16 ఏళ్ల బాలుడిపై 15 మంది అత్యాచారం..
16 ఏళ్ల బాలుడిపై ఏడాదిగా బ్లాక్ మెయిల్ చేస్తూ 15 మంది అత్యాచారానికి పాల్పడ్డారు.
ముంబై: దిగ్బ్రాంతికి గురయ్యే సంఘటన ముంబైలో వెలుగు చూసింది. డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంధేరీలో నివసించే ఓ 16 ఏళ్ల బాలుడిపై ఏడాదిగా బ్లాక్ మెయిల్ చేస్తూ 15 మంది తోటి బాలురే అత్యాచారానికి పాల్పడ్డారు. బాలుడు తీవ్ర నొప్పితో బాధపడుతూ ఈ విషయాన్ని స్నేహితుడికి తెలిపి సోమవారం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలుడికి వైద్య పరీక్షలు జరిపించగా అత్యాచారం జరిగిందని రుజువైంది.
వారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే తీవ్రంగా కొట్టెవారని బాలుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అసహజ సిద్దమైన లైంగిక చర్యకు పాల్పడిన 15 మంది బాలురపై పోలీసులు ఐపీసీ పిల్లల సంరక్షణ చట్టం కింద పలు కేసులు నమోదు చేశారు. వీరంతా 15 నుంచి 17 ఏళ్ల వయసు వారేనని పోలీసులు పేర్కొన్నారు. నిందితుల్లో 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎన్ నగర్ పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం మేరకు 2016లో బాలుడి ఇంటి పక్కనే ఉండే మరో బాలుడు అత్యాచారం జరుపుతూ వీడియో తీశాడు. అనంతరం ఈ వీడియోను అతని స్నేహితులకు షేర్ చేశాడు. ఆ వీడియోను చూపి బ్లాక్మెయిల్ చేస్తూ తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేయడం ప్రారంభించాడు. బాలుడిని నిర్మానుష్య స్థలానికి తీసుకెళ్లి ఒకరి తరువాత ఒకరు అత్యాచారం జరిపేవారు. నిందితుల్లో ఒకరు బాలుడిని రెస్టారెంట్ వెళ్లి తినడానికి డబ్బులు ఇవ్వాలని బెదిరించగా బాధితుడు నిరాకరించాడు. దీంతో నిందితులు జూన్ 26 మరో సారి అత్యాచారం జరిపారు. తీవ్ర భయాందోళనకు గురైన బాధితుడు ఈ విషయాన్ని తల్లితండ్రులకు చెప్పలేకపోయినట్లు తెలుస్తోంది.