
అసాధ్యం సుసాధ్యమైంది: మోదీ
బెంగళూరు: ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) అంగారక కక్ష్యలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించడంతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విజయాన్ని పలు విధాల కీర్తించారు. అవరోధాలను అధిగమించి.. దాదాపు అసాధ్యమనుకున్న దానిని భారతదేశం సుసాధ్యం చేసిందన్నారు. ‘‘ఎన్నో ప్రతికూలాంశాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 51 ప్రయోగాలు జరిగితే కేవలం 21 మాత్రమే విజయం సాధించాయి. మనం తొలి ప్రయత్నంలోనే విజయం సాధించాం’’ అని మంగళయాన్ (మామ్) విజయం సాధించిన సందర్భంగా ఇక్కడి ఇస్రో కమాండ్ కేంద్రంలో మాట్లాడుతూ మోదీ చెప్పారు. ఈ రోజు మామ్ మంగళ్ (అంగారక) గ్రహాన్ని కలుసుకుందని, ఈ రోజు మంగళ్ మామ్ను పొందిందని మోదీ చమత్కరించారు.
మిషన్కు మామ్ అనే పేరు ఖరారు చేసినపుడే.. ఆ మామ్ మనల్ని నిరాశ పరచదని తాను భావించానన్నారు. అరుణ గ్రహం కక్ష్యలోకి మామ్ చేరే చివరి క్షణాల్ని శాస్త్రవేత్తలతో కలసి ఉత్కంఠగా చూసిన మోదీ.. అది కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత ఇస్రో చైర్మన్ కె. రాధాకృష్ణన్ భుజం తడుతూ అభినందించారు. ‘‘భారతదేశం విజయవంతంగా అంగారక గ్రహాన్ని చేరుకుంది. మీకు, దేశ ప్రజలకు అభినందనలు. ఈ రోజు చరిత్ర సృష్టించాం. కొద్ది మందికే తెలిసిన దారిలో 65 కోట్ల కిలోమీటర్ల దూరం మన వ్యోమనౌకను పూర్తి కచ్చితత్వంతో నడిపాం’’ అని మోదీ వ్యాఖ్యానించారు. అరుణ గ్రహాన్ని చేరుకున్న మరో మూడు ఏజెన్సీల సరసన భారత్ నిలిచిందన్నారు. మాజీ ప్రధాని వాజ్పేయి విజన్ చంద్రుడిపై కాలుపెట్టడానికి స్ఫూర్తినిచ్చిందని, చంద్రయాన్ విజయం మామ్ రూపకల్పనకు దోహద పడిందని పేర్కొన్నారు. చివరగా రవీంద్రనాథ్ ఠాగూర్.. ఎక్కడైతే నీ మనస్సు ఎప్పు డూ విసృ్తతం కాని ఆలోచనలు, చర్యలవైపు నిన్ను నడుపుతుందో.. అది స్వేచ్ఛా స్వర్గంలోకి.. మై ఫాదర్, నా దేశాన్ని జాగృతం కానీయి.. పద్యపాదం ఉదహరిస్తూ ప్రసంగం ముగించారు.
విజయంపై ఎవరేమన్నారంటే...
►మంగళ్యాన్ విజయంతో చరిత్రాత్మక విజయం సాధించిన ఇస్రోకు అభినందనలు. ఈ విజయం దేశానికే గర్వకారణం
- రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
► ఘన విజయం సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలకు యావత్తు దేశంతో కలసి సెల్యూట్ చేస్తున్నాను - ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ
► ఈ విజయం ఉదయిస్తున్న భారత్కు గుర్తు. ఇస్రో కృషి, అంకితభావానికి అభినందనలు. - కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు
► మామ్ విజయం ఇస్రో శాస్త్రవేత్తలు దశాబ్దంపాటు చేసిన కృషికి దక్కిన ఫలితం. దీని వెనక కృషిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు.
- మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
► తొలి ప్రయత్నంలోనే అంగారకుడిని అందుకున్న ఏకైక దేశంగా అవతరించి భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. రోదసిలో ఇదో మహాద్భుత ఘట్టం. భారత అంతరిక్ష రంగంలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. దేశానికి ఇంతటి అరుదైన ఘనవిజయాన్ని కట్టబెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలకు హృదయపూర్వక అభినందనలు.
- వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి
► మామ్ ప్రయోగం విజయవంతం కావడం గర్వకారణం. ప్రయోగం విజయవంతం కావడానికి కృషిచేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు.
- ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
► అంగారక యాత్ర విజయంతో అంతరిక్ష యానంలో అత్యున్నత విజయాలు సాధించిన దేశాల గ్రూపులో చేరినందుకు భారత్కు అభినందనలు.
- అమెరికా
► బాలీవుడ్ అభినందనలు: భారత అంగారక యాత్ర విజయంపై బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, లతా మంగేష్కర్, శ్రీదేవి, సునిధి చౌహాన్, షాహిద్ కపూర్, అభిషేక్ కపూర్, తదితరులు కూడా ట్విట్టర్ ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
నమస్తే ఇస్రో... థాంక్యూ మావెన్
మావెన్, మామ్ ఉపగ్రహాలను అంగారకుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, ఇస్రోలు బుధవారం పరస్పరం ట్విట్టర్ ద్వారా అభినందనలు చెప్పుకొన్నాయి. రెండు రోజుల క్రితమే మావెన్ను మార్స్కు పంపిన నాసా మావెన్ టీం.. చరిత్రాత్మక విజయంపై ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపింది. దీనికి ప్రతిగా ‘థాంక్యూ మావెన్ టీం’ అంటూ ఇస్రో బదులు తెలిపింది. అలాగే నాసా క్యూరియాసిటీ బృందం కూడా ఇస్రోకు ట్విట్టర్ ద్వారా ‘నమస్తే’ చెబుతూ శుభాభినందనలు తెలిపింది. కాగా, భారత అంగారక యాత్ర విజయవంతం కావడంతో బుధవారం సోషల్ మీడియాలో శుభాకాంక్షలు, అభినందనలు, సందేశాలు వెల్లువెత్తాయి. ఇస్రో, మామ్ ఫేస్బుక్ పేజీల్లో పది లక్షల మంది సందర్శించగా.. తొలి రెండు గంటల్లోనే 1,47,000 లైక్లు, కామెంట్లు, షేర్లు వచ్చాయి. మామ్ ట్విట్టర్ ఖాతాకు సైతం గంటల్లోనే 55 వేల మంది ఫాలోవర్లు ఏర్పడ్డారు.
విజయ సారథులు వీరే..
సూళ్లూరుపేట: సతీష్ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగించిన మామ్ ఉపగ్రహం విజయంలో ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్కు 9 మంది శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషించారు.
కున్షికృష్ణన్, మిషన్ డెరైక్టర్
పీఎస్ఎల్వీ సీ25కు మిషన్ డెరైక్టర్గా వ్యవహరించారు. ఈయన ఆధ్వర్యంలో రాకెట్ అనుసంధానం పనులు జరిగాయి.
ఎం.చంద్రదత్తన్, ఎల్పీఎస్సీ డెరైక్టర్
రాకెట్ ప్రయోగంలో రెండు, నాలుగోదశలోని ఘన ఇంధనం దశలు లిక్విడ్ ప్రపొల్లెంట్ స్పేస్ సెంటర్ డెరైక్టర్ ఆధ్వర్యంలోనే జరిగాయి. తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఎల్పీఎస్సీలో ఈ రెండు దశలను తయారు చేశారు.
ఎస్ రామకృష్ణన్, వీఎస్ఎస్సీ డెరైక్టర్
పీఎస్ఎల్వీకి ఉపయోగించే రెండో దశ నుంచి నాల్గో దశదాకా ఉపయోగించిన రాకెట్ పరికరాలు త్రివేండ్రంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఈయన ఆధ్వర్యంలో జరిగాయి.
డాక్టర్ శివకుమార్, శాటిలైట్ డెరైక్టర్
బెంగళూరులోని ఐజాక్ సెంటర్ లో మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహాన్ని ఈయన ఆధ్వర్యంలో తయారు చేశారు. బెంగళూరులో ఈయన ఆధ్వర్యంలోనే మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహాన్ని రూపొందించారు.
ఏఎస్ కిరణ్కుమార్, స్పేస్ అప్లికేషన్ సెంటర్ డెరైక్టర్
ఈయన స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్కు డెరైక్టర్గా వ్యవహరిస్తూ ఈ ప్రయోగంలో కూడా కీలక పాత్ర పోషించారు. రాకెట్ డిజైనింగ్, శాటిలైట్ డిజైనింగ్ ప్రక్రియ ఈయన ఆధ్వర్యంలోనే జరిగింది.
వీకే దడ్వాల్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ డెరైక్టర్
హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ డెరైక్టర్గా ఉంటూ ఈ ప్రయోగంలో ఉపగ్రహం తయారీలో పాలుపంచుకున్నారు.
