shivsena
-
ఏక్నాథ్ షిండేపై అనుచిత వ్యాఖ్యలు.. కమెడియన్ కునాల్కు బిగ్ షాక్
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. మరోవైపు.. శివసేన నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కమెడియన్ కమ్రాపై కేసు నమోదు చేశారు. క్రమాపై వ్యాఖ్యలను సీఎం ఫడ్నవీస్, మరో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తప్పుబట్టారు.ఈ ఘటనపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ..‘కునాల్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఏకానాథ్ షిండేపై చేసిన వ్యాఖ్యలకు గాను కునాల్ కమ్రా క్షమాపణలు చెప్పాల్సిందే. నేను కామెడీకి వ్యతిరేకంగా కాదు.. కానీ, కామెడీ పేరుతో ఒకరిని అగౌరవ పరచడం సరికాదు. డిప్యూటీ సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి గురించి ఇలా మాట్లాడాల్సింది కాదు. రాజ్యాంగం మనకు స్వేచ్ఛను ఇస్తుంది. అలా అని మీరు ఇతరుల స్వేచ్చను భంగపరచకూడదు. దానికి పరిమితులు ఉన్నాయి. అలా మాట్లాడి మీ తప్పును మీరు సమర్థించుకోలేరు’ అంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు.. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మాట్లాడుతూ..‘రాజ్యాంగ నియమాలకు వ్యతిరేకంగా ఎవరూ ప్రవర్తించకూడదు. రాజ్యాంగం కల్పించిన హక్కులకు కట్టుబడి మాట్లాడాలి. చట్టం పరిధి దాటి వ్యవహరించకూడదు అంటూ వ్యాఖ్యలు చేశారు.This part was so hilarious 😂#kunalkamra @kunalkamra88 pic.twitter.com/zJ74DODgoO— ɱąŋʑʂ ☘️🍉 (@TheManzs007) March 23, 2025ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేను ఉద్దేశిస్తూ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఖార్ ప్రాంతంలోని ది యూనికాంటినెంటల్ హోటల్లోని హాబిటాట్ కామెడీ క్లబ్లో కునాల్ కమ్రా (Kunal Kamra) షో జరిగింది. ఇందులో కుమ్రా.. డిప్యూటీ సీఎంను ఉద్దేశిస్తూ ఓ జోక్ వేశారు. ‘శివసేన నుంచి శివసేన బయటికి వచ్చింది. ఎన్సీపీ నుంచి ఎన్సీపీ విడిపోయింది. అంతా గందరగోళంగా ఉందన్నారు. ఏక్నాథ్ షిండేను ద్రోహిగా అభివర్ణించారు. ఈ సందర్భంగా ‘దిల్ తో పాగల్ హై’ అనే హిందీ పాటను రాజకీయాలకు అనుగుణంగా మార్చి అవమానకర రీతిలో పాడారు. దీంతో, కమెడియన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేసిన శివసేన కార్యకర్తలు.. ఆదివారం రాత్రి షో జరిగిన హోటల్పై దాడి చేశారు. హోటల్లోని ఫర్నీచర్ు ధ్వంసం చేశారు. కమ్రా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ దాడికి పాల్పడ్డారు. కమెడియన్ వ్యాఖ్యలపై శివసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కమ్రాపై కేసు నమోదు చేశారు. Kunal Kamra's Joke On Eknath Shinde । FIR Lodge Against Kamra । #kunalkamra #eknathshinde #gaddar #Trending #Mumbai pic.twitter.com/U8RfKqSwbQ— Magadh Talks (@MagadhTalks) March 24, 2025 -
డిప్యూటీ సీఎం షిండేపై అనుచిత వ్యాఖ్యలు.. శివసేన కార్యకర్తల దాడి
ముంబై: మహారాష్ట్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై కమెడియన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో, ఆగ్రహానికి లోనైన శివసేన కార్యకర్తలు ఓ క్లబ్పై దాడి చేశారు. సదరు కమెడియన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని శివసేన కార్యకర్తలు డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు.వివరాల ప్రకారం.. మహారాష్ట్ర ఖార్ పోలీస్స్టేషన్ పరిధిలోని ‘ది యూనికాంటినెంటల్ క్లబ్’ లో స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా షో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమెడియన్ కునాల్ కమ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం, శివసేన నాయకులు ఏక్నాథ్ షిండేను టార్గెట్ చేశారు. ఈ క్రమంలోనే ఏక్నాథ్ షిండేను దేశద్రోహిగా అభివర్ణించారు. షోలో కునాల్.. ‘దిల్ తో పాగల్ హై’ అనే హిందీ పాటను మార్చి పాడారు. 2022లో ఉద్దవ్ థాక్రేకు వెన్నుపోటుకు సంబంధించిన వ్యాఖ్యలు చేస్తూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. దీంతో, శివసేన కార్యకర్తలు ెద్ద సంఖ్యలో ‘ది యూనికాంటినెంటల్ క్లబ్’ వద్దకు చేరుకున్నారు. అనంతరం, క్లబ్పై దాడి చేశారు.అనంతరం, కమెడియన్ కునాల్ కమ్రాను అరెస్ట్ చేయాలని శివసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కునాల్పై ఫిర్యాదు చేయడానికి పార్టీ సభ్యులు ఖార్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్బంగా శివసేన నేతలు మాట్లాడుతూ.. ఉద్దవ్ థాక్రే నుంచి డబ్బులు తీసుకుని కునాల్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే భయంకరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.Kunal Kamra's stage where he performed has been vandalised by Eknath Shinde's men. His MP is threatening Kunal Kamra. FIRs will be filed on him soonReason : This Video. Please don't watch & make it viral, Eknath Shinde won't not like it. pic.twitter.com/r6oyuV770C— Roshan Rai (@RoshanKrRaii) March 23, 2025మరోవైపు.. ఈ ఘటనపై మాజీ మంత్రి, ఉద్దవ్థాక్రే కుమారుడు ఆధిత్య థాక్రే స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆధిత్య థాక్రే.. కునాల్ కమ్రాపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నాం. ఏక్నాథ్ షిండేపై అతడు చేసిన వ్యాఖ్యలు వంద శాతం నిజం. అభద్రతాభావం ఉన్న వ్యక్తులే, పిరికివాళ్లు మాత్రమే ఇలాంటి దాడులు చేస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో తెలుసా?. ముఖ్యమంత్రి, హోంమంత్రిని అణగదొక్కడానికి ఏక్నాథ్ షిండే చేసిన మరో ప్రయత్నం ఇది అంటూ సంచలన ఆరోపణలు చేశారు.Mindhe’s coward gang breaks the comedy show stage where comedian @kunalkamra88 put out a song on eknath mindhe which was 100% true.Only an insecure coward would react to a song by someone. Btw law and order in the state? Another attempt to undermine the CM and Home Minister…— Aaditya Thackeray (@AUThackeray) March 23, 2025 -
‘మహా’ కేబినెట్ విస్తరణ పూర్తి..అలిగిన శివసేన ఎమ్మెల్యే
నాగ్పూర్:మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం ఏర్పాటైన పది రోజులకు మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. మహాయుతిలోని మూడు పార్టీలకు చెందిన 39 మంది నేతలు మంత్రులుగా ఆదివారం(డిసెంబర్15) ప్రమాణ స్వీకారం చేశారు. నాగ్పూర్లోని రాజ్భవన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ మంత్రులతో ప్రమాణం చేయించారు.సీఎం దేవేంద్ర ఫడ్నవీస్,డిప్యూటీసీఎంలు ఏక్నాథ్ శిండే,అజిత్ పవార్ల సమక్షంలో మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బావాన్కులేతోపాటు రాధాకృష్ణ విఖే పాటిల్, చంద్రకాంత్ పాటిల్, గిరీశ్ మహాజన్, గణేశ్ నాయక్, మంగళ్ప్రభాత్ లోధా, జయ్కుమార్ రావల్, పంకజ ముండే, అతుల్ సావే, అశోక్ ఉయికే, ఆశిశ్ శేలార్, శివేంద్రసిన్హ భోసలే, జయ్కుమార్ గోరె మంత్రులుగా ప్రమాణం చేశారు. శివసేన నుంచి గులాబ్రావ్ పాటిల్, దాదా భూసే, సంజయ్ రాథోడ్, ఉదయ్ సామంత్, శంభూరాజ్ దేశాయ్, ఎన్సీపీ నుంచి ధనంజయ్ ముండే, హసన్ ముష్రిఫ్, దత్తాత్రేయ, అధితీ తాత్కరే, మానిక్రావ్ కొకాటే, నరహరి జిర్వాల్ తదితరులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఉన్నారు. మరోవైపు తనకు కేబినెట్ బెర్తు దక్కలేదని శివసేన ఎమ్మెల్యే, పార్టీ విదర్భ కో ఆర్డినేటర్ నరేంద్ర మోడేకర్ అలిగారు. పార్టీ కో ఆర్టినేటర్ పదవికి రాజీనామా చేశారు. -
మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి శివసేన అధినేత ఏక్నాథ్ షిండే మంగళవారం రాజీనామా చేశారు. తదుపరి మహారాష్ట్ర సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై అనిశ్చితి కొనసాగుతున్న వేళ.. షిండే రాజీనామా కీలకంగా మారింది. మరోవైపు నేటితో ప్రస్తుత శాసనసభ గడువు ముగియనుంది. ఆలోగా కొత్త ప్రభుత్వం ఏర్పాటవకపోతే రాష్ట్రపతి పాలన తప్పదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కానీ వీటిని అసెంబ్లీ వర్గాలు తోసిపుచ్చాయి.శనివారం వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సారథ్యంలోని పాలక మహాయుతి కూటమి అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ 132 చోట్ల విజయం కేతనం ఎగురవేసి అతిపెద్ద పార్టీగా అవతరించింది. షిండే శివసేన 57 స్థానాల్లో గెలుపొందగా.. అజిత్పవార్ ఎన్సీపీ41 చోట్ల విజయం సాధించింది. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్)ల ఎన్డీయే కూటమికి స్పష్టమైన మెజార్టీ లభించినప్పటికీ ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఇదిలా ఉండగా మరోవైపు శాసన సభ ప్రాంగణంలో ప్రమాణస్వీకారాలకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీకి చెందిన 10 మంది, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్)కి చెందిన అయిదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారని సమాచారం. అయితే ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎవరి నేతృత్వంలో రాష్ట్ర కేబినెట్ కొలువుదీరనుందనే అంశాలపై నేడు స్పష్టత లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఫడ్నవీస్కే ఎక్కువ అవకాశం..బుధవారం కొలువుదీరనున్న మహాయుతి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై పలు రకాల ఊహగానాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో బీజేపీ, మహాయుతి కూటమి అత్య«ధిక స్థానాలు సాధించడంలో కీలకపాత్ర పోషించిన, ముఖ్యమంత్రిగా అయిదేళ్ల అనుభవమున్న దేవేంద్ర ఫడ్నవీస్కే సీఎం పదవినివ్వాలని బీజేపీ నేతలు కోరుతుండగా మరోవైపు శివసేన (షిండే) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేనే మళ్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని శివసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు.ఏక్నాథ్ షిండే నేతృత్వంలో మహాయుతి కూటమి ఎన్నికల బరిలో దిగింది. సీఎంగా ఆయన చేసిన అభివృద్ధి, చూపిన ప్రభావం వల్లే ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో మహాయుతి కూటమి రికార్డు స్థాయి స్థానాలను కైవసం చేసుకుందని శివసేన నేతలు చెబుతున్నారు. కాగా సీఎం పదవిరేసుకు ఏక్నాథ్ షిండే పేరును పరిశీలించే పక్షంలో అజిత్ పవార్ పేరును కూడా పరిగణనలోనికి తీసుకోవాలని ఎన్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరనేది బీజేపీ అధిష్ఠానంతో దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు చర్చల అనంతరం స్పష్టం కానుందని చెప్పవచ్చు. కాగా ప్రస్తుత పరిస్థితులను పరిశీలించినట్టయితే దేవేంద్ర ఫడ్నవీస్కే సీఎం పదవి దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
Maharashtra: ‘వారికి కాంగ్రెస్ ఓటు బ్యాంకే దిక్కు’
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికీ ప్రచారంలో నేతలు పరస్పర విమర్శలు చేసుకున్నారు. తాజాగా సీఎం ఏక్నాథ్ షిండ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమకు శివసేన కార్యకర్తల ఓట్లు ఉండగా.. ఉద్ధవ్ థాక్రే వర్గం మాత్రం కాంగ్రెస్ ఓటు బ్యాంక్పై ఆధారపడుతున్నారని అన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆదివారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. పాలక మహాయుతి కూటమిలో ఎలాంటి చీలికలు లేవు. అసెంబ్లీ ఎన్నికల్లో నిర్ణయాత్మక విజయాన్ని సాధించడంపైనే మేము దృష్టి సారించాం. ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తాం. శివసేనకు చెందిన బేస్ ఓటు బ్యాంక్ మాకు మద్దతుగా ఉన్నారు. కానీ, యూబీటీ చీఫ్ ఉద్దవ్ థాక్రేకు మాత్రం కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఉంది. కాంగ్రెస్ ఓటు బ్యాంక్పైనే వాళ్లు ఆధారపడుతున్నారు. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో శివసేన (యూబీటీ) స్వల్ప విజయానికి సొంత బలం కంటే కాంగ్రెస్ మద్దతు వల్లే విజయం సాధించగలిగారు.బాలాసాహెబ్ థాక్రే మహారాష్ట్రకు సైద్ధాంతిక మూలస్తంభం. ఉద్ధవ్ తన కుమారుడే అయినప్పటికీ, అతను కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం ద్వారా బాలాసాహెబ్ సిద్ధాంతాలను విడిచిపెట్టాడు. బాలాసాహెబ్ పార్టీతో ఎప్పుడూ సహవాసం చేయనని ప్రతిజ్ఞ చేశాడు. శివసేన-బీజేపీ కూటమికి ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఉద్ధవ్ రాజీ పడ్డారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దవ్ ప్రయత్నిస్తున్నారు. బాలాసాహెబ్ పేరును ఉపయోగించుకునే అర్హత కూడా అతనికి లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇక, 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరుగుతుంది. -
ఐదుగురు రెబెల్స్పై ఉద్ధవ్ శివసేన వేటు
ముంబయి:మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ శివసేన (ఉద్ధవ్) పార్టీ ఐదుగురు రెబెల్ నేతలను పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్లను ఉపసంహరించుకోకపోవడం వల్లే వేటు వేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది.పార్టీ టికెట్ దక్కని నేతలు ఆయా నియోజకవర్గాల నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. వీరందరినీ నామినేషన్లు ఉపసంహరించుకోవాలని పార్టీ ఆదేశించింది. ఈ ఆదేశాలను వారు పెడచెవిన పెట్టడం వల్లే చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని పార్టీ ఆదేశించింది. కాగా,మహారాష్ట్రలో నవంబరు 20న మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగనుంది.23న ఫలితాలు వెలువడనున్నాయి. ఇదీ చదవండి: అమెరికా ఎన్నికలు.. తులసేంద్రపురంలో పూజలు -
ఫడ్నవీస్పై ఇజ్రాయెల్ దాడికి ప్లాన్ చేస్తోందా?.. సంజయ్ రౌత్ సెటైర్లు
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే శివసేనకు చెందిన రెండు వర్గాల మధ్య గట్టి పోటీ నెలకొంది. మరోవైపు.. తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవంద్ర ఫడ్నీవీస్కు భద్రత పెంచడంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఫడ్నవీస్ మీద ఇప్పుడేమైనా ఇజ్రాయెల్ లేదా లెబనాన్ దాడికి దిగుతున్నాయా? అని ప్రశ్నించారు.మహారాష్ట్రలో ఎన్నికల వేళ నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్కు అదనపు భద్రత పెంచుతున్నారనే సమాచారం వచ్చింది. ఫడ్నవీస్కు ప్రస్తుతం జెడ్ ప్లస్ భద్రత ఉండగా.. ఆయన కోసం అదనపు ఫోర్స్ వన్ కమాండోలను నాగపూర్లో ఉంచినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫడ్నవీస్ భద్రతపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ స్పందించారు.ఈ సందర్బంగా రౌత్ మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం ఫడ్నవీస్కు ఆకస్మికంగా భద్రతను పెంచడానికి కారణం ఏంటి?. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఆయన.. తన కోసం భద్రతను పెంచుకోవడం ఏంటి?. ఇలాంటి వ్యక్తి ప్రజలకు ఏం రక్షణ ఇస్తారు?. ఫడ్నవీస్ నివాసం వెలుపల ఫోర్స్ కమాండోలు నిలబడి ఉన్నారు. నాగపూర్ మరో 200 మంది ఉన్నారు. డిప్యూటీ సీఎం ఎందుకు అంత భయపడుతున్నారు. ఆయనపై దాడి జరగబోతోందా..? అలా ఎవరు చేయాలనుకుంటున్నారు..? ఇజ్రాయెల్ లేదా లెబనాన్ ఏమైనా ఆయనపై దాడికి దిగుతున్నాయా..? అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో భద్రతను పెంచడంపై ఫడ్నవీస్, డీజీపీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో నవంబర్ 20వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ఉద్దవ్థ్రాకే శివసేన వర్గం పట్టుదలతో ప్రచారంలో బిజీ ఉంది. #WATCH | Mumbai: Shiv Sena (UBT) Sanjay Raut says "The Home Minister of this state, who is a former Chief Minister (Devendra Fadnavis), has suddenly increased his security. The Home Minister gives security to others but he increased his own security. Suddenly we saw Force One… pic.twitter.com/yvDaJwNBIp— ANI (@ANI) November 3, 2024 -
‘మహా’త్యాగం కాంగ్రెస్కు సాధ్యమా?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా దేశ ఎన్నికల ముఖచిత్రాన్నే సమూలంగా మార్చివేసిన భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నిక కోసం ఎప్పుడో సన్నద్ధమైపోయింది. హరియాణా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు 48 గంటల ముందు ప్రచారానికి తెర పడ్డప్పుడు, ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్రలో పర్యటిస్తూ రాజకీయ ప్రసంగం చేయడం ఇందుకు నిదర్శనం. మహారాష్ట్ర ఎన్నికల కోసం కాంగ్రెస్లో ఇప్పుడిప్పుడే కద లిక ప్రారంభమయ్యింది. కాంగ్రెస్ సన్నద్ధతపై ఆ పార్టీ విజయమొక్కటే ఆధారపడి లేదు. బీజేపీకి, దాని నేతృత్వంలోని ఎన్డీఏకు సవాల్ విసురుతున్న ‘ఇండియా’ విపక్ష కూటమి బలం పుంజుకోవడం కూడా కాంగ్రెస్ మంచి చెడుల పైనే ఆధారపడి ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రవర్తన మీద!మహారాష్ట్ర, రెండు కూటములకూ ఎంతో కీలకమైన రాష్ట్రం. ప్రతి కూటమిలోనూ కనీసం మూడేసి ముఖ్య మైన భాగస్వామ్య పక్షాలున్నాయి. బీజేపీతో శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్ పవార్)లు జట్టుకట్టి ఏర్పడ్డ ‘మహాయుతి’ కూటమి ఎన్డీఏ శిబిరంలో ఉంది.కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న శివసేన (ఉద్దవ్ థాక్రే), ఎన్సీపీ (శరద్ పవార్)ల ‘మహా వికాస్ ఆఘాడి’ (ఎమ్వీఏ) ఇండియా శిబిరంలో ఉంది. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్ర సంక్లిష్ట రాజకీయాల్లో కూటమి విజయాలన్నవి భాగస్వామ్య పక్షాల మధ్య పొత్తుల సాఫల్యతను బట్టి ఉంటాయి. 2019 ఎన్నికల తర్వాత ఎన్నో రాజకీయ పరిణా మాలు వేగంగా మారుతూ వచ్చాయి. కలిసి ఎన్నికల్లో పోరిన బీజేపీ– శివసేన పార్టీలు గెలిచి కూడా సర్కారు ఏర్పరిచే సఖ్యత కుదరక విడిపోయాయి. ఎన్సీపీ–కాంగ్రెస్ జోడీతో చేతులు కలిపి శివసేన ‘ఎమ్వీఏ’ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొత్త పొత్తులతో ఏర్పడ్డ ఎమ్వీఏ ప్రభుత్వం కొంత కాలానికే కుప్ప కూలింది. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ ‘చొరవ’ తీసుకొని, శివసేన చీలికవర్గం (తమదే అసలు శివసేన అంటారు) నేత ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొంత కాలం తర్వాత, ఎన్సీపీ నుంచి చీలి వచ్చిన (వీరిది అదే రాగం) అజిత్ పవార్ను ఉపముఖ్యమంత్రిని చేసి, ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. ఈ చీలికలు మహా రాష్ట్ర ప్రజలకు నచ్చినట్టు లేదు, అందుకే 2024 లోక్సభ ఎన్నికల్లో పాలక కూటమికి చుక్కెదురైంది. 48 లోక్సభ స్థానాలకుగాను మహాయుతికి 17 స్థానాలు దక్కితే, ఎమ్వీఏ 30 స్థానాల్లో నెగ్గి సత్తా చాటింది.ఇదివరకటిలా కాకుండా, రాహుల్గాంధీ రాజకీయంగా కొంత రాటుదేలుతున్నాడనే భావన ప్రజాక్షేత్రంలో వ్యక్తమౌతోంది. పొత్తుల్లో కొన్ని సార్లే కాంగ్రెస్ లాభపడ్డా, ఆ సానుకూల వాతావరణం వల్ల మిత్రులకు మేలు కలిగిన సందర్భాలే ఎక్కువ. 2004 తర్వాత మళ్లీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో అది కొట్టొచ్చినట్టు కనిపించింది. పొత్తుల్లో పట్టువిడుపులు లేకుండా కాంగ్రెస్మొండికేసిన చోట, వారి వల్ల మిత్రులు నష్టపోయిన సందర్భాలూ ఉన్నాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు బట్టి ఎక్కువ సీట్లు తీసుకొని, తక్కువ స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ కారణంగానే, ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కోల్పోయారనే భావన అత్య ధికుల్లో ఉంది. 243 స్థానాల్లో మ్యాజిక్ నంబర్ 122 అయితే ‘మహా ఘట్ బందన్’ 110 వద్ద ఆగిపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు 12 సీట్లు తగ్గాయి. 70 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 19 చోట్ల మాత్రమే నెగ్గింది. ఏ మాత్రం తేడా వచ్చినా ఇటీవల ముగిసిన జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో ఒమర్ ఫరూక్ పరిస్థితి అట్లానే ఉండేది! 90 సీట్లకు, పొత్తుల్లో 51 చోట్ల పోటీ చేసి నేషనల్ కాన్ఫరెన్స్ 42 చోట్ల నెగ్గితే, 32 స్థానాలు తీసుకొని (మరో 5 చోట్ల స్నేహపూర్వక పోటీలో ఉండి) 6 చోట్ల మాత్రమే కాంగ్రెస్ నెగ్గింది. హరియాణాలో, ‘ఇండియా’ కూటమి పక్షమైన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి పొత్తుల్లో పది స్థానాలు (90లో) ఇవ్వడానికి వెనుకాడిన కాంగ్రెస్, వారు దాదాపు అంతటా పోటీ చేయడానికి పురిగొల్పింది. సమాన ఓటు వాటా (సుమారు 40 శాతం) పొందిన బీజేపీ, కాంగ్రెస్ మధ్య సీట్ల తేడా 11 మాత్రమే! కానీ, ఆప్కు సుమారు 2 శాతం ఓటు వాటా లభించింది.క్షేత్రంలోని వాస్తవిక బలం తెలుసుకొని, పొత్తుల్లో కొంచెం తగ్గితే వచ్చే నష్టమేంటి? ఈ సంస్కృతి కాంగ్రెస్ మరచిపోతోంది. ఇటువంటి పరిస్థితే లోగడ తలెత్తినపుడు... సోనియాగాంధీ నేతృత్వంలోనే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వెనుకంజకు సిద్ధపడింది. ‘బీజేపీని, దాని నేతృత్వపు ఎన్డీఏను గద్దె దించడానికి ప్రతి యుద్ధం ప్రకటించాలి. ప్రతి పోరూ సాగించాలి. ఏ త్యాగానికైనా సిద్ధ పడాలి’ అని బెంగళూర్ (2001)లో జరిగిన ప్లీనరీలో నిర్ణ యించారు. ఆ మేరకు రాజకీయ తీర్మానం ఆమోదించారు. 2002 మౌంట్ అబూలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య మంత్రుల కాంక్లేవ్లో, ఈ పంథాకు సోనియాగాంధీ మరింత స్పష్టత ఇచ్చారు. ‘ఛాందసవాదుల్ని గద్దె దించ డానికి లౌకిక శక్తుల్ని ఏకం చేయాలి... మన లక్ష్యం సొంతంగా ప్రభుత్వం ఏర్పరచడమే, కానీ, అవసరమైతే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకూ మనం సంసిద్ధంగా ఉండాలి’ అని ఆమె ఉద్బోధించారు. నేను స్వయంగా విని, రిపోర్ట్ చేసిన, 1997 కలకత్తా ప్లీనరీలో సీతారాం కేసరి అధ్యక్షోపన్యాసం... ‘ఇది సంకీర్ణాల శకం అనుకోన వసరం లేదు. కాంగ్రెసే ఓ విజయవంతమైన సంకీర్ణం. మనకు ఏ పార్టీలతో పనిలేదు. సొంతంగా సర్కారు ఏర్ప రిచే సత్తా మనకుంది...’ అన్న ఆలోచనాసరళి దిశనే సోనియాగాంధీ పూర్తిగా మార్చేశారు. దీనికి, 1999 ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ కొత్త పాఠాలు నేర్చు కోవడమే కారణం. వివిధ రాజకీయ పార్టీల్లో నెలకొన్న ‘కాంగ్రెస్ వ్యతిరేక ధోరణి’ తారస్థాయికి చేరి, అప్పుడు తేలిగ్గా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. ‘పొత్తు లతో మాత్రమే కాంగ్రెస్ గెలువగలదు...’ అని ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని కమిటీ 2003 డిసెంబరులో ఇచ్చిన నివేదికతో సోనియా ఈ దిశలో మరింత క్రియా శీలమయ్యారు. 2004 ఎన్నికల్లో దాన్ని పక్కాగా అమలు పరచి, ఎన్నికలు గెలిచి, కాంగ్రెస్ నేతృత్వంలో విజయవంతంగా ‘ఐక్య ప్రగతిశీల కూటమి’ (యూపీఏ) ప్రభు త్వాన్ని ఏర్పాటు చేశారు. ‘త్యాగాలు’ అనే మాట ఊరకే రాలేదు. రాజీవ్గాంధీ హత్యలో డీఎమ్కేకు భాగముందని కాంగ్రెస్ స్వయంగా విమర్శించినా... తమిళనాడులో ఆ పార్టీతోనే పొత్తుపెట్టుకున్నారామె. ఆమె జాతీయతనే ప్రశ్నించి కాంగ్రెస్ను చీల్చిన శరద్పవార్ నేతృత్వపు ఎన్సీపీతో మహారాష్ట్రలో ఆమె పొత్తులకు సిద్ధమయ్యారు. సఖ్యతకు తలుపులు తెరచిన కమ్యూనిస్టులతో జతకట్టి యూపీఏను విజయతీరాలకు చేర్చారు. అవిభక్త ఆంధ్ర ప్రదేశ్లో ఉద్యమపార్టీ టీఆర్ఎస్తో చేతులు కలిపి గెలి చారు. ఈ పంథాయే ఇప్పుడు కాంగ్రెస్కు శరణ్యం.2029 ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే రాజకీయ పునరేకీకరణలకు కాంగ్రెస్ వ్యూహరచన చేయొచ్చు. బీజేపీతో ముఖాముఖి తలపడే రాజస్థాన్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హరియాణా, హిమా చల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు సరేసరి! మహారాష్ట్ర, బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్,పంజాబ్, జార్ఖండ్, కేరళ వంటి రాష్ట్రాల్లో మరింత వ్యూహాత్మకంగా కాంగ్రెస్ కూటములను బలోపేతం చేసుకోవచ్చు. ఇతర ‘ఇండియా’ పక్షాలు లేని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఒడిషా వంటి రాష్ట్రాల్లో కొత్త మిత్రుల్ని వెతుక్కోవచ్చు. అయితే వారే పేర్కొన్నట్టు ‘త్యాగాల’కు సిద్ధమైతే తప్ప పొత్తు ధర్మం పొద్దు పొడ వదు, రాజకీయ ఫలం సిద్ధించదు!దిలీప్ రెడ్డి వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,‘పీపుల్స్ పల్స్’ డైరెక్టర్ -
శివసేన నేత కుమారుడికి చెక్!.. సీఎం షిండే సంచలన కామెంట్స్
ముంబై: మహారాష్ట్రలో హిట్ అండ్ రన్ కేసు సంచలనంగా మారింది. ఈ ప్రమాదానికి శివసేన నేత కుమారుడు మిహిర్ షానే కారణమని బాధితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు.కాగా, సీఎం షిండే సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. హిట్ రన్ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, ఈ ప్రమాదంలో నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదన్నారు. చట్టం తన పని తాను చేస్తుంది. నిందితులకు శిక్ష పడేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్టు స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రజలే మాకు ముఖ్యం. ప్రజల భద్రత కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాం అని కామెంట్స్ చేశారు. ఇక, ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసినట్టు పోలీసు అధికారులు చెప్పారు.మరోవైపు.. మహారాష్ట్రలోని వర్లీ పోలీసులు మిహిర్పై ర్యాష్ డ్రైవింగ్, హత్యకు సంబంధించి కేసుతోపాటు, మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మిహార్ షా పారారీలో ఉండటంతో ఆరుగురు పోలీసుల బృందం అతనికోసం గాలిస్తుంది.జరిగింది ఇది.. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో ఆదివారం ఉదయం బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు.. బైక్ను ఢీకొట్టడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ముంబై వర్లిలోని సాసూన్ డాక్ ఫిష్ మార్కెట్ నుంచి భార్య కావేరీ నక్వాతో పార్థిక్ నక్వా బైక్పై వెళ్తున్నారు. ఈ సమయంలో బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు వేగంగా వచ్చి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కావేరీ నక్వా మరణించగా.. ఆమె భర్త పార్థిక్ నక్వాకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్లాన్ ప్రకారమే జంప్..మిహిర్ షా మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో శివసేన నాయకుడు రాజేష్ షా కుమారుడు. రాజేష్ షా వ్యాపారాల్లో మిహిర్ షా సహకారం అందిస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటుఉన్నాడు. ఇక, ఈ ప్రమాదానికి ముందు.. మిహిర్ మద్యం మత్తులో ఉన్నాడు. డ్రైవర్తో లాంగ్ డ్రైవ్ వెళ్లాలని సూచించాడు. జుహూ నుంచి వర్లీకి వెళ్లే మార్గంలో డ్రైవర్ రాజేంద్ర సింగ్ బిజావత్ ను పక్కకు తప్పించి మిహిర్ షానే స్వయంగా డ్రైవ్ చేశాడు. ప్రమాదం తరువాత కారును బాంద్రా కళానగర్లో వదిలి అక్కడి నుంచి మిహిర్ షా పరారయ్యాడు. అంతకుముందు.. కారుపై ఉన్న శివసేన స్టిక్కర్ ను తొలగించే ప్రయత్నం చేశాడు. కారున తన తండ్రి పేరుపై ఉందని తెలియకుండా ఉండేందుకు నంబర్ ప్లేట్ ను సైతం తొలగించాడని పోలీసులు గుర్తించారు. -
ఎన్డీఏ పరిస్థితి ఇప్పుడు మూడు చక్రాలే: ఉద్ధవ్
ముంబై: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై శివసేన(ఉద్ధవ్) అధినేత ఉద్ధవ్ థాక్రే సెటైర్లు వేశారు. గతంలో మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వాన్ని మూడు చక్రాల రిక్షాగా దేవేంద్ర ఫడ్నవిస్ కామెంట్ చేయడాన్ని ఉద్ధవ్ గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానిది రిక్షా పరిస్థితేనని ఎద్దేవా చేశారు. ‘ఇప్పుడు కేంద్రంలో ఉన్నది మోదీ సర్కార్ కాదు.. ఎన్డీయే ప్రభుత్వం. ఇది ఎంతకాలం అధికారంలో కొనసాగుతుందో తెలియదు. నాడు పార్టీని విడిచి మళ్లీ ఇప్పుడు తిరిగి రావాలనుకుంటున్నవారికి మా పార్టీలో చోటు లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని పార్టీలో చేర్చుకోం. అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా ఎంవీయే అధికారంలోకి వస్తుంది. అందుకు సమష్టి కృషి ఇప్పటికే ప్రారంభమైంది’అని ఉద్థవ్ తెలిపారు. -
విషాదం: మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి కన్నుమూత
ముంబై: మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి (86) కన్నుమూశారు. రెండు రోజుల క్రితం గుండెపోటుతో ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మనోహర్ తుదిశ్వాస విడిచారు. వివరాల ప్రకారం.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి మృతిచెందారు. ముంబైలోని పీడీ హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. ఈరోజు మధ్యాహ్నం ముంబైలో మనోహర్ అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా, గత ఏడాది మేలోనూ మెదడులో రక్తస్రావం కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారు. ఇక, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు గురువారం సాయంత్రమే వైద్యులు తెలిపారు. #WATCH | Former CM of Maharashtra Manohar Joshi passed away at Hinduja Hospital in Mumbai at around 3 am today. He was admitted here on February 21 after he suffered a cardiac arrest. Visuals from outside the hospital. pic.twitter.com/yFL7aUkhfo — ANI (@ANI) February 23, 2024 రాజకీయ ప్రస్థానం.. 1937 డిసెంబర్ 2న నాంద్వీలో మనోహర్ జోషి జన్మించారు. విద్యాభ్యాసం మొత్తం ముంబైలోనే జరిగింది. తొలినాళ్లలో ఉపాధ్యాయుడిగా పనిచేసిన మనోహర్ జోషి 1967లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1968-70 మధ్య మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. ఇక, శివసేన పార్టీలో కీలక నేతగా ఎదిగిన మనోహర్ జోషి 1995 నుంచి 1999 మధ్య మహారాష్ట్ర సీఎంగా పనిచేశారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో 2002-2004 మధ్య లోక్సభ స్పీకర్గానూ వ్యవహరించారు. మూడుసార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన తర్వాత 1990లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 1990-91 మధ్య అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో శివసేన తరఫున ముంబై నార్త్-సెంట్రల్ నియోజవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు. కాగా, ఆయన సతీమణి అనఘ మనోహర్ జోషి 2020లో మరణించారు. ఆయనకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
మహారాష్ట్ర పాలిటిక్స్లో మరో ట్విస్ట్.. థాక్రే వర్గానికి ఎదురుదెబ్బ?
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్రలో 14 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకూడదన్న స్పీకర్ ఆదేశాలను సవాల్ చేస్తూ శివసేన (షిండే) చీఫ్ విప్ భరత్ గోగావాలే దాఖలు చేసిన పిటిషన్పై ముంబై హైకోర్టు థాక్రే వర్గానికి, స్పీకర్కు నోటీసులు జారీ చేసింది. దీంతో, మహారాష్ట్ర రాజకీయం మరోసారి హీటెక్కింది. వివరాల ప్రకారం.. 2022లో చీలిక తర్వాత ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని సేన వర్గాన్ని నిజమైన రాజకీయ పార్టీగా ప్రకటిస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో, స్పీకర్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఉద్ధవ్ థాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరోవైపు, సీఎం ఏక్నాథ్ షిండే వర్గం కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో దీనిపై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రతివాదులందరూ తమ అఫిడవిట్లను దాఖలు చేయాలని గిరీష్ కులకర్ణి, ఫిర్దోష్ పూనివాలాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. అనంతరం, తదుపరి విచారణను ఫిబ్రవరి ఎనిమిదో తేదీకి వాయిదా వేసింది. మరోవైపు.. 2022లో పార్టీ చీలిక తర్వాత ఫిరాయింపుల నిరోధక చట్టాల కింద ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలనే డిమాండ్ వచ్చింది. షిండేతో సహా అధికార వర్గానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్ధవ్ థాక్రే బృందం పిటిషన్లో డిమాండ్ చేసింది. ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని షిండే డిమాండ్ చేశారు. అయితే, షిండే వెంటే మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారని చెబుతూ శాసన సభ్యులపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లన్నింటినీ స్పీకర్ తిరస్కరించారు. శివసేన మొత్తం ఎమ్మెల్యేలు 57 మంది కాగా వారిలో అత్యధికులు (37 మంది) షిండేతో పాటే ఉన్నారని స్పీకర్ నిర్ధారించారు. ఉద్ధవ్ థాక్రే సవాల్.. ఇదిలా ఉండగా.. ఏది అసలైన శివసేననో బహిరంగ చర్ చద్వారా తేల్చుకుందామని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, స్పీకర్ రాహుల్ నర్వేకర్లకు ఉద్ధవ్ థాక్రే సవాల్ విసిరారు. షిండే వర్గమే అసలైన శివసేన అని స్పీకర్ ఇచ్చిన రూలింగ్పై ఆయన మంగళవారం స్పందించారు. ‘నేను ఈ పోరాటాన్ని ప్రజా కోర్టులోకి తీసుకెళ్తా. ఈ పోరాటం ద్వారా దేశంలో ప్రజాస్వామ్యం ఉందా.. లేదా అనేది తేలుతుంది’ థాక్రే స్పష్టం చేశారు. -
రాముడే బీజేపీ ఎన్నికల అభ్యర్థి!: రౌత్
ముంబై: అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవాన్ని బీజేపీ పూర్తిగా రాజకీయమయం చేస్తోందని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. ఆలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఆహా్వనంపై రౌత్ స్పందించారు. ‘‘ శ్రీరాముని పేరును బీజేపీ తన రాజకీయాలకు విపరీతంగా వాడేసుకుంది. అయోధ్యలో ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్నీ బీజేపీ ఎంతో రాజకీయ చేసింది. తమ ఎన్నికల అభ్యర్థి శ్రీరామచంద్రుడే అని బీజేపీ ప్రకటించడం ఒక్కటే మిగిలిపోయింది. జనవరి 22న జరిగేది బీజేపీ కార్యక్రమం. ఆ రోజు జరిగేది ఎలా చూసినా జాతీయ కార్యక్రమం కాబోదు. రాజకీయాలతో బీజేపీ రాముడిని కిడ్నాప్ చేసింది’’ అని వ్యాఖ్యానించారు. మరి శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే ఆ కార్యక్రమానికి వెళ్తారుగా అని మీడియా ప్రశ్నించగా ‘‘అవును. కానీ బీజేపీ ఆధ్వర్యంలో జరిగే తతంగం అంతా ముగిశాక అసలు కార్యక్రమంలో ఉద్ధవ్ పాల్గొంటారు’’ అని బదులిచ్చారు. -
సీఎం షిండేపై బీజేపీ పోస్టర్..సంజయ్ రౌత్ ఆగ్రహం
ముంబై : మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిండేపై రాజస్థాన్ బీజేపీ లీడర్ వేసిన పోస్టర్ శివసేన ఉద్ధవ్ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్రౌత్కు కోపం తెప్పించింది. రాజస్థాన్ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లిన సందర్భంగా రాజస్థాన్లోని హవామహల్ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి బాలముకుందాచార్య కార్యకర్తలు షిండేకు ఆహ్వానం పలుకుతూ ఒక పోస్టర్ వేశారు. హిందూ హృదయ సామ్రాట్ షిండే అని పోస్టర్పై ఉండడం పట్ల సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార దాహం కోసం సొంత పార్టీకి మోసం చేసిన వ్యక్తిని బాల్ థాక్రేతో సమానంగా కీర్తిస్తారా అని మండిపడ్డారు. అధికారం కోసం సొంత పార్టీని మోసం చేసే వారిని కీర్తించే కొత్త ట్రెండ్ స్టార్టయిందని రౌత్ అన్నారు. ఈ వివాదంపై మహారాష్ట్ర మంత్రి సుధీర్ మునగంటివార్ స్పందించారు. ‘కార్యకర్తలు సాధారణంగా తమ అభిమాన నేతలను వారికిష్టం వచ్చినట్లుగా పిలుచుకుంటారు. ఇందులో భాగంగానే షిండేను అభిమానించే వ్యక్తి ఆ పోస్టర్పెట్టుంటారు. షిండే బాల్థాక్రే బాటలో వెళ్తున్నారని పోస్టర్ వేసిన వాళ్లు భావించి ఉంటారు. షిండే తనకు తానుగా ఆ పోస్టర్ అయితే పెట్టలేదుగా’ అని సుధీర్ అన్నారు. ఇదీచదవండి..డీకే శివకుమార్ సీబీఐ కేసుపై సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు -
వరల్డ్కప్ ఫైనల్పై శివసేన ఎంపీ తీవ్ర విమర్శలు
World Cup final: ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆతిథ్య భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య హోరాహోరీగా సాగుతోంది. దేశవ్యాప్తంగా కోట్ల మంది ఈ ఫైనల్ మ్యాచ్ సంరంభంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో వరల్డ్ ఫైనల్పై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు చేశారు. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్స్ క్రికెట్ ఈవెంట్ కంటే కూడా బీజేపీ ఈవెంట్లా సాగుతోందని సంజయ్ రౌత్ ఆరోపించారు. క్రికెట్ పరిభాషలో బీజేపీపై విమర్శలు గుప్పించారు. "ఈరోజు ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ప్రధాని మోదీ బౌలింగ్, అమిత్ షా బ్యాటింగ్, ఫీల్డింగ్ చేసేలా ఉన్నారు" అని వ్యంగంగా విమర్శించారు. "క్రికెట్లోకి రాజకీయాలు తీసుకురావాల్సిన అవసరం లేదు. కానీ అహ్మదాబాద్లో అదే జరుగుతోంది" అని రౌత్ అన్నారు. ఇందులో తనకేమీ ఆశ్చర్యం లేదన్నారు. ప్రధాని మోదీ హాజరవుతున్నారు కాబట్టి భారత్ కచ్చితంగా కప్ గెలవాలని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ను వీక్షించనున్నట్లు శనివారం అధికారిక ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. -
మరో ‘మహా’ నాటకం!
