
జైపూర్: చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తూ ప్రజల్ని గజగజవణికిస్తోంది. ఈ వ్యాధికి సంబంధించి భారత్లో ఇప్పటిదాకా ఐదు కరోనా కేసులు నమోదు కాగా.. తాజాగా రాజస్థాన్లోని జైపూర్లో మరో కేసు నమోదైంది. ఇటలీకి చెందిన పర్యాటకుడు భారత్ పర్యటనకు రాగా జైపూర్లో పర్యటిస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అతడిని ఆసుపత్రిలో చేర్పించి కరోనా వైద్య పరీక్షలు చేయగా తొలుత నెగిటివ్ వచ్చింది. దీంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: కరోనాతో మరో వైద్యుడు మృతి
అయితే అతని ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో మరోసారి వైద్యపరీక్షలు నిర్వహించారు. అతని రక్తనమూనాలను పుణేలో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ విభాగానికి పంపించారు. పరీక్ష చేసిన నిపుణులు అతనికి కరోనా సోకినట్టు నిర్ధారించారు. దీంతో దేశంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య ఆరుకి చేరింది. ఢిల్లీలో ఒకరికి, హైదరాబాద్ లో మరొకరికి కరోనా సోకినట్టు సోమవారం కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 90వేల మంది కరోనా వైరస్ బారిన పడగా.. 3వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. చదవండి: 'కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధం'