raj thackeray
-
ఎమ్మెన్నెస్ ‘పట్టాలు తప్పింది’
అసెంబ్లీ రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) ఘోర పరాజయం పాలైంది. ఒక్క సీటు కూడా రాకపోవడంతో పార్టీ గుర్తింపునకే ముప్పు ఏర్పడింది. మహా వికాస్ ఆఘాడి, మహాయుతి కూటములకు చెందిన వెన్నుపోటుదార్లకు (గద్దార్లకు) ఓటు వేయవద్దని, ఒకసారి తమ పార్టీకి అవకాశమిచ్చి చూడాలని ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ ఓటర్లు తిరస్కరించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరగ్గా, శనివారం ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలిచి రాష్ట్ర రాజకీయరంగంలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవాలన్న ఎమ్మెన్నెస్ చీఫ్ ఆశలు అడియాశలయ్యాయి. పార్టీ తరపున ఒక్క అభ్యర్థి కూడా గెలవకపోగా మొదటిసారిగా ఎన్నికల బరిలో దిగిన తన తనయుడు అమిత్ ఠాక్రేను కూడా గెలిపించుకోలేకపోయారు. దీంతో రాజ్ వైఖరి,ఆయన తనయుడు అమిత్ ఓటమిపై సోషల్ మీడియాలో వివిధ రకాల కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. పార్టీ గుర్తు రద్దయ్యే అవకాశం... దాదాపు 18 ఏళ్ల కిందట హిందూ హృదయ్ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి బయటకువచ్చిన రాజ్ ఠాక్రే 2006 మార్చి తొమ్మిదో తేదీన ఎమ్మెన్నెస్ పార్టీని స్ధాపించారు. ఆ తరువాత 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి తమ పార్టీ తరఫున అభ్యర్ధులను బరిలోకి దింపారు. వీరిలో ఏకంగా 13 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని ప్రశంసలు అందుకున్నారు. ఆ సమయంలో ఎమ్మెన్నెస్కు 5.71 శాతం ఓట్లు పోలయ్యాయి. కానీ తరచూ పరాయిప్రాంతం వారిని ముఖ్యంగా ఉత్తరభారతీయులను లక్ష్యంగా చేసుకుని పదేపదే విమర్శించడంతో పార్టీ ప్రాబల్యం క్రమేపీ తగ్గుతూ వచ్చింది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కరంటే ఒక్కరే గెలవగా మొత్తంమీద 3.15 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆ తరువాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్ధితి పునరావృతమైంది. కేవలం 2.25 శాతం ఓట్లు పోలైనప్పటికీ కల్యాణ్ నియోజక వర్గం నుంచి రాజు పాటిల్ ఒక్కరే గెలవడంతో రాజ్ ఠాక్రే పరువు, పార్టీ ప్రతిష్ట నిలబడ్డాయి. కానీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజు పాటిల్ కూడా ఓటమిపాలయ్యారు.ముఖ్యంగా రాజ్ ఠాక్రేకు విశ్వాస పాత్రుడిగా పేరుగాంచిన బాలా నాంద్గావ్కర్ శివ్డీ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నాంద్గావ్కర్ గెలుపు కోసం ప్రచారం ముగింపు చివరి రోజున అంటే గత సోమవారం శివ్డీలో ప్రత్యేకంగా ఓ సభ కూడా నిర్వహించారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో రాజ్ ఠాక్రేతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర మనస్ధాపానికి గురయ్యారు. ఇప్పుడు ఎమ్మెన్నెస్లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. అంతేగాకుండా ఈ ఎన్నికల్లో కనీసమాత్రం ఓట్లు కూడా రాకపోవడంతో పార్టీ మనుగడ ప్రమాదంలో పడే అవకాశముందని, అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం పార్టీ గుర్తును రద్దుచేసే అవకాశం కూడా ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మాటలకు ఓట్లు రాలవని... రాజ్ ఠాక్రే ముంబైసహా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సభ ఏర్పాటు చేసినా ఇసుకవేస్తే రాలనంతమంది ప్రజలు ఆ సభలకు హాజరవుతారు. ఆయన మాటతీరు, ప్రముఖ రాజకీయ నాయకుల మాటలను అనుకరించే (మిమిక్రీ) విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. దీంతో రాజ్ ప్రసంగం వినేందుకు ప్రజలు ఎంతగానో ఆసక్తి కనబరుస్తారు. అయితే మాటలకు ఓట్లు రాలవని ప్రతి ఎన్నికల్లో ఎమ్మెన్నెస్కు రుజువవుతూనే ఉంది. ఫలితంగా ఓటింగ్ శాతం నెమ్మదిగా దిగజారుతూ వచ్చింది. దీంతో ఈసారి ఎలాగైనా అధికసంఖ్యలో సీట్లను చేజిక్కించుకోవాలని భావించిన రాజ్ఠాక్రే గెలిచే అవకాశాలున్నాయని భావించిన 128 స్ధానాల్లో తమ అభ్యర్ధులను పోటీలో నిలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ అభ్యర్ధులకు మద్దతుగా ముమ్మరంగా ప్రచారం చేశారు. తమ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.చదవండి: మహారాష్ట్రలో సకుటుంబ సపరివార రాజకీయంఅధికారంలో లేకపోయినప్పటికీ పార్టీ తరపున గతంలో చేపట్టిన అనేక ఆందోళనల గురించి ప్రతీ సభలో వివరించారు. వీటినే ప్రధాన ప్రచార ఆ్రస్తాలుగా మలచుకున్నారు. టోల్ మాఫీ, రైల్వే ఉద్యోగాల భర్తీలో భూమిపుత్రులకు జరిగిన అన్యాయం, మసీదుల వద్దనున్న లౌడ్స్పీకర్లలోంచి పెద్ద శబ్దంతో వినిపించే నమాజ్కు వ్యతిరేకంగా హనుమాన్ చాలీసా వినిపించాలన్న ఆందోళన.. ఇలా అనేక కార్యక్రమాలను చేపట్టామని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదని తన ప్రసంగాల్లో వివరించారు. తాము అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో మసీదులపై అక్రమంగా ఏర్పాటు చేసిన లౌడ్స్పీకర్లను తొలగిస్తామని, యువతకు ఉపాధి, ఉద్యోగవకాశాలు కల్పిస్తామని ఇలా అనేక హామీలిచ్చారు. కాని అవేమి ఓటర్లకు రుచించలేదని శనివారం వెలువడిన ఫలితాలను బట్టి స్పష్టమైంది. -
రాజ్ఠాక్రేపై ఏ ఫైల్ ఓపెన్ చేశారు: సంజయ్ రౌత్
ముంబై: లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ఠాక్రేపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజ్ ఠాక్రేపై ఏదో ఫైల్ ఓపన్ చేశాని.. అందుకే ఒక్కసారిగా బీజేపీకి తన మద్దతు ప్రకటించారని సంజయ్ రౌత్ అన్నారు. ‘ఒక్కసారిగా ఏదో విచిత్రం జరిగింది. మేము ఈ విషయాన్ని రాజ్ఠాక్రేను అడగదలుచుకున్నాం. ఒక్కసారిగా మారిపోయి మహారాష్ట్ర శత్రువుల(ప్రత్యర్థుల)వైపు చేరి పూర్తి మద్దతు ఇస్తున్నారు. మీరు ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? ఇలా చేయటం వెనక ఉన్న బలమైన కారణం ఏంటీ? మీ మీద ఏ ఫైల్ ఓపెన్ చేశారు?’ అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు సోదరుడైన రాజ్ ఠాక్రే... తన పార్టీ బీజేపీ, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ (ఎన్సీపీ) కూటమికి సంపూర్ణ మద్దత ఇస్తుందని ప్రకటించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్ ఠాక్రే.. తన పార్టీ కేవలం ప్రధాని నర్రేందమోదీ, ఎన్డీయే కూటమికే మాత్రమే మద్దతు ఇస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఎన్నికలకు సన్నద్ధం కావాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తనకు 1990 నుంచి బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. మొదటి నుంచి నరేంద్ర మోదీ.. ప్రధాని అవుతారన్న వారిలో తాను ఒకరినని చెప్పారు. ఇక.. ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన(యూబీటీ) ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న విషయం తెలిసిందే. మంగళవారం మహావికాస్ ఆఘాడీ కూటమి మధ్య సీట్లు పంపిణీ ఖరారైన విషయం తెలిసిందే. శివసేన (యూబీటీ)కి -21,కాంగ్రెస్- 17, ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్)-10 సీట్లుతో లోక్సభ ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. -
రంజుగా మారిన రాజకీయం.. ప్రధాని మోదీకి ఎంఎన్ఎస్ భేషరతుగా మద్దతు
లోక్సభ ఎన్నికల తరుణంలో మహరాష్ట్ర రాజకీయం రంజుగా మారింది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే ప్రధాని నరేంద్ర మోదీకి బేషరతుగా మద్దతు ప్రకటించారు. గత నెలలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఎంఎన్ఎస్ నేత రాజ్ఠాక్రే భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం రాజ్ థాకరే బీజేపీ, ఏక్నాథ్ షిండే - శివసేన, అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పక్షాల కూటమి ‘మహాయుతి’లో చేరవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్థాకరే కీలక ప్రకటన చేశారు. ముంబైలోని శివాజీ పార్క్ వద్ద గుడిపడ్వా వేడుకల్లో పాల్గొన్న రాజ్ థాకరే ప్రసంగిస్తూ లోక్సభ ఎన్నికల్లో ఎంఎన్ఎస్ పోటీ చేయదని తెలిపారు. అయితే ఈ ఏడాది చివర్లో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి మద్దతు కోరారు. నాకు పదవులొద్దు నాకు రాజ్యసభ, విధానసభ పదవులు వద్దని ఫడ్నవీస్తో చెప్పాను. అంతేకాదు నేను ఎటువంటి అంచనాలు, షరతులు లేకుండా ప్రధాని మోదీతో పాటు మహాయుతి కూటమికి మద్దతిస్తున్నానని రాజ్ థాకరే అన్నారు. కాగా, ఎంఎన్ఎస్ 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఒక్క స్థానంలో కూడా గెలువలేకపోయింది. 2019 లోక్సభ ఎన్నికల్లో అసలు బరిలో దిగలేదు. -
ఎన్డీఏలోకి రాజ్ఠాక్రే?
మహారాష్ట్ర రాజకీయాలు మరో మలుపు తిరగబోతున్నాయి. ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ఠాక్రే ఎన్డీఏలో చేరనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్ ఠాక్రే ఎన్డీయేలో చేరడంపై జరుగుతున్న చర్చలు చివరి దశలో ఉన్నాయని తెలుస్తోంది. దక్షిణ ముంబై సీటును ఎంఎన్ఎస్ అభ్యర్థికి కేటాయించాలని రాజ్ ఠాక్రే డిమాండ్ చేస్తున్నారని సమాచారం. ఈ సీటు నుంచి ఇప్పటికే బీజేపీ తరపున రాహుల్ నర్వేకర్ పేరు వినిపిస్తోంది. కాగా రాజ్ ఠాక్రే డిమాండ్పై బీజేపీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఈ సీటు కేటాయించిన తర్వాతనే రాజ్ఠాక్రే ఎన్డీఏలో చేరనున్నారనే వార్త వినిపిస్తోంది. తాజాగా మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వర్గంతో బీజేపీకి ఒప్పందం ఏమీ లేదని అన్నారు. బీజేపీ, షిండే నేతృత్వంలోని శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్) కూటమి మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈసారి బీజేపీ సీట్ల రికార్డును బ్రేక్ చేస్తుందన్నారు. -
హిందువులు సహనశీలురు
ముంబై: ప్రముఖ కవి, గీత రచయిత జావెద్ అక్తర్(78) హిందూ సంస్కృతిపై ప్రశంసలు కురిపించారు. హిందువులు ఎంతో సహనశీలురని, వారి వల్లే మన దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తోందని చెప్పారు. అదే సమయంలో, నేడు దేశంలో వాక్ స్వాతంత్య్రం తగ్గిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ముంబైలో రాజ్ ఠాక్రే సారథ్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) నిర్వహించిన దీపోత్సవ్లో ఆయన పాల్గొన్నారు. ‘హిందువులు దయామయులు. విశాల హృదయులు. అసహనం కలిగిన కొందరున్నారు. హిందువులు వారిలా ఉండరు. హిందువులకు మాత్రమే దయ, విశాల హృదయం అనే గొప్ప లక్షణాలుంటాయి. వాటిని కోల్పోవద్దు. లేకుంటే మిగతా వారికీ మీకూ బేధం ఉండదు. హిందువుల జీవన విధానం నుంచి మేం నేర్చుకున్నాం. వాటిని మీరు వదులుకుంటారా?’అని ఆయన ప్రశ్నించారు. ఇంకా ఆయన.. ‘శ్రీరాముడు, సీతాదేవిల గడ్డపై పుట్టినందుకు గర్విస్తున్నాను. నేను నాస్తికుడినే అయితే రాముడిని, సీతను ఈ దేశ సంపదగా భావిస్తాను. రామాయణం మన సాంస్కృతిక వారసత్వం’అంటూ జై సియా రాం అని నినదించారు. ‘ఇది హిందూ సంస్కృతి, నాగరికత. మనకు ప్రజాస్వామ్య దృక్పథాలను నేర్పింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. అందుకే మనమే ఒప్పు, అందరిదీ తప్పు అని భావించడం హిందువుల సిద్ధాంతం కాదు. ఇది మీకు ఎవరు నేర్పించినా తప్పే’అని అన్నారు. అయితే, దేశంలో నేడు వాక్ స్వాతంత్య్రం క్షీణిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. -
సోదరులిద్దరూ కలిసేనా? ఒకతాటిపైకి ఉద్ధవ్ ఠాక్రే.. రాజ్ ఠాక్రే!
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (చీఫ్) రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఒకతాటిపైకి వస్తుండవచ్చనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తోంది. దివంగత బాల్ ఠా క్రే స్మారకం విషయంపై చర్చించేందుకు తన సోదరుడైన రాజ్ఠాక్రేకి ఫోన్ చేయాల్సి ఉందని ఇటీ వల ఓ ఇంటర్వ్యూలో ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. అయితే అది ఎప్పుడనేది మాత్రం స్పష్టం చేయలేదు. కాగా.. రాజ్–ఉద్ధవ్లు ఒకటయితే బాగుంటుందని ఇరు పార్టీల కార్యకర్తలు కొంత కాలంగా కోరుకుంటున్నా రు. అంతేగాకుండా ఇటీవల అక్కడక్కడా ఫ్లె క్సీలు, బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇద్దరు ఠాక్రేలు ఒకటైతే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఎవరు.. ఏ పార్టీలో ఉన్నారో? రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల ఊహించని మార్పులు జరుగుతున్నాయి. నాయకులు ఓ పార్టీ నుంచి బయటపడి ప్రత్యర్థి పారీ్టలో చేరడం, లేదంటే కొత్త పార్టీ ఏర్పాటు వంటివి చేస్తున్నారు. కూటములు ఏర్పడుతున్నాయి దీంతో ఎవరు, ఏ పారీ్టలో ఉన్నారో తెలియని గందరగోళ పరిస్ధితి నెలకొంది. గత సంవత్సరం ఏక్నాథ్ శిందే.. శివసేనను చీల్చి బీజేపీలో చేరారు. ఆ తరువాత నాటకీయ పరిణామాల మధ్య మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం కుప్పకూలిపోవడం, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం చకచకా జరిగిపోయాయి. ఈ విషయం నుంచి తేరుకోకముందే మహా వికాస్ ఆఘాడిలో మిత్రపక్షంగా ఉన్న నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ వర్గం నుంచి అజిత్ పవార్ కూడా బయటపడ్డారు. పార్టీని చీల్చి తన మద్దతుదారులతో ఆయన బీజేపీ ప్రభుత్వంలో చేరారు. వారికి కొన్ని మంత్రిపదవులు సైతం లభించాయి. అందరూ స్వార్థ రాజకీయాలు చేస్తున్న వేళ.. వీరెందుకు (రాజ్–ఉద్ధవ్) ఒకటి కాకూడదనే అంశాన్ని ఇరుపార్టీల పదాధికారులు, కార్యకర్తలు తెరమీదకు తెచ్చారు. బీజేపీ నుంచి ప్రతికూల సంకేతాలు.. బీజేపీతో సాన్నిహిత్యంగా మెలుగుతున్న తీరును బట్టి ఆ పారీ్టతో పొత్తు పెట్టుకుంటుండవచ్చని అప్పట్లో అందరు భావించారు. కానీ ఉత్తర భారతీయుల ఓట్లను దృష్టిలో ఉంచుకుని రాజ్ఠాక్రేకు కొంత దూరంగా ఉంచడమే ఉత్తమమని బీజేపీ వర్గాలు భావించాయి. ఆ తరువాత మసీదులపై లౌడ్స్పీకర్లు తొలగించాలని చేపట్టిన ఆందోళన రాజ్ను బీజేపీకి మరింత దగ్గర చేసింది. ఈ నేపథ్యంలోనే దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ శిందే, చంద్రకాంత్ పాటిల్సహా పలువురు బీజేపీ మంత్రులు, నేతలు రాజ్ ఠాక్రేతో భేటీ అయ్యేందుకు ఆయన నివాసమైన శివాజీపార్క్లోని రాజ్ఘడ్కు వెళ్లడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో రాజ్ ఠాక్రే బీజేపీతో జత కట్టడం ఖాయమని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జోరందుకుంది. కానీ వచ్చే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఏక్నాథ్ శిందే, అజిత్ పవార్ లాంటి ఇద్దరు బలమైన నాయకులు లభించారు. ఫలితంగా బీజేపీతో పొత్తుపై ఎమ్మెన్నెస్ పెట్టుకున్న ఆశలు సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే.. బాల్ ఠాక్రే స్మారకం విషయంపై స్వయంగా రాజ్ ఠాక్రేకు ఫోన్ చేస్తానని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. దీంతో ఇరువురు ఠాక్రేలు స్మారకం అంశంతో పాటు తాజా రాజకీయలు, పొత్తు అంశంపై కూడా చర్చస్తుండవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజ్ ఠాక్రే ఎలా స్పందిస్తారనే దానిపై ఇరు పారీ్టల పదాధికారులు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. ఉద్ధవ్తో మైత్రికి ప్రయత్నాలు.. అయితే అప్పటికే రాష్ట్ర రాజకీయాలపై రాజ్ ఠాక్రే నిప్పులు చెరుగుతున్నారు. మనం ఎవరికి ఓటు వేశాం..? మనం ఓటువేసిన ప్రతినిధి ఏ పార్టీలో కొనసాగుతున్నారో తెలుసుకోలేని పరిస్ధితుల్లో ఓటర్లు ఉన్నారని పలుమార్లు అన్నారు. తను భవిష్యత్తులో ఎవరితోను పొత్తుపెట్టుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్లు అనేక సందర్బాల్లో వెల్లడించారు. అంతేగాకుండా సోదరులిద్దరూ ఒకటయ్యే విషయంపై ఇదివరకు ఉద్ధవ్కు రెండు సార్లు మైత్రి హస్తం చూపానని రాజ్ అన్నారు. కానీ ఏకైక ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెన్నెస్తో పొత్తు పెట్టుకోవడం వల్ల రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం లేదని ఉద్ధవ్ భావించి ఉండవచ్చని అనేక సంవత్సరాలు వేచి చూశారు. ఉద్ధవ్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో దూరంగా ఉండడమే ఉత్తమని రాజ్ భావించారు. -
మొత్తం శరద్ పవారే చేశారు.. ఎన్సీపీ చీఫ్పై సంచలన వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమిలోని ఎన్సీపీ చీలికపై.. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి సంక్షోభాలకు శరద్ పవార్ ఆద్యుడని ఆరోపించిన రాజ్ థాక్రే.. తాజా పరిణామాలకు కూడా శరద్ పవారే కారణమంటూ పేర్కొన్నారు. మహారాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలపై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(MNS) చీఫ్ రాజ్ థాక్రే బుధవారం మీడియాతో మాట్లాడారు. ఎన్సీపీ సంక్షోభం శరద్ పవార్ ఆశీస్సులతోనే జరిగిందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారాయన. ‘‘రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే జరిగిందో అది అసహ్యమైన రాజకీయం. ఇది ముమ్మాటికీ ఓటర్లను అవమానించడమే అని తీవ్రంగా స్పందించారాయన. అసలు మహారాష్ట్రలో ఇలాంటి రాజకీయాలు మొదలుపట్టిందే శరద్ పవార్. 1978లో పులోద్(పురోగామి లోక్షాహీ దళ్) పేరుతో చీలిక రాజకీయాలను ప్రదర్శించారు. అప్పటిదాకా మరాఠా రాజకీయం అలాంటి పరిణామాలను చూడలేదు. ఇలాంటివి పవార్తోనే మొదలై.. ఆయనతోనే ముగిసేలా కనిపిస్తున్నాయి. కర్మ ఫలితాన్ని ఆయన అనుభవించాల్సిందే కదా. ఇప్పుడు జరుగుతున్నదంతా ఆయన చేజేతులారా చేసుకున్నదే అని రాజ్ థాక్రే విమర్శించారు. అలాగే.. ప్రఫుల్ పటేల్, దిలీప్ వాల్సే పాటిల్, ఛాగన్ భుజ్బల్లు అజిత్ పవార్ వెంట వెళ్లే వ్యక్తులు ఏమాత్రం కాదని.. వాళ్లకు కచ్చితంగా శరద్ పవార్ అండదండలు ఉంటాయని ఆరోపించారాయన. ఆనాడు ఏం జరిగిందంటే.. 1977 సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం.. జనతా పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్లో చీలిక ఏర్పడింది. ఇందిరా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్(ఐ), యశ్వంత్రావు చవాన్ నేతృత్వంలో కాంగ్రెస్(యూ)గా ముందుకు వెళ్లాయి. మహారాష్ట్రలో మెజారిటీ సీట్లు ఓడిపోవడంతో నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి సీఎం శంకర్రావ్ చవాన్ రాజీనామా చేశారు. దీంతో వసంత్దాదా పాటిల్ సీఎం అయ్యారు. అయితే.. శరద్ పవార్ అప్పటి పాటిల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నుంచి తెగదెంపులు చేసుకుని బయటకు వచ్చారు. తన రాజకీయ గురువైన యశ్వంత్రావు చవాన్ పంచన చేరి కాంగ్రెస్(యూ)లో కొనసాగారు. అయితే.. అధికారం కోసం కాంగ్రెస్(యూ) నుంచి విడిపోయి.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్(సోషలిస్ట్) పార్టీని సొంతంగా ఏర్పాటు చేశాడు శరద్ పవార్. ఆపై జనతా పార్టీ, పీడబ్ల్యూపీలతో కలిసి ప్రొగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్(ప్రగతిశీల ప్రజాస్వామ్య కూటమి) లేదా పురోగామి లోక్షాహీ అగాఢి ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా 38 ఏళ్ల శరద్ పవార్ ప్రమాణ స్వీకారం చేయగా.. 1978 జులై 18 పీడీఎఫ్ ప్రభుత్వం కొలువుదీరింది. అయితే.. ఇందిరా గాంధీ తిరిగి అధికారంలోకి వచ్చాక 1980 ఫిబ్రవరి 18వ తేదీన ఆ ప్రభుత్వం రద్దు అయ్యింది. అదే ఏడాదిలో జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ తిరిగి అధికారం కైవసం చేసుకుంది. ఇదీ చదవండి: శరద్ పవార్కు షాక్ -
మాటల్లో మార్పు.. వెన్నుపోటుకి అజిత్ పవార్ రెడీనా?
పుణే: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) నేత, మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయంలో ఆసక్తికర చర్చకు దారితీశాయి. బాల్ థాక్రే విషయంలో రాజ్ థాక్రే ఎలాంటి దృష్టి పెట్టాడో.. తానూ తన బాబాయ్ శరద్ పవార్ విషయంలో అలాంటి దృష్టే సారిస్తానంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల సంగతి పక్కనపెట్టినా.. బాబాయ్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్-అబ్బాయి అజిత్ పవార్ల మధ్య అగాధం తారాస్థాయికి చేరుకుంటోందని వాళ్ల మాటల్లో మార్పుని బట్టి తెలుస్తోంది!. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృత, ఎన్సీపీ ఎంపీ అమోల్ ఖోల్హే, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రేలు తాజాగా ఒక వేదికపై చిట్చాట్లో పాల్గొన్నారు. అయితే ఆ ఇంటర్వ్యూలో రాజ్ థాక్రే మాట్లాడుతూ.. అజిత్ పవార్ బయట ఎలాగైతే తన బాబాయ్(శరద్ పవార్)ను గౌరవిస్తాడో, పార్టీలో అంతర్గతంగానూ అలాగే గౌరవించాలని సలహా ఇచ్చాడు. అయితే ఆ సలహాపై మీడియా అజిత్ పవార్ను స్పందించాలని కోరింది. దానికి ఆయన అంతే తేడాగా స్పందించారు. రాజ్ థాక్రే ఇచ్చిన సలహా గురించి తెలిసింది. తన పెద్దనాన్న అయిన బాల్ థాక్రే విషయంలో రాజ్ థాక్రే ఎలాంటి వైఖరి అవలంభించారో, ఎంతగా దృష్టిసారించారో.. తాను తన బాబాయ్ శరద్ పవార్ విషయంలో అలాంటి దృష్టిసారిస్తానంటూ వ్యాఖ్యానించారు. బాల్ థాక్రే చిన్న సోదరుడు శ్రీకాంత్ థాక్రే తనయుడు రాజ్ థాక్రే. అయితే.. తన పెదనాన్నతో విబేధాలు రావడంతో.. 2006లో శివసేన నుంచి బయటకు వచ్చేసి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీని నెలకొల్పారు రాజ్థాక్రే. అజిత్ పవార్, రాజ్ థాక్రే వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూనే.. తన మనసులోని మాట బయటపెట్టారా?. ఎన్సీపీలో తనకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలు, కీలక నేతలతో అజిత్ పవార్ బయటకు వస్తారని, బీజేపీతో కలిసి జట్టు కడతాడంటూ గత కొంతకాలంగా మహా రాజకీయాల్లో విపరీతమైన చర్చ నడుస్తోంది. ఒకవేళ అదే గనుక జరిగితే.. తాము ప్రభుత్వ కూటమి నుంచి వైదొలుగుతామంటూ బీజేపీకి అల్టిమేటం జారీ చేసింది షిండే శివసేన వర్గం. కానీ, తాను జీవితాంతం ఎన్సీపీ, బాబాయ్ శరద్ పవార్ వెంటనే నడుస్తానని ఆ ప్రచారాన్ని అజిత్ పవార్ ఖండించారు. అయినప్పటికీ మహారాష్ట్ర రాజీకీయాల్లో రాబోయే రోజుల్లో రాజకీయ కుదుపు ఉండొచ్చని, అజిత్ పవార్ వెన్నుపోటు అస్త్రం ప్రయోగించొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పవార్ రోటీ వ్యాఖ్యల దుమారం అజిత్ పవార్ తర్వాత రాజకీయ అడుగుల గురించి చర్చ నడుస్తున్న వేళ.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారి తీశాయి. పార్టీ యూత్ వింగ్ సమావేశంలో పాల్గొన్న శరద్ పవార్ మాట్లాడుతూ.. రోటీలను సమాయానికి పెనం మీద తిప్పి వేయాలి. లేకుంటే అవి తినడానికి పనికి రాకుండా పోతాయని నాకు కొందరు చెప్పారు. అలాగే పార్టీలో కూడా సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకుంటాం అని వ్యాఖ్యానించారు. దీంతో.. బీజేపీకి మళ్లీ అజిత్ పవార్ చేరువవుతున్న కమ్రంలో ఎన్సీపీని నుంచి ఆయన్ని దూరం చేయాలని శరద్ పవార్ భావిస్తున్నారా? అనే చర్చ జోరందుకుంది. అయితే ఈ రోటీ వ్యాఖ్యలపైనా అజిత్ పవార్ స్పందించారు. పవార్ సాబ్ తన 55, 60 ఏళ్ల కెరీర్లో ఎన్నోసార్లు పార్టీని పునరుద్ధరించారు. ఎన్నో కొత్త ముఖాలు పార్టీలోకి వచఆచయి. మరెందరికో ప్రమోషన్లు లభించాయి. నాతో పాటు ఆర్ఆర్ పాటిల్, దిలీప్ వాల్సే పాటిల్, చగ్గన్ భుజ్బల్, సునీల్ తాట్కరే.. లాంటి నేతలం అలా పైకి వచ్చినవాళ్లమే. మీ వృత్తిలో కూడా రాణిస్తే ప్రమోషన్లు, ఉన్నత పదవులు ఇస్తారు కదా అని అజిత్ పవార్ మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాగే.. ఎన్సీపీలోనూ కొత్త వాళ్లు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా రావడం సాధారణం. అదే సమయంలో పాత ముఖాలను పక్కనపెట్టడమూ సాధారణమే అని వ్యాఖ్యానించారాయన. షిండే వర్గం స్పందన.. అయితే.. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గం ‘పవార్ రోటీ’ కామెంట్లపై స్పందించింది. అజిత్ పవార్ను పక్కనపెట్టే క్రమంలోనే శరద్ పవార్ ఆ వ్యాఖ్యలు చేశాడన్నది స్పష్టంగా తెలుస్తోందని వ్యాఖ్యానించింది. ఇదీ చదవండి: మోదీపై ఖర్గే వ్యాఖ్యలు.. తీవ్ర దుమారం -
ఎమ్మెల్యేలకు దేవేంద్ర ఫడ్నవీస్ తీపి కబురు
సాక్షి, ముంబై: మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందోనని కళ్లలో వత్తులేసుకుని ఎదురుచూస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శుభవార్త ఆందించారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని నాగ్పూర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఫడ్నవీస్ ప్రకటించారు. త్వరలో అసెంబ్లీ కార్యకలాపాల నిర్వాహణ కమిటీ ముహూర్తం ఖరారుచేసి తేదీ ప్రకటిస్తుందని ఆయన అన్నారు. దీంతో మంత్రి పదవులు ఆశిస్తున్న ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే వర్గం, ఫడ్నవీస్ వర్గం ఎమ్మెల్యేలలో ఆనందం వెల్లివిరిసింది. ముఖ్యంగా గత మూడు నెలలుగా అసంతృప్తితో బీజేపీ ప్రభుత్వంలో కొనసాగుతున్న శిందే వర్గం ఎమ్మెల్యేల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే కరోనా మహమ్మారి కారణంగా నాగ్పూర్లో జరగాల్సిన శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ముంబైలో చాలా తక్కువ రోజులు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈసారి నాగ్పూర్లో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు రెండు వారాలపాటు కచ్చితంగా నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఒకవేళ ఎమ్మెల్యేలకు అభ్యంతరం లేకుంటే నూతన సంవత్సర వేడుకలు నాగ్పూర్లో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ఉద్ధవ్తో కలవం.. రాజ్ ఠాక్రే సత్సంబంధాలు ఇదిలాఉండగా భవిష్యత్తులో ఉద్ధవ్ ఠాక్రేతో చేతులు కలిపే సమస్యే లేదని విలేకరులడిగిన ఓ ప్రశ్నకు ఫడ్నవీస్ సమాధానమిస్తూ స్పష్టం చేశారు. ఉద్ధవ్ తన మనసుకు చాలా బాధ కల్గించారని, ఆయనతో ఇకపై చేతులు కలిపే ప్రసక్తేలేదని అన్నారు. ఎమ్మెన్నెస్తో పొత్తు పెట్టుకుంటారా? అని విలేకరులడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ పార్టీలు వేరైన అనేక ఏళ్లుగా రాజ్ ఠాక్రేతో తమకు సత్సంబంధాలున్నాయి. ఆయన తనకు మంచి మిత్రుడని, రాజకీయంగా కాకపోయిన మంచి మిత్రులుగా కలిసే ఉంటామని ఫడ్నవీస్ వెల్లడించారు. మూడునెలలుగా పెండింగ్లోనూ.. ఏక్నాథ్ శిందే, దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి కొత్తగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన నెల రోజులకు మంత్రి వర్గ విస్తరణ జరిగింది. మొదటి దశ మంత్రివర్గ విస్తరణ జరిగి దాదాపు మూడు నెలలు కావస్తోంది. అయినప్పటికీ రెండో దశ విస్తరణకు ఇంకా ముహూర్తం లభించకపోవడంపై ఎమ్మెల్యేలలో అసంతృప్తి నెలకొంది. ముఖ్యంగా శిందే వర్గం ఎమ్మెల్యేలలో అసంతృప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. దీంతో వారిని సంతృప్తి పరిచేందుకు త్వరలో రెండో దశ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అప్పట్లో ప్రకటించారు. కాని ఇంతవరకు దాని ఊసు ఎత్తడం లేదు. మహిళలకు దక్కని ప్రాధాన్యం అప్పట్లో ఏక్నాథ్ శిందే తిరుగుబాటుతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం రద్దయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు నెల రోజులకు మొదటి దశ మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇందులో శిందే, ఫడ్నవీస్ వర్గానికి చెందిన తొమ్మిది మంది చొప్పున ఇలా 18 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మిగతావారికి ఆవకాశం దొరక్కపోవడంతో కొందరు ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. అంతేగాకుండా ఈ మంత్రివర్గ విస్తరణలో ఒక్క మహిళకు కూడా ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఇటు మహిళా వర్గం నుంచి, అటు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవల్సి వచ్చింది. దీంతో రెండో దశ మంత్రివర్గ విస్తరణ త్వరలో ఉంటుందని అందులో మహిళలకు చోటు కల్పిస్తామని అప్పట్లో అందరినీ బుజ్జగించే ప్రయత్నం జరిగింది. రోజురోజుకు పెరుగుతున్న అసంతృప్తి ముఖ్యంగా అప్పట్లో ఏక్నాథ్ శిందేతోపాటు శివసేన నుంచి బయటపడిన ఎమ్మెల్యేలు కొత్త ప్రభుత్వంలోని మంత్రివర్గంలో చోటు లభిస్తుందని ఎంతో ఆశపడ్డారు. కానీ ఆశ నిరాశకు గురిచేసింది. శిందే వర్గం ఎమ్మెల్యేలలో నెలకొన్న అసంతృప్తి రోజురోజుకు తీవ్రరూపం దాల్చసాగింది. ఫలితంగా శిందేపై తిరుగుబాటుచేసి సొంత గూటిలోకి (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) చేరే ప్రమాదం ఏర్పడింది. ఒకవేళ అదే జరిగితే బీజేపీ ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకోవడం ఖాయం. ఆ పరిస్ధితి రాకముందే శిందే, ఫడ్నవీస్ జాగ్రత్త తీసుకున్నారు. చివరకు శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ చేపడతామని ఫడ్నవీస్ ప్రకటించి ఈ అంశానికితెరదించారు. (క్లిక్ చేయండి: మరో ‘మహా’కూటమి?.. ఉద్ధవ్కు చెక్ పెట్టేందుకు పావులు) -
మహారాష్ట్రలో మరో ‘మహా’కూటమి?.. ఉద్ధవ్కు చెక్ పెట్టేందుకు పావులు
సాక్షి ముంబై: శివాజీపార్క్ సాక్షిగా మరో మహాకూటమి అవిర్భవించే అవకాశాలు కన్పిస్తున్నాయి. మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎమ్మెన్నెస్) దీపావళిని పురస్కరించుకుని శివాజీపార్క్లో శుక్రవారం రాత్రి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్లు హాజరయ్యారు. దీంతో రాబోయే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతోపాటు ఇతర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో శిందే వర్గం, బీజేపీ, ఎమ్మెన్నెస్ల మహాకూటమి ఏర్పడే అవకాశాలున్నాయన్న రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా గణేశ్ ఉత్సవాల సందర్భంగా రాజ్ ఠాక్రే కూడా వారి ఇంటికి వెళ్లి గణేశుడిని దర్శించుకోవడం ఆ సందర్భంగా బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను బట్టి.. రాబోయే రాష్ట్రంలో కొత్తగా మహాకూటమికి శివాజీపార్క్లో బీజం పడిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏక్నాథ్ శిందేతోపాటు 40 మంది శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటు అనంతరం ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయాలు తారుమారైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవికి ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేయగా మరోవైపు బీజేపీ మద్దతులో ఏక్నాథ్ శిందే ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఈ రాజకీయ పరిణామాల అనంతరం రాష్ట్ర రాజకీయాలలో ఒకరకమైన ఉత్పాతం సంభవించదని చెప్పొచ్చు. అనంతరం ఎన్నికల కమిషన్ శివసేన పార్టీ, చిహ్నాన్ని రెండింటినీ తాత్కాలికంగా సీజ్ చేయడం ఆ తర్వాత ఉద్దవ్ఠాక్రేకు శివసేన ఉద్దవ్ బాలాసాహెబ్ ఠాక్రే పారీ్టగా, ఏక్నాథ్ శిందే వర్గానికి బాలాసాహెబాంచి శివసేన పార్టీగా ఆమోదం తెలిపింది. దీంతోపాటు ఉద్దవ్ ఠాక్రే వర్గానికి మండుతున్న కాగడా (మశాల్), శిందే వర్గానికి కత్తులు డాలు గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. దీనిపైనే పోటీ పడనున్నాయి. అయితే రాబోయే బీఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా ఉద్దవ్ ఠాక్రే వర్గాన్ని గద్దె దింపాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ, శిందే వర్గం నేతలు రాజ్ ఠాక్రేతో పొత్తు కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. చదవండి: బెంగాల్ను విడదీసేందుకు బీజేపీ కుట్రలు.. టీఎంసీ ఎంపీ ఫైర్ ఈ విషయంపై పలుమార్లు బీజేపీ నాయకులు కూడా పేర్కొన్నారు. ఇలాంటి నేపథ్యంలో రాజ్ ఠాక్రే ఆహా్వనం మేరకు ఏక్నాథ్ శిందే, దేవేంద్ర ఫడ్నవీస్లు ఎమ్మెన్నెస్ దీపోత్సవానికి హాజరుకావడంతో పలు రకాల చర్చలకు ఊతం వచ్చేలా చేసింది. ముఖ్యంగా శివాజీపార్క్లో జరిగిన ఎమ్మెన్నెస్ దీపోత్సవ కార్యక్రమంలో శిందే, బీజేపీ, ఎమ్మెన్నెస్ల మహాకూటమికి బీజం పడిందన్న వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై మాత్రం అధికారికంగా ఎవరూ వెల్లడించడం లేదు. ఎప్పట్నుంచో కలవాలనుకున్నాను:సీఎం ఏక్నాథ్ శిందే ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రేను ఎప్పట్నుంచో కలవాలని ఉన్నప్పటికీ రాజకీయాల్లో తీరికలేని పరిస్థితుల దృష్ట్యా ఇప్పటివరకు కలవలేకపోయానని ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే పేర్కొన్నారు. ముఖ్యంగా గత పదేళ్లుగా ఎమ్మెన్నెస్ దీపోత్సవాలను నిర్వహిస్తోంది. గత రెండేళ్లు కరోనా మహమ్మారి కారణంగా అనేక నిర్బంధాలున్నాయి. అయితే ఈసారి మాత్రం మహమ్మారి తగ్గిపోవడంతో గణేశ్ ఉత్సవాలు, దసరా నవరాత్రోత్సవాలతోపాటు దీపావళి ఉత్సవాలను కూడా ప్రజలు ఆనందంగా జరుపుకుంటున్నారు. గతంలో మనసులో కలవాలన్న కోరిక ఉన్నప్పటికీ కలువలేకపోయాను. కానీ ఇప్పుడు దీపోత్సవం సందర్భంగా ఇలా కలిసేందుకు అవకాశం లభించిందన్నారు. -
సొంత బలంతోనే బరిలోకి.. అక్కడ మాత్రం పోటీ చేయం
సాక్షి, ముంబై: స్ధానిక సంస్ధల ఎన్నికల్లో సొంత బలంపై పోటీ చేసేందుకు సన్నద్ధంగా ఉండాలని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న స్ధానిక సంస్ధల ఎన్నికలపై చర్చించేందుకు బాంద్రాలోని రంగ్శారద సభా గృహంలో ఎమ్మెన్నెస్ పదాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్ ఠాక్రే పదాధికారులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తనకు పూర్తి నమ్మకం ఉంది. అధికారం అంచుల వరకు వెళతాం, కానీ మీ ఆలోచన, విధి విధానాలు దృఢంగా ఉంచుకోవాలని సూచించారు. ఒకవేళ అధికారం మనకే దక్కినా పదవి కోసం కక్కుర్తిపడి కుర్చీలో మాత్రం తను కూర్చోనని ఉద్ధవ్ ఠాక్రే పేరు ఉచ్చరించకుండా పరోక్షంగా చురకలంటించారు. ప్రత్యామ్నాయంగా ఎమ్మెన్నెస్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు కింది స్ధాయికి దిగజారి పోతున్నాయి. సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకుని ఎమ్మెన్నెస్పై తప్పుడు సందేశాలు అప్లోడ్ చేస్తున్నారు. ఎమ్మెన్నెస్ నుంచి అనేక మంది పదాధికారులు బయటపడతారని, పార్టీకి ఇక నూకలు చెల్లాయని ఇలా రకరకాల సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిని నమ్మవద్దని, సాధ్యమైనంత వరకు వాటికి దూరంగానే ఉండాలని సూచించారు. రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్న తాజా పరిస్ధితిపై ప్రజలు విసిగెత్తిపోయారు. ఇక ఎమ్మెన్నెస్ను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటారని ఉద్ఘాటించారు. మైండ్ను సెట్ చేసుకోవాలి పార్టీని పటిష్టం చేయడానికి మీ మైండ్ను సెట్ చేసుకోవాలని సలహా ఇచ్చారు. అందుకు పార్టీ కార్యకర్తలందరూ ఏకతాటిపైకి వచ్చి పనులు వేగవంతం చేయాలని సూచించారు. బీఎంసీ ఎన్నికల్లో కచ్చితంగా భారీ మెజారిటీతో విజయం సాధించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేస్తామని, ఎవరితోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఇక్కడ సఫలీకృతమైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సునాయాసనంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెలుపించుకోవచ్చని అన్నారు. ఆ తరువాత లోక్సభ ఎన్నికల్లో కూడా సత్తాచాటవచ్చని దీమా వ్యక్తం చేశారు. అందుకు ఇప్పటి నుంచే ప్రజల దగ్గరకు వెళ్లాలి, దీపావళికి ఇంటి గుమ్మాల ముందు ఎమ్మెన్నెస్ కందిళ్లు (చుక్కలు) వెలగాలని పిలుపునిచ్చారు. వాడివేడిగా రాజకీయ వాతావరణం ప్రస్తుతం రాజకీయ వాతావరణం వాడివేడిగా ఉంది. శివసేన పేరు, విల్లు–బాణం గుర్తుపై ఎన్నికల సంఘం నిషేధం విధించిన తరువాత సభలు, సమావేశాల్లో, సోషల్ మీడియాలో ఎవరు, ఎలాంటి కామెంట్లు చేయవద్దన్నారు. రమేశ్ లట్కే మృతితో ఖాళీ అయిన తూర్పు అంధేరీ అసెంబ్లీ నియోజక వర్గంలో ఎమ్మెన్నెస్ నుంచి ఎవరూ పోటీ చేయడం లేదన్నారు. ఎవరైనా కార్పొరేటర్గానీ, ఎమ్మెల్యేగానీ దురదృష్టవశాత్తు చనిపోతే అక్కడ జరిగే ఉప ఎన్నికలో ఎమ్మెన్నెస్ పోటీ చేయదని స్పష్టం చేశారు. (క్లిక్: అంధేరీలో ఆమె చుట్టే తిరుగుతున్న రాజకీయం.. ఇంతకీ ఎవరామె!) -
శిండే, ఠాక్రే వివాదంలో జోక్యం వద్దు..రాజ్ ఠాక్రే ఆదేశం
సాక్షి, ముంబై: ఉద్ధవ్ ఠాక్రే, ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే మధ్య జరుగుతున్న రాజకీయ వివాదంలో జోక్యం చేసుకోవద్దని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే పార్టీ పదాధికారులకు, శ్రేణులకు ట్విట్టర్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో స్ధానికంగా జరిగే సభలు, సమావేశాల్లో ఎలాంటి వివాదాస్పద ప్రసంగాలు చేయవద్దని, సోషల్ మీడియాలో కూడా కామెంట్లు చేసిన క్లిప్పింగులు, రాతలుగానీ పెట్టవద్దని సూచించారు. ఇరువురు మధ్య నెలకొన్న వివాదం సద్దుమణిగాక సమయం చూసుకుని తానే స్వయంగా అభిప్రాయాలను వెల్లడిస్తానని పదాధికారులకు, కార్యకర్తలకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయాలు వాడీవేడిగా ఉన్నాయి. శివసేన ఎవరిదనే విషయం తాజాగా ఉండగానే కొత్త వివాదం తెరమీదకు వచ్చింది. తదుపరి ఆదేశాలు జారీ అయ్యేంత వరకు శివసేన పేరు, విల్లు–బాణం గుర్తును వినియోగించడంపై ఎన్నికల సంఘం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో శివసేన తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. ఫలితంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇలాంటి సమయంలో మీరు జోక్యం చేసుకుంటే పరిస్ధితి మరో విధంగా మారుతుందని రాజ్ అన్నారు. గతంలో ఎమ్మెన్నెస్ నేత సందీప్ దేశ్పాండే సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వ్యాఖ్యలు, సందేశాలు దుమారం లేపాయి. దీంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఎమ్మెన్నెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇది కొద్దిరోజుల వరకు సాగింది. గత అనుభవం, తాజా పరిస్ధితులను దృష్టిలో ఉంచుకుని ఈ వివాదంలో ఎవరూ మాట్లాడవద్దని, రాయవద్దని రాజ్ హెచ్చరించారు. -
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం.. వారి భేటీ అందుకేనా?
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే సోమవారం ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధికార నివాసమైన సాగర్ బంగ్లాలో భేటీ అయ్యారు. అకస్మాత్తుగా జరిగిన ఇరువురి భేటీవల్ల రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తావిచ్చినట్లయింది. త్వరలో ముంబై, థానే, పుణే, నాసిక్ తదితర ప్రధాన కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్ ఠాక్రే ఫడ్నవీస్తో భేటీ కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. 2019 అక్టోబరులో ముఖ్యమంత్రి పీఠంపై శివసేన, బీజేపీ మధ్య నెలకొన్న వివాదం చివరకు తెగతెంపులు చేసుకునే వరకు దారి తీసిన విషయం తెలిసిందే. శివసేనతో తెగతెంపులు చేసుకున్న తరువాత అప్పటి నుంచి బీజేపీ, ఎమ్మెన్నెస్ల మధ్య సాన్నిహిత్యం కొంతమేర పెరిగిపోయింది. ముఖ్యంగా ఎమ్మెన్నెస్కు ముంబై, థానే, నాసిక్, పుణే కార్పొరేషన్లలో మంచి పట్టు ఉంది. దీంతో బీజేపీ, ఎమ్మెన్నెస్ మధ్య పొత్తు కుదురుతుండవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శివసేనకు చెందిన ఏక్నాథ్ శిందే వర్గం దేవేంద్ర ఫడ్నవీస్తో ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెన్నెస్ మద్దతు కూడా లభిస్తే ఆ నాలుగు కార్పొరేషన్లలో విజయం సులభం కానుంది. దీంతో బీజేపీ కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీకి దగ్గరవుతున్న ఎమ్మెన్నెస్ ఇదిలాఉండగా బీజేపీ శివసేనతో తెగతెంపులు చేసుకున్న తరువాత దేవేంద్ర ఫడ్నవీస్, రాజ్ ఠాక్రే మధ్య సంబంధాలు కొంత బలపడ్డట్లు తెలుస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రాజ్ ఠాక్రే ఓ లేఖ రాశారు. అందులో ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసినందుకు ఫడ్నవీస్ను ప్రశంసించారు. అనంతరం రాజ్ ఠాక్రే నివాసమైన శివ్ తీర్ధ్ బంగ్లాకు వెళ్లి ఫడ్నవీస్తో భేటీ అయ్యారు. అదేవిధంగా రాజ్ ఠాక్రే మసీదులపై అక్రమంగా ఏర్పాటు చేసిన లౌడ్స్పీకర్లకు వ్యతిరేకంగా లేవనెత్తిన ఆందోళనకు బీజేపీ నుంచి ప్రశంసల జల్లులు కురిశాయి. అప్పుడే హిందుత్వ నినాదంపై బీజేపీ, ఎమ్మెన్నెస్ ఒక్కటవుతుండవచ్చని వార్తలు గుప్పుమన్నాయి. అప్పటి నుంచి ఇరుపార్టీల మధ్య రోజురోజుకు పెరుగుతున్న సాన్నిహిత్యం, ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం రాజ్ ఠాక్రే ఫడ్నవీస్తో భేటీకావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సోమవారం జరిగిన భేటీ మర్యాదపూర్వకంగా జరిగిందా...లేక రాజకీయ పరంగా జరిగిందా.. అనేది త్వరలో బయటపడనుంది. చదవండి: (చిన్న పార్టీలకు అధికారం దక్కకుండా చేయడమే బీజేపీ ఎజెండా) ఎన్నికలకు సిద్ధమవుతున్న అన్ని పార్టీలు త్వరలో ముంబై, థానే సహా పుణే, పింప్రి–చించ్వడ్, ఉల్లాస్నగర్, భివండీ, పన్వేల్, మీరా–భాయందర్, షోలాపూర్, నాసిక్, మాలేగావ్, పర్భణీ, నాందేడ్, లాతూర్, అమరావతి, అకోలా, నాగ్పూర్, చంద్రాపూర్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఓబీసీ రిజర్వేషన్ కారణంగా తరుచూ ఈ ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. కాని ఈ ఎన్నికల్లో తమ బలం, సత్తా ఏంటో నిరూపించుకునేందుకు అన్ని పార్టీలు నడుం బిగించాయి. ఇటీవల ఏక్నాథ్ శిందే తిరుగుబాటుతో మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం కుప్పకూలిన తరువాత ఎన్నికలు జరగడం ఇదే ప్రథమం. దీంతో అధికార పార్టీతో పాటు, ప్రతిక్షాలు కూడా ఈ ఎన్నికలను ఒక సవాలుగా తీసుకుంటున్నాయి. ముఖ్యంగా గత ఐదు దశాబ్దాలకుపైగా ఒక్కటిగా ఉన్న శివసేన పార్టీ ఇప్పుడు రెండుగా చీలిపోయింది. దీంతో ఈ ఎన్నికల్లో ఏలాంటి అద్భుతం జరుగుతుంది..? ఫలితాలు ఎలా వస్తాయనే దానిపై యావత్ రాష్ట్ర ప్రజల దృష్టి ఇటువైపు ఉంది. -
ఒకేఒక్క ఎమ్మెల్యేతో జాక్పాట్.. కేబినెట్లో చోటు!
ముంబై: మహారాష్ట్రలో శివ సేన చీలిక తర్వాత.. రెబల్ వర్గంతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఇప్పుడు మంత్రివర్గ కూర్పుపై దృష్టిసారించింది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలూ ఉన్నందునా.. రాజకీయ స్థిరత్వం కోసం పావులు కదుపుతోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రేను ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కలిశారు. దాదర్(మధ్య ముంబై)లోని థాక్రే నివాసం ‘శివతీర్థ’కు స్వయంగా వెళ్లిన ఫడ్నవీస్.. గంటన్నరకు పైనే మంతనాలు జరిపారు. రాజ్థాక్రేకు గత నెలలో సర్జరీ జరిగింది. అలాగే షిండే వర్గంతో పొత్తు సమయంలో అనూహ్యంగా ఉపముఖ్యమంత్రి పదవికి సుముఖత వ్యక్తం చేశారు ఫడ్నవీస్. ఆ సమయంలో ఫడ్నవీస్ త్యాగాన్ని కొనియాడాడు రాజ్ థాక్రే. ఈ నేపథ్యంలోనే మర్యాదపూర్వకంగా కలిసినట్లు ప్రచారం జరిగింది. అయితే.. మొదటి నుంచి ఎంఎన్ఎస్.. బీజేపీకి మద్దతుదారు పార్టీనే. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో, రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ప్రత్యక్ష మద్దతు ప్రకటించింది ఎంఎన్ఎస్. అలాగే త్వరలో బీఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంకోవైపు మంత్రి వర్గ కూర్పు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రాజకీయపరమైన చర్చ ఇద్దరి మధ్య జరిగినట్లు తెలుస్తోంది. కేబినెట్లో చోటు! మహారాష్ట్రలో బీజేపీ రాజకీయ స్థిరత్వం కోసం ప్రయత్నిస్తోంది. మరో రెండున్నరేళ్ల పాటు అధికారం కొనసాగేందుకు అవసరమైన మద్దతు కూడగడుతోంది. ఈ క్రమంలో షిండే వర్గంతో పాటు చిన్న చిన్న పార్టీలను కూడదీసుకుని ముందుకు వెళ్లాలనుకుంటోంది. గతంలోనూ.. ఇప్పుడూ ఎంఎన్ఎస్ మహారాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంది. ఇప్పుడు ఉన్నది ఒక్క సీటే అయినా.. కేబినెట్లో స్థానం ద్వారా మరింత మచ్చిక చేసుకోవాలని బీజేపీ-షిండే వర్గం భావిస్తోంది. ఎంఎన్ఎస్కు ఉన్న ఏకైక ఎమ్మెల్యే ప్రమోద్ రతన్ పాటిల్. కల్యాణ్ రూరల్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2010లో ఎంఎన్ఎస్ పార్టీ స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో 29 సీట్లు గెలవడానికి ఈయనే మూలకారణం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ ఆయనకు పట్టుంది. అందుకే ప్రమోద్కు కేబినెట్ బెర్త్ ఆఫర్ చేస్తోంది బీజేపీ. అయితే.. ఇదికాకుండా మరో ప్రతిపాదన సైతం రాజ్ థాక్రే ముందు ఉంచింది. రాజ్ థాక్రే తనయుడు అమిత్ థాక్రేకు షిండే కేబినెట్లో ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అమిత్ చట్టసభలో సభ్యుడిగా లేడు. ఒకవేళ కేబినెట్ హోదా గనుక ఇస్తే.. ఎమ్మెల్యేగా లేదంటే ఎమ్మెల్సీగా తప్పకుండా గెలవాలి. దీంతో బీజేపీ ఆఫర్పై రాజ్ థాక్రే పార్టీ వర్గంతో చర్చిస్తున్నట్లు సమాచారం. -
ప్రియమైన ఉపముఖ్యమంత్రి గారూ.. మీరు చాలా గ్రేట్!