కొన్ని సన్నివేశాలు, సంఘటనలు మునుపెన్నడో చూసినట్టు, చిరపరిచితమైనట్టు అనిపిస్తుంటాయి. మహారాష్ట్రలో ఆదివారం నుంచి జరుగుతున్న పరిణామాలు, జాతీయవాద కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో సంక్షోభం, అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ వర్గం మహారాష్ట్ర బీజేపీ సర్కార్లో చేరడం చూస్తే... సరిగ్గా ఏడాది క్రితం సంఘటనలే పునరావృతమవుతున్నట్టు అనిపిస్తుంది. అప్పట్లో శివసేనను చీల్చిన ఏక్నాథ్ శిందే వ్యవహారం గుర్తొస్తుంది. ఇప్పుడు మనుషులు, పార్టీల పేర్లు మారాయి కానీ కథ మాత్రం మళ్ళీ అదే. అప్పుడు ఉద్ధవ్ ఠాక్రే సారథ్య శివసేన, ఇప్పుడు శరద్పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ. అక్కడ శిందే, ఇక్కడ అజిత్. కాకపోతే ఈసారి తెలివిగా ‘చీలిక’ అనకుండా, ఎన్సీపీగా తాము ప్రభుత్వాన్ని సమర్థిస్తూ, మంత్రివర్గంలో చేరుతున్నామంటూ సాంకే తిక చిక్కులు లేకుండా చూసుకుంటున్నారు అజిత్. అంతే తేడా. మొత్తానికి గతంలో కర్ణాటక, గోవా తదితర రాష్ట్రాల్లో లాగా మహారాష్ట్రలోనూ ప్రత్యర్థి పార్టీల్ని చీలికలు పేలికలు చేయడంలో బీజేపీ మరోసారి సఫలమైంది. జాతీయస్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతా యత్నానికి గట్టి దెబ్బ కొట్టింది. శరద్ – ఆయన కుమార్తె సుప్రియ ఒకవైపు, అజిత్ వర్గం మరోవైపు నిలవడంతో ఎన్సీపీపై పట్టు కోసం పోరు మరిన్ని మలుపులు తీసుకోనుంది. గత 24 ఏళ్ళలో విడతలు విడతలుగా 17 ఏళ్ళు ఎన్సీపీ మహారాష్ట్రలో అధికారంలో ఉంది. మధ్యలో కొన్నేళ్ళు, మళ్ళీ ఇప్పుడు ఏడాదిగా గద్దెపై లేదు. ఏళ్ళ తరబడి పవార్ కుటుంబాన్ని కలిపి ఉంచిన అధికార బంధం బలహీనమైంది. అధికారం రుచి మరిగిన అజిత్ దేనికైనా సిద్ధమయ్యారు. అన్న కొడుకులోని అధికార కాంక్షను గుర్తించిన శరద్ కొత్త వ్యూహాలతో చెక్ పెడుతూ వచ్చారు. నెల క్రితం కూడా పార్టీ పగ్గాలు వదిలేస్తున్నట్టు ప్రకటించి, తీరా కార్యకర్తల ఆకాంక్ష అంటూ మళ్ళీ మూడు రోజులకే వెనక్కి తగ్గి, కుమార్తెకు పెత్తనం కట్టబెట్టారు. అజిత్ను రాష్ట్రానికే పరిమితం చేస్తూ చాణక్య నీతి ప్రదర్శించారు. అజిత్కు అది మింగుడు పడలేదు. అదను చూసి, అనుచరులతో కలసి సొంత బాబాయ్ని వదిలేసి, కేంద్రంలో మోదీకి జై కొట్టారు. ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో మెజారిటీ తమ వైపే ఉన్నారని అజిత్ అంటున్నా, అందుకు లిఖితపూర్వక సాక్ష్యమేమీ ఇప్పటికైతే లేదు. ‘మహారాష్ట్ర పురోభివృద్ధి కోసం, మోదీ సారథ్యంలో దేశ పురోగతి కోసం’ ...ఇలా శరద్ను వదిలిపెట్టి, పార్టీని చీల్చలేదంటూనే చీల్చిన అజిత్ తదితరులు బోలెడు మాటలు చెబుతున్నారు. కానీ, నాలుగేళ్ళలో ముగ్గురు వేర్వేరు సీఎంల హయాంలో మూడోసారి డిప్యూటీ సీఎం అయిన అజిత్ ఆకాంక్షలు బహిరంగ రహస్యం. పైగా, స్వయంగా అనేక భారీ కుంభ కోణాల ఆరోపణల్ని ఎదుర్కొంటున్న అజిత్, ఆయన వర్గపు ఎమ్మెల్యేలు బీజేపీలో ఎందుకు చేరారో ఊహించడం కష్టమేమీ కాదు. వారంతా ఇక బీజేపీ వాషింగ్ మెషిన్తో స్వచ్ఛమైపోయినట్టే! రాజకీయ గూగ్లీలతో ప్రత్యర్థుల్ని బోల్తా కొట్టించే శరద్ ఈసారి తానే క్లీన్ బౌల్డయ్యారు. ప్రఫుల్ పటేల్ తదితరులు విశ్వాసపాత్రులన్న నమ్మకం నట్టేట ముంచింది. 2019లోనే బీజేపీ వైపు వెళ్ళేందుకు అజిత్ విఫలయత్నం చేసినప్పుడే ముకుతాడు వేయాల్సిన శరద్ ఆ పని చేయలేదు. ఇప్పుడు ఏకు మేకైంది. తాజా చీలిక కాని చీలికతో ఎవరిది అసలైన పార్టీ, ఎవరిది ఎన్నికల గుర్తన్నది సైతం వివాదాస్పదమే. మనుగడ కోసం 83వ ఏట ఈ మరాఠా యోధుడు ప్రజాక్షేత్రంలో మళ్ళీ పోరుకు దిగాలి. పదవుల్లోని ప్రత్యర్థులపై ఇరువర్గాల పోటాపోటీ వేటు పర్వం సాగుతోంది. ఎన్సీపీ వర్కింగ్ ఛీఫ్ ప్రఫుల్ పటేల్ను పదవి నుంచి, అజిత్ వర్గ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు శరద్ ప్రకటించారు. వచ్చే 3 నెలల్లో మహారాష్ట్రలో పెనుమార్పులు తప్పవంటున్నారు. ఆ మాటేమో కానీ అజిత్ వర్గాన్ని చేర్చుకోవడం వెనుక బీజేపీకి దాని లెక్కలు దానికున్నాయి. గత నెల సుప్రీం కోర్ట్ ఇచ్చిన ఆదేశాలతో ఏక్నాథ్ శిందే సారథ్య శివసేన చీలిక ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోక తప్పకపోవచ్చు. రేపు సాక్షాత్తూ సీఎం శిందే సహా పలువురు చీలిక వర్గపు శివసేన సభ్యులు అనర్హత పాలైనా, కొత్తగా చేరిన అజిత్ వర్గంతో మహారాష్ట్రలో బీజేపీ సర్కార్ మనుగడకు ఢోకా ఉండదు. కానీ, బహిష్కరణల వేటుతో అజిత్ వర్గం ఎమ్మెల్యేలూ అనర్హత వేటు ఎదుర్కొనే ముప్పు లేకపోలేదు. పాలకపక్ష స్పీకర్ నాన్చకుండా, అంత నిర్ణయం తీసుకుంటారా అన్నది వేరే కథ. వెరసి, సంకీర్ణ రాజకీయాల రచ్చలో పూర్తిగా దెబ్బతిన్నది మహారాష్ట్రలో ప్రజాతీర్పు. అయితే, పార్టీ సంస్థాగత ప్రక్షాళన చేపట్టి, కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు దిగుతున్న కమలనాథుల గురి మొత్తం రాబోయే ఎన్నికలే. ఠాణేలో శిందే, మరాఠ్వాడాలో అజిత్లకు గట్టి పట్టుంది. బీజేపీకి పట్టు లేని ఆ ప్రాంతాల్లో ఈ ప్రాంతీయ నేతలిద్దరూ ‘మిషన్ 2024’లో అక్కరకు వస్తారనేది లెక్క. అలాగే, శిందే రెక్కలు కత్తిరించడానికీ పక్కనే అజిత్ను కూర్చోబెట్టడం కమలనాథులకి పనికొస్తుంది. 2019 ఎన్నికల్లో తమతో కలసి పోటీ చేసి, తీరా గెలిచాక పక్కకు వెళ్ళి అధికారాన్ని దూరం చేసిన ఉద్ధవ్ ఠాక్రే శివసేన పైనా, అలాగే కీలకమైన ప్రతిసారీ ఖంగు తినిపించిన శరద్పవర్ ఎన్సీపీ పైనా బీజేపీ చివరకిలా ప్రతీకారం తీర్చుకుంది. ఎన్నికల కల్లా శిరోమణి అకాలీదళ్ లాంటి ఒకప్పటి మిత్ర పక్షాల్ని ఎన్డీఏలోకి తెచ్చుకోవాలని చూస్తున్న బీజేపీకి ఇది సంతోష సందర్భం. ఆపసోపాలు పడుతున్న ప్రతిపక్ష ఐక్యతాయత్నానికి మహా కష్టం. ఎన్సీపీలో చీలిక సఫలమైతే బీజేపీకి లాభం. సఫలం కాకున్నా అజిత్కే తప్ప, దానికొచ్చిన నష్టమేమీ లేదు. ఇక బిహార్లోనూ ఇలాంటి ‘ఆపరేషన్’ సిద్ధమవుతోందని వార్త. ఏమైనా, అధికారం కోసం దేనికైనా సిద్ధమై, ప్రజాస్వామ్యాన్ని వట్టి నంబర్ల గేమ్గా మార్చేస్తున్న మన పార్టీల, నేతల నిస్సిగ్గు నగ్నత్వానికి ‘మహా’ నాటకం మరో ప్రతీక. -
చంపేస్తానని లైవ్ లోనే బెదిరించిన శివసేన నేత
మహారాష్ట్రలోని కొల్హాపూర్ అల్లర్ల నేపథ్యంలో శివసేన నాయకుడు సంజయ్ మషీల్కర్ ఒక టీవీ ఛానల్ నిర్వహించిన డిబేట్లో పాల్గొని లైవ్ లోనే తమ పార్టీ నాయకుడిని చంపేస్తానంటూ బెదిరించడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు శివసేన(UBT) నాయకుడు సంజయ్ రౌత్. ప్రభుత్వమే తమ ప్రత్యర్థులను చంపేయమని ఆర్డర్లు వేస్తోందా? మర్డర్లు చేయడానికి టెండర్లు కూడా స్వీకరిస్తున్నారా? అని ప్రశ్నించారు. కొల్హాపూర్ అల్లర్లు తర్వాత ఆ ప్రాంతంలో గురువారం కర్ఫ్యూ విధించింది ప్రభత్వం. ఈ సందర్బంగా పలు టీవీ డిబేట్లలో పాల్గొన్న శివసేన నాయకుడు సంజయ్ మషీల్కర్ ఒక లైవ్ ప్రోగ్రామ్ లో పాల్గొని కార్యక్రమం ముగిసిన తర్వాత శవసేన(UBT) నాయకుడు ఆనంద్ దూబేను ఉద్దేశించి నువ్వేమైనా ఛత్రపతి శివాజీ వారసుడు అనుకుంటున్నావా? హద్దుల్లో ఉండు... లేదంటే కాల్చి పారేస్తా... అని బెదిరించారు. దీంతో ట్విటర్ వేదికగా శివసేన(UBT) నాయకుడు సంజయ్ రౌత్ షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు. "మహారాష్ట్రలో ఏం జరుగుతోంది? ప్రభుత్వం ఇక్కడ ఎలాంటి పరిస్థితులను నెలకొల్పుతోంది? రాజకీయ ప్రత్యర్థులను మట్టుబెట్టడానికి ప్రభుత్వమే సుపారీ ఇచ్చి మర్డర్లు చేయమని చెబుతోందా? ఇదేమి సంస్కృతి. దీనికి హోంమంత్రి ఫడ్నవీస్ సమాధానం చెప్పాలి" అని హిందీలో రాశారు. महाराष्ट्र में क्या हो रहा है? ये कैसी हालत खोके सरकारने बना रखी हैं ? शिवसेना प्रवक्ता आनंद दुबे जी कल एक टीव्ही न्यूज शो पर चर्चा कर रहे थे तो उन्हे ऑन एअर धमकाया गया..गृहमंत्री फडणविस मुकदर्शक बने बैठे हैं. क्या अपने राजनैतिक विरो धियोकी हत्या करने की सुपारी सरकारने दी… — Sanjay Raut (@rautsanjay61) June 8, 2023 ఇది కూడా చదవండి: ఏకమైన ప్రతిపక్షాలు... బీజేపీని ఓడించడమే లక్ష్యం -
ఉద్ధవ్ను సీఎంగా నియమించలేం.. శివసేన సంక్షోభంపై సుప్రీం కీలక తీర్పు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే కొనసాగడానికి సుప్రీంకోర్టు తీర్పుతో మార్గం సుగమమైంది. ఉద్ధవ్ ఠాక్రేను తిరిగి ముఖ్యమంత్రిగా నియమించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. శాసనసభలో బల పరీక్షను ఎదుర్కోకుండా∙ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేశారని పేర్కొంది. అప్పట్లో గవర్నర్ భగత్సింగ్ కోషియారీ వ్యవహరించిన తీరు సమర్థనీయంగా లేనప్పటికీ ఉద్ధవ్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని తేల్చిచెప్పింది. సీఎం పదవికి రాజీనామా చేయాలని ఏక్నాథ్ షిండేను ఆదేశించలేమని పేర్కొంది. శివసేన పార్టీలో తలెత్తిన సంక్షోభం, తద్వారా రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభంపై దాఖలైన 8 పిటిషన్లను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం∙తీర్పు వెలువరించింది. ‘సభలో ఉద్ధవ్ ఠాక్రే మెజార్టీ కోల్పోయినట్లు నిర్ధారణకు రావడానికి తగిన సమాచారం లేకపోయినా మెజార్టీ నిరూపించుకోవాలని ప్రభుత్వానికి గవర్నర్ సూచించడం సరైంది కాదు. ఆయన తన విచక్షాణాధికారాలను ఉపయోగించి తీరు చట్టబద్ధంగా లేదు. సభలో బల పరీక్ష ఎదుర్కోకుండా ఉద్ధవ్ రాజీనామా చేశారు కాబట్టి ఆయన ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేం. ఉద్ధవ్ రాజీనామా చేసిన తర్వాత బీజేపీ మద్దతున్న షిండేతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అది సమర్థనీయమే’ అని వెల్లడించింది. ఉద్ధవ్ వర్గంపై తిరుగుబాటు చేసి, షిండే పక్షాన చేరిన శివసేన ఎమ్మెల్యేలపై ఇప్పుడు అనర్హత వేటు వేయలేమని తెలియజేసింది. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటున్న స్పీకర్కు తిరుగుబాటు ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసు ఇచ్చే అధికారం ఉందా? అనేది తేల్చడానికి అధ్యయనం చేయాల్సి ఉందని అభిప్రాయపడింది. అందుకే ఈ అంశాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి మరో ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. షిండే వర్గాన్ని అసలైన శివసేనగా ఎన్నికల సంఘం గుర్తించిన సంగతి తెలిసిందే. షిండే రాజీనామా చేయాలి: ఉద్ధవ్ సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని పునరుద్ధరించిందని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. అప్పటి గవర్నర్ తీరును కోర్టు తప్పుపట్టిందని చెప్పారు. వారు(షిండే వర్గం ఎమ్మెల్యేలు) తమ పారీ్టని, తండ్రి బాల్ ఠాక్రే అందించిన వారసత్వానికి దగా చేశారని మండిపడ్డారు. సీఎం పదవికి తాను రాజీనామా చేయడం చట్టప్రకారం పొరపాటే అయినప్పటికీ నైతిక విలువలను పాటిస్తూ పదవి నుంచి తప్పుకున్నానని వివరించారు. వెన్నుపోటుదారులతో ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేయాలని ఉద్ధవ్ డిమాండ్ చేశారు. చదవండి: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ సర్కార్కు భారీ ఊరట.. కేంద్రానికి షాక్ -
మహారాష్ట్రలో ఆనాడు జరిగిందిదే.. మాజీ గవర్నర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ముంబై: మహారాష్ట్రలో శివసేనకు చెందిన విల్లుబాణం గుర్తుపై రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలో మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే.. సీఎం ఏక్నాథ్ షిండేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. కాగా, దీనిపై తాజాగా మహారాష్ట్ర మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ స్పందించారు. అయితే, కోష్యారీ ఇండియా టుడే ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో రాజ్యాంగం ప్రకారమే అంతా జరిగిందన్నారు. తమకు మెజార్టీ ఉందని షిండే, ఫడ్నవీస్ చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాతే రాజ్ భవన్లో కార్యక్రమం జరిగింది. అంతే తప్ప గవర్నర్గా నా పాత్ర ఏమీ లేదన్నారు. అలాగే.. ఇదే సమయంలో ఉద్ధవ్ థాక్రే తనకు మెజార్టీ ఉందని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తన వద్దకు రాలేదన్నారు. ఏమీ మాట్లాడలేదు. దీంతో, మరో పార్టీ వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పింది.. చేసింది. రాజ్యాంగం ప్రకారమే అంతా జరిగిందన్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై ప్రఫుల్ పటేల్, శరద్ పవార్, ఛగన్ భుజ్ బల్ (ఎన్సీపీ నేతలు)ను అడిగాను. అయినా ఒక్కరు కూడా.. ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ ఉందని లేఖ ఇవ్వలేదు. శివ సైనికుడిని సీఎం చేయాలని అనుకుంటున్నామని మాత్రం చెప్పుకుంటూ వచ్చారంతే అని కోష్యారీ వివరించారు. ఇక, కోష్యారీ గవర్నర్గా ఉన్న సమయంలోనే మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. శివసేన రెండుగా చీలిపోవడం ఆ తర్వాత బీజేపీతో కలిసి షిండే కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. ఈ క్రమంలోనే ఇటీవలే ఎన్నికల కమిషన్ కూడా శివసేన అధికారిక గుర్తు.. విల్లుబాణంను షిండే వర్గానికే కేటాయించింది. -
శివసేన పార్టీ పేరు, గుర్తు కోసం రూ.2,000 కోట్ల డీల్: సంజయ్ రౌత్
ముంబై: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ ఎన్నికల గుర్తు విల్లు-బాణాన్ని కొనుగోలు చేసేందుకు రూ.2,000 కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. అసలైన శివసేన ఎక్నాథ్ షిండేదే అని ఎన్నికల సింగం నిర్ణయం తీసుకోవడం ఓ ఒప్పందంలో భాగంగానే జరిగిందని అన్నారు. ఈ వ్యవహారంలో రూ.2,000 కోట్ల లావాదేవి జరిగిందన్నారు. ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయని, త్వరలోనే వాటిని బయటపెడతానని చెప్పారు. ఈ లావాదేవి గురించి అధికార పార్టీతో సన్నిహత సంబంధాలు ఉన్న ఓ బిల్డర్ తనకు చెప్పారని రౌత్ పేర్కొన్నారు. ఈమేరకు ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 'ఒక ఎమ్మెల్యేను కొనడానికి రూ.50 కోట్లు, ఒక ఎంపీని కొనడానికి రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మా కౌన్సిలర్ని, శాఖా ప్రముఖ్ని కొనడానికి రూ.కోటి వెచ్చిస్తున్న ఈ ప్రభుత్వం, నాయకుడు, నీతిలేని వ్యక్తుల సమూహం, మా పార్టీ గుర్తును, పేరును కొనుగోలు చేయడానికి ఎంత ఖర్చు చేయగలరో నేను ఊహించగలను. నా అంచనా ప్రకారం అది రూ.2,000 కోట్లు' అని రౌత్ ఆరోపించారు. #WATCH शिवसेना और उसका निशान (तीर-कमान) चिह्न छीना गया है और ऐसा करने के लिए इस मामले में अब तक 2,000 करोड़ रुपए की लेनदेन हुई है: उद्धव ठाकरे गुट के नेता व सांसद संजय राउत, मुंबई pic.twitter.com/6hyQHLjMZr — ANI_HindiNews (@AHindinews) February 19, 2023 చదవండి: ఇంటిపై నుంచి రూ.500 నోట్ల వర్షం.. తీసుకునేందుకు ఎగబడ్డ జనం.. -
‘మహారాష్ట్ర’ సంక్షోభంపై సుప్రీం తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని శివసేన పార్టీలో చీలికలు ఏర్పడిన అనంతరం తలెత్తిన రాజకీయ సంక్షోభంపై సుప్రీం కోర్టు తన తీర్పుని రిజర్వ్ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యులున్న ధర్మాసనం శివసేనలో చీలిక, కొందరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకి సంబంధించిన పిటిషన్ను గురువారం విచారించింది. ‘ ఠాక్రే, షిండే చీలికవర్గం తరఫు లాయర్ల వాదనలన్నింటినీ విన్నాం. 2016 నబమ్ రెబియా తీర్పుని పునఃపరిశీలించాలా? దానిని ఏడుగురు సభ్యులున్న విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించాలా?’ అనే విషయంపై తీర్పు రిజర్వ్ చేస్తున్నాం అని తెలిపింది. ఏమిటీ నబమ్ రెబియా తీర్పు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్కున్న అధికారాలపై అరుణాచల్ ప్రదేశ్లోని నబమ్ రెబియా కేసులో 2016లో సుప్రీం తీర్పు చెప్పింది. ఈ తీర్పు ప్రకారం శాసనసభ స్పీకర్ను తొలగించిన నిర్ణయం సభలో పెండింగ్లో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అధికారం సభాపతికి ఉండదు. అరుణాచల్ ప్రదేశ్లో అప్పట్లో అధికార కాంగ్రెస్కు చెందిన సీఎం నబమ్ టుకీయేని గద్దె దించడానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సహకారంతో అసమ్మతి నాయకుడు కలిఖో ఫుల్ తిరుగుబాటు చేశారు. దీంతో టుకీ సోదరుడైన అసెంబ్లీ స్పీకర్ నబమ్ రెబియా 21 మంది అసమ్మతి ఎమ్మెల్యేల్లో 14 మందిని అనర్హులుగా ప్రకటించారు. మరోవైపు అసమ్మతి ఎమ్మెల్యేలు స్పీకర్ రెబియాను తొలగిస్తూ తీర్మానం చేశారు. దీనిపై కాంగ్రెస్ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, స్పీకర్ను తొలగించిన నిర్ణయం పెండింగ్లో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అధికారం ఉండదని సుప్రీం తీర్పు చెప్పింది. ఈ తీర్పుని అనుసరించి సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికి ఊరట లభిస్తుంది. మహారాష్ట అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, థాక్రే విధేయుడు నరహరి సీతారామ్ జిర్వాల్ను తొలగిస్తూ షిండే వర్గం ఇచ్చిన నోటీసు సభలో పెండింగ్లోనే ఉంది. చదవండి: ఆదివాసీల అభ్యున్నతికి ప్రాధాన్యం.. -
ఎమ్మెల్యే గారూ.. పెళ్లికి అమ్మాయిని వెతకండి..
ఔరంగాబాద్: దాదాపు పది ఎకరాల భూమి ఉన్నా పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని తెగ వాపోయాడు ఓ పెళ్లికాని ప్రసాద్. తెలిసిన వారందరినీ వధువు కోసం ఆరాతీసి విసిగిపోయిన ఆ అవివాహితుడు చివరకు ఏకంగా తమ నియోజకవర్గం ఎమ్మెల్యేకే ఫోన్ చేసి బాధపడిపోయాడు. మీరైనా పెళ్లికి సరిజోడీని వెతికిపెట్టండి సారూ అంటూ ఫోన్లోనే విన్నపాలు వినిపించాడు. అతని బాధను అర్థ్ధంచేసుకున్న ఆ ఎమ్మెల్యే పెళ్లిళ్ల పేరయ్యగా మారేందుకూ సిద్ధమయ్యాడు. వెంటనే బయోడేటా పంపించు.. పెళ్లికి అమ్మాయిని వెతికిపెట్టే పూచీ నాదీ అంటూ హామీ ఇచ్చాడు. ఎమ్మెల్యే, నియోజకవర్గ ఓటరుకు మధ్య జరిగిన ఈ ఆసక్తికర సంభాషణ తాలూకు ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తోంది. మహారాష్ట్రలోని కన్నాడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉదయ్సింగ్ రాజ్పుత్కు అక్కడి ఖుల్తాబాద్ వాస్తవ్యుడికి మధ్య ఈ సంభాషణ జరిగింది. ఉదయ్సింగ్.. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన చీలికవర్గానికి మద్దతు ఇస్తున్నారు. పెళ్లికాని ఓటరు ఫోన్కాల్పై మీడియా ప్రశ్నించగా ఎమ్మెల్యే సమాధాన మిచ్చారు. ‘ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాస్తవిక సమస్య ఇది. ఓ 2,000 మంది జనాభా ఉన్న గ్రామాన్ని తీసుకుంటే అందులో ఖచ్చితంగా 150 మంది యుక్తవయసు అబ్బాయిలు పెళ్లిళ్లుకాక ఇబ్బందులు పడుతున్నారు. 100 ఎకరాల భూస్వామి అయినా సరే వధువు కోసం తిప్పలు పడాల్సిందే. పట్టణప్రాంతాల్లో స్ధిరపడిన అబ్బాయిలవైపు అమ్మాయిల తల్లిదండ్రులు మొగ్గుచూపడమే ఇక్కడ అసలు సమస్య. పెళ్లి కావట్లేదు బాబోయ్ అంటూ నాకు ఇలాగే చాలా మంది ఫోన్లు చేశారు’ అని ఎమ్మెల్యే చెప్పారు. -
'ఆ విషయం తెలిస్తే రౌత్ను ఉద్ధవ్ థాక్రే చెప్పుతో కొడతారు'
ముంబై: కేంద్రమంత్రి నారాయణ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ గురించి తనకు తెలిసిన రహస్యాలు చెబితే ఉద్ధవ్ థాక్రే, ఆయన భార్య రష్మి.. రౌత్ను చెప్పుతో కొడతారని వ్యాఖ్యానించారు. త్వరలోనే ఉద్ధవ్ను కలిసి రౌత్ తనతో చెప్పిన విషయాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు. అప్పుడు రౌత్ నిజస్వరూపం ఆయనకు తెలుస్తుందన్నారు. 'నేను రాజ్యసభ సభ్యుడినయ్యాక.. సంజయ్ రౌత్ నా దగ్గరకు వచ్చి పక్కనే కూర్చునేవారు. ఉద్ధవ్, ఆయన భార్య రష్మి గురించి నాతో చెప్పేవారు. ఆ రహస్యాలు ఎంటో ఉద్ధవ్, రష్మికి చెబితే వారు రౌత్ను చెప్పుతో కొడతారు' అని నారయణ్ రాణె చెప్పారు. శివసేనను ఖతం చేసేందుకు రౌత్ సుపారీ తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు రాణె. శివసేన స్థాపించిన 1969 నుంచి తాను పార్టీ కోసం పనిచేసినట్లు వివరించారు. సంజయ్ రౌత్ వల్లే శివసేన(ఉద్ధవ్) ఎమ్మెల్యేల సంఖ్య 56 నుంచి 12కు పతనమైందని విమర్శించారు. నారాయణ రాణె కేంద్రమంత్రి హోదాలో కాకుండా సాధారణ వ్యక్తిలా వచ్చి తనను కలవాలని రౌత్ శుక్రవారం సవాల్ చేశారు. ఆ మరునాడే రాణె తీవ్రంగా స్పందించారు. తనకు ఎలాంటి రక్షణ అవసరం లేదని, రౌత్ ఎక్కిడికి రమ్మంటే అక్కడకు వెళ్లి కలిసేందుకు సిద్దమని సవాల్ను స్వీకరించారు. చదవండి: మోదీ హయాంలో రెండు రకాల భారత్లు -
సీఎం షిండే ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. బిల్ క్లింటనే తనపై ఫోకస్ చేశారంటూ..
శివసేనలో తిరుగుబాటుతో మెజార్టీ ఎమ్మెల్యేలతో, బీజేపీతో కలిసి ఏక్నాథ్ షిండే మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఉద్ధవ్ థాక్రేకు ఊహించని షాక్ తగిలింది. ఈ క్రమంలో సీఎం ఏక్నాథ్ షిండే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఏకంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ పేరు చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. కాగా, నాగపూర్లో జరిగిన ఓ కార్యక్రమానికి సీఎం ఏక్నాథ్ షిండే హాజరయ్యారు. ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ.. నెల క్రితం ఓ వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు అతను అమెరికాలో నివాసం ఉంటాడు. అతడు బిల్ క్లింటన్కు సన్నిహితుడు. అయితే, అతడి బంధువు ఒకరు.. ఆయన దగ్గరకు వెళ్లారు. ఈ క్రమంలో బిల్ క్లింటన్ను కూడా ఆయన కలిశారు. ఈ సందర్భంగా బిల్ క్లింటన్.. అతడిని నా గురించి అడిగారు. ఏక్నాథ్ షిండే ఎవరు?. అతడు ఏం చేస్తాడు?. ఎప్పుడు నిద్రపోతారు?. ఎప్పుడు తింటారు?. అని అడిగినట్టు చెప్పారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. తానే ఏ రేంజ్లో ఉన్నాడో పరోక్షంగా చెప్పారు. అనంతరం, షిండే మాట్లాడుతూ.. కొంతమంది నా పని అయిపోందని అనుకుంటున్నారు. జర్నలిస్టు మిత్రులు కూడా నన్ను అడుగుతున్నారు. కానీ, అన్నీ చెప్పలేము కదా. నేనెప్పుడూ నటించలేదు. ప్రతీకారంతో ఎవరినీ దెబ్బకొట్టలేదు. నాకు అలాంటి మనస్తత్వం లేదు. భవిష్యత్త్లో ఏం చేస్తామో అందరూ చూస్తారు అని అన్నారు. అంతకుముందు కూడా షిండే.. ప్రపంచంలోని 33 దేశాలు తన తిరుగుబాటును గమనించాయని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. #Maharashtra CM #EknathShinde claimed that even former US President Bill Clinton enquired about him. "Bill Clinton asked who is Eknath Shinde? How much he works? When does he eat? When does he sleep" Shinde said while speaking at an event in #Nagpur | @mieknathshinde pic.twitter.com/EDMSqEQgTp — Free Press Journal (@fpjindia) December 23, 2022 -
Kashmir Files: 'కశ్మీర్ ఫైల్స్ తర్వాతే అక్కడ హత్యలు బాగా పెరిగాయ్'
ముంబై: 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రంపై ఐఎఫ్ఎఫ్ఐ జ్యూరీ చీఫ్ నడవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ ఈ విషయంపై స్పందించారు. నడవ్ లాపిడ్కే మద్దతుగా నిలిచారు. ది కశ్మీర్ ఫైల్స్ దురుద్దేశంతో తీసిన సినిమా అనడంలో వాస్తవం ఉందని రౌత్ పేర్కొన్నారు. ఈ సినిమాలో కావాలనే ఒక వర్గం వారిని తప్పుగా చూపించారని చెప్పారు. దీని పబ్లిసిటీలో ఒక పార్టీ, ప్రభుత్వం ఫుల్ బిజీగా ఉన్నాయని విమర్శలు గుప్పించారు. కశ్మీర్ ఫైల్స్ సినిమా విడుదల అయ్యాకే జమ్ముకశ్మీర్లో హత్యలు విపరీతంగా పెరిగాయని రౌత్ చెప్పుకొచ్చారు. 'కశ్మీర్ ఫైల్స్ సినిమాకు పబ్లిసిటీ చేస్తున్న వారు అప్పుడేమయ్యారు. కశ్మీరీ పండిట్ల పిల్లలు ఆందోళనలు చేసినప్పుడు వీళ్లు ఎక్కడున్నారు. వాళ్ల కోసం ఎవరూ ముందుకు రాలేదు. కశ్మీర్ పైల్స్ 2.0 తీయాలనుకుంటే అది కూడా పూర్తి చేయండి' అని రౌత్ వ్యాఖ్యానించారు. గోవా వేదికగా జరిగిన అంతర్జాతీయ భారతీయ చలన చిత్రోత్సవ వేడుకల్లో 'ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని' ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను చూసిన జ్యూరీ హెడ్, ఇజ్రాయెల్ దర్శకుడు నడవ్ లాపిడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ది కశ్మీర్ ఫైల్స్ అసభ్యంగా ఉందని, ప్రచారం కోసమే ఈ సినిమా తీశారని విమర్శలు గుప్పించాడు. అసలు దీన్ని ఈ వేడుకలో ఎలా ప్రదర్శించారో అర్థం కావడం లేదన్నారు. ఐఎఫ్ఎఫ్ఐలో ప్రదర్శించిన 15 చిత్రాల్లో 14 బాగున్నాయని, ది కశ్మీర్ ఫైల్స్ మాత్రమే చెత్తగా ఉందన్నారు. నడవ్ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగింది. కశ్మీర్ పండిట్ల బాధ పట్ల ఆయనకు విచారం లేదని కొందరు విమర్శించారు. మరికొందరు మాత్రం నడవ్ వాఖ్యల్లో వాస్తవం కూడా ఉందని మద్దతుగా నిలుస్తున్నారు. చదవండి: ‘కశ్మీర్ ఫైల్స్’పై ఇఫి జ్యూరీ హెడ్ సంచలన వ్యాఖ్యలు, స్పందించిన డైరెక్టర్ -
శివాజీపై వ్యాఖ్యల దుమారం.. నితిన్ గడ్కరీ ఏమన్నారంటే?
ఛత్రపతి శివాజీపై వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా మహారాష్ట్ర రాజకీయం మరోసారి వేడెక్కింది. శివాజీపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్గా సంచలనంగా మారాయి. దీంతో, సీఎం ఏక్నాథ్ షిండే అనుకూల ఎమ్మెల్యేలు సైతం గవర్నర్ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. షిండే వర్గం-బీజేపీ కూటమిలో ప్రకంపనలు రేపుతున్నాయి. అంతటితో ఆగకుండా గవర్నర్ను బదిలీ చేయాలనే డిమాండ్ తెరమీదకు తెస్తున్నారు. ఈ క్రమంలో గవర్నర్ భగత్సింగ్ కోష్యారీ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. బీజేపీ మిత్రపక్ష నేత, సీఎం ఏక్నాథ్ షిండే తీరును గడ్కరీ సోమవారం తప్పుబట్టారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ.. శివాజీ మహారాజ్ మాకు దేవుడు. మా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆయనను పూజిస్తాం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, గడ్కరీ వ్యాఖ్యలతోనైనా మహారాష్ట్రలో ఈ పొలిటికల్ ప్రకంపనలకు తెరపడుతుందో లేదో చూడాల్సిందే. అయితే, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఔరంగాబాద్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. మహారాష్ట్రలో చాలా మంది ఆరాధ్య నాయకులు ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ పాతకాలం నాటి ఆరాధ్య దైవం. ఇప్పుడు బీఆర్ అంబేద్కర్, నితిన్ గడ్కరీ ఉన్నారు అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై శివసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా షిండే వర్గంలోని ఎమ్మెల్యేలు కూడా గవర్నర్పై ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. -
శివాజీపై తీవ్ర వ్యాఖ్యలు.. సీఎం షిండే వర్గంలో చిచ్చుపెట్టిన గవర్నర్!
మహారాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారింది. ఛత్రపతి శివాజీపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్గా సంచలనంగా మారాయి. గవర్నర్ వ్యాఖ్యలను ఉద్ధవ్ థాక్రే వర్గం, శివసేన నేతలు తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై ఆయన వర్గానికే చెందిన ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, గవర్నర్ కోష్యారీ వ్యాఖ్యలపై శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గైక్వాడ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ను తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. కోష్యారీ గతంలో కూడా ఇలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఛత్రపతి శివాజీ మహారాజ్.. ప్రపంచలోని మరే ఇతర వ్యక్తితోనూ పోల్చలేరని అన్నారు. మహారాష్ట్ర చరిత్ర తెలియని వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధకరమని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ పార్టీకి, సీనియర్ నేతలకు ఇక్కడి చరిత్ర తెలిసినట్టు లేదని చురకలు అంటించారు. ఇప్పటికైనా తన తప్పు తెలుసుకుని గవర్నర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఇలాంటి కామెంట్స్ చేయడంతో మహారాష్ట్ర రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. Shiv Sena MLA Sanjay Gaikwad of Chief Minister Eknath Shinde's faction on Monday demanded that Maharashtra Governor Bhagat Singh Koshyari be shifted out of the state for his recent remarks about Chhatrapati Shivaji Maharaj.https://t.co/bvMkSHjnQS — Economic Times (@EconomicTimes) November 21, 2022 ఇక, అంతకుముందు.. గవర్నర్ వ్యాఖ్యలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఖండించారు. గవర్నర్ను తక్షణమే తొలగించాలంటూ డిమాండ్ చేశారు. అసలు షిండే మహారాష్ట్ర బిడ్డేనా? అని నిలదీశారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండ్ వెంటనే రాజీనాయాలన్నారు. ఈ ఏడాది వ్యవధిలో గవర్నర్ కోష్యారీ నాలుగుసార్లు ఛత్రపతి శివాజీని అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారన్నారు రౌత్. అయినా మహారాష్ట్ర ప్రభుత్వ మౌనంగానే ఉందంటూ విరుచుకుపడ్డారు. అయితే, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఔరంగాబాద్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. శివాజీ మహారాజ్ పాత విగ్రహం అయిపోయాయని, ఇప్పుడూ మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ నితిన్ గడ్కరీ వంటి వారెందరో అందుబాటులో ఉన్నారని వ్యాఖ్యానించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు మహారాష్ట్రలో పెనుదుమారం రేపాయి. -
ఫడణవీస్ 'ప్రతీకారం' వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన సంజయ్ రౌత్
ముంబై: తనకు వెన్నుపోటు పొడిచిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకున్నానని మంగళవారం ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్. మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రేను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే శివసేన(ఉద్ధవ్) సీనియర్ నేత సంజయ్ రౌత్ దీనిపై స్పందించారు. ఫడణవీస్ మాటలు మహారాష్ట్ర సంస్కృతికి పూర్తి విరుద్ధమని కౌంటర్ ఇచ్చారు. కొత్త ఒరవడి, సంప్రదాయాలకు శ్రీకారం చుడుతున్న ప్రస్తుత రాజకీయాల్లో ప్రతీకారానికి తావు లేదని పేర్కొన్నారు. ఫడణవీస్ మాటలు ఆయన స్థాయిని తగ్గించేలా ఉన్నాయని చెప్పారు. రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు సహజమేనని, కానీ మహారాష్ట్రలో ఇప్పటివరకు ప్రతీకారం అనే పదాన్ని ఏ రాజకీయ నాయకుడు ఉపయోగించలేదని రౌత్ అన్నారు. ఫడణవీస్ వ్యాఖ్యలు దురదృష్టకరమని పేర్కొన్నారు. ఓ మరాఠీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు నమ్మకద్రోహం చేసిన వారిపై ప్రతీకారం తీర్చేసుకున్నానని ఫడణవీస్ అన్నారు. రాజకీయాల్లో తమ పక్కనే ఉండి, అధికారం పంచుకొని ఆ తర్వాత పదవుల కోసం వెన్నుపోటు పొడిచేవాళ్లు కచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారని వ్యాఖ్యానించారు. తనకు వెన్నుపోటు పొడిచిన వాళ్లపై తాను ఇప్పటికే ప్రతీకారం తీర్చుకున్నానని స్పష్టం చేశారు. ఆయన ఉద్ధవ్ థాక్రేను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారు. థాక్రే.. కాంగ్రెస్, ఎన్సీపీతో చేతులు కలిపి తన కాలిని తానే షూట్ చేసుకున్నాడని ఫడణవీస్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో శివసేనను చీల్చి ఏక్నాథ్ షిండే బీజేపీతో చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దేవేంద్ర ఫడణవీస్ డిప్యూటీ సీఎం అయ్యారు. సొంత పార్టీ నేతలే తిరుగుబావుటా ఎగురవేసినా.. ఉద్ధవ్ థాక్రే ఏమీ చేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఫడణవీస్ ప్రతీకారం తీర్చుకున్నానని వ్యాఖ్యానించారు. శివసేనను చీల్చి, థాక్రేను సీఎం పదవి నుంచి తప్పించి తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నానని చెప్పకనే చెప్పారు. చదవండి: కాంగ్రెస్కు మరో షాక్.. రాజస్థాన్ ఇన్ఛార్జ్ రాజీనామా -
థాక్రే వర్గానికి పార్టీ పేరు గుర్తు ఖరారు చేసిన ఈసీ.. షిండేకు షాక్!
సాక్షి,న్యుఢిల్లీ: అంధేరీ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గానికి పార్టీ పేరు, ఎన్నికల గుర్తును కేటాయించింది ఎన్నికల సంఘం. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే) పేరు, కాగడా(ఫ్లేమింగ్ టార్చ్) గుర్తును ఖరారు చేసింది. మరోవైపు ఏక్నాథ్ షిండే వర్గానికి 'బాలసాహెబ్చీ శివసేన' పేరును ఫైనల్ చేసింది ఈసీ. అయితే ఎన్నికల గుర్తు మాత్రం ఖరారు చేయలేదు. షిండే వర్గం అడిగిన గుర్తులు ఇప్పటికే రిజిస్టర్ అయ్యాయని, కొత్త ప్రతిపాదనలు పంపాలని సూచించింది. అయితే థాక్రే, షిండే అడిగిన త్రిశూలం, గధ, ఉదయించే సూర్యుడి గుర్తులను కేటాయించేందుకు ఎన్నికల సంఘం నిరాకరించింది. కొన్ని గుర్తులు మతపరంగా ఉన్నాయని, ఉదయించే సుర్యూడి గుర్తు డీఎంకే రిజిస్టర్ చేసుకుందని పేర్కొంది. అసలైన శివసేన తమదంటే తమదే అని థాక్రే, షిండే వర్గం వాదిస్తున్న నేపథ్యంలో శివసేన పార్టీ పేరు, విల్లు-బాణం గుర్తును ఈసీ సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నవంబర్ 3న జరిగే అంధేరీ ఉపఎన్నిక కోసం పార్టీ పేరు, గుర్తు కోసం రెండు వార్గాలు కొన్ని ప్రతిపాదనలను ఈసీకి పంపాయి. చదవండి: నన్ను గెలిపిస్తే రూ.20కే పెట్రోల్, ఇంటికో బైక్.. -
Uddhav Thackeray: ఉద్ధవ్ థాక్రేకు ఊహించని షాక్
Shiv Sena leader Uddhav Thackeray.. మహారాష్ట్రలో పొలిటికల్ వాతావరణం ఇంకా చల్లబడలేదు. బీజేపీ మద్దతుగా శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా.. ఉద్ధవ్ థాక్రేకు మరోసారి ఊహించని దెబ్బ తగిలింది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మద్దతు తెలపడం మహా వికాస్ అఘడి (ఎంవీఏ)లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉద్ధవ్ థాక్రే నిర్ణయంపై కూటమి భాగస్వామి అయిన కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత బాలాసాహెట్ థోరట్.. శివసేనసై సంచలన విమర్శలు చేశారు. కాగా, బాలాసాహెబ్ ట్విట్టర్ వేదికగా.. శివసేన ఎందుకు ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తుందో తెలపాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధికి మద్దతు ఇచ్చే ముందు ఎందుకు ఎంవీఏ కూటమితో చర్చించలేదని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని బేఖాతరు చేస్తూ అప్రజాస్వామిక పద్ధతిలో మహారాష్ట్రలో ఎంవీఏ సర్కార్ను కూల్చి, శివసేన ఉనికినే సవాల్ చేసిన బీజేపీ కూటమికి రాష్ట్రపతి ఎన్నికల్లో శివసేన ఎలా మద్దతు ఇస్తుందని ప్రశ్నించారు. మరో అడుగు ముందుకేసి.. రాష్ట్రపతి ఎన్నిక భిన్న సిద్ధాంతాల మధ్య పోరుగా మారిందని, ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగాన్ని కాపాడేందుకు పోరాటం కోసం సాగుతోందని అన్నారు. అంతా వారి ఇష్టమేనా(శివసేన) అని పరోక్షంగా కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. శివసేన వైఖరిపై అటు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ద్రౌపది ముర్ముకు మద్దతిచ్చే విషయంలో ఎంవీఏకు శివసేన ముందస్తు సమాచారం ఇవ్వలేదని వెల్లడించింది. కాగా, మహారాష్ట్రలో శివసేన.. కాంగ్రెస్, ఎన్సీపీ భాగస్వామ్యంతో(ఎంవీఏ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. राष्ट्रपती पदाची निवडणूक ही वैचारिक लढाई आहे. लोकशाही आणि संविधान रक्षणासाठी सुरू असलेला हा संघर्ष आहे. स्त्री, पुरुष किंवा आदिवासी, बिगर आदिवासी अशी ही लढाई नाही. जे संविधान आणि लोकशाहीच्या संरक्षणाच्या बाजूने आहेत ते सर्व यशवंत सिन्हा यांना पाठिंबा देत आहेत. pic.twitter.com/LSykyJ0b6L — Balasaheb Thorat (@bb_thorat) July 12, 2022 -
తెగని ‘మహా’ పంచాయితీ.. ఇంతకూ అసలైన ‘సేన’ ఎవరిది?
కొన్ని వారాలుగా మహా రాష్ట్ర రాజకీయాలు ఎన్నో మలుపులు తిరిగాయి. శివ సేన సీనియర్ నేత ఏక్నాథ్ శిందే 34 మంది ఎమ్మెల్యే లతో తిరుగుబాటు చేసి, ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ మద్దతుతో శిందే వర్గం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గింది. మహారాష్ట్ర అసెంబ్లీ సభ్యుల సంఖ్య 288 కాగా 164 మంది సభ్యుల మద్దతు శిందే వర్గానికి లభించింది. ఈ మొత్తం సంక్షోభంలో ఒక కీలక ప్రశ్నకు సమా ధానం లభించలేదు. తమదే నిజమైన శివసేన అని ఇరు పక్షాలూ ప్రకటించుకుంటున్న నేపథ్యంలో శిందే, అతడి రెబల్ ఎమ్మెల్యేలకు ఉన్న రాజ కీయ అనుబద్ధత ఏమిటి? శిందేకు స్పష్టంగానే శివసేన శాసన సభ్యుల మద్దతు ఉంది. కానీ ఆ ప్రాతిపదికన మొత్తం శివసేన తనదే అని హక్కును చాటు కోవడానికి ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే సరి పోతుందా? ఏది నిజమైన శివసేన అనేదాన్ని ఎన్నికల కమిషన్ (ఈసీ) నిర్ణయిస్తుంది. పార్టీ అధినేతగా ఠాకరేని తొలగించి పార్టీ స్టేటస్ని మార్చాల్సిందిగా శిందే వర్గం ఇప్పటికే ఈసీని కలిసింది. కానీ ఈ అంశంపై చట్టం చాలా స్పష్టంగా ఉంది. రాజ్యాం గంలోని పదవ షెడ్యూల్ ఆర్టికల్ 191 (2)లో దీనికి సమాధానం కనబడుతుంది. ఫిరాయింపు దారులను ‘అనర్హుల’ను చేసే నిబంధనలు పదో షెడ్యూ ల్లో ఉన్నాయి. వీటిని రాజ్యాంగ (52వ సవరణ) చట్టం, 1985లో పొందుపరిచారు. పార్టీనుంచి ఫిరాయిం చిన ప్రజాప్రతినిధిని అనర్హుడిని చేయాలని ఇది స్పష్టంగా పేర్కొంది. ఏ పార్టీ అయినా మరొక పార్టీలో విలీనం కావాలంటే పార్టీ సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది ఆ విలీనానికి అను కూలతను ప్రదర్శించాలని రాజ్యాంగ (91వ సవరణ) చట్టం–2003 పేర్కొంది. పదవులిస్తామనో, ఇతర ఆశలు చూపో రాజ కీయ ఫిరాయింపులకు పాల్పడే దుష్టకార్యాలను నిరోధించడమే పదో షెడ్యూల్ లక్ష్యం. ఎందుకంటే ఫిరాయింపులు మన ప్రజాస్వామ్య పునాదులను ప్రమాదంలోకి నెడతాయి. అందుకే పార్లమెంటు ఉభయ సభలకు లేదా శాసన సభలకు చెందిన సభ్యుడిని అనర్హుడిని చేయడమే ఫిరాయింపులకు తగిన చికిత్స అని పదో షెడ్యూల్ నిర్దేశించింది. పదో షెడ్యూల్ శాసనసభా పార్టీలో చీలికను గుర్తించ లేదు. దానికి బదులుగా అది విలీనాన్ని గుర్తిస్తోంది. కాబట్టే ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేల సంఖ్య రీత్యా చూస్తే ఉద్ధవ్ ఠాకరే వర్గం ఇప్పుడు మైనారిటీలో ఉంటోంది కాబట్టి తమదే నిజమైన శివసేన అని చెప్పుకునే స్వతంత్ర హక్కు శివసేన రెబల్స్కు లేదు. అనర్హత నుంచి తప్పించుకోవా లంటే ఒక పార్టీలోని మూడింట రెండొంతుల సభ్యులు మరో పార్టీలో విలీనం కావలసి ఉంటుంది. శివసేన రాజ్యాంగానికి తాము కట్టుబడి ఉండాల్సి ఉంటుందన్న వాస్తవం రెండు వర్గాలకూ తెలుసు. సేన రాజ్యాంగంలో పార్టీ పతాక, పార్టీ చిహ్నం, ఎన్నికల గుర్తు వంటివాటి కోసం విడి విడిగా ఆర్టికల్స్ ఉన్నాయి. ముంబై దాదర్ లోని సేన భవన్ పార్టీ రిజిస్టర్డ్ ఆఫీసుగా ఉంది. ఇది సంస్థాగత చట్రాన్ని అందిస్తుంది. ఈ చట్రంలో శివసేన అధ్య క్షుడికి పార్టీలో కీలక స్థానం ఉంటుంది. సేన అధ్యక్షు డికి సర్వాధికారాలు ఉంటాయి. రాష్ట్రీయ కార్యకా రిణి సభ్యుల నుంచి ప్రతినిధి సభకు ఎన్నికైన సభ్యులు పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. శివసేన రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడికి పార్టీలో అత్యున్నత అధికారం ఉంటుంది. పార్టీ పాలసీ, యంత్రాంగానికి సంబంధించిన అన్ని విష యాల్లో అతడి నిర్ణయమే ఫైనల్ అవుతుంది. పార్టీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 8 పేర్కొన్న ఏ పదవినైనా, నియామకాన్నయినా పార్టీ అధ్యక్షుడు నిలిపి వుంచ గలడు లేదా తొలగించగలడు. శివసేన శాసన సభా పక్షనేతకైనా ఇదే వర్తిస్తుంది. మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే, అధ్యక్షుడికి తప్ప మరే ఇతర పార్టీ ఆఫీస్ బేరర్కి గానీ, సభ్యుడికి గానీ ఎవరినీ పార్టీ నుంచి బహిష్కరించే అధికారం లేదు. ఆఫీసు బేరర్లు, ప్రజా సంఘాల పనులకు సంబంధించిన నియమ నిబంధనలు రూపొందించే అధికారం రాష్ట్రీయ కార్యకారిణికి ఉండగా, దాని సమావేశా లను నిర్ణయించే అధికారం పార్టీ అధ్యక్షు డికి ఉంటుంది. అధ్యక్షుడి నిర్ణయమే ఫైనల్. కాబట్టి పార్టీ సభ్యులను, ఆఫీస్ బేరర్లను తొలగించే అధికారం పార్టీ రాజ్యాంగం ప్రకారం శివసేన అధ్యక్షుడిగా ఠాకరేకి ఉంటుంది. శిందేకు గానీ, తిరుగుబాటు ఎమ్మెల్యేలకుగానీ అలాంటి అధికారాలు ఉన్నాయని ప్రకటించుకునే అధికారం లేదు. తిరుగుబాటుదారులకు మూడింట రెండొం తుల మెజారిటీ ఉన్నప్పటికీ పార్టీ అధ్యక్షుడి అధి కారాలను తమవిగా వీరు ప్రకటించుకోలేరు. మహా రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గానీ, సుప్రీంకోర్టుగానీ ఇలాంటి అధికారాలను రెబెల్స్కి ఇవ్వలేరు. ఎన్నికల కమిషన్ వద్ద అయినా, శిందే వర్గం శివసేనపై తన చట్టబద్ధతనూ, హక్కులనూ నిరూ పించుకోవడం కష్టమే. పార్టీ చిహ్నం, పార్టీ గుర్తుపై ఎలాంటి హక్కు ప్రక టించుకోవాలన్నా శివసేనలోని రెండు వర్గాలూ పార్టీ రాజ్యాంగంపైనే ఆధారపడాలి. శివసేన పార్టీ అధ్యక్షుడిగా ఠాకరేని తొలగిస్తే తప్ప, రెబల్స్ పార్టీపై ఎలాంటి హక్కునూ ప్రకటించు కోలేరు. పార్టీ చిహ్నం, పార్టీ ఎన్నికల గుర్తు వంటి వాటిపై అసోసియేట్ హక్కులను కూడా వీరు పొందలేరు. వ్యాసకర్త: అభయ్ నెవగీ, సీనియర్ న్యాయవాది (‘ది వైర్’ సౌజన్యంతో...) -
అప్పుడు మీరంతా ఎక్కడున్నారు.. రెబల్స్కు థాక్రే సవాల్
మహారాష్ట్రలో ఊహించని ట్విస్టుల మధ్య శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే.. సీఎం పీఠాన్ని అధిరోహించారు. బీజేపీ మద్దతుతో షిండే కొత్త సర్కార్ను ఏర్పాటు చేశారు. కాగా, శివసేన పార్టీపై ఆధిపత్యం కోసం మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే వర్గం, కొత్త సీఎం షిండే వర్గం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మొదటిసారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు జరిపాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో రెబల్ ఎమ్మెల్యేలకు దమ్ముంటే శివసేన గుర్తుతో కాకుండా వేరే గుర్తుతో పోటీ చేయాలని సవాల్ విసిరారు. శివసేన పార్టీ గుర్తు తమతోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈరోజే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని తాను సవాల్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. నిజంగా మేము తప్పు చేసి ఉంటే ప్రజలు మమ్మల్ని ఇంటికి పంపిస్తారు. ప్రజలే మీకు తగిన బుద్దిచెబుతారని అన్నారు. మహారాష్ట్ర ప్రజలు కేవలం శివసేన గుర్తును మాత్రమే చూడరు. ఆ గుర్తుతో పోటీ చేసే వ్యక్తిని కూడా చూస్తారని అన్నారు. శివసేనను ఎవరూ తమ నుంచి లాక్కెళ్లలేరని అన్నారు. పార్టీలు పోయినంత మాత్రానా ఎక్కడైనా పార్టీ పోతుందా? అని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో పని చేసే రిజిస్టర్డ్ పార్టీ ఒకటి.. లెజిస్లేచర్ పార్టీ మరొకటి ఉంటుందని, ఈ రెండు వేర్వేరు అని వివరించారు. ఇలా చేయాలని అనుకుంటే.. రెండుననరేళ్ల క్రితమే చేసి ఉండాల్సిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కేంద్రంలో ఉన్న బీజేపీ.. గత రెండున్నర ఏళ్లుగా తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేసిందని ఆరోపించారు. ఆ సమయంలో రెబల్ ఎమ్మెల్యేలంతా ఎక్కుడున్నారని ఫైర్ అయ్యారు. అలాంటి బీజేపీతో కలిసి.. మీరు(రెబల్ ఎమ్మెల్యేలు) సొంత పార్టీకి ద్రోహం చేస్తారా అని ప్రశ్నించారు. బీజేపీ కొందరు శివసేన నేతలను బెదిరింపులకు గురిచేసినా కొంత ఎమ్మెల్యేలు నాకు మద్దతుగా నిలిచారు. వారిని చూసి నేను గర్విస్తున్నానని అన్నారు. దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పట్ల తాము ఆందోళనగా ఉన్నామని, న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉన్నదని అన్నారు. రెబల్ ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం కోసం ఆత్రుతగా చూస్తున్నారని వివరించారు. సుప్రీంకోర్టు నిర్ణయం గురించి తాను ఆందోళన చెందడం లేదని, చట్టం తన పని తాను చేసుకుంటుందని స్పష్టం చేశారు. ఇక, ప్రస్తుతం దేశంలో సత్యమేవ జయతే కాదు.. అసత్యమేవ జయతే నడుస్తోందని విమర్శలు గుప్పించారు. ఇది కూడా చదవండి: ఆ విషయం తేలకుండానే ప్రభుత్వ ఏర్పాటా? షిండేపై మళ్లీ కోర్టుకెక్కిన థాక్రే వర్గం -
షిండే ప్రభుత్వ ఏర్పాటు సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్
ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్ధవ్ థాక్రే శివసేన వర్గం సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని షిండేను ఆహ్వానించడాన్ని పిటిషన్ ద్వారా సవాల్ చేసింది. పదహారు మంది రెబల్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ విషయంపై ఎటూ తేలకుండానే అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించారని, స్పీకర్ ఎన్నిక ఓటింగ్లోనూ వారంతా పాల్గొన్నారని కోర్టుకు తెలిపింది. ఉద్ధవ్ థాక్రే వర్గం ప్రతినిధి సుభాష్ దేశాయ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. పదహారు మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత విషయంపై తీర్పు చెప్పాలని థాక్రే వర్గం సుప్రీంకోర్టును కోరింది. వీరు ఓటింగ్లో పాల్గొన్న నూతన స్పీకర్ రాహుల్ నర్వేకర్పై తాము అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పింది. సోమవారం ఈ పిటిషన్పై విచారణ జరగనుంది. మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు చేసి భాజపా మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు సీఎం ఏక్నాథ్ షిండే. జూన్ 30న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఆ తర్వాత అసెంబ్లీలో సోమవారం జరిగిన బలపరీక్షలో 166 ఓట్లతో షిండే మెజారిటీ నిరూపించుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా 99 ఓట్లే వచ్చాయి. షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక థాక్రే వర్గం మరింత బలహీనపడుతోంది. శివసేన నాయకులు, కార్పొరేటర్లు అధికారికంగా షిండే వర్గంలో చేరుతున్నారు. దీంతో అసలైన శివసేన తమదేనని షిండే వర్గం వాదిస్తోంది. థాక్రేతో ప్యాచప్కు సిద్ధం మరోవైపు ఉద్ధవ్ థాక్రే తిరిగి తమతో కలవాలనుకుంటే పార్టీలో చీలక ఉండదని షిండే వర్గం ఆఫర్ ఇచ్చింది. తమతో పాటు బీజేపీ కూడా ఉందని, మునుపటిలా కలిసిముందుకాసాగుదామని ఆఫర్ ఇచ్చింది. అయితే ఇందుకు థాక్రే బీజేపీ నేతలను కలిసి మాట్లాడాలని సూచించింది. చదవండి: అధికారం పోయింది, మరి పార్టీ? -
మహారాష్ట్రలో కేబినెట్ విస్తరణ.. బీజేపీకి పెద్ద పీట?
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అనంతరం.. శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే.. బీజేపీ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, 45 మంది మంత్రులతో నూతన కేబినెట్ను షిండే ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, కొత్త కేబినెట్లో బీజేపీకి చెందిన వారు 25 మంది, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నుంచి 13 మంది మంత్రులు ఉంటారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక, స్వతంత్రులకు సైతం కేబినెట్లో స్థానం కల్పించనున్నట్టు తెలుస్తోంది. కాగా, వీరిలో సీఎం షిండే, డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మినహా అందరూ కొత్తవారేనని సమాచారం. ఇదిలా ఉండగా.. ఏక్నాథ్ షిండే, బీజేపీ మధ్య ఓ ఒప్పందం కుదిరినట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ ఒప్పందం ప్రకారమే.. శివసేనతో ప్రతీ ముగ్గురు ఎమ్మెల్యేలకు, బీజేపీలో ప్రతీ నలుగురు ఎమ్మెల్యేలకు ఓ మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరోవైపు.. షిండేతో సహా 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై జూలై 11న సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నట్టు విశ్వసనీయ సమాచారం. 🔴 New Maharashtra cabinet: 25 ministers from BJP, 13 from Chief Minister Eknath Shinde's Sena, say sources https://t.co/VU6h2cDdEU pic.twitter.com/NXlTPoeb71 — NDTV (@ndtv) July 7, 2022 ఇది కూడా చదవండి: ఉద్ధవ్కు మరో ఎదురుదెబ్బ.. షిండే వర్గంలోకి 66 మంది శివసేన కార్పొరేటర్లు! -
Eknath Shinde-బీజేపీ మీరనుకుంటున్నట్టు కాదు: సీఎం షిండే
సాక్షి, ముంబై: బీజేపీ తనకు ఎందుకు మద్దతుగా నిలిచిందో చెప్పారు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే. ఆ పార్టీకి అధికారం మాత్రమే కాదు సిద్ధాంతం కూడా ముఖ్యమనేందుకు తమ ప్రభుత్వమే నిదర్శనమన్నారు. ఎమ్మెల్యేలు హిందుత్వానికే కట్టుబడి ఉండి తిరుగుబాటు చేయడం వల్లే ఉద్ధవ్ థాక్రే సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని వివరించారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ హయాంలో శివసేన ఎమ్మెల్యేలకు పనులు పూర్తి చేయడానికి కష్టంగా ఉండేదని షిండే పేర్కొన్నారు. ఎన్సీపీ, కాంగ్రెస్ మాత్రం అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని క్షేత్రస్థాయిలో బలపడాలని చూశాయని ఆరోపించారు. బీజేపీపై ఆ అపోహ నిజం కాదు అధికారం కోసం బీజేపీ ఎమైనా చేస్తుందనే అపోహ ప్రజల్లో ఉందని, కాని అది నిజం కాదని షిండే అన్నారు. 50 మంది ఎమ్మెల్యేలు హిందుత్వానికి, సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నందుకే ఆ పార్టీ తమకు మద్దతుగా నిలిచిందని చెప్పారు. హిందుత్వం, అభివృద్ధే తమ ఉమ్మడి ఎజెండా అని, అందుకే బీజేపీకి తమకంటే చాలా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. సీఎం పదవి తనకిచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించిందని షిండే తెలిపారు. మహారాష్ట్రను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని ప్రధాని మోదీ తనకు సూచించారని షిండే ఈ సందర్బంగా చెప్పుకొచ్చారు. కేంద్రం నుంచి అన్నివిధాలుగా సహకారం ఉంటుందని బీజేపీ పెద్దలు హామీ ఇచ్చారని చెప్పారు. 200 స్థానాల్లో గెలుస్తారా? తాము చట్టవిరుద్ధంగా ఏమీ అధికారాన్ని చేపట్టలేదని షిండే అన్నారు. ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసే పోటీచేశాయని, తాము దానికే కట్టుబడి ఉన్నామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి 200 స్థానాల్లో గెలుస్తారా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ఇప్పటికే తమ కుటమిలో 170 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, ఇంకో 30 స్థానాలే గెలవాల్సి ఉందని చెప్పారు. దేవేంద్ర ఫడ్నవీస్ ఎంతో పెద్ద మనసు చేసుకుని తనకు సీఎం పదవి ఇచ్చి, ఆయన డిప్యూటీ సీఎం పదవి తీసుకున్నారని షిండే అన్నారు. -
మరాఠ ప్రజలకు కొత్త సీఎం షిండే బంపరాఫర్
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం కారణంగా కీలక పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. శివసేన రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటులో మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమిలో ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ఏర్పడింది. నేడు(సోమవారం) సీఎం షిండే బల నిరూపణలో సైతం పూర్తి మెజార్టీతో విజయం సాధించింది. ఇదిలా ఉండగా.. సీఎం ఏక్నాథ్ షిండే సోమవారం మహారాష్ట్ర ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రజా ఆకర్షణ చర్యల్లో భాగంగా.. ఇంధన ధరలను తగ్గించనున్నట్టు తెలిపారు. కొత్త కేబినెట్ సమావేశం తర్వాత పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను తగ్గించనున్నట్టు స్పష్టం చేశారు. దీనిపై కేబినెట్ తర్వలోనే నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అయితే, గత ఏడాది నవంబర్లో, కేంద్రం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని రూ. 5, రూ. 10 తగ్గించింది. ఈ నేపథ్యంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఇంధన ధరలపై వ్యాట్ను తగ్గించాయి. ఇక, మేలో కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు వ్యాట్ను మరింత తగ్గించాయి. అయితే, ప్రజలకు ఉపశమన చర్యగా ఇంధనంపై వ్యాట్ను తగ్గించాలన్న ప్రధాని సూచనను ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు తిరస్కరించాయి. కాగా, మహారాష్ట్రలో అప్పుడున్న ఉద్ధవ్ థాక్రే సర్కార్ వ్యాట్ను తగ్గించలేదు. తాజాగా ఏక్నాథ్ షిండే ప్రభుత్వం వ్యాట్ను తగ్గించనున్నట్టు తెలిపింది. ఇది కూడా చదవండి: ఉద్ధవ్ థాక్రేకే ఎందుకిలా.. ఎమ్మెల్యే ఇంత పనిచేస్తాడని ఊహించలేదు -
ఉద్ధవ్ థాక్రేకే ఎందుకిలా.. ఎమ్మెల్యే ఇంత పనిచేస్తాడని ఊహించలేదు
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో భలే ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. నేడు(సోమవారం) ఏక్నాథ్ షిండే ప్రభుత్వం.. విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. సీఎం షిండేకు మద్దతుగా.. 164 మంది శాసనసభ్యులు ఓటు వేశారు. షిండే-బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 99 ఓట్లు పోలయ్యాయి. ఇదిలా ఉండగా.. బలపరీక్షలో శివసేన ఎమ్మెల్యేలు షిండే సర్కార్కు సపోర్టుగా నిలిచారు. మద్దతుగా ఓట్లు వేశారు. ఈ నేపథ్యంలో శివసేన ఎమ్మెల్యే సంతోష్ బంగర్ ట్విటర్లో జూన్ 24న పోస్ట్ చేసిన ఓ వీడియో చర్చనీయాంశంగా మారింది. కాగా, శివసేనకు చెందిన రెబల్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారం క్రితం సంతోష్ బంగర్.. తాను ఉద్ధవ థాక్రేకు మద్దుతు ఇస్తున్నట్టు చెప్పాడు. ఈ సందర్భంగా తన నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి సంతోష్ బంగర్ ఓ సభలో మాట్లాడుతూ.. ఉద్ధవ్కి మద్దతుగా కన్నీరు కూడా పెట్టుకున్నారు. కానీ, ఉద్ధవ్ థాక్రేకు షాకిస్తూ.. సోమవారం జరిగిన బల పరీక్షలో సంతోష్ బంగర్.. సీఎం ఏక్నాథ్ షిండేకు మద్దతు ఇచ్చారు. దీంతో ఉద్ధవ్ వర్గం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. అయితే, సంతోష్ బంగర్ ఆదివారం రాత్రే ముంబైలోని ఓ హోటల్లో సీఎం షిండేని కలిసినట్టు సమాచారం. आज मतदारसंघांमध्ये परत आल्यानंतर उपस्थित शिवसैनिकांना संबोधित करताना अश्रू अनावर झाले....शेवटच्या श्वासापर्यंत आदरणीय शिवसेना पक्षप्रमुख #उद्धव_ठाकरे साहेबा सोबत. @ShivSena @AUThackeray pic.twitter.com/loMHpUI4cL — आमदार संतोष बांगर (@santoshbangar_) June 24, 2022 ఇది కూడా చదవండి: శివసేన, ఎన్సీపీకి కాంగ్రెస్ షాక్! -
మహారాష్ట్ర స్పీకర్గా రాహుల్ నర్వేకర్.. థాక్రేకు షాక్
మహారాష్ట్రలో శివసేన రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏక్నాథ్ శిండే సర్కార్ బలపరీక్షకు సిద్ధమైంది. అందుకోసం రెండు రోజులుపాటు అసెంబ్లీ సమావేశాలను జరిపేందుకు సిద్దమైంది. అందులో భాగంగానే ఆదివారం, సోమవారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరిపింది. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజైన ఆదివారం.. స్పీకర్ ఎన్నిక జరిగింది. స్పీకర్ పదవి కోసం బీజేపీ తరపున రాహుల్ నర్వేకర్.. మహావికాస్ అఘాడీ తరపున రాజన్ సాల్వీ పోటీపడ్డారు. ఈ పోటీలో రాహుల్ నర్వేకర్ స్పీకర్ పదవికి ఎన్నికయ్యారు. దీంతో మాజీ సీఎం ఉద్ధవ్ వర్గానికి షాక్ తగిలింది. ఇదిలా ఉండగా, సోమవారం మహా అసెంబ్లీలో కొత్త సీఎం ఏక్నాథ్ శిండే బలపరీక్ష ఎదుర్కోనున్నారు. 39 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, 11 మంది స్వతంత్రులు.. శనివారం గోవా నుంచి ముంబై చేరుకున్న విషయం తెలిసిందే. వీరంతా శిండేకు మద్దతుగా నిలుస్తారా.. లేక కొందరైనా ఉద్దవ్ థాక్రేవైపు వెళ్తారా అనేది ఓటింగ్లో తేలనుంది. BJP's Rahul Narwekar elected as Maha Assembly Speaker Read @ANI Story | https://t.co/piiMIgmNcU#RahulNarwekar #Maharashtra #MaharashtraAssemblySpeaker #EknathShinde pic.twitter.com/4EqTlJ1idE — ANI Digital (@ani_digital) July 3, 2022 -
మహా పాలి‘ట్రిక్స్’.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన శివసేన
మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్టుల మీద సస్పెన్స్లు కొనసాగిన విషయం తెలిసిందే. రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో పొలిటికల్ డ్రామా నడిచింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే.. సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం, శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే.. బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు వేశారు. బీజేపీ అధిష్టానం నిర్ణయంతో మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు స్వీకరించారు. ఇదిలా ఉండగా.. అనూహ్యంగా శివసేన శుక్రవారం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో అనర్హత తేలే వరకు 16 మందిని సస్పెండ్ చేయాలని అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. శుక్రవారం పిటిషన్ను స్వీకరించిన ధర్మాసనం విచారణను ఈనెల 11వ తేదీకి వాయిదా వేసింది. కాగా, అంతకుముందు శివసేన.. సీఎం ఏక్నాథ్ షిండేతోపాటు 15 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. Shiv Sena Chief Whip Sunil Prabhu moves Supreme Court seeking suspension from House, of Maharashtra CM Eknath Shinde & 15 other MLAs against whom disqualification petitions are filed, till a final decision is taken on their disqualification. pic.twitter.com/iTkLUyBK8k — ANI (@ANI) July 1, 2022 మరోవైపు.. మహారాష్ట్రలో ఈనెల 3, 4 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో 3వ తేదీన స్పీకర్ ఎన్నిక, 4వ తేదీన బలనిరూపణకు పరీక్ష ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇది కూడా చదవండి: శరద్ పవర్కు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు -
రాజకీయ మహా థ్రిల్లర్
పది రోజుల పైచిలుకు మహా రాజకీయ నాటకం క్లైమాక్స్లోనూ ఆశ్చర్యకరమైన మలుపులు తిరిగింది. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాకరేపై ఏక్నాథ్ శిందే సారథ్యంలో ఎమ్మెల్యేల తిరుగుబాటు, సూరత్ మీదుగా గౌహతి దాకా క్యాంపు రాజకీయాలు, అసెంబ్లీలో బలపరీక్షకు గవర్నర్ ఆదేశాలు, సుప్రీమ్ కోర్టుకెక్కిన వివాదం – ఇలా ఇన్ని రోజుల పొలిటికల్ థ్రిల్లర్కు ఆఖరి ఘట్టం అక్షరాలా అనూహ్యమైనది. మెజార్టీ కోల్పోయినా ‘మహా వికాస్ అఘాడీ’ (ఎంవీఏ) కూటమి సర్కారుకు సారథ్యం వహిస్తున్న ఉద్ధవ్ ఠాకరే ఎట్టకేలకు ఓటమి అంగీకరించి, బుధవారం రాత్రి పొద్దుపోయాక జోరున వర్షంలో రాజ్భవన్కు వెళ్ళి రాజీనామా సమర్పించారు. ఇన్నాళ్ళుగా తెర వెనుక నుంచే కథ నడిపిన బీజేపీ రాజకీయ మహా వ్యూహంతో గురువారం సాయంత్రం ఆఖరి నిమిషంలో శిందేను సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. అంతటితో ఆగకుండా, శిందే సర్కారుకు బయట నుంచే మద్దతు నిస్తానని ప్రకటించిన సొంత బీజేపీ నేత – మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను ఉప ముఖ్యమంత్రిగా పని చేయమంటూ రెండు గంటల తేడాలో ఆదేశించి, అవాక్కయ్యేలా చేసింది. గతంలో ఫడ్నవీస్ ప్రభుత్వంలో శిందే మంత్రిగా పనిచేస్తే, ఇప్పుడు శిందే కొత్త సర్కారులో ఆయన కింద ఫడ్నవీస్ బాధ్యతలు నిర్వహించనుండడం అనూహ్యమే. కొద్ది గంటల్లోనే బీజేపీ ఇన్ని మార్పులు చేయడానికి దారితీసిన కారణాలేమిటో రాగల రోజుల్లో బయటకు రావచ్చు. ఇప్పటికైతే, బీజేపీ తన గుగ్లీలతో ప్రత్యర్థులను క్లీన్బౌల్డ్ చేసింది. ఇటు చట్టపరంగానూ, అటు రాజకీయంగానూ లబ్ధి కలిగేలా శిందేను సీఎం చేసింది. చట్టపరంగా చూస్తే – నిన్నటి దాకా శివసేన శాసనసభా నేత అయిన శిందే అదే హోదాను నిలబెట్టుకొని, తన వర్గమే అసలైన శివసేనగా గుర్తింపు పొందే అవకాశం పెరిగింది. మిగతా రెబల్ ఎమ్మెల్యేలేమో పార్టీ ఫిరాయింపు లాంటి చట్టపరమైన వేటు నుంచి తప్పించుకుంటారు. రాజకీయంగా చూస్తే – ఉద్ధవ్నూ, అతని వెంట మిగిలిన కొద్దిమంది ఎమ్మెల్యేలనూ నిస్సహాయుల్ని చేయగల ఎత్తు ఇది. పార్టీ జెండా, అజెండా శిందే వశమయ్యే శివ సేనను బీజేపీ తన చంకలో పిల్లాణ్ణి చేసుకోగలుగుతుంది. సీఎం పీఠం బీజేపీ దయాధర్మం గనక శిందే కృతజ్ఞతాభారంతో బీజేపీకి శాశ్వత అనుచరుడవుతారు. అన్నిటికీ మించి భవిష్యత్తులో మహా రాష్ట్రలో హిందూత్వ రాజకీయ పునాదిపై తానొక్కటే బలంగా నిలిచేలా బీజేపీ ఈ చర్య చేపట్టింది. కొద్దినెలల్లో రానున్న ప్రతిష్ఠాత్మక ముంబయ్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం తాజా చర్య బీజేపీకి కలిసి రావచ్చు. శిందేను సీఎంను చేయడం ద్వారా బాలాసాహెబ్ ఠాకరే భావజాలానికి నివాళి సమర్పించామంటున్న కమలం పార్టీ అలా మంచి పేరు కొట్టేస్తుంది. నిన్నటి దాకా భావోద్వేగ ప్రసంగాలతో శివసైనికుల సానుభూతి సంపాదించిన ఉద్ధవ్ పట్ల ఏ కొద్ది సానుకూలత మిగిలి ఉన్నా దాన్ని దూరం చేయగలుగుతుంది. హిందూత్వానికి నిలబడింది తామేనని చెప్పుకోగలుగుతుంది. ఈ మొత్తంలో ఇటు పదవీ, అటు దాదాపుగా పార్టీ కూడా చేజారి నష్టపోయింది – ఉద్ధవ్ ఠాకరే. మొదటి నుంచి మహారాష్ట్రలో కింగ్ మేకర్ గానే తప్ప సీఎం పీఠంపై కింగ్గా ఉండని సంప్రదాయం ఆయన తండ్రి బాలాసాహెబ్ ఠాకరేది. దానికి భిన్నంగా నడిచి, ఉద్ధవ్ పెద్ద తప్పే చేసినట్టున్నారు. సీఎం పదవికి రాజీనామాతో ఆయనిక కింగ్ కాదు. అంతకన్నా ముఖ్యంగా ఇకపై కింగ్ మేకరూ కాలేరు. ఏకంగా ఆయన రాజకీయ భవితవ్యమే ప్రశ్నార్థకమైంది. రెండున్నరేళ్ళ క్రితం బీజేపీతో ఎన్నికల ముందు ఒప్పందంతో పోటీ చేసుకొని, తీరా ఎన్నికల్లో గెలిచాక బీజేపీని కాదని కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఉద్ధవ్. సహజ మిత్రపక్షమైన బీజేపీని కాదని, దానికి పూర్తి విరుద్ధమైన లౌకికవాద పార్టీలతో అసహజ మైత్రి చేసుకున్నారు. రాజకీయం మాటెలా ఉన్నా నైతికంగా అది ఆయన చేసిన తప్పు. ఆ లెక్కన ఇప్పుడు సొంతపార్టీలో తిరుగుబాటు తెచ్చిన శిందేదీ, శివసేనలోని అంతర్గత అసమ్మతిని ఆసరాగా చేసుకొని, ఎంవీఏ ప్రభుత్వ పతనానికి దోహదపడి పగ తీర్చుకున్న బీజేపీదీ అంతే తప్పు. రాజకీయ రణంలో చెల్లుకు చెల్లు అయిందనుకొంటే, ఇక నైతిక ప్రశ్నలు, ధర్మాధర్మ విచక్షణలకు తావు లేదు. డబ్బు, అధికారం, ఈడీ కేసుల భయం – ఏ కారణమైతేనేం కనీసం డజనుకు పైగా ఎమ్మెల్యేలు ఉద్ధవ్ను వదిలి, బీజేపి ఆశీస్సులున్న శిందే వైపు వచ్చారని ఆరోపణ. శివసేన సుప్రీమ్కు ఒకప్పుడు కుడిభుజంలా మెలిగి, పార్టీ సమస్యల పరిష్కర్తగా వెలిగిన శిందే ఇవాళ అదే అధినేతకు సంక్షోభ కారకుడు కావడం రాజకీయ వైచిత్రి. కొత్త సర్కారుతో శిందే, ఫడ్నవీస్లను తెర ముందు నిలబెట్టి, రిమోట్ కంట్రోల్ను చేతిలో పెట్టుకున్న బీజేపీ ఒకే దెబ్బకు అనేక పిట్టలను కొట్టిందనుకోవాలి. మహారాష్ట్రలో ఠాకరేల ప్రాబల్యానికి తెర దించడానికి ఇది ఉపకరిస్తుంది. అలాగే, యూపీ తర్వాత అత్యధిక లోక్సభ స్థానాలున్న మహారాష్ట్రలో శివసేన ఓటర్లను కూడా తన వెంటే తిప్పుకోగలుగు తుంది. ఆ రాష్ట్రంలో శాశ్వతంగా జెండా పాతడానికి ఇది మంచి అవకాశం. మరి, కొద్దిమంది ఎమ్మెల్యేలతోనే సీఎం అయిన శిందే చివరకు బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మిగిలిపోతారా? లేక శివసేనను నిలబెట్టి, తనకంటూ బలమైన కార్యకర్తలను నిర్మించుకుంటారా? 2014లో పూర్తికాలం పాటు, 2019లో కొద్దిరోజులే సీఎంగా పనిచేసి, ఇప్పుడు అధిష్ఠానం ఆదేశం మేరకు అనాసక్తంగానే డిప్యూటీ సీఎం అయిన ఫడ్నవీస్ మనస్ఫూర్తిగా జూనియర్ కింద పనిచేస్తారా? రాజకీయ చతురుడు శరద్ పవార్ ఏం చేయనున్నారు? మహా రాజకీయ థ్రిల్లర్ సిరీస్లో తరువాతి అధ్యాయం అదే! -
ఉద్ధవ్ సెలవు.. బీజేపీ కొలువు
న్యూఢిల్లీ/ముంబై/గువాహటి: పది రోజులుగా రోజుకో మలుపు తిరిగిన మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఎట్టకేలకు బుధవారం ఓ కొలిక్కి వచ్చింది. ముఖ్యమంత్రి పదవికి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. గురువారం ఉదయం అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా గవర్నర్ ఆదేశించడం, దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు తలుపు తట్టినా లాభం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం అర్ధరాత్రి స్వయంగా కారు నడుపుకుంటూ రాజ్భవన్కు వెళ్లి గవర్నర్కు రాజీనామా లేఖ సమర్పించారు. రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్లు రాజ్భవన్ ప్రకటించింది. దాంతో సేన–ఎన్సీపీ–కాంగ్రెస్ కలయికతో రెండున్నరేళ్ల కింద ఏర్పాటైన మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) సంకీర్ణ ప్రభుత్వం కథ కంచికి చేరింది. ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన రెబల్ ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. విపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని సమాచారం. బీజేపీ మహారాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సీటీ రవి ఇప్పటికే రంగంలోకి దిగి మంత్రివర్గ కూర్పు తదితరాలపై షిండేతో చర్చలు జరుపుతున్నారు. షిండేకు ఉప ముఖ్యమంత్రితో పాటు ఆయన వర్గానికి 9 మంత్రి పదవులిస్తారని సమాచారం. ఎనిమిది రోజులుగా గువాహటిలో ఓ హోటల్లో మకాం చేసిన 39 మంది సేన రెబల్ ఎమ్మెల్యేలు, 10 మంది స్వతంత్రులు బుధవారం రాత్రి ప్రైవేట్ చార్టర్ విమానంలో గోవా చేరుకున్నారు. వారంతా గురువారం ఉదయం ముంబై రానున్నట్టు సమాచారం. ‘‘మేం రెబల్స్ కాదు. నిజమైన శివ సైనికులం మేమే’’అని ఈ సందర్భంగా షిండే అన్నారు. రోజుంతా పలు మలుపులు: సంకీర్ణ సారథి శివసేనపై మంత్రి ఏక్నాథ్ షిండే సారథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో జూన్ 21న మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. కనీసం 20 మంది ఎమ్మెల్యేలతో కలిసి జూన్ 20న అర్ధరాత్రి షిండే రాష్ట్రం వీడి సూరత్ చేరుకున్నారు. మర్నాడు గౌహతికి మకాం మార్చారు. 55 మంది శివసేన ఎమ్మెల్యేల్లో చూస్తుండగానే 39 మందికి పైగా షిండే శిబిరంలో చేరిపోయారు. దాంతో ఉద్ధవ్ సర్కారు మైనారిటీలో పడింది. ఉద్ధవ్ బెదిరింపులు, బుజ్జగింపులు, ఇరువర్గాల సవాళ్లూ ప్రతి సవాళ్లతో వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ వచ్చింది. మంగళవారం రాత్రి ఫడ్నవీస్ గవర్నర్ భగత్సింగ్ కోషియారీని కలిసి బలపరీక్షకు ఉద్ధవ్ను ఆదేశించాలని కోరడంతో ముదురు పాకాన పడింది. ఆ వెంటనే సీఎంను గురువారం సభలో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా గవర్నర్ ఆదేశించారు. అందుకు ఏర్పాట్లు చేయాలంటూ అసెంబ్లీ కార్యదర్శికి మంగళవారం రాత్రే లేఖ రాశారు. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు సజావుగా లేవు. 39 మంది సేన రెబల్ ఎమ్మెల్యేల కార్యాలయాలు తదితరాలపై దాడుల నేపథ్యంలో వారికి, వారి కుటుంబ సభ్యులకు ముప్పుంది. విపక్ష నేత ఫడ్నవీస్ కూడా నన్ను కలిసి బలపరీక్షకు ఆదేశించాలంటూ విజ్ఞాపన సమర్పించారు. అందుకే గురువారం సభలో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా సీఎంను ఆదేశిస్తున్నా’’అని పేర్కొన్నారు. దీన్ని సవాలు చేస్తూ శివసేన బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ ఆదేశంపై స్టే కోరింది. అందుకు కోర్టు నిరాకరించింది. బల నిరూపణే సమస్యకు పరిష్కారమని న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్డీవాలాలతో కూడిన వెకేషన్ బెంచ్ అభిప్రాయపడింది. సేన పిటిషన్ను ఈ ఉదంతంపై దాఖలైన ఇతర కేసులతో కలిపి జూలై 11న విచారిస్తామని ప్రకటించింది. బలపరీక్ష ఫలితం తమ తుది తీర్పుకు లోబడి ఉంటుందంటూ తీర్పు వెలువరించింది. అసెంబ్లీ కార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేసి, ఐదు రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కూలదోసి ఆనందిస్తున్నారు: ఉద్ధవ్ సుప్రీం తీర్పు వెలువడ్డ కొద్ది నిమిషాల్లోనే సీఎం పదవి నుంచి ఉద్ధవ్ తప్పుకున్నారు. రాజీనామా చేస్తున్నట్టు ఫేస్బుక్ లైవ్లో ప్రకటించారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. ‘‘పదవిని వీడుతున్నందుకు నాకు ఏ బాధా లేదు. నంబర్గేమ్పైనా ఏ మాత్రం ఆసక్తి లేదు. పార్టీ ఎమ్మెల్యేల్లో నన్ను ఒక్కరు వ్యతిరేకించినా నాకది అవమానమే’’అన్నారు. ‘‘రెబల్స్ను ముంబై రానివ్వండి. ఎలాంటి ఆందోళనలకు, నిరసనలకు దిగొద్దు’’అని శివసేన కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. శివసేన, బాల్ ఠాక్రే కారణంగా రాజకీయంగా ఎదిగిన రెబల్ ఎమ్మెల్యేలు చివరికి ఆయన కుమారున్నే సీఎం పదవి నుంచి దించేసి ఆనందిస్తున్నారని వాపోయారు. ఈ పరిణామాన్ని ఉద్ధవ్ బుధవారం ఉదయమే ఊహించారు. దాంతో మధ్యాహ్నం జరిగిన కేబినెట్ భేటీ ఒకరకంగా ఉద్ధవ్ వీడ్కోలు సమావేశంగా మారింది. తనకు రెండున్నరేళ్లుగా సహకరించినందుకు సంకీర్ణ భాగస్వాములైన ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల చీఫ్లు శరద్ పవార్, సోనియా గాంధీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ‘‘రెబల్స్ కోరితే సంకీర్ణం నుంచి తప్పుకుని బయటినుంచి మద్దతిచ్చేందుకు కూడా సిద్ధమని కాంగ్రెస్ ప్రకటించింది. నన్ను మోసగిస్తారనుకున్న వాళ్లు ఇలా మద్దతుగా నిలబడితే సొంతవాళ్లే మోసగించారు’’అంటూ ఆవేదన వెలిబుచ్చారు. రెబల్స్ తమ సమస్యలపై తన దగ్గరికి వచ్చి ఉండాల్సిందన్నారు. ‘‘శివసేన సామన్యుల పార్టీ. గతంలోనూ ఇలాంటి ఎన్నో సవాళ్లను విజయవంతంగా అధిగమించింది’’అన్నారు. పార్టీని పునర్నిర్మిస్తానని ప్రకటించారు. కర్మ సిద్ధాంతం పని చేసింది: బీజేపీ ఉద్ధవ్ రాజీనామా విషయంలో కర్మ సిద్ధాంతం పని చేసిందని బీజేపీ వ్యాఖ్యానించింది. ‘‘కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. చేసిన దాన్ని అనుభవించే తీరాలి. ఉద్ధవ్ విషయంలోనూ అదే జరిగింది’’అని కేటీ రవి అన్నారు. ‘‘శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే ఎన్నడూ అధికార పదవులు చేపట్టకపోయినా ప్రభుత్వాలను శాసించారు. ఆయన కుమారునిగా ఉద్ధవ్ మాత్రం అధికారంలో ఉండి కూడా సొంత పార్టీనే అదుపు చేయలేకపోయారు. ఎంతటి పతనం!’’అంటూ బీజేపీ నేత అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు మహారాష్ట్ర సంక్షోభంలో ఎప్పుడేం జరిగిందంటే... జూన్ 20: మహారాష్ట్రలో 10 శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వెలువడ్డాక శివసేన సీనియర్ మంత్రి ఏక్నాథ్ షిండే అదృశ్యమయ్యారు. ఆయనతో మరో 11 మంది శివసేన ఎమ్మెల్యేలు ఆ అర్ధరాత్రే బీజేపీ పాలిత గుజరాత్లోని సూరత్ చేరారు. జూన్ 21: ఉద్ధవ్ ఠాక్రే సమావేశానికి శివసేన ఎమ్మెల్యేల్లో 12 మందే వచ్చారు. పార్టీ శాసనసభాపక్ష నేత పదవి నుంచి షిండేను తొలగించారు. తనకు 40 మందికిపైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని షిండే ప్రకటించారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఉద్ధవ్ను డిమాండ్ చేశారు. జూన్ 22: షిండే వర్గం సూరత్ వీడి బీజేపీ పాలిత అస్సాంలోని గువాహటి చేరుకుంది. రెబల్స్ కోరితే సీఎం పదవి నుంచి తప్పుకుంటానని ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. సంకీర్ణాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. జూన్ 23: 37 మంది శివసేన ఎమ్మెల్యేలు తమ శాసనసభా పక్ష నేతగా షిండేను ఎన్నుకుంటూ తీర్మానం చేశారు. జూన్ 24: షిండే వర్గంలోని 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిప్యూటీ స్పీకర్కు సేన ఫిర్యాదు చేసింది. షిండే ప్రత్యేక విమానంలో గుజరాత్లోని వడోదర వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్లతో సమావేశమైనట్టు వార్తలొచ్చాయి. బీజేపీలో శివసేన విలీనం, బయటి నుంచి మద్దతు, ఇరువురూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం వంటి పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం. జూన్ 26: అనర్హత నోటీసులను షిండే వర్గం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. డిప్యూటీ స్పీకర్పై తమ అవిశ్వాస తీర్మానం పెండింగులో ఉండగా తమకు అనర్హత నోటీసులిచ్చే అధికారం ఆయనకు లేదని వాదించింది. జూన్ 27: రెబల్ ఎమ్మెల్యేల అనర్హత నోటీసులపై జూలై 11 దాకా ఏ నిర్ణయమూ తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. జూన్ 28: అదను చూసి బీజేపీ రంగంలోకి దిగింది. ఉద్ధవ్ను తక్షణం అసెంబ్లీలో బలం నిరూపించుకోవాల్సందిగా ఆదేశించాలని గవర్నర్ను ఫడ్నవీస్ కోరారు. జూన్ 29: గురువారం ఉదయానికల్లా మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించడం, దానిపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో సీఎం పదవికి ఉద్ధవ్ రాజీనామా చేశారు. షిండే వర్గం ఎమ్మెల్యేలు గువాహటి నుంచి గోవా చేరుకున్నారు. -
మహా పాలిటిక్స్లో ట్విస్ట్.. రాజ్ థాక్రేతో టచ్లో ఏక్నాథ్ షిండే
మహారాష్ట్రలో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. పొలిటికల్ ఇష్యూ చివరకు సుప్రీంకోర్టును తాకింది. సీఎం ఉద్ధవ్ థాక్రే వర్గం, శివసేన తిరుగుబాటు టీమ్ ఏక్నాథ్ షిండే మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు.. డిప్యూటీ స్పీకర్ అనర్హతను సవాల్ చేస్తూ షిండే వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. వారి పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర పాలిటిక్స్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేవ(ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాక్రే తెర మీదకు వచ్చారు. సోమవారం ఉదయం రాజ్థాక్రేకు ఏక్నాథ్ షిండే ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో నెలకొన్ని రాజకీయ పరిస్థితులపై చర్చించారు. శివసేన నేతలు ప్రవర్తిస్తున్న తీరు, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి షిండే.. రాజ్ ఠాక్రేను అడిగి తెలుసుకున్నారు. దీంతో వీరి మధ్య సంభాషణ ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: మీకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి.. రెబల్స్కు ఆధిత్య థాక్రే వార్నింగ్ -
మీకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి.. రెబల్స్కు ఆదిత్య థాక్రే వార్నింగ్
మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్టులు చోటుచేసుకుంటన్న విషయం తెలిసిందే. శివసేనకు చెందిన రెబల్ ఎమ్మెల్యేలు ఉద్ధవ్ థాక్రే సర్కార్పై తిరుగుబాటు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం ఉద్దవ్ వర్గం, రెబల్ ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ఏక్నాథ్ షిండే వర్గం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా.. సీఎం ఉద్ధవ్ థాక్రే కుమారుడు మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆదిత్య థాక్రే.. రెబెల్ నేత ఏక్ నాథ్ షిండేపై విరుచుకుపడ్డారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను దోశద్రోహులు అని పేర్కొన్నారు. శివసేనకు ద్రోహం చేసిన వారిని మహారాష్ట్ర ఎప్పటికీ క్షమించదని ఆయన అన్నారు. ద్రోహులుగా ఉన్న రెబెల్ ఎమ్మెల్యేలను మాత్రం తిరిగి పార్టీలోకి తీసుకోబోమని ఆదిత్య థాక్రే అన్నారు. రెబల్ ఎమ్మెల్యేలకు దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఈ క్రమంలో ఏక్నాథ్ షిండేకు తమను ఎదుర్కొనే దమ్ములేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో తిరుగుబాటు చేసే ధైర్యం లేక గుజరాత్లోని సూరత్కు వెళ్లి.. పార్టీ నేతలతో తిరుగుబాటు చేశారని ఆరోపించారు. శివసేన ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసి బలవంతంగా అసోంకు తరలించారని అన్నారు. ప్రస్తుతం శివసేన ఎమ్మెల్యేకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బీజేపీలో చేరడం లేదా ప్రహార్లో చేరడం అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం 10 గంటలకు ఏక్నాథ్ షిండే మీడియా సమావేశంలో మాట్లాడనున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: బీజేపీని ఓడించే దమ్ములేదని తేలింది.. -
సీఎం థాక్రేకు రెబల్ ఎమ్మెల్యే షిండే లేఖ.. ఘాటు వ్యాఖ్యలు
మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ప్రభుత్వం, సీఎం ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు చేశారు. ఈ క్రమంలో మరో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు నాయకత్వం వహిస్తున్న ఏక్నాథ్ షిండే.. సీఎం ఉద్ధవ్ థాక్రేకు గురువారం మూడు పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో షిండే ఘాటుగా స్పందించారు. సీఎం థాక్రేను కలిసే ప్రసక్తేలేదని షిండే.. తేల్చి చెప్పారు. ఉద్ధవ్ ప్రతిపాదనలను సైతం షిండే తిరస్కరించారు. ఎమ్మెల్యేలకు ఉద్ధవ్ థాక్రే అపాయింట్మెంట్ దొరకడం లేదు. ఎమ్మెల్యేలను ఏనాడు సీఎం థాక్రే పట్టించుకోలేదుంటూ విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉండగా.. తమ పార్టీ నేతలను బీజేపీ బంధించింది అంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ही आहे आमदारांची भावना... pic.twitter.com/U6FxBzp1QG — Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) June 23, 2022 ఇది కూడా చదవండి: ప్రజలు చస్తుంటే.. రాజకీయాలు చేస్తున్నారా..?: సీఎంపై ఫైర్ -
‘మహా’ సంక్షోభం: సీఎం ఉద్దవ్థాక్రే రాజీనామా?
ముంబై: మహారాష్ట్రలో రాజకీయాలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ ‘ఆపరేషన్ కమలం’ దెబ్బకు మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని సర్కార్ కుప్పకూలే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆ శివసేన నేతల వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ రద్దయ్యే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా సీఎం ఉద్దవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే.. ఇప్పటికే ట్విట్టర్ ఖాతాలో ఉన్న మంత్రి హోదాను తొలగించారు. ఇదిలా ఉండగా.. ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం కేబినెట్ భేటి జరగనుంది. అలాగే, సాయంత్రం 5 గంటలకు పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం ఉద్దవ్ థ్రాకే సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. महाराष्ट्रातील राजकीय घडामोडींचा प्रवास विधान सभा बरखास्तीचया दिशेने.. — Sanjay Raut (@rautsanjay61) June 22, 2022 -
Maharashtra Political Crisis: అసోంకు మారిన ‘మహా’ రాజకీయం.. ఖుషీలో కమలం నేతలు!
ముంబై: మహారాష్ట్రలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. బీజేపీ ‘ఆపరేషన్ కమలం’ దెబ్బకు మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని పాలక సంకీర్ణం సంక్షోభంలో పడింది. శివసేన చీఫ్, సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న పార్టీ కీలక నేత, రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి ఏక్నాథ్ షిండే (58) తిరుగుబావుటా ఎగురవేసిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రే వారందరినీ ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన బీజేపీ పాలిత గుజరాత్లోని సూరత్లో ఓ హోటల్కు తరలించారు. కాగా, బుధవారం ఉదయానికి వీరంతా బీజేపీ పాలిత అసోంకు చేరుకున్నారు. గుహవటిలో విమానాశ్రయంలో ఏక్నాథ్ షిండే మీడియాతో మాట్లాడుతూ.. తనతో శివసేనకు చెందిన 40 మంది(33 మంది శివసేన ఎమ్మెల్యే, 7 స్వతంత్రులు) ఎమ్మెల్యే ఉన్నారని అన్నారు. తామంతా బాలా సాహెబ్ హిందుత్వ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తాము అని అన్నారు. ఈ సందర్భంగా వారిని రిసీవ్ చేసుకునేందుకు వచ్చిన అసోం బీజేపీ ఎమ్మెల్యే సుశాంత బోర్గోవైన్ విమానాశ్రయానికి వచ్చారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎంత మంది ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చారో తెలియదు. వారంతా కేవలం వ్యక్తిగత కారణాల వల్లే ఇక్కడికి వచ్చారని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. నేడు(బుధవారం) మహారాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు కేబినెట్ సమావేశం జరుగనుంది. భవిష్యత్ కార్యాచరణపై కీలక జరిగే అవకాశం ఉంది. #WATCH | "A total of 40 Shiv Sena MLAs are present here. We will carry Balasaheb Thackeray's Hindutva," said Shiv Sena leader Eknath Shinde after arriving in Guwahati, Assam pic.twitter.com/YpSrGbJvdt — ANI (@ANI) June 22, 2022 ఇది కూడా చదవండి: మళ్లీ ఆపరేషన్ కమలం... ‘మహా’ సంక్షోభం -
శివసేన, సిక్కు వర్గాల మధ్య ఘర్షణలు.. రాళ్లు రువ్వి, కత్తులు దూసి
చండీగఢ్: పంజాబ్లోని పాటియాలాలోని కాళీమాత ఆలయం సమీపంలో శుక్రవారం శివసేన కార్యకర్తలు, సిక్కు వర్గాల మధ్య మధ్య ఘర్షణలు చోటుచేసుకుంది. ఒక గ్రూప్ వారు మరో గ్రూప్పై రాళ్లు రువ్వుకున్నారు. కత్తులు దూశారు. పంజాబ్ శివసేన వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ సింగ్లా నాయకత్వంలో పాటియాలాలో ఆ పార్టీ కార్యకర్తలు ఖలిస్తానీ గ్రూపులకు వ్యతిరేకంగా ర్యాలీ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. ఇరు వర్గాల వారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఒకరితో ఒకరు ఘర్షణకు దిగారు. శివసేన కార్యకర్తలు ఖలిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేయగా.. వీరికి వ్యతిరేకంగా సిక్కు వర్గాలు కత్తులు చేతిలో పట్టుకొని వీధుల్లోకి వచ్చారు. దీంతో ఇరువర్గాలు రాళ్ల దాడులతో విరుచుకుపడ్డారు. కత్తులు దూయడంతో పాటియాలలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సంఘటన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. హరీశ్ సింగ్లా మాట్లాడుతూ, పంజాబ్లో ఖలిస్థానీ గ్రూపులు ఏర్పడటానికి శివసేన అవకాశం ఇవ్వబోదని చెప్పారు. చదవండి: వరుడి నిర్వాకం... ఊహించని షాక్ ఇచ్చిన వధువు #WATCH | Punjab: A clash broke out between two groups near Kali Devi Mandir in Patiala today. Police personnel deployed at the spot to maintain law and order situation. pic.twitter.com/yZv2vfAiT6 — ANI (@ANI) April 29, 2022 పాటియాలాలో పరిస్థితులు చేయి దాటిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. కాగా ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందించారు. పాటియాలాలో ఘర్షణలు జరగడం చాలా దురదృష్టకరమని తాను డీజీపీతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. ప్రస్తుతం పాటియాలాలో పరిస్థితులు పునరుద్ధరిరంచినట్లు పేర్కొన్నారు. పరిస్థితిని పరిశీలిస్తున్నామని, రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ఎవరినీ అనుమతించమని స్పష్టం చేశరు. పంజాబ్లో శాంతి, సామరస్యం కాపాడటం చాలా ముఖ్యమని భగవంత్ మాన్ అన్నారు. The incident of clashes in Patiala are deeply unfortunate. I spoke with the DGP, peace has been restored in the area. We are closely monitoring the situation and will not let anyone create disturbance in the State. Punjab’s peace and harmony is of utmost importance. — Bhagwant Mann (@BhagwantMann) April 29, 2022 పాటియాలా డిప్యూటీ కమిషనర్ సాక్షి సాహ్నీ మాట్లాడుతూ, ప్రజలు శాంతియుతంగా ఉండాలని, వదంతులను నమ్మవద్దని కోరారు. పాటియాలతోపాటు పంజాబ్ ప్రజలంతా సోదరభావంతో మెలగాలని కోరారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్నారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అన్ని చర్యలు తీసుకుంటున్నారు తెలిపారు. -
PM Modi: మోదీకి హనుమాన్ చాలీసా ఎఫెక్ట్
దేశంలో హనుమాన్ చాలీసా పఠనంపై ఇంకా ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో శివసేన, బీజేపీ, ఎన్సీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన మహిళా నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీకి చెందిన ఫహ్మిదా హసన్ ఖాన్.. తనకు ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ఎదుట(ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని మోదీ అధికారిక నివాసం) హనుమాన్ చాలీసా, నమాజ్, దుర్గా చాలీసా, నమోకర్ మంత్రం (జైన్ శ్లోకం), గురు గ్రంథ్ సాహిబ్ (సిక్కు గ్రంథం) చదివేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. అనంతరం తాను హనుమాన్ చాలీసా పఠిస్తానని, తన ఇంట్లో దుర్గాపూజ కూడా చేస్తానని ఎంఎస్ ఖాన్ చెప్పారు. దీంతో ఆమె లేఖ చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. హనుమాన్ చాలీసా చాలెంజ్తో ముంబైలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన విషయం తెలిసిందే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని నవనీత్ రాణా మొదట్లో దంపతులు ప్రకటించారు. ఆ తర్వాత విరమించుకున్నారు. వీళ్లకు కౌంటర్గా శివ సేన కార్యకర్తలు రంగంలోకి దిగడంతో ముంబైలో హైటెన్షన్ నెలకొంది. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి వారిలో కోర్టులో హాజరు పరుచగా.. వీరిద్దరికీ మే 6 వరకూ జుడీషియల్ రిమాండ్ విధిస్తున్నట్లు బాంద్రా మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ హాలిడే అండ్ సన్డే కోర్టు ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు బిగ్ షాక్ -
దమ్ముంటే దావూద్ ఇబ్రహీంను పట్టుకొని చంపండి.. మోదీకి సవాల్
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సతీమణి సోదరుడైన శ్రీధర్ పాటన్కర్కు వ్యతిరేకంగా ఈడీ చర్యలు చేపట్టింది. ఇందులో బాగంగా సుమారు రూ. 6.45 కోట్ల విలువలైన ఆస్తులను మంగళవారం జప్తు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే.. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ..‘‘ మీరు(బీజేపీ) అధికారంలోకి రావాలంటే రండి. అయితే అధికారంలోకి రావడానికి ఈ దుర్మార్గపు పనులన్నీ చేయకండి. అధికారం కోసం మరొకరి కుటుంబ సభ్యులను వేధించకండి. మేము మీ కుటుంబ సభ్యులను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. మీ(బీజేపీ) కుటుంబ సభ్యులు తప్పు చేశారని, కాషాయ నేతలను ఇబ్బంది పెట్టగలమని తాము చెప్పడం లేదు. బీజేపీ అధికారంలోకి రావడం కోసం తమను(ఉద్ధవ్ ఠాక్రే, కుటుంబ సభ్యులు) జైలులో పెట్టాలనుకుంటే పెట్టండి’’ అని విమర్శించారు. అంతకు ముందు.. మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మంత్రి నవాబ్ మాలిక్ రాజీనామాను బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన తీవ్రంగా మండిపడ్డారు. నవాబ్ మాలిక్కు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉందని, ఈ విషయం మాజీ సీఎం ఫడ్నవీస్కు కూడా తెలుసని ఆయన ఘాటుగా స్పందించారు. అసలు దావూద్ ఎక్కడుంటాడు? ఎవరికైనా తెలుసా? అంటూ ప్రశ్నించారు. బీజేపీకి నిజంగా దమ్ముంటే దావూద్ను పట్టుకుని చంపేస్తారా? అని ప్రధాని మోదీకి ఉద్ధవ్ ఠాక్రే సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే బీజేపీ గత ఎన్నికల్లో రామ మందిరం పేరు మీదుగా ఓట్లు అడిగిందని, ఇప్పుడు దావూద్ పేరు మీద ఓట్లు అడగానికి సిద్ధపడిందా? అంటూ విమర్శలు గుప్పించారు. మంత్రి నవాబ్ మాలిక్ నిజంగా దావూద్తో సంబంధాలుంటే కేంద్ర దర్యాప్తు బృందాలు ఇన్ని రోజులు ఎందుకు దాడులు చేయలేదని, ప్రశ్నించలేదని బీజేపీని నిలదీశారు. -
బీజేపీ మంత్రికి శివసేన వార్నింగ్.. మేము మీకు ‘బాప్’ అంటూ..
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో అధికార శివసేన, బీజేపీ నేతల మధ్య మాటల యుద్థం నడుస్తోంది. కేంద్ర మంత్రి నారాయణ్ రాణే వ్యాఖ్యలకు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కౌంటర్ ఇచ్చారు. అంతకు ముందకు రాణే శుక్రవారం మాట్లాడుతూ.. థాక్రే కుటుంబం, శివసేన జాతకం తన వద్ద ఉందని ఎవరినీ విడిచిపెట్టమంటూ వ్యాఖ్యలు చేశారు. సీఎం ఉద్దవ్ థాక్రే నివాసం ‘మాతోశ్రీ’లో నలుగురు వ్యక్తుల కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో శనివారం సంజయ్ రౌత్ స్పందిస్తూ.. ఇలాంటి బెదిరింపులను తాము లెక్కచేయమని, రాణే జాతకం కూడా తన వద్ద ఉందంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే మీరు కేంద్ర మంత్రి కావచ్చు.. కానీ ఇది మహారాష్ట్ర.. మేము మీకు ‘బాప్’ ఇది మర్చిపోవద్దంటూ కామెంట్స్ చేశారు. బీజేపీ బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. తాము నిజంగా కుంభకోణాలకు పాల్పడితే వాటికి సంబంధించిన పత్రాలను కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలని బీజేపీ మాజీ ఎంపీ సోమయ్యకు సోమయ్యకు సవాల్ విసిరారు. ఈ సందర్భంగానే తాము కూడా సోమయ్యకు సంబంధించిన కుంభకోణాలను బయటపెడతామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమయ్య పోవాయ్లోని పెరూ బాగ్లో మురికివాడల పునరావాస ప్రాజెక్ట్ ద్వారా సోమయ్య రూ. 300 కోట్లకు పైగా దోపిడీ చేశారని రౌత్ ఆరోపించారు. అలాగే, పాల్ఘార్లో రూ. 260 కోట్ల విలువైన ప్రాజెక్ట్ విషయంలో కుంభకోణాన్ని బయటపెడతామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న క్రిమినల్ సిండికేట్ను అంతం చేస్తామంటూ సంజయ్ రౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుంభకోణాలకు సంబంధించిన ప్రతీ సమాచారాన్ని బహిర్గతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. -
అరవింత్ సావంత్పై సంచలన ఆరోపణలు చేసిన నవనీత్ కౌర్
-
శివసేన ఎంపీ యాసిడ్ పోస్తానన్నాడు: నవనీత్ కౌర్
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో మాట్లాడితే తనపై యాసిడ్ పోస్తానని.. జైలుకు పంపుతామని శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తనను బెదిరించారని నటి, అమరావతి స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ రానా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, తనపై యాసిడ్ దాడి చేస్తామని బెదిరింపు కాల్స్తో పాటు శివసేన పార్టీ లెటర్ హెడ్తో కూడిన లేఖలు వచ్చినట్టు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు నవనీత్ కౌర్ ఫిర్యాదు చేశారు. అయితే, నవనీత్ కౌర్ ఆరోపణలను ఎంపీ అరవింద్ సావంత్ ఖండించారు. అంతేకాదు, మహిళా సభ్యురాలిని ఎవరైనా బెదిరిస్తే.. తాను ఆమెకు మద్దతుగా నిలుస్తానని అన్నారు. తనకు రాసిన బెదిరింపు లేఖపై తేదీని మార్చి 22గా పేర్కొన్నారని నవనీత్ కౌర్ తెలిపారు. ‘శివసేన పార్లమెంట్ సభ్యుడు అరవింద్ సావంత్ బెదిరించారు.. ఇది కేవలం నాకు జరిగిన అవమానం మాత్రమే కాదు, దేశంలోని మహిళలందరికీ జరిగిన అవమానం.. అరవింద్ సావంత్పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి’ అని నవనీత్ కౌర్ డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల గురించి పార్లమెంట్లో ప్రస్తావించడం పట్ల సావంత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు నవనీత్ కౌర్ పేర్కొన్నారు. ‘నువ్వు మహారాష్ట్రలో ఎలా తిరుగుతావో చూస్తా... నిన్ను జైల్లో వేసి నీ చేత ఊచలు లెక్కబెట్టిస్తాం’ అని అరవింద్ సావంత్ తనను లోక్సభ లాబీలో బెదిరించినట్లు తెలిపారు. ‘ఆయన మాటలకు నాకు మతిపోయినట్లయ్యింది. ఒక్కసారిగా సావంత్వైపు తిరిగాను.. నా పక్కనే మరో ఎంపీ ఉన్నారు.. ‘సావంత్ మాటలను మీరు విన్నారా’ అని ఆయనను అడిగితే.. ‘విన్నాను’ అని చెప్పారు’ అంటూ నవనీత్ తాను ఎదుర్కొన్న బెదిరింపుల ఘటనను వివరించారు. సావంత్ బెదిరించినప్పుడు నవనీత్ కౌర్ పక్కన రాజమండ్రి వైఎస్ఆర్సీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఉన్నట్లు న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించింది. ‘పోలీసులు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయడానికి ముందు శివసేన పేరుతో బెదిరింపులు లేఖలు వచ్చాయి. అంతేకాక ‘‘ఉద్ధవ్ ఠాక్రే గురించి మాట్లాడుతున్నావ్ కదా.. నీకు అందమైన ముఖం ఉందని మురిసిపోతున్నావు.. దానిపై యాసిడ్ పోస్తే ఎక్కడకీ తిరగలేవు అంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్లు చేశారు’ అని నవనీత్ ఆరోపించారు. అరవింద్ సావంత్ నవనీత్ ఆరోపణలపై స్పందించారు. ‘నా జీవితంలో ఎవరినీ ఇప్పటి వరకూ బెదిరించలేదు.. అలాంటిది ఓ మహిళను నేను బెదిరించడం ఏంటి’ అన్నారు. కేవలం పబ్లిసిటీ కోసమే నవనీత్ కౌర్ ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని.. వాటిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ముకేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని నిలిపిన కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం సచిన్ వజేని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై లోక్సభలో వాడీవేడి చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో నవనీత్ కౌర్ రానా లోక్సభలో ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘‘మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ అవినీతి ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయాలి’’ అని డిమాండ్ చేశారు. అయితే సావంత్ నవనీత్ వ్యాఖ్యలని ఖండించారు. ఆమె చేసే ఆరోపణలన్ని అవాస్తవలన్నారు. అంతేకాక సీఎం ఠాక్రే గురించి మాట్లాడేటప్పుడు ఆమె అంత దూకుడుగా ప్రవర్తించడం ఏంటని ప్రశ్నించారు. చదవండి: యాసిడ్ ఓడింది జంట కలిసింది వాజే టార్గెట్ వంద కోట్లు -
ఠాక్రేకు షాకిచ్చిన సీనియర్ నేత..
సాక్షి, ముంబై : కల్యాణ్–డోంబివలి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుల బెడద అధికమైంది. పార్టీ ఉపాధ్యక్షుడు రాజేశ్ కదం మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎంఎన్ఎస్) నుంచి బయటపడి శివసేన తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఎంఎన్ఎస్ మాజీ ప్రతిపక్ష నాయకుడు మందార్ హలబే సైతం ఆ పార్టీకి గుడ్బై చెప్పేశారు. ఆయన మంగళవారమే బీజేపీలో చేరడం కలకలం సృష్టించింది. దీంతో డోంబివలిలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనకు చెందిన పలువురు కీలక నాయ కులు, పదాధికారులు, కార్యకర్తలు పార్టీ నుంచి బయట పడే అవకాశం ఉంది. వీరంతా శివసేన, బీజేపీలో చేరడం వల్ల వచ్చే ఎన్నికల్లో డోంబివలిలో ఎంఎన్ఎస్కు గట్టి దెబ్బ తగలడం ఖాయమని స్పష్టమవుతోంది. అంతేగాకుండా స్థానికంగా ఎంఎన్ఎస్ ప్రాబల్యం తగ్గిపోయి, వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు తారుమారయ్యే ప్రమా దం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజు పాటిల్పై బాధ్యతలు.. ఎంఎన్ఎస్కు చెందిన డోంబివలి నగర అధ్యక్షుడు, ఎంఎన్ఎస్ ఉపాధ్యక్షుడు రాజేశ్ కదం, తన సహచరులతో కలిసి సోమవారం సాయంత్రం శివసేనలో చేరారు. రాజేశ్ కదం శివసేనలో చేరడానికి శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే ప్రధాన పాత్ర పోషించారు. మాతోశ్రీ బంగ్లాలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, థానే జిల్లా ఇన్చార్జీ మంత్రి ఏక్నాథ్ షిండే సమక్షంలో రాజేశ్ శివసేనలో చేరారు. గతంలో శివసేనలో కొనసాగిన రాజేశ్ కదం ఎంఎన్ఎస్ స్థాపించిన తరువాత రాజ్ ఠాక్రేతోపాటు ఆయన కూడా బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఎంఎన్ఎస్లో కొనసాగిన రాజేశ్ కదం ఇలా అకస్మాత్తుగా పార్టీ మారడం జీర్ణించుకోలేకపోతున్నారు. రాజేశ్ శివసేనలో చేరి 24 గంటలు గడవక ముందే అంటే మంగళవారం ఎంఎన్ఎస్ కార్పొరేటర్, మాజీ ప్రతిపక్ష నాయకుడు మందార్ హలబే బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ సమక్షంలో బీజేపీలో చేరారు. మందార్ రాజ్ ఠాక్రేకు అతి సన్నిహితుడని, డోంబివలిలో తిరుగులేని నాయకుడిగా పేరుంది. ఇలా వరుసగా ఇరువురు కీలక నాయకులు పార్టీ నుంచి బయటపడటంవల్ల భవిష్యత్తులో ఎంఎన్ఎస్కు నష్టం వాటిళ్లే ప్రమాదం లేకపోలేదు. వీరి కారణంగా డోంబవలిలో ఎమ్మెన్నెస్ బలహీనపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎంఎన్ఎస్ ఎమ్మెల్యే రాజు పాటిల్ త్వరలో జరగనున్న డోంబివలి కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీని ఎలా బలోపేతం చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. స్థానిక ఎన్నికల బాధ్యతలు ఆయనకే అప్పగించే సూచనలున్నాయి. ఇదిలా ఉండగా రాజేశ్ కదం శివసేనలో చేరడంవల్ల డోంబివలి నగర అధ్యక్ష పదవి మళ్లీ మనోజ్ ఘరత్కు కట్టబెట్టారు. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే సమక్షంలో ఆయన ఈ పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో మనోజ్ మూడేళ్లు నగర అధ్యక్ష పదవిలో కొనసాగారు. ఇప్పుడు మళ్లీ పదవీ బాధ్యతలు స్వీకరించడంతో పార్టీలో నూతనోత్తేజాన్ని నింపినట్లయింది. బీజేపీతో కలుస్తారా? ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొత్త రాజకీయ సమీకరణాలు కనిపించే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు కలిసికట్టుగా పోటీ చేసిన శివసేన, బీజేపీలు రాబోయే ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయనున్నారు. మరోవైపు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కూడా కలిసి పోటీ చేసే అవకాశాలున్నాయి. ఇదిఇలాఉండగా మరోవైపు ఈ మూడు పార్టీలు కలిస్తే వీరిని అడ్డుకునేందుకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్)తో బీజేపీ చేతులు కలిపే అవకాశాలున్నాయి. దీనిపై ఇప్పటికే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అనేక సంవత్సరాలుగా బీఎంసీలో తిరుగులేని పార్టీగా కొనసాగుతున్న శివసేనను అధికారానికి దూరం చేయాలని బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో శివసేనను దెబ్బతీయడానికి వచ్చే బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఎంఎన్ఎస్తో జతకడుతుండవచ్చని వార్తలు వచ్చాయి. అనుకున్న విధంగానే ఇటీవలె బీజేపీ ఎమ్మెల్యే ప్రసాద్ లాడ్ ఎమ్ఎన్ఎస్ చీఫ్ రాజ్ఠాక్రేతో భేటీ కావడంతో వార్తలు నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఎంసీ ఎన్నికల్లో శివసేనను ఢీకొట్టడానికి బీజేపీ, ఎంఎన్ఎస్ ఒక్కటవుతాయా లేదా అన్ని పార్టీలు ఒంటరిగానే బరిలోకి దిగనున్నాయా అనేది వేచి చూడాల్సిందే. -
మహా గవర్నర్ రీకాల్కు సేన డిమాండ్
ముంబై : ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి వ్యవహరిస్తున్నారని పాలక శివసేన ఆరోపించింది. గవర్నర్ స్ధానంలో కూర్చున్న వ్యక్తి చేయకూడని రీతిలో ఆయన పనిచేస్తున్నారని పార్టీ పత్రిక సామ్నాలో శివసేన విమర్శలు గుప్పించింది. రాజ్భవన్ ప్రతిష్టను కాపాడాలాని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా భావిస్తే గవర్నర్ కోష్యారిని వెంటనే రీకాల్ చేయాలని డిమాండ్ చేసింది. ‘ఆయన సంఘ్ ప్రచారక్ లేదా బీజేపీ నేత కావచ్చు..కానీ ఆయన ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్ హోదాలో ఉన్న విషయం మరువరాద’ని హితవు పలికింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు గవర్నర్ లేఖ పంపడం అవాంఛనీయ చర్యగా శివసేన అభివర్ణించింది. ఉద్ధవ్ ఠాక్రేకు ఇటీవల కోష్యారి రాసిన లేఖలో మీరు ఒక్కసారిగా సెక్యులర్గా మారారా అంటూ ప్రశ్నించడాన్ని సేన ప్రస్తావించింది. సీఎంకు లేఖ రాసిన సమయంపైనా శివసేన మండిపడుతూ కోష్యారి బీజేపీ అజెండాను ముందుకు తీసుకువెళుతున్నారని వ్యాఖ్యానించింది. -
‘ఎన్డీయే రెండు సింహాలను వదులుకుంది’
ముంబై : ఎన్డీయే నుంచి శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) బయటకు వచ్చిన క్రమంలో బీజేపీ నేతృత్వంలోని కూటమిపై శివసేన విమర్శలతో విరుచుకుపడింది. ఎన్డీయే కూటమి నుంచి రెండు సింహాలు ఎస్ఏడీ, శివసేన తెగతెంపులు చేసుకున్నాయని, ఇక ఆ కూటమిలో ఇప్పుడు ఉన్నది ఎవరని శివసేన ప్రశ్నించింది. అకాలీదళ్ను కూటమి నుంచి వెళ్లకుండా నిరోధించేందుకు ఎన్డీయే ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఆశ్చర్యపరిచిందని పార్టీ పత్రిక సామ్నా ఎడిటోరియల్లో శివసేన రాసుకొచ్చింది. పార్లమెంట్లో వ్యవసాయ బిల్లుల ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ చిరకాల మిత్రపక్షం ఎస్ఏడీ శనివారం ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. రైతులకు కనీస మద్దతు ధరను అందిస్తూ రైతుల ఉత్పత్తుల కొనుగోలుపై చట్టపరమైన భరోసా ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించడంతో ఎన్డీయే కూటమి నుంచి వైదొలగామని అకాలీదళ్ స్పష్టం చేసింది. బాదల్లు ఎన్డీయేను వీడుతున్న క్రమంలో వారిని నిలువరించేందుకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు..గతంలో శివసేన సైతం ఎన్డీయేను వీడింది..ఈ రెండు పార్టీల నిష్క్రమరణ తర్వాత ఎన్డీయే దగ్గర ఎవరు మిగిలారని శివసేన ప్రశ్నించింది. ఎన్డీయేతో ఇప్పటికీ ఉంటున్న పార్టీలు అసలు హిందుత్వ కోసం కట్టుబడ్డాయా అని శివసేన ప్రశ్నించింది. చదవండి : ముంబై నుంచి పార్శిల్ చేస్తాం: రౌత్ -
ఇప్పుడు మీ నోళ్లు మూసుకుపోయాయా : శివసేన
సాక్షి, ముంబై : పైర్ బ్రాండ్ కంగనా రనౌత్పై శివసేన చేస్తున్న ఆరోపణలపై ఆమె తీవ్రంగా స్పందించింది. తాను రైతులను ఉగ్రవాదులు అని సంబోధించలేదని, ఒకవేళ అలా అనుంటే నిరూపించాలని డిమాండ్ చేసింది. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఇలాంటి ఆరోపణలు నిరూపిచంగలిగితే తక్షణమే క్షమాపణలు చెప్పి శాశ్వతంగా ట్విట్టర్ నుంచి వైదొలుగుతానంటూ పేర్కొంది. అంతేకాకుండా శ్రీకృష్ణుడికి నారాయణి సైన్యం ఉన్నట్లే, పప్పుకు తన చంపు సైన్యం ఉంటుందంటూ శివసేన గురించి విమర్శనాస్ర్తాలు సంధించింది. పార్లమెంటులో ఆమోదం పొందిన రెండు వ్యవసాయ బిల్లులు రాజ్యసభ ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ బిల్లులు రైతులు సాధికారికత సాధించేలా తోడ్పడతాయంటూ మోదీ చేసిన ట్వీట్కు స్పందనగా ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ చేసిన ట్వీట్ రాజకీయాల్లో హోట్ టాపిక్గా మారింది. (రైతులకు శుభాకాంక్షలు: ప్రధాని మోదీ) ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ కొందరు నిరసనకారులు సీఏఏ తరహాలోనే ఉగ్రవాదుల వలె రక్తపాతం సృష్టిస్తారంటూ కంగనా చేసిన ట్వీట్ను శివసేన తనకు అనుకూలంగా మరల్చుకుంది. వారి హక్కులకోసం పోరాడుతున్న రైతులను కంగనా ఉగ్రవాదులు అని సంబోధించడం ఏంటని ప్రశ్నించింది. శివసేన తన సంపాదకీయం సామ్నాలో కంగనాపై విరుచుకుపడింది. గతంలో ఓ నటి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే చాలు రాజకీయ పార్టీలన్నీ పాముల్లా తమపై విషం చిమ్మారు..మరి ఇప్పుడేమైంది? రైతులను ఉగ్రవాదులుగా, ముంబైని పాకిస్తాన్తో పోల్చి మాట్లాడినా బీజేపీ ఎందుకు మౌనం వహిస్తోందంటూ ఆరోపించింది. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులను పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులు సహా పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, కేంద్రం తెచ్చిన బిల్లులు నిరసనలకు దారితీశాయని సంపాదకియంలో పేర్కొంది. (డ్రగ్స్ వాడకం ఫలితమే డిప్రెషన్: కంగనా) जैसे श्री कृष्ण की नारायणी सेना थी, वैसे ही पप्पु की भी अपनी एक चंपू सेना है जो की सिर्फ़ अफ़वाहों के दम पे लड़ना जानती है, यह है मेरा अरिजिनल ट्वीट अगर कोई यह सिद्ध करदे की मैंने किसानों को आतंकी कहा, मैं माफ़ी माँगकर हमेशा केलिए ट्वीटर छोड़ दूँगी 🙏 https://t.co/26LwVH1QD9 — Kangana Ranaut (@KanganaTeam) September 21, 2020 -
శివసైనికుల దాడి : బీజేపీలో చేరిన నేవీ అధికారి
ముంబై : ఓ కార్టూన్ వివాదంపై శివసేన సభ్యులచే దాడికి గురైన రిటైర్డ్ నౌకాదళ అధికారి మదన్ శర్మ బీజేపీ, ఆరెస్సెస్లో చేరినట్టు మంగళవారం స్వయంగా వెల్లడించారు. తాను బీజేపీలో చేరానని, మహారాష్ట్రలో ఎలాంటి గూండాగిరి జరగకుండా అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోష్యారితో తాను సమావేశమయ్యానని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరగా..దీనిపై కేంద్రంతో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారని శర్మ తెలిపారు. చట్టం రెండు రకాలుగా ఎందుకు వ్యవహరిస్తోందో అర్ధం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నేతను మరోలా, సాధారణ పౌరుడిని మరో రకంగా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. గవర్నర్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై దాడి ఘటనను గవర్నర్కు వివరించానని, ఈ ఘటనపై నిందితులపై ప్రయోగించిన సెక్షన్లు బలహీనంగా ఉన్నాయని చెప్పానన్నారు. తన వినతిపత్రంపై చర్యలు చేపడతానని గవర్నర్ తనకు హామీ ఇచ్చారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని కోరగా, కేంద్రంతో మాట్లాడతానని గవర్నర్ భరోసా ఇచ్చారని రిటైర్డ్ నేవీ అధికారి మదన్ శర్మ చెప్పుకొచ్చారు. కాగా ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేపై కార్టూన్ను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు శర్మపై సేన కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు సేన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి ఆపై బెయిల్పై విడుదల చేశారు. చదవండి : ‘కంగనా ఓ మెంటల్ కేసు’ -
రనౌత్ వర్సెస్ రౌత్ : బీజేపీని టార్గెట్ చేసిన సేన నేత
ముంబై : శివసేన నేత సంజయ్ రౌత్ నేరుగా బీజేపీపై ఆదివారం విమర్శలు గుప్పించారు. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)తో పోల్చిన వారిని బీజేపీ సమర్ధిస్తోందని దుయ్యబట్టారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకే బీజేపీ బాలీవుడ్ ఫైర్బ్రాండ్కు మద్దతివ్వాలని నిర్ణయించిందని కంగనా రనౌత్ పేరు ప్రస్తావించకుండా పేర్కొన్నారు. ముంబైని పీఓకేగా, బీఎంసీని బాబర్ సైన్యంతో పోల్చిన వారికి మహారాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం కొమ్ముకాయడం దురదృష్టకరమని పార్టీ పత్రిక సామ్నాలో రాసిన వ్యాసంలో సంజయ్ రౌత్ అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అగ్రవర్ణ రాజ్పుత్, క్షత్రియ ఓట్లను ఆకట్టుకోవడం కోసమే బీజేపీ ప్రయత్నమని దుయ్యబట్టారు. మహారాష్ట్రను అవమానపరిచిన వారికి మద్దతిస్తూ బిహార్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా బీజేపీ పనిచేస్తోందని విమర్శించారు. జాతీయవాదులుగా చెప్పుకునే వారికి ఇది తగదని మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తున్నా మహారాష్ట్ర బీజేపీ నేతలెవరూ నోరు మెదపడంలేదని అన్నారు. ముంబై ప్రాధాన్యతను తగ్గించేందుకు ప్రణాళికాబద్ధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, నగర ప్రతిష్టను దిగజార్చే కుట్రలో భాగంగా ఇలా జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మహారాష్ట్రలో మరాఠాలంతా ఏకమవ్వాల్సిన సంక్లిష్ట సందర్భమని శివసేన నేత వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రజలను ఓ నటి అవమానిస్తుంటే బీజేపీ నేతలు స్పందించడం లేదని, ఇది ఎలాంటి స్వేచ్ఛకు ప్రతీకని ప్రశ్నించారు. ఆ నటి (కంగనా రనౌత్) ముంబైని పీఓకేతో పోల్చితే ఏ ఒక్కరూ మాట్లాడలేదని రౌత్ బాలీవుడ్పైనా విమర్శలు గుప్పించారు. చదవండి : బాలీవుడ్ క్వీన్కు మరో షాక్ కంగనా అభిప్రాయాలు సినీ పరిశ్రమ అభిప్రాయాలు కాదని బాలీవుడ్ ప్రతినిధులు స్పష్టం చేయాలని కోరారు. కనీసం అక్షయ్ కుమార్ అయినా స్పందించాలని అన్నారు. ముంబై పట్ల కృతజ్ఞత చూపేందుకు కొందరికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చురకలు వేశారు. వారికి ముంబై ప్రాధాన్యత కేవలం డబ్బు సంపాదించేందుకేనని, ముంబైని ఎవరైనా రేప్ చేసినా వారికి పట్టదని రౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా నటుడు సుశాంత్ కేసులో ముంబై పోలీసుల దర్యాప్తుపై తనకు నమ్మకం లేదని కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలతో వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ముంబై పోలీసులపై విశ్వాసం లేకుంటే నగరంలో ఉండరాదని శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించడంతో కంగనా, శివసేనల మధ్య వివాదం ముదిరింది. -
రనౌత్ వర్సెస్ రౌత్ : శివసేన నేతకు కీలక పదవి
ముంబై : బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్తో వివాదానికి కేంద్ర బిందువైన శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు ఆ పార్టీ కీలక పదవిని కట్టబెట్టింది. సంజయ్ రౌత్ను పార్టీ ముఖ్య అధికార ప్రతినిధిగా శివసేన నియమించింది. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)తో పోల్చిన కంగనా రనౌత్పై సంజయ్ రౌత్ కొద్దిరోజులుగా విమర్శలతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ముంబైని పీఓకేతో పోల్చిన కంగనాను నగరంలో అడుగుపెట్టవద్దని సేన నేత పరోక్షంగా హెచ్చరించారు. కాగా, సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో ముంబై పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదని కంగనా అసహనం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది. ఇక కంగనాపై అభ్యంతరకర వ్యాఖ్యలను ఉపసంహరించుకునేందుకు ఆయన సుముఖత చూపకున్నా తాను ఎంచుకున్న పదాలు మరింత మెరుగ్గా ఉంటే బావుండేదని ఓ ఇంటర్వ్యూలో అంగీకరించారు.మరోవైపు బాలీవుడ్ క్వీన్ కంగనా ఈనెల 9న ముంబైకు రానుండటంతో ఆమెకు భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కంగనాకు వై సెక్యూరిటీ కల్పించడంతో మనాలీలోని ఆమె నివాసం వద్ద పెద్దసంఖ్యలో పోలీసులను నియమించారు. ముంబై పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఐబీ, సీఆర్పీఎఫ్ అధికారులు ఆమె నివాసానికి చేరుకున్నారు. చదవండి : ‘కంగనా ఓ మెంటల్ కేసు’ -
ఆమె వ్యాఖ్యలు హిందుత్వకు అవమానకరం!
ముంబై : కోవిడ్-19 ప్రభావంతో నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన దేవుడి చర్య (యాక్ట్ ఆఫ్ గాడ్) వ్యాఖ్యలను శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్ తప్పుపట్టారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుతూ దేవుడ్ని నిందించడం హిందుత్వకు అవమానకరమని సామ్నా పత్రికలో రాసిన వ్యాసంలో ఆయన పేర్కొన్నారు. జీఎస్టీ భేటీలో నిర్మలా సీతారామన్ ఇటీవల మాట్లాడుతూ కరోనా వైరస్ను ఉద్దేశించి దేవుడి చర్య కారణంగా ఆర్థిక కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దేశ ఆర్థిక వ్యవస్థ దైవ చర్యతో కుప్పకూలిందని ఆర్థిక మంత్రి చెప్పడం సరైంది కాదని సంజయ్ రౌత్ మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాన్ని దేవుడిపై నెపం వేసి ఎలా చేతులుదులుపుకుంటారని ఆయన నిలదీశారు. ‘దేవుడి తప్పిదమే అయితే ఏ కోర్టులో ఆయనను విచారిసారు..? ప్రభుత్వ చేతికానితనానికి దేవుడిపై నెపం మోపడం హిందుత్వకు అవమానకరమ’ని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనా శివసేన నేత విమర్శలు గుప్పించారు. ‘మన ప్రధాని అన్ని విషయాల గురించి మాట్లాడతారు..దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థపై మాత్రం నోరుమెదపరు..నోట్ల రద్దు నుంచి లాక్డౌన్ వరకూ సాగిన ప్రయాణంలో మన ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమైంద’ని రౌత్ ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్-19 ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు బ్రెజిల్ సహా పలు దేశాలు తమ పౌరులకు ఆర్థికంగా చేయూత అందించాయని ఆయన చెప్పుకొచ్చారు. ఆయా ప్రభుత్వాలు కోవిడ్-19 సమస్యను దైవ ఘటనగా చూడలేదని, ఆర్థిక సంక్షోభంగానే పరిగణించి పౌరులను ప్రభుత్వాలు ఆదుకున్నాయని అన్నారు. చదవండి : ‘కంగనా ఓ మెంటల్ కేసు’ -
‘కంగనా ఓ మెంటల్ కేసు’
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ క్వీన్, ఫైర్బ్రాండ్ నటి కంగనా రనౌత్ శివసేన నేత సంజయ్ రౌత్ల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ముంబై పోలీసులపై విశ్వాసం లేకుంటే నగరంలోకి రావద్దని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తనను బెదిరించారని కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై శివసేన నేత స్పందించారు.‘ఆమె ఓ మెంటల్ కేసు..తను తినే పళ్లెంలోనే ఉమ్మేసే రకం.. ఆమె వెనుక కొన్ని రాజకీయ పార్టీలున్నా’యని రౌత్ వ్యాఖ్యానించారు. ‘మేం ఎవరినీ బెదిరించబోము...ముంబై నగరాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)తో పోల్చేవారికి పీఓకే గురించి ఏమీ తెలియదు..ముంబై, మహారాష్ట్రలను కించపరచడాన్ని తాము సహించ’మని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. 26/11 దాడుల సమయంలో ముంబై పోలీసులు వారి ప్రాణాలను పణంగా పెట్టి పౌరులను కాపాడారని, 1992 ముంబై పేలుళ్లలోనూ నగరాన్ని, నగర ప్రజలను వారు కాపాడారని కొనియాడారు. కరోనా వైరస్తో పలువురు ముంబై పోలీసులు అధికారులు ప్రాణాలు కోల్పోయారని, రోగుల సేవలో పలు త్యాగాలు చేస్తున్నారని ప్రస్తుతించారు. కాగా సుశాంత్ మృతి కేసుకు సంబంధించి ముంబై పోలీసుల దర్యాప్తుపై కంగనా రనౌత్ ప్రశ్నలు లేవనెత్తడాన్ని ప్రస్తావిస్తూ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలపై కంగనా అభ్యంతరం తెలిపారు. ముంబై పోలీసులపై నమ్మకం లేకపోతే ముంబైలో అడుగుపెట్టరాదని సేన నేత తనను బెదిరించారని, ముంబైని చూస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్లా ఎందుకు కనిపిస్తోందని ఆమె ట్వీట్ చేశారు. చదవండి : పీఓకేను తలపిస్తోన్న ముంబై -
శివసేనలో చేరిన స్వతంత్ర ఎమ్మెల్యే
ముంబై : మహారాష్ట్ర మంత్రి, స్వతంత్ర ఎమ్మెల్యే శంకర్ రావు గదఖ్ అధికార శివసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శంకర్ రావు అహ్మద్ నగర్ జిల్లా నేవాసా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో స్వతంత్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వా శివసేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో చేరి భూమి, జలశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం శివసేనాధిపతి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసమైన మాతోశ్రీకి వచ్చిన శంకర్ రావు శివసేన పార్టీలో చేరారు. తమ పార్టీలో చేరిన శంకర్ రావుకు సీఎం ఠాక్రే శివ బంధన్ను కట్టి పార్టీలోకి ఆహ్వానించారు. (సుశాంత్ కేసు: ‘మహా’ప్రభుత్వంపై కేంద్రం కుట్ర) ఈ కార్యక్రమానికి పార్టీ కార్యదర్శి మిలింద్ నార్వేకర్ కూడా హాజరయ్యారు. కాగా ఇప్పటి వరకు మహా వికాస్ అఘాడి(శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ) ప్రభుత్వంలో ఉన్న ఏకైక స్వతంత్ర ఎమ్మెల్యే కూడా ఆయనే కావడం విశేషం. ప్రస్తుతం శంకర్ రావు పార్టీలో చేరడంతో శాసనసభలో శివసేన బలం 57కు పెరిగింది. యూత్ కాంగ్రెస్ ప్రచారకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన గదఖ్ 2017లో క్రాంతికారి శెట్కారి పక్ష పార్టీని స్థాపించి స్థానిక ఎన్నికల్లో పోటీ చేశారు. (సుశాంత్ కేసు: మహారాష్ట్ర వర్సెస్ బిహార్) महाराष्ट्र राज्याचे मृद व जलसंधारण मंत्री @GadakhShankarao जी यांनी आज मातोश्री निवासस्थानी शिवसेना पक्षप्रमुख, मुख्यमंत्री उद्धव बाळासाहेब ठाकरे यांच्या हस्ते शिवबंधन बांधून शिवसेनेत जाहीर प्रवेश केला. यावेळी शिवसेनेचे सचिव @NarvekarMilind_ जी उपस्थित होते. pic.twitter.com/0obIZOPVhF — ShivSena - शिवसेना (@ShivSena) August 11, 2020 -
గాల్వన్ లోయను చైనాకు వదిలేశారా?
ముంబై: లద్ధాఖ్లోని గాల్వన్ లోయ ప్రాంతంపై సర్వ అధికారాలు తమకే చెందుతాయన్న చైనా ప్రకటనపై కేంద్రం స్పందించాలని శివసేన ఉపాధ్యక్షురాలు, ఎంపీ ప్రియాంక చతుర్వేది డిమాండ్ చేశారు. సరిహద్దుల్లో శాంతి నెలకొనేలా చర్యలకు సిద్ధమంటూనే చైనా పదేపదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ‘మన భూభాగంలోకి ఎవరూ రాలేదని మోదీ దేశానికి హామీ ఇచ్చారు. కానీ గాల్వన్ లోయ తమదిగా చైనా చెప్పుకుంటోంది. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. మాకు కొన్ని అనుమానాలున్నాయి. గాల్వన్ లోయను మనం విడిచిపెట్టామా లేదా అక్కడి నుంచి చైనా సైన్యాన్ని వెళ్లగొట్టారా? దేశ ప్రజలందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు’ అంటూ చతుర్వేది ట్వీట్ చేశారు. (మరి మన జవాన్లు ఎక్కడ గాయపడ్డారు: చిదంబరం) Yesterday PM Modi assured the nation that no posts/territory have been ceded to China, but here China claims Galwan Valley as theirs. This is unacceptable& GoI needs to clarify or respond to this. Have we ceded our Galwan Valley or ousted the PLA from there? Nation needs to know. pic.twitter.com/FhVH4vvW4j — Priyanka Chaturvedi (@priyankac19) June 20, 2020 జూన్ 15న లద్ధాఖ్లో గాల్వన్ లోయలో సరిహద్దు వివాదంలో తలెత్తిన ఘర్షణలో భారత్కు చెందిన కల్నల్ సహా 20 మంది సైనికులు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. వాస్తవాధీన రేఖ (ఎల్ఓసీ)కు అటు (చైనా) వైపే కార్యకలాపాలు కొనసాగించుకోవాలని శుక్రవారం చైనాకు భారత్ స్పష్టం చేసింది. మన భూభాగంలోకి ఎవరూ రాలేదని, సరిహద్దు క్షేమమని, మన ఆర్మీ పోస్టులను ఎవరూ స్వాధీనం చేసుకోలేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఒక్క అడుగు కూడా మన భూభాగాన్ని వదులుకునేది లేదని శుక్రవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో వివిధ పార్టీ నేతలతో మోదీ అన్నారు. (రాహుల్-అమిత్ షా మధ్య ట్విటర్ వార్ ) -
సీఎం కుర్చీ..ఊడినట్లేనా? డెడ్లైన్ మే 28 మాత్రమే
ముంబై : ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేను శాసన మండలి సభ్యునిగా నామినెట్ చేయాలంటూ గవర్నర్ భగత్సింగ్ కోష్యారిని మంత్రివర్గం మరోసారి అభ్యర్థించింది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అధ్యక్షతన సోమవారం ఏర్పాటైన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు తీర్మానించింది. గడిచిన రెండు వారాల్లోనే రాష్ర్ట కేబినెట్ రెండు సార్లు ఈ ప్రతిపాదనను గవర్నర్ ముందుంచింది. అయితే కోష్యారి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2019 నవంబర్ 28 న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఠాక్రే ఇప్పటివరకు ఏ చట్టసభల్లోనూ సభ్యుడు కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల లోపు ఉభయ సభల్లో (అసెంబ్లీ, మండలి )ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంది. రానున్న మే 28 నాటికి ఠాక్రే సీఎంగా ఎన్నికై ఆరు నెలల పదవీకాలం ముగియనుంది. ఈ లోపు ఏదైనా సభకు ఎన్నిక కాకపోతే ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఒక నెల సమయం మాత్రమే ఉంది. కరోనా సంక్షోభంలో ఇప్పుడు ఎన్నికలు జరిగే ప్రసక్తి లేదు. ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయంపైనే రాష్ర్ట రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి. ( సీఎం పదవికి గండం..ఎమ్మెల్సీ పదవి ఇవ్వండి) -
ఆ సిటీల్లో కోవిడ్-19 అలజడి..
ముంబై : మహారాష్ట్రలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న క్రమంలో ముంబై, పుణే నగరాల్లో ఎమర్జెన్సీ తరహా పరిస్థితి నెలకొందని శివసేన పేర్కొంది. కోవిడ్-19 మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని శివసేన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయం పేర్కొంది. మహారాష్ట్రలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు 5218కి పెరిగాయని, 251 మంది మరణించారని బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన నేపథ్యంలో సామ్నా ఎడిటోరియల్ ఈ వ్యాఖ్యలు చేసింది. ముంబై, పుణే నగరాల్లో కరోనా వైరస్ విశృంఖలంగా వ్యాప్తి చెందుతుండటంతో మహారాష్ట్రలో అత్యవసర పరిస్థితి నెలకొందని సామ్నా సంపాదకీయం వ్యాఖ్యానించింది. పాల్ఘార్ జిల్లాలో ఇద్ధరు సాధువులను కొట్టిచంపిన ఘటనను సామ్నా ఎడిటోరియల్ తీవ్రంగా ఖండించింది. మహారాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరిగిన ప్రయత్నంలో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుందని, దీనికి మతం రంగు పులమడం అమానవీయమని పాలక శివసేన పేర్కొంది. లాక్డౌన్ సమయంలో దొంగలు సాధువుల వేషంలో వచ్చారనే వదంతులతో గడ్చింకల్ గ్రామస్తులు ఇద్దరు సాధువులను దారుణంగా హింసించి చంపారని తెలిపింది. మహారాష్ట్ర మీదుగా గుజరాత్కు వెళుతున్న సాధువులపై దాడి జరిగిందని పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సరైన చర్యలు చేపట్టారని మహా సర్కార్ను సమర్ధించింది. బాధితులు, నిందితులు ఒకే మతానికి చెందిన వారు కావడంతో ఈ కేసుకు మతం రంగు పులమడం సరికాదని సేన సంపాదకీయ వ్యాఖ్యానించింది. చదవండి : శివ సైనిక -
శివ సైనిక
చదువు కళ ఉన్న ముఖం తెలిసిపోతుంది. ప్రియాంక చతుర్వేది అలాంటి కళే కలిగిన నాయకురాలు. రాజ్యసభ అభ్యర్థిగా ప్రియాంకను నామినేట్ చేస్తున్నట్లు శివసేన ప్రకటించగానే పార్టీలోని అనేక ముఖాలు కళావిహీనం అయ్యాయి. అయితే శివసేన ప్రియాంకను రాజ్యసభకు పంపించాలని నిశ్చయించుకోడానికి తగిన కారణమే ఉంది. ప్రియాంక చక్కటి ఇంగ్లిష్ మాట్లాడతారు. హిందీ కూడా బాగా వచ్చు. ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చి మహారాష్ట్రలో స్థిరపడిన కుటుంబం కనుక మరాఠీ కూడా కొట్టిన పిండే. మహారాష్ట్రలో ఉండేవారంతా మరాఠీలోనే మాట్లాడాలని శివసేన అంటున్నా.. రాజ్యసభలో మాత్రం తన స్వరం వినిపించడానికి ఆ పార్టీకి ఇంగ్లిష్, హిందీ తప్పనిసరి అవుతోంది. అందుకే ప్రియాంకను ఎంచుకుంది. ప్రియాంక గత ఏడాది ఏప్రిల్ వరకు కాంగ్రెస్లోనే ఉన్నారు. 2010 లో పార్టీలో చేరి, రెండేళ్లలోనే నార్త్–వెస్ట్ ముంబై జాతీయ యువజన కాంగ్రెస్కు ప్రధాన కార్యదర్శి కూడా అయ్యారు. అయితే ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో కొందరు ఆమెతో అమర్యాదగా ప్రవర్తించినప్పుడు.. వారిని పార్టీనుంచి బయటికి పంపించిన కాంగ్రెస్.. ఆ తర్వాత కొద్ది రోజులకే వాళ్లను వెనక్కు తీసుకోవడంతో ఆగ్రహించి పార్టీ నుంచి బయటికి వచ్చేశారు. వచ్చిన రెండో రోజే శివసేనలో చేరిపోయారు. ‘పార్టీలో నేను మామూలు శివసైనికురాలిగా ఉంటాను’ అని ఆమె అన్నారు కానీ, ఠాక్రేనే.. సైనిక దళానికి ఒక నేతగా ఉండమని కోరారు. ఇప్పుడు రాజ్యసభకు పంపిస్తున్నారు. ప్రియాంక జన్మస్థలం ఉత్తర ప్రదేశ్. పెరిగిందీ, చదువుకున్నదీ ముంబైలో. జూహూలోని సెట్ జోసెఫ్స్ హైస్కూల్లో చదివారు. విలేపార్లే లోని నర్సీ మోంజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనమిక్స్లో కామర్స్ డిగ్రీ చేశారు. తర్వాత పెళ్లి, ఇద్దరు పిల్లలు. రాజకీయాల్లోకి రాకముందు, వచ్చాక కూడా మంచి కాలమిస్టుగానే ఆమెకు పేరు. బాగా రాస్తారు, రాసినంత బాగా మాట్లాడతారు. ‘తెహల్కా’, ‘డైలీ న్యూస్ అనాలిసిస్’, ‘ఫస్ట్పోస్ట్’.. వీటికి వ్యాసాలు రాశారు. రెండు మూడు ఎన్జీవోలకు ధర్మకర్త కూడా. బాలల విద్య, స్త్రీ సాధికారత, స్త్రీ ఆరోగ్యం.. ఇవీ.. వ్యాసకర్తగా, సామాజిక కర్యకర్తగా ఆమె స్వీకరించిన బాధ్యతలు. ఏ ప్రభుత్వమైనా మొదట స్త్రీ శిశు సంక్షేమం కోసం పని చేయాలని ప్రియాంక అంటారు. అప్పుడు అభివృద్ధి దానంతటే వస్తుందని చెబుతారు. ముంబైలో ‘ఎంపవర్ కన్సల్టెంట్స్’ అని.. మీడియా, పి.ఆర్. ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఒకటి ఉంది. డిగ్రీ అయిపోగానే ఆ కంపెనీ డైరెక్టర్గా చేరారు ప్రియాంక. ముంబైలోనే ‘ప్రయాస్ చారిటబుల్ ట్రస్ట్’ అనే సంస్థ ఉంది. ఆ సంస్థ ఆధ్వర్యంలో రెండు పాఠశాలు ఉన్నాయి. స్థోమత లేని 200 మంది పిల్లలకు ఆ పాఠశాలల్లో ఉచిత విద్య లభిస్తోంది. ఆ సంస్థకు కూడా ట్రస్టీగా ఉన్నారు ప్రియాంక. మోదీ అంటే ఆమెకు పడదు. ఇక చూడాలి.. ఈ శివసైనికురాలు రాజ్యసభలో మోదీ సైన్యాన్ని తన వాక్పటిమతో, సామాజికాంశాలలో తనకున్న పరిజ్ఞానంతో ఎలా అదరగొట్టి, బెదరగొట్టి దారికి తెస్తారో! -
‘బీజేపీ పగటికలలు నెరవేరవు’
ముంబై : జ్యోతిరాదిత్య సింథియా కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరడంతో మధ్యప్రదేశ్లో నెలకొన్న పరిణామాలపై శివసేన స్పందించింది. మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ సర్కార్కు ఎలాంటి ముప్పూ లేదని, కాంగ్రెస్-ఎన్సీపీలతో కలిసి ఉద్ధవ్ ఠాక్రే మహా సర్కార్ను సమర్ధవంతంగా నడిపిస్తున్నారని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ తమ యువనేతలను కలుపుకునిపోవడంలో విఫలమవుతోందని శివసేన పత్రిక సామ్నా ఎడిటోరియల్ వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోస్తామన్న బీజేపీ పగటికలలను మానుకోవాలని సామ్నా సంపాదకీయం ఎద్దేవా చేసింది. మహారాష్ట్రలో అస్ధిరత కోసం మూడు నెలల కిందట బీజేపీ చేసిన విఫల ప్రయోగం గుర్తుకుతెచ్చుకోవాలని సూచించింది. ఇక మధ్యప్రదేశ్ పరిణామాలపై కాంగ్రెస్ తీరునూ తప్పుపట్టింది. మధ్యప్రదేశ్లో సీనియర్ నేతలు కమల్నాథ్, దిగ్విజయ్ సింగ్లు సమన్వయంతో సర్కార్ను నడుపుతున్నా జ్యోతిరాదిత్య సింధియా వంటి నేతలను నిర్లక్ష్యం చేసి పొరపాటు చేసిందని ఎత్తిచూపింది. సీనియర్ నేతగా పేరొందిన కమల్నాథ్ను తక్కువగా అంచనా వేయలేమని మహారాష్ట్ర తరహాలో మధ్యప్రదేశ్లోనూ ఆయన బీజేపీకి షాక్ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని పేర్కొంది. ఇక రాజస్ధాన్, మధ్యప్రదేశ్ల సీఎంలు కమల్నాథ్, అశోక్ గెహ్లోత్ల సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో పరాజయం మూటగట్టుకుందని సామ్నా సంపాదకీయం ప్రస్తావించింది. చదవండి : ‘ఆ వైరస్ మాకు సోకదు’ -
మన్ కీ బాత్పై ఉద్ధవ్ సెటైర్లు
ముంబై : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత ఏఆర్ అంతూలేపై పుస్తకావిష్కరణ సందర్భంగా సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమం మన్ కీ బాత్పై వ్యంగ్యోక్తులు విసిరారు. అంతూలే శివసేన వ్యవస్ధాపకులు బాల్ ఠాక్రేకు అత్యంత సన్నిహితులని, ఈ పుస్తకం దిల్ కీ బాత్ వంటిదని, ఇది మన్ కీ బాత్కు భిన్నమైనదని ప్రధాని నరేంద్ర మోదీ రేడియో ద్వారా జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగాన్ని ఉటంకిస్తూ చురకలు వేశారు. అంతూలే అద్భుత పరిపానా దక్షుడని, తన సిద్ధాంతాలకు కట్టుబడిన గొప్పనేతని కొనియాడారు. అంతూలే సాహెబ్ ప్రతిరోజూ తన భార్యకు ఈ లేఖలు రాయగా ఆమె వాటిని భద్రంగా దాచారని ఇది వారి మధ్య నెలకొన్న గొప్ప బంధానికి సంకేతమని ఠాక్రే అన్నారు. అంతూలే కేంద్ర మంత్రి అయిన సందర్భంలో తాను ఢిల్లీలో శివసేనకు బ్రాండ్ అంబాసిడర్నని చెప్పడం తనకు గుర్తుందని ఉద్ధవ్ ఠాక్రే చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయన బతికిఉంటే తన స్నేహితుడి కుమారుడు ముఖ్యమంత్రిగా ఉన్నందుకు గర్వంగా ఫీలయ్యేవారని అన్నారు. తన తండ్రి స్నేహితులందరూ తనను ఇష్టపడతారని శరద్ పవార్ వైపు చూస్తూ ఠాక్రే గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్లు పాల్గొన్నారు. చదవండి : ‘అది మరో జలియన్ వాలాబాగ్’ -
చెరో మూడు ఖాయం
సాక్షి,ముంబై: రాబోయే రాజ్యసభ ఎన్నికల కోసం మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏడుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 2న ముగియనుంది. గడువు పూర్తవనున్న రాజ్యసభ సభ్యుల ఎన్నిక కోసం ఈ నెలలో నోటిఫికేషన్ వెలువడనుంది. పదవీకాలం పూర్తవుతున్న వారిలో ఆర్పీఐ అధ్యక్షుడు రామ్దాస్ ఆఠవలేతోపాటు సంజయ్ కాకడేలున్నారు. అదేవిధంగా బీజేపీకి చెందిన అమర్ సాబలే, కాంగ్రెస్ నేత హుసేన్ దల్వాయి, శివసేన నేత రాజ్కుమార్ దూత్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ç పవార్, అడ్వొకేట్ మాజీద్ మేమన్లు ఉన్నారు. అయితే మహావికాస్ ఆఘాడికి చెందిన ముగ్గురు, బీజేపీకి చెందిన ముగ్గురు ఎన్నిక కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఏడవ రాజ్యసభ సభ్యుడి ఎన్నిక కోసం గట్టిపోటీ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ స్థానం కూడా దక్కించుకునేందుకు మహావికాస్ ఆఘాడి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తోంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిన సంగతి తెలిసిందే. గతంలో బీజేపీతో కలిసి ఉన్న శివసేన అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి రాష్ట్రంలో మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రస్తుతం శాసన సభ్యుల సంఖ్యను పరిశీలిస్తే బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్కు 44, ఎమ్మెన్నెస్ 1, సమాజ్వాదీ పార్టీ 1, బహుజన్ వికాస్ ఆఘాడి 3, ఇండిపెండెంట్లు కలసి మొంత్తం 288 మంది ఉన్నారు. రాష్ట్రంలో మహావికాస్ ఆఘాడి మిత్రపక్షాలతోపాటు ఇండిపెండెంట్లతో కలిసి 170 మందితో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరోవైపు బీజేపీ వద్ద ఇండిపెండెంట్లు మిత్రపక్షాలతో కలిపి 115 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉంది. ఈ నేపథ్యంలో గడువు ముగియనున్న ఏడుగురు రాజ్యసభ సభ్యుల ఎంపిక కోసం ఒక్కొక్కరికీ కనీసం 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం కానుంది. దీంతో కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలకు ఒక్కో రాజ్యసభ పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు బీజేపీకి మూడు రాజ్యసభ స్థానాలు దక్కనున్నాయి. అయితే ఏడవ రాజ్యసభ సభ్యుడి కోసం మాత్రం ఇండిపెండెంట్లు కీలకంగా మారనున్నారు. దీంతో ఇండిపెండెంట్లు ఎవరికి మద్దతివ్వనున్నారనేది వేచి చూడాల్సిందే. -
రాష్ట్రపతిగా సేన ఛాయిస్ ఆ నేతే..
సాక్షి, న్యూఢిల్లీ : 2022లో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలూ అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పేరును పరిగణనలోకి తీసుకోవాలని శివసేన నేత సంజయ్ రౌత్ కోరారు. రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించేందుకు అవసరమైన సంఖ్యా బలం 2022 నాటికి తమకు సమకూరుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్ కూటమి సర్కార్ ఏర్పాటులో పవార్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. దేశంలోనే సీనియల్ నేత శరద్ పవార్ పేరును రాష్ట్రపతి పదవికి అన్ని రాజకీయ పార్టీలూ పరిశీలించాలని ఈ సందర్భంగా రౌత్ విజ్ఞప్తి చేశారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర సర్కార్లో పవార్ సారథ్యంలోని ఎన్సీపీ హోం, ఆర్థిక వంటి పలు కీలక శాఖలను దక్కించుకుంది. -
మోదీని పెద్దన్న అంటూనే..
ముంబై : మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి సర్కార్ కొలువుతీరిన అనంతరం శివసేన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ధవ్కు పెద్దన్న అంటూ వ్యాఖ్యానించింది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, శివసేన మధ్య విభేదాలు నెలకొన్నా ప్రధాని మోదీ, ఉద్ధవ్ల మధ్య సోదర భావం ఉందని పేర్కొంది. ప్రధాని కేవలం ఒక పార్టీకే కాదు జాతి మొత్తానికి చెందిన వారని స్పష్టం చేసింది. ఈ విషయం గమనంలో ఉంచుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్దేశాలతో విభేదించే వారి పట్ల ఆగ్రహం ఎందుకు వెలిబుచ్చుతుందని ప్రశ్నించింది. పోరాటం, సంఘర్షణ జీవితంలో భాగమని శివసేన సంపాదకీయం పేర్కొంది. ఢిల్లీ దేశ రాజధాని కావచ్చు..కానీ మహారాష్ట్ర ఢిల్లీ దేవుళ్లకు బానిస కాదని స్పష్టం చేసింది. ఈ సిద్ధాంతాన్ని నమ్మిన బాలాసాహెబ్ ఠాక్రే కుమారుడు ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారని వ్యాఖ్యానించింది. ఛత్రపతి శివాజీ మహారాష్ట్రకు అందించిన ఆత్మ గౌరవం తమకు చాలా ముఖ్యమైనదని పేర్కొంది. మోదీని పెద్దన్న అంటూనే కేంద్రానికి, బీజేపీకి శివసేన గట్టి కౌంటర్ ఇచ్చింది. -
మహా సంకీర్ణం : రైతు సంక్షేమం, ఉపాధే అజెండా
ముంబై : రైతులు, ఉపాధి కల్పనే ప్రధాన అజెండాగా మహారాష్ట్రలో కొలువుతీరే ఎన్సీపీ-కాంగ్రెస్-శివసేన కూటమి ప్రభుత్వం కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ) విడుదల చేసింది. అకాల వర్షాలు, వరదల వల్ల భారీగా నష్టపోయిన రైతాంగానికి తక్షణ సాయం, వ్యవసాయ రుణాల రద్దు, పంటల బీమా పథకంతో పాటు రైతులకు గిట్టుబాటు ధరల కల్పనకు పెద్దపీట వేయనున్నట్టు సీఎంపీ వెల్లడించింది. కరువు పీడిత ప్రాంతాలకు నీటి సరఫరాపై నిర్ధిష్ట చర్యలు చేపడతామని పేర్కొంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ సత్వరమే భర్తీ చేస్తామని తెలిపింది. అర్హులైన నిరుద్యోగ యువతకు ఫెలోషిప్ మంజూరు, స్ధానిక యువతకు ఉద్యోగాల్లో 80 శాతం రిజర్వేషన్ కోసం చట్టం తీసుకువస్తామని సీఎంపీలో పొందుపరిచారు. బాలికలకు ఉచిత విద్య, మహిళల భద్రతకు పెద్దపీట వేస్తామని కూటమి నేతలు సీఎంపీలో ప్రస్తావించారు. -
ఎప్పుడేం జరిగిందంటే..
మహారాష్ట్ర రాజకీయ పరిణామాల్లో మంగళవారం ఉదయం నుంచీ చోటు చేసుకున్న అనూహ్య మార్పుల క్రమమిదీ... - ఉదయం 10.39: ఫడ్నవీస్ బలపరీక్షకు బుధవారం సాయంత్రం వరకు గడువునిచ్చిన సుప్రీంకోర్టు. - 11.32: మహారాష్ట్ర పరిణామాలకు నిరసనగా రాజ్యాంగ దినోత్సవ పార్లమెంటు ఉభయ సభల సమావేశాన్ని బహిష్కరించిన కాంగ్రెస్; శివసేన ప్రతిపక్షాలు - 12.07: సీఎం ఫడ్నవీస్ రాజీనామా చేస్తున్నారనీ, 162 మంది మద్దతుతో ఉద్ధవ్ ఠాక్రే సీఎం కాబోతున్నారంటూ శివసేన నేత ఏక్నాథ్ షిండే వ్యాఖ్య - 12.18: అసెంబ్లీలో బలనిరూపణ పట్ల విశ్వాసం వ్యక్తం చేసిన కాంగ్రెస్ చీఫ్ సోనియా - 01.18: పార్టీ ఎమ్మెల్యేలందరూ ముంబై రావాలని బీజేపీ పిలుపు. - 03.01: బుధవారం బలనిరూపణకి సుప్రీంకోర్టు సమయాన్నిచ్చిన అనంతరం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపీ నడ్డాతో ప్రధాని మోదీ భేటీ - 03.16: శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్తో సమావేశం అనంతరం మరో ఐదేళ్ల పాటు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అంటూ శివసేన నేత సంజయ్ రౌత్ ప్రకటన. - 03.18: అజిత్ పవార్ తమతోనే ఉన్నాడన్న సంజయ్ రౌత్ - 03.42: డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవార్ రాజీనామా - 04.34: గవర్నర్కు రాజీనామా పత్రాన్ని సమర్పించిన ఫడ్నవీస్ - 05.06: అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా బీజేపీకి చెందిన కాళిదాస్ కోలంబ్కర్ నియామకం - 05.50: కాబోయే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేనని ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ ప్రకటన - 06.07: ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిం చాలని గవర్నర్ని కోరిన కాంగ్రెస్ - 7.47: ఓడిన, అవకాశవాద పార్టీల కూటమి ప్రజల మద్దతు పొందదన్న బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు - 9.12: ప్రభుత్వ ఏర్పాటులో గవర్నర్ పాత్రను ప్రశ్నించిన వామపక్షాలు. - 9.39: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇంటికి చేరుకున్న అజిత్ పవార్ - 9.39: రాజ్భవన్కు చేరుకున్న ఉద్ధవ్ - 9.46: ముంబైలో బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం -
మహారాష్ట్రలో సరికొత్త కూటమి
మహారాష్ట్రలో బీజేపీకి వ్యతిరేకంగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్లు కూటమి కట్టి, రాష్ట్రంలో ప్రభు త్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎట్టకేలకు సిద్ధపడ్డాయి. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా అయిదేళ్లూ ఉంటారని... ఎన్సీపీ, కాంగ్రెస్లకు చెరో ఉప ముఖ్యమంత్రి పదవీ వస్తుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. ఇంత వివరంగా చెప్పడానికి సిద్ధపడకపోయినా...అన్ని అంశాలూ చర్చించామని, రేపు మరింత స్పష్టత వస్తుందని శివసేన, కాంగ్రెస్ నేతలు కూడా తెలిపారు. ముగ్గురి మధ్యా ఇంకా తేల్చుకోవాల్సిన లెక్కలు... మంత్రిత్వ శాఖల పంపకాలు చాలానే ఉన్నాయని అర్ధమవుతుంది. ఎన్నికల ఫలితాలు వెలువడి 25 రోజులు దాటిపోయింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరూ సిద్ధపడలేదన్న కారణంతో రాష్ట్రపతి పాలన విధించారు. మరోపక్క సాగు సంక్షోభం తీవ్రంగా ఉన్నదని వివిధ కథనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మరఠ్వాడా ప్రాంతంలో ఈ నెల రోజుల్లో 68మంది అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడ్డారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రధాన పార్టీలన్నీ అధికారం కోసం ఎత్తులు, పైయెత్తులు వేయడంలో క్షణం తీరిక లేకుండా ఉంటే... తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో రైతులకు తెలియడం లేదు.అయితే, సైద్ధాంతికంగా భిన్న ధ్రువాలైన పార్టీలు కలవడానికి ప్రయత్నించినప్పుడు ఈమాత్రం జాప్యం చోటుచేసుకోవడం సహజమేనని కొందరు చెబుతున్నారు. ఇందులో అర్ధసత్యం మాత్రమే ఉంది. విశ్వాసాలకు కట్టుబడి ఉండటం కంటే అవకాశాలనూ, అనుకూలతలనూ వెదుక్కోవడమే ఈమధ్య అందరికీ ప్రధానమైపోయింది. చెప్పాలంటే గతంతో పోలిస్తే కాంగ్రెస్కు సైద్ధాంతిక గుంజాటన పెద్దగా లేదు. రాష్ట్రాల్లో వీలైనన్నిచోట్ల బీజేపీకి అధికారం దక్కకుండా చేసి, తాము అధికార పీఠాలకు దగ్గరకావడం ఎలాగన్నదే కాంగ్రెస్ను ఇప్పుడు వేధిస్తున్న ప్రశ్న. అందుకోసమే కర్ణాటకలో అలాంటి ప్రయత్నం చేసి, తనకంటే చాలా తక్కువ స్థానాలొచ్చిన జేడీఎస్కు ముఖ్య మంత్రి పగ్గాలు అప్పజెప్పింది. ఆ ప్రయోగం విఫలమై, చివరకు తమ పార్టీ ఎమ్మెల్యేలు గోడ దూకడంతో అది ఖంగుతింది. చివరకు ముఖ్యమంత్రి పదవి అప్పగించిన హెచ్డీ కుమారస్వామి నుంచి సైతం ఆ పార్టీ మంచి మార్కులు పొందలేకపోయింది. మహారాష్ట్ర పరిస్థితి కాస్త భిన్నం. అక్కడ శివసేన హిందుత్వ సిద్ధాంతాన్ని ప్రవచించడంతోపాటు మరాఠాల ప్రయోజనాలు కాపాడు తున్నామన్న పేరిట పలు సందర్భాల్లో పొట్టకూటి కోసం వలస వచ్చేవారిపై దుందుడుకుతనాన్ని ప్రదర్శించిన పార్టీ. అలాంటి పార్టీతో పొత్తుకు సిద్ధపడితే వెంటనే జరగబోయే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో దాని ప్రభావం ఎలా ఉంటుందోనన్న శంక కాంగ్రెస్కు ఉంది. అలాగే అయిదేళ్లకోసారి పాలకుల్ని మార్చే అలవాటున్న కేరళలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ప్రస్తుతం అధి కారంలో ఉన్న వామపక్ష ప్రజాతంత్ర కూటమి పాలన అంతమై, తన నేతృత్వంలో యూడీఎఫ్ ప్రభుత్వం వస్తుందన్న ఆశ కాంగ్రెస్కు ఉంది. ఇప్పుడు మహారాష్ట్రలో శివసేనతో చెలిమి చేస్తే కేరళపై దాని ప్రభావం పడి ఈసారి ఫలితం తారుమారవుతుందన్న శంక ఆ పార్టీని పీడించింది. అంత మాత్రం చేత శివసేనతో కలిసే ప్రసక్తి లేదని చెప్పేంత ధైర్యం కాంగ్రెస్కు లేదు. అలా ప్రకటించాక పార్టీలో ఎందరు ఎమ్మెల్యేలు మిగులుతారో చెప్పడం కష్టం. అధికారానికి చేరువయ్యే అవకాశం వచ్చి నప్పుడు సిద్ధాంతాల పేరు చెప్పి దాన్ని చేజార్చుకోవడం వారికి ససేమిరా మింగుడుపడని విషయం. వేరే రాష్ట్రాల్లో సమస్యలొస్తాయన్న అంచనాతో తమ అవకాశాలకు అడ్డుపడటం వారు సహించలేరు! కాంగ్రెస్కు ఇన్ని సమస్యలు ఉండబట్టే మహారాష్ట్రలో జాప్యం తప్పలేదు. హిందుత్వ ఛత్రఛాయలో ఒక్కటిగా ఉంటున్నామని ఇన్నాళ్లూ చెప్పుకున్న బీజేపీ, శివసేనల తీరు కూడా మహారాష్ట్రలో బట్టబయలైంది. బీజేపీ పూర్వరూపమైన జనసంఘ్ను కాదని శివసేన కాంగ్రెస్తో చెలిమి చేసిన సందర్భాలు గతంలో ఉన్నా... 80వ దశకం నుంచి బీజేపీ, శివసేనలు రెండూ సమష్టిగా ఉద్యమాలు నడుపుతున్నాయి, కలిసి పోటీ చేస్తున్నాయి. వాజపేయి హయాంలో బీజేపీ మితవాద ధోరణిని ప్రదర్శిస్తున్నప్పుడు బాల్ ఠాక్రే హిందుత్వకు సంబంధించిన పలు అంశాల్లో దూకుడుగా ఉండేవారు. అయినా బీజేపీతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. కానీ ట్రిపుల్ తలాక్కు వ్యతిరేకంగా చట్టం, 370 అధికరణ రద్దు, రామజన్మభూమి తదితర అంశాల్లో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తున్న వర్తమానంలో శివసేన ఆ పార్టీకి దూరమై కాంగ్రెస్, ఎన్సీపీలకు చేరువ కావడం గమనించదగిన విషయం. శివసేనతో తమకు సైద్ధాంతిక సామీప్యత ఉన్నదని బీజేపీ నిజంగా భావిస్తే... శివసేన కోరుకున్నట్టు సీఎం పదవిని రెండున్నరేళ్లు ఇవ్వడానికి ఎందుకు సిద్ధపడ లేకపోయింది? అందుకు అడ్డుపడిన అంశాలేమిటి? అలాగే ఇన్ని దశాబ్దాలుగా హిందుత్వ గురించి అంతగా పరితపిస్తున్న శివసేన ఈ సమయంలో బీజేపీకి ఎందుకు దూరం కావాల్సివచ్చిందో చెప్పాలి. కేవలం ముఖ్యమంత్రి పదవి విషయంలో ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడమే ఏకైక కారణమా? అయితే శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్లు కలవడం సాధ్యపడినా... ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఆ కూటమికి వస్తుందో రాదో చెప్పడం సులభమేమీ కాదు. రెండేసి పార్టీలు రెండు ప్రత్యర్థి కూటములుగా ఎన్నికల్లో జనం ముందుకెళ్లగా... ఒక కూటమిలోని పార్టీ ఇప్పుడు ఒంటరిగా మిగి లింది. రెండు పార్టీలున్న మరో కూటమి ప్రస్తుతం మూడు పార్టీల కూటమిగా రూపాంతరం చెందింది. ఈ సరికొత్త కూటమి శనివారం రాష్ట్ర గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత తెలియజేస్తూ లేఖ ఇచ్చాక ఏ పార్టీల్లో ఎలాంటి కుదుపులుంటాయో... గవర్నర్ తుది నిర్ణయం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. పార్లమెంటరీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. తీసుకునే నిర్ణయం ఏదైనా రాష్ట్ర ప్రజల శ్రేయస్సును, వారి ప్రయోజనాలనూ దృష్టిలో ఉంచుకోవడం ప్రధానమని అందరూ గుర్తించాలి. -
ఆ సర్కార్ మనుగడ కష్టమే..
రాంచీ : మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ల కలయిక అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆరోపించారు. శివసేన కూటమి అధికార పగ్గాలు చేపట్టినా ఆ ప్రభుత్వం ఎనిమిది నెలలకు మించి కొనసాగలేదని జోస్యం చెప్పారు. సిద్ధాంత వైరుధ్యాలున్న మూడు పార్టీలు చేతులు కలపడానికి అవకాశవాదమే మూలమని, బీజేపీని అధికారంలోకి రాకుండా నిలువరించేందుకే ఈ పార్టీలు కలిశాయని విమర్శించారు. అసలు ఈ పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేయలేవని..ప్రభుత్వం ఏర్పాటు చేసినా ఆరు నుంచి ఎనిమిది నెలలకు మించి వీరు ప్రభుత్వాన్ని నడపలేరని దుయ్యబట్టారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గడ్కరీ రాంచీలో జరిగిన సభలో మాట్లడారు. -
‘సేన కూటమితో బుల్లెట్ ట్రైన్కు బ్రేక్’
ముంబై : మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రధాని నరేంద్ర మోదీ కలల ప్రాజెక్ట్, ప్రతిష్టాత్మక బుల్లెట్ ట్రైన్ పట్టాలపైకి ఎక్కడం అసాధ్యమని భావిస్తున్నారు. ముంబై-అహ్మదాబాద్లను కలుపుతూ తలపెట్టిన ఈ ప్రాజెక్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకునే అవకాశం ఉంది. మహారాష్ట్రలో అధికార పగ్గాలను చేపట్టిన అనంతరం శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును రద్దు చేస్తుందని, రూ లక్ష కోట్ల వ్యయాంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో మహారాష్ట్ర వెచ్చించాల్సిన రూ 5000 కోట్లను నిలిపివేస్తుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. 2017 సెప్టెంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే అహ్మదాబాద్లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు శంకుస్ధాపన చేశారు. ఈ ప్రాజెక్టుకు కేవలం 0.1 శాతం వడ్డీతో జపాన్ రూ 88,000 కోట్లు రుణం ఇవ్వనుంది. ప్రాజెక్టు ముందుకు సాగాలంటే మొత్తం వ్యయం కేంద్ర ప్రభుత్వమే భరించాలి. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై మహారాష్ట్ర ఖర్చు చేయబోదని ఓ సీనియర్ కాంగ్రెస్ నేత స్పష్టం చేసినట్టు సమాచారం. ఇక రైతుల సంక్షేమం, వ్యవసాయ రుణాల మాఫీని నూతన ప్రభుత్వం చేపడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. -
ఉద్ధవ్పై కేసు నమోదు
ఔరంగాబాద్ : ఎన్సీపీ, కాంగ్రెస్లతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సిద్ధమవుతున్న క్రమంలో ప్రజా తీర్పును ధిక్కరిస్తూ రాష్ట్ర ప్రజలను వంచించారని ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేపై ఫిర్యాదు నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీతో తెగతెంపులు చేసుకుని ప్రజా తీర్పును అవమానించారని ఉద్ధవ్పై ఓ న్యాయవాది కేసు నమోదు చేశారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ చంద్రకాంత్ పాటిల్, శివసేన నేత ప్రదీప్ జైస్వాల్ పేర్లను కూడా న్యాయవాది రత్నాకర్ చౌరే తన ఫిర్యాదులో ప్రస్తావించారు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఉద్ధవ్ ఠాక్రేతో సహా శివసేన, బీజేపీలు హిందుత్వ పేరుతో ఔరంగాబాద్లో ఓట్లు అభ్యర్థించాయని, ఎన్నికల అనంతరం కూటమి నుంచి ఉద్ధవ్ బయటకు రావడంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారని అన్నారు. ఇది ప్రజా తీర్పును వంచించడమేనని, సీఎం పదవి కోసం ఉద్ధవ్ రాష్ట్ర ప్రజలను మోసగించారని చౌరే ఆరోపించారు. ఉద్దవ్ ఠాక్రే, చంద్రకాంత్ పాటిల్, ప్రదీప్ జైస్వాల్లపై తమను మోసం చేశారని ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు. శివసేన ప్రతిపాదించిన రొటేషనల్ సీఎం ఫార్ములాకు బీజేపీ అంగీకరించకపోవడంతో ఇరు పార్టీల మధ్య దోస్తీ బ్రేక్ అయిన సంగతి తెలిసిందే. ఎన్సీపీ, కాంగ్రెస్లతో జట్టుకట్టి ప్రభుత్వ ఏర్పాటకు శివసేన సంసిద్ధమైంది. శివసేన, ఎన్సీపీలు చెరి రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి డిప్యూటీ సీఎం అయిదేళ్ల పాటు పదవిలో కొనసాగేలా మూడు పార్టీల మధ్య అవగాహన కుదిరింది. మంత్రి మండలిలోనూ మూడు పార్టీలకు ప్రాతినిథ్యం దక్కేలా కసరత్తు కొలిక్కివచ్చినట్టు సమాచారం. -
‘మహా క్లారిటీ : ఉద్ధవ్కే సీఎం పగ్గాలు’
ముంబై\న్యూఢిల్లీ : మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి సర్కార్పై స్పష్టత వస్తోంది. అధికార పంపకంపై విస్తృతంగా చర్చిస్తున్న ఆయా పార్టీల ప్రతినిధులు వీలైనంత త్వరగా ఈ కసరత్తును పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. శివసేన-ఎన్సీపీలు చెరి రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకునేలా, కాంగ్రెస్కు ఐదేళ్ల పాటు డిప్యూటీ సీఎం ఆఫర్ చేసేలా అంగీకారం కుదిరినట్టు సమాచారం. మరోవైపు రైతు సమస్యలపై ప్రత్యేకంగా దృష్టిసారించడం, కనీస ఉమ్మడి కార్యక్రమం ఖరారు, లౌకిక స్ఫూర్తికి కట్టుబడటం వంటి కీలక అంశాలపై మూడు పార్టీలు ఇప్పటికే ఓ అవగాహనకు రావడంతో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇక మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే పాలనా పగ్గాలు చేపడతారని, డిప్యూటీ సీఎంలుగా ఎన్సీపీ నేత అజిత్ పవార్, కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్ థొరట్లు బాధ్యతలు చేపడతారని తెలిసింది. ఇక ఎన్సీపీ నూతన క్యాబినెట్లో మంత్రులపై కసరత్తు సాగిస్తున్నట్టు సమాచారం. ఇక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో రాష్ట్ర వాటా నిధులను మహారాష్ట్రలో సమస్యల బారిన పడిన రైతాంగానికి వెచ్చించాలనే అంశంపైనా సేన, కాంగ్రెస్, ఎన్సీపీలు యోచిస్తున్నట్టు తెలిసింది. -
వారాంతంలో కొలువుతీరనున్న మహా సర్కార్..
ముంబై : మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్లతో కూడిన సంకీర్ణ సర్కార్ ఈ వారాంతంలో కొలువు తీరే అవకాశం ఉంది. మూడు పార్టీల ప్రతినిధులు ఢిల్లీలో విస్తృత మంతనాలు కొనసాగిస్తున్న క్రమంలో కూటమి సర్కార్పై ఓ స్పష్టత వచ్చినట్టు సమాచారం. మరోవైపు మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేల నుంచి తదుపరి సర్కార్కు మద్దతు ప్రకటిస్తూ రూపొందే లేఖలను శనివారం గవర్నర్కు సమర్పిస్తామని శివసేన నేత సంజయ్ రౌత్ వెల్లడించారు. ఇక సీఎం పదవిని చెరి రెండున్నరేళ్లు పంచుకోవాలని ఎన్సీపీకి శివసేన సూచించింది. కాంగ్రెస్ నుంచి డిప్యూటీ సీఎం ఐదేళ్ల పాటు కొనసాగేలా సంప్రదింపులు సాగుతున్నాయి. మరోవైపు కూటమికి తుదిరూపు ఇచ్చేందుకు సేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల సంయుక్త సమావేశం ముంబైలో జరుగుతుందని ఆయా పార్టీల నేతలు వెల్లడించారు. అధికార పంపకంపై ప్రధానంగా చర్చలు జరిపే ఈ కీలక భేటీకి సేన, ఎన్సీపీల చీఫ్లు ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్లు హాజరవుతారు. అంతా సజావుగా సాగితే నూతన ప్రభుత్వం ఆదివారం లేదా సోమవారం ప్రమాణ స్వీకారం చేస్తుందని శివసేన వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకు మద్దతు ఇవ్వాలని మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశించిన విషయం తెలిసిందే. మతతత్వ పోకడలపై పోరాడే క్రమంలో బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు శివసేనకు మద్దతు ఇవ్వక తప్పడం లేదని సోనియా ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులకు వివరించినట్టు సమాచారం. -
శివసేనకు మద్దతుపై సోనియా గ్రీన్సిగ్నల్
ముంబై : మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ, కాంగ్రెస్ల మద్దతు కోసం శివసేన చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలను ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశించారు. శివసేనకు సహకరించేందుకు ఎన్సీపీ కూడా సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. మరోవైపు శివసేనకు పార్టీ ఎమ్మెల్యేల నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్సీపీ, కాంగ్రెస్లతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన ప్రయత్నాలను 17 మంది సేన ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. పార్టీ నిర్ణయంపై అసంతృప్తితో రగులుతున్న ఎమ్మెల్యేలు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను కలుసుకోనున్నారు. ఇక బీజేపీ సైతం సేన ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకోవడంతో పాటు స్వతంత్రులు, ఇతర పార్టీల నుంచి పలువురు ఎమ్మెల్యేలను సమీకరించి ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదపడంతో మహారాష్ట్ర రాజకీయాలు మళ్లీ ఉత్కంఠ పెంచుతున్నాయి. -
శివసేనకు భారీ షాక్..
ముంబై : మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ధీమాగా ఉన్న శివసేనకు బుధవారం ఆ పార్టీ ఎమ్మెల్యేలు గట్టి షాక్ ఇచ్చారు. ఎన్సీపీ, కాంగ్రెస్లతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ 17 మంది ఎమ్మెల్యేలు గళమెత్తారు. అసమ్మతి ఎమ్మెల్యేలు పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ కానున్నారు. మరోవైపు శివసేన సారథ్యంలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకోగా రైతుల సమస్యలపైనే తాను ప్రధానిని కలిశానని పవార్ వెల్లడించారు. మహారాష్ట్ర రాజకీయాలు తమ భేటీలో ప్రస్తావనకు రాలేదని తెలిపారు. శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్సీపీ, కాంగ్రెస్ల మధ్య సంప్రదింపులు కొలిక్కిరాని క్రమంలో సొంత పార్టీలోనే అసమ్మతి స్వరాలు వినిపిస్తుండటం శివసేనకు ఇబ్బందికరంగా మారింది. ఇక బీజేపీ సైతం శివసేన అసంతృప్త ఎమ్మెల్యేలు, ఇండిపెండెంట్లతో పాటు తమతో కలిసివచ్చే ఇతర పార్టీల్లోని ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతూ ప్రభుత్వ ఏర్పాటుకు తమ ముందున్న అవకాశాలపై ఆరా తీస్తోంది. -
మహా రగడపై ఆరెస్సెస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, శివసేన కూటమి మధ్య చిచ్చు రేగడంపై ఆరెస్సెస్ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీర్ఘకాలం పరస్పర అనుబంధంతో సాగిన ఈ రెండు పార్టీలు ఏ అంశంపై కీచులాటలకు దిగినా అది ఇరు పార్టీలకు నష్టమని బీజేపీ, శివసేనల విభేదాలను ప్రస్తావిస్తూ ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. స్వార్ధం అనేది చేటని ప్రతిఒక్కరికీ తెలిసినా చాలా కొద్ది మందే తమ స్వార్ధాన్ని విడనాడతారని నాగపూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు. అధికార పంపకంపై బీజేపీ, శివసేనల ఘర్షణతో ఇరు పార్టీలు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు గడువులోగా ఏ ఒక్క పార్టీ ముందుకురాకపోవడంతో రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. సీఎం పదవిని చెరి రెండున్నరేళ్లు పంచుకోవాలన్న శివసేన ఫిఫ్టీఫిఫ్టీ ఫార్ములాను బీజేపీ వ్యతిరేకించడంతో ఇరు పార్టీలతో కూడిన కూటమికి తూట్లు పడగా, తాజాగా ఎన్సీపీ కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. -
'శరద్ పవార్పై మాకు ఎలాంటి అనుమానం లేదు'
ముంబై : అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 27 రోజులు గడుస్తున్నా.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. నవంబర్ 12 తర్వాత ఏ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు చేయకపోవడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం శివసేనతో కలిసి ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అందరూ భావిస్తుండగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. ప్రభుత్వ ఏర్పాటుకు చర్చలే జరగలేదని చెప్పి షాక్ ఇచ్చారు. 288 మంది ఎమ్మెల్యేలు ఉన్న సభలో శివసేనకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఎక్కడ నుండి వస్తుందో ఆ పార్టీ నేతలే చెప్పాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాతో సమావేశం తరువాత పవార్ ఈ వ్యాఖ్యలు చేసారు. ఈ విషయంపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పందించారు. శరద్ పవార్ తీరుపై తమకు ఎలాంటి అనుమానం లేదన్నారు. మహారాష్ట్రలో డిసెంబరు మొదటి వారంలో శివసేన అధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో.. తాము త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి రైతుల సమస్యలను గురించి వివరిస్తామని సంజయ్ రౌత్ తెలిపారు. కాగా.. తాము ఎన్సీపీ, కాంగ్రెస్తో చర్చలు జరుపుతోన్న తరుణంలో తమ పార్టీని ఎన్డీఏ నుంచి తొలగించడంపై బీజేపీపై శివసేన అధికార పత్రిక సామ్నాలో విమర్శలు గుప్పించింది. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే ఏడవ వర్ధంతి సందర్భంగా ఆయనకు దేశం మొత్తం నివాళులు అర్పిస్తున్న సమయంలో బీజేపీ ఇటువంటి నిర్ణయం తీసుకోవడంతోనే ఆ పార్టీ తీరు ఎలాంటిదో స్పష్టమైందని తెలిపారు. 288 అసెంబ్లీ స్థానాలు కలిగిన మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
మహా ట్విస్ట్ : బీజేపీ-సేన నయా ఫార్ములా
సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ సరికొత్త మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీల మధ్య ఢిల్లీలో మహారాష్ట్ర పరిణామాలపై కీలక భేటీ జరగగా, మరోవైపు బీజేపీ-శివసేనల మధ్య నయా ఫార్ములా తెరపైకి వచ్చింది. కేంద్రమంత్రి రాందాస్ అథవలే ఈ దిశగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మహారాష్ట్రలో బీజేపీ-సేన సంకీర్ణ సర్కార్ ఏర్పాటుపై శివసేన నేత సంజయ్ రౌత్తో సంప్రదింపులు జరిపానని మూడేళ్లు బీజేపీ సీఎం, రెండేళ్లు శివసేన సీఎం ఉండేలా సరికొత్త ఫార్ములాను ప్రతిపాదించానని రాందాస్ అథవలే చెప్పుకొచ్చారు. తన ప్రతిపాదనపై రౌత్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ ప్రతిపాదనపై తాను బీజేపీతో సంప్రదింపులు జరుపుతానని ఆయన తనకు చెప్పారని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇక సోనియాతో భేటీ అనంతరం శరద్ పవార్ మాట్లాడుతూ మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై తాము చర్చించామని, అయితే శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు అంశం ప్రస్తావనకు రాలేదని చెప్పారు. కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు చర్చించిన మీదట చర్చల పురోగతిని వారు తమకు వివరిస్తారని అన్నారు. -
‘మహా గవర్నర్పై సేన ఫైర్’
ముంబై : మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియపై బీజేపీ సహా ఆ రాష్ట్ర గవర్నర్ బీఎస్ కోశ్యారి అనుసరిస్తున్న తీరు పట్ల శివసేన మండిపడింది. వరదలతో దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోవడంలో కేంద్రం తాత్సారం చేస్తోందని, తమకు ఓటు వేయని రైతులపై కేంద్రం కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడరాదని పార్టీ పత్రిక సామ్నా ఎడిటోరియల్లో శివసేన దుయ్యబట్టింది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోనందుకు కేంద్రం రైతులపై ప్రతీకారం తీర్చుకోరాదని తాము కోరుతున్నామని సంపాదకీయంలో శివసేన పేర్కొంది.మరోవైపు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారిని రాజాగా అభివర్ణించిన సేన ఆయన రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మోకాలడ్డుతున్నారని ఆరోపించింది. హెక్టార్కు రూ 25,000 చొప్పున రైతులకు పరిహారం ప్రకటించాలని శివసేన కేంద్రాన్ని డిమాండ్ చేసింది. రైతుల తరపున తాము ఢిల్లీ (కేంద్రం)తో పోరాడుతున్నామని పేర్కొంది. బీజేపీ మాటలు ఓ రకంగా ఉంటే చేతలు మరోరకంగా ఉంటాయని విమర్శించింది. -
‘రాష్ట్రపతి పాలన ముసుగులో ఎమ్మెల్యేల కొనుగోలు’
ముంబై : మహారాష్ట్రలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు పావులు కదుపుతున్న శివసేన మాజీ మిత్రపక్షం బీజేపీపై తీవ్రస్ధాయిలో విరుచుకుపడింది. రాష్ట్రపతి పాలన ముసుగులో బీజేపీ ఎమ్మెల్యేల కొనుగోలుకు రాయబేరాలు సాగిస్తోందని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో ఆరోపించింది. 105 మంది ఎమ్మెల్యేలతో తాము ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని గవర్నర్కు స్పష్టం చేసిన బీజేపీ ఇప్పుడు మహారాష్ట్రలో తమ పార్టీ మాత్రమే ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని ఎలా చెప్పగలుగుతుందని ప్రశ్నించింది. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి దారిలోకి తెచ్చుకుంటున్నారని దుయ్యబట్టింది. బీజేపీ చెబుతున్న పారదర్శక ప్రభుత్వం ఏంటో ఇప్పుడు వెల్లడవుతోందని శివసేన విమర్శించింది. అనైతిక పద్ధతుల్లో ఎమ్మెల్యేలను లోబరుచుకోవడం మహారాష్ట్ర సంప్రదాయం కాదని హితవు పలికింది. కాగా తమ పార్టీ త్వరలో మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ సామ్నా సంపాదకీయం బీజేపీని ఎండగట్టింది. ఇక రాజకీయాలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ క్రికెట్తో పోల్చడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయాలు ఆటల కన్నా ఇప్పుడు వ్యాపారంలా మారాయని శివసేన ఆందోళన వ్యక్తం చేసింది. క్రికెట్లోనూ రాయబేరాలు, మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని గుర్తెరగాలని పేర్కొంది. మహారాష్ట్రలో గడువులోగా ఏ పార్టీ ప్రభుత్వ ఏర్పాటునకు ముందుకురాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. -
ఉమ్మడి ముసాయిదా ఖరారు
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటులో ప్రతిష్టంభన.. రాష్ట్రపతి పాలన తర్వాత కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన ప్రభుత్వం ఏర్పాటు దిశగా పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. కనీస ఉమ్మడి కార్యక్రమంపై దాదాపు ఒక అంగీకారం కుదిరిందని, ఆదివారం నూతన ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. గురువారం తొలిసారిగా కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన నేతలు సమావేశమై కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ)తోపాటు అధికారంలో సమాన వాటా అంశంపై చర్చలు జరిపారు. ముసాయిదాను శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ చీఫ్లు ఉద్దవ్ ఠాక్రే, శరద్ పవార్, సోనియా గాంధీలకు తుది నిర్ణయం కోసం అందించనున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల మహాశివ్ కూటమి ప్రభుత్వం ఈ 17వ తేదీన ఏర్పడనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎంపీలో ఏముంటుంది?: కనీస ఉమ్మడి కార్యక్రమం(సీఎంపీ)లో ఏ ఏ అంశాలున్నాయనే దానిపై రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ప్రభుత్వ పాలనలో ప్రాధాన్యత అంశాలతోపాటు పదవుల పంపకంపై మూడు పార్టీల నేతల మధ్య ఒక ఏకాభిప్రాయం కుదిరింది. ఒక అంచనా ప్రకారం..శివసేన, ఎన్సీపీలు చెరో రెండున్నరేళ్లపాటు ముఖ్యమంత్రి పదవులతోపాటు చెరో 14 మంత్రి పదవులు.. అయిదేళ్లపాటు కాంగ్రెస్కు ఉపముఖ్యమంత్రి పదవి, 11 మంత్రి పదవులు లభించనున్నట్టు తెలుస్తోంది. మరో అంచనా ప్రకారం.. శివసేన, కాంగ్రెస్లకు చెరో రెండేళ్లు, కాంగ్రెస్కు ఏడాది పాటు ముఖ్యమంత్రి పదవి ఇచ్చే విషయంపై అంగీకారం కుదిరిందని తెలిసింది. దీంతోపాటు మంత్రి పదవులు ఎన్సీపీ, శివసేనలకు సమానంగా ఉండగా కాంగ్రెస్కు మూడు మంత్రి పదవులు తక్కువ కానున్నాయని సమాచారం. -
‘మహా’ రగడ: అమిత్ షా అసత్యాలు
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ, శివసేనల మధ్య జరిగిన ఒప్పందంపై కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా అసత్యాలు చెబుతున్నారని శివసేన నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. మహారాష్ట్రలో చెరి రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవాలనే శివసేన డిమాండ్ పట్ల అమిత్ షా అవాస్తవాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రొటేషనల్ సీఎం అంశంపై అమిత్ షా ప్రధాని నరేంద్ర మోదీకి తెలియకుండా దాగుడుమూతలు ఆడారని మండిపడ్డారు. మహారాష్ట్రలో ఎన్నకల ప్రచారం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి దేవేంద్ర ఫడ్నవీస్ కొనసాగుతారని చెప్పడం ప్రస్తావిస్తూ.. జనబాహుళ్యంలో మోదీకి ఉన్న పేరుప్రఖ్యాతుల దృష్ట్యా ఆయన ప్రకటనలను ఆ సమయంలో తాము ఆక్షేపించలేదని స్పష్టం చేశారు. మరోవైపు మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి శివసైనికుడేనని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సైతం పలు సభల్లో ప్రస్తావించారని గుర్తుచేశారు. రొటేషనల్ సీఎం ప్రతిపాదన తమ ఒప్పందంలో లేదని అమిత్ షా ఇప్పుడెలా చెబుతారని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకూ ఇరు పార్టీల మధ్య సజావుగా ఉన్న సంబంధాలు ఒక్కసారిగా ఎందుకు దిగజారాయని నిలదీశారు. కాగా, శివసేనతో ఎన్నికలకు ముందు జరిగిన సంప్రదింపుల్లో సీఎం పదవిని చెరు రెండున్నరేళ్లు పంచుకునే అంశం లేదన అమిత్ షా పేర్కొన్నారు. -
‘మహా’ డ్రామాలో మరో ట్విస్ట్
సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: బాలీవుడ్ బ్లాక్బస్టర్ సినిమాను మించిన ట్విస్ట్లతో మహారాష్ట్రలో రాజకీయ డ్రామా కొనసాగుతోంది. కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతుతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని, దాంతో ‘మహా’ ఉత్కంఠకు తెరపడనుందని సోమవారం ఉదయం వరకూ అంతా భావించారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు చోటు చేసుకున్న వరుస నాటకీయ పరిణామాలు, అనూహ్య మలుపులు.. ‘మహా’ ఉత్కంఠను పెంచాయి. మద్దతు లేఖ ఇవ్వకుండా కాంగ్రెస్ ఆఖరి నిమిషంలో ఇచ్చిన ట్విస్ట్తో శివసేన కంగుతిని, అధికారానికి అడుగు దూరంలో నిలిచిపోయింది. గవర్నర్ను కలిసిన ఆదిత్య ఠాక్రే మరో 48 గంటలు గడువు ఇచ్చేందుకు గవర్నర్ కోష్యారీ నిరాకరించడంతో రాజ్భవన్ నుంచి శివసేన యువనేత ఆదిత్య ఠాక్రే బృందం నిరాశగా వెనుతిరిగింది. ఆ తరువాత, అనూహ్యంగా, ప్రభుత్వ ఏర్పాటు రేసులో ఎన్సీపీ ముందుకు వచ్చింది. ఎన్సీపీని గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. స్పందించేందుకు 24 గంటల గడువు విధించి, నేటి(మంగళవారం) రాత్రి 8.30 వరకు ఏ విషయం చెప్పాలన్నారు. దాంతో ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనలు ఏం చేయబోతున్నాయన్నది సస్పెన్స్గా మారింది. ఉదయం నుంచి చర్చోపచర్చలు.. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సిద్ధమై, ఎన్సీపీ, కాంగ్రెస్ల మద్దతు కోరిన నేపథ్యంలో.. సోమవారం ఉదయం నుంచి కాంగ్రెస్ పార్టీలో చర్చలు కొనసాగాయి. తొలుత పార్టీ చీఫ్ సోనియా నేతృత్వంలో సీడబ్ల్యూసీ భేటీ జరిగింది. సాయంత్రం 4 గంటల సమయంలో మరోసారి భేటీ అయ్యారు. సీనియర్ నేతలు ఖర్గే, అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్ తదితరులతో సోనియా చర్చలు జరిపారు. మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు అశోక్ చవాన్, పృథ్వీరాజ్ చవాన్, సుశీల్ కుమార్ షిండే, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బాలాసాహెబ్ తోరట్.. తదితరులు భేటీలో పాల్గొన్నారు. ముఖ్యంగా శివసేనకు మద్దతివ్వాలా? వద్దా? ఇస్తే.. ప్రభుత్వంలో చేరాలా? లేక బయటనుంచి మద్దతివ్వాలా? మద్దతిచ్చేందుకు ఎలాంటి షరతులు విధించాలి? మద్దతివ్వడం లేదా ప్రభుత్వంలో చేరడం వల్ల పార్టీకి ఎలా ప్రయోజనకరం? తదితర అంశాలపై వారు చర్చించారు. శివసేనకు మద్దతివ్వడాన్ని కొందరు నేతలు వ్యతిరేకించారని, సైద్ధాంతికంగా విభేదాలున్న శివసేనకు మద్దతిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని పలువురు నేతలు గట్టిగా వాదించినట్లు తెలిసింది. శివసేనకు మద్దతివ్వాలని, ప్రభుత్వంలో తమ భాగస్వామ్యం ఉండాలని మెజారీటీ ఎమ్మెల్యేలు కోరుకున్నట్లు సమాచారం. చివరకు, శివసేనకు మద్ధతిచ్చేందుకు పార్టీ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ ఖండించారు. ‘ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు ఇస్తామని హామీ ఇస్తూ ఎలాంటి లేఖను శివసేనకు కాంగ్రెస్ ఇవ్వలేదు. శివసేనకు మద్దతివ్వడానికి సంబంధించి కాంగ్రెస్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. సోనియాకు ఫోన్; పవార్తో భేటీ ఇదే సమయంలో, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సోనియాగాంధీకి ఫోన్ చేసి, మద్దతు కోరారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, సోనియా ఠాక్రేకు ఎలాంటి హామీ ఇవ్వలేదని, తమ పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు తెలుసుకుని నిర్ణయం తీసుకుంటామని ఠాక్రేకు చెప్పారని వెల్లడించాయి. సోనియాగాంధీకి ఉద్ధవ్ఠాక్రే చేసిన ఫోన్ కాల్పై ప్రశ్నించగా.. ‘అది మర్యాదపూర్వక ఫోన్కాల్ మాత్రమే’ అని ఆ తరువాత వేణుగోపాల్ మీడియాకు తెలిపారు. మరోవైపు, ఉద్ధవ్ ఠాక్రే ఎన్సీపీ చీఫ్ శరద్పవార్తో ముంబైలోని ఒక హోటల్లో దాదాపు గంట పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ‘ముంబైలో ఎన్సీపీ నేతలతో మంగళవారం తదుపరి చర్చలు జరుగుతాయని మహారాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జ్ మల్లిఖార్జున్ ఖర్గే తెలిపారు. కాగా, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సోనియాగాంధీ నివాసంలో నేడు ఉదయం 10 గంటలకు భేటీ కానున్నారు. ఎన్సీపీకి పిలుపు రాత్రి 8 గంటల సమయంలో అనూహ్యంగా, మూడో అతిపెద్ద పార్టీ అయిన ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ గవర్నర్ లేఖ పంపారు. దాంతో, ఎన్సీపీ శాసనసభా పక్ష నేత అజిత్ పవార్ నేతృత్వంలో పార్టీ బృందం గవర్నర్ను కలిసి, తమ మిత్రపక్షం కాంగ్రెస్తో చర్చించేందుకు సమయం కావాలని, మంగళవారం రాత్రిలోగా తమ నిర్ణయం చెబుతామని వివరించారు. శివసేనకు షాక్ కాంగ్రెస్ ప్రకటనతో ప్రభుత్వ ఏర్పాటులో ఎన్సీపీ, కాంగ్రెస్ల మద్దతు లభిస్తుందని, వారి నుంచి మద్దతు లేఖలు వస్తాయని ఆశించిన శివసేన ఒక్కసారిగా షాక్ తిన్నది. సాయంత్రం 7.30కు గవర్నర్ గడువు ముగియనున్న నేపథ్యంలో రాజ్భవన్కు ఆదిత్య ఠాక్రే బృందం వెళ్లి, మరో 48 గంటల గడువు కావాలని కోరింది. అందుకు గవర్నర్ నిరాకరించడంతో వారు నిరాశతో వెనుతిరిగారు. ‘గడువు పొడిగించేందుకు గవర్నర్ నిరాకరించారు. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న మా ప్రతిపాదనను తిరస్కరించలేదు’ అని ఆదిత్య చెప్పారు. మరోవైపు, మోదీ సారథ్యంలోని కేంద్రప్రభుత్వంలో శివసేన ఏకైక మంత్రి అరవింద్ సావంత్ సోమవారం మంత్రిపదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు తాము మద్దతివ్వాలంటే ముందు ఎన్డీయే నుంచి వైదొలగాలంటూ శివసేనకు ఎన్సీపీ చేసిన డిమాండ్ నేపథ్యంలో సావంత్ ఆ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా లేఖతో అరవింద్ సావంత్ -
మహా ఉత్కంఠ: రాష్ట్రపతి పాలన వస్తే..
ముంబై : మహారాష్ట్రలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతున్న క్రమంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనివార్యమైతే అది శివసేన తప్పిదం కాదని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర రాష్ట్రపతి పాలన దిశగా వెళుతోందా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఈ పరిస్థితికి తాము బాధ్యులం కాదని, ఈ దిశగా కుట్ర పన్నేవారు ప్రజల తీర్పును అవమానిస్తున్నారని బీజేపీ తీరును ఎండగట్టారు. సీఎం పదవిని పంచుకునే విషయంలో ఎన్నికలకు ముందు బీజేపీ, శివసేనల మధ్య ఏకాభిప్రాయం ఉందని ఇరు పార్టీల మధ్య అధికార పంపకంపై నెలకొన్న చిక్కుముడిని ప్రస్తావిస్తూ పేర్కొన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి బీజేపీ నుంచి తాజా ప్రతిపాదనలేవీ రాలేదని, తాము కూడా ఎలాంటి ప్రతిపాదనా పంపలేదని సంజయ్ రౌత్ చెప్పారు. గతంలో జరిగిన ఒప్పందం అమలు చేయాలనే తాము కోరుతున్నామని, కొత్త ప్రతిపాదనలేమీ లేవని పేర్కొన్నారు. (చదవండి: త్వరలో శుభవార్త వింటారన్న బీజేపీ) -
‘మహా రాజకీయాల్లో ఆరెస్సెస్ జోక్యం’
ముంబై : మహారాష్ట్రలో అధికార పంపకంపై బీజేపీ-శివసేనల మధ్య నెలకొన్న సంవాదం తీవ్రమవడంతో ఆరెస్సెస్ జోక్యం చేసుకుని ప్రతిష్టంభనకు తెరదించాలని శివసేన నేత కోరారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్కు శివసేన నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సన్నిహితుడైన కిషోర్ తివారీ లేఖ రాశారు. బీజేపీ సంకీర్ణ ధర్మాన్ని పాటించడం లేదని లేఖలో పేర్కొన్నారు. మహారాష్ట్రలో చెరి రెండున్నరేళ్లు అధికారం పంచుకోవాలని, రాష్ట్ర మంత్రివర్గంలో ఇరు పార్టీలు చెరిసగం ఉండాలంటూ శివసేన ముందుకుతెచ్చిన ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములాను కాషాయపార్టీ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ప్రజలు బీజేపీ-శివసేన కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా నూతన ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ జాప్యం చేస్తోందని, ఆరెస్సెస్ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని మోహన్ భగవత్కు రాసిన లేఖలో శివసేన నేత తివారీ కోరారు.మరోవైపు ఎన్సీపీ, కాంగ్రెస్ల సహకారంతో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండగా బీజేపీ నేతృత్వంలోనే తదుపరి ప్రభుత్వం ఏర్పాటవుతుందని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
మహా ఉత్కంఠ : ఎన్సీపీ కీలక ప్రకటన
ముంబై : మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ, శివసేనలు ఎవరికి వారు సొంతంగా ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేస్తుండగా ఎన్సీపీ కీలక సంకేతాలు పంపింది. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనకు మద్దతిస్తామని ఎన్సీపీ సూచనప్రాయంగా వెల్లడించింది. బీజేపీ తోడ్పాటు లేకుండా ఛత్రపతి శివాజీ పేర్కొన్న తరహాలో ప్రజా ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన ముందుకువస్తే తాము సానుకూలంగా స్పందిస్తామని ఎన్సీపీ ముఖ్య అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అడుగులు వేస్తే ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కాగా ప్రజలు తమకు విపక్ష స్ధానాన్ని కట్టబెట్టినందున, ఎన్సీపీ ప్రతిపక్షంలో కూర్చుంటుందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రకటించిన క్రమంలో నవాబ్ మాలిక్ ప్రకటన అందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తింది. నవంబర్ 7 నాటికి నూతన ప్రభుత్వం ఏర్పాటు కాని పక్షంలో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తారని బీజేపీ నేత సుధీర్ ముంగతివర్ ప్రకటన పట్ల మాలిక్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో బీజేపీ రాష్ట్రపతి పాలన విధించడాన్ని తాము అనుమతించబోమని, రాష్ట్రానికి ప్రజాస్వామ్య ప్రక్రియలో నూతన దిశను అందిస్తామని స్పష్టం చేశారు. తాము ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని అందించేందుకు సిద్ధమని, శివసేన ఇతర పార్టీలు దీనిపై తమ వైఖరిని వెల్లడించాలని కోరారు. -
మహా పాలిటిక్స్ : రాజకీయాల్లో ఎవరూ సన్యాసులు కాదు..
సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్రలో పాలనా పగ్గాలు చేపట్టడంపై బీజేపీ, శివసేనలు ఇంకా ఓ అవగాహనకు రాలేదు. ప్రత్యామ్నాయాలను అన్వేషించే పరిస్థితి తమకు కల్పించవద్దని, రాజకీయాల్లో ఎవరూ సన్యాసులు కాదని బీజేపీకి శివసేన స్పష్టమైన సంకేతాలను పంపింది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతు స్వీకరించడాన్ని శివసేన నేత సంజయ్ రౌత్ తోసిపుచ్చలేదు. కూటమి లక్ష్యాలకు శివసేన కట్టుబడి ఉంటుందని అంటూనే రాజకీయాల్లో ఏ పార్టీ సన్యసించదని కాషాయ పార్టీని ఆయన తనదైన శైలిలో హెచ్చరించారు. బీజేపీ ప్రతిపాదన కోసం తాము వేచిచూస్తామని సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే స్పష్టంగా చెప్పారని..అయితే తమను ప్రత్యామ్నాయాల వైపు చూసే పరిస్థితి కల్పించవద్దని సంజయ్ మిత్రపక్షానికి సూచించారు. మహారాష్ట్రలో అధికారం పంచుకునేందుకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములాపై శివసేన వెనక్కితగ్గడం లేదు. ఇరు పార్టీలు చెరి రెండున్నరేళ్లు అధికారాన్ని పంచుకోవాలని ఆ పార్టీ బీజేపీని కోరుతోంది. అయితే రొటేషన్ పద్ధతిలో సీఎం పదవిని పంచుకునేందుకు తాము సుముఖంగా లేమని బీజేపీ స్పష్టం చేసింది. సేన ఎమ్మెల్యేలు పలువురు ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రేను రెండున్నరేళ్ల పాటు సీఎంగా ప్రతిపాదిస్తున్నారు. -
బ్రహ్మానందం, స్నేహ ఉల్లాల్ ప్రచారం
సాక్షి, షోలాపూర్: తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు జాతీయ పార్టీలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన నాయకులను ఎన్నికల ప్రచారంలోకి దింపాయి. ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా తెలుగు ప్రజలు అత్యధికంగా ఉండే ప్రాంతాలలో పర్యటిస్తూ తమ తమ పార్టీల అభ్యర్థులను గెలిపించాలంటు కోరారు. శనివారం సాయంత్రం ఎన్నికల ప్రచార పర్వం ముగిసే వరకు అనేక మంది తమదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా మహారాష్ట్రలో అక్టోబరు 21వ తేదీ సోమవారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణకు చెందిన కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి కిషన్రెడ్డి, ఇతర బీజేపీ నాయకులు నటుడైన మాజీ మంత్రి బాబు మోహన్, నిజమాబాదు ఎంపి ధర్మపురి అరవింద్, ధరం గురువా రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డిలతోపాటు కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి, హస్య నటుడు బ్రహ్మానందం, సీతారాం ఏచూరి తదితర నాయకులు గత కొన్ని రోజులుగా ప్రచారం చేశారు. బై, భివండీలతోపాటు పశ్చిమ మహారాష్ట్రలని షోలాపూర్, పుణే మొదలగు ప్రాంతాలపై వీరు ప్రత్యేక శ్రద్ద చూపించారు. దీంతో తెలుగు వారుండే పలు ప్రాంతాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న అనుభూతి కలిగిందని చెప్పవచ్చు. ఫ్లకార్డుల నుంచి వేదికపై బ్యానర్లు తదితరాలన్ని దాదాపు తెలుగులోనే దర్శనమిస్తున్నాయి. మహేశ్ కోటెకు మద్దతుగా బ్రహ్మానందం, స్నేహా ఉల్లాస్ షోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజక వర్గం నుంచి పోటీచేస్తున్న శివసేన తిరుగుబాటు ఇండిపెండెంట్ అభ్యర్ధి మహేశ్ కోటేకు మద్దతుగా ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, నటీ స్నేహా ఉల్లాస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నిన్న మధ్యాహ్నం వీరిద్దరు పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని 70 ఫీట్ల రోడ్ నుంచి ప్రారంభమైన ఈ రోడ్ షో తుకారాం చౌక్, అశోక్ చౌక్, పద్మశాలి చౌక్, మౌలాలి చౌక్, సివిల్ కోర్టు మీదుగా సాగింది. సినీ నటీ నటులను చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. ఇండిపెండెంట్గా పోటీచేస్తున్న మన తెలుగు అభ్యర్ధి మహేశ్ కోటేను గెలిపించాలని ఇరువురు కోరారు. ముగిసిన ఎన్నికల ప్రచారం మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా వాడివేడిగా సాగిన ప్రచారపర్వం నిన్నటితో ’(శనివారం)తో ముగిసింది. చెదురుముదురు సంఘటనలు మినహా ప్రశాంతంగానే ప్రచారాలు ముగిశాయి. అక్టోబరు 21వ తేదీ జరగనున్న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలలో మొత్తం 8,97,62,706 మంది ఓటర్లున్నారు. ఇతర ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 95, 473 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా 1.8 లక్షల ఈవీఎంలను వినియోగించనున్నారు. ఈ సారి సుమారు 13 రోజులు మాత్రమే ప్రచారాలకు సమయం లభించింది. బహుముఖ పోటీ? రాష్ట్రంలో నియోజకవర్గాలన్నింటిలో త్రిముఖ, బహుముఖ పోటీ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. గత సంవత్సరం ఒంటరిగా బరిలోకి దిగిన ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, ఎన్సీపీలు, శివసేన, బీజేపీల కూటమిగా పోటీ చేస్తున్నాయి. మరోవైపు వంచిత్ బహుజన్ ఆఘాడి, ఎమ్మెన్నెస్, ఎంఐఎం, ఎస్పీ, బీఎస్పీలతోపాటు ఇతర స్థానిక పార్టీలున్నాయి. ఇలాంటి నేపథ్యంలో దాదాపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో త్రిముఖ, బహుముఖ పోటీ ఏర్పడింది. కొన్ని నియోజకవర్గాల్లో శివసేన, బీజేపీల కూటమి, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమిల మధ్య ప్రధాన పోటీ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. హామీల వర్షం.. అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన వివిధ పార్టీల మేనిఫేస్టోలలో హామీల వర్షం కురిపిచాయి. అనేక అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. స్వాతంత్ర వీర్ సావర్కర్కు భారతరత్న అవార్డు ఇవ్వనుండటంతో మరాఠ్వాడా కోసం వాటర్ గ్రిడ్ ఇతర మౌళిక సదుపాయాలు, రూ. 10కే భోజనం, రూ. 1 కే వైద్యకీయ పరీక్షలు మౌళిక సదుపాయాలు, సొంత ఇళ్లు, విద్యుత్ సమస్య, రైతుల సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం తదితరాలు మేనిఫేస్టోలలో పొందుపరిచారు. పెద్ద పార్టీగా అవతరించనున్న బీజేపీ? రాష్ట్రంలో అత్యధిక సీట్లను బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎన్నికలకు ముందు చేసిన సర్వేలన్ని కూడా ఇవే చెబుతున్నాయి. గత కొంత కాలంగా రాష్ట్రంలో బీజేపీ బలోపేతమైంది. లోకసభ ఎన్నికల తర్వాత బీజేపీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నిండింది. దీంతో ఈసారి బీజేపీ మనోబలంపెరిగింది. మరోవైపు శివసేన రెండవ అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని కొందరు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ ఈ సారి నాలుగో స్థానంలో నిలువగా ఎన్సీపీ రెండో స్థానంలో నిలుస్తుందని అంచనాలు వేశాయి. ప్రచారం చేసిన ప్రముఖులు.. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు ప్రచారం చేశారు. ప్రముఖ పార్టీల జాతీయ నాయకులు ప్రచార సభలు జరిగాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్ తదితర అనేక మంది పాల్గొన్న సభలకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. అయితే వీరందరు ఓట్లు ఎవరికి వేస్తారనేది వేచిచూడాల్సిందే. ఈ సారి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కోసం కాంగ్రెస్ జాతీయ నాయకులు దూరంగా ఉండటం అందరినీ విస్మయం కలిగించింది. రాహుల్ గాంధీ ముంబైలో ఒక సభలో పాల్గొన్నప్పటికీ సోనియాగాంధీ, ప్రియంకా గాంధీలు మాత్రం ఎక్కడా కానరాలేదు. ప్రచారానికి వారిద్దరు దూరం ఉండటం గమనార్హం. ఈ సారి ఎన్నికల్లో దివంగత బాల్ ఠాక్రే మనుమడైన యువసేన అధ్యక్షులు ఆదిత్య ఠాక్రే ముంబై వర్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఠాక్రే కుటుంబం నుంచి మొట్టమొదటిసారిగా ఆయన పోటీ చేస్తుండటం ఈ ఎన్నికల విశేషం. భారీ వర్షంలో శరద్ పవార్ సభ... సాతారాలో భారీ వర్షంలో కూడా ఎన్సీపీ అధ్యక్షులు శరద్ పవార్ సభ కొనసాగించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయ అంశంగా మారింది. సుమారు 80 ఏళ్ల వయసులో కూడా ఆయన వర్షంలోను ఎలాంటి ఇబ్బంది లేకుండా మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సాతారాలో శుక్రవారం రాత్రి సభలో శరద్ పవార్ ప్రసంగం ప్రారంభించగానే భారీ వర్షం ప్రారంభమైంది. అయితే అనేక మంది వర్షం కారణంగా సభలను రద్దు చేసుకోగా శరద్ పవార్ మాత్రం భారీ వర్షంలోనే సభ కొనసాగించారు. దీనిపై యువసేన అధ్యక్షులు ఆదిత్య ఠాక్రే స్పందించారు. తన తాత దివంగత బాల్ ఠాక్రే మిత్రులైన శరద్ పవార్ నుంచి నేర్చుకోవల్సింది చాలా ఉందన్నారు. మరోవైపు ఉక్కులాంటి నేతృత్వం మాకు లభించిందని అజిత్ పవార్ను కొనియాడారు. -
మందగమనంతో కొలువుల కోత
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై ఆ పార్టీ భాగస్వామ్య పక్షమైన శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తనదైన శైలిలో చురకలు వేశారు. ఎవరు అంగీకరించినా లేకున్నా ఆర్థిక వ్యవస్థ మందగమనం ఎదుర్కొంటోందని, దీంతో దేశంలో నిరుద్యోగ సమస్య ఉత్పన్నమైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక మందగమనం ఉందా లేదా అన్నది తర్వాత తెలియవచ్చినా ఉద్యోగాలు మాత్రం తగ్గిపోతున్నాయి..వ్యాపారాలు మూతపడుతున్నాయి..ఇది స్పష్టంగా కనిపిస్తోంది దీన్ని మనం అంగీకరించా’లని పార్టీ పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉద్థవ్ ఠాక్రే స్పష్టం చేశారు. 2014 నుంచి శివసేన మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉన్నా ఎప్పుడూ తాము ప్రభుత్వాన్ని అస్థిరపరచలేదని అన్నారు. ప్రభుత్వంలో ఎక్కడైనా తప్పిదాలు జరిగినప్పుడు మాత్రం తాము తమ గళం వినిపించామని గుర్తుచేశారు. సంకీర్ణ సర్కార్లో సంయమనం అవసరమని, భాగస్వామ్య పక్షం దూకుడు పెంచితే ప్రమాదాలు తప్పవని వ్యాఖ్యానించారు. ఇలాంటి సందర్భాలు గతంలో ఎదురయ్యాయని 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ-శివసేన పొత్తుకు విఘాతం కలిగిన విషయాన్ని ప్రస్తావించారు. -
‘నేడు సీట్ల సర్దుబాటు ప్రకటన’
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్ధుబాటు వివరాలను బీజేపీ-శివసేన కూటమి నేడు ప్రకటించనుంది. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్లు ఆదివారం మీడియా సమావేశంలో సీట్ల సర్ధుబాటును అధికారికంగా వెల్లడించనున్నారు. ఆదివారంతో దేవీ నవరాత్రులు ఆరంభమవుతున్న క్రమంలో ప్రకటన చేసేందుకు శుభసూచకంగా ఇరు పార్టీలు భావిస్తున్నాయి. మరోవైపు బీజేపీ చీఫ్ అమిత్ షాతో చర్చలు సానుకూలంగా జరిగాయని త్వరలోనే తుది నిర్ణయం వెల్లడిస్తామని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే పేర్కొన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర సీఎంగా శివసైనికుడిని అందలం ఎక్కిస్తానని తన తండ్రి, దివంగత బాల్ థాకరేకు తాను వాగ్ధానం చేశానని కూడా ఉద్ధవ్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి కొనసాగుతారని బీజేపీ అగ్రనేతలు స్పష్టం చేసిన నేపథ్యంలో ఉద్ధవ్ చేసిన వ్యాఖ్యలు కూటమి వర్గాల్లో చర్చకు తెరతీశాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ 21న పోలింగ్ జరగనుండగా, 24న ఫలితాలు వెలువడతాయి. -
ఆ రోజు దగ్గరలోనే ఉంది - ఉద్ధవ్ ఠాక్రే
ముంబై: అక్టోబర్ 21న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసే అంశంపై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే స్పష్టత ఇచ్చారు. రాబోయే ఒకటి, రెండు రోజుల్లో శివసేన, భారతీయ జనతా పార్టీ సీట్ల భాగస్వామ్య ఏర్పాట్లను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు. పొత్తుపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని, ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్నఅంశంపై కసరత్తు జరుగుతోందని చెప్పారు. బీజేపీ జాతీయ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్తో ఇరు పార్టీల మధ్య సీట్ల భాగస్వామ్య ఒప్పందంపై తుది చర్చలు జరుగుతున్నాయని, కొన్ని సీట్లపై కూటమిలోని పార్టీలు ఒక అవగాహనకు రావాల్సి ఉందని ముంబైలోని పార్టీ కార్యకర్తలు, నాయకులతో నిర్వహించిన సమావేశంలో తెలియజేశారు. అదే సందర్భంలో తాను తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే రోజు కూడా ఎంతో దూరంలో లేదన్నారు. ఎన్డీఏ-శివసేన కూటమి అధికారంలోకి రాగానే సీఎం పదవిని చెరో రెండున్నర సంవత్సరాలు బీజేపీ, శివసేన పంచుకునే అవకాశాలున్నాయని ఊహాగానాలు వెలువడుతున్న తరుణంలో ఉద్ధవ్ ఠాక్రే చేసిన ఈ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
సేన గూటికి ఎన్సీపీ ముంబై చీఫ్
ముంబై : మహారాష్ట్రలో ఎన్సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముంబై ఎన్సీపీ చీఫ్ సచిన్ అహిర్ ఆ పార్టీని వీడి గురువారం శివసేనలో చేరారు. సేన చీఫ్ ఉద్ధవ్ థాకరే సమక్షంలో అహిర్ ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శివసేన గూటికి చేరేముందు అహిర్ ఉద్ధవ్ థాకరే, ఆయన కుమారుడు ఆదిత్య థాకరేలను సేన కార్యాలయంలో కలుసుకున్నారు. 2009-14లో మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ సర్కార్లో అహిర్ మంత్రిగా వ్యవహరించడం గమనార్హం. ముంబైలోని వొర్లికి చెందిన అహిర్ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్కు అత్యంత సన్నిహితుడు. అహిర్ పార్టీని వీడటం ఎన్సీపీకి గట్టి షాక్గా భావిస్తున్నారు. కాగా మహారాష్ట్ర మాజీ సీఎం, ఎన్సీపీ సీనియర్ నేత చగన్ భుజ్భల్ సైతం త్వరలో శివసేనలో చేరతారని భావిస్తున్నారు. -
ముంబై నగరి ఎవరిపై గురి
మహారాష్ట్ర రాజధాని ముంబై మహానగరంలోని ఆరు సహా 17 లోక్సభ స్థానాల్లో ఈ నెల 29న పోలింగ్ జరుగుతుంది. దీంతో రాష్ట్రంలోని మొత్తం 48 సీట్లకు ఎన్నికలు పూర్తవుతాయి. కిందటి ఎన్నికల సమయంలో కేంద్రంలో, రాష్ట్రంలో యూపీఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. తర్వాత రెండు చోట్లా బీజేపీ నాయకత్వంలోని సంకీర్ణాల పాలన వచ్చింది. ఐదేళ్ల కాషాయ కూటమి పాలన తర్వాత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మారిన రాజకీయ పరిస్థితులు 2019 పార్లమెంటు ఎన్నికల ఫలితాలను ఏ మేరకు ప్రభావితం చేస్తాయో అంచనావేయ లేకపోతున్నారు. 2014లోక్సభ ఎన్నికల్లో ఈ 17 సీట్లలో 8 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా, తొమ్మిది సీట్లను దాని మిత్రపక్షం శివసేన గెలుచుకుంది. నాలుగోదశలో పోలింగ్ జరిగే ఈ ఎన్నికల్లో మూడు కోట్ల 11 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకుంటారు. ముంబైలోని ఆరు సీట్లతో(ముంబై సౌత్, నార్త్, నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ సెంట్రల్, సౌత్ సెంట్రల్)పాటు నగర శివార్లలోని పాల్ఘర్, భివాండీ, కల్యాణ్, ఠాణె ఈ 17 సీట్లలో ఉన్నాయి. ఇంకా పశ్చిమ మహారాష్ట్ర పుణే జిల్లాలోని మావల్, శిరూర్, అహ్మద్నగర్ జిల్లా షిర్డీ స్థానాలేగాక ఉత్తర మహారాష్ట్రలోని నందర్బార్, ధూలే, దిండోరీ, నాశిక్ నియోజకవర్గాల్లో కూడా ఏప్రిల్ 29న పోలింగ్ జరుగుతుంది. ముంబైపైనే అందరి దృష్టి ముంబైలో నియోజకవర్గాల్లో కొన్నింటిలో ప్రముఖుల పిల్లలు పోటీలో ఉండడంతో వాటిపై విపరీతమైన ఆసక్తి నెలకొంది. ముంబై నార్త్లో బాలీవుడ్ నటి ఊర్మిళా మాటోండ్కర్(కాంగ్రెస్), ముంబై నార్త్ సెంట్రల్లో బాలీవుడ్ సునీల్ దత్, నర్గీస్ కూతురు ప్రియాదత్(కాంగ్రెస్) పోటీలో ఉన్నందు వల్ల ఈ సీట్లు కీలకంగా మారాయి. ప్రియదత్ను కిందటి సారి ఓడించిన పూనమ్ మహాజన్(బీజేపీ) మళ్లీ నార్త్ సెంట్రల్ నుంచే పోటీకి దిగారు. కిందటి ఎన్నికల్లో ముంబై నార్త్ ఈస్ట్ నుంచి గెలిచిన డా.కిరీట్ సోమయ్యకు ఈసారి బీజేపీ టికెట్ నిరాకరించారు. ఇక్కడ మనోజ్ కోటక్ను బీజేపీ బరిలోకి దింపింది. ఇక్కడ సంజయ్ దీనా పాటిల్ కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి తరఫున మరోసారి రంగంలోకి దిగారు. ముంబై సౌత్ సెంట్రల్లో కిందటిసారి విజేత రాహుల్ రమేష్ షెవాలే(శివసేన) మళ్లీ తన పాత కాంగ్రెస్ ప్రత్యర్థి ఏక్నాథ్ గైక్వాడ్తో తలపడుతున్నారు. ముంబై సౌత్ నియోజకవర్గంలో ముంబై కాంగ్రెస్ కేంద్ర మాజీ మంత్రి మురళీ దేవరా కొడుకు, మాజీ ఎంపీ మిలింద్(కాంగ్రెస్) మరోసారి పోటీచేస్తున్నారు. 2014లో మిలింద్ను ఓడించిన శివసేన నేత అరవింద్ సావంత్ ఇక్కడ రంగంలో ఉన్నారు. కిందటి ఎన్నికల్లో ముంబై సీట్లన్నింటినీ మోదీ ప్రభంజనం ఫలితంగా కాషాయ కూటమి కైవసం చేసుకుంది. నగరంలో పేరుకుపోయిన సమస్యలు, నిరుద్యోగం, పెద్ద నోట్ల రద్దు ప్రభావం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత కారణంగా ఈసారి ఈ కూటమికి కొన్ని చోట్ల ఓటమి తప్పదని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. శివారులో హోరాహోరీ ముంబై నగర శివార్లలోని పాల్ఘర్ స్థానంలో 2014లో బీజేపీ అభ్యర్థి చింతామణ్ వనగా విజయం సాధించారు. ఆయన మరణంతో జరిగిన 2018 ఉప ఎన్నికలో శివసేనతో పొత్తు లేకుండా బీజేపీ విజయం సాధించింది. కాని, ఈసారి పాల్ఘర్ను శివసేనకు కేటా యించారు. ఎస్టీలకు కేటాయించిన ఈ స్థానంలో శివసేన తరఫున రాజేంద్ర గావిత్ పోటీచేస్తున్నారు. కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి తన మిత్రపక్షమైన బహుజన్ వికాస్ ఆఘాడీకి ఈ సీటు కేటాయించగా ఈ పార్టీ నేత, మాజీ ఎంపీ బలిరామ్ జాధవ్ మళ్లీ బరిలోకి దిగారు. 2009లో ఏ పార్టీతో పొత్తు లేకుండా బహుముఖ పోటీలో జాధవ్ ఈ సీటు నుంచి విజయం సాధించారు. మరో శివారు నియోజకవర్గం భివాండీలో బీజేపీ సిటింగ్ సభ్యుడు కపిల్ పాటిల్, ఆయన పూర్వ కాంగ్రెస్ ప్రత్యర్థి సురేష్ తవారే మళ్లీ ఇక్కడ పోటీపడుతున్నారు. తెలుగు ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన జనం పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఠాణేలో శివసేన సిటింగ్ సభ్యుడు రాజన్ విచా రే, ఎన్సీపీ కొత్త అభ్యర్థి ఆనంద్ పరంజపేతో తలపడుతున్నారు. కల్యాణ్ స్థానంలో శివసేన సభ్యుడు శ్రీకాంత్ షిండేతో ఎన్సీపీ నేత బాబాజీ బలరాం పాటిల్ పోటీకి దిగారు. ఠాణే జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్ అయిన పాటిల్ లోక్సభకు పోటీచేయడం ఇదే మొదటిసారి. సామాజిక కార్యకర్తగా మంచి పేరు తెచ్చుకున్నారు. శివసేన అభ్యర్థికి ఆయన గట్టి పోటీ ఇస్తారని భావిస్తున్నారు. పశ్చిమంలో ‘మూడు’ ఎటువైపు? రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న ఆధిపత్య కులమైన మరాఠాలకు బలమైన కేంద్రమైన పశ్చిమ మహారాష్ట్రలోని మావల్, శిరూర్, షిర్డీలో కాంగ్రెస్–ఎన్సీపీ కూటమికి, బీజేపీ–శివసేన కూటమికి మధ్య పోటీ గట్టిగా ఉంది. మరాఠా యోధుడు శరద్ పవార్ అన్న కొడుకు, మాజీ ఎంపీ అజిత్ పవార్ కొడుకు పార్థ్ పవార్ ఎన్సీపీ అభ్యర్థిగా తొలిసారి మావల్ నుంచి పోటీచేస్తుండడంతో ఈ స్థానం అందరి దృష్టి ఆకర్షిస్తోంది. శరద్పవార్ ఈ ఎన్నికల్లో లోక్సభకు పోటీచేయరాదని నిర్ణయించుకోవడంతో పార్థ్కు అవకాశం వచ్చింది. శివసేన సిట్టింగ్ సభ్యుడు శ్రీరంగ్ బర్నే మళ్లీ బరిలోకి దిగారు. పవార్ కుటుంబ సభ్యులు శరద్, పార్థ్ తల్లి సునేత్ర, వరుసకు మేనత్త, శరద్ కూతురు సుప్రియా సూలే మావల్లో ఎన్సీపీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తున్నారు. శివసేన అభ్యర్థి తరఫున కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా సహా పలువురు అగ్రనేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మహా రాష్ట్ర నవనిర్మాణ్ సేన నేత రాజ్ ఠాక్రే నియోజకవర్గంలో చేస్తున్న ప్రచారం కూడా ఎన్సీపీకి ప్రయోజనకరమని భావిస్తున్నారు. ఇదే ప్రాంతంలోని శిరూర్లో శివసేన తరఫున పోటీచేస్తున్న ప్రస్తుత ఎంపీ శివాజీరావ్ పాటిల్ గతంలో మూడుసార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. 2014లో ఆయన తన సమీప ఎన్సీపీ ప్రత్యర్థి దేవదత్త నికమ్ను మూడు లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఓడించారు. ఈసారి శివాజీరావ్ను ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో మరాఠీ టీవీ సీరియల్ ‘స్వరాజ్య రక్షక్ సంభాజీ’ నటుడు అమోల్ కోల్హేకు ఎన్సీపీ టికెట్ ఇచ్చి ఆయన తరఫున ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. షిర్డీలో హేమాహేమీల ప్రచారం ప్రసిద్ధ సాయిబాబా ఆలయం ఉన్న అహ్మద్నగర్ జిల్లా షిర్డీ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ సహా ప్రధాన పార్టీల అగ్రనేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. కాషాయ కూటమిలో శివసేనకు ఈ సీటులో మరోసారి పోటీకి అవకాశమిచ్చారు. సేన సిట్టింగ్ సభ్యుడు సదాశివ్ లోఖాండే మళ్లీ పోటీచేస్తున్నారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి భౌసాహిబ్ మల్హరీ కాంబ్లే పోటీకి దిగారు. ఈ ప్రాంతంలో రైతుల్లో పెరుగుతున్న అసంతృప్తి వల్ల శివసేన అభ్యర్థి గెలుపు అంత తేలిక కాదని భావిస్తున్నారు. కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన రాజారామ్ వాక్చౌరేపై దాదాపు రెండు లక్షల ఓట్ల ఆధిక్యంతో శివసేన అభ్యర్థి గెలిచారు. రాజారామ్ వాక్చౌరే తర్వాత బీజేపీలో చేరి షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్టీగా నియమితులయ్యారు. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగడంతో ఆయనను బీజేపీ బహిష్కరించింది. ఈ కీచులాటల వల్ల శివసేన నేత లొఖాండేకు గట్టి పోటీ ఎదురౌతోంది. 64 మంది అభ్యర్థులపై తీవ్ర నేరారోపణలు మహారాష్ట్రలోని 17 లోక్సభ స్థానాల్లో పోటీపడుతున్న 323 అభ్యర్థుల్లో 109 మంది కోటీశ్వరులున్నారు. వారిలో 64 మంది అభ్యర్థులపై తీవ్ర నేరారోపణులున్నాయని నేషనల్ ఎలక్షన్ వాచ్, ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం(ఏడీఆర్) వెల్లడించాయి. ఈ అభ్యర్థులు తమ అఫిడవిట్లలో తెలిపిన వివరాల ఆధారంగా ఈ విషయాలు తెలిశాయి. వంచిత్ బహుజన్ ఆఘాడీకి చెందిన ఓ అభ్యర్థి హత్య కేసులో నిందితుడని, మరో ముగ్గురు అభ్యర్థులు హత్యాయత్నం కేసుల్లో నిందితులని ఈ సంస్థలు తెలిపాయి. ప్రియ వర్సెస్ పూనమ్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ ప్రమోద్ మహాజన్ కూతురు పూనమ్. సినీ రాజకీయ రంగాల్లో రాణించి స్థానిక ప్రజల్లో తనదైన ముద్ర వేసిన సునీల్ దత్ కూతురూ, ప్రియాదత్ కాంగ్రెస్ అభ్యర్థిగా ముంబై నార్త్ సెంట్రల్ నుంచి తలపడబోతున్నారు. 2004, 2009లో ముంబైలో గెలుపు బావుటా ఎగురవేసిన ప్రియాదత్పై 2014లో బీజేపీ అభ్యర్థి పూనమ్ మహాజన్ 1 లక్షా 86 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మోదీ ప్రభంజనంలో పూనమ్కు 56.6శాతం ఓట్లు వస్తే, కాంగ్రెస్కి పట్టున్న ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాదత్కి 34.51 శాతం ఓట్లు పోలయ్యాయి. ముంబై మెట్రో నిర్మాణం, ముంబై పోర్ట్ ట్రస్ట్, నెహ్రూ పోర్ట్ ట్రస్ట్లను కలుపుతూ రవాణా వ్యవస్థను ఏర్పాటు, ఎయిర్పోర్ట్ పరిసరాల్లోని మురికివాడల ప్రజలకు గృహ నిర్మాణం బీజేపీ అభ్యర్థి పూనమ్ మహాజన్ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా వినిపిస్తోన్న హామీలు. ఆమె ప్రత్యర్థి ప్రియాదత్ మాత్రం ఇళ్ల నిర్మాణమే తన తక్షణ ప్రాధాన్యత అనీ, పర్యావరణ పరిరక్షణ, మురికివాడల అభివృద్ధిని చేపడతానంటున్నారు. ముంబై సౌత్లో మిలింద్ దేవరా ముంబై సౌత్లో శివసేన సిట్టింగ్ సభ్యుడు అరవింద్ సావంత్తో మరోసారి కాంగ్రెస్ మాజీ మంత్రి మిలింద్ దేవరా తలపడుతున్నారు. నెల క్రితమే ఆయన నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టారు. ఆయన తండ్రి, కేంద్ర మాజీ మంత్రి మురళీ దేవరా 22 ఏళ్లు ఈ పదవిలో ఉన్నారు. నియోజకవర్గంలోని 15 లక్షల 30 వేల మంది ఓటర్లలో ఆరు లక్షల మంది మరాఠీలు కాగా, దాదాపు మూడున్నర లక్షల మంది ముస్లింలు ఉన్నారు. ఈ రెండు వర్గాల ఓట్ల కోసం సావంత్, దేవరా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో మిలింద్పై శివసేన నేత సావంత్ లక్షా పాతిక వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అప్పుడు 84 వేల ఓట్లు సాధించిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) ఈసారి పోటీలో లేదు. నియోజకవర్గంలోని కాలాచౌకీ ప్రాంతంలో ఎంఎన్ఎస్ నేత రాజ్ ఠాక్రే భారీ ర్యాలీలో ప్రసంగిస్తూ బీజేపీని కేంద్రంలో అధికారంలోకి రాకుండా చేయడానికి ముంబై సౌత్లో శివసేనను ఓడించాలని పిలుపునిచ్చారు. దీని వల్ల కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్కు ప్రయోజనకరమని భావిస్తున్నారు. అరవింద్ సావంత్ తరఫున శివసేన అధినేత కొడుకు, యువ సేన నేత ఆదిత్య ఠాక్రే అనేక ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఊర్మిళ వర్సెస్ గోపాల్ షెట్టి సినీ నటి ఊర్మిళ మాటోండ్కర్, స్థానిక బీజేపీ నాయకుడు గోపాల్ షెట్టిల మధ్య ముంబైనార్త్లో పోటీ రసవత్తరంగా మారింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ నిరుపమ్పై 4 లక్షల ఓట్ల మెజారిటీతో గోపాల్ షెట్టి గెలిచారు. 16 లక్షల మంది ఓటర్లున్న ముంబై నార్త్లోని మొత్తం ఆరు అసెంబ్లీ సీట్లలో మలద్ అసెంబ్లీ సీటు ఒక్కటే 2014లో కాంగ్రెస్ గెలుచుకోగలిగింది. నాలుగు బీజేపీ, ఒకటి శివసేన దక్కించుకున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్కి ముందే కాంగ్రెస్లో చేరిన ఊర్మిళ ఈ దేశంలో భావ వ్యక్తీకరణ ప్రమాదకరంగా తయారయిందంటూ బీజేపీని విమర్శించారు. అత్యధికంగా క్రైస్తవుల జనాభా ఉన్న ముంబై నార్త్లోని వర్లీ, మాల్వానీ ప్రాంతాల్లో గత ఎన్నికల సందర్భంగా క్రైస్తవులను విదేశీయులంటూ గోపాల్షెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. ఓ పక్క ఊర్మిళ ప్రచార హోరు, ఊర్మిళకున్న జనాకర్షణకు తోడు గోపాల్ షెట్టిపై క్రైస్తవుల్లో ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్కి కలిసొచ్చే అంశాలని విశ్లేషకులు భావిస్తున్నారు. -
విజయం ఖాయమని తెలిసే పోటీకి దూరం!
ముంబై : లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూ ప్రచారానికి పదును పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ మిత్రపక్షం శివసేన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, బీఎస్పీ అధినేత్రి మాయావతి లక్ష్యంగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది. వారిద్దరు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పడం..నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావడానికి సంకేతమని అభిప్రాయపడింది. ఈ మేరకు తన అధికార పత్రిక సామ్నాలో మాయావతి, శరద్ పవార్ల తీరును విమర్శిస్తూ శివసేన కథనం ప్రచురించింది. ‘తాము ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించి ప్రధాని రేసు నుంచి తప్పుకొంటున్నట్టు శరద్ పవార్, మాయావతి స్పష్టం చేశారు. బీఎస్పీ అభ్యర్థులను గెలిపించేందుకు మాయావతి కృషి చేస్తారట. అందుకే పోటీ చేయడం లేదని చెప్పారు. దళితుల పార్టీగా చెప్పుకొనే బీఎస్పీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో ఒక్క సీటు కూడా గెలవలేదు. దళితులు, యాదవులు గంపగుత్తగా మోదీకే ఓటు వేశారు. ఆ చేదు అనుభవానికి సంబంధించిన మరక ఈ నాటికీ మాయావతిని వెంటాడుతోంది.నిజానికి ఉత్తరప్రదేశ్లో తప్ప మరే ఇతర రాష్ట్రంలోనూ బీఎస్పీకి ఆదరణ లేదు. బహుషా ఈ విషయాన్ని గుర్తెరిగినందు వల్లే ఆమె ఎన్నికల బరి నుంచి పారిపోయారు. అదే విధంగా ప్రస్తుతం ప్రియాంక గాంధీ రూపంలో బీఎస్పీకి మరో ముప్పు పొంచి ఉంది. ప్రియాంక ‘పర్యాటక యాత్ర’ కు వస్తున్న కొద్దిపాటి స్పందన మాయావతిని భయపెడుతోంది. ఇన్ని ప్రతికూల అంశాల మధ్య పోటీ చేయరాదని బహుషా బెహన్ జీ భావించారేమో. అందుకే ఈ నిర్ణయం’ అంటూ ఎద్దేవా చేసింది.(నేను పోటీ చేయను) ముందు కుటుంబాన్ని చక్కదిద్దుకోండి..! ‘ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేయడానికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ పాపం చాలా ప్రయత్నించారు. కానీ తన కుటుంబ సభ్యులను, పార్టీ కార్యకర్తలనే ఏకతాటిపైకి తీసుకురాలేకపోయారు. ఆయన పార్టీ వాళ్లు బీజేపీలో చేరుతుండటం ఎన్సీపీకి పెద్ద ఎదురుదెబ్బే. ముఖ్యంగా రంజిత్సిన్హా మోహిత్ పాటిల్ వంటి ముఖ్య నాయకులు పార్టీని వీడటం ద్వారా ఎన్సీపీ బలహీనపడుతుంది. అందుకే శరద్ పవార్ కూడా మాయావతి మార్గాన్నే అనుసరించారు. ఎన్డీయే కూటమి విజయం ఖాయమని తెలిసి పోటీ నుంచి తప్పుకొన్నారు’ అని శరద్ పవార్పై శివసేన విమర్శలు గుప్పించింది. -
చితి బూడిద చల్లారే వరకు కూడా ఆగలేదు..
