
విద్యార్థుల ఆత్మహత్యలు (ఫైల్ ఫోటో)
చదువు ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని తాజా రిపోర్టులు సైతం హెచ్చరిస్తున్నాయి. తాజాగా విడుదలైన ఓ రిపోర్టులో 2007 నుంచి 2016 మధ్యకాలంలో దేశంలో దాదాపు 75వేల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడైంది. 2016లోనే దాదాపు 9,474 మంది విద్యార్థులను తమ ప్రాణాలను తీసుకున్నారని, అంటే రోజుకు 26 మంది చనిపోయినట్టు హోం వ్యవహారాల సహాయమంత్రి హెచ్జీ అహిర్ చెప్పారు.
విద్యార్థుల ఆత్మహత్యలు దేశంలో 52 శాతం మేర పెరిగాయని, 2007లో రోజుకు 17 మంది తమ ప్రాణాలను హరింప చేసుకుంటే, 2016కి వచ్చేసరికి రోజుకు 26 మంది చనిపోయినట్టు తెలిసింది. 2016లో 1,350 మంది విద్యార్థుల ఆత్మహత్యలతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా.. దాని తర్వాత పశ్చిమబెంగాల్, తమిళనాడులు ఉన్నాయని రిపోర్టు పేర్కొంది. పరీక్షల్లో ఫెయిల్ కావడం వల్లనే 2016లో 2,413 మంది విద్యార్థులు చనిపోయారని రిపోర్టులో వెల్లడైంది. ఇదే కారణంతో 2007 నుంచి 2016 మధ్యకాలంలో 23వేల మంది విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకున్నట్టు తెలిసింది. యువత ఎక్కువగా ఆత్మహత్య చేసుకుంటున్న దేశాల్లో భారత్ కూడా ఒకటిగా ఉందని లాన్సెట్ రిపోర్టు 2012లోనే హెచ్చరించింది. వీరిలో 15 నుంచి 29 వయసు కలవారు ఎక్కువగా చనిపోతున్నట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment