
బెంగాల్ ప్రభుత్వ ప్రకటనలపై జాగ్రత్త
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటనలు తీసుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) తన సభ్యులకు సూచించింది.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటనలు తీసుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఇండియన్ న్యూస్పేపర్ సొసైటీ(ఐఎన్ఎస్) తన సభ్యులకు సూచించింది. ఐఎన్ఎస్ కార్యవర్గ కమిటీ సోమవారమిక్కడ సమావేశమైంది. తన సభ్య పత్రికలకు కొన్నింటికి ప్రభుత్వం చాలా ఏళ్లుగా ప్రకటనల బిల్లులు చెల్లించకపోవడంపై కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
మీడియా పరిశ్రమ ఇప్పటికే కష్టాల్లో ఉన్న నేపథ్యంలో బిల్లుల డబ్బులు రాక ఈ పత్రికలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. ముఖ్యమంత్రి వెంటనే బకాయిలు చెల్లించాలని కార్యవర్గం కోరినట్లు ఐఎన్ఎస్ ప్రధాన కార్యదర్శి వి.శంకరన్ ఓ ప్రకటనలో తెలిపారు.