
కేరళ సీఎం పినరయి విజయన్
దుబాయ్ సాయాన్ని ఎలా వద్దంటామన్న కేరళ సీఎం పినరయి విజయన్
తిరువనంతపురం : వరదలతో ప్రకృతి ప్రకోపానికి గురైన కేరళకు దుబాయ్ ప్రకటించిన రూ. 700 కోట్ల సాయాన్ని స్వీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించడంపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. దుబాయ్ను వేరే ఇతర దేశంగా పరిగణించలేమని, భారతీయులు ముఖ్యంగా కేరళ ప్రజలు దుబాయ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని విజయన్ వ్యాఖ్యానించారు. తనకు తెలిసినంతవరకూ దుబాయ్ కేరళకు వరద సాయాన్ని తన సొంతంగా ప్రతిపాదించిందని, వారి దేశ నిర్మాణంలో భారతీయులు ముఖ్యంగా కేరళ ప్రజలు ఇతోధిక సాయం చేశారని ఆ దేశ పాలకులు గుర్తెరిగిన క్రమంలో దుబాయ్ను వేరే ఇతర దేశంగా పరిగణించలేమని విజయన్ స్పష్టం చేశారు.
అబుదాబి రాజు షేక్ మహ్మద్ బిన్ జయేద్ అల్ నయాన్ ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి సాయంపై ప్రతిపాదించారని సీఎం విజయన్ చెప్పారు. కాగా, 2004లో ఏర్పాటైన విపత్తు సాయం విధానానికి అనుగుణంగా భారత్ వ్యవహరిస్తుందని, అప్పటి నుంచి విదేశ సాయాన్ని తిరస్కరిస్తూ వస్తున్నదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. (చదవండి: యూఏఈ సాయానికి కేంద్రం నో!)