
మీటూపై రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు..నానా పటేకర్ అమర్యాదకరంగా వ్యవహరిస్తాడు కానీ..
సాక్షి, ముంబై : మీటూ ఉద్యమంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు నానా పటేకర్ అమర్యాదకరంగా వ్యవహరిస్తాడని తనకు తెలుసన్నారు. అయితే ఆయన ఇలాంటి పనులు చేశాడని తాననుకోవడం లేదని, కోర్టులే దీన్ని నిగ్గుతేలుస్తాయని వ్యాఖ్యానించారు. మీటూ సీరియస్ అంశమని, దీనిపై మీడియా ఏం చేస్తుందని ప్రశ్నించారు.
ఇలాంటి సున్నిత అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరగరాదని కోరారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న పెట్రో ధరలు, రూపాయి క్షీణత, నిరుద్యోగం వంటి తీవ్ర సమస్యల నుంచి పక్కదారి పట్టించేందుకే ఈ ఉద్యమం ముందుకువచ్చిందని రాజ్ థాకరే సందేహం వ్యక్తం చేశారు. మహిళలకు ఎలాంటి అవాంఛనీయ పరిస్థితి ఎదురైనా వారు ఎంఎన్ఎస్ను సాయం కోసం ఆశ్రయించవచ్చన్నారు. మహిళలు తాము అణిచివేతకు గురైన వెంటనే గొంతెత్తాలని, పదేళ్ల తర్వాత కాదని ఆయన చురకలు వేశారు.