మసీదులో మహిళలు ప్రార్థన చేయొచ్చు | Muslim women can pray at mosques | Sakshi
Sakshi News home page

మసీదులో మహిళలు ప్రార్థన చేయొచ్చు

Jan 30 2020 3:17 AM | Updated on Jan 30 2020 11:08 AM

Muslim women can pray at mosques - Sakshi

న్యూఢిల్లీ: మసీదుల్లోకి వచ్చి ముస్లిం మహిళలు ప్రార్థనలు చేయడం ఇస్లాంలో ఆమోదనీయమేనని అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌(ఏఐఎంపీఎల్‌బీ) వెల్లడించింది. ముస్లిం పురుషుల మాదిరిగానే ముస్లిం మహిళలు కూడా నమాజ్‌ చేసేందుకు మసీదుకు రావొచ్చని తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు బుధవారం అఫిడవిట్‌ సమర్పించింది. మసీదుల్లోకి మహిళలను అనుమతించేలా ఆదేశించాలని కోరుతూ యాస్మీన్‌ జుబేర్‌ అహ్మద్‌ పీర్జాదే దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా ఏఐఎంపీఎల్‌బీ ఈ అఫిడవిట్‌ అందించింది. ఈ అంశాన్ని కూడా శబరిమల సహా మతపరమైన ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొంటున్న వివక్షకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఏర్పాటైన 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుంది.

‘ఇస్లాం గ్రంధాలు, ఇతర సంప్రదాయాలు, విశ్వాసాల ప్రకారం మసీదుల్లోకి మహిళలు వచ్చి నమాజ్‌ ఆచరించడం ఆమోదనీయమే. మహిళలు మసీదుల్లోకి స్వేచ్ఛగా రావొచ్చు. అలా రావాలా? వద్దా? అని నిర్ణయించుకునే హక్కు ఆ మహిళలకు ఉంది. ఈ విషయానికి సంబంధించి ఉన్న విరుద్ధమైన మతపర అభిప్రాయాలపై మేం స్పందించదలచుకోలేదు’ అని ఏఐఎంపీఎల్‌బీ ఆ అఫిడవిట్‌లో పేర్కొంది. ముస్లిం మహిళలు కచ్చితంగా సామూహిక ప్రార్థనల్లో పాల్గొనాలని కానీ, శుక్రవారం ప్రార్థనల్లో పాలు పంచుకోవాలని కానీ ఏ నిబంధన ఇస్లాంలో లేదని ఏఐఎంపీఎల్‌బీ కార్యదర్శి మొహ్మద్‌ ఫజ్లుర్‌రహీమ్‌ తన న్యాయవాది షంషాద్‌ ద్వారా కోర్టుకు తెలిపారు. మసీదుల్లో కానీ, ఇంట్లో కానీ ప్రార్థన చేసే అవకాశం ఇస్లాం ముస్లిం మహిళలకు కల్పించిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement