
మహేశ్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని మూడో పాటని సోమవారం సాయంత్రం విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలోని 5 పాటలను వారానికి ఒకటి చొప్పున 5 సోమవారాలు రిలీజ్ చేస్తామని ప్రకటించిన చిత్ర యూనిట్.. గత రెండు సోమవారాలు రెండు పాటలను విడుదల చేసింది. ఇప్పుడు అదే బాటలో మళ్ళీ ఈ సోమవారం (డిసెంబర్ 16) మరో పాటను ప్రేక్షకుల ముందుంచారు. ‘హి ఈజ్ సో క్యూట్..’ అంటూ సాగిపోతున్న ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా, మధుప్రియ ఆలపించింది. మహేష్ బాబు అందాన్ని పొగుడుతూ సాగుతున్న ఈ పాట ‘ప్రిన్స్’ ఫ్యాన్స్లో జోష్ను నింపుతోంది. మహేష్ను ఆటపట్టిస్తూ రష్మిక వేస్తున్న స్టెప్పులు అదుర్స్ అనిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకి తోడు ఈ సాంగ్ కూడా సినిమాపై హైప్ క్రియేట్ చేసింది.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిత్రంలో రష్మిక మండన్నకథానాయికగా నటించగా, లేడీ సూపర్స్టార్ విజయశాంతి, ప్రకాష్ రాజ్,రాజేంద్ర ప్రసాద్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. దేవీ శ్రీ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది.