
తమిళసినిమా: నాకా అర్హత లేదు అంటోంది నటి శ్రియ. నటిగా దశాబ్దాన్ని పూర్తి చేసుకున్న తారల్లో శ్రియ ఒకరు. ఇష్టం అంటూ టాలీవుడ్కు, ఉనక్కు 18 ఎనక్కు 20 చిత్రంతో కోలీవుడ్కు పరిచయం అయిన ఈ ఉత్తరాది బ్యూటీ ఈ రెండు భాషల్లోనూ కథానాయకిగా మంచి పేరునే తెచ్చుకుంది. ఇటీవలే ప్రేమించిన ప్రియుడిని అత్యంత రహస్యంగా పెళ్లి చేసుకున్న ఈ అమ్మడికి చిత్రాలు తగ్గుముఖం పట్టాయనే చెప్పాలి. ముఖ్యంగా కోలీవుడ్లో నరకాసురన్ అనే ఒక్క చిత్రం మినహా మరో అవకాశం లేదు. అరవిందస్వామి హీరోగా నటిస్తున్న చిత్రంలో శ్రియ ప్రతినాయకి ఛాయలున్న పాత్రలో నటించినట్లు సమాచారం. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఇటీవల శ్రియ పత్రికల వారితో ముచ్చటించింది.
అవేమిటో చూద్దాం. చాలా గ్యాప్ తరువాత నరకాసురన్ చిత్రంలో తమిళ ప్రేక్షకుల ముందుకు రానుండటం సంతోషంగా ఉంది. నేనిప్పటి వరకూ నటించిన చిత్రాలన్నింటి కంటే నా మనసుకు నచ్చిన చిత్రం శివాజీ. అందులో రజనీకాంత్ సరసన నటించడం నా భ్యాగం. రజనీకాంత్తో నటిస్తానని కలలో కూడా ఊహించలేదు. చిన్న వారి నుంచి పెద్ద వారి వరకూ సమానంగా చూసే మానవత్వం కలిగిన వ్యక్తి ఆయన. రజనీకాంత్ వంటి నటుడిని నా జీవితంలో చూడలేదు. శివాజీ చిత్ర షూటింగ్ సమయంలో ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ఇకపోతే సినిమారంగంలో అగ్రతారలుగా రాణించిన విజయశాంతి, జయప్రద లాంటి వారు ఆ తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. మీకూ అలాంటి ఆలోచన ఉందా? అని అడుగుతున్నారు. అయితే నేను రాజకీయాలకు అస్సలు పనికి రాను. రాజకీయాల్లోకి రావాలంటే చాలా తెలిసుండాలి. నాకు రాజకీయాల గురించి అస్సలు తెలియదు.కాబట్టి నాకు రాజకీయ అర్హత లేదు. అయితే నాకు డాన్స్ అంటే ఆసక్తి. దానికి సంబంధించిన చిత్రాల్లో నటించాలని ఆశ పడుతున్నాను. అలాంటి చిత్రాల అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను అని శ్రియ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment