయామని, ఇస్లామిక్ చట్టాల ప్రకారం మహిళలకు అన్ని హక్కులు కల్పిస్తామని తాలిబన్లు తమ తొలి మీడియా సమావేశంలో భాగంగా మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, మహిళలు మాత్రం తాలిబన్ల రాజ్యంలో తమ హక్కులకు భంగం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: Karnataka: అఫ్గాన్లలో కలవరం.. మా వాళ్లకు అక్కడ నరకమే! తాలిబన్లపై కీలక నిర్ణయం తీసుకున్న యూట్యూబ్...! -
అక్కడ నిషేధించారు.. మన దేశంలో ఎప్పుడు?
న్యూఢిల్లీ : లైంగిక కోరికలు కలుగకుండా ఉండేందుకు బాలికలకు ‘ఫిమేల్ జెనిటల్ మ్యుటేషన్ (ఎఫ్జీఎం) టైప్–3’ నిర్వహించే రాక్షస దురాచారాన్ని నిషేధిస్తూ సూడాన్ దేశం మే 1వ తేదీన చట్టం తీసుకొచ్చింది. ఈ ఆచారాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ బాధ్యులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా చట్టం తీసుకొచ్చారు. కరోనా వార్తల కారణంగా ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూడాన్లో 87 శాతం బాలికలకు టైపు–3 జెనిటల్ మ్యుటేషన్ నిర్వహిస్తారు. మహిళల అంగాల్లో లైంగిక వాంఛను ప్రేరేపించే అంగాన్ని తొలగించడాన్ని జెనిటల్ మ్యుటేషన్ అని వ్యవహరిస్తారు. ఈ దురాచారం భారత్లోని ‘బొహ్రా’ జాతి ప్రజల్లో కూడా ఉంది. ఆ జాతిలో ఆరేడేళ్ల వయస్సు వచ్చిన బాలికల్లో 75 నుంచి 80 శాతం ఎఫ్జీఎల్ను నాటు పద్ధతిలో నిర్వహిస్తారు. దీన్ని ‘కఫ్జ్ లేదా కాట్నా’ అని కూడా వ్యవహరిస్తారు. భారత్లో దాదాపు 20 లక్షల మంది బొహ్రా జాతి జనులు ఉన్నారు. వారిలో ఇప్పటికీ కొనపాగుతున్న ఈ దురాచారాన్ని నిషేధించాల్సిందిగా ఎన్నో దశాబ్దాలుగా సామాజిక కార్యకర్తలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తోన్న భారత్ ప్రభుత్వాలు ఇంతవరకు స్పందించలేదు. ఆ ఆచారం వారిలో లేదని కొట్టేస్తూ వచ్చాయి. లేనప్పుడు నివారణ చట్టం తీసుకొస్తే వచ్చే నష్టం ఏముందన్న మహిళా సంఘాల ప్రశ్నకు, ఇండియన్ పీనల్ కోడ్, ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్యువల్ అఫెన్సెస్ చట్టాలు సరిపోతాయంటూ వాదిస్తూ వచ్చాయి. ఈ దురాచారంపై నిషేధం విధించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలయిన ఓ పిటిషన్ ఇప్పటికీ పెండింగ్లో ఉంది. (షాకింగ్ : కరోనాకు ముందు - ఆ తర్వాత!) -
ఇవీ మహిళల హక్కులు
పని ప్రదేశాల్లో పురుషులతో సమానంగా వేతనం పొందే హక్కు మహిళలకు చట్టబద్ధంగా ఉంది. చాలాచోట్ల పని ప్రదేశాలలో మహిళలకు ఇప్పటికీ తక్కువ వేతనాలు చెల్లిస్తున్న సందర్భాలు ఉన్నాయి. అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలు దీనివల్ల చాలా నష్టపోతున్నారు. సమాన వేతన చట్టం ప్రకారం సమానమైన పనికి సమానమైన వేతనం పొందే హక్కు ప్రతి మహిళకూ ఉంది. ►గౌరవ మర్యాదలు పొందే హక్కు ప్రతి మహిళకూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా కేసులో మహిళ నిందితురాలైనప్పటికీ, కోర్టుకు అప్పగించడానికి ముందు ఆమెకు నిర్వహించే వైద్యపరీక్షలను మరో మహిళ సమక్షంలోనే నిర్వహించాలి. ►ఉద్యోగాలు చేసుకునే మహిళలకు కార్యాలయాలు, కర్మాగారాలు వంటి పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నుంచి రక్షణ పొందే హక్కు ఉంది. తోటి ఉద్యోగుల నుంచి లేదా పై అధికారుల నుంచి వేధింపులు ఎదురైతే, వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై పని చేస్తున్న సంస్థకు చెందిన అంతర్గత ఫిర్యాదుల కమిటీకి మూడు నెలల్లోగా ఫిర్యాదు చేయవచ్చు. ►గృహహింస నుంచి రక్షణ పొందే హక్కు ప్రతి మహిళకూ ఉంది. భార్య, సహజీవన భాగస్వామి, తల్లి, సోదరి.. ఇలా కుటుంబంలో ఉండే ఏ మహిళ అయినా గృహహింసకు గురైతే, తమ పట్ల హింసకు పాల్పడే వారిపై గృహహింస నిరోధక చట్టం కింద ఫిర్యాదు చేయవచ్చు. గృహహింస ఫిర్యాదులు రుజువైతే నిందితునికి మూడేళ్ల వరకు కారాగార శిక్ష, జరిమానా పడే అవకాశాలు ఉంటాయి. ►అత్యాచార బాధితులైన మహిళలకు, బాలికలకు తమ పేరును గోప్యంగా ఉంచుకునే హక్కు ఉంది. తన పట్ల జరిగిన నేరానికి సంబంధించి బాధితురాలు నేరుగా మేజిస్ట్రేట్ ఎదుట గాని లేదా ఒక మహిళా పోలీసు అధికారి ఎదుట గాని తన వాంగ్మూలాన్ని ఇవ్వవచ్చు. ►న్యాయ సేవల ప్రాధికార చట్టం ప్రకారం మహిళలకు ఉచితంగా న్యాయ సేవలను పొందే హక్కు ఉంది. ఉచిత న్యాయ సేవలను కోరే మహిళల తరఫున కోర్టులో వాదనలను వినిపించడానికి న్యాయ సేవల ప్రాధికార సంస్థ ప్రత్యేకంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తుంది. ►మహిళలకు రాత్రివేళ అరెస్టు కాకుండా ఉండే హక్కు ఉంది. ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ ఆదేశాలు లేకుండా మహిళలను సూర్యాస్తమయం తర్వాతి నుంచి సూర్యోదయం లోపు అరెస్టు చేయరాదు. ఒకవేళ ప్రత్యేకమైన కేసుల్లో అరెస్టు చేయాల్సి వస్తే, పోలీసులు తప్పనిసరిగా ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ ఆదేశాలను పొందాల్సి ఉంటుంది. ►పోలీస్ స్టేషన్కు నేరుగా వెళ్లలేని పరిస్థితుల్లో ఈ–మెయిల్ ద్వారా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా కూడా మహిళలు తమ ఫిర్యాదులను దాఖలు చేసుకోవచ్చు. అలాంటి ఫిర్యాదులు అందిన తర్వాత సంబంధిత పోలీస్స్టేషన్ అధికారి ఒక కానిస్టేబుల్ను ఫిర్యాదు చేసిన మహిళ వద్దకు పంపి, నేరుగా ఫిర్యాదు నమోదు చేసుకుంటారు. ►మహిళలకు అశ్లీల ప్రదర్శనలకు వ్యతిరేకంగా న్యాయం పొందే హక్కు ఉంది. మహిళల ఫొటోలను అశ్లీలంగా చిత్రించడం, వాటిని సామాజిక మాధ్యమాల ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా ప్రదర్శించడం శిక్షార్హమైన నేరాలు. తమ పట్ల ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై ఫిర్యాదు చేసి రక్షణ, న్యాయం పొందే హక్కు మహిళలందరికీ ఉంది. ►వెంటాడి వేధించడం, ఈ–మెయిల్స్, స్మార్ట్ఫోన్లపై నిఘా వేయడం వంటి చర్యలకు పాల్పడే వారి నుంచి రక్షణ పొందే హక్కు మహిళలకు ఉంది. ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి జైలు శిక్ష, జరిమానా పడే అవకాశాలు ఉంటాయి. ►మహిళలకు జీరో ఎఫ్ఐఆర్ దాఖలు చేసుకునే హక్కు ఉంది. బాధితురాలైన మహిళ పట్ల నేరం ఎక్కడ జరిగినా, ఆమె తన ఫిర్యాదును తనకు అందుబాటులో ఉన్న చోట దాఖలు చేసుకోవచ్చు. ఆమె ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా, నేరస్థలం ఆ పోలీస్స్టేషన్ పరిధిలోకి రాకున్నా, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవాల్సిందే. అత్యాచారాలపై ప్రభుత్వ గణాంకాలు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వెల్లడించిన లెక్కల ప్రకారం 2001 నుంచి 2017 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా అత్యాచారాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ పదిహేడేళ్ల కాలంలో కొద్ది రాష్ట్రాల్లో మాత్రమే అత్యాచారాల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టింది. 2001–17 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 4,15,786 అత్యాచార సంఘటనలపై కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సగటున 67 అత్యాచారాలు జరుగుతున్నాయి. అంటే దేశంలో సగటున ప్రతి గంటకూ ముగ్గురు మహిళలు అత్యాచారాల బారిన పడుతున్నారు. ఎన్సీఆర్బీ తాజా నివేదిక ప్రకారం 2017లో నమోదైన నేరాల సంఖ్య 3,59,849. మహిళలపై అఘాయిత్యాల నిరోధానికి చట్టాలు మహిళలపై అఘాయిత్యాల నిరోధానికి ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సహా చాలా చట్టాలు ఉన్నాయి. పిల్లలపై లైంగిక అఘాయిత్యాలను అరికట్టడానికి లైంగిక నేరాల నుంచి బాలలకు రక్షణ చట్టం (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఎగైనెస్ట్ సెక్సువల్ అఫెన్సెస్–పోక్సో యాక్ట్), గృహహింస నిరోధక చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం, సతి నిషేధ చట్టం, ‘నిర్భయ’ చట్టం, ఆంధ్రప్రదేశ్లో ‘దిశ’ చట్టం మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ అమలులో ఉన్నా.. చాలామంది మహిళలకు చట్టపరంగా తమకున్న హక్కులపై అవగాహన లేదు. దీని కారణంగా ఎంతోమంది స్త్రీలు రకరకాల హింసను మౌనంగా భరిస్తూ వస్తున్నారు. -
స్త్రీల హక్కులు, భద్రతలో డెన్మార్ నం.1
డిసెంబర్ 10 ‘అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం’. ఈ సందర్భంగా గత రెండు వారాలుగా ఐక్యరాజ్య సమితి లింగవివక్ష లేని, సమాన అవకాశాలు కలిగిన ప్రపంచమే లక్ష్యంగా విభిన్న కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా నవంబర్ 25ని ‘మహిళలపై హింసావ్యతిరేక దినోత్సవం’గా గుర్తించింది. అప్పటి నుంచి డిసెంబర్ 10 వరకు స్త్రీపురుష సమానత్వాన్ని చాటుతూ కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్త్రీల హక్కులూ మానవహక్కులుగా గుర్తించమని చెప్పడమే ఈ కార్యక్రమాల ఉద్దేశ్యం. స్త్రీల హక్కులు మానవ హక్కులే స్త్రీల హక్కులు మానవ హక్కుల్లో ఎందుకు భాగం కాదు? అన్న ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. నిజానికి వారి శారీరక, మానసిక, భౌతిక అవసరాల రీత్యా స్త్రీలకు కొన్ని ప్రత్యేక హక్కులుండాలని ఐక్యరాజ్యసమితి గుర్తించి వాటిని సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా మలిచింది. అయితే వాటికిప్పటికింకా సమాజంలో ఆమోదముద్ర పడలేదన్నది కాదనలేని సత్యం. ఇప్పటికీ అది చేరుకోవాల్సిన లక్ష్యం. స్త్రీల హక్కులు మానవ హక్కుల్లో భాగమేనని గుర్తించిన దేశాలు బహు తక్కువని 2019 లింగ సమానత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 129 దేశాల్లో జరిపిన అధ్యయనంలో సంపూర్ణంగా లింగ సమానత్వాన్ని సాధించిన దేశాలు లేనేలేవన్న విషయం వెల్లడయ్యింది. అయితే స్త్రీపురుష సమానత్వం కోసం కృషి చేస్తోన్న దేశాల్లో కొంతలో కొంత మెరుగైన ఫలితాలను సాధించడం గమనించాల్సిన విషయం. కొన్ని దేశాల్లో కొంత మెరుగు... 2019లో జరిగిన సర్వే ప్రకారం లింగ సమానత్వం వైపు పురోగమిస్తోన్న టాప్ టెన్ దేశాల్లో డెన్మార్క్ది తొలిస్థానం. ఫిన్లాండ్ ద్వితీయస్థానంలో; స్వీడన్ మూడవ స్థానంలో ఉన్నాయి. నార్వే నాలుగు, నెదర్లాండ్స్ ఐదు, స్లోవేనియా ఆరు, జెర్మనీ ఏడు స్థానాల్లో ఉన్నాయి. కెనడా ఎనిమిదవ స్థానంలో ఉండగా, ఐర్లాండ్ తొమ్మిదవ స్థానాన్ని, ఆస్ట్రేలియా పదో స్థానాన్ని దక్కించుకున్నాయి. సమానత్వంలో టాప్ డెన్మార్క్... స్త్రీల విషయంలో టాప్ వన్ స్థానంలో నిలిచిన డెన్మార్క్ గురించి ఇప్పుడు మిగిలిన దేశాలు దృష్టి పెట్టాయి. డెన్మార్క్లో నాలుగ్గంటలకే సూర్యాస్తమయం అవుతుంది. అంటే డెన్మార్క్లో దీర్ఘరాత్రులుంటాయి. అయితే అక్కడ చీకటి అభద్రతకు చిహ్నం కాదు. ఆ దేశంలో మహిళలు పగలే కాదు రాత్రిళ్ళు కూడా అత్యంత సురక్షితంగా ఉంటారు. స్త్రీ పురుష సమానత్వాన్ని సా«ధించేందుకు ఆ దేశంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. అంతేకాదు సంక్షేమ రాజ్యంగా కూడా డెన్మార్క్ని పేర్కొంటారు. ఆరోగ్యం, విద్య, ఉద్యోగావకాశాల్లో స్త్రీపురుష సమానత్వాన్ని విస్తృతంగా ముందుకు తెచ్చింది డెన్మార్క్ ప్రభుత్వం. డెన్మార్క్లో ఉపాధిరంగంలో ఉన్న మహిళలు అత్యధికంగా ఉన్నారు. స్త్రీ అయినా పురుషులు అయినా ఒకే విధమైన వేతన విధానాన్ని అనుసరించారు. ఆర్థిక రంగంలోనూ, రాజకీయ రంగంలోనూ నిర్ణయాత్మక పాత్రలో మహిళలకూ సమ ప్రాధాన్యముంది. 2014 ఎన్నికల అనంతరం 30 శాతం మంది మంత్రులూ, 37 శాతం మంది పార్టీ నాయకులూ స్త్రీలే ఉన్నారు. వివిధ కంపెనీల్లో బోర్డు మెంబర్లుగా ఉన్న స్త్రీల శాతం పెరిగింది. ఇక్కడ స్త్రీలు 61 ఏళ్ళకు రిటైర్ అయితే, పురుషులకది 63 ఏళ్ళు. పునరుత్పత్తి హక్కులు... వివాహ వయస్సు, పునరుత్పత్తి హక్కుల విషయంలో డెన్మార్క్ ముందుంది. 2012లో ఇక్కడ స్త్రీలు తొలి బిడ్డను కనే వయస్సు 29. 52 వారాల పేరెంటల్ లీవ్ అమలుచేస్తున్నారు. అత్యధిక శాతం తల్లులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. భర్తలకు ఇచ్చే పిల్లల పెంపకానికి సంబంధించిన సెలవుని సైతం పెంచారు. పిల్లల సంరక్షణ ప్రభుత్వ బాధ్యత... మహిళా ఉద్యోగుల పిల్లల పెంపకానికి సంబంధించిన విషయాల్లో సైతం డెన్మార్క్ ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. ప్రభుత్వమే పిల్లల సంరక్షణ బాధ్యతను వహిస్తోంది. వాటి పర్యవేక్షణకు సరిపడే అధికారులను, సిబ్బంది నియామకాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. 2013లో 0–2 ఏళ్ళ మధ్య వయస్సు పిల్లల్లో 67.9 శాతం మందిని ప్రభుత్వం నిర్వహించే చైల్డ్ కేర్ సెంటర్లలో చేర్పించారు. అదే ఏడాది 3–5 ఏళ్ళ మధ్యవయస్సు పిల్లల్లో 97.2 శాతం మందిని చేర్పించారు. మానవ అక్రమ రవాణానిషేధంపై డెన్మార్క్ ప్రత్యేక దృష్టి సారించింది. –అరుణ అత్తలూరి -
నోటి మాటే నినాదం అయింది!
‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అనే నినాదం భగత్సింగ్ది. ‘ఆకాశంలో సగం’ అనే నినాదం విప్లవనేత మావోది. ‘డూ ఆర్ డై’ అనే నినాదం గాంధీజీది.‘మహిళల హక్కులూ మానవహక్కులే’ అనే నినాదం.. ఎవరిది? ఆ అజ్ఞాత నినాదకర్త గురించి చదవండి. 1984. జెనీవాలో యు.ఎన్. కాన్ఫరెన్స్ జరుగుతోంది. మానవ హక్కుల మీద చర్చ. ఇండియా నుంచి మాట్లాడ్డానికి మాలా పాల్ అనే ఆవిడ వెళ్లారు. ముగ్గురు పిల్లల తల్లి. ఆమె వంతు వచ్చింది. ‘‘ఇండియాలో, ఇంకా అనేక ప్రపంచ దేశాల్లో మహిళలు కనీస హక్కులకు కూడా నోచుకోకుండా దుర్భరమైన జీవితం సాగిస్తున్నారు. మనం మానవ హక్కుల గురించి మాట్లాడుకుంటున్నాం. మహిళల హక్కులూ మానవ హక్కులేనని ఎందుకు గుర్తించలేకపోతున్నాం! ఉమెన్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్ కాదా?!’’ అన్నారు మాలా. ఆ మాటకు మాలా పక్కన ఉన్నావిడ గట్టిగా బల్లను చరిచి మాలాను సమర్థించారు. మరుక్షణం హాలంతా హర్షధ్వానాలు. మాలా పాల్ ‘ఆలిండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్’ ప్రతినిధిగా ఆ సదస్సుకు హాజరు అయ్యారు. ఆ బల్లగుద్దిన ఆవిడ సెనెగల్ రాయబారి. కొన్ని వారాల తర్వాత ఐక్యరాజ్యసమితి.. మాలా అన్న మాటను తన అధికారిక నినాదంగా స్వీకరించింది. ‘ఉమెన్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్’ అనే ఆ మాట అప్పట్నుంచి వాడుకలోకి వచ్చింది. ఏమిటి అంత పవర్ ఆ మాటలో! మహిళ కూడా మనిషేనని గుర్తు చేయడం. గుర్తు చేయవలసినంతగా మహిళల హక్కుల గురించి పట్టించుకోవడం మానేశాం అని చెప్పడం. 1995లో ఐక్యరాజ్యసమితి చైనా రాజధాని బీజింగ్లో నిర్వహించిన నాల్గవ ప్రపంచ మహిళా సదస్సులో ప్రసంగిస్తూ అప్పటి అమెరికా ప్రథమ మహిళ హిల్లరీ క్లింటన్ ‘ఉమెన్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్’ అని అనడంతో అప్పట్నుంచీ అదొక పొలిటికల్–ఫెమినిస్ట్ నినాదం కూడా అయింది. 1984 అంటే ఇంటర్నెట్కు ముందు కాలం. అందుకే మాలా పాల్ అజ్ఞాతంగా ఉండిపోయారు. ఆమె నినాదానికి లభించిన ప్రాధాన్యం నినాదకర్తగా ఆమెకు గుర్తింపు లభించలేదు. అయితే గుర్తింపు కోసం మాలా నినదించలేదు. మహిళల హక్కులను మానవహక్కులుగా గుర్తించమని మాత్రమే అడిగారు. ప్రస్తుతం మాలా వయసు 87 సంవత్సరాలు. యాభైఏళ్ల పాటు విదేశాల్లో గడిపాక, భర్త మరణానంతరం జన్మభూమి జ్ఞాపకాలతో తిరిగి ఇండియా చేరుకుని ఢిల్లీలో ఉండిపోయారు. మాలా 1932లో లాహోర్లో జన్మించారు. ఆరుగురు తోబుట్టువులలో ఆఖరి బిడ్డ. తండ్రి ఇండియన్ సివిల్ సర్వీస్లో పనిచేసేవారు. అంత గొప్ప హోదా పిల్లలకీ గొప్ప జీవితాన్ని ఇచ్చింది. క్రమశిక్షణతో పెరిగారు. సిటీలోని టాప్ స్కూళ్లలో చదివారు. అయితే దేశ విభజనతో ఆ కుటుంబ పరిస్థితి తలకిందులయింది. 18వ ఏట మాలా పెళ్లయే వరకు వారు ఢిల్లీలోని బరోడా హౌస్కి అనుబంధంగా ఉన్న ఒక ఇంట్లో ఉన్నారు. మాలా భర్త డాక్టర్ రాజీందర్ పాల్ ఆమె కన్నా 13 ఏళ్లు పెద్ద. మలేరియాలజిస్టు. ఆయన వృత్తి జీవితమంతా పూర్తిగా విదేశాల్లోనే గడిచింది. భార్యాభర్తలు కెనడాలో ఉన్నారు. యు.ఎస్.లో ఉన్నారు. చివరికి స్విట్జర్లాండ్లో ఉండిపోయారు. అక్కడి ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయంలో భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ తరఫున మాలా భర్త వివిధ రకాలైన ప్రాజెక్టులలో తలమునకలై ఉండేవారు. స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో ఉన్నప్పుడు మాలా ‘ఆలిండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్’ (ఎ.ఐ.డబ్లు్య.సి) వలంటీర్గా పని చేశారు. తర్వాత ఆ సంస్థకు ఐక్యరాజ్యసమితి గుర్తింపు రావడంతో సమితిలోని ‘ఎకోసాక్’ (ఎకనమిక్ అండ్ సోషల్ కమిషన్)లో శాశ్వత సభ్యురాలయ్యారు. ఎ.ఐ.డబ్లు్య.సి. కి సమితి గుర్తింపు లభించడం అన్నది అప్పట్లో భారత్కు గర్వకారణమైన విషయం అయింది. అక్కడి నుంచి మాలా ‘కాంగ్రెస్ ఆఫ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్’ సంస్థకు వైస్–ప్రెసిడెంట్ అయ్యారు. ఆ హోదాలో మాలా అనేక సమస్యలపై ఐక్యరాజ్యసమితిలో పోరాటం జరిపారు. బాలికల హక్కుల పరిరక్షణ, పర్యావరణం, గృహ వసతి, వృద్ధాప్యం, ఆధ్యాత్మిక జీవనం వంటి అనేక ముఖ్యమైన అంశాలపై ఆమె ప్రభుత్వాల ఉదాసీనత్వాన్ని వేలెత్తి చూపేవారు. సమస్యల పరిష్కారానికి స్పష్టమైన సూచనలు చేసేవారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఇంటర్నేషనల్ అలయెన్స్ ఆఫ్ ఉమెన్’లో కూడా మాలా సభ్యురాలు. సొంత ఖర్చుతో వెళ్లి అంతర్జాతీయ వేదికలపై ఆమె ప్రసంగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంటిని నడుపుతూనే. పిల్లల ఆలనాపాలనా చూస్తూనే. ఎప్పుడూ బిజీగా, అందుబాటులో లేకుండా ఉండే భర్తతో సర్దుకు వస్తూనే! ప్రస్తుతం మాలా తన కుమార్తె దగ్గర ఉంటున్నారు. పిల్లల పిల్లలతో ఉల్లాసంగా గడుపుతున్నారు. వంట మనిషి కూతుర్ని మంచి స్కూల్లో చదివిస్తున్నారు. తనే స్వయంగా ఆ అమ్మాయికి పాఠాలు చెబుతుంటారు. ‘ఆడపిల్లకు చదువే రక్షణ. చదువే భద్రత’ అంటారు మాలా పాల్. -
28 ఏళ్ల తరువాత.. తొలిసారి
బెర్న్: మనదేశంలోనే కాదు దాదాపు ప్రపంచమంతా మహిళలపై అనేక రంగాల్లో వివక్ష కొనసాగుతూనే ఉంది. అమెరికా, నార్వే, స్కాండినేవియన్ వంటి దేశాల్లో మహిళలకు ఎన్నో హక్కులు ఉన్నప్పటికీ ఇంకా కొన్ని దేశాలు మాత్రం కల్పించలేకపోతున్నాయి. మహిళల హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా రోజూ ఏదోఒక ఉద్యమం సాగుతునే ఉంటుంది. తాజాగా తామకు సమాన హక్కులు కల్పించాలని కోరుతూ.. స్విట్జర్లాంట్లో మహిళలు ఆందోళన బాట పడ్డారు. గత రెండు రోజుల నుంచి లక్షలాది మంది మహిళలు రోడ్లపైకి చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. పనికి సామానవేతనం కల్పించాలని, పురుషులతో సమానంగా హక్కుల్లో ప్రాధాన్యం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా 28 ఏళ్ల తరువాత ఇంత పెద్దఎత్తున స్విస్లో మహిళలు ఉద్యమంలో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం విశేషం. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత మహిళలకు ఓటు హక్కు కల్పించాలని మొదటి సారి వారు ఆందోళన బాటి పట్టారు. దీనికి ప్రతిఫలితంగా 1971లో స్విట్జర్లాండ్ ప్రభుత్వం వారికి తొలిసారి ఓటు హక్కును కల్పించింది. అప్పటి వరకు ఆ దేశంలో మహిళకు ఓటు హక్కులేకపోవడం గమన్హారం. ఆ తరువాత ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు అవకాశం కల్పించాలని, ప్రసూతి సెలవులను మంజూరు చేయాలని 1991లో మరోసారి మహిళాలోకం ఆందోళన బాట పట్టింది. వారి డిమాండ్లకు తలొగ్గిన స్విస్ ప్రభుత్వం తొలిసారి వారిని ప్రభుత్వ ఉద్యోగాలకు అనుమనిచింది. వారి ఉద్యమ ఫలితమే నేడు ఆదేశ మంత్రిమండలిలో ఎనిమిది మంది మహిళా మంత్రులకు అవకాశం కల్పించింది. కాగా తాజాగా వేతంలో తమపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని.. పురుషులతో పోల్చుకుంటే 20శాతం తక్కువగా వేతనాలు చెల్లిస్తున్నారని, మరికొన్ని అంశాల్లో తమకు పూర్తి స్వేచ్చను కల్పించాలని ఆందోళన చేస్తున్నారు. దీనికి ఆదేశ పలువురు మహిళా ప్రముఖులు పూర్తి మద్దతును ప్రకటించారు. 1991 ఉద్యమ స్ఫూర్తితోనే ప్రభుత్వంపై పోరాడి హక్కులను సాధించుకుంటామని అప్పటి ఉద్యమంలో పాల్గొన్నవారు చెపుతున్నారు. -
‘ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మా ఓటు’
సాక్షి, న్యూఢిల్లీ : ‘మేము ఓటర్లలో సగం. దేశంలో పెరిగిపోతున్న మూక హత్యలకు వ్యతిరేకంగా మేము ఈ సారి ఓటు వేస్తాం. పట్టపగలు, పలువురు చూస్తుండగా ఈ హత్యలు జరుగుతుండడం దారణం. మా రాజ్యాంగ హక్కులు హరించుకుపోయాయి. మా భావప్రకటనా స్వేచ్ఛను అణచి వేస్తున్నారు’ అని 58 ఏళ్ల మంజూ శర్మ వ్యాఖ్యానించారు. ఆమె ఓ సామాజిక కార్యకర్త. గురువారం నాడు ఢిల్లీ మండి హౌజ్ నుంచి జంతర్ మంతర్కు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మహిళల్లో ఆమె ఒకరు. మహిళలు, ట్రాన్స్జెండర్లు, రైతులు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, కళాకారులకు సంబంధించిన పలు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన ఈ ర్యాలీలో కొన్ని వందల మంది మహిళలు పాల్గొన్నారు. వీరంతా ఒక్క ఢిల్లీ నుంచే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, అజ్మీర్, చెన్నై, అహ్మదాబాద్ నగరాల నుంచి కూడా వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్రంలోని ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ మహిళలకు పిలుపు ఇవ్వడంలో భాగంగానే ఈ ర్యాలీ జరిగిందని ర్యాలీలో పాల్గొన్న సామాజిక కార్యకర్త షబ్నమ్ హష్మీ తెలిపారు. పెద్దనోట్ల రద్దు కారణంగా దేశంలో ఎంతో మంది మహిళలు ఉద్యోగాలను కోల్పోయారని ఆమె చెప్పారు. పితృస్వామిక వ్యవస్థ, ఫాసిజం, కులతత్వం నశించాలంటూ ర్యాలీలో పాల్గొన్న పలువురు మహిళలు నినదించారు. సోమాసేన్, సుధా భరద్వాజ్ అనే సామాజిక కార్యకర్తలను విడుదల చేయాలంటూ కూడా వారు ప్లే కార్డులను ప్రదర్శించారు. పుణెకు సమీపంలోని భీమా కోరెగావ్లో సమావేశంలో పాల్గొన్న తొమ్మిది మందితోపాటు ఈ ఇరువురిని జూన్ నెలలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ మరుసటి రోజు జరిగిన విధ్వంసకాండకు ఆ సమావేశమే కారణం అంటూ వారిపై కేసులు నమోదు చేశారు. దేశంలో విద్వేష రాజకీయాలు పెరిగిపోయి విధ్వంసం, హింసాత్మక సంఘటనలు పెరిగిపోయాయని, మహిళలకు భద్రత కరవైందని, మరోపక్క నిరుద్యోగం పెరిగిపోయిందని, ఈ ఎన్నికల్లో ప్రధానాంశం నిరుద్యోగమేనని 50 ఏళ్ల అఫ్రోజ్ గుల్జార్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మహిళ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నట్లు ర్యాలీలో పాల్గొన్న పలువురు మహిళలు ఆరోపించారు. -
షీ వాంట్..
దశాబ్దాలు గడిచినా హక్కులు, అవకాశాల్లో ‘ఆమె’కు సమానభాగస్వామ్యం దక్కడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి.. ప్రతి ఎన్నికల్లో పార్టీలు హామీల వర్షంకురిపిస్తున్నాయి. కానీ మహిళల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి, సామాజిక భద్రత ఇప్పటికీఅంతంతమాత్రంగానే ఉంది. ఇల్లు, బడి, కార్యాలయం, రోడ్డు, బహిరంగప్రదేశాల్లో ఎక్కడో ఓ చోట ఏదో రకమైన వివక్ష, వేధింపులు,అణచివేతను మహిళలు ఎదుర్కొంటున్నారు. గృహహింస, నిర్భయ చట్టాలు వచ్చినా.. షీటీమ్స్ బృందాలు రంగంలోకి దిగినా లైంగిక దాడులు, హింస కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీల ఎన్నికల మేనిఫెస్టోల్లో మహిళల ఆకాంక్షలు ఏ మేరకు ప్రతిబింబిస్తున్నాయనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మహిళా, హక్కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ‘ఉమెన్ మేనిఫెస్టో’పై దృష్టిసారించాయి. మహిళల సంక్షేమం కోసం అన్ని రాజకీయ పార్టీలు ‘ఉమెన్ మేనిఫెస్టో’నుప్రామాణికంగా తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో : ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలలు తదితర విద్యాసంస్థల్లో అమ్మాయిలు నిశ్చింతగా చదువుకునేందుకు అనువైన వాతావరణం, మౌలిక సదుపాయాలు కల్పించాలి. అన్ని విద్యాసంస్థల్లో ఇందుకోసం ప్రత్యేకంగా 2013 నిర్భయ చట్టానికి అనుగుణంగా ‘నిర్భయ సెల్’ను ఏర్పాటు చేయాలి. టాయిలెట్ల ఏర్పాటు, మంచినీళ్లు, పౌష్టికాహారం అందజేయాలి. అమ్మాయిల్లో రక్తహీనత ఒక సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో స్కూళ్లలో తృణధాన్యాలతో కూడిన పోషకాహారాన్ని అందజేయాలి. స్కూళ్లలో తప్పనిసరిగా చైల్డ్ హెల్త్ కేర్ రికార్డులను అమలు చేయాలి. ఇందులో ఉపాధ్యాయులు, ఆరోగ్యకార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు భాగస్వాములు కావాలి. యుక్తవయసు బాలికలకు చక్కటి ఆరోగ్య విద్యను అందజేయాలి. శానిటరీ ప్యాడ్స్, న్యాప్కిన్స్ అందుబాటులో ఉంచాలి. యుక్తవయసులో వచ్చే మార్పుల గురించి అమ్మాయిలకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించే విధంగా నిరంతరం జెండర్ సెన్సిటైజేషన్ వర్క్షాపులు ఏర్పాటు చేయాలి. వృత్తి విద్యాకోర్సుల్లో శిక్షణనిప్పించి అమ్మాయిలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందుకునేందుకు చర్యలు తీసుకోవాలి. స్వీయ రక్షణ కోసం నిరంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. సమాన అవకాశాలు... స్త్రీలపై జరుగుతున్న అన్ని రకాల హింసను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని రంగాల్లో మహిళలకు 50శాతం అవకాశాలు కల్పించాల్సిందేనని మహిళా సంఘాలు చెబుతున్నాయి. విద్య, ఆరోగ్యం, జీవితబీమా, బ్యాంకింగ్, పోలీసు, రవాణా, న్యాయ, వైద్య, ఎయిర్ఫోర్స్, నావిక తదితర అన్ని రంగాల్లో మహిళలు రాణించే విధంగా సమాన అవకాశాలను కల్పించి ప్రోత్సహించాలి. సమాజంలో మహిళలపై హింసకు మద్యపానం కూడా కారణమే. దీన్ని ఆదాయ వనరుగా భావించే ప్రభుత్వ దృక్పథం మారాలి. మద్యం దుకాణాలను తగ్గించాలి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల లోపే మద్యం షాపులు తెరిచి ఉంచాలి. ప్రధాన హైవేలు, బస్టాపులు, ఆలయాలు, బడులు, ప్రార్థనా స్థలాలకు సమీపంలో ఉన్న వాటిని తొలగించాలి. సామాజిక భద్రత... నగరంలో సుమారు 8లక్షల మంది మహిళలు గృహ కార్మికులుగా పని చేస్తున్నారు. భవన నిర్మాణ రంగంలో ఇతర అనేక అసంఘటిత రంగాల్లో మరో 10లక్షల వరకు మహిళలు ఉన్నారు. వీరి సంక్షేమం, సామాజిక భద్రతకు అంఘటిత కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ప్రత్యేక వసతి గృహాలను అందుబాటులోకి తీసుకురావాలి. కనీస వేతనాలు అమలు చేయాలి. గృహ కార్మికులకు రోజుకు 8గంటల పని, నెలకు రూ.10వేల వేతనం అందే విధంగా చూడాలి. అలాగే గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే మహిళా కార్మికుల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. పాతబస్తీతో పాటు అనేక ప్రాంతాల నుంచి లక్షలాది మంది మహిళలు ఉపాధి కోసం గల్ఫ్ బాట పడుతున్నారు. వీరి సంక్షేమం కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. భద్రత కల్పించాలి. నిరంతర రవాణా... నగరంలో సిటీ బస్సులు, మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లు ప్రజా రవాణా సదుపాయంగా అందుబాటులో ఉన్నప్పటికీ... మహిళలకు అరకొర సదుపాయాలే ఉన్నాయి. మహిళల కోసం లేడీస్ స్పెషల్ బస్సులను పెంచాలి. ప్రస్తుతం ఉదయం, సాయంత్రం వేళల్లో సుమారు 50బస్సులు మాత్రమే ఉన్నాయి. వీటి సంఖ్యను మహిళా ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా పెంచాలి. అలాగే మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లలోనూ స్పెషల్ సర్వీసులను నడపాలి. రాత్రి 10గంటలు దాటితే క్యాబ్లు, ఆటోరిక్షాలు వంటి వాహనాలపైన ఆధారపడాల్సి వస్తోంది. ఈ వాహనాల్లో మహిళలకు సరైన భద్రత ఉం డడం లేదు. దీంతో 24గంటల పాటు ప్రజా రవా ణా సదుపాయాలు అందుబాటులో ఉండే విధం గా నగర రవాణా వ్యవస్థను మెరుగుపర్చాలి. ⇔ కులాంతర, మతాంతర వివాహాల్లో పితృస్వామ్య, కుల, మతపరమైన ఆధిపత్య హింసలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాన్ని తేవాలి. పరువు హత్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించే విధంగా చట్టాలను రూపొందించాలి. ⇔ పెద్దల సంరక్షణ లేని పిల్లలు, ఒంటరి మహిళలు, వికలాంగులు తదితర వర్గాలకు, నిరాశ్రయులకు ప్రభుత్వమే అన్ని విధాలుగా అండగా నిలిచి భద్రత కల్పించాలి. అలాంటి పిల్లలను చదివించి వారి భవిష్యత్తుకు భరోసాను కల్పించాలి. ఈసారైనా... కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణలో అన్ని వర్గాల్లాగే మహిళలు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ నాలుగున్నరేళ్లలో నిరాశే మిగిలింది. మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. మరోసారి ఎన్నికలొచ్చాయి. ఈసారైనా రాజకీయ పార్టీలు మహిళల సంక్షేమంపై దృష్టి సారిస్తాయని ఆశిస్తున్నాం. – సజయ, సామాజిక కార్యకర్త -
లైంగికహింసపై పోరాటానికి నోబెల్
ఓస్లో: ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, అంతర్యుద్ధాలు జరుగుతున్న కల్లోలిత ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న లైంగిక హింసపై అలుపెరుగని పోరు జరుపుతున్న ఇద్దరికి ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. కాంగోకు చెందిన వైద్యుడు డెనిస్ మక్వీజ్(63), ఇరాక్లోని యాజిది తెగకు చెందిన యువతి నదియా మురాద్(25)లు ఈ ప్రతిష్టాత్మక గౌరవం పొందారు. యుద్ధాల్లో లైంగిక హింసను ఒక ఆయుధంగా వాడుకోకుండా నిరోధించేందుకు ఈ ఇద్దరు ఎంతో పోరాడారని నోబెల్ ఎంపిక కమిటీ ప్రశంసించింది. ఈ అవార్డుల ప్రకటనను అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్య సమితి స్వాగతించాయి. ‘యుద్ధ సమయాల్లోనూ మహిళల హక్కులు, భద్రతను గుర్తించి కాపాడితేనే శాంతియుత ప్రపంచం సాకారమవుతుంది’ అని కమిటీ చైర్మన్ బెరిట్ రీస్ అండర్సన్ వ్యాఖ్యానించారు. యుద్ధాలు, సాయుధ దళాల సంఘర్షణల్లో లైంగిక హింస కట్టడికి పోరాడిన మక్వీజ్ జాతీయంగా, అంతర్జాతీయంగా పేరు గడించారని పేర్కొన్నారు. మక్వీజ్, మురాద్ తమ వ్యక్తిగత జీవితాలను పణంగా పెట్టి లైంగిక నేరాలపై పోరాడారని కొనియాడారు. కాంగోలో యుద్ధ సమయాల్లో లైంగిక హింసకు గురైన మహిళలు శారీరక, మానసిక క్షోభ నుంచి కోలుకునేలా మక్వీజ్ గత రెండు దశాబ్దాలుగా సేవ చేస్తున్నారు. 1999లో తాను స్థాపించిన ఆసుపత్రిలో వేలాది మంది బాధితులకు చికిత్స అందించారు. ‘డాక్టర్ మిరాకిల్’గా పిలిచే మక్వీజ్..యుద్ధ సమయాల్లో మహిళలపై దాష్టీకాలను నిర్మొహమాటంగా ఖండించారు. 2014లో ఐఎస్ ఉగ్రవాదుల చేతిలో అపహరణకు గురైన మురాద్..మూడు నెలల తరువాత వారి చెర నుంచి తప్పించుకుంది. ఉగ్రవాదులు లైంగిక బానిసలుగా చేసుకున్న వేలాది మంది యాజిది మహిళలు, చిన్నారుల్లో మురాద్ కూడా ఒకరు. హాలీవుడ్ను కుదిపేసిన ‘మీటూ’ ఉదంతం వెలుగు చూసి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా లైంగిక నేరాలపై పోరాడి న వారికి నోబెల్ శాంతి బహుమతి దక్కడం విశేషం. వెల్లువెత్తిన అభినందనలు.. మక్వీజ్, మురాద్ల ధైర్య సాహసాలను యూరోపియన్ అధ్యక్షుడు డొనాల్డ్ టస్క్, జర్మనీ చాన్స్లర్ ఎంజెలా మెర్కెల్ కొనియాడారు. మక్వీజ్కు నోబెల్ దక్కిన వార్త వెలువడిన వెంటనే ఆయన ఆసుపత్రి ప్రాంగణంలో సంబరాలు మిన్నంటాయి. మురాద్కు నోబెల్ బహుమతి రావడం.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడిన ఇరాక్ పౌరులందరికీ గర్వకారణమని ఆ దేశ అధ్యక్షుడు బర్హాం సలేహ్ అన్నారు. ఉగ్రవాదులకు ఇది చెంపపెట్టు అని, లైంగిక హింసకు గురైన బాధితుల పట్ల ఇరాక్ ప్రభుత్వం మరింత దృష్టిసారిస్తుందని ఆశిస్తున్నట్లు యాజిది ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు. మురాద్, మక్వీజ్లు కాకుండా ఈ అవార్డుకు అర్హులు మరొకరు లేరని ఐరాస మానవహక్కుల హైకమిషనర్ మిచెల్ బ్యాచ్లెట్ కితాబిచ్చారు. మరోవైపు, కాంగో ప్రభుత్వం మక్వీజ్ను అభినందిస్తూనే, ఆయన తన సేవలను రాజకీయం చేశారని విమర్శించింది. బాధితురాలే నాయకురాలై.. నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న ఇరాక్కు చెందిన యాజిదీ యువతి మురాద్ నదియా (25)ది పోరాట గాథ. 2014లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఉత్తర ఇరాక్లోని ఓ గ్రామంపై తెగబడ్డారు. మైనారిటీలైన కుర్దులుండే ఈ గ్రామంపై దాడిచేసి.. కనబడ్డ మగవారిని చంపేశారు. మహిళలు, చిన్నారులను ఎత్తుకెళ్లారు. వారిలో మురాద్ నదియా (25) ఒకరు. వీరిని తీసుకెళ్లిన ఐఎస్ ఉగ్రవాదులు మహిళలు, చిన్నారులని తేడా లేకుండా అందరిపై దారుణంగా, కిరాతకంగా వ్యవహరించారు. లైంగిక బానిసలుగా తమ వద్ద పెట్టుకుని దారుణమైన అకృత్యాలకు పాల్పడ్డారు. మూడు నెలలపాటు వీరి అరాచకాలను భరించిన నదియా.. అతికష్టం మీద తప్పించుకున్నారు. ఐసిస్ నుంచి తప్పించుకుని శరణార్థుల శిబిరానికి చేరుకున్న తర్వాత.. ఆమె జీవితంలో రెండో ఇన్నింగ్స్ మొదలైంది. తన లాగా మరెవరూ ఈ కిరాతక కూపంలో ఉండకూడదని నిశ్చయించుకున్నారామె. శిబిరంలో బ్రిటీష్ లాయర్, హక్కుల కార్యకర్త అమల్ క్లూనీ పరిచయం ఆమె ఆశయానికి మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. అదే.. యాజిదీలకు జరుగుతున్న అన్యాయం ప్రపంచానికి వివరించేలా చేసింది. ఐక్యరాజ్య సమితి వంటి వేదికలపై నదియా.. తన గళం విప్పే అవకాశాన్ని కల్పించింది. దీని ఫలితంగానే.. దాదాపు నాలుగున్నర లక్షల మంది బాధితులకు ఐసిస్ నరకకూపం నుంచి విముక్తి లభించింది. ‘ద లాస్ట్ గర్ల్’ తన తోటి యాజిదీలు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితుల గురించి ‘ద లాస్ట్ గర్ల్’ పేరుతో నదియా ఒక పుస్తకాన్ని రాశారు. 2017లో ఈ పుస్తకం ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి అమల్ క్లూనీ ముందుమాట రాసి మరోసారి నదియాకు మద్దతుగా నిలిచారు. ఇరాక్లో ఐసిస్ దురాగతాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రకటించడం నదియా పోరాట ఫలితమే. ‘నాకు అప్పుడు 21 ఏళ్లు. 2014, జూలైలో నన్ను ఐసిస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అడ్డొచ్చినందుకు అమ్మ, ఆరుగురు సోదరులను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత నాతో పాటు మేనకోడళ్లను కూడా లైంగిక బానిసలుగా మోసూల్ పట్టణంలో మాలాగే.. ఓ 30 మంది బాధితులు ఉన్న శిబిరంలో పడేశారు. రోజూ ఓ వంద మంది ఉగ్రవాదులు వచ్చేవారు. వారికి నచ్చిన వారిని ఎంపిక చేసుకుని రాక్షసానందం పొందేవారు. చిన్న పిల్లలైన నా మేనకోడళ్లపైనా ఆ దుర్మార్గులు కనికరం చూపలేదు. ఈ అకృత్యాలను తట్టుకోలేక ఓ రోజు వారికి ఎదురు తిరిగాను. దీంతో కోపోద్రిక్తుడైన ఐసిస్ నాయకుడొకడు నన్ను తీవ్రంగా హింసించాడు. మమ్మల్ని చంపేయని అడిగాను. కానీ వాడలా చేయలేదు. ఇలా హింసించడంలోనే ఆనందం ఉందన్నాడు. తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను’ అని ఐఎస్లో లైంగిక బందీగా ఉన్నప్పటి దారుణాలను నదియా వివరించారు. డాక్టర్ ‘మిరాకిల్’ మక్వీజ్ డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో.. రాజకీయ హింస, అధికార, ప్రభుత్వ వ్యతిరేక దళాల మధ్య అంతర్యుద్ధంతో రావణకాష్టంలా మారింది. దశాబ్దాలుగా ఇది కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం కారణంగా లెక్కలేనన్ని కుటుంబాలు అస్తిత్వాన్ని కోల్పోయాయి. ఇది చాలదన్నట్లు రెండు వర్గాలు మహిళలను తమ ఆయుధాలుగా వాడుకుంటున్నాయి. ఈ సంఘర్షణలో లెక్కలేనంత మంది మహిళలు లైంగిక హింసకు గురయ్యారు. అయితే.. లైంగిక హింస బాధితులను ఆదుకునేందుకు డాక్టర్ డెనిస్ మక్వీజ్ రెండు దశాబ్దాలుగా అలుపెరగని ప్రయత్నం చేస్తున్నారు. 1999లో దక్షిణ కివూలో పంజీ హాస్పిటల్ను స్థాపించి.. అత్యాచార బాధితులకు అండగా నిలిచారు. తన వద్దకు వచ్చే బాధితులను ఆదుకునేందుకు ఈ డాక్టర్ రోజుకు 18 గంటల పాటు పనిచేసిన సందర్భాలు లెక్కలేనన్ని. తిరుగుబాటుదారులు ఎంత క్రూరంగా అత్యాచారాలు చేసే వారంటే కొందరు మహిళలకు ఒకటి కంటే ఎక్కువసార్లు శస్త్రచికిత్సలు నిర్వహించాల్సి వచ్చేది. కాంగో మహిళలకు మక్వీజ్ అందిస్తున్న సేవల గురించి ‘ద గ్లోబ్ అండ్ మెయిల్’ పత్రిక ద్వారా ప్రపంచానికి తెలిసింది. అయితే.. తమ చేతుల్లో అత్యాచారానికి గురైన మహిళలకు డాక్టర్ అండగా నిలుస్తున్నాడనే కక్షతో ఉగ్రవాదులు ఆయన్ను హతమార్చడానికి ప్రయత్నించారు. 2012లో తన ఇంటిపై దాడి చేసినపుడు అక్కడి నుంచి తప్పించుకుని యూరోప్ వెళ్లారు. ఆయన లేని సమయంలో పంజీ ఆసుపత్రిలో శస్త్ర చికిత్సలు జరగక బాధిత మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆరునెలల తర్వాత తిరిగి వచ్చిన మక్వీజ్కు బుకావ్ విమానాశ్రయం 21 మైళ్ల దూరమున్న పంజీ ఆసుపత్రి వరకు ప్రజలు.. ముఖ్యంగా మహిళలు స్వాగతం పలికారు. యూరప్లో ఉన్న సమయంలోనే మక్వీజ్.. ఐరాస వేదికగా కాంగో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను ప్రపంచానికి వెల్లడించారు. ‘డాక్టర్ మిరాకిల్’గా సుపరిచితుడైన ఆయన.. మహిళలపై లైంగిక దాడిని ‘భారీ విధ్వంసక ఆయుధం’గా అభివర్ణించారు. శాంతి బహుమతి ప్రకటన జరిగినపుడు కూడా ఆయన తన విధుల్లోనే (శస్త్రచికిత్స నిర్వహిస్తున్నారు) ఉన్నారు. అయితే నోబెల్ శాంతి బహుమతికి డాక్టర్ మక్వీజ్ ఆరుసార్లు నామినేట్ కావడం విశేషం. -
మహిళా ఉద్యమ విజయం
ప్రభుత్వాలు మొండికేసినా, మతం మోకాలడ్డినా పట్టుదలతో పోరాడితే ఎలాంటి అమానవీయ మైన చట్టాలైనా తుత్తినియలవుతాయని నిరూపించిన ఐర్లాండ్ మహిళలకు జేజేలు. మత విశ్వాసా నికీ, వైద్యపరమైన అవసరానికీ పోటీ పెట్టి... గర్భస్థ శిశువుకుండే హక్కుల్ని మాత్రమే గుర్తించి గర్భిణుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న గర్భస్రావ నిషేధ చట్టం శుక్రవారం జరిగిన రిఫ రెండంలో పలాయనం చిత్తగించింది. 1983లో దేశ పౌరులంతా ఏమరుపాటుగా ఉన్నవేళ మత విశ్వాసాలది పైచేయిగా మారి అమల్లోకొచ్చిన చట్టాన్ని 67 శాతంమంది... అంటే మూడింట రెండొంతులమంది తిరస్క రించారని శనివారం వెల్లడైన రిఫరెండం ఫలితాలు చెబుతున్నాయి. ఆరేళ్లక్రితం కర్ణాటకకు చెందిన దంత వైద్యురాలు సవితా హాలప్పన్ కేవలం ఐర్లాండ్ వాసి కావడం వల్ల ఈ పాశవిక చట్టానికి బలై పోయారు. ఆనాటినుంచీ ఐర్లాండ్ మహిళలు ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. దృఢ సంకల్పంతో సాగిన ఆ ఉద్యమానికి జడిసి 2013లో అక్కడి ప్రభుత్వం ఆ చట్టానికి సవరణలు తెచ్చింది. గర్భిణి ప్రాణానికి ముప్పు ఏర్పడిందనుకున్నప్పుడు గర్భస్రావం చేయొచ్చునన్నది ఆ సవరణ సారాంశం. అయితే ఐర్లాండ్ మహిళలు దీంతో సంతృప్తి చెందలేదు. అసలు మహిళల పునరుత్పాదక హక్కుల విషయంలో అన్యాయంగా వ్యవహరించ డానికి ప్రభుత్వానికి హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇన్నేళ్లకు వారి ఉద్యమం ఫలించింది. డాక్టర్ సవిత ఉదంతం అత్యంత విషాదకరమైనది. అది ఎలాంటివారినైనా కంటతడి పెట్టిస్తుంది. స్వయంగా వైద్యురాలు అయినందువల్ల తన గర్భంలోని పిండం కదలికలపైనా, అది స్పందించే తీరుపైనా ఆమెకు అనుమానం వచ్చింది. తన శరీరంలో ఏదో జరుగుతున్నదని శంకిం చారు. ఆసుపత్రికెళ్లి వైద్యులను సంప్రదించారు. అన్ని పరీక్షలూ నిర్వహించి అది నిజమేనని వారు ధ్రువీకరించారు. గర్భస్థ శిశువు గుండె తప్ప మరేదీ పనిచేయడం లేదని తేల్చారు. అది కూడా ఏ దశలోనైనా నిలిచిపోవచ్చునని నిర్ధారించారు. కనుక గర్భస్రావం చేయడమొక్కటే మార్గమని సవిత దంపతులు వైద్యులను ప్రాథేయపడ్డారు. కానీ వారు చేతులెత్తేశారు. పిండం గుండె కొట్టుకుంటూ ఉన్నందువల్ల అమల్లో ఉన్న చట్టం ప్రకారం అబార్షన్ చేయడం నేరమవుతుందని తెగేసి చెప్పారు. కాసేపటికే ఆ గర్భస్థ శిశు పిండం సవిత పాలిట పెనుగండమైంది. మరణించిన పిండాన్ని సైతం అక్కడి చట్టం ప్రకారం పురుడు పోసి బయటకు తీయడానికి వైద్యులు ప్రయ త్నించారు. ఈ క్రమంలో ఆమెకు ఇన్ఫెక్షన్ సోకింది. సెప్టిసీమియా ఏర్పడింది. బాక్టీరియా వ్యాపించి శరీరంలో రక్తం కలుషితమైంది. శరీరంలో అవయవాలు ఒక్కొక్కటీ విఫలమవుతూ చివరికామె ప్రాణాలు కోల్పోయారు. ఏ మతమైనా మనుషుల్లో నైతికవర్తన పెంపొందించి సమాజం సామరస్యంగా మనుగడ సాగించడానికి తోడ్పడాలి. దానికి భిన్నంగా వక్రభాష్యాలు చెప్పి స్వప్రయోజనాలు నెరవేర్చుకునే శక్తులు బయల్దేరినప్పుడు సమాజం అల్లకల్లోలమవుతుంది. ప్రభుత్వాలే ఆ పాత్ర పోషిస్తే ఇక చెప్పనవసరమే లేదు. సవిత మరణానంతరం ఐర్లాండ్లో విస్తృతంగా సాగిన చర్చలో మెజారిటీ పౌరులు ఛాందసవాద ధోరణుల్ని తప్పుబట్టారు. పిండం తల్లి ప్రాణానికి గండంగా పరిణ మించినప్పుడు గర్భస్రావం చేయడమే సరైనదని క్యాథలిక్ మత విశ్వాసాలు బలంగా ఉన్నవారు సైతం వాదించారు. కానీ అక్కడి క్యాథలిక్ చర్చి చట్టం రద్దును తీవ్రంగా వ్యతిరేకించింది. అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో ఐర్లాండ్ వంటి ఛాందసవాద సమాజం మరెక్కడా కనబడదు. ఒకప్పుడు ప్రపంచానికి చవగ్గా శ్రామికుల్ని ‘ఎగుమతి’ చేసే దేశంగా పేరుబడ్డ ఐర్లాండ్లో ప్రస్తుతం గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ వంటి అగ్రశ్రేణి సంస్థలు కార్యకలాపాలు నిర్వహి స్తున్నాయి. ఆ సంస్థల్లో పనిచేసేందుకు ప్రపంచం నలుమూలలనుంచీ వేలాదిమంది అక్కడికి వలసపోతున్నారు. 2015లో ఆ దేశం తొలిసారి స్వలింగ సంపర్కుల మధ్య వివాహాన్ని చట్టబద్ధం చేసింది. 2017లో ఆ దేశ ప్రధానిగా ఎన్నికైన భారత సంతతి పౌరుడు లియో ఎరిక్ వరాద్కర్ స్వలింగ సంపర్కుడని తెలిసినా అక్కడి ప్రజలు అధికారం కట్టబెట్టారు. అలాంటిచోట మహిళకు కనీస మానవహక్కును నిరాకరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిని యువత అంతా వలసబాట పట్టిన 80వ దశకంలో క్యాథలిక్ చర్చి అభీష్టం మేరకు ఒక రిఫరెండం ద్వారా రాజ్యాంగానికి 8వ సవరణ వచ్చి చేరి గర్భస్రావాల నిషేధం అమల్లోకొచ్చింది. ‘తల్లితో సమానంగా పుట్టబోయే బిడ్డకు సైతం ప్రాణం నిలుపుకునే హక్కు ఉంటుంద’ని అది చెప్పింది. ‘సాధ్యమైనంతవరకూ’ ఆ హక్కును రక్షించాలని నిర్దేశించింది. ఇది కేవలం ఐర్లాండ్ పౌరులకేనా లేక విదేశీయులకు కూడానా అనే అంశంలో స్పష్టత లేదు. అందువల్లే డాక్టర్ సవిత ప్రాణాలు కోల్పోయారు. ఒక ఛాందసవాద సమాజంలో మహిళా ఉద్యమం పెను తుఫాను రేపింది. సకల సాధనా లనూ ఆ ఉద్యమం వినియోగించుకుంది. మహిళను వ్యక్తిగా గుర్తించ నిరాకరిస్తున్న చట్టాన్ని తుత్తి నియలు చేద్దాం రమ్మని పిలుపునిచ్చింది. దేశదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న ఐర్లాండ్ మహిళలు, వారికి మద్దతుగా యువత రిఫరెండం కోసం దండు కట్టారు. వారి రాకతో ఆ దేశంలోని అయిదు విమానాశ్రయాలు కిక్కిరిశాయి. కనుకనే ఊహించని ఫలితం వెలువడింది. అది పొరుగునున్న పలు దేశాల్లో ప్రకంపనలు సృష్టించబోతోంది. అసలు ఆ చట్టమే లేని దేశాల్లోనూ, ఉన్నా సవాలక్ష లోపాలతో అమలవుతున్న దేశాల్లోనూ ఐర్లాండ్ మహిళల విజయం స్ఫూర్తినిస్తుంది. బ్రిటన్లో ఉన్న అబార్షన్ చట్టాన్ని సవరించాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ఆ దేశంలో భాగమైన ఉత్తర ఐర్లాండ్లో ఆ చట్టమే వర్తించదు. ఇక మన దేశంలో అమలవుతున్న చట్టంలోనూ ఎన్నో లోపాలున్నాయి. ఇవన్నీ ఇప్పుడు బోనెక్కక తప్పదు. -
మహిళల హక్కుల రక్షణకే వృత్తి చేపట్టా..
నల్లగొండ లీగల్ : ‘మహిళా హక్కుల రక్షణకు ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకొచ్చాయి. వాటిని మహిళలకు తెలియజేసి, వారి హక్కులను కాపాడాలనే ఉద్దేశంతోనే న్యాయవాద వృత్తిని చేపట్టా’ అని చెబుతోంది.. నల్లగొండకు చెందిన న్యాయవాది జి.మనీషా. ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె ‘సాక్షి’ వెల్లడించారు. వివరాలు ఆమె మాటల్లోనే.. నేను బీ.ఫార్మసీ పూర్తి చేసిన అనంతరం న్యాయవాది కావాలని లక్ష్యంగా పెట్టుకున్నా. కార ణం మా నాన్న మాల కొండారెడ్డి కూడా న్యాయవాది కావడంతోనే ఈ వృత్తిపై ఆసక్తి పెరిగింది. 2011లో నెట్టెంపాడు ప్రాజెక్టులో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పనిచేస్తున్న (ప్రస్తుత నల్లగొండ జాÆ ‡ుుంట్ కలెక్టర్) సి.నారాయణరెడ్డితో వివాహం జరిగింది. నా భర్త ప్రోత్సాహంతో 2016లో లా డిగ్రీ పూర్తి చేశా. ప్రస్తుతం నల్లగొండ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నా. సత్వర న్యాయం సమన్యాయమే ధ్యేయంగా భారత న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది. మహిళను ప్రోత్సహిస్తే ఎంతో ఉన్నత స్థానాలకు ఎదగడానికి అవకాశం ఉంది. ప్రజలకు చట్టాలపై అవగాహ న తీసుకురావడానికి న్యాయవిజ్ఞాన శిబిరాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. భూ వివాదాలు పరిష్కారం కావడానికి కోర్టుల్లో ఎక్కువ సమయం పడుతుంది. పెరుగుతున్న కేసుల రద్దీకి అనుగుణంగా కోర్టుల సంఖ్యను పెంచాలి. కక్షిదారులకు సమ్మతి మేర కు లోక్ అదాలత్ల ద్వారా కేసులను పరిష్కరించడం జరుగుతుంది. ఇటీవల పెద్ద సంఖ్యలో మహిళలు న్యాయమూర్తులుగా, న్యాయవాదులుగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు న్యాయమందించడం సంతోషకరం. మహిళలు చట్టాలపై అవగాహన కలిగించాలి మహిళలు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలి. ప్రభుత్వాలు మహిళల రక్షణకు అనేక చట్టాలు రావడం జరిగింది. తమ హక్కులకు భంగం కలిగినప్పుడు ఈ చట్టాల ద్వారా న్యాయస్థానాలను ఆశ్రయించి సత్వర న్యాయం పొందవచ్చు. – దువ్య గీత, న్యాయవాది, నల్లగొండ లాయర్ కావాలనే.. పేదలు, మహిళలు, బాలల హక్కులను కాపాడానికే ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం వచ్చినా, వదులుకుని న్యాయ విద్యనభ్యసించి న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్నా. పట్టుదలతో చదివి న్యాయవాదిని అయ్యా. మహిళలకు న్యాయ సాయం అందించడంతో పాటు వారి హక్కులను తెలియపరుస్తున్నా. – మామిడి ప్రమీల, న్యాయవాది, నల్లగొండ బాల్యంలోనే అన్యాయంపై ప్రశ్నించేదాన్ని.. కోదాడఅర్బన్ : ఏ విషయంలో అన్యాయం జరిగిందని అనిపిస్తే దానిపై చిన్నతనంలోనే ప్రశ్నించేదానిని. బీఎస్సీ చదివిన నేను స్వతహాగానే న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించాలనుకున్నా. 1988–91 మధ్య కాలంలో గుంటూరులోరి ఆంధ్రా క్రిస్టియన్(ఏసీ) కాలేజీలో బీఎల్ కోర్సు పూర్తి చేశా. అనంతరం ఆరునెలలు హైదరాబాద్లో పనిచేశా. 1992 నుంచి నేటివరకు కోదాడ కోర్టులోనే ప్రాక్టీస్ చేస్తున్నా. మా కుటుంబంలో అందరూ విద్యావంతులే కావడంతో నేను న్యాయవాది వృత్తిలోకి ప్రవేశించడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ప్రస్తుత తరం అమ్మాయిలు ధైర్యంగా ఉండి, క్లిష్ట పరిస్థితులను ఎదిరించే విధంగా తయారుకావాలి. న్యాయవాద వృత్తిలో ప్రవేశిస్తే సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించవచ్చు. బాధితులకు అండగా నిలబడే అవకాశం ఉంటుంది. – శ్రీదేవి, న్యాయవాది, కోదాడ పెండింగ్ కేసులను పరిష్కరించాలి వివిధ కోర్టుల్లో పెండింగ్ కేసులను పరిష్కరించి సత్వర న్యాయం అందించేందుకు న్యాయ వ్యవస్థ కృషి చేయాలి. మహిళల హక్కుల రక్షణకు అనేక చట్టాలున్నా వాటి అమలులో లోపాల వల్ల నేటికి మహిళలు సకాలంలో న్యాయం పొందడం లేదు. చట్టాలను అమలు పర్చాల్సిన సంబంధిత అధికారుల నిర్లక్ష్యం మూలంగా మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. – ఎన్.సంధ్యారాణి, న్యాయవాది, నల్లగొండ న్యాయవ్యవస్థలో మహిళల పాత్ర పెరగాలి చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో న్యాయసేవాధికార సంస్థతో పాటు ప్రభుత్వ కృషి ఉండాలి. న్యాయవాదిగా పనిచేస్తూ మహిళల తరఫున నిలబడాలనే తపనతోనే ఈ వృత్తిని ఎంచుకున్నా. న్యాయవ్యవస్థలో మహిళల పాత్ర మరింతగా పెరగాల్సిన అవసరం ఉంది. – ఎం.ప్రగతి, న్యాయవాది, నల్లగొండ -
మహిళలు.. ఆ ఐదు విజయాలు
సాక్షి, వెబ్డెస్క్ : వైద్య, విద్యా రంగాల్లో మహిళలకు పురుషులతో సమాన హక్కులు లభిస్తున్నాయి. కానీ ఆర్థిక స్వాలంబన, రాజకీయ రంగంలో సమాన అవకాశాలు ఇప్పుడప్పుడే లభించేలా లేవు. ‘ఆటంకాలను అధిగమించి మహిళలు సాధికారత సాధించేందుకు ఇంకో వందేళ్లయినా పడుతుంద’ని ప్రపంచ ఆర్థిక సంస్థ సైతం పేర్కొంది. ఈ క్రమంలో మహిళా హక్కుల రక్షణ అంశంపై వాషింగ్టన్లో జరిగిన చరిత్రాత్మక సదస్సు ‘వుమెన్స్ మార్చ్’ .. అతివలకు సరికొత్త దిశానిర్దేశం చేసింది. సాధికారత సాధన కోసం ఆ సదస్సులో వ్యక్తమైన అభిప్రాయాలు కాలక్రమంలో చట్టాలుగా మారిన తీరు ఎంతైన అభినందనీయం. అలా 2018లో ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు లభించిన ఐదు ప్రధాన విజయాలను(హక్కులను) ఓసారి పరిశీలిస్తే.. ఐస్లాండ్లో సమాన వేతనం.. జాతి, మత, లింగ భేదాలు లేకుండా అందరికీ సమాన వేతనాలు కల్పించే చట్టాన్ని తెచ్చింది ఐస్లాండ్ ప్రభుత్వం. ఈ చట్టం ద్వారా మహిళలకు కూడా పురుషులతో సమాన వేతనాలు కల్పించాలి. దేశంలో గల 1200 కంపెనీలు ఈ చట్టాన్ని అమలు చేసి తీరాల్సిందే. పనిచేసే వారి సంఖ్య 25 మంది కంటే ఎక్కువ ఉన్న కంపెనీలు కచ్చితంగా తాము అనుసరిస్తున్న వేతన ప్రమాణాలను ప్రభుత్వానికి తెలియజేయాల్సిందే. ఏడాది మొదటి రోజు నుంచే ఈ చట్టం అమల్లోకి వచ్చింది. సౌదీలో మహిళలకు డ్రైవింగ్ అవకాశం కట్టుబాట్లకు మారుపేరైన సౌదీలో గత దశాబ్ద కాలంగా చెప్పుకోదగ్గ మార్పులు వస్తున్నాయి. సౌదీ స్టాక్ ఎక్ఛ్సేంజ్లో ఎగ్జిక్యూటివ్లుగా, షౌరా కౌన్సిల్( సౌదీ కన్సల్టేటివ్ అసెంబ్లీ) మెంబర్లుగా నియమితులవుతున్న మహిళలకు కొత్తగా డ్రైవింగ్ చేసే హక్కును కల్పించింది ఈ రాచరిక ప్రభుత్వం. గతేడాది సెప్టెంబర్లోనే ఈ హక్కు కల్పించినా జూన్ నుంచి అమల్లోకి రానుంది. కానీ ఇక్కడ కూడా మెలిక పెట్టింది. ఇస్లామిక్ చట్టాలకనుగుణంగానే డ్రైవ్ చేయాలి. ‘మీ టు’ ఉద్యమ వెల్లువ స్త్రీ కార్చే ఒక్క కన్నీటి చుక్క చాలు సామ్రాజ్యాలు కూలిపోవడానికి అని పురాణాలు చెబుతున్నాయి. కానీ నేటి ఆధునిక సమాజంలో నీటి చుక్క కార్చటం కాదు తమకు జరిగిన అన్యాయాన్ని నిర్భయంగా చెప్పటం ద్వారా ఎంతటివారినైనా నిగ్గదీయవచ్చని నిరూపించింది.. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మీ టూ ’ఉద్యమం. లైంగిక వేధింపులకు గురైన ఎంతో మంది ఆడవాళ్లు నిర్భయంగా వాటి గురించి చర్చించారు. చట్టానికెవరూ అతీతులు కాదు అని నిరూపించింది హాలీవుడ్ నిర్మాత హార్వీ విన్స్టన్ ఉదంతం. ‘మా శరీరం మాకే సొంతం.. ఎవరికీ అంటే ఇంకెవరికీ కాదు’ అనే నినాదంతో, #బ్యాలన్స్టాన్పోర్క్(ఔట్ యువర్ పిగ్) అనే హాష్ ట్యాగ్తో ట్వీట్ చేస్తున్నారు మహిళలు. బాలికా వధువులకు రక్షణ కల్పించిన భారత్.. సనాతన దేశంగా చెప్పుకునే భారత్లోనూ మహిళలు, ముఖ్యంగా బాలికల హక్కులపై న్యాయస్థానాలు గొప్పతీర్పులు ఇచ్చాయి. మైనర్ భార్యతో కాపురం చేయటాన్ని (ఆమె అనుమతి ఉన్నా లేకున్నా) రేప్గా పరిగణిస్తామంటూ గత అక్టోబర్లో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. దాని ప్రకారం నేరం నిరూపితమైతే పదేళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. రాజకీయాల్లో క్రియాశీలకంగా అమెరికా అతివలు.. అగ్రదేశ రాజకీయాల్లో మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2018 చివరినాటికి పదవులు చేపట్టే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ‘ద సెంటర్ ఫర్ అమెరికన్ వుమెన్ అండ్ పాలిటిక్స్’ తెలిపిన వివరాల ప్రకారం వచ్చే ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ నుంచి 49 మంది, రిపబ్లికన్ పార్టీ నుంచి 28 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉంది. రాజకీయాల్లో రాణిస్తోన్న అగ్రదేశ మహిళలు మిగతా ప్రపంచానికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. -
నిన్ను నువ్వు కనవే తల్లి
ఇవాళ దశమి. విజయదశమి. తొమ్మిది అవతారాలనూ సెలబ్రేట్ చేసుకునే రోజు. మరి.. సంతోషంగా, సంపూర్ణంగా, నిండుగా జీవించడానికి ఈ ప్రపంచంలో నేటి మహిళ ఏ అవతారం ఎత్తాలి?! అమ్మవారి తొమ్మిది అవతారాలనూ కలుపుకుని.. మహిళ... ఓ కొత్త శక్తిగా అవతరించాలి. తనలోంచి తనే జన్మించాలి! ఎప్పుడూ ఒకర్ని మోయడమేనా? ఎప్పుడూ ఒకర్ని కనడమేనా? నిన్ను నవ్వు కను తల్లీ. నీలోంచి నువ్వు అవతరించి అసమానతల్ని సంహరించు. శక్తి స్వరూపమై ప్రభవించు. అమ్మవారి తొమ్మిది అవతారాల్లా ఇవి.. ప్రతి స్త్రీకీ అవసరమైన తొమ్మిది హక్కులు. ఇంట్లో వాటిని సాధించుకుంటే.. ఇలలో తిరుగే ఉండదు. అడిగే హక్కు త్రిపుర ఒక్కటే ఇంట్లో ఆడపిల్ల. మిగతా ఇద్దరూ మగపిల్లలు. త్రిపుర అమ్మానాన్న చెప్పినట్లు వింటుంది. చెయ్యొద్దన్నవి చెయ్యకూడదనే అనుకుంటుంది. కానీ ఎంతైనా చిన్నపిల్ల. త్రిపురకు కూడా అన్నయ్యల్లా ఫ్రీ బర్డ్స్గా ఉండాలనిపిస్తుంది. అన్నయ్యల్లా ఇప్పుడు తనక్కూడా టూ వీలర్ నేర్చుకోవాలనిపిస్తోంది! ‘నీకెందుకమ్మా ఆడపిల్లవు?’ అనేసింది అమ్మ! నాన్నయితే.. ‘ఆడపిల్లలు బయట తిరక్కూడదు’ అని.. పుట్టినప్పట్నుంచీ అంటూనే ఉన్నాడు. త్రిపుర ఆలోచిస్తోంది. ఇంట్లో వాళ్ల ఇష్టం కోసం తన ఇష్టాలను చంపుకుంది. అన్నయ్యలు ఆడుకోడానికి వెళితే, తను వంటింట్లో అమ్మకు హెల్ప్ చెయ్యడానికి వెళ్లింది. అన్నయ్యలతో గొడవ పడినప్పుడు.. ‘మగపిల్లల్తో ఏమిటే.. కాస్త అణుకువగా ఉండు’ అనే మాటను కూడా తనే పడింది. అన్నయ్యల స్కూల్ బ్యాగును, అన్నయ్యల లంచ్ బాక్స్నూ తనే సర్దిపెట్టింది. ఇంట్లో తనొక ఆడపిల్లలా లేదు. ఇంకో ‘అమ్మ’లా ఉంది. ఇప్పుడు తను అమ్మాయిలా ఉండే హక్కును కోరుకుంటోంది. ఎలాగైనా నాన్నను ఒప్పించి వచ్చే బర్త్డేకి గిఫ్టుగా.. డ్రైవింగ్ నేర్చుకోడానికి నాన్న నుంచి లైసెన్స్ తెచ్చుకోవాలని నిశ్చయించుకుంది. నాన్న లైసెన్స్ ఇస్తే చాలు, డ్రైవింగ్ లైసెన్స్ తనకు చిటికెలో పని అని త్రిపురకు తెలుసు. కదిలే హక్కు లలితకు పెళ్లయి రెణ్ణెల్లే అయింది. నవదంపతులు నవ్వుతూ తుళ్లుతూ ఉన్నారు. ఊళ్లు, గుళ్లు తిరుగుతున్నారు. పుట్టింటి నుంచి, పుట్టిన ఊరి నుంచి లలిత బయటికి రావడం అదే మొదటిసారి. గడప దాటిన లలితకు ప్రతిదీ కొత్త ప్లేసే. అయినా బెరుకు లేదు. కంగారు లేదు. బిడియం లేదు. పక్కన భర్త ఉంటే చాలు.. అది తన బర్త్ ప్లేస్ అన్నంత స్వేచ్ఛగా ఉంటోంది లలిత. భర్త వెంట రోడ్డు మీద వెళుతుంటే స్వేచ్ఛ. భర్తతో కలిసి సినిమా చూస్తుంటే స్వేచ్ఛ. భర్త, తను రెస్టారెంట్కి ఎదురెదురుగా కూర్చొని భోజనం చేస్తుంటే స్వేచ్ఛ. భర్త స్నేహితులతో సరదాగా నవ్వుతూ మాట్లాడుతుంటే స్వేచ్ఛ. అన్నీ కొత్త ప్రదేశాలే, అందరూ కొత్త మనుషులే. ప్రతిచోటా కలిసిపోయింది. కానీ ఒకే ఒక కొత్త ప్రదేశంలో లలిత స్వేచ్ఛగా కలవలేకపోతోంది. స్వేచ్ఛగా కదల్లేకపోతోంది. అది.. ఆమె మెట్టినిల్లు! అత్త, మామ, మరిది, ఆడపడుచు.. అంతా అయినవాళ్లే. అయినా ఆమెకు కొత్త పోవడం లేదు. ఇంకా వింతేమిటంటే.. ఆ ఇంట్లో ఉన్నంతసేపూ భర్త కూడా తనకు కొత్త వ్యక్తిలా అనిపిస్తున్నాడు. లలిత ఆలోచించింది. అందరికీ అన్నీ అందించినంత మాత్రాన కొత్త పోదు. మెట్టినింటి అలవాట్లకు తనూ అలవాటు పడడం వల్ల కొత్త పోదు. కొత్త పోవడం అంటే తను తనలా ఉండడం. అందరికీ అన్నీ అందిస్తూనే, తనకూ కొన్ని అందివచ్చేలా చేసుకుంది. మొదట రెస్పెక్ట్ అందుకుంది. దాంతో పాటు వచ్చే ఫ్రీడమ్నూ అందుకుంది. ఎంపిక హక్కు గాయత్రికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ‘చూస్తున్నారు’ కాదు. వస్తున్నాయి. అందమైన పిల్ల. అణుకువ ఎలాగూ ఉంటుంది. మంచి ఉద్యోగం. మంచి కుటుంబం. మరి రాకుండా ఉంటాయా? ఆ వచ్చేవాళ్లు కూడా తక్కువేం కాదు. ఆస్తులు, అంతస్తులు ఉన్నవాళ్లు, ఎన్నారైలు, ఐఏఎస్లు. కట్నం వద్దన్నారు. బంగారం వద్దన్నారు. ఇవన్నీ కాదు. అబ్బాయి అందగాడు. సకల సుగుణాభిరాముడు. ఇంకేం కావాలి? గాయత్రి తల్లిదండ్రులు కూడా ఇంకేం అక్కర్లేదనుకున్నారు. ఆఖరికి తమ కూతురు మనసులో ఏముందో కూడా తెలుసుకోనక్కర్లేదనుకున్నారు. నిజానికి గాయత్రి మనసులో ఎవరూ లేరు. కానీ.. ఎప్పుడు చేసుకోవాలో, ఎలాంటి వారిని చేసుకోవాలో తనకో క్లారిటీ ఉంది. జీవితాంతం తను కలిసి నడవాలనుకుంటోంది తప్ప, ఏడడుగుల కోసం ఎవరినో ఒకర్ని కలుపుకుపోవాలని అనుకోవడం లేదు. ఆ సంగతే అమ్మకు, నాన్నకు చెప్పేసింది. నడిపే హక్కు లక్ష్మి ఉద్యోగం చేస్తోంది. నెలంతా కష్టపడుతుంది. నెలయ్యాక ఆ కష్టాన్నంతా భర్త చేతుల్లో పెడుతుంది! అసలు ఆమె పెట్టేలోపు అతడే లాగేసుకుంటాడు. లక్ష్మి పే స్లిప్పు, ఆమె చేతిలోని జీతం రెండూ చెక్ చేసుకుంటాడు. రెండు రూపాయలు తేడా వచ్చినా.. ఏం చేశావ్ అంటాడు! ఇంటి ఖర్చులకని లక్ష్మి జీతంలోంచే లక్ష్మికి కొంత తీసి ఇస్తాడు. ఇక నెలంతా ఆమె పడాల్సిందే. పాల బిల్లు. నువ్వే ఇవ్వు; పేపర్ బిల్లు. నువ్వే ఇవ్వు; వాటర్ బిల్లు. నువ్వే ఇవ్వు; పిల్లల ఫీజు. నువ్వే ఇవ్వు; అన్నిటికీ లక్ష్మీనే ఇవ్వాలి. లక్ష్మి భర్తకు ఎంత జీతం వస్తుందో లక్ష్మికి తెలియదు. ఇంటి ఖర్చులకు ఎందుకు డబ్బు ఇవ్వడో తెలీదు. అడగడానికైతే అడుగుతుంది. ‘‘ఉద్యోగం చేస్తున్నానని పొగరా! నీ ఒక్క సంపాదనతోనే ఇల్లు గడుస్తోందా?’’ అని రంకెలేస్తాడు. ఇంటి ఇన్స్టాల్మెంట్లన్నీ లక్ష్మి జీతం నుంచే. బ్యాంకు లోన్లన్నీ లక్ష్మి జీతం మీదే. చేతిలో రూపాయి మిగలదు. రవిక ముక్క కొనుక్కోవాలన్నా చెయ్యి చాచాలి. లక్ష్మి ఆలోచనలు చేతిలోంచి జారిపడిన కరెన్సీ కాగితాల్లో ఎగురుతున్నాయి. తను ఉద్యోగం చేస్తోంది. ఎప్పుడూ రూపాయి కోసం దేవులాటే. పక్కింట్లోని శారద ఏ ఉద్యోగమూ చేయడం లేదు. పైగా నెలాఖర్లో తనే వాళ్లకీ వీళ్లకు వందా రెండొందలు చేబదులు ఇస్తుంటుంది. సంపాదించడం ఆర్థిక స్వాతంత్య్రం కాదు. ఖర్చు పెట్టే వీలుండడం ఆర్థిక స్వాతంత్య్రం. తన జీతాన్ని తనే మేనేజ్ చెయ్యాలని లక్ష్మి గట్టిగా తీర్మానించుకుంది. భర్త వింటాడా? ఆమేమీ ‘ఇమ్మని’ అడగడం లేదు కదా. ‘ఇవ్వను’ అని మాత్రం చెప్పబోతోంది. వద్దనే హక్కు దుర్గకు ఒంట్లో బాగోలేదు. భర్త వచ్చేటప్పటికి నీరసంగా పడుకుని ఉంది. అతడి కోసం డైనింగ్ టేబుల్ మీద అన్ని సర్ది వచ్చే పడుకుంది. భర్త వచ్చాడు. ఆమె దగ్గరికి రాలేదు. స్నానం చేశాడు. భోజనం చేశాడు. తర్వాతే ఆమె దగ్గరకు వచ్చాడు. మరింత దగ్గరకి వచ్చాడు. ఒంట్లో బాగోలేదని చెప్పింది. టాబ్లెట్ వేసుకున్నాననీ చెప్పింది. ‘తగ్గుతుందిలే’ అని తనవైపుకు లాక్కోపోయాడు. ఆమెకు ఒళ్లు సహకరిస్తే కదా! ‘నా వల్ల కాదు’ అంది. మీద పడబోయాడు. దుర్గ ప్రతిఘటించింది. ఎక్కడి నుంచి వచ్చిందో అంత శక్తి! భర్తను గట్టిగా నెట్టేసింది. ‘‘నువ్వు భార్యవేనా?’’ అన్నాడు ఉక్రోషంగా. కాదు. ‘‘నా ఒంట్లో బాగోలేనప్పడే కాదు, నా మనసు బాగోలేనప్పడు కూడా నేను నీ భార్యను కాదు’’ అంది దుర్గ. ‘‘నువ్వు భర్తవి కావచ్చు. నేను భార్యను కావచ్చు. నా బాడీ అండ్ మైండ్ నాకు సహకరించకపోతే, నేనూ నీకు సహకరించలేను’’ అని గట్టిగా చెప్పేసింది దుర్గ. సహోద్యోగ హక్కు రాజేశ్వరి వర్కింగ్ ఉమన్. ఆఫీసులో చలాకీగా ఉంటుంది. చక్కగా పనిచేస్తుంది. కొలీగ్స్తో కలిసిపోతుంది. ఎవరైనా పర్సనల్ ప్రాబ్లం చెబితే వింటుంది. సొల్యూషన్ చెబుతుంది. వాళ్ల గురించి వీళ్లకు, వీళ్ల గురించి వాళ్లకూ చెప్పదు. అలాంటి మనిషిపైనా కూడా ఏవో విమర్శలు వచ్చాయి. లొడబుచ్చి అని, ఓవర్స్మార్ట్ అనీ, బాస్ ఈవిడ మాటే వింటాడనీ.. ఏవేవో కామెంట్స్. రాజేశ్వరి నొచ్చుకుంది. అలాగని తననేం మార్చుకోలేదు. ఆఫీస్లో తన బర్త్డేకి చిన్న పార్టీ ఇచ్చింది. అప్పుడే తన మనసులో మాట బయట పెట్టింది. జీతం కన్నా, ప్రమోషన్ల కన్నా.. కొలీగ్స్ ఒకరికొకరు ఇచ్చుకునే రెస్పెక్ట్ విలువైనది అని చెప్పింది. ఎవరి కుటుంబ సభ్యులు వారికి ఉన్నా, ఆఫీసు సభ్యులు కూడా తన అత్మీయ సభ్యులేనని చెప్పింది. చెప్పే హక్కు మహి! పేరుకే మహి. ఏమీ తెలీదు. ఎలా ఉండాలో తెలీదు. ఎలా ఉండకూడదో తెలీదు. పిల్లల్ని ఎలా పెంచాలో తెలీదు. ఎలా పెంచకూడదో తెలీదు. వట్టి దేభ్యం ముఖం. తెలివితక్కువ. పల్లెటూరి బైతు. నాజూగ్గా ఉండడం చేతకాదు. వంట చేస్తే రుచీపచీ ఉండదు. ఇంటి పనిలో శుచీ శుభ్రత ఉండదు.. ఇవన్నీ మహి గురించి మనం చెప్పుకుంటున్నవీ కాదు. ఆమె భర్తగారి స్టేట్మెంట్స్. పిల్లల ముందు, బంధువుల ముందు, స్నేహితుల ముందు, బయట అపరిచితుల ముందు ఆయనగారు మహికి ఇచ్చే సర్టిఫికెట్స్. మహికి గానీ, ఇంకో మహిళకు గానీ.. భర్త కంటే ఎక్కువ తెలియకపోయినా, భర్తకు సమానంగానైనా తెలియకపోతుందా. ఆ సంగతి గ్రహించలేని భర్తదా తెలియనితనం? భార్యదా ఆ మంచితనం. విశ్రాంతి హక్కు సరస్వతి ఉదయాన్నే లేచింది. ఇల్లూ వాకిలీ ఊడ్చింది. పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపింది. భర్త లేచేలోపు ఆయనకు కావలసినవన్నీ అమర్చింది. పిల్లలు స్కూల్కి వెళ్లిపోయాక, భర్త ఆఫీస్కి వెళ్లిపోయాక, అత్తమామలకు ఆ పూట సేవల ప్రేమానురాగాలను అందించాక సరస్వతికి కాస్త నడుము వాల్చాలనిపించింది. వాల్చబోతుండగా పిల్లలు వచ్చేశారు. పెద్దవాళ్లూ లేచారు. మళ్లీ తెల్లారినంత పనైంది. మళ్లీ టిఫిన్లు, మళ్లీ అన్నాలు, మళ్లీ పక్క సర్దుళ్లు. మళ్లీ అందరి నిద్రలు. పదకొండయింది. పన్నెండయింది. భర్తగారు ఉదయించారు. లేచి ఆయనకూ వడ్డించింది. చివరికి తను మిగిలింది. తనూ తిందామనుకుంది. ఓపిక లేక వాలిపోయింది. ఏ ఇంట్లో అయినా ఇల్లాలికి తినేందుకు ఇంత ముద్ద ఉంటుంది. కానీ తినే ఓపికే ఉండదు. ఆమెకు విశ్రాంతి అనే ముద్ద కావాలి. అది పెట్టేదెవరు? తీసుకోనిదే.. ఏ ఇల్లయినా ఇల్లాలికి విశ్రాంతిని ఇస్తుందా?! మాట్లాడే హక్కు పూర్ణ నోట్లోంచి మాట తొణకదు. నిండు కుండ! కానీ అది కన్నీటి కుండ. చిన్నప్పట్నుంచీ కళ్లలోనే దాచిపెట్టుకున్న నీళ్లు అవి. మాటలొచ్చీ మాట్లాడని అమ్మాయి ఊళ్లో ఎవరూ అంటే పూర్ణ. స్కూల్లో ఎవరూ అంటే పూర్ణ. కాలేజీలో ఎవరూ అంటే పూర్ణ. పెళ్లి చూపుల్లోనూ మాట్లాడలేదు. పెళ్లయ్యాకా మాట్లాడలేదు. ‘మాటలన్నీ మీవే.. మాట వినడమే నేను’ అన్నట్లు ఉండిపోయింది పూర్ణ. కాకి ఒక్కోరాయినీ కుండలో వేస్తే నీళ్లు పైకి వచ్చినట్లుగా.. పూర్ణ ఒక్కో మాటనూ మింగీ మింగీ కళ్లలోకి నీళ్లు తెచ్చేసుకుందా అన్నట్లు ఉంది ఇప్పుడు. ఆ నీళ్లన్నీ పొంగి పొర్లి, మనసు తేలికపడాలంటే పూర్ణ మాట్లాడాలి. పూర్ణ వయసు ఇప్పుడు 50 ఏళ్లు. చాన్స్ ఇస్తే ఇప్పుడు తనేం మాట్లాడుతుంది? ఏమైనా మాట్లాడనివ్వండి. కానీ చాన్స్ ఒకరు ఇవ్వడం కాదు. పూర్ణే తీసుకోవాలి. (ఫోటోలన్నీ ప్రతీకాత్మక చిత్రాలు) -
ట్రిపుల్ తలాక్పై సంచలన తీర్పు
-
విడాకులపై హైకోర్టు సంచలన తీర్పు
-
విడాకులపై సంచలన తీర్పు
ట్రిపుల్ తలాక్పై అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. రాజ్యాంగపరంగా ట్రిపుల్ తలాక్ ఆమోదయోగ్యం కాదని, దీన్ని ఎవరూ ఆచరించాల్సిన అవసరం లేదని తెలిపింది. రాజ్యాంగంలో ఉన్న హక్కులను హరించేలా పర్సనల్ లాబోర్డు ఏదీ ఉండకూడదని హైకోర్టు తెలిపింది. ట్రిపుల్ తలాక్ అనేది మహిళల హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని, దానికి చట్టబద్ధత లేదని చెప్పింది. రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కారని, అందువల్ల దీన్ని పాటించాల్సిన అవసరం లేదని తెలిపింది. చాలాకాలంగా ట్రిపుల్ తలాక్ విధానం మీద ఎడతెగని వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. మూడు సార్లు తలాక్ అని చెప్పడం ద్వారా భార్యకు విడాకులు ఇవ్వడం అనే ముస్లిం ఆచారం మీద పలు రకాల విమర్శలు, వివాదాలు ఉన్నాయి. కేవలం నోటిమాట ద్వారా విడాకులు ఇచ్చేస్తే మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పలువురు వాదిస్తున్నారు. అయితే, ఇది తమ మతపరమైన ఆచారాలకు సంబంధించిన విషయమని, ఇందులో వేలు పెట్టడం సరికాదని ముస్లిం మతపెద్దలు వాదిస్తున్నారు. ఎట్టకేలకు ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఒక స్పష్టత వచ్చినట్లయింది. అయితే దీన్ని మళ్లీ సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది. -
