
మార్స్ యాత్రకు అడుగు దూరంలో శ్రద్ధా ప్రసాద్
ముంబయి: ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న గ్రహం మార్స్. అంగారక గ్రహంపై అడుగుపెట్టడానికి కేరళకు చెందిన శ్రద్ధా ప్రసాద్ తహతహలాడుతోంది. నెదర్లాండ్కు చెందిన ఓ ప్రైవేటు సంస్థ 2024లో అంగారక యాత్ర నిర్వహించనుంది. ఈ యాత్రలో పాల్గొనేందుకు నిర్వహించిన కార్యక్రమంలో ముగ్గురు భారతీయులు ...చివరి నాలుగో రౌండ్కు ఎంపికయ్యారు. జీవితంలో ఒకసారి మాత్రమే చేయగలిగే ఈ యాత్రకి అతి పిన్న వయస్కురాలైన ఓ భారతీయురాలు సెలక్ట్ అవడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
వివరాల్లోకి వెళితే నెదర్లాండ్స్ కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ మార్స్ యాత్రను చేపట్టనుంది. అరుణ గ్రహంపైకి పంపిస్తున్న ఈ యాత్రకు ప్రపంచ వ్యాప్తంగా 705 మందిని పంపిస్తున్నారు. యాత్రలో పాల్గొనేందుకు సుమారు 2,02,586 దరఖాస్తులు వచ్చాయి. కాగా అంగారక యాత్ర చేపట్టేందుకు ఎంపిక చేసిన వంద మంది జాబితాలో ముగ్గురు భారతీయులు చోటు దక్కించుకోవడం విశేషం.
వీరిలో కేరళకు చెందిన 19 ఏళ్ల శ్రద్ధా ప్రసాద్ ఒక్కరే ప్రస్తుతం భారత్ (కేరళ) లో ఉంటున్నారు. ఎంపికైన తరన్ జీత్ సింగ్, రితికా సింగ్ ఇద్దరు ప్రవాస భారతీయులు. తరన్ జీత్ సింగ్ భాటియా సెంట్రల్ ఫ్లోరిడా యూనివర్సిటీలో డాక్టరేట్ చేస్తుండగా, రితికా సింగ్ ప్రస్తుతం దుబాయ్లో స్ధిరపడ్డారు.
అంగారకుడిపై శాశ్వతంగా మానవ ఆవాసాన్ని ఏర్పాటు చేసే దిశగా వీరు ప్రయత్నాలు చేయడం కోసం తలపెట్టినదే ఈ యాత్ర. మొత్తంగా 40 మందిని అంగారక గ్రహంపైకి పంపించాలన్నది ఈ మిషన్ ఉద్దేశం. ప్రతి రెండేళ్లకు నలుగురిని మార్స్ యాత్రకి పంపుతారు. అన్ని రౌండ్ లను విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్ధులకు శిక్షణ ఇచ్చి ఈ యాత్రకు పంపిస్తారు. ప్రస్తుతం 3 రౌండ్లు పూర్తయ్యేసరికి 100 మంది సెలక్ట్ కాగా వీరిలో మహిళలు 50, పురుషులు 50 మంది ఉండటం విశేషం.
జీవితంలో ఒకేసారి చేసే యాత్ర
'కుటుంబాన్ని, స్నేహితులను, సన్నిహితులను వదిలి వెళ్లడం చాలా బాధగా ఉంది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.. జీవితంలో ఒకసారి మాత్రమే వచ్చే సదవకాశమని నేను మరిచిపోకూడదు' అని శ్రద్ధా ప్రసాద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే తనకు చాలా ఇష్టమని, రిస్క్తో పాటు యాత్రను ఎంజాయ్ చేయాలనుకుంటున్నానని కోయంబత్తూరు లోని అమృత యూనివర్సిటీకి చెందిన శ్రద్ధా చెప్పారు. మూడవ రౌండ్ అయిన తర్వాత చివరి రౌండ్ విజయవంతంగా పూర్తిచేస్తానన్న నమ్మకం ఏర్పడిందని ఆమె దీమా వ్యక్తం చేశారు.