బద్రీనాథ్‌లో భయం భయంగా.. | Dangerous situation in Badrinath | Sakshi
Sakshi News home page

బద్రీనాథ్‌లో భయం భయంగా..

Published Sat, Jul 19 2014 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 10:29 AM

బద్రీనాథ్‌లో భయం భయంగా..

బద్రీనాథ్‌లో భయం భయంగా..

 సాక్షి, న్యూఢిల్లీ, విజయవాడ బ్యూరో: గతేడాది ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్రికులపై విరుచుకుపడ్డ భారీ వరదలు మరోసారి వణికిస్తున్నాయి.  చార్‌ధామ్ యాత్రకు వెళ్లిన పలువురు తెలుగు భక్తులు అక్కడ చిక్కుకుపోయారు. జోరు వానలోనే నానా కష్టాలు పడి బద్రీనాథ్ చేరుకుని ప్రస్తుతం అక్కడి చినజీయర్‌స్వామి ఆశ్రమంలో తలదాచుకుంటున్నా రు. మూడు రోజులుగా ఆశ్రమ నిర్వాహకులు వారికి భోజన వసతి కల్పించి ఆదుకుంటున్నారు.  వీరిలో ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం, తూర్పు గోదావరి, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలకు చెందిన వారితోపాటు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, హైదరాబాద్ ప్రాంతాల వారు సుమారు 50 మంది యాత్రికులున్నారు. కరెంటు సదుపాయం, ఫోన్లు, ఏటీఎంలు పనిచేయక అవస్థలు పడుతున్నట్లు యాత్రికులు ఫోన్ ద్వారా ‘సాక్షి’ ప్రతినిధులకు తెలిపారు. మరో 100 మందికి పైగా తెలుగువారు బద్రీనాథ్‌లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని చెప్పారు. వారిలో వృద్ధులు, మహిళలు ఉండటంతో ఎక్కడ ఆశ్రయం పొందుతున్నారో తెలియక ఆందోళన వ్యక్తమవుతోంది.
 
 ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం శుక్రవారం మధ్యాహ్నం జీయర్ ఆశ్రమ నిర్వాహకులతో మాట్లాడింది. పోలీసులను పంపి తెలుగు యాత్రికుల వివరాలను సేకరిం చింది. ఇక్కడున్న యాత్రికుల్లో ఇద్దరి మొబైల్స్ 9701456187, 9560935988 మాత్రమే పని చేస్తున్నాయి. యాత్రికులు విజయవాడ ఆశ్రమ నిర్వాహకులతో మాట్లాడి బద్రీనాథ్‌లోని చినజీయర్ ఆశ్రమంలో ఆశ్రయం పొందారు. ఆశ్రమం మేనేజర్ కృష్ణారావు వీరికి ఏర్పాట్లు చేస్తున్నారు.
 
 వాతావరణం మెరుగుపడ్డాకే యాత్ర పునరుద్ధరణ
 
 ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కొనసాగటంతోపాటు నదులు ఉప్పొంగటం, వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో చార్‌ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. కేదార్‌నాథ్, బద్రీనాథ్ యాత్రను తొలుత నిలిపివేయగా యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని గంగోత్రి, యమునోత్రి యాత్రను కూడా సాయంత్రం నిలిపివేశారు. దీంతో చార్‌ధామ్ యాత్ర పూర్తిగా నిలిచిపోయింది. మరోవైపు అత్యవసర సమయంలో వినియోగించేందుకు ఉత్తరాఖండ్‌కు రెండు ఎంఐ-17 హెలి కాప్టర్లు సమకూర్చేందుకు కేంద్రం అంగీకరించింది. జూలై 25వ తేదీ వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. గత ఏడాది వరద బీభత్సం అనుభవాల నేపథ్యంలో జాతీయ విపత్తు నివారణ సంస్థ(ఎన్డీఆర్‌ఎఫ్) అప్రమత్తమైంది. ఆరు సహా యక బృందాలను రంగంలోకి దించారు. అల్మోరా, పౌరి, రుద్రప్రయాగ, చమోలీ, హరిద్వార్‌లో యాత్రికుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.
 
 ఇంత ప్రమాదమని తెలిస్తే వచ్చే వాళ్లం కాదు
 
 భారీ వర్షాల వల్ల కరెంటు సరఫరా నిలిచిపోయి పిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. కొండప్రాంతాల్లోని రోడ్లు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. మూడు రోజులుగా యాత్రికులు నానా అవస్థలు పడుతున్నా ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పందించి సహాయక చర్యలు ప్రారంభించలేదు.
 - బద్రీనాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు
 
  చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాం
 
 మూడు రోజుల క్రితం బద్రీనాథ్‌కి వచ్చాం. అప్పటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండ చరియలు విరిగిపడుతున్నాయి. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాం. అంతా చినజీయర్‌స్వామి ఆశ్రమంలో ఉన్నాం.
 - సాక్షితో హరిబాబు(కేపీహెచ్‌బీ, హైదరాబాద్)
 
 చినజీయర్‌స్వామి ఆశ్రమంలో తలదాచుకున్నాం
 
 చినజీయర్‌స్వామి ఆశ్రమంలో తలదాచుకోవటంతో బయటపడగలిగాం. ఆంధ్రప్రదేశ్‌లో ఉంటున్న తొమ్మిది మంది బంధువులతో కలిసి యాత్రకు వచ్చాం.
 - ఎస్‌వీఎస్ రావు (ఢిల్లీలో ఉంటున్న తెలుగు వ్యక్తి)
 
 చినజీయర్ ఆశ్రమంలో తలదాచుకుంటున్న కొందరు తెలుగువారు..
 
 తుంగల భాస్కరరావు, సావిత్రి, అరుణ, నగరాజకుమారి, రాధ, సాంబశివరావు, సుబ్బారావు, ఎస్‌వీఎస్ రావు (కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం వేకనూరు)
 ఎస్. హరిబాబు (చిత్తూరు)
 సోమయాజులు, రజని దంపతులు. యల్లప్ప, తాయారమ్మ దంపతులు, సూర్యనారాయణ, సుహాసిని, మౌనిక, మాల్యాద్రి (వీరిది కేపీహెచ్‌బీ కాలనీ)
 విశాఖపట్నం, రాజమండ్రి, మచిలీపట్నం ప్రాంతాలకు చెందిన దాదాపు 20 మంది
 
 ఉత్తరాఖండ్‌లో నదుల పరవళ్లు
 
 గత 24 గంటల్లో నైనిటాల్‌లో గరిష్టంగా 152 మి.మీ. వర్షం కురిసింది.
 అలకనంద, మందాకినీ పరీవాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు.
 రుద్రప్రయాగ, చమోలీ, ఉత్తరకాశీ జిల్లాలలో  అన్ని పాఠశాలలను సోమవారం వరకు మూసివేశారు.
 ప్రమాదస్థాయిలో అలకనంద, గంగ, మందాకినీ నదులు  
 
 యాత్రికులు క్షేమం: కంభంపాటి
 
 బద్రీనాథ్‌లో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులను స్వస్థలాలకు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. యాత్రికులు బద్రీనాథ్‌లోని చినజీయర్‌స్వామి ఆశ్రమంలో క్షేమంగా ఉన్నారు. ఆశ్రమ నిర్వాహకులతోపాటు జాతీయ విపత్తుల సంస్థ సభ్యులతో మాట్లాడి వారికి సాయం అందించాలని కోరాం. ఏపీ భవన్ అధికారులూ యాత్రికులతో మాట్లాడుతున్నారు.
 - కంభంపాటి రామ్మోహన్‌రావు, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement