
బిహార్ మాజీ సీఎం రబ్రీ దేవి (ఫైల్ ఫోటో)
ముజఫర్పూర్ ఘటన సిగ్గుచేటు..
పట్నా : ముజఫర్పూర్ షెల్టర్ హోంలో చిన్నారులపై అకృత్యాల ఘటనపై బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని మాజీ సీఎం రబ్రీ దేవి డిమాండ్ చేశారు. నితీష్ సీఎం పదవిలో కొనసాగినంత కాలం నిష్పాక్షిక విచారణ సాధ్యం కాదని తేల్చిచెప్పారు. సీబీఐ ప్రస్తుతం కేసును విచారిస్తున్నా ఇంతవరకూ పెద్ద తలకాయలు ఎవరూ పట్టుబడలేదని, నితీష్ అధికారంలో ఉంటే కేసులో ప్రమేయం ఉన్న రాజకీయ నేతలు, అధికారుల పేర్లు వెలుగుచూడవని తాము భావిస్తున్నామన్నారు.
ముజఫర్పూర్ దారుణ ఘటనలో జేడీయూ, బీజేపీ నేతల హస్తం ఉందని నితీష్ అంతరాత్మకు తెలుసని రబ్రీ దేవి ఆరోపించారు. ఈ కేసులో సీబీఐ నిష్పాక్షిక విచారణపై ఆమె సందేహం వ్యక్తం చేశారు. ముజఫర్పూర్ ఘటన బిహార్తో పాటు నితీష్ ప్రతిష్టను మంటగలిపిందని అన్నారు. మహిళలు, బాలికలకు బిహార్ సురక్షితం కాదని ఆందోళన వ్యక్తం చేశారు.