obama modi visit 2015
-
విశాల్ను ఒబామా వద్దకు తీసుకొచ్చిందెవరు?
ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)లో గతంలో ప్రాంతీయ డైరెక్టర్గా పనిచేసిన కేకే మహ్మద్కు జనవరి 19న అమెరికా రాయబార కార్యాలయం నుంచి ఓ ఫోన్ వచ్చింది. ఏకంగా ఎంబసీ నుంచి ఫోన్ అనగానే ఆయన కాసేపు భయపడ్డారు. తర్వాత అవతల ఫోన్ చేసినవాళ్లు.. విశాల్ అనే కుర్రాడి చిరునామా ఇవ్వగలరా అని అడిగారు. భారతదేశ పర్యటనకు వస్తున్న ఒబామా దంపతులు ఆ పిల్లాడిని కలవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఇంతకీ విశాల్ ఎవరో గుర్తుపట్టారా? ఇంతకుముందు 2010 నవంబర్ నెలలో ఒబామా దంపతులు భారతదేశానికి వచ్చినప్పుడు హుమాయూన్ సమాధి వద్ద విశాల్ను మరికొందరు పిల్లలతో కలిసి చూశారు. అప్పట్లో కేకే మహ్మద్ ఏఎస్ఐలో సూపరెంటిండింగ్ ఆర్కియాలజిస్టుగా ఉండేవారు. అక్కడ పనిచేసే కూలీల పిల్లల్లో ఒకరే.. విశాల్. యూపీ, మధ్యప్రదేశ్, బీహార్ లాంటి వివిధ రాష్ట్రాల నుంచి వలసలు వచ్చే ఈ కార్మికులు.. తమ పిల్లలను కూడా వెంట తెచ్చుకునేవారు. అప్పట్లో విశాల్ సహా మొత్తం 500 మంది పిల్లలకు మహ్మద్, ఇతరులు పాఠాలు చెప్పేవారు. అయితే, అమెరికన్ ఎంబసీ నుంచి ఫోన్ రాగానే, అసలు విశాల్ ఎక్కడున్నాడో.. వాళ్ల తల్లిదండ్రులు ఎక్కడున్నారో గుర్తించడం ఎలాగని మహ్మద్ కాసేపు ఆందోళన చెందారు. అయితే.. ఎట్టి పరిస్థితుల్లోనూ అతడి ఆచూకీ కావాలని అవతలి వ్యక్తి ఫోన్లో చెప్పారు. 'విశాల్ను నేను మర్చిపోయా గానీ, ఒబామాలు మర్చిపోలేదు' అని మహ్మద్ అన్నారు. ఎట్టకేలకు యూపీలోని ఝాన్సీ సమీపంలో గల గ్రామంలో విశాల్ కుటుంబం ఆచూకీ దొరికింది. అతడి తల్లి, తండ్రి, సోదరి అంతా కూడా ఢిల్లీలోని సిరిఫోర్ట్ ఆడిటోరియంలో ఒబామా దంపతులను కలిశారు. బరాక్ ఒబామా తన ప్రసంగంలో కూడా విశాల్ పేరును, అతడి గాధను ప్రస్తావించారు. -
మిషెల్ ఒబామా.. బురఖా వివాదం!
సౌదీ అరేబియా పర్యటనలో మిషెల్ ఒబామా బురఖా ధరించకపోవడం అక్కడ పెద్ద వివాదానికి కారణమైంది. భారతదేశ పర్యటన ముగించుకుని సౌదీ అరేబియా వెళ్లిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్.. తన దుస్తుల తీరును కొంతవరకు మార్చుకున్నారు. ఇక్కడ కాస్త పొట్టి గౌన్లలో కనిపించిన ఆమె, అక్కడ పొడవాటి ప్యాంట్లు కూడా ధరించారు. అయినా కూడా బురఖా లేదన్న కారణంతో ఆమె ముఖాన్ని సౌదీ అధికారిక చానల్లో బ్లర్ చేసి చూపించారని పెద్ద వివాదం రేగింది. అయితే, ఆ ఆరోపణలు అవాస్తవమని, వాస్తవాలు చూడాలి తప్ప ఫేస్బుక్ వివాదాల మీద ఆధారపడొద్దని సౌదీ ఎంబసీ ట్వీట్ చేసింది. వాస్తవానికి యూట్యూబ్లో పోస్ట్ చేసిన క్లిప్పింగులలో అయితే సౌదీ అరేబియా టీవీ మిషెల్ ముఖాన్ని బ్లర్ చేసి చూపించినట్లు ఉంది. అయితే, ప్రత్యక్ష ప్రసారం చూసినవాళ్లు మాత్రం అదేమీ లేదని చెబుతున్నారు. దాంతో ఇప్పుడు ఇదంతా పెద్ద వివాదంగా మారింది. గల్ఫ్ దేశాల్లో మహిళల దుస్తుల మీద సాధారణంగా కఠినమైన నిబంధనలుంటాయి. మహిళలు తప్పనిసరిగా బురఖా వేసుకోవాలి, ముఖం కూడా కప్పుకోవాలి. అయితే విదేశీయులకు మాత్రం ఈ నిబంధన ఉండదు. -
ఒబామా భారత పర్యటన పై చైనా విమర్శలు
-
ఒబామా భారత పర్యటన పై మోదీ హర్షం
-
తాజ్ సందర్శనకు మళ్లీ వస్తా: మిషెల్
న్యూఢిల్లీ: ప్రపంచ వింతల్లో ఒకటైన ప్రేమ మందిరం తాజ్మహల్ను ఈసారి పర్యటనలో వీక్షించలేకపోయినప్పటికీ తాజ్ సందర్శన కోసం మరోసారి భారత్ వస్తానని అమెరికా ప్రథమ మహిళ మిషెల్ ఒబామా మంగళవారం తెలిపారు. దీనిపై విలేకరుల ప్రశ్నకు మిషెల్ ఈ మేరకు బదులిచ్చారు. ఆగ్రా పర్యటన రద్దు కావడం తనకు నిరాశ కలిగించిందన్నారు. వాస్తవానికి ఒబామా దంపతుల భారత పర్యటన షెడ్యూల్లో మంగళవారం తాజ్ సందర్శన ఉన్నప్పటికీ సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా మరణం నేపథ్యంలో ఆయన కుటుంబానికి సంతాపం తెలిపేందుకు సౌదీ వెళ్లాలని ఒబామా నిర్ణయించుకోవడంతో షెడ్యూల్ను కుదించారు. తాజ్మహల్ను ఇప్పటివరకూ పలువురు దేశాధినేతలు కుటుంబ సభ్యులతో కలసి సందర్శించారు. 2010లో ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ తన భార్య కార్లా బ్రూనీ 2000 సంవత్సరంలో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ తన కుమార్తె చెల్సీతో కలసి తాజ్ను వీక్షించారు. -
వైట్ హౌస్ స్పందన
న్యూఢిల్లీ: ఒబామా పర్యటన భారత్-అమెరికా సంబంధాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్లిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. రెండు దేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఒబామా సౌదీ అరేబియాకు బయల్దేరిన అనంతరం మోదీ ఈ మేరకు ట్వీటర్లో వ్యాఖ్యానించారు. ''ఒబామాకు వీడ్కోలు. మీ ప్రయాణం సురక్షితంగా జరగాలని ఆకాంక్షిస్తున్నా. మీ పర్యటనతో రెండుదేశాల సంబంధాలు కొత్త శిఖరాలకు చేరాయి'' అని మోదీ అన్నారు. వైట్హౌస్ కూడా దీనికి స్పందించింది. ''ఒబామా పర్యటనను ఎల్లకాలం గుర్తుండిపోయేలా మలిచినందుకు థాంక్యూ నరేంద్రమోదీ. ఆత్మీయ స్వాగతం పలికిన భారత ప్రజలకు కతజ్ఞతలు''అంటూ అధ్యక్షుడి కార్యాలయం బదులిచ్చింది. దీన్ని మోదీ ట్వీటర్లో పొందుపరిచారు. Thank you @NarendraModi for a memorable visit, and to the Indian people for their warm welcome. #India -bo — The White House (@WhiteHouse) January 27, 2015 -
బీజేపీకి లాభం!
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యాటనకు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేకపోయినా బిజెపి నేతలు, కొందరు రాజకీయ పరిశీలకులు ఈ పర్యటన త్వరలో జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి లాభసాటిగా మారనుందని అంటున్నారు. ఒబామా పర్యటన కారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్ట పెరిగిపోయిందని , ఇది ఫిబ్రవరి 7న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి లాభించగలదని వారు అంటున్నారు. ఒబామా పర్యటనను బిజెపి విజయంగా బిజెపి నేతలు కొందరు ప్రచారం చేస్తున్నారు. వీరిలో ఢిల్లీ బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ కూడా ఉన్నారు. నరేంద్ర మోడీ కృషి వల్లే ఒబామా భారత్కు వచ్చారని ఆమె తన ఎన్నికల ప్రచారంలో ప్రజలకు చెప్పారు. బిజెపి అభ్యర్థి రాజీవ్ బబ్బర్ మరో అడుగు ముందకు వేసి ఒబామా ఫోటోను తన ఎన్నికల పోస్టర్లలో చేర్చారు. ఇదిలా ఉండగా, ఒబమా పర్యటనను ఎన్నికల ప్రచారానికి వాడుకోవడం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని, దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదుచేయాలని కొందరు ఆమ్ అద్మీ పార్టీ నేతలు యోచిస్తున్నారు. -
బహుత్ ధన్యవాద్.. జైహింద్!
