
ముంబై : మహాత్మా గాంధీపై ఐఏఎస్ అధికారిణి నిధి చౌదరి చేసిన ట్వీట్పై విమర్శలు వెల్లువెత్తడంతో ఆమెను ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్కి జాయింట్ సెక్రటరీగా పని చేస్తున్న నిధి చౌదరిని నీటి సరఫరా, పారిశుద్య శాఖ డిప్యూటి సెక్రటరీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వివాదంపై వివరణ ఇవ్వాల్సిందగా ఆదేశించడమే కాక షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది.
గాడ్సేకు కృతజ్ఞతలు అంటూ పదిహేను రోజుల కిందట ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదాలకు కేంద్ర బిందువైన సంగతి తెలిసిందే. ‘మన కరెన్సీపై గాంధీ ముఖాన్ని తొలగించడం, ప్రపంచవ్యాప్తంగా ఆయన విగ్రహాలను రూపుమాపడం, ఆయన పేరిట నెలకొల్పిన సంస్ధలు, రహదారుల పేర్లు మార్చడం ఇప్పుడు తక్షణం మనం చేయాల్సిన పని.. ఇదే మనం ఆయనకు ఇచ్చే ఘననివాళి.. థ్యాంక్యూ గాడ్సే’ అంటూ ఆమె చేసిన ట్వీట్ కలకలం రేపింది. విమర్శలు వెల్లువెత్తడంతో ట్వీట్ను ఆమె తొలగించారు. నిధి చౌదరిని ప్రభుత్వ సర్వీసు నుంచి సస్పెండ్ చేయాలని ఎన్సీపీ నేత జితేంద్ర అవధ్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
(చదవండి : ‘ఆ ట్వీట్పై రాద్ధాంతం అవసరమా’)
Comments
Please login to add a commentAdd a comment