సాక్షి,ముంబై: ఒకసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి చేపట్టి కూడా ఇప్పుడ ఉపముఖ్యమంత్రి పదవిని పెద్దమనసుతో అంగీకరించిన దేవేంద్ర ఫడ్నవీస్ను మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే అభినందించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఫడ్నవీస్కు లేఖ రాశారు. గతంలో ముఖ్యమంత్రిగా కొనసాగినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పదవిని స్వీకరించి అందరికీ ఆదర్శంగా నిలిచారని ఫడ్నవీస్ను కొనియాడారు. ఎంత ఉన్నత పదవుల్లో ఉన్నవారైనా పార్టీ అధిష్టానం జారీ చేసిన ఆదేశాలను శిరసావహించాల్సిందేనని, ఈ విషయంలో ఫడ్నవీస్ ఏ మాత్రం భేషజాలు ప్రదర్శించకుండా అధిష్టానం ఆదేశాలను పాటించి మంచి వ్యక్తిత్వాన్ని చాటుకున్నారని అభినందించారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి సమర్థవంతమైన పాలన అందించారని, ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎంతో కృషి చేశారని ఈ విషయంలో మీరు నిజంగా ప్రశంసనీయులని కొనియాడారు. ఇప్పుడు మీకు లభించింది ప్రమోషనా లేక డీమోషనా అనేది ముఖ్యం కాదని, బాణాన్ని వదలాలంటే దారాన్ని గట్టిగా వెనక్కి లాగాలని, అప్పుడే ఆ బాణం ముందుకు దూసుకుపోతుందన్నారు. దారం వెనక్కి వెళ్లినంతమాత్రనా దాని విలువ తగ్గినట్లు కాదని ఉదహరించారు. ‘‘మీ కర్తవ్యాన్ని మీరు నెరవేర్చారని, ప్రజలకు సేవ చేయడానికి మీకు మరోసారి అవకాశం లభించిందని, మీకు ఆయురారోగ్యాలను, శక్తిని ఆ జగదాంబ మాత ప్రసాదించాలని కోరుకుంటున్నా’’నని లేఖలో పేర్కొన్నారు. -
కర్మ అనుభవించక తప్పదు.. ఉద్ధవ్ రాజీనామాపై రాజ్ఠాక్రే స్పందన
సాక్షి, ముంబై: నాటకీయ పరిణామాల మధ్య శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాత ఈ విషయాన్ని భాగోద్వేగంతో బుధవారం రాత్రి ప్రకటించారు. దీనిపై ఇటు మహావికాస్ ఆఘాడిలో కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు, సొంత పార్టీ శివసేన నాయకులు, సంజయ్ రావుత్, ఇతర పార్టీల పదాధికారుల నుంచి రకరకాల స్పందనలు వచ్చాయి. కానీ ఉద్ధవ్ సోదరుడు, ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే ఎలా స్పందిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాత్రి రాజ్ ఠాక్రే నుంచి ఉద్ధవ్ను ఓదార్చడం, బాధ, ఆవేదన, సానుభూతిలాంటి ఎలాంటి స్పందనలు రాలేదు. ఒకవేళ రాజ్ ఠాక్రే వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటాయన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చివరకు ఉద్ధవ్ రాజీనామా చేసిన 15 గంటల తరువాత అంటే.. గురువారం ఉదయం ఎట్టకేలకు రాజ్ ట్విటర్లో స్పందించారు. అందులో ఉద్దవ్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. కాని పరోక్షంగా వ్యాఖ్యలు మాత్రం ఆయనపై చేశారు. ‘ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు, అధికారం చేతిలో ఉంది కదాని విర్రవీగితే పరిస్ధితులు ఇలాగే ఉంటాయి’ అని చురకలంటించారు. మసీదులపై అక్రమంగా ఏర్పాటు చేసిన లౌడ్స్పీకర్లను తొలగించాలని అప్పట్లో రాజ్ చేసిన ప్రకటన చర్చల్లోకి వచ్చింది. చదవండి: నాకు చేసినట్లు ముంబైకి ద్రోహం చేయకండి: షిండే ప్రభుత్వానికి ఉద్దవ్ వార్నింగ్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న లౌడ్స్పీకర్లను తొలగించాలని ఆందోళన చేస్తున్న, మసీదుల ఎదుట హనుమాన్ చాలీసా వినిపిస్తున్న ఎమ్మెన్నెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై రాజ్ ఠాక్రే ఆఘాడి ప్రభుత్వంపై ఘాటుగా వ్యాఖ్యలు చేస్తూ ముఖ్యమంత్రి ఉద్ధవ్కు ఒక లేఖ రాశారు. అందులో నేను మీకు ఒక్కటే చెప్పదల్చుకున్నాను. మా సహనాన్ని పరీక్షించవద్దు, అధికారం ఇవ్వాళ ఉంటుంది. రేపు పోతుంది. అధికారాన్ని పుట్టుకతోనే అమ్మ కడుపులోంచి ఎవరు తెచ్చుకోలేదు. ఉద్ధవ్ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని లేఖలో పేర్కొన్నారు. దాదాపు నెలన్నర కిందట రాసిన ఆ లేఖను గురువారం మళ్లీ ట్విటర్లో పెట్టారు. అప్పట్లో ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. -
మహా పాలిటిక్స్లో ట్విస్ట్.. రాజ్ థాక్రేతో టచ్లో ఏక్నాథ్ షిండే
మహారాష్ట్రలో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. పొలిటికల్ ఇష్యూ చివరకు సుప్రీంకోర్టును తాకింది. సీఎం ఉద్ధవ్ థాక్రే వర్గం, శివసేన తిరుగుబాటు టీమ్ ఏక్నాథ్ షిండే మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు.. డిప్యూటీ స్పీకర్ అనర్హతను సవాల్ చేస్తూ షిండే వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. వారి పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర పాలిటిక్స్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేవ(ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాక్రే తెర మీదకు వచ్చారు. సోమవారం ఉదయం రాజ్థాక్రేకు ఏక్నాథ్ షిండే ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో నెలకొన్ని రాజకీయ పరిస్థితులపై చర్చించారు. శివసేన నేతలు ప్రవర్తిస్తున్న తీరు, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి షిండే.. రాజ్ ఠాక్రేను అడిగి తెలుసుకున్నారు. దీంతో వీరి మధ్య సంభాషణ ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: మీకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి.. రెబల్స్కు ఆధిత్య థాక్రే వార్నింగ్ -
లౌడ్స్పీకర్ల వివాదం..చంపేస్తామని బెదిరింపులు.. రాజ్ ఠాక్రేకు భద్రత పెంపు
ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రేకు బెదిరింపు లేఖ వచ్చిన నేపథ్యంలో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. రాజ్ ఠాక్రేను హతమారుస్తామని రెం డు రోజుల కిందట బెదిరింపు లేఖ వచ్చిన విష యం తెలిసిందే. దీంతో ఆ పార్టీ సీనియర్ నేత బాల నాంద్గావ్కర్ బుధవారం హోంమంత్రి దిలీప్ వల్సే పాటిల్తో భేటీ అయి ఈ విషయా న్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వాస్తవా లు ఆరా తీసిన మహావికాస్ ఆఘాడి ప్రభు త్వం భద్రత పెంచుతున్నట్లు శుక్రవారం ప్రక టించింది. ప్రస్తుతం రాజ్ ఠాక్రేకు వై–ప్లస్ భ ద్రతా ఉంది. బెదిరింపు లేఖ వచ్చిన తరువాత ప్రభుత్వం ఈ భద్రతను ఇలాగే కొనసాగిస్తూ అదనంగా పోలీసుల సంఖ్య పెంచింది. ఇందు లో అదనంగా ఒక పోలీసు అధికారి, కానిస్టేబుల్ ఉన్నారు. బెదిరింపు లేఖ హిందీలో ఉన్నప్పటకీ అందులో వాడిన పదాలు ఎక్కువ శాతం ఉర్దూలో ఉన్నాయి. దీంతో రాజ్కు ఏదైనా హాని జరిగితే మహారాష్ట్ర తగలబడకుండా ఉండదని నాంద్గావ్కర్ హెచ్చరించారు. లౌడ్స్పీకర్ల వివాదం తెరమీదకు వచ్చిన తరువాత తమకు అనేక బెదిరింపు లేఖలు వస్తున్నాయని నాంద్గావ్కర్ అన్నారు. రాజ్ ఠాక్రేను హతమారుస్తామని ఇలా బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది. లౌడ్స్పీకర్లలో నమాజ్ వినిపించడాన్ని అడ్డుకుంటున్న విధానం మానుకోవాలని, లేదంటే నిన్ను, రాజ్ ఠాక్రేను వదిలే ప్రసక్తే లేదు. కచ్చితంగా హతమారుస్తామని రాసి ఉంది. ఈ లేఖను రాజ్ ఠాక్రేకు చూపించిన తరువాత పోలీసు కమిషనర్తో భేటీ అయినట్లు ఆయన తెలిపారు. దీంతో రాజ్కు భద్రత మరింత పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చదవండి: క్యాట్ కుప్పకూలుతోంది: సుప్రీం కోర్టు సీరియస్ -
లౌడ్స్పీకర్లు తీస్తేనే.. హనుమాన్ చాలీసా ఆపేస్తాం
ముంబై: ప్రార్థనా మందిరాల్లో లౌడ్స్పీకర్ల విషయంలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) అధినేత రాజ్ ఠాక్రే తన వైఖరిని సమర్థించుకున్నారు. మసీదుల్లో లౌడ్స్పీకర్లు ఉన్నంతకాలం తమ పార్టీ కార్యకర్తలు హనుమాన్ చాలీసాను బిగ్గరగా పఠిస్తూనే ఉంటారని బుధవారం తేల్చిచెప్పారు. ముంబై పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించేవారిని స్వేచ్ఛగా వదిలేసి తమ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. తన పిలుపు తర్వాత 90 శాతం మసీదుల్లో లౌడ్స్పీకర్ల మోత ఆగిపోయిందని చెప్పారు. లౌడ్స్పీకర్లకు వ్యతిరేకంగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. మసీదుల్లో రోజుకు నాలుగైదు సార్లు లౌడ్స్పీకర్లు ఉపయోగిస్తే, తమ కార్యకర్తలు కూడా రెట్టింపు శబ్దంతో హనుమాన్ చాలీసా పఠిస్తారని పేర్కొన్నారు. ఏ ఆలయమైనా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాల్సిందేనని సూచించారు. న్యాయస్థానం అనుమతించిన శబ్ద పరిమితిని ఉల్లంఘించడానికి వీల్లేదన్నారు. ముంబైలో బుధవారం రాజ్ నివాసం వద్ద ఎంఎన్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేశారు. మాకు హిందుత్వను నేర్పొద్దు: రౌత్ లౌడ్స్పీకర్ల నిబంధనలను ఎవరూ ఉల్లంఘించడం లేదని అధికార శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. హిందుత్వ గురించి తమకు నేర్పించొద్దన్నారు. నకిలీ హిందుత్వవాదుల మాటలు నమ్మొద్దని ప్రజలను కోరారు. శివసేనకు వ్యతిరేకంగా కుతంత్రాలు సాగిస్తున్నారని పరోక్షంగా బీజేపీ, ఎంఎన్ఎస్ నేతలపై మండిపడ్డారు. ప్రజల్లో విభజన మంటలు రేపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. -
లౌడ్ స్పీకర్లపై పోరాటం ఆగదు: రాజ్ ఠాక్రే హెచ్చరికలు
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో లౌడ్ స్పీకర్ల వివాదం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మసీదుల్లో లౌడ్స్పీకర్లు తొలగించే వరకూ.. హనుమాన్ చాలీసా పఠిస్తామని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రే మరోసారి హెచ్చరించారు. భారీ సౌండ్ వచ్చే లౌడ్స్పీకర్లు తొలగించే వరకూ తమ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. 45 నుంచి 55 డెసిబుల్స్ వరకూ సుప్రీంకోర్టు అనుమతించిందని, అయితే.. ముంబైలోని 135 మసీదులు సుప్రీం ఆదేశాలను ఉల్లంఘించాయని ఆరోపించారు. వాటిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని రాజ్ఠాక్రే ప్రశ్నించారు. కాగా హనుమాన్ చాలీసా ప్లే చేస్తామని రాజ్ ఠాక్రే హెచ్చరించిన నేపథ్యంలో బుధవారం ముంబైతోపాటు దాని పరిసర ప్రాంతాల్లోని చాలా మసీదులు ఆజాన్ సమయంలో లౌడ్స్పీకర్లను బంద్ చేశాయి. మహారాష్ట్రలోని పర్భాని, ఉస్మానాబాద్, హింగోలి, జల్నాలోని కొన్ని ప్రాంతాలు, నాందేడ్, నందుర్బార్, షిర్డీ, శ్రీరాంపూర్తో సహా పలు ప్రాంతాల్లో ఆజాన్ సమయంలో లౌడ్స్పీకర్లు స్వచ్ఛందంగా తొలగించగా. మరి కొన్ని చోట్ల తక్కువ వాల్యూమ్తో ఉపయోగించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 250 నుంచి 260 మంది ఎమ్ఎన్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్ ఠాక్రే నివాసం ముందు గుమిగూడిన పలువురు కార్యకర్తలలతోపాటు పుణెలో ఎనిమిందిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కార్యకర్తల అరెస్ట్పై రాజ్ ఠాక్రే స్పందించారు. చట్టాన్ని అనుసరించే తమ పార్టీ కార్యకర్తలను నిర్బంధించి నోటీసులు జారీ చేశారని మండిపడ్డారు. చదవండి: లౌడ్స్పీకర్ల వ్యవహారంలో ముగిసిన డెడ్లైన్.. ముంబైలో హైఅలర్ట్ ఈ సమస్య కేవలం మసీదులకు సంబంధించినది మాత్రమే కాదని, అక్రమ లౌడ్స్పీకర్లతో అనేక దేవాలయాలు కూడా ఉన్నాయని అన్నారు. ఈ అంశం మతపరమైంది కాదని, సామాజిక సమస్య అని అన్నారు. అలాగే ఈ సమస్య ఒక రోజుది కాదని.. లౌడ్ స్పీకర్ల కారణంగా విద్యార్థులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ముంబైలోని 1,140 మసీదుల్లో 135 మసీదులు బుధవారం ఉదయం 6 గంటల కంటే ముందే లౌడ్ స్పీకర్లను ఉపయోగించాయని మహారాష్ట్ర హోంశాఖ పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా వ్యహరించిన సదరు 135 మసీదులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. -
ముగిసిన డెడ్లైన్.. ముంబైలో హైఅలర్ట్
ఆజాన్ వర్సెస్ హనుమాన్ చాలీసా రాజకీయం.. బెదిరింపులతో ముంబై మహానగరం అప్రమత్తం అయ్యింది. మహారాష్ట్ర నవ్నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే విధించిన డెడ్ లైన్ పూర్తి కావడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మసీద్లపై లౌడ్స్పీకర్ల నుంచి ఆజాన్ వినిపిస్తే.. ప్రతిగా హనుమాన్ చాలీసా ప్రదర్శిస్తామంటూ రాజ్ థాక్రే హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మసీద్లపై లౌడ్స్పీకర్లు తొలగించాలంటూ మే 3వ తేదీని డెడ్లైన్గా ప్రకటించాడాయన. ఆజాన్ శబ్ధ కాలుష్యానికి కారణం అవుతుందనేది ఆయన వాదన. ఈ మేరకు ఆయన విధించిన గడువు ముగియడంతో ముంబై పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఇదిలా ఉండగా.. ముంబై నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలాచోట్ల ఆజాన్ టైంలో స్పీకర్లు స్వచ్ఛందంగా బంద్ చేశారు. మసీదు ట్రస్టీలతో సమావేశాలు నిర్వహించిన పోలీసులు.. ఉదయం ప్రార్థనల సమయంలో లౌడ్ స్పీకర్లు బంద్ చేయాలనే సుప్రీం కోర్టు ఆదేశాలను వాళ్లకు వివరించారు. దీంతో కళ్యాణ్ తో పాటు చాలా ప్రాంతాల్లో లౌడ్స్పీకర్లు మూగబోయాయి. ఈ క్రమంలో ఎంఎన్ఎస్ కార్యకర్తలు మసీదుల దగ్గరకు వెళ్లి.. లౌడ్స్పీకర్లు బంద్ కావడం గమనించి అక్కడి నుంచి నిష్క్రమిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చాన్స్ తీసుకోవాలనుకోవడం లేదు. అందుకే అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంది. మరోవైపు విద్వేషపూరిత ప్రసంగంతో రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు చేశారంటూ రాజ్థాక్రేపై ఔరంగాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు నోటీసులు అందించిన పోలీసులు.. బుధవారం ఉదయం రాజ్థాక్రే ఇంటి వద్ద భారీగా మోహరించారు. థాక్రే వర్సెస్ థాక్రే మహారాష్ట్రలో స్థానిక సంస్థ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. థాక్రే కుటుంబంలో రాజకీయ వైరం లౌడ్ స్పీకర్ల వ్యవహారంతో ముదురుతోంది. అధికార పార్టీ శివసేన, ఎంఎన్ఎస్ను బీజేపీ బీ టీంగా అభివర్ణిస్తోంది. హిందుత్వ ఓటు బ్యాంక్తో సేన ఓట్లను ఎంఎన్ఎస్ ద్వారా చీల్చే యత్నం చేస్తోందంటూ బీజేపీపై మండిపడుతోంది. చదవండి: 14 ఏళ్ల కిందటి కేసు.. రాజ్థాక్రేపై నాన్ బెయిలబుల్ వారెంట్ -
లౌడ్స్పీకర్ల వివాదంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. రాజ్ ఠాక్రేపై కేసు
ముంబై: ఔరంగాబాద్లో ఆదివారం ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ఠాక్రే నిర్వహించిన బహిరంగ సభలో పోలీసులు విధించిన షరతుల్లో కొన్ని ఉల్లంఘించారనే అభియోగంపై మంగళవారం చీఫ్ రాజ్ ఠాక్రేపై కేసు నమోదైంది. రాజ్ ప్రసంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఔరంగాబాద్ పోలీసులు నియమాల ఉల్లంఘన జరిగినట్లు నివేదిక రూపొందించారు. ఆ తరువాత ముఖ్యమంత్రి, హోంమంత్రి, సంబంధత అధికారులతో జరిగిన సమావేశంలో ఆ నివేదికను ప్రవేశపెట్టారు. ఈ నివేదికపై ఆరా తీసిన తరువాత ఔరంగాబాద్లోని సిటీ చౌక్ పోలీసు స్టేషన్లో రాజ్పై కేసు నమోదు చేశారు. సభకు అనుమతిచ్చే ముందు పోలీసులు విధించిన మొత్తం 16 షరతుల్లో 12 షరతుల ఉల్లంఘన జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో రాజ్తోపాటు సభకు అనుమతివ్వాలని దరఖాస్తు చేసుకున్న రాజీవ్ జవళేకర్పై కూడా కేసు నమోదు చేశారు. ఔరంగాబాద్లో కేసు నమోదైన విషయంపై రాజ్ ఠాక్రే తనయుడు అమిత్ ఠాక్రే ఫోన్చేసి స్ధానిక ఎమ్మెన్నెస్ పదాధికారి రజీవ్ జవళేకర్తో చర్చించారు. చట్టం అందరి సమానంగా ఉండాలని, పోలీసులు సభకు అనుమతిచ్చే ముందు కేవలం 15 వేల మంది హాజరుకావాలని షరతులు విధించారని, అయితే రాజ్ ఠాక్రే రోడ్డుపై నడుస్తూ వెళుతుంటేనే 15 వేలకుపైగా జనాలు అనుసరిస్తారని, ఇలాంటి సందర్భంలో షరతులు ఉల్లంఘించారని కేసు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. మరోనేత సందీప్ దేశ్పాండే మాట్లాడుతూ తొలుత సభకు అనుమతివ్వకపోవడం, ఆ తరువాత సమయం దగ్గరపడగానే షరతులతో కూడిన అనుమతివ్వడం లాంటి సందర్భాలు గతంలో ఎదురు కాలేదన్నారు. పోలీసులపై ప్రభుత్వం కచ్చితంగా ఒత్తిడి తెచ్చిందని దీన్ని బట్టి స్పష్టమవుతోందన్నారు. కార్యకర్తలను భయపట్టేందుకే కేసులు నమోదు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కేసు నమోదు చేసిన నిందితుల జాబితాలో రాజ్ ఠాక్రే పేరు మొదటి స్ధానంలో ఉంది. ఆ తరువాత రాజీవ్ జావళేకర్, నిర్వాహకులు, ఇతర పదాధికారుల పేర్లున్నాయి. స్ధానిక సిటీ చౌక్ పోలీసు ఇన్స్పెక్టర్ అశోక్ గిరీ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: డెన్మార్క్ ప్రధాని నివాసంలో మోదీ చర్చలు.. వీడియో వైరల్ నాన్ బెయిలబుల్ వారెంట్ మరోవైపు మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరేపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. 14 ఏళ్ల కిందటి కేసులో మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కాగా రాజ్ ఠాక్రే రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణలపై 2008లో ఆయనపై ఐపీసీ సెక్షన్ 109,117 కింది కేసు నమోదు చేశారు. ఆ కేసు విచారణలో రాజ్ ఠాక్రే కోర్టుకు హాజరు కాకపోవడంతో జూన్ 8లోపు అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని సాంగ్లి జిల్లా షిరాలా ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ పేర్కొంది. అయితే 2012 కంటే ముందు నమోదైన రాజకీయ పరమైన కేసులన్నిటినీ ప్రభుత్వం రద్దు చేసిందని ఎంఎన్ఎస్ నేత ఒకరు గుర్తు చేశారు. -
ఎంఎన్ఎస్కు బీజేపీ ‘కాంట్రాక్ట్’
ముంబై: మహారాష్ట్రలో శాంతిభద్రతలకు భంగం కలిగించడానికి బీజేపీ నుంచి మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కాంట్రాక్టు తీసుకుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. ఎంఎన్ఎస్ పేరు ప్రస్తావించకుండా ఆయన ఈ ఆరోపణలు చేశారు. అయితే తమ ప్రభుత్వ హయాంలో ఎంఎన్ఎస్ ఆటలు సాగబోవని హెచ్చరించారు. ‘శాంతి సామరస్యాలకు విఘాతం కలిగించేందుకు ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీ ‘కాంట్రాక్ట్’ కుదుర్చుకున్నంత మాత్రాన రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దెబ్బతినద’ని ఉద్ఘాటించారు. మే 4వ తేదీలోపు మసీదుల నుంచి లౌడ్స్పీకర్లను తొలగించాలని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే అల్టిమేటం జారీ చేశారు. ఔరంగాబాద్లో ఆదివారం జరిగిన మహారాష్ట్ర దినోత్సవ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ‘మే 4 నుంచి మేము వినం. మీరు మీ లౌడ్ స్పీకర్లతో ఇబ్బందిని సృష్టించడం కొనసాగిస్తే, మేము హనుమాన్ చాలీసాను మసీదుల ముందు రెట్టింపు పరిమాణంలో ప్రసారం చేస్తామ’ని రాజ్ థాకరే హెచ్చరించారు. శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో రాజ్ థాకరే వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. ‘శివసేనను లక్ష్యంగా చేసుకుని మే 1న ముంబైలో బీజేపీ ‘బూస్టర్ డోస్’ ర్యాలీని ప్లాన్ చేయగా, ఔరంగాబాద్లో జరిగిన ర్యాలీలో బీజేపీ ఉంపుడుగత్తె ఎమ్ఎన్ఎస్.. శరద్ పవార్ను లక్ష్యంగా చేసుకుంద’ని ఘాటుగా వ్యాఖ్యానించింది. దీనిపై సంజయ్ రౌత్ స్పందిస్తూ.. మహా వికాస్ అఘాదీని ఎదుర్కోవడానికి కొన్ని చిన్న పార్టీలను బీజేపీ వాడుకుంటోందని అన్నారు. రాష్ట్రంలో శాంతి, సామరస్యాలకు భంగం కలిగించాలని భ్రమల్లో ఉన్నవారు.. వాస్తవంలోకి రావాలని సూచించారు. (క్లిక్: కాంగ్రెస్కు భారీ షాకిచ్చిన సీనియర్ నేతలు) -
పొలిటికల్ రీ సౌండ్
మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించాలంటూ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే చేస్తున్న డిమాండ్ దేశవ్యాప్తంగా రీ సౌండ్ ఇస్తోంది. బహిరంగ ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్ల వాడకాన్ని ఆపేయాలన్న ఆయన డిమాండ్తో క్రమంగా ఒక్కో పార్టీ గొంతు కలుపుతూ వస్తోంది. అసలు దేశంలో లౌడ్ స్పీకర్లపై ఉన్న నిబంధనలేమిటి? చట్టాలు ఏం చెబుతున్నాయి? శబ్ద కాలుష్యంతో నష్టమెంత? మసీదుల్లో ప్రార్థనల వల్ల శబ్ద కాలుష్యంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వాటిలో లౌడ్ స్పీకర్లను తొలగించాలని మహారాష్ట్రలో రాజ్ఠాక్రే నేతృత్వంలోని నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చేస్తున్న డిమాండ్ రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. బీజేపీతో పాటు వీహెచ్పీ వంటి హిందుత్వ సంస్థలు ఎంఎన్ఎస్ డిమాండ్కు మద్దతిచ్చాయి. శబ్ద కాలుష్య భూతాన్ని తరిమికొట్టాలని అవి డిమాండ్ చేస్తున్నాయి. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన ఈ వివాదాన్ని కేంద్రం కోర్టులోకి విసిరింది. లౌడ్ స్పీకర్పై కేంద్రం జాతీయ విధానం రూపొందిస్తే ఆ మేరకు నడుచుకుంటామని చెబుతోంది. ఈ నేపథ్యంలో లౌడ్ స్పీకర్ల వాడకంపై దేశంలో ఎలాంటి నిబంధనలున్నాయనే చర్చ సాగుతోంది. శబ్ద కాలుష్యమంటే? కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ప్రకారం అనవసరమైన శబ్దాలేవైనా కాలుష్యం కిందకే వస్తాయి. చెవులు చిల్లులు పడే శబ్దాలతో శరీరానికి హానికరంగా మారితే దేశ చట్టాల ప్రకారం శబ్ద కాలుష్యం కిందకే వస్తుంది. శబ్ద కాలుష్యం ఇన్నాళ్లూ వాయు కాలుష్య నియంత్రణ చట్టం (1981) పరిధిలో ఉండేది. అది ఇటీవల అతి పెద్ద సమస్యగా మారడంతో శబ్ద కాలుష్య (నియంత్రణ, కట్టడి) నిబంధనలు, 2000 రూపొందించి అమలు చేస్తున్నారు. వీటిని ఉల్లంఘిస్తే సదరు పరికరాలను జప్తు చేయడంతో పాటు రూ.10 వేల వరకు జరిమానా విధించవచ్చు. ఆరోగ్యంపై ప్రభావం శబ్ద కాలుష్యం ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావమే చూపుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 110 కోట్ల మంది యువకులు (12 నుంచి 35 మధ్య వయసువారు) భరించలేని శబ్దాల వల్ల వినికిడి సమస్యను ఎదుర్కొంటున్నారు. రాత్రిపూట శబ్దాలతో నిద్రలేమి సమస్య ఎదుర్కొంటున్న వారూ ఉన్నారు. శబ్దకాలుష్యం తలనొప్పి, రక్తపోటు వంటి సమస్యలకూ దారితీస్తుంది. అమల్లో ఉన్న నిబంధనలేమిటి? బహిరంగ ప్రదేశాల్లో ఇష్టారాజ్యంగా శబ్దాలు చేస్తామంటే, లౌడ్ స్పీకర్ల మోత మోగిస్తామంటే కుదిరే పని కాదు. దేశంలో ఎక్కడైనా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే లౌడ్ స్పీకర్లను అనుమతిస్తారు. శబ్దకాలుష్యం ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుండటంతో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వాడటానికి వీల్లేదని సుప్రీంకోర్టు 2005 అక్టోబర్ 28న తీర్పు ఇచ్చింది. సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాల్లో లౌడ్ స్పీకర్లు పెట్టాలంటే అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి. అది కూడా ఏడాదిలో 15 రోజులకి మించొద్దని సుప్రీం స్పష్టం చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
లోకల్ రైళ్లలో అందరినీ అనుమతించండి
సాక్షి, ముంబై: ముంబైకర్ల సహనం కట్టలు తెంచుకోకముందే లోకల్ రైళ్లలో సామాన్యులందరికి ప్రయాణాలకు అనుమతినివ్వాలని ప్రభుత్వాన్ని ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. సాధ్యమైనంత త్వరగా అందరికోసం లోకల్ రైళ్లు ప్రారంభిస్తే ఎంతో మంచిదని ఆ లేఖలో పేర్కొన్నారు. సాధారణ ప్రజానీకం సహనం నశించకముందే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని కోరారు. కరోనా కారణంగా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ తరువాత లోకల్ రైళ్లలో అత్యవసర విభాగాలలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే అనుమతిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పేద, సామాన్య ప్రజలు, కూలీలు, కార్మికులు, కష్టజీవులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం రూ.100–150 బస్సు చార్జీలు చెల్లించే ఆర్థిక స్థోమత లేక సతమతం అవుతున్నారు. దీంతో అనేక మంది విధులకు వెళ్లలేక కుటుంబాలు పస్తులు ఉంటున్నాయి. ప్రస్తుతం ముంబైలోని దాదాపు అన్ని కార్యాలయాలు, షాపులు, ఇతర వ్యాపార సంస్థలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. అందరికి ఇంటి నుంచి విధులు నిర్వహించే సౌకర్యం లేదు. లోకల్ రైళ్లలో అనుమతి లేకపోవడంతో శివారు ప్రాంతాల నుంచి ముంబైకి విధులకు రావాలంటే చిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే, రాష్ట్రంలో ఇంకా లాక్డౌన్ కొనసాగింపుపై రాజ్ ఠాక్రే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘లాక్డౌన్ ఇంకా ఎన్ని నెలలు అమలులో ఉంటుంది..? గత ఏడాదిన్నర నుంచి సామాన్యులు, పేదలు లోకల్ రైలు సేవలను ఉపయోగించుకోలేక పోతున్నారు. గంటల తరబడి రోడ్డు మార్గం ద్వారా ముంబైకి చేరుకుంటున్నారు. బస్సుల్లో అనుమతిస్తున్నప్పటికీ రద్దీ విపరీతంగా ఉంటోంది. బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొడుగాటి క్యూలు ఉంటున్నాయి. రద్దీవల్ల కరోనా వ్యాప్తి చెందే ప్రమాదమూ లేకపోలేదు. వారి సహనం, ఆగ్రహం కట్టలు తెంచుకోకముందే లోకల్ రైళ్లలో అనుమతించాలి’అని ఆ లేఖలో పేర్కొన్నారు. లాక్డౌన్ పొడిగింపునకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అర్ధరాహిత్యమని ఆ లేఖలో రాజ్ ఠాక్రే విమర్శించారు. ప్రభుత్వానికి లాక్డౌన్ అమలు చేయడం తప్ప ఇతర ప్రత్యామ్నాయ ఆలోచనలు రావడం లేదా అంటూ నిలదీశారు. ‘ఇదివరకే ముంబైకర్లందరి కోసం లోకల్ రైలు సేవలు ప్రారంభించాల్సి ఉంది. జాప్యం జరిగినప్పటికీ ప్రజలు ఎంతో సహనం పాటించారు. ఇక వారి ఓపిక నశించి ఉండవచ్చు’అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా వ్యవహరించని పక్షంలో ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. లోకల్ రైళ్లలో అనుమతించాలని డిమాండ్ చేస్తూ సామాన్యులు, కూలీలు, కష్టజీవులు, ఇతర ప్రయాణికులు ఆందోళనలు చేపడితే ఎమ్మెన్నెస్ వారికి మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు. అందరినీ కాకుండా కనీసం కరోనా రెండు డోసుల టీకాలు తీసుకున్న వారినైనా లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతించాలని రాజ్ ఠాక్రే ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. -
అరే చూస్తావేంటి చేరిపో!
సాక్షి, ముంబై: తరుచూ పరాజయాలతో కుంగిపోతున్న రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) పార్టీ సభ్యత్వ నమోదుకు కొత్త నినాదం అందుకుంది. ‘అరె బగ్తాయ్ కాయ్ సామీల్ వ్హా’ (అరే చూస్తావేంటి చేరిపో) అనే కొత్త నినాదంతో ముందుకొచ్చారు. ఈ ఏడాది మార్చి 9తో ఎమ్మెన్నెస్ పార్టీ ఆవిర్భవించి 15 సంవత్సరా లు పూర్తయింది. ఈ సుదీర్గ కాలంలో, అనేక రాజకీయ పరిణామాలతో పార్టీ ఇంతవరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదటిసారిగా చేపడుతున్న ఈ కార్యక్ర మానికి సోషల్ మీడియాలో యువతను ఆకుట్టకునే విధంగా ప్రకటన ఇచ్చింది అందులో ‘అరె బగ్తాయ్ కాయ్ సామీల్ వ్హా’ (అరే చూస్తావేంటి చేరిపో) అనే కొత్త పంథాతో ఎన్నికల ముందుకు వెళ్లనున్నారు. త్వరలో కార్పొరేషన్ ఎన్నికలు.. పుణే, నాసిక్, ఔరంగాబాద్, కల్యాణ్–డోంబివలి, మీరా–భాయందర్ కార్పొరేషన్ల ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ ఎన్నికలను రాజ్ఠాక్రే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. కోల్పోయిన పార్టీ పూర్వ వైభవాన్ని మళ్లీ తెచ్చేందుకు ఎంతో కృషి, పట్టుదలతో ఉన్నారు. ఇటీవలే ఆయన ఈ కార్పొరేషన్లలో విస్తృతంగా పర్యటించారు. ఆ కార్పొరేషన్ల పరిధిలోని సంబంధిత పార్టీ పదాధికారులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. అక్కడి రాజకీయ వాతావరణం, ఏ పార్టీకి ఎక్కువ పట్టు ఉంది...? తమ పార్టీకి అవకాశాలెలా ఉన్నాయి...? ఎన్నికలు జరిగితే ఫలితాలెలా ఉంటాయి...? తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు సభ్యత్వ నమోదు పథకానికి శ్రీకారం చుట్టారు. అందుకు సోషల్ మీడియా ద్వారా ప్రకటనలిస్తున్నారు. కరోనా కారణంగా నేరుగా నియోజకవర్గాల ప్రజల వరకు చేరుకోవడం కష్టతరంగా మారింది. దీంతో సోషల్ మీడియా సాయం తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెన్నెస్లో సభ్యత్వం ఎలా తీసుకోవాలో అందులో వివరాలు పెట్టారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో సాధ్యమైనంత ఎక్కువ మందిని తమ పార్టీ కార్యకర్తలుగా చేర్చుకోవాలనే ప్రయత్నం చేయనున్నారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న, పని చేస్తున్న ప్రముఖులను కూడా ఇందులో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే నెల 24వ తేదీ వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగనుంది. ఇదిలాఉండగా ఏటా పార్టీ అవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించే రాజ్ఠాక్రే ఈ సారి రద్దు చేశారు. సభలో పార్టీ పదాధికారులకు, కార్యకర్తలకు వివిధ అంశాలపై మార్గదర్శనం, పార్టీ దిశనిర్ధేశం చేస్తారు. కానీ, ఈ సారి కరోనా వైరస్ కారణంగా పార్టీ అవిర్భావ వేడుకలు నిర్వహించలేదు. అందుకు సోషల్ మీడియా ద్వారా తమ సందేశాన్ని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల చెంతకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రారంభంలో ఘనంగా.. అప్పట్లో శివసేన నుంచి బయటపడిన రాజ్ఠాక్రే సొంత పార్టీ పెట్టుకున్నారు. అన్ని వర్గాల ప్రజలను తమ పార్టీలో చేర్చుకుంటామని పేర్కొంటూ 2006 మార్చి 9వ తేదీన ఎమ్మెన్నెస్ పార్టీ స్థాపించారు. ప్రారంభంలో తిరుగులేని పార్టీగా ఎదిగిన ఎమ్మెన్నెస్ ప్రధాన పార్టీలను సైతం దెబ్బతీసింది. ఆ తరువాత జరిగిన బీఎంసీ, నాసిక్ కార్పొరేషన్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించుకుంది. కాని కాలక్రమేణా పార్టీ ప్రతిష్ట, ప్రాబల్యం దెబ్బతినసాగింది. దీంతో కార్పొరేటర్ల సంఖ్య, ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోయింది. చివరకు పార్టీలో ఒక్కరే ఎమ్మెల్యే, ఒక్కరే కార్పొరేటర్ మిగిలారు. ఇది పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో పార్టీ కోల్పోయిన ప్రతిష్ట, కార్యకర్తలు కోల్పోయిన మనోధైర్యాన్ని తిరిగి నింపేందుకు శత ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా త్వరలో ఎన్నికలు జరగనున్న కార్పొరేషన్లలో పర్యటించడం, పదాధికారులు, కార్యకర్తలతో సంప్రదించడం లాంటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు ఏకంగా సభ్యత నమోదు పథకాన్ని సోషల్ మీడియా ద్వారా చేపట్టి పార్టీలో కార్యకర్తల సంఖ్య పెంచుకోవాలని, అలాగే ప్రజలకు మరింత దగ్గరవ్వాలనే ప్రయత్నం రాజ్ ఠాక్రే చేస్తున్నారని పార్టీ అధికార వర్గాలు తెలిపాయి. చదవండి: ఊపిరి ఉన్నంతవరకు బీజేపీపై పోరు హోటళ్లు, రెస్టారెంట్లకు తీవ్ర హెచ్చరికలు -
వైన్ షాపులు తెరవండి.. ఖజానా నింపుకోండి
సాక్షి, ముంబై : లాక్డౌన్ కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న వేళ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించాలంటే మద్యం దుకాణాలను తెరవాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ఎమ్ఎన్ఎస్పీ చీఫ్ రాజ్ ఠాక్రే సలహా ఇచ్చారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా లాక్డౌన్ విధించడంతో రాష్ట్ర ఆదాయం పెద్ద ఎత్తున పడిపోయిందని, మద్యం అమ్మకాల ద్వారా దానిని పూడ్చవచ్చని సూచించారు. రాష్ట్రంలో వైన్ షాపులను తెరిస్తే రోజుకు రూ. 42 కోట్లు, నెలకు 1250 కోట్లు, ఏడాదికి రూ. 14000 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఉద్ధవ్కు రాజ్ ఠాక్రే గురువారం ఓ లేఖ రాశారు. (24 గంటల్లో 1409 పాజిటివ్ కేసులు) వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ ఎప్పటి వరకు కొనసాగుతుందో చెప్పలేమన్నారు. ఇది ఇలానే కొనసాగితే ముందుముందు రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు. లాక్డౌన్ కారణంగా ఆర్థిక వనరులన్నీ మూసుకుపోవడంతో సంక్షేమ పథకాలకు ఇబ్బందులు ఏర్పడొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఖజానాను పెంచుకోవాలంటే మద్యం అమ్మకాలకు వెసులుబాటు కల్పించాలని సీఎంకు సూచించారు. లాక్డౌన్ ఆంక్షలను కొనసాగిస్తూనే.. సామాజిక దూరం పాటిస్తూ వీటిని కొనసాగించవచ్చని పేర్కొన్నారు. వీటి ద్వారం వచ్చిన మొత్తాన్ని సంక్షేమ పథకాలు, కరోనా బాధితులకు ఉపయోగించవచ్చని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. (లాక్డౌన్ నుంచి పలు షాపులకు మినహాయింపులు) కాగా దేశ వ్యాప్తింగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రంలోని వెలుగుచూసిన విషయం తెలిసిందే. గురువారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 5,221 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యారు. ఇప్పటి వరకు 251 మంది మృత్యువాత పడ్డారు. మరోవైపు వైరస్ నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసుల సంఖ్య మాత్రం అదుపులోకి రావడంలేదు. ఇక ధారావిలాంటి మురికివాడలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం అధికారులును, ప్రభుత్వాన్ని తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. -
వారి సమాచారం అందిస్తే బహుమానం
ముంబై: దేశంలో అక్రమ చొరబాటుదారులను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం ద్వారా చొరబాటుదారులను గుర్తించి వారిని వారి స్వస్థలాలకు పంపించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన మరో అడుగు ముందుకేసి ఒక కీలక ప్రకటన చేసింది. పార్టీ అధినేత రాజ్థాక్రే ఫోటోతో ఔరంగబాద్లో కొన్ని పోస్టర్లు వెలిశాయి. మహారాష్ట్ర నవనిర్మాన్ సేన విద్యార్థి సంఘం నాయకుడు అఖిల్ చిత్రీ పేరుతో ఈ ప్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. చదవండి: ‘నా ముస్లిం సోదరులే నన్ను కాపాడారు’ ఎవరైనా సరే వారు నివాసం ఉండే పరిసర ప్రాంతాల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలసవచ్చిన వారిని గుర్తించి సమాచారం అందిస్తే రూ. 5,555 బహుమానం ఇవ్వనున్నట్లు ప్రకటనలో తెలిపారు. వివరాలు అందించిన వారి పేర్లను కూడా రహస్యంగానే ఉంచనున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ దగ్గరవుతున్నట్లు కనిపిస్తున్న ఎంఎన్ఎస్ పార్టీ ఈ ప్రకటనలు, పోస్టర్లు అతికించడం ఉత్కంఠ రేపుతోంది. కాగా ఇదివరకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ఠాక్రే ఇంటికి సమీపంలో చొరబాటు దారులున్నారని.. వారిని ప్రభుత్వం గుర్తించాలంటూ పోస్టర్లు ఏర్పాటు చేశారు. చదవండి: ‘కేజ్రీవాల్కు డబుల్ పనిష్మెంట్’ -
సీఏఏ, ఎన్నార్సీలపై నిరసనలెందుకు?
ముంబై: అక్రమంగా భారత్లో నివాసముంటున్న పాకిస్తానీయులు, బంగ్లాదేశీలను తిప్పి పంపాల్సిందేనని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే డిమాండ్ చేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరపట్టిక (ఎన్నార్సీ)లకు మద్దతుగా ఆదివారం ముంబైలో గిర్గావ్ చౌపట్టి నుంచి ఆజాద్ మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి వేలాది మంది కార్యకర్తలు హాజరయ్యారు. అనంతరం ఆజాద్ మైదానంలో ఆయన మాట్లాడుతూ.. సీఏఏ, ఎన్నార్సీలపై నిరసనలు ఎందుకు చేస్తున్నారంటూ సీఏఏ వ్యతిరేక నిరసనకారులను ప్రశ్నించారు. నిరసనలు ఇలాగే కొనసాగితే.. నిరసనలకు నిరసనలతో, రాళ్లకు రాళ్లతో, ఖడ్గాలకు ఖడ్గాలతోనే జవాబిస్తామని హెచ్చరించారు. పుట్టినప్పటి నుంచి భారత్లోనే ఉన్న ముస్లింలను ఎవరూ వెలివేయబోవడంలేదని, వారెందుకు నిరసనలు చేస్తున్నారో అర్థంకావడంలేదన్నారు. సీఏఏ, ఎన్నార్సీ నిరసనకారులు తమ బలాన్ని ఎవరికి, ఎందుకు చూపించాలనుకుంటున్నారని ప్రశ్నించారు. సీఏఏను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే నిరసనలు జరుగుతున్నాయన్నారు. చొరబాటుదారులకు ఆశ్రయం ఇవ్వడానికి భారత్ ఏమైనా ధర్మసత్రమా అని ఆయన ప్రశ్నించారు. -
‘మర్యాదగా వెళ్తారా.. గెంటెయ్యమంటారా?’
ముంబై: బంగ్లాదేశీయులు వెంటనే భారత దేశాన్ని విడిచివెళ్లిపోవాలని.. లేదంటే తామే వెళ్లగొడతామని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎమ్ఎన్ఎస్) నాయకులు బెదిరింపులకు దిగారు. ఈ మేరకు.. ‘‘బంగ్లాదేశీయులు మీరు దేశాన్ని విడిచివెళ్లిపోండి. లేదంటే ఎమ్ఎన్ఎస్ స్టైల్లో మేమే గెంటేస్తాం’’అంటూ రాయ్గఢ్ జిల్లాలో ఎమ్ఎన్ఎస్ పేరిట పోస్టర్లు వెలిశాయి. ఇందులో ఎమ్ఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే ఫొటోతో పాటు కొత్తగా రాజకీయాల్లో చేరిన ఆయన కుమారుడు అమిత్ ఫొటోను కూడా బ్యానర్లో చేర్చారు. కాగా నరేంద్ర మోదీ సర్కారు తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతు తెలుపుతున్నట్లు ఎమ్ఎన్ఎస్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అదే విధంగా మహారాష్ట్రలో శివసేన.. కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో బీజేపీతో కలిసి హిందుత్వ జెండాతో ముందుకు సాగేందుకు పార్టీ నిర్ణయించింది. ఇక పార్టీ జెండాలో సైతం పలు మార్పులు చేసింది. హిందుత్వాన్ని ప్రతిబింబించేలా జెండాను పూర్తిగా కాషాయ రంగులోకి మార్చి... మధ్యలో ఛత్రపతి శివాజీ కాలంనాటి రాజముద్రను చేర్చారు. కాగా ఎమ్ఎన్ఎస్ స్థాపించిన సమయంలో.. పార్టీ జెండాను కాషాయం, నీలం, ఆకుపచ్చ రంగులతో తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతుండగా... ఎమ్ఎన్ఎస్ ఈ విధమైన పోస్టర్లు వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా శివసేన నుంచి బయటికొచ్చిన రాజ్ ఠాక్రే 2006లో ఎమ్ఎన్ఎస్ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. (శివసేనకు చెక్.. బీజేపీతో కలిసిన రాజ్ఠాక్రే..!) -
ఠాక్రే కుటుంబం నుంచి మరో వారసుడు..
ముంబై : మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన ఠాక్రేల కుటుంబం నుంచి మరో వారసుడు రాజకీయాల్లోకి వచ్చారు. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాల్ ఠాక్రే జయంతి సందర్భంగా గురువారం గోరెగావ్లో ఎమ్మెన్నెస్ మహా సభ నిర్వహించింది. ఈ వేదికపై నుంచే ఎమ్మెన్నెస్ సీనియర్ నాయకులు అమిత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా అమిత్ మాట్లాడుతూ.. ‘పార్టీ స్థాపించిన 14 ఏళ్లలో తొలిసారిగా నేను ఓ బహిరంగసభలో మాట్లాడుతున్నాను. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంద’ని అన్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న అమిత్ తల్లి షర్మిల భావోద్వేగానికి లోనయ్యారు. ఎమ్మెన్నెస్లో అమిత్కు ఏ బాధ్యతలు అప్పగిస్తారనేదానిపై ఆ పార్టీ నేతలు స్పష్టత ఇవ్వలేదు. అయితే ఎమ్మెన్నెస్ యూత్ వింగ్ బాధ్యతలను అమిత్కు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. అలాగే పార్టీ జెండాలో కూడా మార్పులు చేశారు. హిందూత్వాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ఆలోచనలతో పూర్తిగా కాషాయం రంగుతో పార్టీ కొత్త జెండాను రూపొందించారు. జెండా మధ్యలో ఛత్రపతి శివాజీ కాలంనాటి రాజముద్రను చేర్చారు. ఎమ్మెన్నెస్ స్థాపించినప్పుడు.. పార్టీ జెండాను కాషాయం, నీలం, ఆకుపచ్చ రంగులతో తీర్చిదిద్దారు. కాగా, శివసేన నుంచి బయటికొచ్చిన రాజ్ ఠాక్రే 2006లో ఎమ్మెన్నెస్ను స్థాపించారు. అనంతరం 2009లో జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో మొదటిసారి పోటీచేసిన ఎమ్మెన్నెస్.. 13 సీట్లలో గెలుపొందింది. ఆ తర్వాత పలు ఎన్నికల్లో ఆ పార్టీ పోటీచేసిన కూడా అశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 122 స్థానాల్లో పోటీచేసిన ఎమ్మెన్నెస్.. ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందడం ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలోనే పార్టీలో పలు మార్పులు చేయాలని ఆలోచనకు వచ్చారు. మరోవైపు ఠాక్రేల కుటుంబం నుంచి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ఆదిత్య ఠాక్రే.. వర్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. దీంతో శివసేనకు, బీజేపీకి మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తి హిందూత్వ ఎజెండాతో ముందుకెళ్లాలని ఎమ్మెన్నెస్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్తో రాజ్ ఠాక్రే భేటీ అయిన సంగతి తెలిసిందే. -
శివసేనకు చెక్.. బీజేపీతో కలిసిన రాజ్ఠాక్రే..!
సాక్షి, ముంబై : సంచలన రాజకీయాలకు ఇటీవల వేదికగా నిలిచిన మహారాష్ట్రలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీజేపీకి ఆమడదూరంలో ఉండే మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్ఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే కేంద్ర ప్రభుత్వంతో జట్టు కట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్ ఠాక్రే, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్తో కూడిన పోస్టర్లు పాల్గాడ్లో వెలవడం తీవ్ర సంచలనంగా మారింది. స్థానిక బీజేపీ కార్యకర్తలు ఈ పోస్టర్ను ఏర్పాటు చేశారు. మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వంలోని మంత్రులకు శాఖలు కేటాయించిన రోజునే ఈ పరిణామం జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే హిందుత్వవాదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్, ఎన్సీపీతో కూటమిగా ఏర్పడ్డ శివసేనకు చెక్ పెట్టేందుకు బీజేపీ, ఎమ్ఎన్ఎస్ కలుస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రానున్న జిల్లాపరిషత్ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో ఎమ్ఎన్ఎస్-బీజేపీ కలిసి పోటీ చేస్తాయని, వీరి కూటమి తరఫున రాజ్ఠాక్రే ప్రచారం చేస్తారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్తో కలవడంపై ఎమ్ఎన్ఎస్ తొలినుంచి కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇరు పార్టీలు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. -
110 స్థానాల్లో పోటీ.. ఒక్క చోట విజయం
సాక్షి, ముంబై: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాల్లలో బీజేపీ-శివసేన కూటమి దూసుకుపోతుండగా, కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి వెనుకబడింది. రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్ఎన్ఎస్) ఘోరంగా చతికిలపడింది. 110 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసిన ఈ పార్టీ కేవలం ఒకచోట గెలిచింది. ఈ ఎన్నికల్లో కనీసం ప్రభావం చూపలేకపోయింది. తన మాటలతో జనాన్ని ఆకర్షించే నాయకుడిగా పేరుపొందిన 51 ఏళ్ల రాజ్ థాకర్ తన పార్టీని మాత్రం గెలుపుబాట పట్టించలేకపోయారు. 2006లో శివసేన నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎస్ 13 సీట్లు గెలిచింది. 2014లో కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎంఎన్ఎస్ పోటీ చేయకపోయినప్పటికీ, బీజేపీ వ్యతిరేకంగా రాజ్ ఠాక్రే ప్రచారం నిర్వహించారు. అప్పుడు కూడా ఆయన పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. 48 లోక్సభ స్థానాల్లో బీజేపీ-శివసేన కూటమి 42 చోట్ల గెలిచి సత్తా చాటింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంలపై విరుచుకుపడ్డారు. కేంద్రం ఎన్నికల సంఘం బ్యాలెట్ పేపర్లతో పోలింగ్ నిర్వహించేంత వరకు అసెంబ్లీ ఎన్నికలు బహిష్కరించాలని కాంగ్రెస్, ఎన్సీపీలను కోరారు. శరద్ పవార్తో పాటు కాంగ్రెస్ కూడా ఈ ప్రతిపాదనను తిరస్కరించాయి. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో రాజ్ ఠాక్రే రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. (చదవండి: ఎన్నికల ఫలితాల అప్డేట్స్) -
ఆదిత్యపై పోటీకి రాజ్ వెనుకంజ!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వర్లి నియోజకవర్గం నుంచి శివసేన తరపున పోటీ చేస్తున్న ఆదిత్య ఠాక్రేపై అభ్యర్థిని నిలబెట్టకూడదని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) భావిస్తోంది. కుమారుడి వరసయ్యే ఆదిత్యపై ఎవరినీ పోటీకి పెట్టరాదని ఎమ్మెన్నెస్ అధినేత రాజ్ ఠాక్రే నిర్ణయించినట్టు సమాచారం. ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన ఆదిత్య ఠాక్రేపై పోటీ పెడితే ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు వెళ్లే అవకాశముందని రాజ్ ఠాక్రే అభిప్రాయపడుతున్నారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. దీంతో వర్లిలో పోటీకి దూరంగా ఉండటమే మంచిదని ఆయన భావిస్తున్నారు. ‘వర్లి నుంచి ఈసారి నితిన్ నందగవాన్కర్, సంజయ్ ధురి పోటీకి ఆసక్తి చూపారు. కానీ తప్పుడు సంకేతాలు వెళ్లకూడదన్న ఉద్దేశంతో రాజ్ ఠాక్రే వీరిద్దకి ఎర్రజెండా చూపార’ని పార్టీ నాయకుడొకరు ఇండియా టుడే టీవీతో చెప్పారు. వర్లిలో పోటీపై ఎమ్మెన్నెస్ పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. వర్లి నియోజకవర్గంలో ఎమ్మెన్నెస్కు చెప్పుకోదగ్గ స్థాయిలో ఓటు బ్యాంకు ఉంది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 32 వేల ఓట్లు సాధించింది. 2014 నాటికి ఈ సంఖ్య 8 వేలకు పడిపోయింది. వర్లి స్థానాన్ని ఈసారి తమ మిత్రపక్షం పీపుల్స్ రిపబ్లికన్ అండ్ సోషలిస్ట్ పార్టీ (పీఆర్ఎస్పీ)కి ఎన్సీపీ కేటాయించింది. 2009లో ఇక్కడి నుంచి ఎన్సీపీ అభ్యర్థి సచిన్ అహిర్ గెలుపొందారు. 2014లో శివసేన అభ్యర్థి సుశీల్ షిండే గెలిచారు. సచిన్ అహిర్ ఇటీవల శివసేన పార్టీలో చేరారు. (చదవండి: శివసేన కొత్త వ్యూహం ఫలిస్తుందా?) -
ఈడీ ముందుకు ఠాక్రే, ముంబైలో టెన్షన్
సాక్షి, ముంబై: కోహినూర్ మిల్లు భూమి కొనుగోలులో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) రాజ్ ఠాక్రే గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరయ్యారు. దాదర్లోని కోహినూర్ మిల్లు భూ లావాదేవీలపై ఆయనను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈడీ ఎదుట రాజ్ ఠాక్రే హాజరైన నేపథ్యంలో దక్షిణ ముంబైలోని ఈడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈడీ కార్యాలయం వెలుపల 144 సెక్షన్ విధించారు. ఎమ్మెన్నెస్ కార్యకర్తల కదిలికలను గుర్తించి, అదుపు చేసేందుకు ముంబై నగరంలోని 12 జోన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందు జాగ్రత్తగా ఎమ్మెన్నెస్ నేత సందీప్ దేశ్పాండేతో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మారిన్ డ్రైవ్, ఎంఆర్ఏ మార్గ్, దాదర్, ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ 144 సెక్షన్ విధించారు. రాజ్ ఠాక్రే నివాసం వద్ద కూడా పోలీసులను భారీ సంఖ్యలో మొహరించారు. శాంతి, భద్రతలకు విఘాతం కల్గిస్తూ చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముంబై పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. సంయమనం పాటించాలని, అందరూ శాంతంగా ఉండాలని ఇదివరకే రాజ్ఠాక్రే తన అనుచరులకు సూచించారు. ‘మా నాయకుడి ఆదేశాలకు కట్టుబడి సంయమనం పాటిస్తున్నాం. ఆయన చెప్పకపోయినా సహనంగా ఉండాలని అనుకున్నాం. మమ్మల్ని అదుపులోని తీసుకుని ప్రభుత్వం రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తోంది’ అని సంతోష్ ధుని అనే నాయకుడు ఆరోపించారు. కోహినూర్ మిల్లు భూ అక్రమాల కేసులో రాజ్ఠాక్రే వ్యాపార భాగస్వాములు ఉమేశ్ జోషి, రాజేంద్ర శిరోద్కర్లను ఇప్పటికే ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈడీ విచారణలో ఒరిగేదేమీ లేదు: ఉద్ధవ్ కోహినూర్ మిల్లు భూమి కొనుగోలు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ ఠాక్రేకు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పరోక్ష మద్దతు ప్రకటించారు. రాజ్ఠాక్రేను ఈడీ ప్రశ్నించినా ఒరిగేదేమీ ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. శివసేన ద్వంద్వ వైఖరి పాటిస్తోందని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి. -
రాజ్ ఠాక్రేకు ఈసీ నోటీసులు
సాక్షి, ముంబై: రాష్ట్రంలో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసిన ఖర్చుల వివరాలు చూపించాలని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రేకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసు జారీ చేసింది. రాజ్ ఠాక్రేతో పాటు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రచార సభలకు ఏర్పాట్లు చేసిన ఆ పార్టీ నేతలు, పదాధికారులు, కార్యకర్తలు ఇబ్బందుల్లో పడిపోయారు. ఇటీవల రాష్ట్రంలో మొత్తం 48 లోక్సభ నియోజక వర్గాలకు జరిగిన ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ తరఫున ఒక్క అభ్యర్థి కూడా బరిలోకి దిగలేదు. అయినప్పటికీ ఆ పార్టీ చీఫ్ రాజ్ ఠాక్రే ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. ముంబైతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7–8 ప్రచార సభలు నిర్వహించి ఓటర్లలో బీజేపీకి వ్యతిరేకంగా వాతావరణం తయారుచేశారు. ఇది కాంగ్రెస్–ఎన్సీపీ మహాకూటమి ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా పరోక్షంగా ప్రచారం చేసినట్టైంది. సాధారణంగా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచార సభలు, రోడ్ షోలు నిర్వహిస్తాయి. కానీ ఎమ్మెన్నెస్ నుంచి ఒక్క అభ్యర్థి కూడా బరిలో లేకపోయినా రాజ్ఠాక్రే ప్రచార సభలు నిర్వహించడమేంటని అప్పట్లో చర్చనీయంశమైంది. నియమాల ప్రకారం రాజకీయ పార్టీలు చేసిన ప్రచార సభల ఖర్చులు తమ తమ అభ్యర్థుల ఖాతాలో వేస్తారు. ఆ తర్వాత ఖర్చుల జాబితా ఎన్నికల సంఘానికి సమర్పిస్తారు. కానీ రాజ్ ఠాక్రే ప్రచార సభల ఖర్చులు ఎవరి ఖాతాలో వేయాలనే అంశం తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రాజ్ ఠాక్రే ఎన్నికల ప్రచారం ఖర్చులు కాంగ్రెస్–ఎన్సీపీ అభ్యర్థుల ఖాతాలో వేయాలని అప్పట్లో బీజేపీ అధికార ప్రతినిధి వినోద్ తావ్డే డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ప్రచార సభలకు సంబంధించిన ఖర్చులు వెల్లడించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్ ఠాక్రేకు లేఖ రాసింది. దీనిపై రాజ్ ఏ విధంగా స్పందిస్తారనే దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. -
‘తిడుతూనే.. కాపీ కొడుతున్నారుగా’
ముంబై : ఐదేళ్లుగా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్ఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించారు. మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలను తిడుతూనే వారిని కాపీ కొడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ... ‘ న్యూఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ మ్యూజియంలో ఒక కొటేషన్ ఉంటుంది. ప్రజలు నన్ను ప్రధాన మంత్రి అని కాకుండా ప్రథమ సేవకుడిగా పిలవాలి అన్న నెహ్రూ ఆదర్శ వాక్యాలు అక్కడ మనకు కనిపిస్తాయి. ప్రస్తుతం మోదీ ప్రథమ సేవకుడికి బదులు ప్రధాన సేవకుడిని అని చెప్పుకొంటున్నారు. నెహ్రూ, ఇందిరా గాంధీని తిడుతూనే వారిని భలేగా కాపీ కొడుతున్నారు’ అని ఎద్దేవా చేశారు. నాందేడ్లో ఓ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రాజ్ ఠాక్రే...నిరుద్యోగం, రైతు సమస్యలు, మహిళా భద్రత గురించి పట్టించుకోకుండా ప్రధానిగా మోదీ విఫలమయ్యారన్నారు. సైనికుల త్యాగాలను రాజకీయాలకు వాడుకుంటూ ఓట్లు అడుక్కుంటున్నందుకు మోదీ సిగ్గుపడాలని ఘాటుగా విమర్శించారు. బీజేపీ, అమిత్ షా, మోదీలను దేశ రాజకీయాల నుంచి తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని... భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మార్పు కోసం ఓటేయాలని పిలుపునిచ్చారు. కాగా ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో రాజ్ ఠాక్రే పోటీ చేయడం లేదన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ వీలు చిక్కినప్పుడల్లా ప్రధాని నరేంద్ర మోదీ, పాలక బీజేపీపై ఆయన విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. ఇక రాజ్ ఠాక్రే కజిన్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. -
ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై : మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే బీజేపీకి భారీ షాకిచ్చారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ తమ పార్టీ పోటీచేయడం లేదని మంగళవారం ప్రకటించారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్షా ద్వయానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని వెల్లడించారు. బీజేపీని ఓడించడమే తమ అంతిమ లక్ష్యమంటూ వ్యాఖ్యానించి సంచలనం రేపారు. మోదీ, షా ఇద్దరూ దేశంలో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తున్నారు..అందుకే వారిద్దర్నీ పక్కకు తొలగించాల్సి ఉందన్నారు. దీనికోసం బీజేపీని ఓడించాలని ఎంఎన్ఎస్ శ్రేణులకు థాకరే పిలుపునిచ్చారు. అలాగే 2019 ఎన్నికల్లో తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. బాంద్రాలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించిన ఆయన బీజేపీ కొత్తగా ప్రారంభించిన మై భీ చౌకీదార్ ప్రచారం ప్రహసనమని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లలో పార్టీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి చేస్తున్న ప్రచారమని విమర్శించారు. అసలు ఎన్నికలు నేపాల్లో జరుగుతున్నాయా లేక భారతదేశంలోనా అని ప్రశ్నించారు. 2019 ఎన్నికలు దేశానికి, నరేంద్రమోదీ, అమిత్షా ద్వయానికి మధ్య జరుగుతున్నవని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వాన్ని తొలగించటం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్పై కూడా థాకరే విమర్శలు గుప్పించారు. -
మోదీకి అందని థాక్రే ఆహ్వానం!
ముంబై : మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే తన కుమారుడి వివాహానికి ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించకపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అడ్వాణీతోపాటు పలువురు కేంద్ర మంత్రులకు వివాహ ఆహ్వానాలు అందగా.. ప్రధాని మోదీకి మాత్రం ఇంతవరకు ఆహ్వానం అందకపోవడం గమనార్హం. గత కొద్దిరోజులుగా మోదీపై బాహాటంగానే విమర్శలు చేస్తున్న థాక్రే.. ఉద్దేశపూర్వకంగానే మోదీని ఆహ్వానించడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాజ్ థాక్రే కుమారుడు అమిత్, ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ సంజయ్ బోరుడె కుమార్తె మిథాలిల వివాహం జనవరి 27న లోవర్ పరేల్లోని సెయింట్ రెగిస్ హోటల్లో జరగనుంది. ఈ వివాహానికి ఆహ్వానించడానికి రాజ్ థాక్రే గతవారమే ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. అనివార్య కారణాల వల్ల వెళ్లలేకపోయారు. దీంతో ఆయన తన సన్నిహతులైన హర్షల్ దేశ్పాండే, మనోజ్ హతేకు ఆహ్వాన బాధ్యతలు అప్పగించారు. వీరిద్దరూ ఢిల్లీలోని పలువురు రాజకీయ ప్రముఖులను కలిసి వివాహానికి ఆహ్వానించారు. వివాహ ఆహ్వానాలు పొందినవారిలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీతోపాటు కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, నితిన్ గడ్కరీ, ప్రకాశ్ జవడేకర్, ధర్మేంద్ర ప్రదాన్, మేనకా గాంధీ, బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ తదితరులు ఉన్నారు. ఎన్సీపీ నేత శరథ్ పవార్ను కూడా ఆహ్వానించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీకి ఆహ్వానం అందింది. అయితే మోదీకి మాత్రం ఇంతవరకు ఆహ్వానం అందలేదు. కొద్దిరోజుల క్రితం కుమారుడి వివాహానికి ప్రధానిని ఆహ్వానిస్తారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు రాజ్థాకరే స్పందిస్తూ.. 'పెళ్లి అనే బంధాన్ని మోదీ నమ్ముతారా?' అంటూ బదులిచ్చారు. కొత్త కూటమి..? మహారాష్ట్రలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), కాంగ్రెస్లు కూటమిగా ఏర్పడతాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈనేపథ్యంలో మోదీని రాజ్ థాక్రే కుమారుడి పెళ్లికి ఆహ్వానించకపోవడం ఈ తరహా ప్రచారానికి బలంచేకూరుస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలో మిత్రపక్షం శివసేన బీజేపీకి ఎదురుతిరుగుతున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీపై బాహాటంగానే శివసేన నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో శివసేన ఒంటరిగానే బరిలోకి దిగుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో మహారాష్ట్రలో మహాకూటమి ఏర్పడితే బీజేపీ కష్టాలు తప్పవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
‘పప్పు’ పరమ పూజ్యుడయ్యాడు
ముంబై : లోక్సభ ఎన్నికలకు సెమీ ఫైనల్స్గా భావిస్తోన్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీసగఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల విజయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కీలక పాత్ర పోషించారనేది వాస్తవం. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పూర్తి స్థాయి మెజారిటీతో.. ఏ పార్టీతో కూడా పొత్తు లేకుండా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చిన ఎన్నికలు కూడా ఇవే. ఈ ఎన్నికల విజయానంతరం రాజకీయ విశ్లేషకులు, ప్రతి పక్షాలు సైతం రాహుల్ గాంధీని ప్రశంసలతో ముంచెత్తుతున్నాయి. తొలినాళ్లలో రాహుల్ని ‘పప్పు’ అన్న వాళ్లే నేడు రాహుల్ గాంధీ ‘పరిణతి’ సాధించాడని ప్రశంసిస్తున్నారు. ఇలా మెచ్చుకునే వారి కోవలోకి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనా అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కూడా చేరారు. రాజస్తాన్, చత్తీస్గఢ్లో స్వంతంగా, మధ్యప్రదేశ్లో ఇతర పార్టీలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో రాజ్ ఠాక్రే మాట్లాడుతూ.. ‘గుజరాత్, కర్ణాటక, ఇప్పుడీ మూడు రాష్ట్రాల ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఒంటరిగా పొరాడారు. అప్పుడు శత్రువులు రాహుల్ని పప్పు అన్నారు. కానీ నేటి ఫలితాలు రాహుల్ పప్పు కాదు పరమ పూజ్యుడు అని నిరూపిస్తున్నాయి. అతి త్వరలోనే దేశ రాజకీయాల్లో రాహుల్ నాయకత్వాన్ని మనం చూడబోతున్నాం’ అంటూ రాహుల్ గాంధీని ప్రశంసించారు. ఈ సందర్భంగా రాజ్ ఠాక్రే బీజేపీపై విమర్శలు చేశారు. ‘నాలుగున్నరేళ్లలో మోదీ, అమిత్ షా ప్రవర్తనకు నిదర్శనం ఈ ఫలితాలు. వీరు మాటల్లో ఘనం.. చేతల్లో శూన్యం అనే విషయం భారత ప్రజలకు కూడా పూర్తిగా అర్థమయ్యింది. నేడు బీజేపీ ఓటమికి అమిత్ షా, మోదీలే ప్రధాన కారణమంటూ రాజ్ ఠాక్రే ఆరోపించారు. -
ముంబైకి వచ్చే రైళ్లన్నీ ఖాళీగా వెళ్తాయి!
సాక్షి, ముంబై : మహారాష్ట్రలో నివసిస్తున్న ఉత్తర భారతీయులను ఉద్దేశించి మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఇతర రాష్ట్రాలకు వలస వచ్చి మీరు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే మీకు ఆత్మగౌరవం లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ముంబైలోని ఉత్తర భారతీయ మహాపంచాయత్ ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి రాజ్ ఠాక్రే హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ... ‘భారతదేశానికి అత్యధిక మంది ప్రధానులను అందించిన ఘనత ఉత్తరప్రదేశ్కు ఉంది. ప్రస్తుత ప్రధాని కూడా అక్కడి(వారణాసి) నుంచి ఎన్నికైన వారే. కానీ ఆ రాష్ట్రం ఇప్పటికీ వెనుకబడే ఉంది. ఉద్యోగాలు, ఉపాధి లేక మీరంతా ముంబైకి వస్తున్నారు. యూపీతో పాటు బిహార్, జార్ఖండ్, బంగ్లాదేశ్ ప్రజలు కూడా ఉపాధి కోసం ఇక్కడికే వస్తారు. మీకు, మీ నాయకులకు నిజంగా ఆత్మగౌరవం ఉంటే ముఖ్యమంత్రి, ప్రధానులను నిలదీస్తారు. మీకు చెందాల్సినవి దక్కించుకుంటారు. కానీ అలా జరగడం లేదు. ఇంకో విషయం గుర్తు పెట్టుకోవాలి.. మీరు ఎక్కడికైతే వలస వెళ్లి బతుకుతున్నారో అక్కడి స్థానిక భాషలను, సంస్కృతిని గౌరవించడం నేర్చుకోవాలి’ అని రాజ్ ఠాక్రే సభికులకు సూచించారు. ముంబైకి వచ్చే రైళ్లన్నీ ఖాళీగా వెళ్తాయి! ‘ముంబైకి రోజూ సుమారు 48 రైళ్లు నిండుగా వస్తాయి. కానీ తిరిగి వెళ్లేప్పుడు మాత్రం ఖాళీగా వెళ్తాయి. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సిటీ కెపాసిటీ ఎంత.. ఇక్కడ నివసిస్తున్న జనాభా ఎంత. ఈ స్థాయిలో వలసలు కొనసాగితే మహారాష్ట్ర పరిస్థితి ఏం కావాలి. నిజమే మీరు బతుకుదెరువు కోసమే వస్తున్నారు. కానీ మహారాష్ట్ర ప్రజల పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా’ అంటూ రాజ్ ఠాక్రే ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరిపై తనకు వ్యక్తిగతంగా కక్ష లేదని, కాకపోతే తమ రాష్ట్ర ప్రజల బాగుకోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఎక్కువ మంది ప్రజలకు ఈ విషయం చేరాలనే ఉద్దేశంతోనే తాను హిందీలో మాట్లాడుతున్నానని తెలిపారు. -
నానా పటేకర్ అలాంటోడే కానీ..
సాక్షి, ముంబై : మీటూ ఉద్యమంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు నానా పటేకర్ అమర్యాదకరంగా వ్యవహరిస్తాడని తనకు తెలుసన్నారు. అయితే ఆయన ఇలాంటి పనులు చేశాడని తాననుకోవడం లేదని, కోర్టులే దీన్ని నిగ్గుతేలుస్తాయని వ్యాఖ్యానించారు. మీటూ సీరియస్ అంశమని, దీనిపై మీడియా ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఇలాంటి సున్నిత అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరగరాదని కోరారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న పెట్రో ధరలు, రూపాయి క్షీణత, నిరుద్యోగం వంటి తీవ్ర సమస్యల నుంచి పక్కదారి పట్టించేందుకే ఈ ఉద్యమం ముందుకువచ్చిందని రాజ్ థాకరే సందేహం వ్యక్తం చేశారు. మహిళలకు ఎలాంటి అవాంఛనీయ పరిస్థితి ఎదురైనా వారు ఎంఎన్ఎస్ను సాయం కోసం ఆశ్రయించవచ్చన్నారు. మహిళలు తాము అణిచివేతకు గురైన వెంటనే గొంతెత్తాలని, పదేళ్ల తర్వాత కాదని ఆయన చురకలు వేశారు. -
రాజ్ ఠాక్రేతో సూపర్ స్టార్ భార్య భేటీ
ముంబై : మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేతో, సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లత భేటీ అయ్యారు. సోమవారం ముంబై కృష్ణ కుంజ్లోని రాజ్ ఠాక్రే నివాసానికి వెళ్లిన లత ఠాక్రేతో పాటు ఆయన సతీమణి షర్మిలా ఠాక్రేతో సమావేశమయ్యారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను రాజ్ ఠాక్రే ట్విటర్ ద్వారా వెల్లడించారు. రజనీ రాజకీయ ఆరంగేట్రం నేపథ్యంలో.. ఈ భేటీకి ప్రాధన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో వీరు తాజా రాజకీయ అంశాలతో పాటు, సినీ, సామాజిక అంశాలను చర్చించినట్టుగా రాజ్ ఠాక్రే పీఆర్ టీమ్ తెలిపింది. గతేడాది డిసెంబర్లో రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలిపిన రజనీ.. రానున్న తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో 234 నియోజక వర్గాల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా రజనీ ఇప్పటివరకు తన పార్టీ పేరు మాత్రం వెల్లడించలేదు. -
బర్త్డే కానుక : పెట్రోల్పై రూ.5 తగ్గింపు
ముంబై : ఇటీవలి కాలంలో పెట్రో ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) వినియోగదారులకు కాసింత ఊరట కల్పించాలని భావించింది. గురువారం ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే జన్మదినాన్ని పురస్కరించుకుని.. వాహనదారులకు 4 నుంచి 5 రూపాయల మేర తగ్గింపుపై పెట్రోలు అందించాలని ఆ పార్టీ శ్రేణులు నిర్ణయించాయి. అందులో భాగంగా ఈ రోజు రాష్ట్రంలో ఎంపిక చేసిన పెట్రోలు బంక్ల్లో ద్విచక్ర వాహనదారులకు ఈ సదుపాయం కల్పించింది. మరికొన్ని చోట్ల 9 రూపాయల వరకు కూడా తగ్గింపు ఇస్తున్నారు. దీంతో చాలా మంది వాహనదారులు ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు. ఎంపిక చేసిన పెట్రోలు బంక్ల ముందు వందల మీటర్ల మేర వాహనదారులు బారులు తీరారు. ఈ రోజు మహారాష్ట్రలో పెట్రోల్ ధర 84.26 రూపాయలుగా ఉంది. ఈ తగ్గింపు వల్ల పెట్రోల్ బంక్ యాజమానులపై పడే భారాన్ని ఎంఎన్ఎస్ చెల్లించనుంది. దీనిపై ద్విచక్ర వాహనదారులు హర్షం చేస్తున్నారు. ఓ వాహనదారుడు మాట్లాడుతూ.. రాజ్ ఠాక్రేలాగే మోదీ కూడా పెట్రోలు ధరలు తగ్గిస్తారని ఆశిస్తున్నామన్నారు. తాను ట్యాంక్ ఫూల్ చేయించడం ఇదే తొలిసారి అని తెలిపారు. -
ఆ రాత్రి నా జీవితంలో మర్చిపోలేనిది..
‘ఐకమత్యమే మహాబలం’...వినడానికి చాలా చిన్న మాటే కానీ చాలా విలువైనది. కలసికట్టుగా ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా తేలికగా పరిష్కరించవచ్చు. సినిమా ఇండస్ట్రీకి కూడా ఈ మాట వర్తిస్తుందిని..దీన్ని ఆచరిస్తే చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయంటున్నారు బాలీవుడ్ మిస్టర్ పర్ఫేక్షనిస్ట్ ఆమిర్ఖాన్. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవని..సామాజిక అంశాల సంగతి అటుంచి స్వయంగా సొంత పరిశ్రమలో వ్యక్తులకు ఇబ్బందులు ఎదురయినప్పుడు కూడా అందరూ కలిసి రావడం లేదని ఆరోపించారు. ‘2014లో కరణ్ జోహర్ ‘యే దిల్ హై ముష్కిల్’ సినిమాలో పాకిస్తాన్ నటి ఫవాద్ ఖాన్ను హీరోయిన్గా తీసుకున్నందుకు ఆ చిత్రం విడుదలకు శివసేన అధ్యక్షుడు రాజ్ థాక్రే ఒప్పుకోలేదు. ఈ విషయంలో కరణ్కు మద్దతు ఇచ్చినవారిని వేళ్ల మీద లెక్కించవచ్చు. ఒక్క మహేష్ భట్ తప్ప మిగితా ఏ నిర్మాత కరణ్కు మద్దతుగా నిలబడలేదు. చివరకు కరణ్ రూ. 5 కోట్లను సైన్య సహాయ నిధిగా ఇస్తానని ఒప్పుకొవడంతో సమస్య సద్దుమణిగింద’న్నారు. ‘ఖాన్’ సినిమాలకు తప్పని తిప్పలు... కరణ్కే కాక ఖాన్ హీరోలకు కూడా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయన్నారు. 2006లో వచ్చిన ఆమిర్ చిత్రం ‘ఫనా’కు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆమిర్ ‘నర్మదా బచావో’ ఆందోళనకు మద్దతివ్వడంతో ‘ఫనా’ సినిమాను గుజరాత్లో విడుదల చేయకుండా నిషేదిండమే కాక ఆమిర్ను క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. కానీ ఆమిర్ అందుకు ఒప్పుకోలేదు. ఆ సమయంలో ఇండస్ట్రీ నుంచి ఎవరూ కూడా ఆమిర్కు మద్దతివ్వలేదు. గతేడాది విడుదలయిన షారుక్ ఖాన్ చిత్రం ‘రాయీస్’ విషయంలో కూడా ఇలాంటి ఇబ్బందులే తలెత్తాయి. ఈ చిత్రంలో పాకిస్తాన్ నటి మహిరా ఖాన్ను హీరోయిన్గా తీసుకున్నారు. చిత్రం విడుదల సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్ధేశంతో షారుక్ ముందుగానే రాజ్థాక్రేను కలిసి మాట్లాడాడు. రాయీస్ చిత్ర ప్రచార కార్యక్రమంలో మహిరా ఖాన్ పాల్గొనదని హామీ ఇచ్చాడు. ఇలా ప్రతి సారీ సినిమా విడుదలకు ముందు రాజకీయ నాయకులను కలిసి వారికి సమాధానం చెప్పడం, లేదా క్షమాపణలు కోరడం పరిపాటి అయ్యింది. లేకపోతే వారు సినిమా విడుదలవ్వకుండా సమస్యలు సృష్టిస్తారన్నారు. ఆ రోజులను మర్చిపోలేము... అయితే ఒకప్పుడు పరిస్థితులు ఇలా ఉండేవి కావని, 1993 నాటి ‘ముంబయి అల్లర్ల’ విషయాన్ని గుర్తుచేసుకున్నారు ఆమిర్. అల్లర్ల సమయంలో ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి మొత్తం చిత్ర పరిశ్రమ ముందుకొచ్చింది. బాంబేలో అల్లర్లు చెలరేగిన సమయంలో వ్యాపారాలు అన్ని మూతపడ్డాయి. ఎవరూ ఇళ్లు వదిలి బయటకు రావడం లేదు. ఈ పరిస్థితిలో మార్పు రావడం కోసం పరిశ్రమ నుంచి ఏమైనా చేయాలని సునీల్ దత్ భావించారు. నాతోపాట మరికొందరు పరిశ్రమ ప్రముఖులతో చర్చించి 40 మందితో ఒక కమిటీ వేసారు. వీరంతా అప్పటి మహారాష్ట్ర సీఎం సుధాకర్రావ్ నాయక్ను కలిసి బాంబేలో చెలరేగుతున్న హింసను ఆపాలని కోరారు. అంతటితోను తమ పని అయిపోయిందని అనుకోకుండా అల్లర్లకు నిరసనగా మంత్రాలయం దగ్గర ఉన్న మహాత్మగాంధీ విగ్రహం వద్ద మౌన దీక్ష చేపట్టారు. అప్పట్లో మీడియ ఇంతగా లేకపోవడం వల్ల ఈ విషయానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు లేవు. అల్లర్లు ఆగేంతవరకూ నిరసన కొనసాగించాలని దత్ సాబ్ నిర్ణయించారు. కనుక వంతుల వారిగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాము. నిరసన తొలిరోజు రాత్రి సునీల్ దత్, యష్ చోప్రా, జానీ వాకర్తో పాటు నేను కూడా నిరసన ప్రదేశం వద్ద ఉన్నాను. ఆ రాత్రి నా జీవితంలో మర్చిపోలేని రాత్రి. రాత్రంతా అక్కడే ఉన్న మాకు మరుసటిరోజు ఉదయం కొందరు టీ, టిఫిన్ తీసుకువచ్చి మాతోపాటు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. చివరకూ ముఖ్యమంత్రి దిగి వచ్చారు. మళ్లీ బాంబే మాములుగా అయిన తర్వాతే మా నిరసనను విరమించుకున్నాము. నిజంగా ఆ రోజులు ఎంతో బాగుండేవ’ని తెలిపారు. ప్రస్తుతం హీరోలకు స్టార్డమ్, సోషల్ మీడియా మద్దతూ ఇంత భారీగా ఉన్నప్పుడు మనం మన సమస్యల గురించి మరింత బాగా పోరాడవచ్చు. ఇండస్ట్రీలో అందరి మధ్య మంచి సంబంధాలు ఉండి ఐక్యంగా ఉంటే ఇలాంటి సమస్యలను సులువుగా పరిష్కరించవచ్చు. కానీ విషాదం ఏంటంటే ఇక్కడ(బాలీవుడ్లో) కోట్లు వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కానీ మారడానికి మాత్రం ఎవరూ సిద్ధంగా లేరు.’ అని ఆమిర్ వ్యాఖ్యలు చేశారు. -
రాజ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబయి : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల ఎంఎన్ఎస్ పెదవివిరిచింది. కర్ణాటక ఫలితాలపై ఆ పార్టీ చీఫ్ రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఫలితాలను ఈవీఎంల విజయంగా థాకరే అభివర్ణించారు. ఈవీఎంల పనితీరుపై సందేహం వ్యక్తం చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు ఈవీఎంలపై కాంగ్రెస్ పార్టీ మరోసారి సందేహం వ్యక్తంచేసింది . ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల వినియోగానికి బీజేపీ ఎందుకు సిద్ధంగా లేదని కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నించాయి. ‘ఈవీఎంలపై దేశంలోని పార్టీలన్నీ సందేహాలు వ్యక్తం చేశాయి. గతంలో బీజేపీ సైతం ఈవీఎంలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. బ్యాలెట్ ద్వారా ఎన్నికల నిర్వహణకు బీజేపీ ఎందుకు సిద్ధంగా లేద’ని కాంగ్రెస్ నేత మోహన్ ప్రకాష్ అన్నారు. -
నాకు ఎమ్మెల్యే.. నీకు ఎంపీ!