అరుణన్, శాటిలైట్ ప్రాజెక్ట్ డెరైక్టర్
మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రాజెక్టుకు డెరైక్టర్గా వ్యవహరించారు. ఈయన ఆధ్వర్యంలోనే ఉపగ్రహాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించి రాకెట్కు అనుసంధానం చేశారు.
డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్
దేశంలో ఇస్రోకు చెందిన పలు కేంద్రాల్లో తయారు చేసిన అన్ని పరికరాలను షార్కు చేర్చి రాకెట్ అనుసంధానం ప్రక్రియ పనులు ఈయన ఆధ్వర్యంలోనే జరిగాయి.
వీ శేషగిరిరావు, రేంజ్ ఆపరేషన్ డెరైక్టర్
రాకెట్ గమనాన్ని సూచించే రేంజ్ అపరేషన్ను డెరైక్ట్ చేసింది ఈయన ఆధ్వర్యంలోనే.
ఎస్వీ సుబ్బారావు, డిప్యూటీ డెరైక్టర్
షార్లోని మొదటి ప్రయోగవేదికపై రాకెట్ అనుసంధానం పనులు ఈయన పర్యవేక్షణలో జరిగాయి.
మామ్ శాస్త్రీయ పరికరాలివే...
మీథేన్ సెన్సర్: మార్స్ వాతావరణంలో మీథేన్ వాయువుని అత్యంత సూక్ష్మస్థాయిలో ఉన్నా పసిగడుతుంది. ఒకవేళ మీథేన్ ఉంటే.. అది రసాయన ప్రక్రియల వల్ల పుట్టిందా? లేక జీవరాశి జీవక్రియల వల్ల పుట్టిందా? అన్నదీ తేలుతుంది.
లైమన్ ఆల్ఫా ఫొటోమీటర్: మార్స్ వాతావరణంలో డ్యుటీరియం, హైడ్రోజన్ల శాతాన్ని అంచనా వేస్తుంది. దీని వల్ల అక్కడ నీరు ఎలా నాశనమైందో తెలుస్తుంది.మార్స్ ఎక్సోస్ఫెరిక్ న్యూట్రల్ కాంపొజిషన్ అనలైజర్: మార్స్ వాతావరణంలో తటస్థ మూలకాల సమ్మేళనాన్ని గుర్తిస్తుంది.
షార్ డెరైక్టర్కు ప్రధాని అభినందనలు
సూళ్లూరుపేట: ఆంధ్రప్రదేశ్లోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) డెరైక్టర్ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేకంగా అభినందించారు. షార్ డెరైక్టర్తో పాటు మామ్ విజయంలో కీలకపాత్ర పోషించిన శ్రీహరికోట రాకెట్ కేంద్రం ఉద్యోగులను కూడా అభినందించారు.
థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్
స్పెక్ట్రోమీటర్: పరారుణకాంతి పరిధిలో మార్స్ నుంచి వెలువడే ఉష్ణ ఉద్గారాలను గుర్తిస్తుంది.
మార్స్ కలర్ కెమెరా: ఇది తీసే ఫొటోలు మార్స్ ఉపరితలాన్ని మరింత బాగా అర్థం చేసుకునేందుకు తోడ్పడతాయి.
ప్రయోగం అమలు ఇలా...
నవంబర్ 5: పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా భూకక్ష్యలోకి ప్రవేశించింది. మామ్ ఇంజన్లను మండించడం ద్వారా ఐదు దశల్లో కక్ష్య ఎత్తును పెంచారు.
డిసెంబర్ 1: ఇంజన్ను ఆరోసారి మండించారు. సెకనుకు 11.2 కి.మీ. వేగంతో భూకక్ష్య నుంచి అంగారక కక్ష్య వైపు దూసుకుపోయింది. రోదసిలో అంగారక కక్ష్య వైపు 300 రోజుల పాటు నిరంత రం 66.6 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించింది. సెప్టెంబర్ 22: మార్స్ గురుత్వాకర్షణ క్షేత్రంలోకి అడుగుపెట్టింది.
► సెప్టెంబర్ 24: అంగారక కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది.
మామ్ మహాయానం!
► నింగికి: నవంబర్ 5, 2013న ఏపీలోని శ్రీహరికోట నుంచి
► ప్రయోగం ఖర్చు రూ.450 కోట్లు
► మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్) ఉపగ్రహ బరువు 1,337 కిలోలు
► ఇంధనం 852 కిలోలు
► 5 శాస్త్రీయ పరికరాలు 13 కిలోలు