
శనివారం భారత్ పర్యటనకు బయలుదేరిన ఒబామా దంపతులు
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన సందర్భంగా ఢిల్లో వాతావరణ కాలుష్యం ఏ స్థాయిలో ఉందో స్పష్టమైంది.
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన సందర్భంగా ఢిల్లో వాతావరణ కాలుష్యం ఏ స్థాయిలో ఉందో స్పష్టమైంది. ఒమాబా సందర్శించనున్న ఢిల్లీలోని ఆరు ప్రాంతాల్లో వాయు కాలుష్యం ప్రమాదరక స్థాయిలో ఉన్నట్లు వెల్లడైంది. అది భారత భద్రతా ప్రమాణాలకంటే మూడు రెట్లు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకంటే తొమ్మిది రెట్లు ఎక్కువగా ఉందని గ్రీన్పీస్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ శుక్రవారం జరిపిన 'పీఎం2.5' పరీక్షల్లో తేలింది. అదే బీజింగ్లో అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో పోల్చితే 2.5 రెట్లు మాత్రమే ఎక్కువగా ఉంటుంది.
ఒబామా సందర్శించనున్న జనపథ్లో 2.5 మైక్రో మీటర్ల కంటే తక్కువ ఉన్న రేణువుల(పీఎం2.5) గరిష్ట స్థాయి క్యూబిక్ మీటరుకు 264 మైక్రో గ్రాములు, హైదరాబాద్ హౌస్ వద్ద 239, రాజ్ఘాట్ వద్ద 229 మైక్రో గ్రాములుగా నమోదైందని గ్రీన్పీస్ ఇండియా తెలిపింది. పీఎం2.5 రేణువుల కారణంగా కేన్సర్ వంటి తీవ్రమైన జబ్బులు వస్తాయి. ఒబామా పర్యటన సందర్భంగా ఆయన క్షేమం కోసం అమెరికా ప్రభుత్వం ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుందో దీని ద్వారా స్పష్టమవుతోంది. అలాగే ఢిల్లీ వాయు కాలుష్యం ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో కూడా మనకు అర్ధమైంది.