సాక్షి, ముంబై: రాష్ట్రంలో వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)తో రహస్యంగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్మెన్నెస్) పొత్తు పెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీతో జతకట్టి 35–50 స్థానాల్లో గెలిచే ప్రయత్నం చేయాలని ఇప్పటి నుంచే ఎమ్మెన్నెస్ పార్టీ నాయకులు వ్యూహం పన్నుతున్నారు. అసెంబ్లీలో మద్దతిస్తే లోకసభ ఎన్నికల్లో ఇరుపార్టీల అభ్యర్థులున్న చోట ఎమ్మెన్నెస్ పోటీచేయకూడదని నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉంది. కాంగ్రెస్తో కష్టమే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు వ్యతిరేక పార్టీలన్ని ఒకతాటిపైకి రావల్సిన అవసరం ఉందని ఉగాది రోజున శివాజీపార్క్ మైదానంలో జరిగిన మేళావాలో ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే దానిపై దృష్టి సారించారు. ఉత్తర భారతీయులకు వ్యతిరేక పార్టీగా గుర్తింపు పొందిన ఎమ్మెన్నెస్తో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. అందుకు ప్రధాన కారణం ఎలాంటి ఎన్నికలైనా కాంగ్రెస్ అభ్యర్థులు ఉత్తర భారతీయులు, ముస్లింల ఓట్లతోనే విజయ ఢంకా మోగిస్తారు. దీంతో ఎమ్మెన్నెస్తో కాంగ్రెస్ జత కష్టమే. కాగా, ఇదివరకు జరిగిన పలు ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీలు కలసి పోటీ చేయడం, కొన్నింటిలో ఒంటరిగా బరిలోకి దిగడం లాంటి సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. దీంతో విభేదాలున్నా.. కాంగ్రెస్, ఎన్సీపీలతో రహస్యంగా పొత్తు పెట్టుకోవాలని ఎమ్మెన్నెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం జరగనున్న అసెంబ్లీ ఎన్నికలో 100–150 స్థానాల్లో పోటీ చేసే బదులు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న 35–50 స్థానాలను ఎంపిక చేసుకుని అక్కడి నుంచి తమ పార్టీ అభ్యర్థులను బరిలో దింపాలని ఎమ్మెన్నెస్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకు కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి పరోక్షంగా మద్దతు తీసుకునే అవకాశాలున్నాయి. అసెంబ్లీలో సాయం చేస్తే.. లోకసభకు మద్దతు ఇటీవల ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాలను విశ్లేషించారు. అందులో 35–50 నియోజక వర్గాల్లో కాంగ్రెస్, ఎన్సీపీలు నాలుగు, ఐదో స్థానాల్లో ఉండగా, ఎమ్మెన్నెస్ రెండు, మూడో స్థానాల్లో నిలిచింది. ఈ స్థానాల్లో ఇరుపార్టీల సాయం తీసుకునే అవకాశాలున్నాయి. ముంబై, థానే, నాసిక్తోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని నియోజక వర్గాలలో పార్టీ కార్యకర్తలు ఇప్పటి నుంచే ప్రజలకు దగ్గరయ్యే పనులు ప్రారంభించారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ ఘోరంగా ఓడిపోయింది. కేవలం ఒకే ఎమ్మెల్యేతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్సీపీతో రహస్యంగా జతకట్టి ఎక్కువ స్థానాలు గెలుపించుకునే ప్రయత్నం చేస్తోంది. లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తే కాంగ్రెస్, ఎన్సీపీ ఫలితాలపై కచ్చితంగా ప్రభావం చూపనుంది. దీంతో లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలో దింపాలా...? వద్దా..? అనే దానిపై రాజ్ ఠాక్రే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల్లో ఇరుపార్టీలు ఎమ్మెన్నెస్కు పరోక్షంగా సహకరిస్తే లోక్సభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ కూడా పరోక్షంగా సహకరించే అవకాశాలున్నాయి. లేదంటే ఐదు లేదా ఆరు లోక్సభ నియోజకవర్గాలలో ఎమ్మెన్నెస్ తమ అభ్యర్థిని బరిలో దింపే ప్రయత్నం చేయనుంది. ఒకవేళ 2019లో జరిగే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఎమ్మెన్నెస్కు ఇరు పార్టీలు సహకరిస్తే బీజేపీ, శివసేనకు కొంత మేర నష్టం జరగడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
శ్రీదేవి, అక్షయ్పై ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
ముంబై : మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే సంచలన ఆరోపణలు చేశారు. నీరవ్ మోదీ కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే శ్రీదేవి అంత్యక్రియలకు అంతలా హడావిడి చేశారని ఆరోపించారు. బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆదివారం ముంబైలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ.. ‘మోదీ ముక్త్ భారత్’ కోసం ఆయన పిలుపునిచ్చారు. హిట్లర్ పాలనలా బీజేపీ సర్కారు పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ‘శ్రీదేవి గొప్ప నటి కావచ్చు కానీ ఆమె దేశానికి ఏం సేవ చేశారు? ఆమె భౌతికాయంపై త్రివర్ణ పతాకం ఎందుకు ఉంచారు? అధికార లాంఛనాలతో ఎందుకు అంత్యక్రియలు నిర్వహించారు? బీజేపీయేతర ముఖ్యమంత్రి ఇలా చేసివుంటే మీడియా గగ్గోలు పెట్టేది. మోదీ ప్రభుత్వానికి భయపడే మీడియా నోరు మెదపడం లేద’ని రాజ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్కుమార్పై కూడా ఆయన విమర్శలు చేశారు. ‘అక్షయ్ భారతీయుడు కాదు. ఆయన పాస్పోర్టులో కెనడియన్గా ఉంది. వికీపిడియా కూడా ఆయనను భారత్లో పుట్టిన కెనడియన్గా చూపిస్తోంది. ఒకప్పటి నటుడు మనోజ్ కుమార్ అడుగుజాడల్లో నడవడానికి అక్షయ్ ప్రయత్నిస్తున్నార’ని పేర్కొన్నారు. -
సల్మాన్ఖాన్ సినిమాపై వివాదం
సాక్షి, ముంబై: సల్మాన్ఖాన్ నటించిన ‘ఏక్ థా టైగర్’ సినిమాకి సీక్వెల్గా వస్తున్న ‘టైగర్ జిందా హై’ ఈ నెల 22న విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ సినిమాపై వివాదం నెలకొంది. సినిమా విడుదలను నిలిపివేయాలని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే థియేటర్ యజమానులకు వార్నింగ్ ఇచ్చారు. ముందు మరాఠీ సినిమాలకే థియేటర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరాఠీ సినిమాలను కాదని బాలీవుడ్ సినిమాలు విడుదల చేస్తే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. తాజాగా సల్మాన్ తన ట్విటర్ ద్వారా ఈ సినిమా టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. టైగర్ ను చూడడానికి తప్పకుండా థియేటర్ కు రండి అని ట్వీట్ చేశారు. జిందా హై అంటూ సాగిన ఈ పాటలో సల్మాన్ ఫైట్ సీన్స్ తో పాటు, కత్రినా కైఫ్ గన్ చేతబట్టి విలన్ల మీద ఫైర్ చేయడం హైలైట్ గా ఉన్నాయి. -
‘భారత్లో అంతర్యుద్ధం మొదలు..’
ముంబై : మహా నగరం ముంబైలోని బెహ్రంపాద తదితర మురికివాడల్లో నివసిస్తున్న వారందరూ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన చొరబాటు దారులని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎమ్ఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే ఆరోపించారు. వీరందరికీ ఆధార్ కార్డులు సులువుగా దొరుకుతోందని అన్నారు. ఇదే ట్రెండ్ గనుక కొనసాగితే పాకిస్తాన్తో కాకుండా చొరబాటు దారులతో భారత్ యుద్ధ చేయాల్సివుంటుందని హెచ్చరించారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చి ముంబైలో జీవనం సాగిస్తున్న వారికి సంబంధించి ఎలాంటి అధికారిక రికార్డులు మెయింటైన్ చేయకపోవడంపై ఆగ్రహించారు. గత నెల 26న బాంద్రా రైల్వే స్టేషన్ పరిధిలో జరిగిన అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తు జరగలేదని, ఎవరో కుట్ర పన్ని చేశారనే అనుమానం కలుగుతోందని అన్నారు. -
రాజ్ఠాక్రే కార్యకర్తలను చితక్కొట్టారు..
ముంబై : మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్ఎన్ఎస్) కార్యకర్తలను చిరువ్యాపారులు శనివారం చితక్కొట్టారు. రాజ్ ఠాక్రే పార్టీకి చెందిన 15 మంది కార్యకర్తలు నగరంలోని మలడ్ రైల్వే స్టేషన్ వద్ద దురాక్రమణలను పరిశీలించేందుకు వెళ్లారు. రైల్వే స్టేషన్ పరిధిలోని భూమిలో అక్రమంగా నిలిపిన దుకాణాలను తొలగించాలని వారికి చెప్పారు. దీంతో ఆగ్రహించిన 100 మంది చిరు వ్యాపారులు వారిపై రాడ్లు, కర్రలతో విరుచుకుపడ్డారు. ముంబై కాంగ్రెస్ ప్రెసిడెంట్ సంజయ్ నిరుపమ్ మలడ్ రైల్వే స్టేషన్ పరిధిలోని చిరు వ్యాపారులతో సమావేశమైన తర్వాత వారు దాడికి పాల్పడటం అనుమానాలకు తావిస్తోంది. చిరు వ్యాపారుల దాడిలో ఓ ఎమ్ఎన్ఎస్ కార్యకర్త తలకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్ఎన్ఎస్) దురాక్రమణకు గురైన రైల్వే స్థలాలపై ప్రచార కార్యక్రమాలను ఆపబోమని పేర్కొంది. -
హాకర్ల సమస్య పరిష్కారం?
విశ్లేషణ అధికారులు పూనుకుంటే నగరాలను పరిశుభ్రంగా ఉంచగలరు. హఠాత్తుగా వీధి వ్యాపారులు మటుమాయం కావడమే అందుకు నిదర్శనం. కానీ, వీధి వ్యాపా రుల విధానాన్ని తేలేకపోతే వారి జీవనోపాధి హక్కుకు భంగం కలుగుతుంది. రెండు ఘటనలు, ముంబై ప్రాంత స్థానిక రైల్వే స్టేషన్ల లోకి ప్రయాణికుల రాకపో కలు, స్టేషన్ లోపలి కదలికలు స్వేచ్ఛగా సాగడానికి ఉన్న అడ్డంకులను తొలగించాయి. ఒకటి, ఎల్ఫిన్స్టోన్ స్టేషన్ వద్ద జరిగిన తొక్కిసలాట. మరొ కటి, స్టేషన్ల బయటా లోపలా ఉండే వీధి వర్తకులు (హాకర్స్) 15 రోజులలోగా ఖాళీ చేయాలని రాజ్ ఠాక్రే జారీ చేసిన హెచ్చరిక. అలా చేయక పోతే, పరిణామాలు హింసా త్మకంగా ఉండగలవని ఆయన సంకేతించారు కూడా. వీధి వ్యాపారులతో తలెత్తున్న ఈ సమస్య పట్ల అధి కారులు ఎప్పటికప్పుడు అలసత్వం చూపుతూ వస్తు న్నారు. ఒక సందర్భంలోనైతే ప్రజలు వారిని ఆదరించ రాదని కోరుతూ, ఆ బాధ్యతను వారి మీదకే నెట్టేశారు. ఎంత గట్టి చర్యలను చేపట్టినా వీధి వ్యాపారులు మొండి కేస్తున్నారని తరుచుగా అధికారులు చెబుతుండేవారు. కాబట్టి ప్రజలు తమను తామే తప్పు పట్టుకోవాలని అర్థం. వీధి వ్యాపారులు మొండివారు నిజమే, కానీ అధి కారులు పట్టుదలతో ప్రయత్నించారనడం మాత్రం నిజం కాదు. రాజ్ ఠాక్రే నేతృత్వంలోని నవనిర్మాణ్ సమితి కొంత కాలంగా పలుకుబడిని కోల్పోతోంది. దాని క్యాడర్ పునాది బలహీనపడింది. పని ప్రదేశాలకు సురక్షి తంగా Ðð ళ్లి రావడం అనే సమస్య సరిగ్గా సమయానికి వారి చేతికి అందివచ్చింది. రాజ్, రైల్వే కార్యాలయాలను సందర్శించి వచ్చి ‘‘15 రోజుల్లోగా వీధి వ్యాపారులను తొలగించకపోతే మా తదుపరి మోర్చా శాంతియుతంగా జరగకపోవచ్చు’’ అని చెప్పారు. ఇది అందరి మనసు ల్లోని ఆందోళనను తాకింది. రాజ్ వ్యతిరేకించే బిహార్, యూపీ వారు సహా ప్రతి ప్రయాణికుడి హృదయాన్నీ ఆయన మీటారు. ఈ సమస్య అంత సార్వత్రికమైనది మరి. ఇది, తెలివి ఉన్నా చాకచక్యంలేని ముంబై నగర నిర్వహణా వ్యవస్థలోని ఒక ముఖ్య బలహీనతకు సంబంధించినది. వీధివర్తకుల సంఖ్య ఎంతో కూడా తెలియని నగర పాలక సంస్థల నిర్వహణకు సంబంధించిన ఈ బలహీనత... విధానాలు సహా అన్ని స్థాయిలలో వీధి వర్తకులతో వ్యవహరించే అందరిలోనూ ఉంది. అయితే, ఈ కాలమ్లో రాజ్ ఠాక్రేపై కంటే ఎక్కు వగా వీధి వర్తకులపైనే దృష్టిని కేంద్రీకరిద్దాం. సమస్యా త్మకమైన ముంబై నగర జీవితంలో వారు ఒక భాగం. అనాలోచితంగా ఎక్కడబడితే అక్కడ పుట్టుకొచ్చేసి వీధి వర్తకులు స్టేషన్లకు వెళ్లివచ్చే దారులను, కాలినడక వంతెనలను, వీధి పక్క పాదచారుల బాటలను ఆక్రమిం చేస్తుంటారు. ప్రయాణికులు వారి సమస్యగురించి చికాకు పడుతూనే వారిని ఆదరిస్తుంటారు. అందుబాటులోని దుకాణాలుగా వ్యవహరిస్తూ వీధి వ్యాపారులు నగర ఆర్థిక వ్యవస్థలో భాగమై పోయారు. వలస వచ్చినవారికి, ఇటీవలి కాలంలో స్థానికులకు సైతం అది తేలికగా, త్వరితగతిన సంపాదించుకోగలిగిన జీవనోపాధి కావడమే అందుకు కారణం. నగర ప్రాంత స్థూల జాతీయోత్పత్తిని లెక్కించేటప్పుడు బహుశా వీరికి సంబంధించిన గణాంకాలను లెక్కలోకి తీసుకుని ఉండరు. ఆకాశాన్నంటే రియల్ ఎస్టేట్ ధరల మూలంగా చిన్న ఇంటి దుకాణం పెట్టుకోవడం కూడా అసాధ్యంగా మారింది. ఇది కూడా వారి ఉనికికి కారణం. పార్లమెంటు, వీధి వ్యాపారంపై చట్టపరమైన నిబం ధనలను, రూపొందించింది. వీధి వ్యాపారుల జీవనో పాధి హక్కుకు రక్షణను కల్పించే తీర్పును సుప్రీం కోర్టు 2014లోనే ఇచ్చింది. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం తన వీధి వ్యాపార విధానాన్ని ఇంతవరకు రూపొందించనే లేదు. వారు చెల్లించే రూ. 2,000 కోట్ల విలువైన ముడుపులే ఇందుకు కారణమని, కనీసం ఒక వీధి వ్యాపారుల ట్రేడ్ యూనియన్ చెప్పింది. ఆ సంఖ్య బహుశా ఎక్కువగా చేసి చెప్పనది కావచ్చు. కానీ, వీధి వ్యాపారులతో వ్యవహరించే శాఖకు చెందిన ఉద్యోగులు ఉంటారు కాబట్టి స్వార్థ ప్రయో జనం ఉన్నది నిజమే. వీధి దుకాణదారులను తొలగిం చాక, వారు జరిమానా చెల్లించేసి తిరిగి వస్తారు, జరిమా నాల పెంపుదల వారిని నిరోధించేదిగా ఏం పని చేయక పోగా, లంచాల మొత్తంలో పెరుగుదలకు కారణమౌ తుంది. ముంబై నగర జనాభాను బట్టి చూస్తే చట్టప్రకా రమే మూడు లక్షల మంది వీధి వ్యాపారులను వారి వృత్తులను కొనసాగించుకోడానికి అనుమతించవచ్చు. రహదారుల పక్క కాలిబాటలకు, రోడ్లపై పయ నించే వారికి కనీసమైన అటంకం మాత్రమే కలిగించే విధంగా వారిని వేరే చోట్లకు తరలించడంతోపాటూ, వారి ప్రయోజనాలను కూడా కాపాడటం సులువేమీ కాదు. ప్రధాన రహదారులకు దూరంగా ప్రశాంతంగా ఉండే ప్రాంతాల నివాసులు వారిని ఆహ్వానించరు. వీధివ్యాపారులూ అలాంటి చోట్లకు వెళ్లాలని కోరుకోరు. వీధి వ్యాపారాలు చేస్తున్నామని చెప్పే వారిలో చాలా మంది ఇంత జాగా సంపాదించుకోవాలనుకునే నకిలీ వ్యాపారులని ఒక సర్వేలో తేలింది. అధికార యంత్రాం గం నివారించగలిగిన తలనొప్పులే ఇవన్నీ. ప్రస్తుతానికే అయినా రైల్వే స్టేషన్ల లోపల, చుట్టూతా ఉండే వీధి వర్తకులంతా రాత్రికి రాత్రే ఒక్కరూ కనబడకుండా మటుమాయం కావడం అనే ఘటన.. అధికారులు కోరుకుంటే నగరాలను పరిశుభ్రంగా ఉంచ గలరనే భరోసాను మనకు తిరిగి కల్పించాలి. అయితే, వీధి వ్యాపారుల విధానాన్ని రూపొందించడంలో అన వసర జాప్యం చేయడం వల్ల నగర జనాభాలోని గణ నీయమైన భాగపు జీవనోపాధి హక్కుకు భంగం కలి గించినట్టు అవుతుంది. కావాలంటే ఆ చట్టాన్ని ప్రశ్నించ వచ్చుగానీ, అలాంటి చట్టం ఉన్నదని విస్మరించలేం. మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
'బుల్లెట్'కు ఒక్క ఇటుక పేర్చనీయం
ముంబయి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంపై మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధినేత రాజ్ఠాక్రే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరేల్ రోడ్, ఎల్ఫిన్స్టన్ రోడ్డు రైల్వే స్టేషన్లను కలిపే పాదచారుల వంతెన (ఫుట్ ఓవర్ బ్రిడ్జ్)పై భారీ తొక్కిసలాటను వివిధ కారణాలు చూపించి తప్పించుకోవాలని చూడొద్దంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముందు మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేసే వరకు బుల్లెట్ రైలుకోసం ఒక్క ఇటుక పేర్చనీయం అని హెచ్చరించారు. వర్షాలు ఇప్పుడే కొత్తగా రావడం లేదని, వర్షాల వల్లే తొక్కిసలాట జరిగిందని, అటు కేంద్ర రైల్వే శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తప్పించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు ముంబయి రైల్వేలో జరిగిన ప్రమాదాల జాబితాను అక్టోబర్ 5న అందిస్తామని, ఆ రోజు వారికి డెడ్లైన్ కూడా పెడతామని, అప్పటికీ తమ ఆందోళనను పట్టించుకోకుండా తర్వాత సంగతి తాము చూసుకుంటామని తెలిపారు. -
‘త్వరలో ఇండియాకు మాఫియా డాన్’
-
‘త్వరలో ఇండియాకు మాఫియా డాన్’
సాక్షి,ముంబయిః మహారాష్ర్ట నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో బీజేపీ ప్రభుత్వం మంతనాలు జరుపుతున్నదని అన్నారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న దావూద్ భారత్కు రావాలని అనుకుంటున్నారని, ఇక్కడే తుదిశ్వాస విడవాలని భావిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం దీనిపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. దావూద్ను తాము దేశానికి రప్పించామని ప్రచారం చేసుకునేందుకు బీజేపీ తహతహలాడుతోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం ఈ అంశాన్ని వాడుకునేందుకు బీజేపి ప్రయత్నిస్తుందని విమర్శించారు. తన అధికారిక ఫేస్బుక్ పేజీ ప్రారంభం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో థాకరే ఈ వ్యాఖ్యలు చేశారు. -
ఠాక్రేతో రాందేవ్ భేటీ.. మతలబేంటి?
మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ఠాక్రేను ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ కలిశారు. ముంబైలోని ఆయన నివాసమైన 'కృష్ణ కుంజ్'లో ఉదయం 9.30 గంటల సమయంలో ఈ భేటీ జరిగింది. వారిద్దరూ ఈ భేటీలో ఏం చర్చించుకున్నారో తెలియలేదు గానీ.. ఆ తర్వాత మాత్రం రాందేవ్ బాబాను రాజ్ ఠాక్రే పొగడ్తల్లో ముంచెత్తారు. హిందూ సంప్రదాయం, యోగా, ఆయుర్వేదం తదితర అంశాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంలో రాందేవ్ మంచి పాత్ర పోషిస్తున్నారని అన్నారు. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల ద్వారా ఆయుర్వేదం ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి చాటుతున్నారని తెలిపారు. రాందేవ్ను కలవడం చాలా గొప్పగా అనిపిస్తోందని కూడా ఆయన చెప్పారు. అయితే ఈ సమావేశం గురించి రాందేవ్ వైపు నుంచి గానీ, పతంజలి గ్రూపు నుంచి గానీ ఎలాంటి సమాచారం విడుదల కాలేదు. -
శివసేన విజయానికి బ్రేకులు!
దేశంలోనే అత్యంత ధనవంతమైన కార్పొరేషన్ అయిన బీఎంసీ ఎన్నికలు వాడి వేడిగా జరిగాయి. మొత్తం 227 వార్డులకు గాను 2275 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. చాలా కాలంగా బీజేపీ - శివసేన కూటమి పాలనలో ఉన్న బీఎంసీలో ఈసారి ఈ రెండు పార్టీలు ఎదురెదురుగా తలపడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు భుజాల మీద చేతులు వేసుకుని తిరిగిన నాయకులు ఇప్పుడు కత్తులు దూశారు. అయితే, ఈసారి శివసేన విజయాన్ని అడ్డుకునేది బీజేపీ కాకపోవచ్చని.. ఠాక్రేల కుటుంబం నుంచే వచ్చిన మరో పార్టీ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అని విశ్లేషకులు భావిస్తున్నారు. చాలావరకు వార్డులలో శివసేన ఓట్లను రాజ్ఠాక్రే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ చీల్చుకోవచ్చని అంచనా వేస్తున్నారు. సొంతంగా గెలిచేంత బలం ఎంఎన్ఎస్కు లేకపోయినా.. మరాఠా సెంటిమెంటుతో శివసేన పొందాలనుకున్న ఓట్లను మాత్రం చాలావరకు అది చీల్చే అవకాశం ఉందని, దానివల్ల అంతిమంగా బీజేపీకి లబ్ధి చేకూరవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఫలితాలు వెలువడేవరకు ఇది అంచనా మాత్రమే అవుతుంది. ఆ తర్వాతే అసలు విషయం తెలుస్తుంది. మొత్తం 227 వార్డులకు గాను ముంబైలో 7034 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. మొత్తం 91,80,491 మంది ఓటర్లుండగా, వారిలో 50,30,361 మంది పురుషులు, 49,49,749 మంది మహిళలు, 381 మంది 'ఇతరులు' ఉన్నారు. -
అంతరార్థం ఏమిటి?
