
ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబై కరోనా మహమ్మారి కేంద్రంగా మారడంతో మహారాష్ట్ర ప్రభుత్వం బీఎంసీ కమిషనర్ ప్రవీణ్ పర్దేశిపై వేటు వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి బదిలీలు చేపట్టరాదని ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను పక్కనపెట్టిన ప్రభుత్వం ప్రవీణ్ స్ధానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఐఎస్ చహల్కు ప్రతిష్టాత్మక బీఎంసీ కమిషనర్ బాధ్యతలు అప్పగించింది. ప్రవీణ్ను మంత్రాలయ్లోని నగరాభివృద్ధి శాఖకు బదిలీ చేసింది.
ముంబై నగరంలో విపరీతంగా పెరుగుతున్న కోవిడ్-19 కేసులను అదుపులోకి తేవడంలో విఫలమైన ప్రవీణ్పై విమర్శలు వెల్లువెత్తడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనపై బదిలీ వేటు వేసింది. కేంద్ర బృందం ముంబై పర్యటన ముగిసిన వెంటనే ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. క్వారంటైన్ కేంద్రాల సంఖ్యను పెంచి, కంటెయిన్మెంట్ వ్యూహాలను కఠినంగా అమలు చేయాలని కేంద్ర బృందం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిందని అధికారులు తెలిపారు. ముంబైలో కరోనా కేసులు పెరుగుతుండటం పట్ల కేంద్ర బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ముంబైలో కోవిడ్-19 కేసులు రెట్టింపయ్యే వ్యవధిని పెంచడంపై దృష్టిసారించాలని కేంద్రం బృందం సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment