
ఐఏఎస్ అధికారి నికుంజా ధాల్
భువనేశ్వర్: కష్టాల్లో ఉన్నవారిని కాపాడే వారిని హీరో అంటాం. ఐఏఎస్ అధికారి నికుంజా ధాల్ ఇప్పుడు హీరోగా నిలిచారు. కష్టాల్లో ఉన్న ప్రజల కోసం తన బాధను దిగమించి బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించిన ఆయనపై అన్నివైపుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆయన చేసిన పనికి సలాం చెబుతూ తోటి అధికారులే కాదు ప్రజలు కూడా జేజేలు చెబుతున్నారు. (కరోనా మృతదేహాల నిర్వహణ ఇలా..! )
ఒడిశా వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా నికుంజా ధాల్ పనిచేస్తున్నారు. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ ఒడిశాను వణికిస్తున్న నేపథ్యంలో రాత్రింబవళ్లు ఆయన పనిచేస్తున్నారు. తండ్రి చనిపోయిన 24 గంటల్లోనే ఆయన మళ్లీ విధులకు హాజరై నిబద్ధత చాటుకున్నారు. తండ్రి అంత్యక్రియలు పూర్తయిన వెంటనే విధులకు వచ్చేశారు. కరోనా నివారణ చర్యలను స్వయంగా ఆయన పర్యవేక్షిస్తున్నారు. తండ్రి చనిపోయిన బాధను దిగమించిన 24 గంటల్లోనే విధులకు హాజరైన ఆయనను ఐఏఎస్ అధికారుల సంఘం ప్రత్యేకంగా అభినందించింది. సోషల్ మీడియాలో ఆయనపై నెటిజనులు, ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దేశంలో కరోనా కల్లోలాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కృషి చేస్తున్న తెర వెనుక హీరోల్లో నికుంజా ధాల్ ఒకరని అధికారిక ట్విటర్ పేజీలో కేంద్రం ప్రభుత్వం పేర్కొంది.
నమోదు చేసుకుంటే నగదు!
సోమవారం మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదు కాగానే ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్త్రంలోని అన్ని విద్యా సంస్థలకు మార్చి 31 వరకు సెలవులు ప్రకటించింది. పదో తరగతి మినహా అన్ని పరీక్షలకు వాయిదా వేసింది. ధియేటర్లు, స్విమ్మింగ్ ఫూల్స్ సహా మాల్స్ను తాత్కాలికంగా మూసి వేయాలని ఆదేశించారు. ‘కోవిడ్-19’ను రాష్త్ర విపత్తుగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. విదేశాల నుంచి వచ్చే ఒడిశా వాసులు తప్పనిసరిగా పేర్లు నమోదు చేసుకుని, 14 రోజుల పాటు స్వీయ నిర్బంధం(క్వారంటైన్)లో ఉండాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసుకుని, హోమ్ ఐసోలేషన్ పాటించే విదేశీయులకు 15 రూపాయల ప్రోత్సాహక నగదు ఇస్తామని తెలిపారు. (కరోనా ఎఫెక్ట్: 7 ప్రత్యేక రైళ్ల సేవలు రద్దు)
Comments
Please login to add a commentAdd a comment