
భోపాల్ : ఉత్కంఠభరితంగా సాగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు అందరి చూపూ డిసెంబర్ 11న జరిగే కౌంటింగ్ వైపు మళ్లింది. ఈవీఎంల భద్రతపై విపక్ష కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తుండగా, వీటిని భద్రపరిచిన స్ర్టాంగ్ రూంలో గంటపాటు సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం కలకలం రేపింది. విద్యుత్ సరఫరా చాలాసేపు నిలిచిపోవడంతో శుక్రవారం స్ర్టాంగ్రూంలో అమర్చిన సీసీటీవీలు పనిచేయలేదని ఈసీ వర్గాలు అంగీకరించాయి.
ఓటింగ్ యంత్రాలు సురక్షితంగా ఉంచేందుకు జనరేటర్లు, ఇన్వర్టర్లను తెప్పించామని ఈసీ పేర్కొంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ర్టాంగ్ రూం వద్ద పెద్దసంఖ్యలో పోలీస్ బలగాలను నియోగించామని తెలిపింది. మరోవైపు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ సత్నాలోని స్ర్టాంగ్ రూంలోకి ఓ వ్యక్తి కార్టన్ను తీసుకువెళుతున్న వీడియో వైరల్గా మారడంతో కాంగ్రెస్, బీఎస్పీ కార్యకర్తలు స్ర్టాంగ్ రూం వెలుపల ఆందోళన చేపట్టారు. ఈవీఎంలను తారుమారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విపక్షాలు ఆరోపించాయి. నవంబర్ 28న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగ్గా ఈనెల 11న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment