పెట్రోల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ పెంపు | Govt raises fuel excise duty by Rs 3 per litre | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ పెంపు

Mar 15 2020 6:16 AM | Updated on Mar 15 2020 8:05 AM

Govt raises fuel excise duty by Rs 3 per litre - Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల తగ్గుదల ఫలితం ఇకపై దేశీయ వినియోగదారుకు అందదు. ఎందుకంటే, ఆ మేరకు కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.3 చొప్పున ఎక్సైజ్‌ డ్యూటీ పెంచింది. ఈ నిర్ణయంతో పెట్రో ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు. దీని ఫలితంగా కేంద్రానికి రూ.39వేల కోట్ల ఆదాయం అదనంగా సమకూరనుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ మొత్తాన్ని అభివృద్ధి పథకాలు, మౌలికరంగ వసతుల కోసం వెచ్చించనున్నట్లు కేంద్రం తెలిపింది.

తాజా పెంపుతో లీటరు పెట్రోల్‌పై స్పెషల్‌ ఎౖక్సైజ్‌  డ్యూటీ రూ.8 వరకు చేరుకోగా డీజిల్‌పై స్పెషల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ రూ.4కు పెరిగినట్లు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్స్‌ అండ్‌ కస్టమ్స్‌ శనివారం జారీ చేసిన నోటిఫికేషన్‌ పేర్కొంది. అదనంగా రోడ్‌ సెస్సు.. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.1 చొప్పున పెరిగి రూ.10కి చేరింది. అంతిమంగా ఎక్సైజ్‌ డ్యూటీ లీటరు పెట్రోల్‌పై రూ.22.98కు, డీజిల్‌పై 18.83కు చేరుకున్నట్లయింది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ రూ.69.87, డీజిల్‌ రూ.62.58కి అందుబాటులో ఉంది. మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన సమయంలో పెట్రోల్‌పై ఎక్సైజ్‌     పన్ను లీటరుకు రూ.9.48, డీజిల్‌పై రూ.3.56గా ఉంది.   

కాంగ్రెస్‌ మండిపాటు
పెట్రోల్, డీజిల్‌పై ఎక్జైజ్‌ డ్యూటీ పెంపును కాంగ్రెస్‌ విమర్శించింది.అంతర్జాతీయంగా తగ్గిన ధరల ప్రభావం ఆ మేరకు వినియోగదారుకు అందేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement