రూ. 2 వేల నోటుతో మరింత అవినీతి: ఏచూరి
కేంద్రప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేసి 2000 రూపాయల నోట్లు తీసుకొచ్చిందని, దాంతో అవినీతి తగ్గడం కాకుండా మరింత ఎక్కువవుతుందని సీపీఎం అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరి అన్నారు. పెద్ద నోట్ల రద్దు అంశంపై రాజ్యసభలో జరిగిన చర్చలో బుధవారం మధ్యాహ్నం ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. అసోంలో ఉప ఎన్నిక ఉంది కాబట్టే అక్కడ టీ కార్మికులకు మినహాయింపు ఇచ్చారని, ఇతర ప్రాంతాల్లో ఇది ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేవలం స్వీడన్లో మాత్రమే పూర్తిగా నగదు రహిత వ్యవస్థ ఉందని, అక్కడ నూటికి నూరుశాతం ఇంటర్నెట్ విస్తృతి ఉంది కాబట్టి అందరూ తమ ఫోన్లు, ఐ ప్యాడ్ల సాయంతో చెల్లింపులు చేస్తారని.. కానీ మన దేశంలో అంత విస్తృతి ఎక్కడ ఉందని అడిగారు. ప్రధాని మోదీ ఇప్పుడు ఎవరినీ కరెన్సీ వాడొద్దని, అన్నిచోట్లా కార్డులే వాడాలని చెబుతున్నారని, ఇది ఎలా సాధ్యమని అన్నారు. 86 శాతం నగదును రద్దుచేసి.. కేవలం 14 శాతం నగదుపైనే వ్యవస్థ నడవాలంటున్నారని చెప్పారు.
ధాన్యం ధర గణనీయంగా పడిపోయిందని, లక్షలాది ట్రక్కులు జాతీయ రహదారిపైనే ఉండిపోయాయని సీతారాం ఏచూరి అన్నారు. దేశం వెలుపల 90 శాతం నల్లధనం ఉందని ప్రధానమంత్రి చెప్పారని, దాన్ని వెనక్కి తీసుకొచ్చి దేశ ప్రజలు ప్రతి ఒక్కరి అకౌంటులో రూ. 15 లక్షలు వేస్తామన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు కేవలం 6 శాతం బ్లాక్మనీ మాత్రమే నగదు రూపంలో ఉందని, మిగిలినదంతా పెట్టుబడులు, వ్యాపారాల రూపంలోనే ఉందని తెలిపారు. రైతులకు కచ్చితంగా ఉపశమనం కల్పించాలని, ప్రభుత్వం తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల సామాన్యులు అష్టకష్టాలు పడుతున్నారని చెప్పారు. రైతులు తమ పంటలను కూడా అమ్ముకోలేకపోతున్నారన్నారు.