
ఏ విచారణ అయినా ఐదేళ్లు దాటకూడదు
- సీజేఐ జస్టిస్ హెచ్ఎల్ దత్తు వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఏ కేసు విచారణ అయినా ఐదేళ్ల సమయం మించరాదని గడువును నిర్దేశించినట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ హెచ్ఎల్ దత్తు తెలిపారు. కేసుల పెండింగ్కు సంబంధించి న్యాయవ్యవస్థలో ఖాళీలు పెద్ద అవరోధంగా మారాయని హైకోర్టుల చీఫ్ జస్టిస్లు, సీఎంల సదస్సులో అన్నారు. ప్రజాస్వామ్యం అనే తల్లికి న్యాయ, శాసన వ్యవ స్థలు తోబుట్టువులాంటివారని ఈ రెండు కీలక వ్యవస్థలు రాజ్యాంగం ఏర్పరిచిన బాటలో సమన్వయంతో ముందుకు సాగాలని అభిలషించారు. కేటాయించిన నిధుల వినియోగంలో న్యాయవ్యవస్థకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని, ప్రతిభ గల న్యాయ నిపుణులను మంచి ప్యాకేజీలతో ఆకర్షించాల్సిన అవసరం ఉందన్నారు.
అది మా కుటుంబ వ్యవహారం.. సీజేఐ: గుడ్ఫ్రైడే రోజున జడ్జిల సదస్సు నిర్వహణపై వివాదం దురదృష్టకరమని సీజేఐ దత్తు అన్నారు. ఇది తమ కుటుంబ వ్యవహారమని, కుటుంబ పెద్దగా ఈ అంశాన్ని పరిష్కరిస్తానని చెప్పారు. ‘ఆ సదస్సు న్యాయవ్యవస్థ సమస్యలపై చర్చించేందుకు జడ్జీల మధ్య ఏర్పాటు చేసిన ఓ మీటింగ్ మాత్రమే. మాది ఒక కుటుంబం. మాలో నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే.. అది మేం మాట్లాడుకొని పరిష్కరించుకుంటాం’ అని విలేకరులతో అన్నారు. గుడ్ఫ్రైడే రోజున జడ్జిల సదస్సు నిర్వహించడంపై సుప్రీం న్యాయమూర్తి కురియన్ జోసెఫ్.. సీజేఐకి అసంతృప్తి తెలియజేసిన విషయం తెలిసిందే.