న్యూఢిల్లీ: ‘బహుత్ ధన్యవాద్’, ‘జైహింద్’ అని హిందీలో మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అందర్నీ ఆకట్టుకున్నారు. మంగళవారమిక్కడ సిరి ఆడిటోరియంలో తన ప్రసంగం ప్రారంభంలో ఆయన ఈ పదాలు ఉచ్చరించారు. ‘‘నేను అమెరికా ప్రజల స్నేహాన్ని, శుభాశీస్సులను మోసుకొచ్చా. మమ్మల్ని సాదరంగా ఆహ్వానించిన మీ అందరికీ మా ప్రజల తరఫున, నా తరపున, నా భార్య మిషెల్ తరపున బహుత్ ధన్యవాద్’’ అని అనడంతో సభికుల చప్పట్లతో ఆడిటోరియం మార్మోగింది. అలాగే బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ నటించిన ‘దిల్వాలే దుల్హేనియా లే జాయేంగే’ చిత్రంలోని ఓ డైలాగ్ను చెప్పి ఒబామా అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘‘ఇంతకుముందు భారత్కు వచ్చినప్పుడు మేం ముంబైలో దీపావళి జరుపుకున్నాం. కొందరు పిల్లలతో కలసి డ్యాన్స్ చేశాం. కానీ ఈసారి ఆ అదృష్టం లేదు. ఆ డ్యాన్సులేవీ లేవు. ‘సినోరిటా.. బడే బడే దేశ్ మే ఐసీ చోటీ చోటీ బాతీ హోతీ రహెతీ హే’.. నేను చెప్పేది మీకు అర్థమైందనుకుంటా..!’’ అని ఒబామా నవ్వుతూ అనడంతో సభికుల ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయింది. అనంతరం ఆయన మతం, మహిళా సాధికారత, ఇరుదేశాల మధ్య సంబంధాలు.. తదితర అంశాలపై విస్తృతంగా మాట్లాడారు. ధైర్యం, మానవతా విలువలు భారత్-అమెరికాలను కలుపుతాయని చెబుతూ.. ఈ సందర్భంగా బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్, ప్రముఖ క్రీడాకారుడు మిల్కాసింగ్, బాక్సర్ మేరీకోమ్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి పేర్లను ప్రస్తావించారు. ప్రసంగాన్ని ‘జైహింద్’ అంటూ ముగించారు. ప్రసంగం పూర్తయిన తర్వాత వేదిక దిగి సభికుల వద్దకు వెళ్లి నవ్వుతూ అందరితో కరచాలనం చేశారు. కాగా, ఒబామా ప్రసంగంలో తనను గుర్తుచేయడంపై షారూఖ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈసారి ఒబామా భాంగ్రా డ్యాన్స్ చేయలేకపోయారని, మళ్లీ వచ్చినప్పుడు ‘చయ్యా చయ్యా..’ పాటకు తప్పకుండా నృత్యం చేస్తారని పేర్కొన్నారు. ఒబామాను కలిసిన సత్యార్థి బాలల హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థి సిరి ఆడిటోరియంలో ఒబామాను కలిశారు. ప్రపంచవ్యాప్తంగా బాలలను వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించే ఉద్యమంలో తన వంతు సహకారం అందించాలని కోరారు. నోబెల్ బహుమతి.. తన బాధ్యత మరింత పెంచిందని పేర్కొన్నారు. ‘‘బాలలకు భద్రమైన ప్రపంచం నిర్మించడంలో, అహింసాయుత ప్రపంచలో వారి నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో సహకారం అందించాలని ఒబామాను కోరాను’’ అని కైలాశ్ చెప్పారు. -
విశాల్.. ఒబామా.. ఓ ఉద్విగ్నత!
న్యూఢిల్లీ: నాలుగేళ్ల కిందట.. అది ఢిల్లీలోని హుమాయూన్ సమాధి.. ఓ విశిష్ట వ్యక్తి వచ్చారు.. సందర్శన అనంతరం అక్కడే కూలిపని చేసుకుంటున్న ఓ 12 ఏళ్ల బాలుడిని ఆప్యాయంగా పలకరించాడు.. ఆ అబ్బాయి కుటుంబ నేపథ్యం, అతడి ఆశలు, ఆకాంక్షల గురించి అడిగి తెలుసుకున్నాడు..! మంగళవారం.. ఢిల్లీలోని సిరి ఆడిటోరియం.. అదే విశిష్ట వ్యక్తి.. నాలుగేళ్ల కిందట పలకరించిన బాలుడిని గుర్తుపెట్టుకున్నాడు.. నాడు అతడు చెప్పిన ఆశలనూ గుర్తుపెట్టుకున్నాడు.. బాలుడి తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి ఏమేం చేస్తారో చెప్పారు.. తన కూతుళ్లతో సమానంగా ఆ కూలి బాలుడికి కూడా అవకాశాలు దక్కాలని, అతడి కలలు నెరవేరాలని అభిలషించారు..!! ఆ విశిష్ట వ్యక్తి ఎవరో కాదు.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా. ఆ కూలి బాలుడు విశాల్! సిరి ఆడిటోరియంలో సభికుల మధ్య కూర్చున్న విశాల్ గురించి మాట్లాడి ఒబామా అందరినీ ఆకట్టుకున్నారు. ‘‘నాలుగేళ్ల కిందట నేను హుమాయూన్ సమాధిని సందర్శించినప్పుడు.. ఈ దేశ అభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తున్న కొందరు కూలీలు, వారి పిల్లలతో మాట్లాడా. భవిష్యత్తుపై ఎన్నో కలలు.. కళ్లలో ఎన్నో ఆశలు నింపుకున్న కొందరు అద్భుతమైన పిల్లల్ని చూశా. వారిలో విశాల్ ఒకరు. ఈరోజు ఆయనకు (విశాల్ను చూస్తూ..) 16 ఏళ్లు. ఆయన కుటుంబం దక్షిణ ఢిల్లీకి సమీపంలోని ఓ పల్లెలో నివాసం ఉంటోంది. ఆయన తల్లి హుమాయూన్ సమాధి వద్ద పని చేస్తుంటుంది. తండ్రి రాళ్ల పని చేస్తాడు. సోదరి యూనివర్సిటీలో చదువుతోంది. మరో సోదరుడు రోజువారీ కూలి. వీళ్లంతా పని చేయడం వల్ల విశాల్ స్కూలుకు వెళ్లగలిగాడు. ఆయనకు కబడ్డీ చూడడం ఇష్టం. సైన్యంలో చేరాలన్నది విశాల్ కల. ఆయనను చూసి మనమంతా గర్వపడాలి. ఇక్కడి పిల్లల్లో అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయనడానికి విశాల్ ఒక ఉదాహరణ. నా కూతుళ్లు మాలియా, నషా కలలు నాకు ఎంత ముఖ్యమో విశాల్ కలలు కూడా అంతే ముఖ్యం. నా కూతుళ్లకు దక్కే అవకాశాలే విశాల్కూ దక్కాలి.’’ అని ఒబామా అన్నారు. దీంతో ఉద్విగ్నతకు గురైన సభికులు చప్పట్ల మోతతో హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. -
ప్రగతి మన అభి‘మతం’
► మతం పేరుతో చీలితే.. భారత్లో అభివృద్ధి అసాధ్యం ► సిరిఫోర్ట్ ఆడిటోరియంలో ఒబామా స్ఫూర్తిదాయక ప్రసంగం ► మతోన్మాదం అభివృద్ధికి చేటు... ప్రతి పౌరుడికీ మత స్వేచ్ఛ ఉంటుంది ► రాజ్యాంగాలే ఆ హక్కునిచ్చాయి.. కాపాడాల్సిన బాధ్యత ప్రజలది, ప్రభుత్వాలది! ► మహిళాశక్తిని గుర్తించండి; దేశాభివృద్ధిలో వారు కీలకం ► ఐరాస భద్రతామండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి మద్దతు మూడు రోజుల పర్యటన ముగింపును అగ్రదేశాధినేత ఒబామా తనదైన శైలిలో ముగించారు. బీజేపీ నేతల హిందుత్వ వ్యాఖ్యలతో మోదీ సర్కారుపై పడిన ‘మత’ ముద్రపై స్పందనా అన్నట్లుగా.. మత సామరస్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మత స్వేచ్ఛ హక్కు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు అని అధికరణలతో సహా గుర్తు చేశారు. మత విశ్వాసాల పరంగా చీలిపోనంతవరకు భారత్ విజయం సాధిస్తూనే ఉంటుందంటూ సున్నితంగా చురకలంటించారు. దాంతో, అమెరికా అధ్యక్షుడు ఒబామా, భారత ప్రధాని మోదీల మధ్య కుదిరిన కెమిస్ట్రీ.. మోదీ సర్కారుకు చివరకు చేదునే మిగిల్చింది. ఢిల్లీలోని సిరిఫోర్ట్ ఆడిటోరియంలో మంగళవారం ఒబామా ఎంపిక చేసిన 1500 మందిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘అన్ని మతాలూ ఒకే తోటలో విరిసిన కుసుమాలు.. ఒకే అద్భుత వృక్షానికి చెందిన వేర్వేరు శాఖలు’ అన్న మహాత్మాగాంధీ వ్యాఖ్యను ఉటంకిస్తూ.. మతోన్మాదం దేశాభివృద్ధికి చేటు చేస్తుందని, నచ్చిన మతాన్ని అనుసరించే, కోరుకున్న విశ్వాసాన్ని ఆరాధించే హక్కు ప్రజలందరికీ ఉందని ఒబామా తేల్చిచెప్పారు. భారత్, అమెరికాల సారూప్యతలను, ఉజ్వలభరితం కానున్న ఇరుదేశాల సంబంధాలను, భారత్లోని నారీశక్తిని, యువత సామర్థ్యాన్ని, ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా భారత్ పోషించాల్సిన పాత్రపై స్ఫూర్తిదాయక దిశానిర్దేశం చేశారు. ఎలాంటి ఒత్తిడి, భయం, వివక్ష లేకుండా నచ్చిన మతవిశ్వాసాలను అనుసరించే హక్కు, నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ఈ ప్రాథమిక హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ప్రభుత్వం పైనా, ప్రతీ పౌరుడి పైనా ఉంది. తమ మత విశ్వాసమే గొప్పదనుకునేవారి వల్ల ప్రపంచవ్యాప్తంగా మత హింస, మతపరమైన అసహనం, మత ఉగ్రవాదం పెచ్చరిల్లుతోంది. వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. మతపరమైన విభజన రేఖలు గీచి, మనల్ని విడదీయాలనుకునే వారి అన్ని ప్రయత్నాలను అడ్డుకోవాలి. ప్రపంచంలోనే అతిపెద్ద, పురాతన ప్రజాస్వామ్యాలైన మన రెండు దేశాలు కలిసికట్టుగా సాగితే.. ప్రజలకు మరిన్ని ఉద్యోగాలు, మరిన్ని అవకాశాలు లభిస్తాయి. మన రెండు దేశాలు మరింత అభివృద్ధి చెందుతాయి. చదువుకున్న మహిళల పిల్లలకు కూడా మంచి విద్య లభిస్తుంది. మంచి భవిష్యత్తు లభిస్తుంది. అందువల్ల ప్రగతి దిశగా ముందుకెళ్లాలనుకుంటున్న అన్ని దేశాలు.. జనాభాలో సగమైన మహిళల శక్తి సామర్థ్యాలను విస్మరించరాదు. వైవిధ్యత వల్లనే వంటవాడి మనవడినైన నేను అమెరికా అధ్యక్షుడినయ్యాను. టీ అమ్మిన మోదీ భారత ప్రధానయ్యారు. న్యూఢిల్లీ: సమాజంలో మత సామరస్యం, పరమత సహనం ప్రాధాన్యతలను నొక్కి చెబుతూ.. ‘మత విశ్వాసాల పరంగా చీలిపోనంతవరకు భారత్ విజయం సాధిస్తూనే ఉంటుంది’ అంటూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సున్నితంగా హెచ్చరించారు. ‘అన్ని మతాలూ ఒకే తోటలో విరిసిన కుసుమాలు.. ఒకే అద్భుత వృక్షానికి చెందిన వేర్వేరు శాఖలు’ అన్న మహాత్మాగాంధీ వ్యాఖ్యను గుర్తు చేస్తూ.. సమాజంలో మత సామరస్యం అవసరాన్ని ఒబామా నొక్కి చెప్పారు. మతోన్మాదం దేశాభివృద్ధికి చేటు చేస్తుందని, నచ్చిన మతాన్ని అనుసరించే, కోరుకున్న విశ్వాసాన్ని ఆరాధించే హక్కు ప్రజలందరికీ ఉందని తేల్చి చెప్పారు. భారత్, అమెరికా రాజ్యాంగాల్లో మతారాధన హక్కును ప్రసాదించిన అధికరణలను ఉటంకిస్తూ.. ‘ఎలాంటి ఒత్తిడి, భయం, వివక్ష లేకుండా నచ్చిన మతవిశ్వాసాలను అనుసరించే హక్కు, నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ఈ ప్రాథమిక హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రతీ ప్రభుత్వం పైనా, ప్రతీ పౌరుడి పైనా ఉంది’ అని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు, హిందూత్వ సంస్థలు ఇటీవల చేపట్టిన మత మార్పిళ్ల కార్యక్రమం ‘ఘర్ వాపసీ’.. బీజేపీ ఎంపీలు, హిందూత్వ సంస్థల ప్రతినిధులు చేస్తున్న మైనారిటీ వ్యతిరేక హిందూత్వ వ్యాఖ్యలు.. వివాదాస్పదం అయిన నేపథ్యంలో ఒబామా సున్నితంగా చేసిన ఈ హెచ్చరికలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మోదీ సర్కారును ఉద్దేశించే ఒబామా ఈ చురకలు వేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘తమ మత విశ్వాసమే గొప్పదనుకునేవారి వల్ల ప్రపంచవ్యాప్తంగా మత హింస, మతపరమైన అసహనం, మత ఉగ్రవాదం పెచ్చరిల్లుతోంది. వారిపట్ల అప్రమత్తంగా ఉండాలి. మతపరమైన విభజన రేఖలు గీచి, మనల్ని విడదీయాలనుకునే వారి అన్ని ప్రయత్నాలను అడ్డుకోవాలి’ అని ఒబామా పిలుపునిచ్చారు. ‘నేను క్రిస్టియన్ను కాదని, ముస్లింన ని చాలా పుకార్లు వచ్చాయి. నేనెవరో తెలియని వారు నా మత విశ్వాసాలను ప్రశ్నించిన సందర్భాలూ ఉన్నాయి.’ అన్నారు. ఉత్తేజభరితం.. స్ఫూర్తిదాయకం: గణతంత్ర దినోత్సవ వేడుకల ముఖ్య అతిథిగా భారత్కు వచ్చిన ఒబామా 3 రోజుల పర్యటన మంగళవారంతో ముగిసింది. చివరి రోజు మంగళవారం అమెరికాలోని టౌన్హాల్ మీటింగ్ తరహాలో.. ఢిల్లీలోని సిరిఫోర్ట్ ఆడిటోరియంలో ఎంపిక చేసిన దాదాపు 1,500 మంది విద్యార్థులు, మేధావులు, ప్రముఖులనుద్దేశించి ఒబామా స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. సతీమణి మిషెల్తో కలిసి ఆడిటోరియానికి వచ్చిన ఒబామా.. భారత్, అమెరికా సంబంధాలు, ఇరుదేశాల సారూప్యతలు, భారత్లో యువశక్తి, నారీ శక్తి సహా విస్తృతాంశాలను స్పృశిస్తూ దాదాపు 35 నిమిషాల పాటు ప్రసంగించారు. ఒబామా ప్రసంగానికి సభికుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ పర్యటనలో భారతీయ నేతలెవరూ వెంట లేకుండా ఒబామా పాల్గొన్న కార్యక్రమం ఇదొక్కటే. అనంతరం సౌదీ రాజు అబ్దుల్లా మృతిపై ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఒబామా సౌదీ అరేబియాకు బయల్దేరి వెళ్లారు. సహజమే కాదు.. అత్యుత్తమం కూడా.! భారత్, అమెరికాలు సహజ భాగస్వాములు మాత్రమే కాదని, అమెరికా భారత్కు అత్యుత్తమ భాగస్వామిగా మారగలదని తన ప్రసంగంలో ఒబామా పేర్కొన్నారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద, పురాతన ప్రజాస్వామ్యాలైన మన రెండు దేశాలు కలిసికట్టుగా సాగితే.. ప్రజలకు మరిన్ని ఉద్యోగాలు, మరిన్ని అవకాశాలు లభిస్తాయి. మన రెండు దేశాలు మరింత అభివృద్ధి చెందుతాయి.’ అన్నారు. పేదరిక నిర్మూలనకు భారత్ చేస్తున్న కృషిని ప్రశంసించిన ఒబామా.. భారతీయుల జీవన ప్రమాణాలు మెరుగ వుతున్న కొద్దీ భారత్తో మరింత భాగస్వామ్యాన్ని అమెరికా కోరుకుంటుందన్నారు. ‘మీ దేశంలో రోడ్లు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, బుల్లెట్ రైళ్ల వంటి మౌలిక వసతుల నిర్మాణంలో పాలుపంచుకుంటాం. మీ దేశంలో మరిన్ని నగరాల రూపకల్పనలో భాగస్వాములమవుతాం’ అని తెలిపారు. మహిళా శక్తి: భారత్లోని మహిళల శక్తి సామర్థ్యాలను ఒబామా గొప్పగా కొనియాడారు. ‘భారత పర్యటనలో నన్ను అత్యంత ఆకట్టుకున్న అంశం.. భారత సాయుధ దళాల్లోని మహిళల అద్భుతమైన శక్తి సామర్థ్యాలు. నేను రాష్ట్రపతిభవన్కు వెళ్లినప్పుడు అక్కడ నాకు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చిన మహిళా అధికారి ఒక అద్భుతం’ అని వ్యాఖ్యానించారు. ఈ గణతంత్ర కవాతులో మహిళా అధికారులే సాయుధ దళాలకు నేతృత్వం వహించిన విషయం తెలిసిందే. ‘ఏ రంగంలోనైనా విజయం సాధించగలమని భారతీయ మహిళలు రుజువు చేశారు. ఈ దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం.’ అన్నారు. ‘మన కుమారులకు అందించే అన్ని అవకాశాలను కూతుళ్లకు కూడా అందించాలి. ఇంటా, బయటా సురక్షితంగా, గౌరవంగా తన దినచర్యను ప్రతీ మహిళ పూర్తి చేసుకోగలగాలి. ఆ పరిస్థితి కల్పించేందుకు సోదరులుగా, తండ్రులుగా, భర్తలుగా మనమంతా కృషి చేయాలి’ అని ఒబామా పేర్కొన్నారు. ‘చదువుకున్న మహిళల పిల్లలకు కూడా మంచి విద్య లభిస్తుంది. మంచి భవిష్యత్తు లభిస్తుంది. అందువల్ల ప్రగతి దిశగా ముందుకెళ్లాలనుకుంటున్న అన్ని దేశాలు.. జనాభాలో సగమైన మహిళల శక్తి సామర్థ్యాలను విస్మరించరాదు’ అన్నారు. తన జీవితంలో తన భార్య మిషెల్, ఇద్దరు కూతుళ్లు పోషిస్తున్న పాత్రను ఒబామా సభికులకు వివరించారు. ‘నా భార్య మిషెల్ చాలా తెలివైంది. నేనేమైనా తప్పు చేస్తే నిర్మొహమాటంగా చెప్తుంది. నాకు ఇద్దరు అందమైన కూతుళ్లున్నారు. వారికి సమాజ జీవనానికి అవసరమైన ప్రేమ, సానుభూతి, ఆత్మగౌరవం.. మొదలైన ముఖ్యమైన విలువలు నేర్పించడానికి ప్రయత్నిస్తుంటాం’ అన్నారు. ‘మేం గొప్ప కుటుంబాల నుంచేం రాలేదు. మా చదువే మమ్మల్నిక్కడికి చేర్చింది’ అన్నారు. వైవిధ్యత, భిన్నత్వం: భిన్నత్వం, వైవిధ్యతల్లో భారత్, అమెరికాలకు సారూప్యత ఉందని ఒబామా పేర్కొన్నారు. ‘ఆ వైవిధ్యత వల్లనే వంటవాడి మనవడినైన నేను అమెరికా అధ్యక్షుడినయ్యాను. టీ అమ్మిన మోదీ భారత ప్రధాని అయ్యారు. భారత్లో అనేక మతాలు, కులాలు, వర్ణాలు, భాషలు ఉన్నాయి. అవే భారత్ బలం. అమెరికాలోనూ శ్వేతజాతీయులు, నల్లవారు, లాటనో, ఇండో అమెరికన్, ఆసియన్, లాటినో అమెరికన్.. ఇలా విభిన్న జాతులున్నారు. దేశంలోని ప్రతి పౌరుడూ సమానమేనని మన రాజ్యాంగాల్లో స్పష్టంగా చెప్పుకున్నాం. అలాగే ముందుకు వెళ్తున్నాం’ అన్నారు. ‘మన రెండు దేశాల చరిత్ర వేరుకావచ్చు. వేర్వేరు భాషలు మాట్లాడుతాం కావచ్చు. కానీ సమాజంలో వేళ్లూనుకున్న విలువల పరంగా మనమొకటే. అందుకే మనం ఒకరికొకరం ప్రతిబింబాలుగా కన్పిస్తాం’ అన్నారు. వందేళ్లక్రితం స్వామి వివేకానంద చికాగోలో ఇచ్చిన ప్రసంగాన్ని ఒబామా ప్రస్తావించారు. ‘స్వామి వివేకానంద నా సొంత నగరం చికాగో వచ్చారు. అక్కడి ప్రజలను భారతదేశ సోదర, సోదరీమణులారా అని సంబోధించారు. నేనూ మిమ్మల్ని అలాగే సంబోధించాలనుకుంటున్నాను’ అన్నారు. నేనూ వివక్ష ఎదుర్కొన్నా: ‘అమెరికాలో అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలున్నప్పటికీ.. నా చర్మం రంగు కారణంగా నేనూ అసమానతను, వివక్షను ఎదుర్కొన్నా’ అని గుర్తు చేసుకుంటూ.. ఇతరుల ఆశలను, ఆశయాలనూ గౌరవించాలని అభ్యర్థించారు. వాతావరణ మార్పును ఎదుర్కొందాం: భారత్ లాంటి దేశాలు స్వచ్ఛమైన ఇంధన వినియోగం వైపు మళ్లనట్లయితే.. వాతావరణ మార్పు అనే ప్రమాదాన్ని ఎదుర్కోక తప్పదని ఒబామా హెచ్చరించారు. ‘గత వందేళ్లుగా శిలాజ ఇంధనాన్ని వినియోగించుకుని అభివృద్ధి చెందిన మేం.. ఇప్పుడు భారత్ లాంటి దేశాలను ఆ ఇంధనం వాడకూడదని చెప్పడాన్ని పలువురు తప్పుపడుతున్నారన్న విషయం నాకు తెలుసు. కానీ అంతర్జాతీయ భాగస్వామ్యమంటే.. వాతావరణ మార్పు అనే ప్రమాదాన్ని కలసికట్టుగా ఎదుర్కోవడమే’ అని స్పష్టం చేశారు. భద్రతామండలి శాశ్వత సభ్యత్వానికి మద్దతు ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో సంస్కరణల ఆవశ్యకత ఉందన్న ఒబామా.. భద్రతామండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ప్రతిపాదనకు అమెరికా మద్దతిస్తుందని స్పష్టం చేశారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారత్ కీలకశక్తిగా ఎదగాలని ఒబామా ఆకాంక్షించారు. ఈ ప్రాంతంలో నౌకాయాన స్వేచ్ఛ కొనసాగాలని, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరారు. దక్షిణ చైనా సముద్రంపై చైనా ప్రాబల్యం నేపథ్యంలో ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతంలోని ఇతర దేశాల అభివృద్ధికి భారత్ తోడ్పడాలని సూచించారు. ‘ఎన్నికల నిర్వహణలో మీకున్న అనుభవాన్ని, నైపుణ్యాన్ని మయన్మార్, శ్రీలంక తదితర దేశాల్లో ప్రజాస్వామ్య పరిపుష్టికి ఉపయోగించండి’ అన్నారు. వైద్య రంగంలోని నైపుణ్యాన్ని మరిన్ని టీకాల తయారీకి ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా శిశుమరణాలను అడ్డుకోవాలని కోరారు. రెండు దేశాలు.. ఒకే భావన భారత్, అమెరికాల మధ్య బలమైన సంబంధాలున్నాయని, రెండు దేశాల మధ్య ఒకే విధమైన ప్రజాస్వామ్య విలువలున్నాయని, రెండు దేశాల్లోనూ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిఖ్ లు, యూదులు తదితర భిన్న మతస్థులు సహజీవనం చేస్తున్నారని ఒబామా గుర్తు చేశారు. ‘అమెరికా వ్యవస్థాపక పత్రాల్లో, భారత రాజ్యాంగంలోని 25వ అధికరణంలో మతస్వేచ్ఛ హక్కును, మత ప్రచార హక్కును స్పష్టంగా పేర్కొన్నారన్నారు. ‘రెండు దేశాలూ ఉగ్రవాద దాడులను ఎదుర్కొన్నాయి. ఆ బాధను భరించాయి. అందుకే రక్షణ, పరస్పర భద్రత అంశాల్లో సహకారాన్ని విస్తృతం చేసుకోవాలని నిర్ణయించాం. అణ్వాయుధాలు లేని ప్రపంచం మన లక్ష్యం. ఆ దిశగా కలిసి కృషి చేయాలి’ అన్నారు. మూడేళ్ల క్రితం యూఎస్లోని విస్కాన్సిస్ గురుద్వారాలో ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందిన విషయాన్ని ఒబామా గుర్తు చేశారు. -
మీ పర్యటనతో కొత్త అధ్యాయం
ట్వీటర్లో ఒబామాను ఉద్దేశించి మోదీ న్యూఢిల్లీ: ఒబామా పర్యటన భారత్-అమెరికా సంబంధాలను నూతన శిఖరాలకు తీసుకువెళ్లిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. రెండు దేశాల సంబంధాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఒబామా సౌదీ అరేబియాకు బయల్దేరిన అనంతరం మోదీ ఈ మేరకు ట్వీటర్లో వ్యాఖ్యానించారు. ‘‘ఒబామాకు వీడ్కోలు. మీ ప్రయాణం సురక్షితంగా జరగాలని ఆకాంక్షిస్తున్నా. మీ పర్యటనతో రెండుదేశాల సంబంధాలు కొత్త శిఖరాలకు చేరాయి’’ అని మోదీ అన్నారు. వైట్హౌస్ కూడా దీనికి స్పందించింది. ‘‘ఒబామా పర్యటనను ఎల్లకాలం గుర్తుండిపోయేలా మలిచినందుకు థాంక్యూ నరేంద్రమోదీ. ఆత్మీయ స్వాగతం పలికిన భారత ప్రజలకు కృతజ్ఞతలు’’ అంటూ అధ్యక్షుడి కార్యాలయం బదులిచ్చింది. దీన్ని మోదీ ట్వీటర్లో పొందుపరిచారు. గణతంత్ర దినోత్సవం పరేడ్లో చిరుజల్లులు కాస్త ఇబ్బంది కలిగించిన విషయాన్ని కూడా మోదీ తనదైన శైలిలో ప్రస్తావించారు. -
స్నేహంలో నూతనాధ్యాయం
అమెరికా అధ్యక్షుడు ఒబామా మూడురోజుల భారత పర్యటన ముగిసింది. విదేశాలకు వెళ్లినప్పుడు దేశం మొత్తం తన పర్యటనపైనే దృష్టి పెట్టేలా... తన గురించే చర్చించుకునేలా చేసుకోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ మొదటినుంచీ కృతకృత్యుల వుతున్నారు. ఇప్పుడు ఒబామా వంటి అగ్రరాజ్య అధినేత గణతంత్ర దినోత్సవానికి వచ్చిన సందర్భాన్ని సైతం మోదీ అదే స్థాయిలో ఉపయోగించుకున్నారు. జాతీయ మీడియా మొత్తం ఒబామా పర్యటన గురించే చర్చించేలా చేయగలిగారు. అయిదేళ్ల క్రితం నాటి ఒబామా పర్యటననూ, ప్రస్తుత పర్యటననూ పోల్చిచూస్తే ఈ వ్యత్యాసం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. నిజానికి ఆ సమయంలో ఒబామా అమెరికా అధ్యక్ష పదవికి రెండోసారి పోటీపడాలన్న సంకల్పంతో ఉన్నారు. ఇప్పుడాయన వచ్చే ఏడాది ఆ పదవి నుంచి వైదొలగబోతున్నారు. అయినా సరే ఈ పర్యటనకొచ్చిన ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. రిపబ్లికన్ పార్టీకి చెందిన జార్జి బుష్ పాలన సమయంలో పదేళ్లనాడు కుదిరిన పౌర అణు ఒప్పందం అతీ గతీ తేల్చకుండా పదవినుంచి తప్పుకున్నారన్న అపప్రద తనకు అంటకుండా చూసుకోవడం ఒబామాకు అవసరం. అదే సమయంలో భారత్లో తమ వ్యాపారాభివృద్ధికి దోహదపడ్డారని అమెరికన్ కార్పొరేట్ ప్రపంచం అనుకోవడం ముఖ్యం. ఈ పర్యటనద్వారా ఒబామాకు ఆ రెండూ సమకూరాయనుకోవచ్చు. అదే సమయంలో చొరవతో వ్యవహరించి మూలనబడిన అణు ఒప్పందానికి కదలిక తీసుకురావడమేకాక, భారీ మొత్తంలో విదేశీ పెట్టుబడులు రావడానికి దోహదపడిన నేతగా మోదీకి గుర్తింపు వచ్చింది. అయితే, అణు పరిహారచట్టానికి సంబంధించి ఎలాంటి మార్పులు చేయదల్చు కున్నారో ఇంకా తేలాల్సి ఉంది. సంయుక్త భాగస్వామ్యంలో రక్షణ పరికరాల ఉత్పత్తి చేయడానికి, ఇరుదేశాలమధ్యా ఇప్పటికే ఉన్న రక్షణ ఒప్పందాన్ని మరో పదేళ్లపాటు పొడిగించడానికి అంగీకారం కుదిరింది. రెండో రోజు ద్వైపాక్షిక వాణిజ్య బంధం మరింత విస్తరించేందుకు వీలుకల్పించే పలు ఒప్పందాలపై సంతకాలయ్యాయి. మొత్తం 400 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు, రుణాలు సమకూరేలా చూస్తామని ఒబామా ప్రకటించారు. అంతేకాక తమకూ, చైనాకూ మధ్య వాణిజ్యం 56,000 కోట్ల డాలర్లున్నదని ద్వైపాక్షిక వాణిజ్యం ఆ స్థాయికి పెరిగేలా ఇరు దేశాలూ కృషి చేయాలన్నారు. ఇరు దేశాధినేతల మధ్యా శిఖరాగ్ర సమావేశం జరిగి నాలుగు నెలలే అయినా... గణతంత్ర దినోత్సవానికి రావాలన్న మోదీ ఆహ్వానాన్ని అంగీకరించి అందుకనుగుణంగా అమెరికా కాంగ్రెస్లో తన ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్’ ప్రసంగాన్ని ముందుకు జరుపుకొని ఒబామా భారత్కు వచ్చారు. రాజ్పథ్లో మన దేశం ప్రదర్శించిన సైనిక పాటవాన్ని, భిన్న సంస్కృతుల సమ్మేళనాన్ని, ముఖ్యంగా సాయుధ దళాల కవాతులో మహిళలు పాల్గొనడాన్ని ఒబామా ఎంతో ఆసక్తిగా చూశారు. అయితే, ఇరుదేశాలమధ్యా అమ్మకందారు, కొనుగోలుదారు సంబంధాలు కాకుండా అంతకుమించిన అనుబంధం ఏర్పడాలని... అందుకోసం అమెరికా రక్షణ పరికరాల సంస్థలు ఇక్కడే కర్మాగారాలు నెలకొల్పి వాటిని తయారుచేయాలని మోదీ అభిప్రాయపడుతున్నారు. అందుకు తగినట్టుగా ఆయన ఇప్పటికే రక్షణ ఉత్పత్తుల రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచబోతున్నట్టు ప్రకటించారు. అమెరికా నుంచి అందుకు సానుకూలమైన స్పందన లభిస్తుందా అన్నది చూడాలి. ఆసియాలో చైనా, జపాన్ల తర్వాత అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశం మనదే. ఆసియా ఖండంలో చైనాకు దీటుగా ఎదిగేలా భారత్ను ప్రోత్సహించడం వ్యూహాత్మకంగా కూడా అమెరికాకు అవసరం. కనుక అమెరికా ఈ విషయంలో మనకు అనుకూలంగా వ్యవహరించవచ్చునన్న అంచనాలున్నాయి. ఆసియా పసిఫిక్, హిందూ మహా సముద్ర ప్రాంతాల్లో శాంతి, సుస్థిరత, వికాసానికి ఇరు దేశాల సన్నిహిత భాగస్వామ్యం అత్యంత అవసరమని భావిస్తున్నట్టు నేతలిద్దరూ చేసిన సంయుక్త ప్రకటనను గమనిస్తే ఈ విషయంలో అమెరికా స్పష్టతతోనే ఉన్నదని అర్ధమవుతుంది. అయితే, ఇది చైనాను అప్రమత్తం చేస్తుందనడంలో సందేహం లేదు. చైనా అధికారిక మీడియాలో వెలువడిన వ్యాఖ్యానంలో దీని ఛాయలు కనిపించాయి. చైనా, రష్యాలతో భారత్కున్న సంబంధాలను విచ్ఛిన్నం చేసేందుకు అమెరికా చూస్తున్నదని చైనా మీడియా హెచ్చరించింది కూడా. సాధారణంగా నేరుగా దేన్నీ చెప్పడం అలవాటులేని చైనా నాయకత్వం తన మనోభావాలను వ్యక్తంచేయడానికి అక్కడి మీడియాను ఉపయోగించుకుంటుంది. అంతేకాదు...సరిగ్గా మన గణతంత్ర దినోత్సవం రోజునే బీజింగ్ పర్యటనకెళ్లిన పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్కు అక్కడ ఘన స్వాగతం లభించింది. మొదటి రెండురోజులూ మోదీతోనే కనబడిన ఒబామా చివరిరోజు మాత్రం సిరిఫోర్ట్ ఆడిటోరియంలో జరిగిన సభలో తన సతీమణితోపాటు పాల్గొని ‘చాలా విషయాలే’ మాట్లాడారు. బహుశా మొదటి రెండురోజులూ చెప్పడం కుదరనివన్నీ అక్కడ మాట్లాడినట్టున్నారు. ‘మత విశ్వాసాలపరంగా చీలిపోనంతకాలమూ మీరు విజయం సాధిస్తార ’ని హితవు పలికారు. నచ్చిన మతాన్ని, కోరుకున్న విశ్వాసాన్ని అనుసరించే, ప్రచారం చేసుకునే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందని కూడా అన్నారు. ఘర్వాపసీ వంటి వివాదాస్పద కార్యక్రమాలు సాగిన నేపథ్యంలో ఒబామా వ్యాఖ్యలను చురకలనుకోవాలో, సున్నితంగా చేసిన సూచనలనుకోవాలో...వీటితో సంబంధంలేని సాధారణ వ్యాఖ్యలనుకోవాలో వినేవారి రాజకీయ విశ్వాసాలనుబట్టి ఆధారపడి ఉంటుంది. ఎవరికి తోచినట్టు వారు అనుకునే తరహాలోనే ఒబామా ఉదాహరణలున్నాయి. ఆయన విస్కాన్సిన్ గురుద్వారాలో కొన్నేళ్లక్రితం జరిగిన దాడిని ప్రస్తావించారు. తన చర్మం రంగు కారణంగా తాను అమెరికాలో వివక్షను ఎదుర్కొన్న సంగతిని గుర్తుచేసుకున్నారు. మొత్తానికి ఒబామా మూడురోజుల పర్యటన భారత్-అమెరికా సంబంధాల్లో నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించింది. -
ఒబామాకు మోదీ ‘వీడ్కోలు’ట్వీట్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మూడు రోజుల భారత్ పర్యటన ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఒబామా భారత్ పర్యటన ముగించుకొని సౌదీ అరేబియాకు బయల్దేరి వెళ్లగానే మోదీ సామాజిక వెబ్సైట్ ట్విట్టర్లో ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘ఇదే మీకు వీడ్కోలు. మీ పర్యటన భారత్, అమెరికా సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లెంది. మీ ప్రయాణం క్షేమంగా సాగాలని కోరుకుంటున్నాను’ అని మోదీ వ్యాఖ్యానించారు. అమెరికా వైట్హౌస్ కూడా ఇదే రీతిలో స్పందించింది. ఒబామా భారత్ పర్యటన ఓ మధుర జ్ఞాపకంగా మిగిలి పోతుందని, తమకందించిన స్వాగత, సత్కారాలకు భారతీయులకు, మోదీకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వైట్హౌస్ వ్యాఖ్యానించింది. దీనిపై మోదీ స్పందిస్తూ మళ్లీ ట్వీట్ చేశారు. రిపబ్లిక్ పరేడ్ సందర్భంగా వర్షం పడుతుంటే ఒబామా స్వయంగా తానే గొడుకు పట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ ‘బడే బడే దేశంమే ఐసీ చోటే చోటే బాతే హోతీ రహతే హై’ అంటూ సందర్భోచితంగా ఒబామా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. Farewell @WhiteHouse! Your visit has taken India-USA ties to a new level & opened a new chapter. Wish you a safe journey. — Narendra Modi (@narendramodi) January 27, 2015 -
విజయవంతంగా ముగిసిన ఒబామా పర్యటన
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన దిగ్విజయంగా ముగిసింది. మంగళవారం మధ్యాహ్నం ఒబామా దంపతులు ప్రత్యేక విమానంలో సౌదీ అరేబియాకు పయనమయ్యారు. కేంద్ర మంత్రి పియూష్ గోయెల్, ఇతర ఉన్నతాధికారులు ఒబామాకు వీడ్కోలు పలికారు. ఈ రోజు ఉదయం ఒబామా సిరి ఫోర్ట్ ఆడిటోరియంలో ప్రసంగించారు. ఈ రోజు ఆగ్రాకు వెళ్లి తాజ్మహల్ను సందర్శించాల్సివుంది. అయితే సౌదీ రాజు అబ్దుల్లా మరణించడంతో ఒబామా ఆగ్రా పర్యటనకు రద్దు చేసుకుని సౌదీకి బయల్దేరారు. రిపబ్లిక్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఒబామా మూడు రోజుల భారత్ పర్యటనలో అణు ఒప్పందం, ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం తదితర కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపారు. -
సిరిఫోర్ట్ ఆడిటోరియంలో ఒబామా ప్రసంగం
-
ముగిసిన ఒబామా భారత్ పర్యటన
-
'ఒబామాను ఆహ్వానించే ఛాన్స్ మిస్సయ్యాం'
లక్నో:అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఆహ్వానించే ఛాన్సును కోల్పోయమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పశ్చాతాపం వ్యక్తం చేశారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా మూడు రోజుల పర్యటనకు ఒబామా ఆదివారం భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఒబామా ముందస్తు షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శించాల్సి ఉంది. అయితే గత గురువారం సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా కన్నుమూయడంతో ఒబామా ఆగ్రా పర్యటన రద్దయ్యింది. ఒబామా రాష్ట్ర పర్యటన రద్దుకావడంతో అఖిలేష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. 'ఒబామాను రాష్ట్రానికి ఆహ్వానించే ఛాన్స్ కోల్పోయాం. ఇది నిజంగా చాలా బాధాకరం'అంటూ తన అధికారిక ఫేస్ బుక్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సోమవారం ఒబామా విందుకు పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందింది. ఈ విందుకు అఖిలేష్ యాదవ్ కూడా హాజరయ్యారు. రెండు ప్రధాన ప్రజాస్వామ్య దేశాల మధ్య మైత్రి ఆహ్వానించదగ్గ పరిణామం అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
ఢిల్లీలో ఒబామా స్ఫూర్తిదాయక ప్రసంగం
-
అద్భుతమైన ముగింపు ఇచ్చిన ఒబామా
మూడు రోజుల భారతదేశ పర్యటనకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అద్భుతమైన ముగింపు ఇచ్చారు. నమస్తే.. బహుత్ బహుత్ ధన్యవాద్ అంటూ సిరిఫోర్ట్ ఆడిటోరియంలో ప్రసంగం ప్రారంభించి, జైహింద్ అంటూ ముగించారు. ఆయన ఒక్కో మాట చెబుతున్నప్పుడల్లా ఆడిటోరియం కరతాళ ధ్వనులతో మిన్నంటింది. అడుగుడుగునా భారతీయతను తన ప్రసంగంలో ఆయన నింపేశారు. షారుక్ ఖాన్ నటించిన దిల్వాలే దుల్హనియా లేజాయేంగే విజయాన్ని, మిల్కాసింగ్ ఒలింపిక్ పతకాలను, కైలాష్ సత్యార్థి నోబెల్ శాంతి బహుమతిని ప్రస్తావించారు. తాము ఇంతకుముందు వచ్చినప్పుడు చూసిన 'విశాల్' అనే బాలకార్మికుడి విజయాన్ని కూడా గుర్తుచేశారు. స్వామి వివేకానంద అమెరికాకు హిందుత్వాన్ని, యోగాను పరిచయం చేశారన్నారు. 30 లక్షల మంది భారతీయులు తమ దేశాన్ని బలోపేతం చేస్తున్నారని, అది ఎంతో గర్వకారణమని ఒబామా చెప్పారు. భారతదేశంలోని మహిళా శక్తిని వేనోళ్ల పొగిడారు. మతస్వేచ్ఛను ప్రస్తావించారు. అమెరికాలో గురుద్వారాపై దాడి దురదృష్టకరమని అభివర్ణించారు. భారతదేశంలోని యువశక్తిని, వాళ్లకున్న అవకాశాలను, సాధించగలిగిన విజయాలను అన్నింటినీ ఒకదాని వెంట ఒకటిగా గుర్తుచేశారు. భారతీయుల కష్టపడేతత్వాన్ని తాము నేర్చుకోవాలని నిజాయితీగా చెప్పారు. తాను వంటవాడి మనవడినని, మోదీ టీ అమ్ముకునే వ్యక్తి కొడుకని తమ మధ్య పోలికలను గుర్తుచేశారు. -
ఈసారి డాన్సు చేయలేకపోయాం: ఒబామా
న్యూఢిల్లీలోని సిరిఫోర్ట్లో ఒబామా స్ఫూర్తిమంతంగా ప్రసంగించారు. నమస్తే , బహుత్ బహుత్ ధన్యవాద్ అంటూ ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. జైహింద్ అంటూ ముగించారు. ఆయన ఏమన్నారంటే.. ఇంతకుముందు మేం ముంబైలో పిల్లలతో కలిసి డాన్సు చేశాం. దురదృష్టవశాత్తు ఈసారి డాన్సు చేయలేకపోయాం. మిషెల్ మంచి డాన్సర్ అని అందరూ అంటారు. ఇంతకుముందు వైట్ హైస్ లో దీపావళి చేసుకున్నాం. మహాత్మా గాంధీ స్ఫూర్తితోనే పోరాటం చేసినట్లు మార్టిన్ లూథర్ కింగ్ చెప్పారు. అహింస అత్యంత శక్తిమంతమైన ఆయుధం. గాంధీ చెప్పిన ఈ విషయం మనందరికీ ఆచరణీయం. భారతీయులు, అమెరికన్లు అంతా సమానమే. వందేళ్ల క్రితం స్వామి వివేకానంద అమెరికాకు వచ్చి స్ఫూర్తిమంతమైన ప్రసంగం చేశారు. ఆయన మా సొంత నగరం చికాగో వచ్చారు. ఆయన ప్రసంగాన్ని అమెరికాలోని సోదర సోదరీమణులారా అని ప్రారంభించారు. ఇప్పుడు నేనూ భారత్ లోని సోదర సోదరీమణులారా అని అంటున్నాను. ఆయన హిందూత్వాన్ని, దాని శక్తిని ప్రపంచానికి చాటారు. వలసవాదాన్ని తరిమికొట్టడానికి మనమంతా పోరాడాం. భారత యూఎస్ సంబంధాలు అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి. టెక్నాలజీ శక్తి మీ సొంతం. దాని పుణ్యమాని మనం ఫేస్బుక్, ట్విట్టర్.. వీటి సాయంతో ప్రంపచంలో అందరినీ కలవగలుగుతున్నాం. 30 లక్షల మంది భారతీయులు అమెరికాను బలోపేతం చేస్తున్నారు. వాళ్లంతా చాలా గర్వకారణం. భారత్, అమెరికా కేవలం భాగస్వాములే కారు.. అద్భుతమైన భాగస్వాములు. ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్గా భారతదేశం ఉంది. నన్ను రెండోసారి భారతదేశానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. అమెరికా- ఇండియా కలిస్తే ఏదైనా సాధించవచ్చు, ఎంత పెద్ద విజయాన్నైనా సొంతం చేసుకోవచ్చు. పేదరికాన్ని తరిమికొట్టడానికి మోదీ ప్రభుత్వం సౌర విద్యుత్తు లాంటి వాటికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. అణ్వస్తాలు లేని ప్రపంచాన్ని మనం చూడగలగాలి. అందుకోసం మనమంతా కలిసి కృషి చేయాలి. అంతర్జాతీయ శాంతి భద్రతలు, తీరప్రాంత భద్రత ఇవన్నీ అత్యంత ముఖ్యం. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్య దేశంగా చూడాలని నేను అనుకుంటున్నాను. అందుకు నా పూర్తి మద్దతు ఉంటుంది. ఎన్నికల రంగంలో మీకున్న అనుభవం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో నైపుణ్యాలు ఇతర దేశాలకు కూడా ఉపయోగపడాలి. బర్మా, శ్రీలంక లాంటి దేశాలకు మీ సాయం అవసరం. మంచి వాక్సిన్లు కనిపెట్టారు, ఔషధ రంగంలో కూడా మీ అనుభవం అపారం.వైద్య మేథోశక్తితో ప్రపంచ దేశాలకు ఎంతో సాయం చేయచ్చు. మీ లాంటి యువతరమే స్వచ్ఛమైన ఇంధనం కోసం పోరాడాలి. ఈ భూమిని కాపాడుకోవాల్సింది మీరే. అమెరికాలాగే పేదరిక నిర్మూలనకు భారత్ కృషిచేస్తోంది. భారతదేశంలోను, అమెరికాలోను అనేక జాతులు, మతాలు, కులాలు, వర్ణాలు, అన్నీ ఉన్నాయి. మీ రాజ్యాంగం, మా రాజ్యాంగం కూడా ఒక్కలాంటివే. మా తాతగారు బ్రిటిష్ సైన్యంలో వంటవాడిగా పనిచేసేవారు. మేం పుట్టినప్పుడు నల్లజాతి వాళ్లకు ఓటుహక్కు కూడా ఉండేది కాదు. నా చర్మం రంగు కారణంగా అసలు ఇంత ఎత్తు ఎదగగలనా అన్న అనుమానం చాలామందికి ఉండేది. ఇప్పుడు ఇక్కడ ఒకళ్లు ఆటో నడుపుతుంటారు, మరొకరు ఇంట్లో పనిచేసుకుంటారు, వాళ్లకూ ఆశలు.. ఆకాంక్షలు ఉంటాయి. ప్రస్తుతానికి కడు పేదరికంలో మగ్గిపోతున్నా.. వాళ్ల పిల్లలకు అద్భుతమైన అవకాశాలు రావడం ఖాయం. ఓ టీ అమ్ముకునే వ్యక్తి కొడుకు ప్రధానమంత్రి కావడమే ఇందుకు నిదర్శనం. ప్రతి ఒక్కరికీ అవకాశాలున్నాయి. తమ కలలను నిజం చేసుకోడానికి కష్టపడాలి. భారతదేశంలో మహిళా శక్తి అపారం. నా భార్య మిషెల్ చాలా గొప్పవ్యక్తి. మహిళల సమానత్వం కోంస అమెరికా కృషి చేస్తోంది. నాకు ఇద్దరు అందమైన కూతుళ్లున్నారు. వాళ్లకు స్వేచ్ఛ ఉంది. మహిళలు విజయాలు సాధిస్తే దేశం విజయాలు సాధిస్తుంది. మహిళలను ఎలా ట్రీట్ చేస్తారన్నదాన్ని బట్టే విజయాలు ఆధారపడి ఉంటాయి. మగాళ్ల కంటే కూడా ఆడవాళ్లు బాగా చదువుకుంటున్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలలో ఏవైనా దేశాలు వెనకబడ్డాయంటే, మహిళాశక్తిని నిర్లక్ష్యం చేయడం వల్లే. మనమంతా కూడా మహిళలను పూర్తిస్థాయిలో గౌరవించాలి. వాళ్ల గౌరవాన్ని కాపాడే బాధ్యత సోదరుడిగా, భర్తగా, తండ్రిగా, కొడుకుగా మనమీదే ఉంటుంది. రిపబ్లిక్ డే వేడుకల్లో నారీశక్తి నన్ను ఎంతగానో ఆకర్షించింది. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, యూదులు.. అంతా ఉంటారు. కానీ అంతా ఒకే చెట్టుకు ఉన్న వేర్వేరు కొమ్మల్లాంటివాళ్లే. మతస్వేచ్ఛ దేశానికి చాలా ముఖ్యం. మన రెండు దేశాల్లోనూ ఇది ఉంది. ఎలాంటి భయం లేకుండా తమ మతాన్ని అవలంబించడానికి, ప్రచారం చేసుకోడానికి వీలుండాలి. అమెరికాలో విస్కాన్సిస్ గురుద్వారా మీద దాడి జరగడం దురదృష్టకరం. షారుక్ ఖాన్, మిల్కాసింగ్.. ఇలా ఎవరైనా విజయాలు సాధించగలరు. కైలాష్ సత్యార్థి నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్నారు. భారతదేశంలో చాలామంది 35 ఏళ్లలోపు వాళ్లే. మీలాంటి యువతే ఈ దేశ భవిష్యత్తు. ఏదేశంలోనైనా మీవల్లే బంగార భవిష్యత్తు సాధ్యం అవుతుంది. మీ కలలను సాకారం చేసుకునేందుకు అన్నిచోట్లా అవకాశం ఉంది. మీకు సరైన శిక్షణ ఇస్తేచాలు. ఇందుకోసం మన దేశాల్లోని యూనివర్సిటీలు, ఐఐటీలు, కాలేజీల మధ్య సహకారాన్ని మరింత పెంచుదాం. అమెరికా విద్యార్థులు భారత్ రావాలి, భారత విద్యార్థులు అమెరికా రావాలి. మనం ఒకరినుంచి మరొకరు నేర్చుకోవాలి. మవాళ్లు మిమ్మల్ని చూసి కష్టపడే తత్వం నేర్చుకోవాలి. భారతదేశంలోని కుటుంబ వ్యవస్థ చాలా బాగుంటుంది. మేం గతంలో వచ్చినప్పుడు కొంతమంది కార్మికులను కలిశాం. వాళ్ల పిల్లలను చూశాం. వాళ్ల ముఖాలమీద నవ్వు మెరిసిపోతోంది. అతడి పేరు విశాల్. ఇప్పుడు అతడి వయసు 16 ఏళ్లు. ఢిల్లీలో బాగా చదువుకుంటున్నాడు. అందుకు కారణం అతడు స్కూలుకు వెళ్లడమే. విశాల్ భారత సైన్యంలో చేరదామని అనుకున్నాడు. విశాల్ లాంటి లక్షలాది మంది వాళ్లకు మనం చదువుకునే అవకాశాలు కల్పించాలి. భారతదేశ భవిష్యత్తు మీద నేను చాలా ఆశాభావంతో ఉన్నాను. రెండు దేశాల్లోను ఎన్నికలు జరిగాయి. గత తరాలు కనీసం ఊహించలేని స్థాయిలో అభివృద్ధి సాధించాం. మానవహక్కులను గౌరవించాం. మనకు కలలున్నాయి, వాటిని సాకారం చేసుకుంటున్నాం. మనమంతా ఒకే చెట్టుకు పూసిన అందమైన పువ్వులం. మేం మీ స్నేహితులుగా ఉండాలని, భాగస్వాములుగా ఉండాలని అనుకుంటున్నాం. జైహింద్.. -
ఆ సూటు నిండా.. మోదీ పేర్లే!!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను స్వాగతించిన తర్వాత రాష్ట్రపతి భవన్కు వచ్చినప్పుడు ప్రధాని నరేంద్రమోదీ ఓ నల్లటి బంద్ గలా సూట్ వేసుకున్నారు. అయితే దానిమీద బంగారు వర్ణంతో చారల్లాంటి డిజైన్ కనిపించింది. ఇదేంటో.. చారల సూటు అనే అంతా అనుకున్నారు. కానీ, ఆ ఫొటోలను క్లోజప్లో చూస్తే అసలు విషయం తెలిసింది. ఆ చారలన్నీ వాస్తవానికి నరేంద్ర మోదీ పేర్లే! అవును.. ఆయన పూర్తి పేరయిన నరేంద్ర దామోదర్దాస్ మోదీ అనే పేరును బంగారు వర్ణం అక్షరాలుగా దానిమీద కుట్టారు. తొలుత విమానాశ్రయానికి వెళ్లినప్పుడు కుర్తా పైజమా ధరించి, దానిమీద నెహ్రూ జాకెట్, శాలువా వేసుకుని వెళ్లారు. తర్వాత రాష్ట్రపతి భవన్లో అధికారికంగా స్వాగతం చెప్పేటప్పుడు మాత్రం సూటు మార్చుకున్నారు. అదే సూటుతో హైదరాబాద్ హౌస్లో 'చాయ్ పే చర్చా' కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఈ సూటును అహ్మదాబాద్కు చెందిన జేడ్ బ్లూ సంస్థ తయారుచేసింది. మోదీ దుస్తులన్నింటినీ వాళ్లే తయారుచేస్తారు. మోదీ కుర్తాలను డిజైన్ చేసింది కూడా వీళ్లేనని అంటారు. ఆ డిజైన్కు ఎంతగానో ముచ్చట పడిన ఒబామా.. ఆ తరహా కుర్తాలు వేసుకోవాలని తనకూ ఉన్నట్లు వెల్లడించారు. గతంలో ఈజిప్టు మాజీ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ కూడా ఇలా తన పేరును సూటు మీద కుట్టించుకుని వేసుకున్నారు. ఆయన మామూలు టూ పీస్ సూట్ వేసుకుని, దాని కాలర్ సహా మొత్తం సూటంతా తన పేరు కుట్టించుకున్నారు. ఆ తర్వాత ఇలా చేసింది మోదీ ఒక్కరేనని అంటున్నారు. -
నేను ఇక బైకు నడపను: ఒబామా
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ పెరేడ్ సందర్భంగా భారత సరిహద్దు భద్రతాదళం(బీఎస్ఎఫ్)కు చెందిన 'జాన్బాజ్' బృందం మోటార్సైకిళ్లపై చేసిన విన్యాసాలు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను అమితంగా ఆకట్టుకున్నాయి. వారి విన్యాసాలు చూసిన తరువాత తాను ఇక మోటార్ బైకు నడపనని ఆయన చెప్పారు. బీఎస్ఎఫ్ బృందం బైక్స్పై వెళుతూ మానవ పిరమిడ్లా ఏర్పడిన విన్యాసం సహా ఒళ్లు గగుర్పొడిచే ఇతర విన్యాసాలను ఒబామా దంపతులు ఆద్యంతం ఆసక్తిగా వీక్షించారు. చప్పట్లతో, బొటనవేలితో థమ్స్అప్ చిహ్నాలు చూపుతూ ప్రోత్సహించారు. అనంతరం భారత్, అమెరికా వ్యాపార సంస్థల సీఈఓల భేటీలో బీఎస్ఎఫ్ జవాన్ల అద్భుత విన్యాసాలను ఒబామా ప్రస్తావించారు. వారి సాహసోపేత విన్యాసాలను చూసిన తరువాత 'నేనిక బైక్ను నడపబోను'అని ఒబామా వ్యాఖ్యానించారు. -
కదం తొక్కిన భారత నారి
వేడుకల్లో మహిళా పాటవం పతాకావిష్కరణ నుంచి.. కవాతు వరకూ.. నారీశక్తి కేంద్ర బిందువుగా సాగిన పరేడ్ న్యూఢిల్లీ: భారత 66వ గణతంత్రం సోమవారం ఓ అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించింది. ప్రపంచాన్ని అబ్బుర పరిచే విధం గా మహిళా పాటవాన్ని ప్రదర్శించింది. నారీశక్తి కేంద్ర ఇతివృత్తంగా సాగిన రిపబ్లిక్ డే పరేడ్ భారత్లో మహిళా సాధికారత ప్రపంచ పెద్దన్నను విస్మయ పరిచే విధంగా సాగింది. రాజ్పథ్లో పతాకావిష్కరణ దగ్గర నుంచి ఆసాంతం మహిళా ప్రాధాన్యమే కనిపించింది. మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో త్రివిధ దళాల నుంచి మహిళా జవానులు రాజ్పథ్ పరేడ్లో వివిధ బృందాలకు, శకటాలకు నేతృత్వం వహించారు. వీరి ప్రదర్శన పరేడ్కు హాజరైన అశేష ప్రజానీకంలో భావోద్వేగం పెల్లుబికేలా చేసింది. ముఖ్య అతిథి ఒబామా సైతం అబ్బుర పడేలా నారీశక్తి కదం తొక్కింది. పరేడ్ సాగుతుండగానే ఆయన నేతృత్వంలో సాగే అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తన ట్వీటర్ పేజిలో భారత మహిళా సైన్యానికి జోహారు అర్పించింది. ‘భారత రిపబ్లిక్ పరేడ్లో మహిళా సైనికపాటవం ఆకట్టుకునేలా సాగింది. భారత దేశంలోని అద్భుతమైన వైవిధ్యం ఒకేచోట ఏకరూపంగా ప్రదర్శితమైంద’ని నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ట్వీట్ చేసింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పతాకావిష్కరణ పోడియం దగ్గరకు రాగానే, కెప్టెన్ హావోబమ్ బెల్లా దేవి.. ఆయన సమక్షంలో పతాకావిష్కరణ చేశారు. మణిపూర్కు చెందిన రెండోతరం సైనికాధికారి బెల్లాదేవి. పతాకావిష్కరణ జరగగానే జాతీయపతాకానికి వందన సమర్పణకు ఆమే కమాండ్ చేశారు. పరేడ్ ప్రారంభమైన తరువాత ముందుగా పదాతి దళం, కెప్టెన్ దివ్యా అజిత్ నాయకత్వంలో సైన్యాధ్యక్షుడు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వందనం చేస్తూ ముందుకు సాగింది. దివ్యా అజిత్, 2010లో చెన్నైలోని అధికారుల శిక్షణ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్లో ‘స్వోర్డ్ ఆఫ్ హానర్’ అవార్డును పొందారు. దివ్యతోపాటు నౌకా, వాయు సైన్యానికి చెందిన మహిళా జవానులు కూడా రైసీనా హిల్స్ నుంచి ఇండియా గేట్ వరకూ దేశం గర్వపడేలా కవాతును నిర్వహించారు. నౌకాదళం ప్రదర్శించిన శకటం ‘భారతీయ నవసేన, నారీ శక్తి’కి లెఫ్టినెంట్ కమాండర్ శ్వేతాకపూర్, లెఫ్టినెంట్ వర్తికా జోషి నాయకత్వం వహించారు. మరో నలుగురు నౌకాదళ మహిళా అధికారులుశకటంపై అపూర్వమైన పాటవాన్ని ప్రదర్శించారు. ఈ అధికారులు గోవా నుంచి రియో జానెరియో వరకు ప్రతికూల వాతావరణంలో సముద్రంపై సాహస ప్రయాణం చేసిన ధీరవనితలు. ఎవరెస్టు పర్వత శకటంపై మహిళాధికారుల పర్వతారోహణ ఆహూతులను బాగా ఆకట్టుకుంది. ‘అమ్మాయిని రక్షించు.. అమ్మాయిని చదివించు’ (బేటీ బచావో, బేటీ పఢావో పథకానికి సంబంధించిన శకటం పరేడ్లో ముఖ్య ఆకర్షణగా నిలిచింది. ఎన్సీసీ బ్యాండ్ బృందం కూడా బాలికల నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఈ బాలికలు వినిపించిన ‘సారే జహాసే అచ్చా’ గానానికి ఒబామా సతీమణి మిషెల్లీ చప్పట్లు కొట్టి అభినందించారు. .ఎన్ఎస్ఎస్ బృందం లో 148 మంది బాలబాలికలు పాల్గొన్నారు. కేంద్ర జలవనరుల శాఖకు చెందిన ‘మా గంగా’ శకటం మహిళా దైవశక్తిసామర్థ్యాలను చాటింది. పంచాయతీరాజ్ శాఖ శకటం ఈ-గవర్నెన్స్ను ఒక పల్లె పడుచు లాప్టాప్ ద్వారా వినియోగించుకుంటున్నట్లు ప్రదర్శించింది. న్యాయ శాఖ శకటం, రైల్వే శకటాలకు కూడా మహిళా సాధికారతే ఇతివృత్తమయింది. స్త్రీశిశు సంక్షేమ శాఖ బాలికలతో ‘భవిష్యత్తు మాదే’ అన్న ఇతివృత్తం తో శకటాన్ని ప్రదర్శించింది. రిపబ్లిక్డే పరేడ్ మొత్తం భారత మహిళా స్ఫూర్తిని సాధికారికంగా ప్రపంచానికి చాటి చెప్పింది. రాజస్థానీ తలపాగాతో మెరిసిన మోదీ గణతంత్ర వేడుకల్లో రాజస్థానీ ‘బాందనీ’ తలపాగాతో మోదీ మెరిసిపోయారు. నలుపు సూట్పై ఎరుపురంగు తలపాగా ధరించిన మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కూడా ఆయన ఇదే వేషధారణలో కనిపించారు. ఇక ఒబామా నల్లరంగు సూట్ ధరించారు. జల్లులు కురవడం, చల్లని వాతావరణం ఉండడంతో ఒబామా తన వాహనం నుంచి దిగగానే.. సూట్పై నిలువెత్తు కోటు వేసుకున్నారు. మిషెల్ ఒబామా పొడవాటి నల్ల సూట్పై ఎర్రని స్కార్ఫ్తో తళుక్కుమన్నారు. 2015 ఛబ్బీస్ జనవరిలో ఇవి ఫస్ట్.. త్రివిధ దళాల్లోని మహిళా సిబ్బందితో పరేడ్ గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరవడం ఇటీవలే కొనుగోలు చేసిన తీరప్రాంత నిఘా, జలాంతర్గాములను పేల్చివేసే సామర్థ్యం గల పీ-81 యుద్ధ విమానం, అత్యాధునిక మిగ్-29కే విమానం ప్రదర్శించడం ఇదే తొలిసారి. వేడుకలకు హాజరయ్యే విదేశీ ముఖ్య అతిథులు సాధారణంగా రాష్ట్రపతి వాహనంలో వస్తారు. కానీ ఈసారి ఒబామా తన సొంత వాహనం‘బీస్ట్’లో రాజ్పథ్కు వచ్చారు. సీఆర్పీఎఫ్కు చెందిన నక్సల్స్ నిరోధక దళం-కోబ్రా తొలిసారి పరేడ్లో పాల్గొంది. గణతంత్రంలో విశేషాలు.. సన్నని జల్లులు కురుస్తున్నా లెక్క చేయకుండా రాజ్పథ్ మార్గం రెండువైపులా జనం పెద్ద ఎత్తున బారులు తీరారు. ఓవైపు తడిసిపోతున్నా వేడుకలను ఆసక్తిగా వీక్షించారు. సతీమణి మిషెల్తో కలసి ఒబామా రాజ్పథ్కు రాగానే జనం హర్షధ్వానాలు చేశారు. రాష్ట్రపతి రాకకోసం ఎదురుచూస్తున్న సమయంలో జల్లులు కురవడంతో ఒబామా తానే స్వయంగా గొడుగు పట్టుకొని నిల్చున్నారు. యువతీయువకులు ‘వి లవ్ ఒబామా’ అని చూపే ప్లకార్డులు ప్రదర్శించారు. ‘ఒబామా.. ఒబామా..’ అని నినాదాలు చేశారు. త్రివిధ దళాల విన్యాసాల సమయంలో చిన్నారుల కేరింతలతో రాజ్పథ్ మార్మోగింది. ‘నారీశక్తి’కి ప్రతీకగా త్రివిధ దళాల్లోని మహిళా అధికారులు కవాతు చేసిన సమయంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ లేచి నిలబడి అనందం వ్యక్తంచేశారు. ఆకాశంలో సుఖోయ్-30 ఎంకేఐ చేసిన విన్యాసాలు వీక్షకులను అబ్బురపరిచాయి. జాతీయ సాహస అవార్డులు గెల్చుకున్న బాలలకు గౌరవసూచకంగా సందర్శకులంతా లేచి నిలబడ్డారు. గణతంత్ర వేడుకల్లో ఒబామా కారు ‘బీస్ట్’ రాజ్పథ్పై రాచఠీవి ఉట్టిపడుతూ ముందుకు వస్తుంటే అంతా ఆసక్తిగా చూశారు. -
కళ్లకు కట్టిన శక్తి, సంస్కృతి
అగ్రరాజ్యాధినేత సమక్షంలో అబ్బురంగా గణతంత్ర దినోత్సవ కవాతు రిపబ్లిక్ డే పరేడ్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఒబామా సైనిక శక్తిని, భిన్న సంస్కృతులను ప్రదర్శించిన భారత్ రెండు గంటల పరేడ్ను వీక్షించిన ఒబామా దంపతులు న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికా అధినేత ముఖ్య అతిథిగా పాల్గొని అబ్బురంగా వీక్షిస్తుండగా.. భారతదేశం 66వ గణతంత్ర దినోత్సవంలో తన సైనిక పాటవాన్ని, సుసంపన్నమైన భిన్న సంస్కృతుల సమ్మేళనాన్ని కళ్లు చెదిరే రీతిలో ఆవిష్కరించింది. కనీవినీ ఎరుగని భద్రతా ఏర్పాట్ల మధ్య దేశ రాజధాని ఢిల్లీ నగరంలో సోమవారం గణతంత్ర వేడుకల కవాతు కన్నులపండుగగా సాగింది. ఒకవైపు సన్నగా కురుస్తున్న వర్షం, మరోవైపు మంచు మేఘా లు ఆవరించివున్న ఆకాశం.. ఇవేవీ రాజ్పథ్లో రిపబ్లిక్ పరేడ్ను వీక్షించేందుకు వచ్చే వేలాది జనాల ఉత్సాహాన్ని చల్లార్చలేకపోయాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన తొలి అమెరికా అధ్యక్షుడి గా బరాక్ ఒబామా చరిత్ర సృష్టించారు. సాధారణం గా ముఖ్యఅతిథిని రాష్ట్రపతి తన వాహనంలో వెంట తీసుకురావటం సంప్రదాయం. ఈ సంప్రదాయానికి విరుద్ధంగా.. ఒబామా అత్యంత భద్రతాపూరితమైన తన సొంత వాహనం ‘ది బీస్ట్’లోనే రాజ్పథ్లోని వేదిక వద్దకు వచ్చారు. ఒబామా, మోదీ మాటామంతీ: ముదురు నల్ల రంగు సూటు ధరించిన ఒబామా.. ప్రధాన వేదికపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్లాస్ ఎన్క్లోజర్లో రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ సరసన, ప్రధాని నరేంద్రమోదీ పక్కనే ఆశీనులయ్యారు. రాష్ట్రపతికి మరోవైపు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ఆ పక్కన ఒబామా సతీమణి మిషెల్, ఆమెపక్కన అన్సారీ సతీమణి, రక్షణమంత్రి పారికర్, ఇతర ముఖ్యులు ఆశీనులయ్యారు. మోదీ వర్ణశోభితమైన బంధేజ్ సాఫా (రాజస్థానీ తలపాగా) ధరించి ఆకర్షణీయంగా కనిపించా రు. స్వల్పంగా జల్లులు పడుతుండటంతో ఒబామా కొద్ది సేపు తన గొడుగు చేతపట్టుకుని కనిపించారు. వాన జల్లులతో తడిసిన పరేడ్ మార్గంలో రెండు గంటల పాటు కొనసాగిన అద్భుత ప్రదర్శనను ఒబామా ఆద్యంతం ఆసక్తికరంగా వీక్షించారు. పరేడ్లోని ప్రదర్శనల విశేషాలను ముఖ్యఅతిథికి మోదీ వివరిస్తుండగా.. ఒబామా కూడా ఆయనతో ముచ్చటిస్తూ కనిపించారు. ప్రదర్శనలోని పలు అంశాల పట్ల ఒబామా అభినందనపూర్వకంగా తల ఊపారు.. బీఎస్ఎఫ్ జవాన్లుమోటార్ సైకిళ్లపై చేసిన విన్యాసాలకు బొటన వేలు పెకైత్తి చూపుతూ అభినందనలు తెలిపారు. మిషెల్ చిన్నారుల నృత్య ప్రదర్శనలను నవ్వుతూ తిలకించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రణబ్ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా భారత జాతీయ పతాకాన్ని రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ ఆవిష్కరించారు. జాతీయ గీతాలాపన, సంప్రదాయబద్ధమైన 21 గన్ సెల్యూట్ (గాలిలోకి తుపాకులు పేల్చి చేసే వందనం) జరిగాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసి న వేదికపై ఉన్న భారత సర్వసైన్యాధ్యక్షుడైన రాష్ట్రపతికి.. జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (ఢిల్లీ) లెఫ్టినెంట్ సుబ్రతోమిత్రా నేతృత్వంలో సైనిక, పోలీసు బలగా లు.. లయబద్ధమైన సైనిక సంగీతంతో పదం కలుపుతూ కవాతు (మార్చ్ ఫాస్ట్) చేస్తూ సైనిక వందనం సమర్పించాయి. బీఎస్ఎఫ్, అస్సామ్ రైఫిల్స్, కోస్ట్ గార్డ్, సీఆర్పీఎఫ్, ఇండో-టిబెటన్ బోర్డర్ ఫోర్స్, సీఐఎస్ఎఫ్,సశస్త్ర సీమాబల్, ఆర్పీఎఫ్, ఢిల్లీ పోలీస్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ు మార్చ్ ఫాస్ట్ నిర్వహించాయి. అబ్బురపరచిన ఆయుధ సంపత్తి... గణతంత్ర దినోత్సవ కవాతులో తొలిసారిగా ఈ ఏడాది త్రివిధ దళాల నుంచి అన్నీ మహిళా యూనిట్లే పాల్గొనటం విశేషం. సైనిక ఆయుధ సంపత్తిలో.. ఇటీవలే సమకూర్చుకున్న దీర్ఘశ్రేణి సముద్ర నిఘాకు వినియోగించే, జలాంతర్గాములను పేల్చివేసే సామర్థ్యం గల పీ-81 యుద్ధ విమానం, దీర్ఘశ్రేణి అత్యాధునిక మిగ్-29కే యుద్ధవిమానాలను తొలిసారిగా ప్రదర్శించారు. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అభివృద్ధి చేసిన భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల ఆకాశ్ మధ్యశ్రేణి క్షిపణి, వెపన్ లొకేటింగ్ రాడార్ల ప్రదర్శన ఆకర్షించాయి. లేజర్ గెడైడ్ మిసైల్ సామర్థ్యమున్న టి-90 భీష్మ యుద్ధ ట్యాంకు, బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థకు చెందిన మొబైల్ అటానమస్ లాంచర్, శాటిలైట్ టెర్మినల్ (రాడ్శాట్) తదితర ఆయుధ సంపత్తి భారత సైనిక పాటవాన్ని చాటిచెప్పాయి. వైమానిక,నౌకాదళాలు కూడా తమ ఆయుధ సంపత్తిని ప్రదర్శించాయి. దుర్భేద్యమైన కోటగా దేశ రాజధాని... అమెరికా సీక్రెట్ సర్వీస్ భద్రతా జాగ్రత్తల దృష్ట్యా ఆ దేశాధ్యక్షుడు ఒక బహిరంగ వేదిక నుంచి దాదాపు రెండు గంటల పాటు ఒక కార్యక్రమాన్ని వీక్షించటం అసాధారణమైన విషయం. అగ్రరాజ్యాధినేత కోసం చేపట్టిన భూతలం నుంచి గగనతలం వరకూ చేపట్టిన భద్రతా చర్యలు రాజధాని నగరాన్ని దుర్భేద్యమైన కోటగా మార్చివేశాయి. ఏడు వలయాలతో భద్రతను చేపట్టారు. పరేడ్ మార్గం పొడవునా అన్ని భవనాలు, ఎత్తయిన కట్టడాలపైనా నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) స్నైపర్లను మోహరించారు. మోదీ మూడు కలలు ప్రధాని నరేంద్రమోదీ కలల పథకాలు మూడు సోమవారం రిపబ్లిక్ పరేడ్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. జనధన్ యోజన, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛభారత్ పథకాలకు సంబంధించి ప్రత్యేక శకటాలను పరేడ్లో ప్రదర్శించారు. వివిధ పాఠశాలల బాలబాలికలతో పరిశుభ్రతకు సంబంధించిన నృత్య ప్రదర్శనను స్వచ్ఛభారత్ శకటంపై ప్రదర్శించారు. అదే విధంగా కేంద్ర పారిశ్రామిక ఉత్పాదక శాఖ యంత్ర చక్రాలతో రూపొందించిన అతి పెద్ద సింహం నమూనా పరేడ్లో ప్రత్యేకంగా కనిపించింది. అదే విధంగా అత్యధిక ప్రజాదరణ పొందిన జనధన్ యోజన పథకానికి కూడా శకటం ప్రదర్శించారు. వీటితో పాటు బేటీ బచావో, బేటీ పఢావో, ఆయుష్ శకటాలు కూడా ఆహూతులను ఆకట్టుకున్నాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాల నుంచి శకటాలను, వివిధ రంగాల్లో సాధించిన విజయాలు, ప్రభుత్వ లక్ష్యాలను ప్రతిబింబిస్తూ మరో 9 శకటాలను ప్రదర్శించారు. దేశంలో తయారీ పరిశ్రమను, ఉద్యోగాల సృష్టిని ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రచారాన్ని ప్రతిబింబిస్తూ కూడా ఒక శకటాన్ని ప్రదర్శించారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తూ గిరిజనుల నృత్యరీతులు, సంప్రదాయ సంగీతం, పాఠశాలల విద్యార్థినుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. చివర్లో భారత వాయుసేన ఫ్లైపాస్ట్లో హెలికాప్టర్లు, యుద్ధవిమానాలతో చేసిన విన్యాసాలు అతిథులు, వీక్షకులను అబ్బురపరచాయి. పరేడ్ ముగింపులో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో పొగలు విరజిమ్ముతూ వాయుసేన విమానాలు నింగిలో భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించటం ఆకట్టుకుంది. -
భారత్, అమెరికా సరైన దిశలో పయనిస్తున్నాయి
న్యూఢిల్లీ: భారత్, అమెరికా సరైన దిశగా పయనిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు ప్రపంచానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. సోమవారం రాత్రి ఢిల్లీలో జరిగిన భారత్-అమెరికా వాణిజ్య వేత్తల సదస్సులో ఒబామా ప్రసంగించారు. ఈ సదస్సులో ఒబామాతో పాటు భారత ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నారు. భారత గణతంత్ర వేడుకులు తనను అబ్బురపరిచాయని ఒబామా ప్రశంసించారు. భారత్, అమెరికా సాధించాల్సింది చాలా ఉందని ఒబామా అన్నారు. ఇరు దేశాల మధ్య దిగుమతులు పెరగాల్సిన అవసరముందని పేర్కొన్నారు. అమెరికా దిగుమతుల్లో కేవలం 2 శాతమే భారత్ నుంచి వస్తుండగా, భారత్ దిగుమతుల్లో 1 శాతం మాత్రమే అమెరికా వాటా ఉందని చెప్పారు. అమెరికా తయారీ విమానాలు భారత్ విమానాశ్రాయాల్లో నిరంతరం కనబడాలని ఒబామా అన్నారు. అంతకుముందు మోదీ ప్రసంగించారు.