భర్తల లైంగిక దాడులు ఎన్ని రోజులు భరిస్తారు: కత్రినా
న్యూఢిల్లీ: తమపై జరుగుతున్న నేరాల విషయంలో మహిళలు ఏమాత్రం మౌనంపాటించరాదని, ఖచ్చితంగా తమ గొంతు విప్పాలని ప్రముఖ బాలీవుడ్ నటి కత్రానా కైఫ్ అన్నారు. ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం ఐఎంసీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సంయుక్తంగా నిర్వహించిన ‘వీ యునైట్’ అనే సదస్సులో ఆమె మహిళల ఔన్నత్యాన్ని గురించి, మహిళల ప్రాధాన్యత గురించి మాట్లాడారు. బ్రిటీషు పాలన కంటే ముందే భారత దేశంలో ఓ మహిళ దేశాధినేతగా కొనసాగిందని, అది అమెరికాలో ఇప్పటి వరకు సాధ్యం కాలేదన్నారు. మహిళలు మౌనంగా ఉంటే బలహీనులనుకునే వారి ఆలోచనలకు బలాన్ని చేకూర్చినట్లవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బలహీనులమని ఏ పరిస్థితుల్లో భావించకూడదని కత్రినా చెప్పారు. ముఖ్యంగా సమాజంలోకి కొన్ని కట్టుబాట్లు తమను వేలెత్తి చూపుతాయేమోనని భయపడుతూ తమ ఆందోళనను, ఆలోచనలను, తమపై జరుగుతున్న నేరాలను ముఖ్యంగా మారిటల్ రేప్స్ (ఇష్టం లేకపోయిన బలవంతంగా భర్త లైంగికదాడి చేయడంవంటివి)ను బయటకు చెప్పలేకపోతున్నారని, విద్యావంతులైన మహిళల పరిస్థితి కూడా ఇలాగే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మారిటల్ రేప్స్ను ఈ సమాజంలో ఎవరూ నేరంగా పరిగణించడంలేదని, ఇది దురదృష్టం అని వాపోయారు. అందుకే అలాంటివాటిని సహించకుండా ధైర్యంగా ప్రతి మహిళ తన గొంతు విప్పాలని ఆమె కోరారు. -
సంఘటిత చైతన్యంతోనే హక్కుల పరిరక్షణ
వనపర్తిటౌన్ : సంఘటితంగా చైతన్యమైతేనే మహిళల హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుందని ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ రమా మెల్కోటే అన్నారు. శని వారం వనపర్తిలోని వివేకానంద ఆడిటోరియంలో జనశ్రీ సంఘర్ష్ మహిళా వేదిక ఆ ధ్వర్యంలో ‘మహిళ లేని చరిత్ర లేదు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సభలో ఆమె మా ట్లాడారు. ప్రపంచ మహిళాదినోత్సవం కంటే ముందు.. తర్వాత చేసిన ప్రతి ఉద్యమంలో మహిళల పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు. వివక్షకు గురవుతున్న మహిళలే అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఉద్యమించాలని చెప్పారు. వ్యవస్థలో మార్పు కోసం మహిళలు నడుం కట్టాలన్నారు. సమరశీల మహిళా ఉద్యమాలతో పాటు దళిత బహుజన ఉద్యమాలను గుర్తించాలన్నారు. చట్టసభలోని అసెంబ్లీ, పార్లమెంట్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలు మూఢనమ్మకాల బారిన పడకుండా చైతన్యవంతులుగా ఎదగాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కొల్లాపురం విమల మాట్లాడుతూ మహిళ లేని చరిత్ర లేదని, తెలంగాణ ఉద్యమం వృత్తి పని చేసుకునే స్త్రీ ఐలమ్మ రూపంలో పురుడు పోసుకుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో మహిళల పాత్ర లేకుంటే తెలంగాణ వచ్చి ఉండేది కాదని చెప్పక తప్పదన్నారు. పాలమూరు జిల్లాలో 7వ శతాబ్దంలో తెలుగులో కథనా లు చేసిన చరిత్ర ఈ జిల్లా మహిళలకే ఉందన్నారు. నేటి తరం యువతీ యువకులు అధ్యయన కేంద్రాలుగా ఏర్పడి మహిళల సమస్యల పట్ల దృష్టి సారించాలని సూచిం చారు. కార్యక్రమంలో జనశ్రీ సంఘర్ష్ వేదిక ప్రతినిధులు కె.శారద, పుష్పలత, హసీనాబేగం, శోభారాణి, కౌన్సిలర్లు నందిమల్ల శారద, నారాయణదాస్ జ్యోతి, భువనేశ్వరి, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వరలక్ష్మి, కవయిత్రి మీనాకుమారి, ఎస్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రాధ, సరస్వతి, సుకన్య తదితరులు పాల్గొన్నారు. -
'మహిళలకు అన్యాయం జరగనివ్వొద్దు'
వనపర్తి (మహబూబ్నగర్) : పొట్ట చేతబట్టుకొని భర్తలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారి భార్యలకు అన్యాయం జరగనివ్వొద్దని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.కోదండరాం అభిప్రాయపడ్డారు. వారు వేరే ప్రాంతాలకు పోతే ఇంటి వద్ద ఉన్న మహిళలకు భద్రత కరువైందని ఆ అంశం గురించి ప్రభుత్వాలు, చదువుకున్నోళ్లు ఆలోచించాలని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ విద్యావంతుల వేదిక మహబూబ్నగర్ తూర్పు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం వనపర్తి పట్టణంలోని పాత మున్సిపల్ ఆవరణలో ఏర్పాటు చేసిన మహిళల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల సమస్యల అధ్యయనం గురించి అన్ని రంగాల్లో ఆలోచన చేయాల్సి ఉందన్నారు. 'ప్రతి ఒక్కరు చదువుకోవాలని, చదువుకునోళ్లకే సమస్యలకు కారణాలు తెలుస్తాయని ఎప్పుడు జయశంకర్ సార్ చెబుతుండే వారని' కోదండరాం పేర్కొన్నారు. పొదుపు సంఘాలతో మహిళలు ఇంటి నుంచి బయటకు రావడం ప్రారంభం అయ్యిందని, సకలజనుల సమ్మెతో మహిళలు చైతన్యవంతమైన పాత్ర పోషించడం మరింత పెరిగిందని, అయినా ఆశించిన రీతిలో వారి ప్రగతి కనబడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రతి నియోజకవర్గం స్థాయి నుంచి మహిళల సమస్యలను అధ్యయనం చేసి, జిల్లా, రాష్ట్ర స్థాయిలో వాటి పరిష్కారానికి కార్యచరణ మొదలు పెట్టేందుకు ముందుకు కదులుతున్నట్లు వివరించారు. మహిళలు తెలంగాణ ఉద్యమంలో ముందున్నట్లే అభివృద్దిలోనూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. -
అగ్రరాజ్యాల్లోనూ ఇంతింతే..
మహిళల హక్కులపై నిరంతరం నీతిచంద్రికలు వల్లించే అగ్రరాజ్యాల చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం నామమాత్రమే. ‘ఆకాశంలో సగం’ అంటూ మాటలతోనే మహిళలను ఆకాశానికెత్తిన మావో పుట్టిన దేశంలోనూ చట్టసభల్లో మహిళలకు దక్కుతున్న చోటు అంతంత మాత్రమే. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశంతో రూపొందించిన మహిళా రిజర్వేషన్ బిల్లు కు మోక్షం దక్కే ముహూర్తం ఇంకా ఆసన్నం కాకపోవడంతో భారత్లోనూ అదే పరిస్థితి. వివిధ దేశాల్లోని చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు - ఎలక్షన్ సెల్ * ప్రస్తుత పార్లమెంటులో మహిళలకు 11 శాతమే ప్రాతినిధ్యం గల భారత్ ఐపీయూ జాబితాలో 108వ స్థానంలో ఉంది. * పొరుగునే ఉన్న పలు దేశాలు చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడంలో మన కంటే ముందున్నాయి. మహిళలకు 27.7 శాతం ప్రాతినిధ్యం కల్పిస్తూ అఫ్గానిస్థాన్ 37వ స్థానంలో, 20.7 శాతం ప్రాతినిధ్యంతో పాకిస్థాన్ 66వ స్థానంలో, 19.7 శాతం ప్రాతినిధ్యంతో బంగ్లాదేశ్ 71వ స్థానంలో ఉన్నాయి. * చైనా చట్టసభలో మహిళలకు 23.4 శాతం ప్రాతినిధ్యమే లభిస్తోంది. ఐపీయూ జాబితాలో చైనా 56వ స్థానంలో నిలుస్తోంది. * ప్రపంచంలో సుమారు పాతిక దేశాల్లో మాత్రమే చట్టసభల్లో మహిళలకు కనీసం మూడోవంతు ప్రాతినిధ్యం లభిస్తోంది. * ప్రపంచంలోని ఎనిమిది దేశాల్లో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం మచ్చుకైనా లేదు. పెద్దన్న.. చిన్న బుద్ధి పేరుకు అగ్రరాజ్యమే కానీ.. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడంలో మాత్రం అమెరికా వెనకబడే ఉంది. అమెరికా ప్రతినిధుల సభలో మహిళల ప్రాతినిధ్యం 17.8 శాతం మాత్రమే. ఐపీయూ జాబితాలో ఈ దేశం 80వ స్థానంలో ఉంది. -
స్త్రీలకు అన్ని రంగాల్లో సమాన భాగస్వామ్యం
హైదరాబాద్, న్యూస్లైన్: మహిళలకు రాజకీయ, ఆర్థిక రంగాల్లో సమాన భాగస్వామ్యం కల్పించాలని ప్రొఫెసర్ రమా మెల్కొటె పేర్కొన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) రాష్ట్ర మహాసభలు పురస్కరించుకొని శనివారం ఇందిరాపార్కు ధర్నా చౌక్లో బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా మెల్కొటె మాట్లాడుతూ.. రాజ్యాంగపరంగా మహిళలకు దక్కాల్సిన హక్కులకు దేశంలో ఎన్నో అడ్డంకులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య మాట్లాడుతూ.. స్త్రీల హక్కులను సమాజం గుర్తించాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించకుండా పాలకులు తొక్కిపెడుతున్నారని ఆరోపించారు. ఇందిరాగాంధీ 18 ఏళ్లు ప్రధానిగా ఉన్నా.. మహిళల కోసం ఒక్క చట్టం కూడా చేయలేదని విమర్శించారు. మహిళలను దేవతలుగా కాకుండా మనుషులుగా గుర్తించాలన్నారు. మహిళలపై హింస, వేధింపులను నివారించేందుకు ఎమర్జెన్సీ సర్వీసు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సభలో విప్లవ రచయిత్రి విమల, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర నాయకురాలు పి. టాన్యా, పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. విష్ణు తదితరులు పాల్గొన్నారు.