విశ్లేషణ రాజకీయ పార్టీలు రకరకాల కారణాలతో ఏర్పడుతుంటాయి. వాటిలో ఒకటి నల్లధనాన్ని అక్రమంగా చలామణి చేయడమని ఎన్నికల కమిషన్ గుర్తించింది. అలాంటి దాదాపు రెండు వందల పార్టీల గుర్తింపును రద్దు చేసింది. పార్టీల ఏర్పాటుకు ఇతర కారణాలూ ఉంటాయి. పార్టీలోని వ్యక్తిగత, భావజాల వివాదాలు, వారసత్వ పోరాటాలు వంటివి కూడా వాటిలో ఉంటాయి. ములాయంసింగ్ యాదవ్ చేతులెత్తేయకపోతే రెండు సమాజ్వాదీ పార్టీలుండేవే. పదేళ్ల క్రితం రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్ఎన్ఎస్)ను ఏర్పాటు చేయడంతో శివసేన చీలిపోయింది. అదో ప్రత్యేకవాద పార్టీ. తమ పార్టీ అది కాక మరేదో అన్నట్టుగా అది నటించిందీ లేదు. మౌలికంగా మరాఠీలే ఆ పార్టీ ఓటర్లు. అది, తమది బాల్ ఠాక్రే నిర్మించిన పార్టీగా చెప్పుకుంటుంది. అయితే ఈ పార్టీ ఏర్పాటుకు అసలు కారణం నేడు రాజ్ మేనబావ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ఉన్న శివసేన నాయకత్వ వారసత్వ సమస్య వల్ల మాత్రమే ఎమ్ఎన్ఎస్ ఏర్పడింది. ఇద్దరూ మరాఠీలే కాబట్టి, వారు ఐక్యం కావాలని రెండు పార్టీల కేడరూ కోరుకుంటున్నారని ఎప్పుడూ వారికి సూచనలు అందుతూనే ఉన్నాయి. అయితే ఆ ఇద్దరు నేతలు మాత్రం ఆ విషయం గురించి ఎన్నడూ మాట్లాడలేదు. కలసి పనిచేయడం కాదుగదా, కనీసం ఇద్దరి మధ్య అగాధాన్ని పూడ్చే ప్రయత్నమైనా వారిలో ఏ ఒక్కరూ చేయలేదు. స్థానిక పౌర పరిపాలనా సంస్థల నుంచి శాసనసభ వరకు అన్ని స్థాయిల్లోని ఎన్నికల రాజకీయాల్లోనూ వారు ప్రత్యర్థులుగానే ఉంటూ వచ్చారు. అయితే, ముంబైసహా పది ప్రధాన పౌర పురపాలన సంస్థలకు జరుగుతున్న ఎన్నికల్లో రాజ్ ఠాక్రే హఠాత్తుగా ఆశ్చర్యకరంగా ప్రవర్తించారు. రాజ్ తన బావ ఉద్ధవ్కు ఏడు సార్లు ఫోన్ చేశారు. ఆయన ఫోన్ తీయలేదు. ఉద్ధవ్ ఎక్కడ, ఎన్ని సీట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డా అంగీకరించి రెండు పార్టీల మధ్య ఎన్నికల సర్దుబాట్లు చేసుకోవాలనేదే ఈ చర్య వెనుక ఉన్న S ఉద్దేశం. రాజ్ పంపిన దూతను సైతం ఉద్ధవ్ కలవలేదు. మరో నేతను కలిసినా ఎలాంటి ఫలితమూ లేకపోయింది. ఇది, ఎంత హఠాత్తుగా మొదలైందో అంత హఠాత్తుగానే ముగిసిపోయిన ప్రధాన పరిణామం. బలహీనపడుతున్న ఎమ్ఎన్ఎస్ నేత వేసిన ఈ ఎత్తుగడ ఆయనలోని నిస్పృహను సూచిస్తోంది. నాసిక్ మునిసిపల్ కార్పొరేషన్లో మూడొంతుల మంది కార్పొరేటర్లు, అంటే 40 మంది ఉన్న ఎమ్ఎన్ఎస్ ఆ సంస్థను నియంత్రిస్తోంది. కానీ అక్కడి ఆ పార్టీ ప్రతినిధులు శివసేనలోకో లేక బీజేపీలోకో ఫిరాయిస్తున్నారు. 2009లో 13గా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 2014 నాటికి ఒకటికి పడిపోయింది. ఏ ప్రాతినిధ్య సంస్థలోనైనా ఎంత మంది ప్రజాప్రతినిధులున్నారు అనే దాన్ని బట్టే ఒక పార్టీ బలాన్ని లెక్కిస్తారు. అంతేగానీ ఏ సమస్యపైనైనా అది ఎంత ప్రభావాన్ని నెరపగలుగుతుందనేదాన్ని బట్టి కాదు. సేన, ఎమ్ఎన్ఎస్లకు సొంత రాజకీయ రంగ స్థలిౖయెన ముంబైలో పార్టీ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కీలకమైనది. దాదర్ శివసేనకు కీలక ప్రాంతం. గత ఎన్నికల్లో ఎమ్ఎన్ఎస్ చిత్తుగా ఓడిపోయింది. ఠాక్రే కుటుంబీకులు నివసించే ది, శివసేన ఏర్పడింది, దాని ప్రధాన కార్యాలయం ఉన్నది ఆ ప్రాంతంలోనే. ఈ ఘోర పరాజయం రాజ్కు మింగుడు పడటం కష్టమే. ఇకపై శివసేన ఏ పార్టీతోనూ ఎన్నికలకు ముందు కలిసేది లేదని ఆ పార్టీ ముందుగానే ప్రకటించిందనే విషయాన్ని ఇక్కడ చెప్పడం అవసరం. అయినా రాజ్ ఠాక్రే సర్దుబాట్ల కోసం పాకులాడారు. బీజేపీకి, సేనకు మధ్యనే ప్రధానంగా సాగే ఎన్నికల పోరులో మరాఠీ ఓట్లు చీలిపోకూడదనేదే తమ ఉద్దేశమని వివరించ డానికి ఆయన తంటాలుపడ్డారు. ఇదో చిన్నపాటి బెదిరింపే కాదు, ఆ పునాదిని నిలబెట్టుకోగలిగే ఆశలు లేవని ఎమ్ఎన్ఎస్ అంగీకరించడం కూడా. అయితే రాజ్ ఇలా ఉద్ధవ్కు సంకేతాలను పంపడం అతి చాకచక్యంగా వేసిన ఎత్తు అని ప్రస్తుతం రాజకీయ పరిశీలకులు విశ్వసిస్తున్నారు. ముంబై స్థానిక ఎన్నికల్లో బీజేపీ చేతుల్లో శివసేన ఓడిపోతే... మరాఠీ భూమిపుత్రులతో శివసేన జూదం ఆడాలని ప్రయత్నిం చిందనే విషయం ప్రపంచానికి తెలుస్తుంది అనేదే రాజ్ ఉద్దేశమని అంటున్నారు. బీజేపీని మహారాష్ట్రేతరుల పార్టీగానే చూస్తుంటారు. అది వాస్తవాలపై ఆధారపడి ఏర్పడ్డ అభిప్రాయం కానవసరం లేదు. అయినాగానీ బీజేపీ చేతిలో ఓటమి కంటే ఎక్కువగా మరాఠీ అస్తిత్వాన్ని గాయపరచేది మరొకటి ఉండదు. ఒక రాజకీయ పరిణామం జరిగిన తర్వాత దానికి కారణాన్ని చెప్పడం అవసరం. శివసేన ఓటమిని వివరించడానికి జరిపే విశ్లేషణగా అది తెలివైన ఎత్తే కావచ్చు. కానీ అసలీ కాళ్లబేరంలో రాజ్ ఠాక్రే తాను ద్వేషించే నాయకుని పార్టీతోనే మైత్రిని కోరి తన బలహీనతను ఎందుకు ప్రదర్శించాల్సి వచ్చిందో అది వివరించదు. ఏది ఏమైనా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఎమ్ఎన్ఎస్ను అది తక్కువగా చేసి చూపింది. - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
పాక్ నటి ప్రచారంపై ఠాక్రేకు షారుక్ హామీ
ముంబై: తన తాజా చిత్రం ‘రయీస్’ ప్రచార కార్యక్రమాల్లో పాకిస్తాన్ నటి మహీరా ఖాన్ పాల్గొనబోదని బాలీవుడ్ సూపర్స్టార్ షారుక్ఖాన్ మహారాష్ట్ర నవ్నిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రేకు హామీ ఇచ్చారు. ఠాక్రేతో భేటీ సందర్భంగా ఈ హామీ ఇచ్చారని ఎంఎన్ఎస్ చిత్రపథ్ కర్మచారి సేన చీఫ్ అమీ ఖోప్కర్ సోమవారం చెప్పారు. రయీస్ ప్రదర్శనను తాము అడ్డుకోబోమని, ఈ సినిమాలో పాలుపంచుకున్న పాక్ నటులెవరూ ఇక్కడ ఉండరని అన్నారు. రయీస్ సినిమాలో మహీరా నటించారు. -
సూపర్స్టార్కు రాజ్ఠాక్రే ఏం చెప్పారు?
బాలీవుడ్ సూపర్స్టార్ షారుక్ ఖాన్ నటించిన రయీస్ సినిమా విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా అంటే వచ్చే సంవత్సరం జనవరి 26వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ, సినిమాలో హీరోయిన్గా పాకిస్థానీ నటి మహీరా ఖాన్ నటించడమే సినిమాకు పెద్ద అడ్డంకిగా మారింది. పాకిస్థానీ నటులు నటించిన సినిమాలను విడుదల కానివ్వబోమని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధిపతి రాజ్ ఠాక్రే ఇంతకుముందే గట్టిగా వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఈ సినిమా ఏమవుతుందోనన్న ఆందోళనలు మొదలయ్యాయి. దాంతో.. సినిమా హీరో షారుక్ ఖాన్ స్వయంగా రాజ్ఠాక్రే వద్దకు వెళ్లి సినిమా గురించి, సినిమా ప్రచారం గురించి వివరణ ఇచ్చుకున్నారు. మాహిరాఖాన్ ఈ సినిమాను భారతదేశంలో ఏమాత్రం ప్రమోట్ చేయబోదని షారుక్ చెప్పారు. గతంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో జరిగిన సమావేశంలో భవిష్యత్తులో తీయబోయే సినిమాలు వేటిలోనూ పాకిస్థానీ ఆర్టిస్టులు ఉండబోరని హామీ ఇచ్చారని, అలాగే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మాహిరాఖాన్ ప్రచారం చేస్తుందంటూ వచ్చిన కథనాలను కూడా షారుక్ ఖండించారని రాజ్ ఠాక్రే చెప్పారు. అయితే ఇంతకుముందు ఈ సినిమా నిర్మాత రితేష్ సిధ్వానీ మాత్రం మాహిరా ఖాన్కు పూర్తి మద్దతుగా నిలిచారు. అవసరమైతే ఆమెతో కూడా భారతదేశంలో సినిమాను ప్రమోట్ చేయిస్తామని ఆయన చెప్పారు. పాకిస్థానీ నటులు భారతదేశంలో ప్రవేశించకుండా ప్రభుత్వం వైపు నుంచి నిషేధం ఏమీ లేదని అన్నారు. కరాచీకి చెందిన మాహిరా ఖాన్ (31) దుబాయ్లో షారుక్తో కలిసి రెండు పాటల షూటింగ్లో పాల్గొంటుందని ఇంతకుముందు వార్తలొచ్చాయి. -
'యూపీ, బీహార్గా రాష్ట్రాన్ని మార్చేస్తున్నారు'
► కుల రాజకీయాలపై రాజ్ ఠాక్రే ఉద్వేగ ప్రసంగం ముంబై : మహారాష్ట్రలో జరుగుతున్న కుల రాజకీయాలపై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇద్దరు మిత్రులు కలిసి భోజనం చేస్తే వారి మధ్య కులం చిచ్చు పెట్టే రాజకీయాలు రాష్ట్రంలో ఇంతవరకు చూడలేదన్నారు. పుణేలో ఎమ్మెన్నెస్ కార్యకర్తల సదస్సులో ఆయన ఉద్వేగంతో ప్రసంగించారు. కొందరు స్వార్థపరులు స్వలాభం కోసం ప్రజల్లో కులం చిచ్చు రగిలిస్తున్నారని రాజ్ ఠాక్రే మండిపడ్డారు. రాష్ట్రాన్ని యూపీ, బీహార్గా మార్చే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి రాజకీయ నాయకుల ఆటలు సాగినివ్వబోమన్నారు. తన కుటుంబ సభ్యులు కులం గురించి నేర్పలేదన్నారు. మీరు నిజంగా నా శ్రేయోభిలాషులైతే కులం గురించి పట్టించుకోవద్దని కార్యకర్తలకు ఆయన హితవు పలికారు. మొన్నటి వరకు కలిసి ఉన్న మనమంత కేవలం కులం కారణంగా వైరులు అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రం వెనకబడిపోతుందన్నారు. వచ్చే యువతరానికి ఏమిస్తామని, రాష్ట్రంలో ఏం జరుగుతోందని రాజ్ ఠాక్రే ప్రశ్నించారు. కులానికి రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేస్తూ అనేక వర్గాలు ర్యాలీలు, మోర్చాలు నిర్వహిస్తున్నాయన్నారు. కులానికి రిజర్వేషన్ ఎందుకు, ఆర్థికంగా వెనకబడిన వారికి ఇవ్వాల్సిన అవసరం ఎంతైన ఉందని రాజ్ ఠాక్రే చెప్పారు. ఏ కులం నాయకుడు ఆ కుల ప్రజల కోసం ఏం చేశారు..? ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారు. ఎన్నికల కోసం ప్రజలను పావుల్లా వాడుకుంటున్నారు. ఎన్నికల్లో గెలవగానే ప్రజలను గాలికి వదిలేస్తున్నారు. కులం, రిజర్వేషన్ పేరుతో మనలో మనమే గొడవ పడుతున్నాం. కాని కులానికి రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ ఉద్యోగాలెక్కడున్నాయి...? అని ప్రశ్నించారు. భూమి పుత్రులకు అన్యాయం జరుగుతుందని, పరప్రాంతీయులే ఉన్న కాస్తా ఆ ఉద్యోగాలను కాజేస్తున్నారని మండిపడ్డారు. ఇక ఇలాంటి రాజకీయ జిమ్మిక్కులకు పుల్స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజ్ ఠాక్రే ఉద్ఘాటించారు. -
పార్టీ గుర్తు మార్చే పనిలో ఎంఎన్ఎస్!
ముంబై: మహారాష్ట్రలో త్వరలో జరగనున్న బృహత్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో రాజ్ఠాక్రే ఆధ్వర్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎంఎన్ఎస్) కొత్త పార్టీ గుర్తుతో బరిలోకి దిగాలని నిర్ణయించింది. ఈ పార్టీ గుర్తుగా రైలింజన్ను దాదాపు ఖరారు చేసినట్టు కొందరు నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఎంఎన్ఎస్ పార్టీ మహారాష్ట్రలో గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోంది. 2009లో జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 13 స్థానాలు సాధించిన ఎంఎన్ఎస్, 2013లో మాత్రం కేవలం ఒక స్థానం సాధించి పూర్తిగా చతికలపడిన విషయం తెలిసిందే. పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికే గుర్తు మారుస్తున్నారని పార్టీ నాయకులు భావిస్తున్నప్పటికీ కారణాలు మాత్రం కచ్చితంగా తెలియరాలేదు. గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ ఆర్టిస్టులపై నిషేధం విషయంలో ఎంఎన్ఎస్ నేతలు వీరంగం సృష్టించారు. థియేటర్ల యాజమాన్యాన్ని బెదిరించడం, బాలీవుడ్ దర్శకనిర్మాతలను హెచ్చరిస్తూ వ్యవహారాన్ని పెద్దది చేయడంతో.. ఇండస్ట్రీకి చెందిన కొందరు ఏకంగా హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను ఆశ్రయించారు. చివరికి కరణ్ జోహర్ తీసిన మూవీ విడుదలై రికార్డు కలెక్షన్లు వసూలు చేస్తోంది. పార్టీ గుర్తు మార్చితే.. బీఎంసీ ఎన్నికల్లో ఎంఎన్ఎస్ ఫేట్ మారుతుందో లేదో తెలియాలంటే ఆ ఎన్నికల ఫలితాల వరకు వేచిచూడాల్సిందే. -
అవసరమైతే రాజ్ఠాక్రేపై చర్యలు: సీఎం
ఏ దిల్ హై ముష్కిల్ సినిమా విడుదల, ప్రదర్శన విషయంలో చట్టాన్ని ఉల్లంఘిస్తే.. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రేపై చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఆయన చెప్పారు. సెన్సార్ బోర్డు సినిమా విడుదలకు ఆమోదం తెలిపిందంటే.. ఇక ఎవరూ ఆ సినిమా విడుదలను అడ్డుకోవడానికి వీల్లేదని, చట్టాన్ని ఉల్లంఘించడానికి ఏ ఒక్కరినీ అనుమతించేది లేదని ఫడ్నవిస్ అన్నారు. రాజ్ఠాక్రే ఒకవేళ చట్టాన్ని ఉల్లంఘించే ప్రయత్నాలు చేస్తే.. ఆయనపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సినిమా నిర్మాతలు తప్పనిసరిగా ఆర్మీ సహాయ నిధికి రూ. 5 కోట్ల విరాళం ఇవ్వాలన్న ప్రతిపాదనను తాను వ్యతిరేకించినట్లు సీఎం ఫడ్నవిస్ తెలిపారు. వాళ్లు కావాలంటే స్వచ్ఛందంగా ఇచ్చుకోవచ్చన్నారు. చట్టబద్ధంగా ఎవరైనా పాకిస్థానీ నటులు తగిన పత్రాలతో భారతదేశానికి వస్తే, వాళ్లకు తమ ప్రభుత్వం చట్టప్రకారం భద్రత కల్పిస్తుందని కూడా ఆయన తెలిపారు. కాగా, పాకిస్థానీ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమా.. విడుదల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంది. పలు ప్రాంతాల్లో ఎంఎన్ఎస్ కార్యకర్తలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. -
సీఎంపై సీనియర్ నటి మండిపాటు!
'యే దిల్ హై ముష్కిల్' (ఏడీహెచ్ఎం) సినిమా విడుదల విషయంలో ఎమ్మెన్నెస్ అధినేత రాజ్ ఠాక్రే, చిత్ర దర్శకుడు కరణ్ జోహార్ మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీ కుదిర్చిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించినందుకు ఈ సినిమాపై ఎమ్మెన్నెస్ నిషేధం విధించింది. సీఎం సమక్షంలో జరిగిన చర్చల నేపథ్యంలో ఏడీహెచ్ఎంపై నిషేధం ఎత్తివేసేందుకు రాజ్ ఠాక్రే అంగీకరించారు. అంతేకాకుండా భవిష్యత్తులో పాక్ నటులతో సినిమాలు తీయవద్దని, అలా సినిమాలు తీస్తే రూ. ఐదు కోట్లు భారత ఆర్మీ జవాన్ల సంక్షేమ నిధికి ఇవ్వాలని రాజ్ ఠాక్రే షరతులు పెట్టారు. అయితే, ఈ విషయంలో సీఎం స్థాయి వ్యక్తి రాజీయత్నాలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం ఫడ్నవిస్ తీరును బాలీవుడ్ సీనియర్ నటి షబానా ఆజ్మీ తీవ్రంగా తప్పుబట్టారు. 'ఎంత దారుణమైన పరిస్థితి ఇది! సీఎం బ్రోకరిజం చేసి రూ. 5 కోట్లకు దేశభక్తిని కొనుగోలు చేశారు. ఏడీహెచ్ఎం శాంతియుతంగా విడుదల అయ్యేలా చూస్తామని ఏకంగా కేంద్ర హోంమంత్రి హామీ ఇచ్చాక కూడా ఇలా జరిగింది’ అని షబానా వరుస ట్వీట్లలో మండిపడ్డారు. ’నేను దేశభక్తురాలినా? కాదా? అన్నది ఎమ్మెన్నెస్ నిర్ణయిస్తుందా? నేను రాజ్యాంగానికి బద్ధురాలిని కానీ, రాజ్ ఠాక్రేకు కాదు. నిజానికి ఆయన దేశభక్తిని ప్రశ్నించాల్సిన అవసరముంది’ అని పేర్కొన్నారు. 'యే దిల్ హై ముష్కిల్’ విడుదలకు కేంద్రహోంమంత్రి హామీ ఇచ్చినా ఆయనపై సీఎం ఫడ్నవిస్ ఏమాత్రం గౌరవం చూపలేదని, ఆయన నుంచి బీజేపీ వివరణ అడగాలని ఆమె డిమాండ్ చేశారు. -
సినిమా వాళ్ల బలవంతపు విరాళాలు మాకొద్దు
బాలీవుడ్ సినిమా ఏ దిల్ హై ముష్కిల్ విడుదల విషయంలో నెలకొన్న రాజకీయాల్లోకి తమను అనవసరంగా లాగొద్దని సైన్యం తేల్చిచెప్పింది. పాక్ నటీనటులను సినిమాలో పెట్టుకున్నందుకు గాను సైన్యం సహాయనిధికి రూ. 5 కోట్ల విరాళం ఇవ్వాలంటూ నిర్మాతలకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన చేసిన డిమాండు సహేతుకం కాదని చెప్పింది. ఈ విషయమై పలువురు సైన్యాధికారులు తమ తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఆర్మీ ఎప్పుడూ నిధుల కోసం వాళ్ల దగ్గరకు, వీళ్ల దగ్గరకు వెళ్లదని.. సినిమా నిర్మాతలు ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చుగానీ ఇలా బలవంతంగా ఇప్పించకూడదని అన్నారు. ఆర్మీని రాజకీయాలకు దూరంగా ఉంచాలని చెప్పారు. ఏ దిల్ హై ముష్కిల్ సినిమా విడుదలను తాము అడ్డుకోబోమంటూ ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు సినిమాకు ఆటంకాలు కొంతవరకు తగ్గినట్లే కనిపించాయి. అయితే సినిమా థియేటర్ల సంఘాల వాళ్లు మాత్రం.. దీన్ని తాము ప్రదర్శించేది లేదని చెబుతున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో జరిగిన సమావేశంలో.. ముందుగా సైన్యం సహాయ నిధికి రూ. 5 కోట్లు ఇవ్వాలని ఎంఎన్ఎస్ డిమాండు చేయగా, దానికి నిర్మాతలు అంగీకరించారు. మామూలుగా ఎవరు ఏం ఇవ్వాలనుకున్నా సరేగానీ, ఇలా బలవంతంగా ఇప్పించిన డబ్బును తాము స్వీకరించేది లేదని ఆర్మీ ప్రధాన కార్యాలయంలోని ఓ సీనియర్ అధికారి తెలిపారు. జాతి సెంటిమెంట్లను ఇలా వాడుకోకూడదని.. ఏదైనా తప్పయితే దాన్ని తప్పనే అనాలి తప్ప బలవంతంగా రూ. 5 కోట్లు విరాళం ఇప్పించినంత మాత్రాన తప్పు ఒప్పయిపోదని కార్గిల్ యుద్ధ హీరో బ్రిగేడియర్ కుషాల్ ఠాకూర్ (రిటైర్డ్) అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆర్మీ పేరును వాడుకోకూడదన్నదే తమ అభిప్రాయమన్నారు. యుద్ధంలో మరణించినవాళ్ల కుటుంబాల సంక్షేమం కోసం ఇటీవలే ఆర్మీ ఓ బ్యాంకు ఖాతా తెరిచింది. తాము విరాళాలు ఇస్తామంటూ పలు సంస్థలు, పలువురు వ్యక్తులు రక్షణ మంత్రిత్వశాఖను సంప్రదించిన తర్వాత ఈ ఖాతా తెరిచారు. -
'ప్రతి నిర్మాత రూ.5 కోట్లు ఇవ్వాలి'
ముంబై: వివాదాలే ఊపిరిగా మహారాష్ట్రలో మనుగడ సాగిస్తోన్న మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎంఎన్ఎస్) కనీవినీ ఎరుగని డిమాండ్ ను తెరపైకి తెచ్చింది. 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా విడుదలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, దర్శకనిర్మాత కరణ్ జోహార్ లతో భేటీలో పాల్గొన్న ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. (సినిమా రంగంలో కీలక పరిణామం) పాకిస్థానీ నటులతో సినిమాలు తీసిన ప్రతి ఒక్క నిర్మాత రూ.5కోట్లను సైనిక సహాయ నిధి(ఆర్మీ రిలీఫ్ ఫండ్)కి ఇవ్వాలని రాజ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని నిర్మాతలందరూ తప్పక అంగీకరించాలని, రూ.5కోట్లు ఇచ్చేందుకు నోటిమాటగా కాకుండా రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని ఆయన అన్నారు. అంతేకాదు, భారతీయ నిర్మాతలెవ్వరూ పాకిస్థానీ నటీనటులను సినిమాల్లోకి తీసుకోవద్దని, ఒకవేళ అలా చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని ఠాక్రే హెచ్చరించారు. ఉడీ ఉగ్రదాడి తర్వాత పాక్ నటులపై నిషేధం విధించాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన ఎంఎన్ఎస్.. పలు నిర్మాతల మండళ్లు, ఎగ్జిబిటర్ల మద్దతుసైతం కూడగట్టిన సంగతి తెలిసిందే. ఉడీ అమరజవాన్లకు నివాళులు అర్పించడంతోపాటు భవిష్యత్ లోపాక్ నటులను తీసుకోబోమన్న హామీపై 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా విడుదలకు రాజ్ ఠాక్రే అంగీకరించారు. సీఎం ఫడ్నవిస్ సమక్షంలో దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఈ ఒప్పందానికి తలొగ్గారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 28న ఆ సినిమా విడుదల కానుంది. -
సీఎం సమక్షంలో సినిమా వివాదానికి తెర!
ముంబై: రొమాంటిక్ సినిమా విషయంలో కొద్ది రోజులుగా కొనసాగిన సస్సెన్స్ థ్రిల్లర్ ఎట్టకేలకు ముగిసింది. సినిమా విడుదల కావాలంటే సెన్సార్ బోర్డు అనుమతి తప్పనిసరి. కానీ ఓ సినిమా మాత్రం సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వానిధేత, ఒక పార్టీ నేతల అనుమతితో విడుదలవుతోంది. భారతీయ సినిమా రంగంలో కీలక పరిణామంగా భావిస్తోన్న ఈ ఒప్పందానికి సీఎం అధికారిక నివాసం వేదికైంది. ముంబైలోని మహారాష్ట్ర ముఖ్యమంత్రి నివాసంలో శనివారం ఉదయం జరిగిన కీలక భేటీలో.. కరణ్ జోహార్ దర్శకనిర్మాతగా రూపొందించిన 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా విడుదలకు అంగీకారం కుదిరింది. సినిమా విడుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోన్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే, సినిమా విడుదల కోసం పాట్లు పడుతోన్న కరణ్ జోహార్ తోపాటు నిర్మాతల సంఘం అధ్యక్షుడు ముఖేష్ భట్ లు భేటీలో పాల్గొన్నారు. సినిమా ప్రారంభానికి ముందు ఉడీఉగ్రదాడిలో చనిపోయిన అమరజవాన్లకు నివాళులు అర్పిస్తూ ప్రకటన ఇవ్వడం, భవిష్యత్తులో తీయబోయే సినిమాల్లో పాకిస్థానీ నటీనటులను తీసుకోకపోవడం' అని రెండు డిమాండ్లకు దర్శకనిర్మాత తలొగ్గడంతో 'ఏ దిల్ హై ముష్కిల్' విడుదలకు లైన్ క్లియర్ అయింది. (రెచ్చిపోయిన ఐశ్వర్య రాయ్..) సినిమా విడుదలను అడ్డుకోవద్దని, ఒకవేళ ఎవరైనా ఆ పనిచేస్తే తాటతీస్తామని సీఎం ఫడ్నవిస్ ఇంతకుముందే ప్రకటించారు. అయితే ఎంఎన్ఎస్ ఒత్తిడి మేరకు ఎగ్జిబిటర్లు, థియేటర్ల యజమానులు ఆ సినిమాను ప్రదర్శించేందుకు నిరాకరించారు. దీంతో చర్చలు అనివార్యం అయ్యాయి. డీల్ కుదిరిన పిమ్మట బయటికి వచ్చిన రాజ్ ఠాక్రే.. సినిమా విడుదలకు సహకరిస్తామని చెప్పారు. కరణ్ జోహార్ తరఫున ముఖేఖ్ భట్ మాట్లాడుతూ.. 'ఏ దిల్ హై ముష్కిల్ లో 300 మంది భారతీయులు పనిచేశారని, పాకిస్థానీ నటుడు ఫవద్ ఖాన్ ఆఫ్ట్రాల్ నాలుగు నిమిషాలు కనిపిస్తాడని, అయినాసరే సీఎంకు ఇచ్చిన రెండు హామీలను నిలబెట్టుకుంటామని చెప్పారు. (హీరోహీరోయిన్ల స్టన్నింగ్ ఫొటో) ఆందోళన మొదలైందిలా.. కశ్మీర్ లోని ఉడీ సైనిక స్థావరంపై సెప్టెంబర్ 18న పాకిస్థానీ ఉగ్రవాదులు దాడిచేయడం, 19 మంది జవాన్లను పొట్టనపెట్టుకోవడం తెలసిందే. నాటి దాడిని ప్రపంచమంతా తీవ్రంగా ఖండించింది. బాలీవుడ్ ప్రముఖులు కూడా పాకిస్థాన్ తీరుపై భగ్గుమన్నారు. అయితే బాలీవుడ్ లో పనిచేస్తోన్న పాకిస్థానీ నటీనటులు మాత్రం ఉడీపై నోరు మెదపలేదు. దీంతో పాక్ యాక్టర్లను బహిష్కరించాలని ఎంఎన్ఎస్ ఆందోళనలు ప్రారంభించింది. స్థానబలం వల్ల క్రమంగా ఆ ఆందోళనలకు మద్దతు లభించింది. మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల్లోని నిర్మాతల మండళ్లు, ఎగ్జిబిటర్లు పాక్ నటులున్న సినిమాలను ప్రదర్శించబోమని తేల్చిచెప్పారు. అప్పటికే తాను తీసిన 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా విడుదల తేదీని ప్రకటించిన కరణ్ జోహార్ కు ఎంఎన్ఎస్ నిర్ణయం శరాఘాతంలా మారింది. తనకు దేశం ముఖ్యమని, పరిస్థితులు మరోలా ఉన్నప్పుడు తీసిన సినిమాను ఇప్పుడు అడ్డుకోవడం తగదని కరణ్ జోహార్ పలు వేదికల నుంచి ఎంఎన్ఎస్ ను వేడుకున్నాడు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను సైతం కలిసి సహాయాన్ని ఆర్థించాడు. చివరికి మహారాష్ట్ర సీఎం సమక్షంలో ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదిరింది. కరణ్ జోహార్ దర్శకత్వం వహించి, నిర్మించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్, రణ్ బీర్ కపూర్, అనుష్క శర్మ, ఫవద్ ఖాన్ లు ప్రధాన తారగణం. 'బాద్ షా' షారూఖ్ ఖాన్ కూడా తళుక్కున మెరవనున్నారు. ప్రీతం చక్రవర్తి సంగీతం అందిస్తున్నారు. యధావిథిగా దీపావళి కానుకగా అక్టోబర్ 28న 'ఏ దిల్ హై ముష్కిల్' ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఫడ్నవీస్తో రాజ్ ఠాక్రే, కరణ్ జోహార్ భేటీ
ముంబయి: ‘ఏ దిల్ హై ముష్కిల్’ పంచాయితీ తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వద్దకు చేరింది. పాకిస్తాన్ నటులు నటించిన ఈ చిత్రాన్ని బహిష్కరించాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన హెచ్చరికల నేపథ్యంలో ఎమ్ఎన్ఎస్ చీఫ్ రాజ్ఠాక్రే, నిర్మాత, దర్శకుడు కరణ్ జోహర్ శనివారం ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ప్రముఖ నిర్మాత ముఖేష్ భట్ కూడా హాజరయ్యారు. సమావేశం అనంతరం ముఖేష్ భట్ మాట్లాడుతూ భవిష్యత్లో పాకిస్తాన్ నటులతో సినిమాలు తీయమని సీఎంకు హామీ ఇచ్చామన్నారు. అలాగే సినిమా ప్రారంభంలో అమర జవాన్ల త్యాగాలను స్మరిస్తూ న్యూస్ రీల్ను ప్రదర్శించనున్నట్లు కరణ్ జోహార్ ఈ సందర్భంగా ఫడ్నవీస్కు తెలిపినట్లు ఆయన వెల్లడించారు. దీంతో ఎట్టకేలకు ఏ దిల్ హై ముష్కిల్ విడుదలకు లైన్ క్లియర్ అయింది. కాగా దీపావళి సందర్భంగా దిల్ హై ముష్కిల్ చిత్రం ఈ నెల 28న విడుదల కావాల్సి ఉంది. -
సల్మాన్ సినిమాలనూ నిషేధిస్తాం: రాజ్ ఠాక్రే
పాకిస్థాన్కు చెందిన నటీనటులంతా వెంటనే దేశాన్ని విడిచి వెళ్లిపోవాలంటూ 48 గంటల అల్టిమేటం ఇచ్చిన ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే మరోసారి అదే అంశంపై స్పందించారు. ఈసారి ఆయన బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్కు ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు. వాళ్లకు మరీ అంత ఇబ్బందిగా అనిపిస్తే వాళ్ల సినిమాలను కూడా నిషేధిస్తామని చెప్పారు. మన దేశంలో నటీనటులకు కొరతగా ఉందా అని ప్రశ్నించారు. అసలు పాకిస్థానీ నటులు మన సినిమాల్లో పనిచేయాల్సిన అవసరం ఏముందో తనకు అర్థం కావడం లేదన్నారు. మన కోసం జవాన్లు సరిహద్దుల్లో పోరాటం చేస్తున్నారని.. వాళ్లంతా ఆయుధాలు కింద పడేస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. మన సరిహద్దులను కాపాడేది ఎవరు.. సల్మాన్ ఖానా అని ప్రశ్నించారు. దేశం ముఖ్యమన్న విషయాన్ని వీళ్లంతా గుర్తించాలని చెప్పారు. -
‘థాకరేను సల్మాన్ ఖాన్ కలవలేదు’
ముంబై: మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ థాకరేను హీరో సల్మాన్ ఖాన్ కలిసినట్టు వచ్చిన వార్తలను ఆ పార్టీ తోసిపుచ్చింది. పాకిస్థాన్ నటులు ఉన్న ప్రతి సినిమా విడుదలను అడ్డుకుంటామని ఎమ్మెన్నెస్ ప్రకటించిన నేపథ్యంలో థాకరేను సల్మాన్ ఖాన్ కలిసినట్టు వార్తలు వచ్చాయి. ఇవన్నీ వదంతులేనని చిత్రపట్ సేన అధ్యక్షుడు అమేయ్ ఖోపాక్ అన్నారు. పాకిస్థాన్ కళాకారులు దేశం విడిచి వెళ్లిపోవాలన్న తమ విధానంలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదన్నారు. పారిస్ దాడులను పాక్ నటులు ఖండించి, మృతులకు సంతాపం తెలిపారని.. ఉడీ ఉగ్రదాడి గురించి వారెందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. సినిమా, కళలకు తాము వ్యతిరేకం కాదని, పాకిస్థాన్ నటులకు మాత్రమే వ్యతిరేకమని తెలిపారు. పాక్ నటులున్న ప్రతి సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు. భారత చానళ్లను పాకిస్థాన్ లో నిషేధించారని, బాలీవుడ్ తారల పట్ల దురుసుగా ప్రవర్తించారని అమేయ్ ఖోపాక్ గుర్తు చేశారు. తమకు దేశమే ముఖ్యమని, తర్వాతే కళలు అని చిత్రపట్ సేన ప్రధాన కార్యదర్శి షాలిని థాకరే అన్నారు. పాకిస్థాన్ కళాకారులు భారత్ వదిలి వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. -
ప్రముఖ దర్శక నిర్మాతకు బెదిరింపులు
ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్కు బెదిరింపులు వచ్చాయి. ముంబైలో పాకిస్థానీ కళాకారులకు మద్దతు ఇస్తానని చెప్పడంతో మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఆయనపై తీవ్రంగా మండిపడింది. కరణ్ తీసే సినిమాల్లో పాకిస్థానీ కళాకారులకు అవకాశం ఇస్తే.. తమదైన శైలిలో ఆయనకు తగిన సమాధానం చెబుతామని ఎంఎన్ఎస్ హెచ్చరించింది. ఆ సమావేశంలో ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే కూడా ఉన్నారు. ఉడీ దాడి నేపథ్యంలో పాకిస్థానీ నటీనటులు ముంబై వదిలి స్వదేశానికి వెళ్లిపోవాలంటూ ఎంఎన్ఎస్ ఇచ్చిన గడువు ఇప్పటికే ముగిసింది. ఇప్పటికే వాళ్లంతా ముంబై వదిలి వెళ్లిపో్యారని, నగరంలో ఇప్పుడు ఒక్క పాకిస్థానీ కళాకారుడు కూడా లేరని ఎంఎన్ఎస్ సీనియర్ నేత అమే ఖోప్కర్ తెలిపారు. పొరపాటున తమకు ఎవరైనా కనపడితే మాత్రం వాళ్లను బయటకు విసిరి పారేస్తామన్నారు. కరణ్ జోహార్కు దమ్ముంటే ఒక్క పాకిస్థానీ నటుడినైనా తన సినిమాల్లోకి తీసుకోవాలని, అప్పుడు తామేం చేస్తామో చూడాలని ఖోప్కర్ అన్నారు. ఏవైనా సినిమాల్లో పాకిస్థానీ నటీనటులుంటే ఆ సినిమాలను ఇక్కడ విడుదల కానిచ్చేది లేదిన మరో సీనియర్ నేత షాలినీ ఠాక్రే చెప్పారు. ఇదంతా దేశం కోసమే తప్ప రాజకీయాల కోసం కాదన్న విషయాన్ని బాలీవుడ్ కూడా అర్థం చేసుకోవాలని ఆమె తెలిపారు. పాకిస్థానీలు మన సైనికులను చాలామందిని చంపేస్తున్నారని చెప్పారు. కాగా, ముంబైలో ఉంటున్న పాకిస్థానీలకు పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని పోలీసులు అంటున్నారు. ఈ విషయాన్ని తాము సీరియస్గానే తీసుకుంటున్నామని, వాళ్లందరికీ తగిన భద్రత ఇస్తాం కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని డీసీపీ అశ్వినీ సనప్ చెప్పారు. -
సుప్రీం తీర్పునూ లెక్క చేయలేదు
భారీ ఎత్తులో పిరమిడ్లు నిర్మించిన మహారాష్ట్ర వాసులు ముంబై: దహీ హండీ (ఉట్టి) కొట్టేందుకు ఏర్పడే మానవ పిరమిడ్ ఎత్తు పెంచడానికి అనుమతివ్వబోంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కృష్ణభక్తులు పట్టించుకోలేదు. కృష్ణాష్టమి సందర్భంగా 20 అడుగులకు మించి పిరమిడ్లను నిర్మించి గురువారం ఉట్టి ఉత్సవం నిర్వహించారు. సుప్రీంకోర్టు తీర్పునకు నిరసనగా దాదర్ ప్రాంతంలో భక్తులు 20 అడుగుల మానవ పిరమిడ్ రూపంలో నేలపై పడుకుని నిరసన తెలిపారు. దహీ హండీ కొట్టేందుకు ఏర్పడే మానవ పిరమిడ్ ఎత్తు విషయంలో హైకోర్టు తీర్పునే కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 20 మీటర్లకు మించి ఎత్తు పెంచలేమని ధర్మాసనం బుధవారం తీర్పు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఆదేశాలను ఉల్లంఘించారు. పలుచోట్ల 40 నుంచి 50 అడుగుల ఎత్తులో మానవ పిరమిడ్లను నిర్మించే ఉట్టికుండలను పగులకొట్టారు. సుప్రీం ఆదేశాలను బేఖాతరు చేయడాన్ని ఎమ్మెన్నెస్ అధినేత రాజ్ ఠాక్రే సమర్థించుకున్నారు. ’మహారాష్ట్ర పండుగల పరిరక్షణ కోసం చట్టాలను ఉల్లంఘించాల్సి వస్తే అందుకు నేను సిద్ధం. ఎత్తు విషయంలో ఆంక్షలు చట్టమేమీ కాదు. కోర్టు ఆదేశాలు మాత్రమే. అందుకు మీకు ఇష్టమున్న రీతిలో మానవ పిరమిడ్లు నిర్మించుకొని గోవిందులకు (ఉట్టి వేడుకలో పాల్గొనేవారికి) చెప్పాను’ అని ఠాక్రే మీడియాతో అన్నారు. మహారాష్ట్రలో ఏటా జన్మాష్టమి సందర్భంగా దహీహండీ నిర్వహిస్తారు. -
ఠాక్రేలు మళ్లీ కలిశారు..!
ముంబై: శివసేనను వీడి వేరుకుంపటి పెట్టుకున్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే మళ్లీ ఆ పార్టీకి దగ్గరవుతున్నారా? బీజేపీపై తరచూ విమర్శలు చేస్తూ, ఆ పార్టీతో పొత్తు కారణంగా తమ పార్టీ తీవ్రంగా నష్టపోయిందని రగిలిపోతున్న శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే రాజకీయ పునరేకీకరణకు ప్రయత్నిస్తున్నారా? అంటే తాజా పరిణామాలు అవుననే చెబుతున్నాయి. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే.. ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశంకావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ముంబైలోని దాదర్లో నివసిస్తున్న రాజ్ ఠాక్రే శుక్రవారం బాంద్రాలోని ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీకి వెళ్లి ఆయన్ను కలిసినట్టు సమాచారం. శివసేన, ఎంఎన్ఎస్ల మధ్య సయోధ్య కుదరనుందని, వచ్చే ఏడాది జరిగే ముంబై కార్పొరేషన్ సహా స్థానిక సంస్థల ఎన్నికల్లో కలసి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజ్ ఠాక్రే.. శివసేన వ్యవస్థాపకుడు, దివంగత నేత బాల్ ఠాక్రే సోదరుడి కుమారుడు. ఒకప్పుడు రాజ్ ఠాక్రే శివసేనలో చురుగ్గా పనిచేశారు. వారసత్వ రేసులో విభేదాలు రావడంతో 2006లో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అదే ఏడాది మార్చిలో ఎంఎన్ఎస్ను స్థాపించారు. ఇక శివసేన చీఫ్గా బాల్ ఠాక్రే వారసుడిగా ఆయన కుమారుడు ఉద్ధవ్ పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత భిన్నధ్రువాలుగా ఉంటున్న ఠాక్రేలు మళ్లీ కలిసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
'ఇటు రా.. మెడపై కత్తిపెడతా'
ముంబై: 'భారత్ మాతాకీ జై' నినాదంపై చెలరేగుతున్న వివాదానికి మరింత ఆజ్యంపోశారు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే. 'మహారాష్ట్రకు రా.. నీ మెడపై కత్తిపెడతా. 'భారతమాతాకీ జై' అని ఎందుకు అనవో చూస్తా' అంటూ హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసద్దుదీన్ ఒవైసీని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ముంబైలోని ప్రఖ్యాత శివాజీ పార్కులో శుక్రవారం రాత్రి జరిగిన ఓ సభలో మాట్టాడిన రాజ్ థాక్రే ఎంఐఎం, బీజేపీ, శివసేనలపై విరుచుకుపడ్డారు. ఎంఐఎంకు బీజేపీ ఆర్థిక సహాయం అందిస్తున్నదని ఆరోపించారు. అధికార బీజేపీ కరువు పరిస్థితులపై పట్టనట్లు వ్యవహరిస్తున్నదని, మిత్రపక్షంగా ఉన్న శివసేన వెంటనే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని రాజ్ థాక్రే అన్నారు. దేశభక్తి విషయంలో ఆర్ఎస్ఎస్ నిర్ధేశాలను పట్టించుకోనని, మెడపై కత్తిపెట్టినా భారత్ మాతాకీ జై నినాదం చేయబోనని అసదుద్దీన్ గతంలో చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. 'చట్టాలను గౌరవించబట్టే భారత్ మాతాకీ జై అననన్న లక్షల మందిని ఊచకోత కోయట్లేదు'అని యోగా గురు రామ్ దేవ్ అన్నారు. ఇప్పుడు అసద్ ను విమర్శించిన వంతు రాజ్ థాక్రేది. -
నేను చెప్పిందేంటి.. మీరు రాసిందేంటి..?
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే... మరాఠీ విలేకరులపై మండిపడ్డారు. తానొకటి చెబితే విలేకరులు మరోటిరాశారని మీడియాపై చిందులువేశారు. హిందీ విలేకరుల విషయం పక్కనబెట్టినా మరాఠీ మీడియా ఇలా చేస్తుందని అనుకోలేదని, తన వ్యాఖ్యలు అర్థం చేసుకుంటుందని భావించానన్నారు. కాని మరాఠీ విలేకరులలో ‘ఫుల్ ప్యాంటులో ఆఫ్ ప్యాంటు’ కన్పిస్తోందంటూ.. బీజేపీకి మరాఠీ మీడియా మొకరిల్లిందని పరోక్షంగా ఆరోపించారు. బిల్డర్లతో ప్రభుత్వం కుమ్మక్కు అక్రమ కట్టడాలు నిర్మించిన బిల్డర్లతో ప్రభుత్వం కుమ్మక్కైందని రాజ్ ఠాక్రే ఆరోపించారు. అనుమతి లేకుండా ఇళ్లు నిర్మించి విక్రయించిన బిల్డర్లపై చర్యలు తీసుకోకుండా ఎలా క్రమబద్ధీకరిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని రెండు లక్షలకుపైగా ఉన్న అక్రమ కట్టడాలను కొన్ని శరతులపై క్రమబద్ధీకరిస్తామని శుక్రవారం శాసనసభలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ విషయమై తొందర్లోనే చట్టం తీసుకురానున్నట్లు స్పష్టం చేసిన ఫడ్నవీస్ శరతులపై మాత్రం స్పష్టతనివ్వలేదు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయంతో ముంబై, థానే, దివాతోపాటు పుణే, పింప్రి-చించ్వడ్, నాసిక్, ఔరంగాబాద్ నగరాల్లో లక్షలాది మంది ప్రజలకు లాభం కలగనుందని భావిస్తున్నారు. అయితే దీనిపై ఠాక్రే తీవ్రంగా స్పందించారు. కేవలం బిల్డర్లకు లాభం చేకూర్చడానికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. అక్రమ కట్టడాలు నిర్మించి అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎలాంటి చర్యలు తీసుకోకుండా అక్రమకట్టడాలను క్రమబద్దీకరణ చేపట్టడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెనక్కి తీసుకోలేదు.. రాష్ట్రేతరులకు అందించే ఆటో పర్మిట్లపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేదని రాజ్ స్పష్టం చేశారు. ఆటో అందోళన ఎంఎన్ఎస్ విరమిస్తున్నట్లు శనివారం వార్తలు ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై ఠాక్రే స్పందిస్తూ.. అలాంటిదేమీలేదని, పర్మిట్లు ఇంకా పంపిణీ చేయకపోవడంతో తాత్కాలికంగా ఆందోళన నిలిపేశామన్నారు. తమ పేరుతో ఇతరులు ఆందోళన చే యకూడదనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. -
'మహారాష్ట్ర నీ అయ్య జాగీర్ కాదు'
పట్నా: విద్వేషపూరిత వ్యాఖ్యలతో రెచ్చిపోయిన మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) చీఫ్ రాజ్ ఠాక్రేకు లాలూ తనయుడు, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. మహారాష్ట్ర ఎవరి అయ్య జాగీర్ కాదని విషయాన్ని రాజ్ ఠాక్రే గుర్తిస్తే మంచిదని హితవు పలికారు. మహారాష్ట్రలో రాష్ట్రేతరులు ఆటోరిక్షా పర్మిట్ తీసుకుంటే.. వారి ఆటోలను తగలబెట్టాలని రాజ్ ఠాక్రే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఠాక్రే వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన తేజస్వి 'మహారాష్ట్రకానీ, ఈ దేశం కానీ ఎవడి అబ్బ సొత్తు కాదు. రాజ్ ఠాక్రే ఈ విషయాన్ని గుర్తించాలి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఠాక్రేకు వ్యతిరేకంగా వెంటనే చర్య తీసుకోవాలి' అని అన్నారు. గురువారం విలేకరులతో మాట్లాడిన తేజస్వి.. గతంలోనూ బిహారీలకు వ్యతిరేకంగా రాజ్ ఠాక్రే వ్యాఖ్యలు చేశారని, అయినా ఆయనపై బీజేపీ ఎలాంటి చర్య తీసుకోవడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆటోరిక్షాల అనుమతులు మరాఠేతరులకే అధికంగా ఇస్తున్నారని రాజ్ ఠాక్రే ఆరోపించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 70శాతం ఆటో పర్మిట్లు మరాఠేతరులకే ఉన్నాయని , అలాంటి ఆటోలు రోడ్లపై కనిపిస్తే తన కార్యకర్తలు వాటికి నిప్పుపెట్టడం ఖాయం అని ఆయన హెచ్చరించారు. -
'రోడ్లపైకి వస్తే నిప్పంటించడం ఖాయం'
ముంబయి: రాష్ట్రంలో ఆటోరిక్షాల అనుమతులు మరాఠేతరులకే అధికంగా ఇస్తున్నారని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ఆరోపించింది. 70శాతం ఆటో పర్మిట్లు రాష్ట్రేతరులకే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఆటోలన్నింటిని గుర్తించి తగులబెడతామంటూ బహిరంగ ప్రకటన చేసింది. తన పార్టీ కార్యకర్తలు అలాంటి ఆటోలు రోడ్లపై కనిపిస్తే నిప్పుపెట్టడం ఖాయం అని ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే చెప్పారు. పార్టీ పదో వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. 'కొత్త పర్మిట్ తీసుకున్న మహారాష్ట్రేతర ఆటో కనిపిస్తే ఆపేస్తాం. అందులోని ప్రయాణీకులను దించివేసి ఆ ఆటోను కాల్చివేస్తాం.. రాష్ట్ర రవాణాశాఖను చూసుకుంటున్న శివసేన ఈ విషయంలో ఏం చేస్తోంది చెప్పాలి' అని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉన్న అనుమతులు కాకుండా త్వరలోనే మరో 70 వేల మహారాష్ట్రేతరులకు అనుమతులు ఇవ్వబోతున్నారని వాటిని ఆపకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. -
'ప్రధాని ఇంకా సొంత రాష్ట్రం మోజులోనే ఉన్నారు'
ముంబై: దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికీ గుజరాత్ పైనే ఇష్టంతో ఉన్నారని, ఆయన దేశం మొత్తానికి ప్రధానిగా కనపించడం లేదంటూ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. జాతీయత, జాతి అంటూ బీజేపీ ఇచ్చే సర్టిఫికెట్లు ఎవ్వరికీ అవసరం లేవని అభిప్రాయపడ్డారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ వివాదంలో కేంద్ర జోక్యం అనవసరమని సూచించారు. సర్టిఫికెట్లు ఇవ్వకూడదంటూ బీజేపీ నేతలకు ఆయన సూచించారు. జేఎన్యూలో జరిగిన అంశంపై మరింత దుమారం రేపాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకోకూడదని, ఇది ఏబీవీపీ కి మార్గం ఏర్పాటు చేసినట్లుగా కనిపిస్తుందన్నారు. ఎవరు జాతీయవాది.. ఎవరు జాతి వ్యతిరేకులో బీజేపీ తేల్చాల్సిన గత్యంతరం లేదంటూ విమర్శించారు. ముంబైలో ఈ నెలలో జరిగిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం గురించి ప్రస్తావిస్తూ.. కార్యక్రమాల నిర్వహణపైనే బీజేపీ దృష్టిపెట్టిందని చెప్పారు. ఇప్పటివరకు ఎలాంటి పనులు ముందుగు సాగలేదని.. ప్రతి రెండు నెలలకు ప్రధాని ఓ కార్యక్రమం అంటూ ప్రజలు ముందుకు వస్తారని రాజ్ ఠాక్రే విమర్శించారు. మేక్ ఇన్ ఇండియా ఉద్దేశం ఏంటో అర్ధం కావడం లేదని, ఢిల్లీలో జరపకుండా ఈ వేడుకలు ముంబైలో ఎందుకు చేస్తున్నారో తనకు అర్ధం కావడం లేదన్నారు. -
'బీజేపీ అంటే.. భారతీయ జంతుపక్ష పార్టీ'
మహారాష్ట్రలో మాంసం విక్రయాల నిషేధంపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ అంటే భారతీయ జంతుపక్ష పార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. ముంబైలో ఏం చేయాలన్నది కేవలం జైనులు మాత్రమే నిర్ణయించలేరు కదా అని ఆయన వ్యాఖ్యానించారు. రేపు మరో వర్గానికి చెందిన ప్రజలు తమ పండుగ రోజుల్లో షాపులన్నీ మూసేయాలంటే అప్పుడు మూసేస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి ఓటుబ్యాంకు రాజకీయాల నుంచి లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని రాజ్ ఠాక్రే మండిపడ్డారు. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా హిందువులకు జైనులు వ్యతిరేకమనే భావన వస్తోందని ఆయన అన్నారు. -
ఠాక్రే భార్యపై కుక్క దాడి.. 65 కుట్లు!
మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే భార్య షర్మిలను వాళ్ల పెంపుడు కుక్క దారుణంగా కరిచింది. షర్మిల ముఖం మీద ఆ కుక్క బాగా కరిచేయడంతో.. ఆమెను వెంటనే ముంబైలోని హిందూజా ఆస్పత్రికి తరలించి అక్కడ శస్త్రచికిత్స చేయించారు. ఆమెకు దాదాపు 65 కుట్లు పడ్డాయి. రాజ్ ఠాక్రే కుటుంబం 'జేమ్స్', 'బాండ్' అనే రెండు కుక్కలను పెంచుకుంటోంది. వాటిలో బాండ్ అనే పెంపుడు కుక్క ఆమెపై దాడి చేసింది. ఇది గ్రేట్ డేన్ జాతికి చెందినది. రాజ్ ఠాక్రే తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతుండగా ఈ ఘటన జరిగింది. దాంతో ఆయన సమావేశం ముగియగానే ఆస్పత్రికి వెళ్లిపోయారు. బాండ్ అనే ఆ కుక్క షర్మిలను బాగా గట్టిగా కరిచిందని, దాని పళ్లు ఆమె ముఖం ఎముకల వరకు వెళ్లిపోయాయని వైద్యులు చెప్పారు. ఆమెకు బుగ్గల మీద ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి వచ్చింది.