
అంతర్జాతీయ విమాన సేవలు దశలవారీగా ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ : అన్లాక్ 2.0లో భాగంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను దశలవారీగా ప్రారంభమవుతాయని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంగళవారం పేర్కొంది. కరోనా మహమ్మారి కట్టడి కోసం దేశవ్యాప్త లాక్డౌన్తో మార్చి చివరివారం నుంచి దేశ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. రెండు నెలల అనంతరం పరిమిత రూట్లలో దేశీయ విమాన సేవలను అనుమతించినా అంతర్జాతీయ విమాన సర్వీసుల నిలిపివేత కొనసాగుతోంది. కాగా లాక్డౌన్ సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాలను నడిపింది. వందే భారత్ మిషన్లో భాగంగా 50కి పైగా దేశాల పెద్దసంఖ్యలో భారతీయులను స్వదేశానికి రప్పించామని పౌరవిమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు.