
బీజేపీతో పొత్తుపై నిర్ణయాధికారం పార్టీ అధ్యక్షుడికి కట్టబెట్టిన శివసేన ఎంపీలు
సాక్షి, ముంబై : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని శివసేన ఎంపీలు పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరేకు కట్టబెట్టారు. సోమవారం థాకరే నివాసంలో జరిగిన పార్టీ ఎంపీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రలో ప్రజల పక్షాన తమ పార్టీ పోరాడుతుందని బీజేపీతో పొత్తుపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్టీ ఎంపీలు అధ్యక్షుడికి కట్టబెట్టారని సమావేశానంతరం శివసేన ప్రతినిధి సంజయ్ రౌత్ వెల్లడించారు.
మహారాష్ట్రలో బీజేపీ, శివసేన సమాన సంఖ్యలో పోటీ చేస్తాయనే వార్తలపై ఆయన స్పందిస్తూ తమకు ఇలాంటి సమాచారం లేదని, ఈ తరహా సీట్ల సర్దుబాటును తాము అంగీకరించమని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలో తమ పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తుందన్నారు. పార్టీ ఎంపీల సమావేశంలో తాము రాఫెల్ ఒప్పందంతో పాటు మహారాష్ట్రలోని కరువు పరిస్థితిపైనా చర్చించామని చెప్పుకొచ్చారు.
రూ 8 లక్షల లోపు ఆదాయం కలిగిన అగ్రవర్ణ పేదలకు జనరల్ కోటాలో పదిశాతం రిజర్వేషన్లపైనా చర్చించామని, ఈ కోటాకు అర్హులైన వారిని ఆదాయ పన్ను నుంచి మినహాయించాలని ఉద్ధవ్ థాకరే డిమాండ్ చేశారని వెల్లడించారు. వారిని ప్రభుత్వం పేదలుగా ముద్రవేసినప్పుడు వారిని తప్పనిసరిగా ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని అన్నారు.