
సాక్షి, న్యూఢిల్లీ : కారుణ్య మరణంపై సుప్రీంకోర్టు శుక్రవారం సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతూ మరణం అంచుల వద్ద ఉన్న వారికి ప్రాణాన్ని నిలబెట్టే వ్యవస్థను తీసివేయడం ద్వారా మరణాన్ని ప్రసాదించే కారుణ్య మరణాన్ని (పాసివ్ యుతనేసియా) అనుమతించింది. గౌరవంతో మరణించే హక్కు మానవులకు ఉందని మార్గదర్శకాలతో కారుణ్య మరణాలను అనుమతించవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.
రోగి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వ్యాధి నయం కాదని చట్టబద్ధ మెడికల్ బోర్డు ప్రకటించిన అనంతరమే లైఫ్ సపోర్ట్ వ్యవస్థను తొలగించాలని ధర్మాసనం పేర్కొంది. తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న రోగులు తమకు ఎలాంటి వైద్య చికిత్స కావాలో వైద్యులకు తెలుపుతూ లివింగ్ విల్ సమర్పించేందుకు కోర్టు అనుమతించింది. లివింగ్ విల్, పాసివ్ యుతనేసియా అమలుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రాణాంతక వ్యాధులతో జీవచ్ఛవాలుగా మారిన రోగులకు కారుణ్య మరణాలను ప్రసాదించాలనే చర్చ దీర్ఘకాలంగా సాగుతున్నది.