ముంబై : గోవాలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ ఆడిన రాజకీయ క్రీడ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టివేసిందని ఆ పార్టీ మిత్రపక్షం శివసేన విమర్శించింది. అధికారం కోసం సిగ్గుమాలిన చర్యకు పాల్పడిందంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ మేరకు శివసేన అధికార పత్రిక సామ్నాలో కథనం ప్రచురించింది. ‘ మనోహర్ పరీకర్ భౌతికకాయంపై ఉంచిన పువ్వులు వాడనే లేదు. ఆయన చితాభస్మం చల్లారనూ లేదు. కానీ అదే సమయంలో బీజేపీ నీచ రాజకీయ క్రీడకు తెరతీసింది. అధికార వ్యామోహంతో అర్ధరాత్రి కొత్త సీఎంతో ప్రమాణ స్వీకారం చేయించింది. మరో నాలుగు గంటలు ఆగితే ఏం పోయేది. బీజేపీ వ్యవహరించిన విధానం ప్రజాస్వామ్య వ్యవస్థకు చాలా ప్రమాదకరం’ అని బీజేపీ తీరును ఎండగట్టింది. చదవండి : రాత్రి 2గంటలకు సీఎంగా ప్రమాణమా? బీజేపీ మాట తప్పింది.. డిప్యూటీ సీఎంల నియామకం గురించి ప్రస్తావిస్తూ... ‘నాలుగేళ్ల క్రితం బీజేపీ ఉప ముఖ్యమంత్రులుగా పదవులు ఇవ్వమని చెప్పిన బీజేపీ.. అధికారం కోసం మాట తప్పింది. కేవలం 19 ఎమ్మెల్యేలలో ఇద్దరిని డిప్యూటీ సీఎంలుగా నియమించింది. నేటికీ మనోహర్ పరీకర్ మరణాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మరణానికి సంతాప సూచకంగా జాతీయ జెండాను హాఫ్ మాస్ట్ చేసే ఉంచారు. కనీసం అలా ఎందుకు చేస్తారోనన్న విషయం గురించి బీజేపీ వాళ్లకు కాస్తైనా అవగాహన ఉందో లేదో’ అంటూ సామ్నాలో శివసేన వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కాగా కేంద్రం, రాష్ట్రంలో తమతో అధికారం పంచుకున్న శివసేన ఎమ్మెల్యేకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడానికి బీజేపీ నిరాకరించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి మిత్రపక్షంపై విమర్శలు సంధిస్తున్న శివసేన...సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఆ పార్టీతో జట్టు కట్టడం విశేషం. ఇక పదవిలో ఉండగానే గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్ అనారోగ్యంతో ఆదివారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో కొనసాగుతుండగానే మరోపక్క బీజేపీ అధిష్టానం గోవా ముఖ్యమంత్రి ఎంపిక, అందుకు కావాల్సిన మద్దతును మిత్రపక్షాల నుంచి కూడగట్టేందుకు జోరుగా మంతనాలు జరిపింది. తమ పార్టీ నేత, అసెంబ్లీ స్పీకర్ ప్రమోద్ సావంత్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టి.. సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ) ఎమ్మెల్యే సుదిన్ దివాలికర్, గోవా ఫార్వర్డ్ పార్టీ ఎమ్మెల్యే విజయ్ సర్దేశాయ్లకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశమిచ్చింది. దీంతో అధికార పార్టీ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పొత్తు ఫైనల్ : బీజేపీ 25, శివసేన 23 స్ధానాల్లో పోటీ
సాక్షి, ముంబై : మూడేండ్ల పాటు కలహాల కాపురం సాగించిన బీజేపీ-శివసేన మరోసారి భాయ్-భాయ్ అన్నాయి. మహారాష్ట్రలో చెరిసగం సీట్లకు పోటీచేసేందుకు అంగీకరించాయి. శివసేనతో బీజేపీ చీఫ్ అమిత్షా చేపట్టిన మంత్రాంగం ఫలించింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 25 స్ధానాల్లో, శివసేన 23 స్ధానాల్లో పోటీ చేసేందుకు అంగీకారం కుదిరిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధికారికంగా ప్రకటించారు. ఎన్నికలకు ముందు పొత్తుపై బీజేపీతో అంగీకారానికి వచ్చినట్టు శివసేన నేత సంజయ్ రౌత్ అంతకుముందు వెల్లడించారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే, బీజేపీ అధ్యక్షుడు అమిత్షా ఇరు పార్టీల పొత్తుపై లాంఛనంగా ప్రకటన చేయనున్నారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటూనే ప్రధాని మోదీని, బీజేపీని దుమ్మెత్తిపోయడం శివసేనకు రివాజుగా మారింది. మిత్రపక్షమే ఇలాంటి విమర్శలు చేయడమా? అని అందరూ నోళ్లు నొక్కుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాగా, ఓ దశలో శివసేన ఒంటరిగా పోటీ చేస్తుందేమో.. కమలానికి పక్కలో బల్లెంగా మారుతుందేమో అని అనుమానాలు కలిగాయి. కానీ మేమంతా నిజానికి ఒకటేనని, ఒకేగూటి పక్షులమని రెండు పార్టీలు తమ పొత్తు ఖరారు చేసుకున్నాయి.మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ సీట్లలో 50-50 పద్ధతిలో ఇరు పార్టీల మధ్య సీట్ల పంపిణీ జరుగుతుంది. అలాగే బీజేపీ 25 స్ధానాల్లో బరిలో నిలవనుండగా, సేన 23 స్థానాల్లో పోటీ చేయనుంది. దాదాపు మూడు దశాబ్దాలుగా మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ-శివసేన మధ్య గత 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైరం ఏర్పడింది. విడివిడిగా పోటీచేశాయి. ఏ ఒక్క పార్టీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో ఎన్నికల తర్వాత పొత్తుపెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మారిన సమీకరణలు.. సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. నిన్న, మొన్నటి వరకూ ఎడమొహం, పెడమొహంగా ఉన్న శివసేన మళ్లీ బీజేపీతో కలిసిపోయింది. రానున్న ఎన్నికల్లో మహారాష్ట్రలో చెరి సగం సీట్లు పంచుకుని రెండు పార్టీలు పొత్తును ఖరారు చేసుకున్నాయి. గత కొద్ది నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న బీజేపీ– శివసేనల మధ్య పొత్తు సోమవారం ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. రాష్ట్రంలో మొత్తం 48 లోక్సభ స్థానాలుండగా అందులో శివసేన 23 స్థానాలు, బీజేపీ 25 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో 50:50 ఫార్ములాకు ఇరు పార్టీలు అంగీకరించినట్లు తెలిసింది. దీంతో ఇరుపార్టీల నాయకుల్లో నెలకొన్న ఉత్కంఠకు తెర దింపినట్లు అయింది. పొత్తుపై స్పష్టత రావడంతో బీజేపీ, శివసేన నాయకులు ఊపిరీ పీల్చుకున్నారు. శివసేన ఖాతాలోకి పాల్ఘర్! గత లోక్సభ ఎన్నికల్లో శివసేన 22 స్థానాల్లో పోటీ చేసింది. కానీ, పాల్ఘర్ లోక్సభ నియోజక వర్గం బీజేపీ ఎంపీ చింతామణ్ వంగా మృతి చెందడంతో ఆ స్థానం ఖాళీ అయింది. అక్కడ గత సంవత్సరం మేలో ఉప ఎన్నిక జరిగింది. చింతామణ్ వంగా చనిపోయిన తరువాత బీజేపీ నాయకులు తమ కుటుంబాన్ని పట్టించుకోలేదని ఆరోపిస్తూ ఆయన కుమారుడు శ్రీనివాస్ వంగా శివసేనలో చేరారు. సానుభూతి ఓట్లతో కచ్చితంగా శ్రీనివాస్ గెలుస్తాడని భావించిన శివసేన బీజేపీని ఎన్నికల బరిలోంచి తప్పుకోవాలని సూచించింది. కానీ, ఆ స్థానం బీజేపీదేనని తమ అభ్యర్థిని బరిలోకి దింపుతామని బీజేపీ పట్టుబట్టింది. చివరకు అక్కడ జరిగిన ఉప ఎన్నికలో శ్రీనివాస్ ఓటమి పాలవగా బీజేపీ అభ్యర్థి రాజేంద్ర గావిత్ గెలిచారు. కానీ, ఇప్పుడు ఈ స్థానాన్ని తమకే ఇవ్వాలని శివసేన పట్టుబట్టడంతో బీజేపీ నాయకులు అంగీకరించినట్లు తెలిసింది. దీంతో శివసేన ఈ స్థానంలో మళ్లీ శ్రీనివాస్ను బరిలోకి దింపుతుందా లేక మరో అభ్యర్థిని ఎంపిక చేస్తారా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా, పాల్ఘర్ లోక్సభ నియోజక వర్గం శివసేన వాటాలోకి వెళ్లడంతో రాజేంద్ర గావిత్ ఇక్కడి నుంచి పోటీ చేయడానికి వీలులేకుండా పోయింది. దీంతో గావిత్ తప్పుకుంటారా లేక తిరుగుబాటు చేసి ప్రత్యర్థిగా బరిలోకి దిగుతారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని మొదటి నుంచి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటిస్తూ వస్తున్నారు. పార్టీ నాయకులు కూడా ఒంటరిగానే బరిలోకి దిగాలని ఉద్ధవ్పై ఒత్తిడి చేశారు. అయినప్పటికీ బీజేపీ నాయకులు కలిసే పోటీ చేస్తామని అనేక సందర్భాలలో ప్రకటిస్తూ వచ్చారు. అమిత్ షా- ఉద్ధవ్ థాకరే భేటీతో పొత్తులపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ప్రస్తుతం రూపొందించిన ఫార్మూల ప్రకారం లోకసభ ఎన్నికల్లో బీజేపీ–25, శివసేన–23, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ–144, శివసేన–144 స్థానాల చొప్పున పోటీ చేస్తారు. ఇంతకుముందు శివసేనతో పొత్తు కుదరకపోవడానికి బీజేపీ మిత్రపక్షాలే ప్రధాన కారణమని తెలిసింది. సీట్లు సర్దుబాటు చేసే సమయంలో మిత్రపక్షాలు రాష్ట్రీయ సమాజ్ పార్టీ, ఆర్పీఐ (రాందాస్ ఆఠావలే వర్గం), శివ్ సంగ్రామ్ పార్టీలకు కనీసం 20 స్థానాలు కేటాయించాలని బీజేపీ పట్టుబట్టింది. కానీ, ఈ మిత్రపక్షాలు బీజేపీకి చెందినవి కావడంతో వాటితో మాకు ఎలాంటి సంబంధం లేదని శివసేన స్పష్టం చేసింది. బీజేపీ తమ వాటాలోకి వచ్చిన స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించాలని శివసేన పేర్కొంది. చివరకు శివసేన డిమాండ్కు బీజేపీ తలొగ్గినట్లు సమాచారం. తాజాగా ఇరు పార్టీలు సగం సీట్లు సర్ధుబాటు చేసుకోవడంతో మిత్ర పక్షాలకు ఎవరి వాటాలో వారే కేటాయించుకోవల్సి ఉంటుందని తెలిసింది. -
బీజేపీతో పొత్తుపై తేల్చనున్న ఉద్ధవ్ థాకరే
సాక్షి, ముంబై : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని శివసేన ఎంపీలు పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరేకు కట్టబెట్టారు. సోమవారం థాకరే నివాసంలో జరిగిన పార్టీ ఎంపీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్రలో ప్రజల పక్షాన తమ పార్టీ పోరాడుతుందని బీజేపీతో పొత్తుపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్టీ ఎంపీలు అధ్యక్షుడికి కట్టబెట్టారని సమావేశానంతరం శివసేన ప్రతినిధి సంజయ్ రౌత్ వెల్లడించారు. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన సమాన సంఖ్యలో పోటీ చేస్తాయనే వార్తలపై ఆయన స్పందిస్తూ తమకు ఇలాంటి సమాచారం లేదని, ఈ తరహా సీట్ల సర్దుబాటును తాము అంగీకరించమని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలో తమ పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తుందన్నారు. పార్టీ ఎంపీల సమావేశంలో తాము రాఫెల్ ఒప్పందంతో పాటు మహారాష్ట్రలోని కరువు పరిస్థితిపైనా చర్చించామని చెప్పుకొచ్చారు. రూ 8 లక్షల లోపు ఆదాయం కలిగిన అగ్రవర్ణ పేదలకు జనరల్ కోటాలో పదిశాతం రిజర్వేషన్లపైనా చర్చించామని, ఈ కోటాకు అర్హులైన వారిని ఆదాయ పన్ను నుంచి మినహాయించాలని ఉద్ధవ్ థాకరే డిమాండ్ చేశారని వెల్లడించారు. వారిని ప్రభుత్వం పేదలుగా ముద్రవేసినప్పుడు వారిని తప్పనిసరిగా ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని అన్నారు. -
33,000 రుద్రాక్షలతో బాల్ థాకరే చిత్రపటం
సాక్షి, ముంబై : శివసేన వ్యవస్ధాపకులు బాలాసాహెబ్ థాకరే 93వ జయంతోత్సవాల సందర్భంగా ఆర్టిస్ట్ చేతన్ రౌత్ 33,000 రుద్రాక్షలతో థాకరే ప్రత్యేక చిత్రపటం రూపొందించారు. బాలాసాహెబ్ థాకరేకు రుద్రాక్షలతో ప్రత్యేక అనుబంధం ఉండటంతో వాటితోనే ఆయన చిత్రపటం రూపొందించానని రౌత్ చెప్పారు. 8 అడుగుల ఎత్తు 8 అడుగుల వెడల్పుతో 33,000 రుద్రాక్షలతో దీన్ని తయారుచేశానని..దీన్ని ప్రపంచ రికార్డుగా మలిచేందుకు ప్రయత్నించానని వెల్లడించారు. థాకరే జయంతోత్సవాలకు అంకితం చేస్తూ ఈ చిత్రపటాన్ని ముంబైలోని శివసేన భవన్ ఎదురుగా అమర్చారు. కాగా దివంగత థాకరే స్మృతి చిహ్నం నిర్మాణానికి రూ 100 కోట్లు కేటాయించాలని మహారాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. గతంలో ముంబై మేయర్ బంగ్లా ఉన్న శివాజీ పార్క్ ఏరియాలో థాకరే మెమోరియల్ నిర్మించనున్నారు. మెమోరియల్ నిర్మాణం కోసం సముద్రానికి అభిముఖంగా ఉన్న 11,500 చదరపు మీటర్ల స్ధలాన్ని ఇప్పటికే బాలాసాహెబ్ థాకరే రాష్ర్టీయ స్మారక్ న్యాస్ (ట్రస్టు)కు కేటాయించారు. -
‘ఇలా చేసి అచ్రేకర్ని అవమానించారు’
ముంబై : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కోచ్, ద్రోణాచార్య పురస్కార గ్రహీత రమాకాంత్ అచ్రేకర్ బుధవారం ముంబైలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే అచ్రేకర్ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించలేదంటూ శివసేన పార్టీ.. మహారాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. ఇక నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనకుండా బహిష్కరించాలంటూ సచిన్ను కోరింది. ఈ సందర్భంగా శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ‘పద్మశ్రీ, ద్రోణాచార్య అవార్డు గ్రహీత అయిన రమాకాంత్ అచ్రేకర్ అంత్యక్రియలను ఎందుకు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించలేదం’టూ ప్రశ్నించారు. ‘మహారాష్ట్ర ప్రభుత్వం అచ్రేకర్ని నిర్లక్ష్యం చేసింది. ఇందుకు నిరసనగా మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనకుండా సచిన్ వాటిని బహిష్కరించాలి’ అని ఆ పిలుపునిచ్చారు. అచ్రేకర్ మరణానంతరం శివసేన పార్టీ పత్రిక సామ్నాలో ఆయన సేవలను కొనియాడుతూ ఓ కథనాన్ని కూడా ప్రచురించింది. అలాగే ఆయన అంత్యక్రియలు నిర్వహించిన తీరుపై విమర్శలు చేసింది. ఇది క్రికెట్కు అచ్రేకర్ చేసిన సేవలను తక్కువ చేయడమే కాకుండా, ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తుందని మండిపడింది. శివసేనతో పాటు పలువురు సీనియర్ నాయకులు కూడా ఈ విషయం గురించి అసహనం వ్యక్తం చేశారు. అచ్రేకర్కు ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించకపోవడం బాధకరం అన్నారు. 87 ఏళ్ల అచ్రేకర్ బుధవారం సాయంత్రం ముంబయిలోని తన స్వగృహంలో కన్నుమూశారు. గత సంవత్సరం గురు పూర్ణిమ రోజున సచిన్.. అచ్రేకర్ను కలిసి కృతజ్ఞతలు చెప్పారు. క్రికెట్లో సాధించిన విజయాలకు తన గురువు అందించిన ప్రోత్సాహమే కారణమని ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. దానికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేశారు సచిన్. Today, #GuruPurnima, is the day we remember those who have taught us to be better versions of ourselves. Achrekar Sir, I couldn’t have done all this without you. 🙏 Don’t forget to thank your gurus and take their blessings. #AtulRanade and I just did. pic.twitter.com/FOS64baoB3 — Sachin Tendulkar (@sachin_rt) July 27, 2018 -
‘మందిర్పై బీజేపీకి పేటెంట్ లేదు’
సాక్షి, న్యూఢిల్లీ : రామ మందిరంపై బీజేపీకి పేటెంట్ లేదని కేంద్ర మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత ఉమా భారతి అన్నారు. అయోథ్యలో ఆలయ నిర్మాణం కోసం అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపు ఇచ్చారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే అయోథ్య సందర్శించి మందిర నిర్మాణం కోసం పట్టుబట్టడాన్ని ఆమె సమర్ధించారు. ఉద్ధవ్ థాకరే ప్రయత్నాలను తాను సమర్ధిస్తానని, రాముడు అందరివాడనీ, అయోథ్యలో మందిర నిర్మాణం కోసం ఎస్పీ, బీఎస్పీ, అకలీదళ్ సహా అసదుద్దీన్ ఓవైసీ, ఆజం ఖాన్తో పాటు ప్రతిఒక్కరూ బాసటగా నిలవాలని కోరారు. కాగా,ఈ వారాంతంలో అయోథ్యను సందర్శించిన ఉద్దవ్ థాకరే రామాలయ నిర్మాణం తక్షణమే చేపట్టాలని ఆదివారం డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. హిందువుల మనోభావాలతో చెలగాటం వద్దని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్కు హితవు పలికారు. మరోవైపు మందిర నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆర్డినెన్స్ తీసుకురావాలని సంఘ్ పరివార్ నేతలు మోదీ సర్కార్పై ఒత్తిడి పెంచుతున్నారు. -
కుంభమేళాలో మందిర నిర్మాణ తేదీలు
అయోధ్య: రామ మందిర నిర్మాణం డిమాండ్తో ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) ఆదివారం నిర్వహించిన ధర్మసభకు లక్షలాది మంది రామభక్తులు హాజరయ్యారు. పండితుల మంత్రోచ్ఛరణలతో ధర్మసభ ప్రారంభమైంది. అనంతరం నిర్మోహి అఖాడాకు చెందిన రాంజీ దాస్ మాట్లాడుతూ వచ్చే ఏడాది ప్రయాగ్రాజ్ (అలహాబాద్)లో జరిగే కుంభమేళాలోనే రామాలయ నిర్మాణ తేదీలపై ప్రకటన ఉంటుందని అన్నారు. ‘ఇంకొన్ని రోజులే. అందరూ ఓపికతో ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఆయన పేర్కొన్నారు. వీహెచ్పీ సీనియర్ నేత చంపత్ రాయ్ ప్రసంగిస్తూ వివాదంలో చిక్కుకున్న భూమిని హిందు, ముస్లిం సంస్థల మధ్య భాగాలుగా పంచేందుకు తాము ఒప్పుకోమనీ, మొత్తం స్థలం తమకే కావాలనీ, ఇక్కడి మొత్తం భూభాగంలో ఆలయం కడతామని అన్నారు. వివాదాస్పద భూమిని మూడు భాగాలుగా పంచుతూ గతంలో అలహాబాద్ హైకోర్టు తీర్పునివ్వడం తెలిసిందే. రామ జన్మభూమి న్యాస్ అధ్యక్షుడు నృత్య గోపాల్దాస్ మాట్లాడుతూ ‘ఇక్కడకు వచ్చిన ఇంత మంది జనాలను చూస్తుంటే వివిధ వర్గాల ప్రజలకు రామాలయంతో ఎంత అనుబంధం ఉందో తెలుస్తోంది’ అని పేర్కొన్నారు. ‘మేం కోర్టులను గౌరవిస్తాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లపై మాకు ఎన్నో ఆశలున్నాయి. రామాలయ నిర్మాణానికి మార్గాన్ని సుగమం చేయాల్సిందిగా ఆదిత్యనాథ్ను నేను కోరుతున్నా’ అని గోపాల్దాస్ తెలిపారు. రామ్ భద్రాచార్య అనే ఓ నాయకుడు మాట్లాడుతూ గత శుక్రవారమే తాను ఓ కేంద్ర మంత్రిని కలిసి ఆయోధ్యపై మాట్లాడాననీ, డిసెంబర్ 11న ఎన్నికల నింబధనావళి కాలం ముగియగానే కేంద్ర మంత్రివర్గం సమావేశమై రామ మందిర నిర్మాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆ మంత్రి తనకు చెప్పారని తెలిపారు. పండుగ వాతావరణం ధర్మసభ వేదిక అంతా కాషాయ జెండాలు, రంగుల కాగితాలు, ప్లకార్డులతో నిండిపోయింది. అయోధ్యలో పండుగ వాతావరణం కనిపించింది. ధర్మసభకు అన్ని వర్గాల నుంచి మూడు లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యారని వీహెచ్పీ తెలిపింది. ఐదు గంటలపాటు జరిగిన ఈ సభకు వివిధ ఆశ్రమాలు, అఖాడాలకు చెందిన దాదాపు 50 మంది స్వామీజీలు హాజరయ్యారు. హరిద్వార్, ఛత్తీస్గఢ్, రిషికేశ్, ఉజ్జయిని, గుజరాత్, చిత్రకూట్, ప్రయాగ్రాజ్, లక్నో తదితర ప్రదేశాల నుంచి సన్యాసులు ధర్మసభకు వచ్చారని అయోధ్యలోని నిర్మోహి అఖాడాకు చెందిన మహంత్ రామ్దాస్ తెలిపారు. అయోధ్య జిల్లా పంచాయతీ సభ్యుడు బబ్లూ ఖాన్ నేతృత్వంలో కొందరు ముస్లింలు కూడా ధర్మసభలో పాల్గొన్నారు. బబ్లూఖాన్ మాట్లాడుతూ ‘రామ మందిరం ఉద్యమంలో నేను గత మూడేళ్లుగా పాల్గొంటు న్నా. అయోధ్యలోని ముస్లింలు కూడా ఇక్కడ రామాలయం కట్టాలని కోరుకుంటున్నారని నేను భావిస్తున్నా. నేనూ ముస్లింనే. ఇక్కడ రామ భక్తులకు స్వాగతం పలుకుతున్నా’ అని చెప్పారు. చట్టం తేవాలి: భాగవత్ మందిర నిర్మాణం కోసం ఓపికతో వేచి చూసే సమయం అయిపోయిందనీ, సుప్రీంకోర్టు ఈ కేసును త్వరగా తేల్చకపోతే ప్రభుత్వమే చట్టం తీసుకురావాలని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ నాగ్పూర్లో అన్నారు. వీహెచ్పీ నిర్వహించిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడు జరిగే ఉద్యమాలు ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలా ఉండాలని పేర్కొన్నారు. ఇప్పుడు కట్టకుంటే అంతే... అయోధ్యలో రామాలయాన్ని నిర్మించకుంటే ప్రస్తుతం ఉన్నదే బీజేపీకి చివరి ప్రభుత్వం అవుతుందని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే హెచ్చరించారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడంటే అది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి ఆయన మందిర నిర్మాణంపై నిర్ణయం తీసుకోలేకపోయారనీ, కానీ ప్రస్తుతం బీజేపీకి సొంతంగానే మెజారిటీ మార్కు కన్నా ఎక్కువ మంది ఎంపీలున్నా నాలుగేళ్లుగా మోదీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీ రాముడి జపం చేస్తోందని అన్నారు. కార్యక్రమానికి హాజరైన వీహెచ్పీ కార్యకర్తలు -
సీబీఐని కుక్కలా కట్టిపడేశారు : శివసేన
సాక్షి, ముంబై : సీబీఐ వివాదానికి సంబంధించి మోదీ సర్కార్ను లక్ష్యంగా చేసుకుని శివసేన విమర్శలతో విరుచుకుపడింది. ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలా మారిన సీబీఐని సొంత ఆస్తిలా మార్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయం ఆందోళన వ్యక్తం చేసింది. గుజరాత్ కేడర్ ఆఫీసర్, సీబీఐలో నెంబర్ టూ స్ధానంలో ఉన్న రాకేష్ ఆస్ధానా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలకు నమ్మినబంటని పేర్కొంది. సీబీఐపై ఇప్పటి వరకూ పలు ఆరోపణలు వచ్చినా, ఈ తరహా బురదచల్లుకునే పరిణామాలు ఇంతకు ముందెన్నడూ చోటుచేసుకోలేదని వ్యాఖ్యానించింది. బీజేపీ ప్రభుత్వంలో కట్టిపడేసిన కుక్కలా సీబీఐ వ్యవహారశైలి ఉందని సామ్నా ఎడిటోరియల్ దుయ్యబట్టింది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానాల అంతర్యుద్ధం, ఇరువురిపై వచ్చిన అవినీతి ఆరోపణలతో దర్యాప్తు ఏజెన్సీ విశ్వసనీయతపై సర్వత్రా ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. సీబీఐ కీచులాటల నేపధ్యంలో ఉన్నత స్ధాయి దర్యాప్తు సంస్థపై మోదీ సర్కార్ పట్టు కోల్పోయిందని కాంగ్రెస్ సహా విపక్షాలు కేంద్రంపై విమర్శలు గుప్పించాయి. సీబీఐలో పరిస్థితులను చక్కదిద్దేందుకు సర్వోన్నత న్యాయస్ధానం చొరవ తీసుకుంది. అలోక్ వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణను రెండు వారాల్లో పూర్తిచేయాలని సుప్రీం కోర్టు సీవీసీని ఆదేశించింది. మరోవైపు సీబీఐ నూతన చీఫ్గా నియమితులైన ఎం నాగేశ్వరరావు పరిపాలనా వ్యవహారాలనే పర్యవేక్షించాలని, విధాన నిర్ణయాలు తీసుకోరాదని స్పష్టం చేసింది. -
లైంగిక దాడులతో రామ రాజ్యం ఎలా తెస్తారు..?
సాక్షి, ముంబై : శ్రీరాముడు దిగివచ్చినా దేశంలో లైంగిక దాడులను ఆపలేడని బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ బీజేపీపై శివసేన విరుచుకుపడింది. శాంతి భద్రతలపై ప్రభుత్వం పట్టు కోల్పోయిన క్రమంలోఈ పరిస్థితిల్లో బీజేపీ రామ రాజ్యాన్ని ఎలా ప్రతిష్టిస్తుందని ప్రశ్నించింది. 2012లో నిర్భయ ఘటన చోటుచేసుకున్న సమయంలో ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత పాలక పార్టీ వైఖరి గతం కంటే భిన్నంగా ఉందని శివసేన దుయ్యబట్టింది. ప్రభుత్వాలు మారినా లైంగిక దాడులు ఆగడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. భావోద్వేగ అంశాలతో చెలగాటమాడటం హింసకు దారితీస్తుందని, ఎన్నికల్లో విజయం కోసం ఈ తరహా వ్యూహాలను అనుసరించాలని శ్రీరాముడు ఎన్నడూ చెప్పలేదని వ్యాఖ్యానించింది. బీజేపీ రామ రాజ్యాన్ని తీసుకురావడంపై మాట్లాడుతుందని, ఎలా రామ రాజ్యాన్ని తీసుకువస్తారో ఆ పార్టీ స్పష్టం చేయాలని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో శివసేన నిలదీసింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైనా రామ రాజ్యం రాలేదని వ్యాఖ్యానించింది. స్వయంగా దేవుడే దిగివచ్చినా దేశంలో అత్యాచారాలను నిరోధించలేడని బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలే శాంతిభద్రతలపై ప్రభుత్వం పట్టు కోల్పోయిందని తేటతెల్లం చేస్తున్నాయని పేర్కొంది. అన్నీ డబ్బులతో సమకూరవని పేర్కొన్న శివసేన మహిళల భద్రతను తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించింది. నిరుద్యోగ సమస్యను కేవలం మాటలతో పరిష్కరించలేరని పేర్కొంది. -
పవార్ వ్యాఖ్యలపై సేన ఫైర్
సాక్షి, ముంబై : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్పై శివసేన విరుచుకుపడింది. పవార్ రాజకీయాలు మహారాష్ట్రకు ప్రమాదకరమని, సమాజంలో సామరస్యానికి ఇవి విఘాతం కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీమా కోరెగావ్ హింసపై జరుగుతున్న పోలీసు విచారణకు పవార్ వ్యాఖ్యలు అవరోధం కలిగించేలా ఉన్నాయని పేర్కొంది. ఈ ఘటనపై జరుగుతున్న విచారణను తప్పుదోవ పట్టించడం ద్వారా పవార్ ఎవరిని కాపాడాలని ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించింది. బీమా కోరెగావ్ అల్లర్లకు సంబంధించి ఇటీవల పూణే పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేయడంపై పవార్ స్పందిస్తూ ఘర్షణల వెనుక ఉన్న వారిని విడిచిపెట్టి, వాటితో ఏమాత్రం సంబంధం లేని వారిని అరెస్ట్ చేయడం అధికార దుర్వినియోగమేనని వ్యాఖ్యనించారు. ఉత్తర్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరిగిన ఇటీవలి హింసాకాండను ప్రస్తావిస్తూ మహారాష్ట్రలోనూ మతపరంగా ప్రజల్లో చీలిక తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని శివసేన ఆందోళన వ్యక్తం చేసింది. శరద్ పవార్ రాజకీయాలు రాష్ట్రానికి ప్రమాదకరమని శివసేన తన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. బీమా కోరేగావ్ ఘటనపై విచారణను పక్కదారి పట్టించేందుకు శరద్ పవార్, భరిప బహుజన్ మహాసంఘ్ నేత ప్రకాష్ అంబేడ్కర్లు ప్రయత్నిస్తున్నారా అని ప్రశ్నించింది. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులకు బీమా కోరెగావ్ అల్లర్లతో సంబంధం లేదని పవార్ ఏ ప్రాతిపదికన చెబుతున్నారని నిలదీసింది. పోలీసులు అసలైన నిందితులను పట్టుకోలేదని చెప్పడం ద్వారా పవార్ ఎవరిని రక్షించదలుచుకున్నారని శివసేన ప్రశ్నించింది. టీవీ ఛానెళ్ల కెమేరాలకే పరిమితమవకుండా పవార్ ప్రజల్లోకి వచ్చి శాంతిసామరస్యాలు నెలకొనేలా చొరవ చూపాలని హితవు పలికింది. -
బీజేపీకి అతిపెద్ద శత్రువు ఆ పార్టీనే..
సాక్షి, ముంబయి : బీజేపీపై తీవ్రస్ధాయిలో విరుచుకుపడుతున్న శివసేన తాజాగా మరోసారి ఆ పార్టీపై మండిపడింది. బీజేపీకి అతిపెద్ద శత్రువు శివసేన అని ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలను దేశం కోరుకోవడం లేదని, కాంగ్రెస్ లేదా జేడీ(ఎస్) నేత హెచ్డీ దేవగౌడలను ఆమోదిస్తుందని పేర్కొన్నారు. బీజేపీకి అతిపెద్ద శత్రువు శివసేనేనని పార్టీ పత్రిక సామ్నాలో ప్రచురితమైన వ్యాసంలో ఆయన రాసుకొచ్చారు. పాల్ఘర్లో దివంగత ఎంపీ చింతామణ్ వనగ కుమారుడిని (శివసేన అభ్యర్థి) ఓడించి బీజేపీ ఆయనకు నివాళులర్పించిందని విమర్శించారు. చింతామణ్ మృతితో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. శివసేన ప్రధాన శత్రువ కావడంతోనే తమ పార్టీని బలహీనపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈవీఎంల మాయాజాలంతో పాల్ఘర్లో బీజేపీ విజయం సాధించిందని, ఇది కుంభకోణం కంటే ఎంతమాత్రం తక్కువ కాదన్నారు. పోలింగ్ రోజు దాదాపు వంద ప్రాంతాల్లో ఈవీఎంలు పనిచేయలేదనే ఫిర్యాదులు వెల్లువెత్తాయని, ఓటింగ్ సమయం పొడిగించాలన్న శివసేన వినతిని ఈసీ తోసిపుచ్చిందని చెప్పారు. బీజేపీ అభ్యర్థి రాజేంద్ర గవిట్ చేసిన ఇదే తరహా డిమాండ్ను మాత్రం ఈసీ ఆమోదించిందని ఆరోపించారు. కీలక స్ధానాల్లో ఆర్ఎస్ఎస్ మనుషులను నియమించి ఎన్నికలను బీజేపీ ప్రభావితం చేస్తోందని విమర్శించారు.బీజేపీ పాల్ఘర్ లోక్సభ ఉప ఎన్నికల్లో గెలిచినా ఇతర లోక్సభ, అసెంబ్లీ స్ధానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి పాలవడం ఆ పార్టీకి ఎదురుగాలి వీస్తున్నదనేందుకు సంకేతమని అన్నారు. బీజేపీ పతనం ప్రారంభమైందని ఉప ఎన్నికల ఫలితాలు సూచిస్తున్నాయని రౌత్ వ్యాఖ్యానించారు. -
బీజేపీకి షాక్; శివసేన కీలక నిర్ణయం
సాక్షి, ముంబై: శివసేన తన దీర్ఘకాలపు మిత్రపక్షమైన బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. కేంద్రంలో, మహారాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంలో సంకీర్ణ భాగస్వామిగా ఉన్న శివసేన.. 2019 సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. బీజేపీతో దోస్తీకి ఇక గుడ్బై చెప్పాలని నిశ్చయించింది. మంగళవారం జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గం భేటీలో ఈ మేరకు తీర్మానం చేసింది. ఇక, శివసేన జాతీయ కార్యవర్గ సభ్యుడిగా అధినేత ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే నియమితులయ్యారు. ఇటు కేంద్రంలో, అటు మహారాష్ట్రలో బీజేపీతో శివసేన కలహాల కాపురాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. వీలు చిక్కినప్పుడల్లా బీజేపీపై, కేంద్రంలోని మోదీ సర్కారుపై శివసేన తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలో బీజేపీతో దోస్తీపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఉద్ధవ్ ఠాక్రే ఇప్పటికే తెలిపారు. ఇది బీజేపీకి అల్టిమేటం కాదని అన్నారు. -
ఇష్టమైతే ఉండు.. లేకపోతే వదిలేయ్..!
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కలహాలు కాపురం క్లైమాక్స్కు చేరినట్టు కనిపిస్తోంది. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ-శివసేన ఆది నుంచి ఉప్పు-నిప్పులా చిటపటలాడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా శివసేన నేత సంజయ్ రౌత్ బీజేపీతో తెగదెంపులకు సిద్ధమన్న రీతిలో వ్యాఖ్యలు చేశారు. బీజేపీయే తమ ప్రధాన శత్రువు అని ప్రకటించారు. సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. తాజాగా మంగళవారం శివసేన అధికార పత్రిక 'సామ్నా' మరో బాంబ్ పేల్చింది. 'ఠీక్ లగేతో దేఖో, వర్న చోడ్ దో' (ఇష్టమైతే ఉండండి.. లేకపోతే వదిలేయండి' అంటూ 'సామ్నా' ప్రచురించిన సంపాదకీయంలో.. బీజేపీకి నచ్చితో శివసేనతో పొత్తు కొనసాగించాలని, లేదంటే దేవేంద్ర ఫడవిస్ ప్రభుత్వం పొత్తు నుంచి వైదొలగవచ్చునని తేల్చిచెప్పింది. ఇప్పటికే సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మిత్రపక్షం శివసేన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఏకకాలంలో ఆ పార్టీ అధికారపక్షంగా, ప్రతిపక్షంగా రెండు పాత్రలు పోషించలేదని, కావాలంటే తమతో పొత్తు విషయంలో సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయం తీసుకోవచ్చునని అల్టిమేటం జారీచేశారు. ఈ నేపథ్యంలోనే బీజేపే తమ ప్రధాన శత్రువు అని శివసేన నేత రౌత్ వ్యాఖ్యలు చేశారు. మోదీ హవా మసకబారిందని, దేశాన్ని నడిపించే సామర్థ్యం రాహుల్ గాంధీకి ఉందని ఆయన టీవీ చర్చలో వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంతో తాజాగా ఫడ్నవిస్ సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ 'సామ్నా' సంపాదకీయాన్ని ప్రచురించింది. శివసేనతో పొత్తు కొనసాగించాలా? లేదా? అన్న విషయంలో బంతి బీజేపీ కోర్టులోనే ఉందని తెగేసి పేర్కొంది. -
కూటమి నుంచి పోతే పొండి : సీఎం ఘాటు హెచ్చరిక
సాక్షి, ముంబై : మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వ భాగస్వాములైన బీజేపీ, శివసేనల మధ్య ‘రాహుల్ గాంధీ సమర్థత’ అంశం చిచ్చురేపింది. ప్రధాని మోదీ ప్రభ తగ్గిపోయిందని, ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని, దేశాన్ని నడిపించగల సత్తా రాహుల్ గాంధీకి ఉందంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు తాజా దుమారానికి కారణమయ్యాయి. ముంబైలో శుక్రవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఫడ్నవిస్.. శివసేన వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వంలో కొనసాగుతూ శివసేన ప్రతిపక్ష పాత్ర పోషించడం కుదరదని, ఆ పార్టీ నాయకులు ఏదిపడితే అతి మాట్లాడటం తగదని చురకలంటించిన సీఎం.. మరో అడుగు ముందుకేసి ‘కూటమిలో ఉండాలో, బయటికి వెళ్లాల్లో తేల్చుకోండి..’ అని శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేకు సవాలు విసిరారు. బీజేపీ-శివసేనలు దశాబ్ధాలుగా మిత్రులుగానే ఉన్నాయని, నాడు బాలా సాహెబ్(బాల్ ఠాక్రే) సంకీర్ణ ధర్మానికి కట్టుబడితే, నేడు ఉద్దవ్ దానికి తూట్లు పొడుస్తున్నారని ఫడ్నవిస్ విమర్శించారు. మోదీ ఓ గ్రాండ్ మాస్టర్! : ప్రధాని మోదీ పనైపోయిందంటూ శివసేన ఎంపీ సంయజ్ రౌత్ చేసిన వ్యాఖ్యలకు సీఎం ఫడ్నవిస్ ఘాటుగా సమాధానమిచ్చారు. సంజయ్ పేరును ప్రస్తావించకుండానే.. కొందరు శివసేన నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారని, ఇలాంటి వాళ్లపై వారి అధ్యక్షుడు(ఉద్దవ్) దృష్టిసారిస్తే బాగుంటుందని హితవుపలికారు. ‘‘దేశంలోని ముఖ్యమంత్రులందరికీ మోదీ ఒక రోల్ మోడల్. ఆయన ఒక అద్భుతమైన కమ్యూనికేటర్, అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్, దేశాన్ని మార్చేసిన గ్రేట్ లీడర్’’ అని ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు. -
కేంద్రానికి శివసేన సవాలు: అవి తప్పయితే నిరూపించండి
దేశ ఆర్థిక వ్యవస్థ విషయంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఆ పార్టీ సీనియర్ నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. కొందరు యశ్వంత్ సిన్హాకు మద్దతు నిలుస్తుండగా.. మరికొందరు ఏం మాట్లాడితే ఏమై పోతాదో అని భయపడిపోతున్నారు. తాజాగా యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వానికి శివసేన గట్టి సవాలే విసిరింది. ఒకవేళ యశ్వంత్ సిన్హా చేసిన వ్యాఖ్యలు తప్పయితే, ధైర్యముంటే వాటిని నిరూపించుకోవాల్సిందిగా సవాల్ చేసింది. యశ్వంత్ సిన్హాపై కేంద్రప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అటల్ బిహార్ వాజపేయి నేతృత్వంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన సిన్హా, ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనమవుతోందని మండిపడ్డారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలుపైనా తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన రాసిన వ్యాసం ది ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలో 'ఐ నీడ్ టు స్పీక్ అప్ నౌ' పేరుతో ప్రచురితమైంది. ఇటీవల శివసేన కూడా బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ సామ్నలో ఓ వ్యాసం రాసింది. ఈవీఎం మిషన్లను టాంపరింగ్ చేసి, ధన ప్రవాహాంతో ఎన్నికల్లో గెలువచ్చని కొందరు అనుకుంటున్నారని, కానీ ఆర్థిక వ్యవస్థ అధ్వానమైన పరిస్థితిని తెలుసుకోలేకపోతున్నారని విరుచుకుపడింది. సీనియర్ బీజేపీ నాయకులెందరో ఆర్థిక వ్యవస్థ విఫలమయ్యే స్థితిపై తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారని, కానీ తెలియని ప్రమాదాలకు భయపడి చెప్పలేకపోతున్నారని వ్యాఖ్యానించింది. ఒకవేళ యశ్వంత్ సిన్హా వ్యాఖ్యలు తప్పయితే నిరూపించండి అని సవాలు విసిరింది. సిన్హా తప్పని బీజేపీ నిరూపించలేదని, ఎందుకంటే ఆయన సీనియర్ నేతని పేర్కొంది. చాలా పథకాలు అనుకున్న లక్ష్యాలను సాధించడంలో విఫలమవుతున్నాయని, వీటిని విజయవంతం చేయడానికి ప్రభుత్వం కోట్ల కొద్దీ రూపాయలను వెచ్చిస్తున్నట్టు శివసేన విమర్శించింది. -
కేంద్రంపై శివసేన ఫైర్
సాక్షి, ముంబయి : కేంద్ర ప్రభుత్వంపై బీజేపీ మిత్రపక్షం శివసేన మరోసారి మండిపడింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గినా పెట్రోల్ ధరలు పెంచడంపై విస్మయం వ్యక్తం చేసింది. బుల్లెట్ రైలుకు తీసుకున్న రుణంపై వడ్డీ చెల్లించేందుకే ఇంధన ధరలను పెంచుతున్నారా అని కేంద్రాన్నినిలదీసింది. గత నాలుగు నెలల్లో 20 సార్లు పెట్రో ధరలను పెంచడాన్ని ప్రభుత్వంలో ఉన్న వారు సమర్ధిస్తే అది సరైంది కాదని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయం స్పష్టం చేసింది. గత ఏడాదిలో వంట గ్యాస్ ధరలు 15 సార్లు పెరిగాయని పేర్కొంది. కాంగ్రెస్ హయాంలో వంట గ్యాస్ ధర సిలిండర్కు రూ 320 రూపాయలు దాటలేదని, ప్రస్తుతం సిలిండర్ ధర రూ 785కు చేరిందని తెలిపింది. ప్రధాని ప్రజలకు బుల్లెట్ ట్రైన్ ఇవ్వాలనుకుంటున్నారని, అయితే ప్రజలు ఇప్పుడు వారి స్కూటర్లు, కార్లలో రెండు లీటర్ల పెట్రోల్ పోయించుకోలేని పరిస్థితిలో ఉన్నారని పేర్కొంది. ఓ వైపు సంపన్నులు బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించనుంటే..మరోవైపు వాహనాలను భరించలేని సామాన్యులు ఎద్దుల బండిలో ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేసింది. -
అచ్ఛేదిన్ ఎప్పుడన్న శివసేన..
ముంబయిః కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ పట్ల అసంతృప్తిగా ఉన్న బీజేపీ మిత్రపక్షం శివసేన మరోసారి బీజేపీపై మండిపడింది. మోడీ సర్కార్ అధికార పగ్గాలు చేపట్టి మూడేళ్లు దాటినా ప్రయోగాలు కొనసాగుతున్నాయని పేర్కొంది. ప్రజలు మాత్రం మంచిరోజుల కోసం ఇంకా వేచిచూస్తూనే ఉన్నారని పార్టీ పత్రిక సామ్నా ఎడిటోరియల్లో శివసేన వ్యాఖ్యానించింది. మంత్రివర్గ పునర్వ్యవస్ధీకరణ, శాఖల కేటాయింపు బీజేపీ అంతర్గత వ్యవహరమని, అయితే ఇది జాతీయ భద్రత, దేశ అభివృద్ధిపై ప్రభావం చూపితే తాము మౌనంగా ఉండబోమని హెచ్చరించింది. మోడీ, అమిత్ షాలు తమకు నచ్చిన వారికి మంత్రులుగా పట్టం కట్టారని వ్యాఖ్యానించింది. కొందరిని వయోభారం పేరుతో కేబినెట్ నుంచి తప్పించారని, అయితే వారి యువ మంత్రులు సైతం కొందరు సరైన పనితీరు కనబరచలేదని పెదవివిరిచింది. ‘నోట్ల రద్దు పూర్తిగా విఫలమైంది... ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రబలుతున్నాయి...ప్రజలకు మౌలిక వసతులూ అందుబాటులో లేకుండా పోయాయి' అని సంపాదకీయం మోడీ సర్కార్ను దుయ్యబట్టింది. -
రాష్ట్రపతి ఎన్నికలున్నాయి.. జాగ్రత్త: శివసేన
దేశానికి కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోడానికి మరో నాలుగు నెలలే సమయం ఉంది. ఎన్డీయే పక్షానికి ఇంకా పూర్తిస్థాయిలో బలం లేదు. దాదాపుగా ఉందనుకుంటున్నా కూడా మహారాష్ట్రలో మిత్రపక్షమైన శివసేన ఇప్పుడు కత్తులు నూరుతోంది. ప్రతిపక్షాలన్నింటితో ఉద్ధవ్ ఠాక్రే చర్చలు జరుపుతున్నారని, బీజేపీ అభ్యర్థిని అంత సులభంగా గెలవనిచ్చేది లేదని శివసేన వర్గాలు అంటున్నాయి. కొన్ని ఇతర పార్టీలు కూడా ఠాక్రేతో చర్చలు జరుపుతున్నాయని చెబుతున్నారు. మోహన్ భగవత్ను రాష్ట్రపతిని చేయాలంటూ ఆ పార్టీ నాయకుడు సంజయ్ రౌత్ కొత్త వాదన లేవనెత్తిన విషయం తెలిసిందే. భారతదేశం ఇప్పుడు హిందూత్వాన్ని ఆమోదిస్తోందని, అందువల్ల ఆర్ఎస్ఎస్ చీఫ్ను రాష్ట్రపతి చేస్తే బాగానే ఉంటుందని అన్నారు. భగవత్ పేరు ప్రతిపాదిస్తే యావద్దేశం దమకు మదద్తుగా ఉంటుందని చెప్పారు. దేశంలో హిందూత్వం బలం పుంజుకుంటోందని చెప్పడానికి ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే నిదర్శనమని రౌత్ అన్నారు. బీజేపీ అయినా, శివసేన అయినా.. తమ లక్ష్యం హిందూ సామ్రాజ్యమేనని చెప్పారు. లౌకిక వాదం అంటే హిందూమతం గురించి మాట్లాడకపోవడం కాదని, ఉత్తరప్రదేశ్లో ముస్లింలు కూడా బీజేపీకి ఓటేశారని గుర్తుచేశారు. శివసేన ఎలక్టొరల్ కాలేజిలో 30వేల ఓట్లు ఉన్న విషయాన్ని బీజేపీ మర్చిపోకూడదని ఆయన చెప్పారు. -
శివసేన పార్టీ ఫ్రస్టేషన్లో ఉంది: నితీష్ రాణె
న్యూఢిల్లీ : శివసేన పార్టీ ప్రస్తుతం ఫ్రస్టేషన్లో ఉందని కాంగ్రెస్ నేత నితీష్ రాణె వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను ఏమీ చేయలేక, సామాన్య ప్రజలపై ఆ పార్టీ నేతలు తమ ప్రతాపం చూపిస్తున్నారని ఆయన శుక్రవారమిక్కడ విమమర్శించారు. కాగా ఎయిరిండియా సిబ్బందిపై దాడి చేసిన శివసేన ఎంపీ గైక్వాడ్పై తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర విమానయాన శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఆయన తెలిపారు. ఈ అంశం లోక్సభలో శుక్రవారం చర్చకు రాగా, ఎంపీలపై సుమెటో కింద చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని, ఎంపీలు దాడులకు దిగటం సరికాదని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. మరోవైపు శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే... ఎయిరిండియా సిబ్బందిపై దాడికి పాల్పడ్డ గైక్వాడ్ను వివరణ కోరారు. అయితే శివసేన మాత్రం ఎంపీ గైక్వాడ్ను ఎయిరిండియా సిబ్బంది రెచ్చగొట్టారని వెనకేసుకొచ్చింది. ఒకవేళ గైక్వాడ్ తప్పు ఉంటే పార్టీ అధినేత చర్యలు తీసుకుంటారన్నారు. ఇక ఎయిరిండియా విమానాల్లో సౌకర్యాలు మెరుగు పరచాలంటూ విమానయాన శాఖ మంత్రికి గైక్వాడ్ లేఖ రాశారు. అలాగే ఎయిరిండియా సిబ్బందికి తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని, ధైర్యం ఉంటే ఢిల్లీ పోలీసులు తనను అరెస్ట్ చేసుకోవచ్చని సవాల్ విసిరారు. కేసులు సంగతి లాయర్లు, పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే చూసుకుంటారన్నారు. -
ఈ పొత్తు కత్తి మీద సాము
విశ్లేషణ పదవులకు దూరంగా ఉండి, బీజేపీ నిఘాదారుగా ఉంటుందని ఫడ్నవిస్ అన్నారు. అయితే బీజేపీ కార్పొరేటర్లు అవినీతికి పాల్పడకుండా ఉండాలి. ఆ స్థాయి నైతికతను ప్రదర్శించే అవకాశం తక్కువే. ముంబై మేయర్ పదవి కోసం భారతీయ జనతా పార్టీతో శివసేన హోరాహోరీ పోరు సాగించింది. బీజేపీపై అది ఆఖరు క్షణంలో ఆధిక్యతను సాధించి ఓడించింది. అయినా తాము వంచనకు గురయ్యామని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఇప్పుడు భావిస్తుండాలి. అతి సంపన్న వంతమైన ఆ నగర పాలక సంస్థను గెలుచుకో వడం ద్వారా సమకూరే ప్రయోజనాలన్నింటినీ పొందాలని రెండు పార్టీలూ తాపత్రయపడ్డాయి. గతంలోనైతే శివసేనకు లభించిన రెండు ఓట్ల స్వల్ప ఆధిక్యత కనీసం మేయర్ పదవికి పోటీ పడటానికి సరిపోయేది. తక్కువ ఓట్లున్న పార్టీ నామ మాత్రంగా అభ్యర్థులను నిలబెట్టేది. గ్రేటర్ ముంబై కార్పొరేషన్ కోసం సాగిన విద్వేషపూరిత ప్రచారం తర్వాత ఉద్ధవ్కు సంబంధించి అదే సహజమైన ముగింపు అయి ఉండేది. అయితే పోటీపడుతున్న రెండు పక్షా లలో దేనితోనూ కలిసేది లేదని ఇతర పార్టీలు తిర స్కరించాయి. దీంతో బీజేపీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తమ వ్యూహ రచనను మార్చారు. నగర పాలక సంస్థలోని అన్ని పదవులకు పోటీ నుంచి బీజేపీ దూరంగా ఉంటుందని ప్రకటిం చారు. అయితే ఈ వ్యూహంలో ఇమిడివున్న పలు అంతరార్థాల కారణంగా శివసేన తన తిట్ల దండకాన్ని తిప్పి రాయాల్సి వస్తుంది. పురపాలక సంస్థలో తమ పార్టీ లాంఛన ప్రాయమైన ప్రతిపక్షంగా ఉండదని, ఆ సంస్థ లోని పారదర్శకతపై, తప్పులపై నిఘా వేస్తుం దని బీజేపీ ప్రకటించింది. మహారాష్ట్ర ప్రభు త్వంలో శివసేన భాగస్వామి రూపంలోని ప్రతి పక్షంగా వ్యవహరించేది. ఇప్పుడు శివసేన సృష్టించే ఆ తలనొప్పి బాగా తగ్గిపోయింది. ఎంతగానో ఆశపడ్డ నగర ప్రభుత్వమనే ఆట వస్తువు లభించింది కాబట్టి శివసేన ప్రభుత్వం నుంచి వైదొలగే అవకాశం సన్నగిల్లిపోయింది. పంచాయతీరాజ్ సంస్థలకు జరిగిన ఎన్ని కల్లో బీజేపీ పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో గణ నీయ విజయాలను సాధించింది. దీనికి కారకు డైన ఫడ్నవిస్ ముంబై మునిసిపల్ కార్పొరేష న్పై నియంత్రణను సాధించలేని తమ అశక్త తను ఒక విధమైన గెలుపుగా మలిచారు. కార్పొ రేషన్ పదవులపై శివసేనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినందువల్ల బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వా నికి ఇక ఎలాంటి ముప్పూ లేదు. అయినా, శివ సేన తన కాల్పనిక ఆత్మ గౌరవాన్ని కాపాడుకో డానికి తరచుగా గుర్రుమంటూ ఉండవచ్చు. ఉదాహరణకు, పౌర పాలనలో పారదర్శక తకు హామీని కల్పించడం కోసం పదవీ విరమణ చేసిన ముగ్గురు అధికారుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటును పౌర పాలనా సంస్థల న్నిటికీ వర్తింప జేయాలని శివసేన కోరుతోంది. ఇదే ప్రమాణాన్ని రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ సమావేశాలకు కూడా వర్తింపచేసి, ప్రతిపక్ష నేతను, మీడియాను ఆ సమావేశాలకు అనుమ తించాలని ఇటీవల శివసేన కోరింది. దీంతో పారదర్శకత గురించి ఎక్కువగా మాట్లాడే బీజేపీ అయోమయంలో పడింది. అలాంటి పారదర్శకత అవసరమే కావచ్చు. కానీ అవి తేలికగా వచ్చేవిగానీ లేదా తేలికగా అమలయ్యేవి గానీ కాకపోవచ్చు. రాజ కీయవేత్తలు దృష్టిని కేంద్రీకరించేది తాము అందుకున్న పదవుల నుంచి వ్యక్తిగత ప్రయోజ నాలను సాధించుకోవడంపైనే తప్ప, పరిపాల నపై కాదు. బీజేపీ, తన సొంత క్యాడర్లను, ప్రత్యేకించి 82 మంది కార్పొరేషన్ సభ్యులను అవినీతికి పాల్పడకుండా ఉండాలని, తమ నిఘా నేత్రాల ముందే అవినీతి జరగకుండా నివారించాలని కోరాల్సి ఉంటుంది. వారు ఆ స్థాయి నైతికతను ప్రదర్శించే అవకాశం తక్కువే. అయినా ఆ పని చేశామని అది చెప్పుకోవచ్చు కానీ పాలనా యంత్రాంగపు నాణ్యతను పౌరులు సులువుగానే గ్రహించగలుగుతారు. బీజేపీ సాధించామని చెప్పుకునే సుపరి పాలనను పౌరులు తమకు అనుభవంలోకి వచ్చే వాస్తవాలతో పోల్చి చూస్తారు. పగిలిపోయి, దురాక్రమణలకు గురైన రోడ్డు పక్క పాద చారుల బాటలపై వారు రోజూ నడుస్తుంటారు. అవి అలా ఉండాల్సినవి కాదు. సకాలంలో, సరి పడేటంత లభించని నీటి కోసం పౌరులు పడి గాపులు పడాల్సి వస్తోంది. పరిస్థితి అలా ఉండా ల్సినది కాదు. చెత్తను ఎప్పటికప్పుడు తరలిం చాలి. కానీ అది జరగదు. పౌరులకు గతుకులు, గుంతలు లేని రోడ్లపై ప్రయాణం కావాలి. కానీ అతి తరచుగా జరిగే రోడ్ల మరమ్మతులు వాస్త వంగా కాంట్రాక్టర్లు సొమ్ము చేసుకోవడానికేనని, ఎవరితో కలసి వారు ఆ పని చేస్తారో మీకు తెలుసు. ఎవరితో కుమ్మక్కై చట్టవిరుద్ధమైన భవనం నిర్మిస్తున్నారో పౌరుల కళ్లకు కనబడు తూనే ఉంటుంది. కాబట్టి ఫడ్నవిస్ తనకు తానే ఒక సవాలును విసురుకున్నారు. - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
శివసేనకు ఆర్ఎస్ఎస్ ఆఫర్?
ముంబై : బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల ఫలితాలు వెలువడి మూడు రోజులు అయినా ఇప్పటికీ మేయర్ పదవిపై ఉత్కంఠ వీడలేదు. బీఎంసీ ఫలితాల్లో బీజేపీ, శివసేన పోటాపోటీగా సీట్లు గెలుపొందిన విషయం విదితమే. అయితే ఈ ఎన్నికల్లో ఏ పార్టీకీ అధికారం చేపట్టేందుకు తగినంత మెజారిటీ రాకపోవడంతో ఇప్పుడు మళ్లీ పాతమిత్రులు కలిసేలా కనిపిస్తున్నారు. ఈ మేరకు రెండు పార్టీల మధ్య డీల్ కుదిరిందా అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. అంతేకాకుండా శివసేన-బీజేపీ పార్టీలు మేయర్ పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకుంటాయని ఆర్ఎస్ఎస్ నేత ఎంజీ వైద్య ఓ సూచన కూడా చేయడం గమనార్హం. మరోవైపు శివసేన ఎక్కువ సీట్లు గెలుచుకోవడంతో ఆ పార్టీనే ముందుగా మేయర్ పదవి చేపట్టవచ్చని ఆయన ఆదివారంనాడు ఇక్కడ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఎంజీ వైద్య వ్యాఖ్యలపై రెండు పార్టీలు ఇప్పటివరకూ స్పందించలేదు. కాగా బీఎంసీలో ఏ పార్టీకి మెజార్టీ రాకపోయినప్పటికీ అధికారం ఏర్పాటు చేసేందుకు శివసేన-బీజేపీలకు సమాన అవకాశాలున్నాయి. దీంతో ఇరుపార్టీల మధ్య పోటాపోటీ నెలకొంది. మరోవైపు 31మంది కార్పొరేటర్లను గెలుచుకున్న కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునేందుకు ఇటు బీజేపీ, అటు శివసేనే కానీ సిద్ధంగా లేవు. అలాగే ఇండిపెండెంట్ల మద్దతు, గెలిచిన తిరుగుబాటుదారులు సొంతగూటికే చేరడంతో శివసేనకు 89మంది కార్పొరేటర్ల బలం ఉంది. మరోవైపు బీజేపీ కూడా ఇండిపెండెంట్లతో పాటు ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకునే పనిలో పడింది. ఈ నేపథ్యంలో మేయర్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అలాగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఇప్పటికే పొత్తు కోసం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన అధిపతి ఉద్ధవ్ ఠాక్రే కలిసి కూర్చుని చర్చించుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. -
శివసేనకు కాంగ్రెస్ దూరం.. మరెలా?
ప్రతిష్ఠాత్మకమైన ముంబై మేయర్ పదవి దక్కించుకోవాలంటే కనీసం 114 మంది కార్పొరేటర్లు అవసరం. కానీ శివసేన గెలుచుకున్నది 84 మాత్రమే. ఎలాగోలా నలుగురు స్వతంత్ర సభ్యులు మద్దతు తెలపడమో, పార్టీలో చేరిపోవడమో అయ్యి.. ఆ బలం 88కి చేరింది. మరోవైపు మతతత్వ పార్టీలకు తాము మద్దతిచ్చేది లేదని, ఇప్పటికే శివసేన నుంచి కొంతమంది తమను సంప్రదించారు గానీ తాము మాత్రం వాళ్లకు అండగా నిలబడబోమని కాంగ్రెస్ పార్టీకి చెందిన సంజయ్ నిరుపమ్ చెప్పారు. తమవాళ్లెవరూ కాంగ్రెస్ వాళ్ల వద్దకు వెళ్లలేదని, మేయర్ మాత్రం తమవాడే అవుతాడని.. ఎలా అవుతాడో తెలుసుకోవాలంటే మార్చి 9వ తేదీ వరకు ఆగాలని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మరి ఇటు కాంగ్రెస్ మద్దతివ్వకుండా.. అటు బీజేపీ వైపు మొగ్గకుండా అధికారాన్ని శివసేన ఎలా చేపడుతుందన్నది అనుమానంగానే కనపడుతోంది. మొత్తం 227 మంది కార్పొరేటర్లున్న ముంబై కార్పొరేషన్లో అధికారం చేపట్టాలంటే శివసేనకు ఇంకా 26 మంది మద్దతు అవసరం. ఇది ఎక్కడినుంచి వస్తుందన్నది అనుమానంగానే కనిపిస్తోంది. మరి శివసైనికులు ఏం చేస్తారో.. మేయర్ పదవిని ఎలా చేపడతారో చూడాల్సి ఉంది. -
మళ్లీ పొత్తు దిశగా శివసేన - బీజేపీ?
బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో ఏ పార్టీకీ అధికారం చేపట్టేందుకు తగినంత మెజారిటీ రాకపోవడంతో ఇప్పుడు మళ్లీ పాతమిత్రులు కలిసేలా కనిపిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు అధికార కూటమిగా ఉన్న శివసేన - బీజేపీ మళ్లీ కలవొచ్చన్న మాటలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్రకే చెందిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే ఆ దిశగా వ్యాఖ్యలు చేశారు. ఈ పొత్తు కోసం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన అధిపతి ఉద్ధవ్ ఠాక్రే కలిసి కూర్చుని చర్చించుకోవాలని ఆయన సూచించారు. శివసేనకు ఈ ఎన్నికల్లో 84 డివిజన్లు వచ్చి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే 227 స్థానాలున్న బీఎంసీలో అధికారం చేపట్టాలంటే కనీసం 114 మంది మద్దతు అవసరం. అంటే మరో 30 మంది మద్దతు శివసేనకు కావాలి. మరోవైపు రెండో పెద్ద పార్టీగా వచ్చిన బీజేపీ.. సొంతంగా పోటీ చేసి 82 స్థానాలు గెలుచుకుంది. దాంతో ఇద్దరిలో ఎవరికీ మేయర్ పదవి నేరుగా దక్కే అవకాశం లేదు. ప్రస్తుతానికి తాను మేయర్ పదవి గురించి ఏమీ ఆలోచించలేదని, అతిపెద్ద పార్టీగా నిలిచినందుకు సంబరాలు చేసుకుంటున్నామని ఉద్ధవ్ ఠాక్రే తన నివాసమైన మాతోశ్రీ వద్ద చెప్పారు. చర్చలు జరుగుతున్నాయని అన్నారు గానీ.. ఎవరితో అనే విషయం చెప్పలేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా బీజేపీ - శివసేన కూటమి బీఎంసీని పాలిస్తోంది. ఈసారి తాము ఈ పొత్తు నుంచి విడిపోయి వేరుగా పోటీ చేస్తున్నట్లు ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించడంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు పూర్తిస్థాయిలో బయటపడ్డాయి. అయితే ఇప్పుడు ఎన్నికలు అయిపోవడం, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు గానీ శాశ్వత మిత్రులు గానీ ఉండరని చెప్పడంతో ఇప్పుడు మరోసారి ఇరు పార్టీల మధ్య పొత్తు పొడవచ్చన్న ఊహాగానాలు నడుస్తున్నాయి. మహారాష్ట్రలో జరిగిన మొత్తం 10 మునిసిపాలిటీల ఎన్నికల్లో ఎనిమిది బీజేపీకే దక్కడంతో ఇప్పుడు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మీద ప్రశంసలు కురుస్తున్నాయి. ఆసియాలోనే అత్యంత ధనవంతమైన పురపాలక సంస్థ అయిన బీఎంసీకి వార్షిక బడ్జెట్ దాదాపు రూ. 37వేల కోట్లు ఉంటుంది. ఇప్పుడు దీని పగ్గాలు ఎవరు చేపడతారన్న విషయమై మరో రెండు మూడు రోజులు ఆగితే తప్ప స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు. బీజేపీ పరిస్థితి కూడా ఈసారి ఏమీ ఆషామాషీగా లేదు. 82 స్థానాలు గెలుచుకోవడంతో బలమైన పార్టీగా ఉన్న కమలం సైతం అధికారం చేపట్టేందుకు పూర్తి అవకాశాలున్నాయి. ఇంతకుముందు మాత్రం శివసేనకు బయటి నుంచి మద్దతు ఇచ్చింది. ఈసారి బీఎంసీ పగ్గాలను ఎవరు చేపడతారో చూడాలి మరి!! -
మేయర్ పదవే కాదు సీఎం పీఠం కూడా మాదే
ముంబై: మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై మేయర్ తో పాటు తర్వాతి ముఖ్యమంత్రి కూడా శివసేనకు చెందినవారే అవుతారని ఉద్దవ్ ఠాక్రే అన్నారు. ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో (బీఎంసీ) శివసేన అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన 84 సీట్లను గెల్చుకోగా, బీజేపీ 82 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. మొత్తం 227 కార్పొరేటర్ స్థానాలు ఉండే బీఎంసీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి తగిన మెజార్టీ రాలేదు. శివసేన థానెలోనూ అతిపెద్ద పార్టీగా నిలవగా, మిగిలిన 8 కార్పొరేషన్లలో బీజేపీ హవా నడిచింది. బీఎంసీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలవడంతో శివసేన కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు, తమ పార్టీ మరో వైపు నిలిచిందని, అయినా తామే నెంబర్ వన్ స్థానంలో నిలిచామని చెప్పారు. ముస్లింలు కూడా తమకే ఓట్లు వేశారని, ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతు కావడంలో బీజేపీ కుట్ర ఉందని ఆరోపించారు. చాలా చోట్ల తమ పార్టీ అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోయారని చెప్పారు. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ-శివసేన సంకీర్ణ కూటమి అధికారంలో ఉంది. బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాతి ముఖ్యమంత్రి తమ పార్టీకి చెందిన వ్యక్తి అవుతారని ఉద్దవ్ ఠాక్రే వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
శివసేన విజయానికి బ్రేకులు!
దేశంలోనే అత్యంత ధనవంతమైన కార్పొరేషన్ అయిన బీఎంసీ ఎన్నికలు వాడి వేడిగా జరిగాయి. మొత్తం 227 వార్డులకు గాను 2275 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. చాలా కాలంగా బీజేపీ - శివసేన కూటమి పాలనలో ఉన్న బీఎంసీలో ఈసారి ఈ రెండు పార్టీలు ఎదురెదురుగా తలపడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు భుజాల మీద చేతులు వేసుకుని తిరిగిన నాయకులు ఇప్పుడు కత్తులు దూశారు. అయితే, ఈసారి శివసేన విజయాన్ని అడ్డుకునేది బీజేపీ కాకపోవచ్చని.. ఠాక్రేల కుటుంబం నుంచే వచ్చిన మరో పార్టీ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అని విశ్లేషకులు భావిస్తున్నారు. చాలావరకు వార్డులలో శివసేన ఓట్లను రాజ్ఠాక్రే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ చీల్చుకోవచ్చని అంచనా వేస్తున్నారు. సొంతంగా గెలిచేంత బలం ఎంఎన్ఎస్కు లేకపోయినా.. మరాఠా సెంటిమెంటుతో శివసేన పొందాలనుకున్న ఓట్లను మాత్రం చాలావరకు అది చీల్చే అవకాశం ఉందని, దానివల్ల అంతిమంగా బీజేపీకి లబ్ధి చేకూరవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఫలితాలు వెలువడేవరకు ఇది అంచనా మాత్రమే అవుతుంది. ఆ తర్వాతే అసలు విషయం తెలుస్తుంది. మొత్తం 227 వార్డులకు గాను ముంబైలో 7034 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. మొత్తం 91,80,491 మంది ఓటర్లుండగా, వారిలో 50,30,361 మంది పురుషులు, 49,49,749 మంది మహిళలు, 381 మంది 'ఇతరులు' ఉన్నారు. -
మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు వస్తాయా ?
-
తెగేదాకా లాగుతారా!
– మహారాష్ట్రలో ఉత్కంఠ – తారస్థాయికి చేరిన సంకీర్ణ లుకలుకలు – ఫడ్నవీస్ ప్రభుత్వం నుంచి వైదొలుగుతామంటున్న శివసేన – మద్దతివ్వబోమన్న ఎన్సీపీ – మధ్యంతరం వస్తుందా? – స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో ముడిపడ్డ రాజకీయం మహారాష్ట్ర రాజకీయాలు రంజుగా మారాయి. సంకీర్ణ ప్రభుత్వ భాగస్వాముల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. శివసేన ప్రభుత్వం నుంచి వైదొలగడం దాదాపు ఖాయమనే పరిస్థితి నెలకొంది. అదే జరిగితే దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం పుట్టి మునుగుతుందా? ఆపరేషన్ ఆకర్ష్తో ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటారా? మద్దతిచ్చేది లేదంటున్న ఎన్సీపీ మనసు మార్చుకొని... కమలానికి అండగా ఉంటుందా? ఫడ్నవీస్ భవితవ్యాన్ని తేల్చగలిగే బలమున్న శివసేన, ఎన్సీపీలు మాట మీద నిలబడి అధికారానికి దూరం జరిగితే... మధ్యంతర ఎన్నికలు తప్పవా? మహారాష్ట్రలో అసలేం జరుగుతోంది... తాజా పరిణామాలకు దారితీసిన పరిస్థితులేమిటో చూద్దాం.. మారిన పాత్ర పాతమిత్రులైన బీజేపీ, శివసేన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీచేశాయి. బీజేపీ 122 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, శివసేన 63 సీట్లు మాత్రమే సాధించింది. ఎన్సీపీ (41 సీట్లు) అధినేత శరద్ పవార్ వేగంగా స్పందించి బీజేపీకి బేషరతు మద్దతు ప్రకటించారు. దాంతో ఫడ్నవీస్ ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీతో బేరసారాలకు దిగొచ్చని ఆశించిన శివసేన ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. తర్వాత ప్రభుత్వంలో చేరినా ఎన్సీపీ కారణంగా శివసేన బేరమాడే శక్తి తగ్గింది. మొదట్లో ఐదు మంత్రి పదవులు ఇచ్చిన బీజేపీ... బిహార్ ఎన్నికల ఓటమి తర్వాత శివసేన నుంచి మరో ఇద్దరికి అవకాశం ఇచ్చింది. వాస్తవానికి మహారాష్ట్రలో ఎప్పుడూ శివసేనదే పెద్దన్న పాత్ర. వీరి సంకీర్ణం అధికారంలో ఉన్నపుడు కూడా శివసేనకు చెందిన మనోహర్ జోషి, నారాయణ్ రాణేలను సీఎంలుగా చేశారు. అలాంటిది శివసేనకు తమ ప్రాధాన్యం తగ్గడం మింగుడు పడటం లేదు. పైగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇద్దరూ బెదిరింపులకు లొంగేరకం కాదు. ప్రభుత్వంలో చేరినా, బీజేపీ నిర్లక్ష్య ధోరణితో శివసైనికులు లోలోపల కుతకుతలాడిపోతున్నారు. పెరిగిన దూరం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే శివసేన... బీజేపీతో చాలా అంశాల్లో విభేదించింది. ప్రధాని మోదీ నిర్ణయాలపై బహిరంగంగానే విరుచుకుపడింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, సర్జికల్ స్ట్రైక్స్.. ఇలా పలు అంశాల్లో మోదీ నిర్ణయాన్ని తమ పత్రిక ‘సామ్నా’లో శివసేన తూర్పారబట్టింది. ఎన్డీయే భాగస్వామిగా కేంద్రంలో అధికారం పంచుకుంటున్నా ఏనాడూ మిత్రధర్మం పాటించలేదు. నోట్ల రద్దు నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో శివసేన గొంతు కలిపింది. పాటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్తో గుజరాత్లో కలిసి వెళ్తామనే సంకేతాలు ఇవ్వడం, గోవాలో బీజేపీకి వ్యతిరేకంగా మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీతో జట్టుకట్టి పోటీ చేయడం... ఇరుపార్టీల మధ్య పెరుగుతున్న దూరాన్ని సూచించేవే. బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో (మంగళవారం పోలింగ్ జరుగుతుంది) సీట్ల పంపకం కుదరక ఇరుపార్టీలు వేరువేరుగా పోటీచేస్తున్నాయి. గడిచిన 20 ఏళ్లుగా బీఎంసీలో శివసేనదే అధికారం. తమకు పెట్టని కోటగా ఉన్న ముంబై మీద బీజేపీ కన్నేయడం శివసేనకు రుచించలేదు. దీంతో ఒకరిపై మరొకరు ఆరోపణలకు దిగారు. దూషణల పర్వం మొదలైంది. ఫడ్నవీస్ను మిడిమిడి జ్ఞానం కలిగిన మూర్ఖుడిగా ఉద్ధవ్ ఠాక్రే అభివర్ణించగా... శివసేన మామూళ్లు వసూలు చేసే పార్టీ అని మహారాష్ట్ర బీజేపీ ధ్వజమెత్తింది. ఫడ్నవీస్ ప్రభుత్వం నుంచి ఏ క్షణాన్నైనా వైదొలుగుతామని ఉద్ధవ్ ప్రకటించారు. అయినా బీజేపీ దూకుడు తగ్గలేదు. శివసేనపై ముప్పేటదాడికి దిగింది. అవినీతిలో కూరుకుపోయిన బీఎంసీలో అభివృద్ధి చేసి చూపెడతామని ఫడ్నవీస్ ఓటర్లకు హామీ ఇచ్చారు. శివసేన... చెప్పింది చేస్తుందా? 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీచేస్తామని శివసేన ప్రకటించింది. కాబట్టి సందర్భం చూసి ప్రభుత్వం నుంచి వైదొలిగి సొంతబలం పెంచుకోవడంపై దృష్టి సారిస్తే పూర్వ వైభవాన్ని సాధించగలమని విశ్వసిస్తోంది. అయితే ప్రస్తుతం ముంబైతో పాటు మరో తొమ్మిది కార్పొరేషన్లు, 26 జిల్లా పరిషత్లకు జరిగే ఎన్నికల ఫలితాలు ఈనెల 23న రానున్నాయి. పట్టణ, గ్రామీణ ఓటర్ల నాడి వీటిద్వారా తెలుస్తుంది కాబట్టి, వీటిలో మంచి ఫలితాలు సాధిస్తే శివసేన వెంటనే ప్రభుత్వం నుంచి వైదొలుగుతుందనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఒకవేళ ముంబై కార్పొరేషన్లో (మొత్తం 227 స్థానాలు) సొంత మెజారిటీ రాక... బీజేపీ మీద ఆధారపడాల్సి వస్తే మాత్రం బలవంతపు కాపురం తప్పదు. అలాగే ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఓడిపోతే కూడా శివసేన స్వరం పెరుగుతుంది, మరిన్ని డిమాండ్లు ముందుకు తేవొచ్చు. ఎన్సీపీ మాటపై నిలబడుతుందా? శివసేన వైదొలిగితే... ఫడ్నవీస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వబోమని, మధ్యంతర ఎన్నికలకే మొగ్గుతామని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ఈనెల 18న నొక్కిచెప్పారు. ప్రజల మద్దతు కోల్పోయిన ఫడ్నవీస్ ప్రభుత్వం కూలిపోవడమే తమకు కావాలన్నారు. అయితే అవకాశవాద రాజకీయాలకు పేరుపడ్డ ఈ రాజకీయ దురంధరుడు ఎంతవరకు మాటపై నిలబడతారనేది ప్రశ్నార్థకం. గతంలో ఎన్డీయేతో అధికారం పంచుకున్న పవార్... తర్వాత యూపీఏ పంచన చేరారు. 2014లో ఫడ్నవీస్ ప్రభుత్వానికి బయటినుంచి బేషరతు మద్దతు ఇచ్చారు. పైగా ప్రధాని మోదీతో పవార్కు మంచి సంబంధాలే ఉన్నాయి. పవార్ కూతురు సుప్రియా సూలే నియోజకవర్గం బారామతికి ప్రధాని వచ్చివెళ్లారు. ఇటీవలే కేంద్రం ఆయనను పద్మ విభూషణ్తో సత్కరించింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొనే పవార్ చెప్పింది ఎంతవరకు చేతల్లో చూపుతారనేది రాజకీయ పండితుల సందేహం. ఫడ్నవీస్ ధీమా ఏంటి? వైదొలుగుతామని శివసేన, మద్దతు ఇవ్వబోమని ఎన్సీపీ ప్రకటించినా... సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రం ధీమాగానే ఉన్నారు. ఈ రెండు పార్టీలు దూరంగా ఉండే పరిస్థితి వస్తే ఫడ్నవీస్కు మరో 23 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం 145. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి కావాల్సిన బలాన్ని కూడగట్టడం ఏమంత పెద్ద పని కాదని శనివారం ఫడ్నవీస్ స్వయంగా అన్నారు. చిన్నాచితకా పార్టీలకు 13 మంది, స్వతంత్రులు ఏడుగురు ఉన్నారు. అలాకాకుండా శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల ఎమ్మెల్యేలకు అవసరమైన పక్షంలో వల వేసే స్థితిలో ఫడ్నవీస్ ఉన్నారు. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు కేంద్రం అండ ఎటూ ఉంటుంది. ఎన్నికలకు మరో రెండేళ్లు ఉన్నందువల్ల ఇప్పుడే శివసేన ప్రభుత్వం నుంచి వైదొలగదనేది ఫడ్నవీస్ అంచనా. ఒకవేళ వైదొలిగితే ... శివసేన ఎమ్మెల్యేలకే మంత్రి పదవుల ఎరవేసి చీలిక తెచ్చే యోచనలో కమలం శిబిరం ఉంది. చీటికి మాటికి బెదిరింపులకు దిగే శివసేనను దెబ్బకొట్టి మహారాష్ట్రలో బీజేపీ ఆధిపత్య రాజకీయాలను నడపాలనే దీర్ఘకాలిక వ్యూహంతో ఉంది కాబట్టే మిత్రపక్షంతో అమీతుమీకి సిద్ధమైందనే వాదన కూడా ఉంది. మొత్తానికి మహారాష్ట్ర రాజకీయాలు ఏ మలుపులు తిరుగుతాయనేది... ఈ నెల 23న వెలువడే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంది. మహారాష్ట్ర అసెంబ్లీలో బలాబలాలు పార్టీ స్థానాలు బీజేపీ 122 శివసేన 63 కాంగ్రెస్ 42 ఎన్సీపీ 41 చిన్న పార్టీలు 13 స్వతంత్రులు 7 మొత్తం 288 – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఎడ్ల పందేల కోసం పట్టుబడదాం
తమిళనాడులో జల్లికట్టు కోసం జరిగిన పోరాటం మరిన్ని రాష్ట్రాలకు స్ఫూర్తినిచ్చింది. కర్ణాటకలో కంబళ పోటీని చట్టబద్ధం చేసేందుకు అక్కడ ప్రయత్నాలు ఇప్పటికే మొదలుకాగా, తాజాగా మహారాష్ట్రలో ఎడ్ల బండ్ల పందేలకు కూడా అనుమతి పొందేందుకు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ముందుకొచ్చారు. ఈ విషయాన్ని ఆయన ముంబైలో జరిగిన పార్టీ సమావేశంలో ప్రకటించారు. దాంతోపాటు, త్వరలోనే జరగనున్న బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో ఇక ఎవరితోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని, అసలైన పోరు ఇప్పుడే మొదలు కాబోతోందని కూడా ఠాక్రే చెప్పారు. మహారాష్ట్రలో ఇన్నాళ్లూ బీజేపీ - శివసేనల మధ్య పొత్తు ఉండగా.. ఇప్పుడు ఒంటరి పోరాటానికి శివసేన ముందుకెళ్లడం విశేషం. -
బ్రెగ్జిట్ తరహాలో ఓటింగ్ పెట్టండి
పెద్దనోట్ల రద్దు మీద బీజేపీ మిత్రపక్షం శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఓ కొత్త తరహా సూచన చేశారు. యూరోపియన్ యూనియన్లో ఉండాలా వద్దా అన్న విషయమై బ్రిటన్లో నిర్వహించిన 'బ్రెగ్జిట్' పోల్ తరహాలో ఇక్కడ కూడా ఒక రెఫరెండం నిర్వహించాలన్నారు. అలాగే, ప్రముఖ ఆర్థికవేత్త అయిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంటులో చేసిన సూచనలను కూడా తీసుకోవాలని చెప్పారు. పెద్దనోట్ల రద్దు విధానాన్ని అమలుచేసిన తీరుపై తాను విమర్శనాత్మకంగా స్పందించేందుకు ఏమాత్రం ఆలోచించబోనని ఉద్ధవ్ చెప్పారు. బ్రెగ్జిట్ రెఫరెండం నిర్వహించిన తర్వాత బ్రిటిష్ ప్రధాని రాజీనామా చేశారని, అలాంటి పరిణామం ఇక్కడ కూడా జరుగుతుందా అని ఆయన ప్రశ్నించారు. 125 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన నిర్ణయాన్ని ఒకే ఒక్క వ్యక్తి తీసుకోవడం సరికాదని, 500, 1000 రూపాయల నోట్ల చెల్లుబాటును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునే ముందు ఆయన కొంతమందినైనా విశ్వాసంలోకి తీసుకుని ఉండాల్సిందని ఠాక్రే అన్నారు. కాగా, పెద్దనోట్ల రద్దుకు నిరసనగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన ర్యాలీలో శివసేన కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే.. పార్లమెంటులో మాత్రం ఈ విషయంలో బీజేపీకి దన్నుగా ఉంటామని ఆ పార్టీ ప్రకటించింది. -
కమెడియన్పై మండిపడిన శివసేన
బీఎంసీ అధికారులు తన నుంచి రూ. 5 లక్షల లంచం తీసుకున్నారని చెప్పి పెద్ద గొడవ చేసిన కమెడియన్ కపిల్ శర్మపై శివసేన తీవ్రస్థాయిలో మండిపడింది. బయటి నుంచి వచ్చి ముంబై పరువు గంగలో కలుపుతున్నాడని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ విమర్శించారు. కపిల్ శర్మ స్వస్థలం పంజాబ్ అన్న విషయం తెలిసిందే. ముందుగా ఎవరో రాసిచ్చిన స్క్రిప్టులను కపిల్ చదువుతున్నాడని రౌత్ అన్నారు. కపిల్ శర్మను లంచం అడిగింది ఎవరో చెప్పాల్సిందిగా తాము కోరినా.. ఆయన మాత్రం ఆ వివరాలు వెల్లడించలేదని బీఎంసీ విజిలెన్స్ శాఖ చీఫ్ ఇంజనీర్ మనోహర్ పవార్ అన్నారు. ఆయన చెబితే తాము వెంటనే విచారణ ప్రారంభించి వాళ్లపై కఠిన చర్యలు తీసుకోడానికి వీలుంటుందని చెప్పారు. కపిల్ వ్యాఖ్యలపై సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కూడా స్పందించారు. -
24 గంటల్లో ఆయనను గెంటేయండి!
ముంబై: జమ్ముకశ్మీర్ విషయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ పై శివసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ను రెచ్చగొట్టేలా మాట్లాడిన బాసిత్ను 24 గంటల్లోగా పాకిస్థాన్కు పంపించాలమని డిమాండ్ చేసింది. శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రావత్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. 'ఢిల్లీలో కూర్చుని ఆ వ్యక్తి భారత్కు వ్యతిరేకంగా విషం చిమ్ముతున్నాడు. అతన్ని 24 గంటల్లోగా వెంటనే ఇస్లామాబాద్కు పంపించేయాలి. మన స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక్కరోజు ముందు అతను ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాడా? అతనిపై కేంద్రం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాం' అని పేర్కొన్నారు. ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయాన్ని, ముంబైలోని పాక్ రాయబార కార్యాలయాన్ని వెంటనే మూసివేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా పాక్ హైకమిషనర్ వ్యాఖ్యల్ని ఖండించింది. ఆదివారం (ఆగష్టు 14న) పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ కశ్మీర్ విషయమై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 'ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాన్ని కశ్మీర్ విముక్తికి అంకితం చేస్తున్నాం. జమ్ముకశ్మీర్ ప్రజల త్యాగాలు విజయవంతమవుతాయని మేం నమ్మకంగా ఉన్నాం' అని బాసిత్ పేర్కొన్నారు. కశ్మీర్ లోయలో నెలకొన్న అశాంతి విషయమై భారత్-పాక్ సంబంధాలు ఉప్పు-నిప్పులా మారిన సంగతి తెలిసిందే. ఈ సంబంధాలను మరింత దెబ్బతీసేలా.. భారత్ను మరింత రెచ్చగొట్టేలా బాసిత్ వ్యాఖ్యలు చేశారు. -
'సీఎం గారూ.. ఆ మూవీ రిలీజ్ ఆపేయండి'
ముంబై: మరాఠా యోధుడు బాజీరావు పీష్వా, ఆయన ప్రియురాలు మస్తానీ మధ్య సాగిన ప్రేమకథను కళ్లకు కట్టేలా చూపించేందుకు దర్శకుడు సంజయ్లీలా భన్సాలీ తీసిన మూవీ 'బాజీరావు మస్తానీ'పై విమర్శలు, ఆరోపణలు మొదలయ్యాయి. చారిత్రక అంశాల నేపథ్యంలో తీసిన ఆ మూవీలో కొన్ని తప్పులు దొర్లాయని శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ ఆరోపించారు. సమస్య వీగిపోయి, వివాదాస్పద సన్నివేశాలను మూవీ నుంచి తొలగించేంత వరకూ 'బాజీరావు మస్తానీ' విడుదల చేయడానికి అనుమతించవద్దని సేన ఎమ్మెల్యేలు మహారాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను కోరారు. మరాఠా పీష్వా బాజీరావు చరిత్రను ఆ చిత్ర దర్శకుడు సంజయ్లీలా భన్సాలీ పూర్తిగా మరిచిపోయాడని శివసేన ఎమ్మెల్యేలు విమర్శించారు. చారిత్రక అంశాలపై తీస్తున్న చిత్రంలో ఇలా చేయడం మంచిది కాదని ఎమ్మెల్యే సర్నాయక్ పేర్కొన్నారు. బాజీరావు మస్తానీ' విడుదలకు ముందే శాసనసభ్యులకు అసెంబ్లీలో స్పెషల్ షో ప్రదర్శించాలని సర్నాయక్ ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఈ నెల 18న విడుదల కానున్న 'బాజీరావు మస్తానీ'లో రణ్వీర్ సింగ్ బాజీరావు పాత్రలో రాజసంతో కనిపిస్తుండగా, ఆయన భార్య కాశీబాయిగా అమాయకత్వం, భావోద్వేగం మేళవించిన పాత్రలో ప్రియాంకచోప్రా, బాజీరావు ప్రియురాలు మస్తానీగా దీపికా పదుకొణె నటించిన విషయం అందరికీ విదితమే. -
మోదీపై శివసేన ధ్వజం
ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బీజేపీ అనుబంధ సంస్థ శివసేన మరోసారి విరుచుకుపడింది. బిహార్ పై ఎనలేని ప్రేమ కురిపిస్తూ ప్యాకేజీలను ప్రకటిస్తున్నమోదీ కాకులను కొట్టి గద్దలకేసిన చందంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తింది. తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో మోదీ ప్రభుత్వ తీరుపై విమర్శలు ఎక్కుపెట్టింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో కుదేలైన మహారాష్ట్రకు ఆర్థిక సాయం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో విధించిన సర్ చార్జీ ద్వారా వసూలు చేసిన రూ. 1600 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం బిహార్ కు పంచి పెడుతోందని ఆరోపించింది. ఒకవైపు మహారాష్ట్ర కరువు పరిస్థితులతో అల్లాడుతోంటే బిహార్పై మోదీ వరాల జల్లు కురిపిస్తున్నారని మండిపడింది. మహారాష్ట్ర, విదర్భ, మరాట్వాడాలో వందలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడంలేదని ఆరోపించింది. బిహార్ కు ప్రకటించినట్టుగా లక్షా పాతిక వేల కోట్ల రూపాయల ప్యాకేజీ మహారాష్ట్రకు అవసరం లేదని పేర్కొంది. పంట నష్టపోయిన తమ రైతులను ఆదుకునేందుకు కేవలం ఇరవై నుండి ఇరవై అయిదు కోట్ల రూపాయలు సరిపోతుందంటూ వ్యాఖ్యానించింది. -
శివసేన, ఎమ్మెన్నెస్ మధ్య ‘చెరువు’ జగడం
సాక్షి, ముంబై : ఓపెన్ ఎయిర్ జిమ్పై కాంగ్రెస్, శివసేన యువ నాయకుల మధ్య వాగ్వివాదం మరువకముందే తాజాగా మరో వివాదం తెరమీదకు వచ్చింది. భాండూప్ ప్రాంతంలో మహానగర పాలక సంస్థ (బీఎంసీ) చేపట్టిన చెరువు సుందరీకరణ పనులపై శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) మధ్య వివాదం ముదురుతోంది. చెరువు సుందరీకరణ తమ ప్రయత్నం వల్లే జరిగిందని ఇరు పార్టీలు వాదించుకుంటున్నాయి. రెండు పార్టీల మధ్య వివాదం ఎక్కువవుతుండటంతో చెరువు ప్రారంభోత్సవం ఎవరి చేతులమీదుగా జరుగుతుందనే విషయం ఆసక్తిగా మారింది. పశ్చిమ భాండూప్లోని 108 వార్డులోని శివాజీ (కొలను)లో 25 ఏళ్లుగా బురద, చెత్త పేరుకుపోవడంతో కొలను పరిస్థితి దారుణంగా తయారైంది.దీంతో చెరువును సుందరంగా తీర్చిదిద్ది పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ఎమ్మెన్నెస్ మాజీ ఎమ్మెల్యే శిశీర్ షిండే, ఎమ్మెన్నెస్ కార్పొరేటర్లు రూపేశ్ వాయంగన్కర్, వైష్ణవి సర్ఫరే, అనిషా మాజ్గావ్కర్ పలుమార్లు డిమాండ్ చేశారు. తర్వాత బీఎంసీ రూ.రెండు కోట్లతో కొలను సుందరీకరణ పనులు చేపట్టింది. దీంతో తమ వల్లే చెరువు సుందరీకరణ సాధ్యమైందని ఎమ్మెన్నెస్ నాయకులు వాదిస్తున్నారు. సేన ప్రమేయంతోనే..: కార్పొరేటర్ రమేశ్ దీనిపై భాండూప్ ప్రాంతానికి చెందిన శివసేన సీనియర్ కార్పొరేటర్ రమేశ్ కోర్గావ్కర్ మాట్లాడుతూ.. చెరువు సుందరీకరణ పనులకోసం శివసేన బడ్జెట్లో నిధులు కేటాయించిందని చెప్పారు. పార్టీ అభివృద్ధి నిధి నుంచి అదనంగా రూ. 50 లక్షలు అందించినట్లు కూడా పేర్కొన్నారు. పనుల్లో జాప్యం జరగకుండా తరచూ బీఎంసీ కమిషనర్, మేయర్తో సేన సంప్రదింపులు జరిపిందన్నారు. సకాలంలో పనులు పూర్తి చేసేందుకు అనేక సమావేశాలు నిర్వహించామని చెప్పారు. చెరువు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న తరుణంలో చెరువు సుందరీకరణ పనుల కీర్తి దక్కించుకునేందుకు ఎమ్మెన్నెస్ ఈవిధమైన వ్యాఖ్యలు చేస్తోందని ఆరోపించారు. కాగా, చెరువు సుందరీకరణ పనులు పూర్తయిన నేపథ్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమం ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే చేతులు మీదుగా జరగాలని ఎమ్మెన్నెస్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే చేతుల మీదుగా జరగాలని బీఎంసీ కమిషనర్కు లేఖ రాశారు. దీంతో ప్రారంభోత్సవం ఎవరి చేతుల మీదుగా జరుగుతుందని స్థానికుల్లో ఉత్కంఠ నెలకొంది. -
హిందూత్వ అంశంపై ఒక్కటవ్వాలి..
ఉద్ధవ్తో సుబ్రహ్మణ్యస్వామి భేటీ సాక్షి, ముంబై: హిందుత్వ అంశంపై శివసేన, బీజేపీలు ఒక్కటవ్వాలని తాను కోరుకుంటున్నట్టు బీజేపీ నాయకులు సుబ్రమణ్యం స్వామి పేర్కొన్నారు. శివసేనను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసుకోవాలనే ఉద్దేశంతో శుక్రవారం నుంచి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో బీజేపీ నాయకులు మళ్లీ చర్చలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. మాతోశ్రీలో ఉద్ధవ్తో భేటీ అయిన ధర్మేంద్ర ప్రధాన్, చంద్రకాంత్ పాటిల్లు శుక్రవారం చర్చలు జరపగా, శనివారం సుబ్రమణ్య స్వామి ఉద్ధవ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందుత్వవాదంపై రెండు పార్టీలు ఒక్కటి కావాల్సిన అవసరం ఉందన్నారు. తొందర్లోనే బీజేపీ సీనియర్ నాయకుడు నితిన్ గడ్కరీతోపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ఉద్ధవ్తో భేటీ కానున్నట్టు చెప్పారు. ఏదేమైనా.. శివసేన ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతుందన్న నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు. -
లైన్ క్లియర్
ముంబై: బీజేపీ-శివసేన మధ్య లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో మంత్రి మండలి విస్తరణకు మార్గం సుగమమైంది. బీజేపీ అధిష్టానం మంత్రి మండలి విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా కొత్త మంత్రుల్లో శివసేన కూడా ఉండేందుకు అవకాశాలున్నాయని భావిస్తున్నారు. మంత్రి మండలి విస్తరణ విషయంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శనివారం ఢిల్లీలో బీజేపీ అధిష్టానంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను వివరించారు. మంత్రివర్గ విస్తరణలో ఎవరికి అవకాశం కల్పించాలనే విషయంతోపాటు శివసేనను భాగస్వామ్యం చేసుకోవాలనే విషయంపై కూడా చర్చలు జరిగినట్టు సమాచారం. అయిదేళ్లపాటు అధికారంలో కొనసాగేందుకు శివసేన మద్దతు తీసుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. అదే విధంగా ఆర్ఎస్ఎస్ కూడా ఎన్సీపీ మద్దతును వ్యతిరేకిస్తూ శివసేనను భాగస్వామ్యం చేసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో మంత్రి మండలి విస్తరణలో శివసేనకు చెందిన మంత్రులు కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. ఉద్దవ్తో రైల్వే మంత్రి ప్రభు భేటీ ఇటీవలి కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు ముందు శివసేన నుంచి బీజేపీలో చేరి రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సురేష్ ప్రభు శుక్రవారం రాత్రి ముంబైలో శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేను కలుసుకున్నారు. బీజేపీ-శివసేన మధ్య నెలకొన్న విభేదాల పరిష్కారానికే ఆయన ఉద్దవ్తో సమావేశమైనట్లు తెలుస్తోంది. ** -
ఎన్సీపి మద్దతుతోనే బీజేపీ ప్రభుత్వం!
మహారాష్ట్రలో ఎన్సీపి మద్దతుతోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ఈ నెల 31న ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. అయితే చిరకాల మిత్రపక్షమైన శివసేనతో పొత్తు అంశం ఇంకా ఒక కొలిక్కిరాలేదు. రెండు పార్టీల మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. రేపు ఏర్పడబోయే ప్రభుత్వంలో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రమే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారు. శివసేన సభ్యులు ఎవరూ మంత్రి వర్గంలో చేరడంలేదు. ఎన్సీపి మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో బీజేపి ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఆపార్టీ అధినేత శరద్ పవార్ బయట నుంచి మద్దతు ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారోత్సవానికి ఎన్సీపి ఎమ్మెల్యేలు గౌర్హాజరు అవుతారని తెలుస్తోంది. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కూడా హాజరుకారని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే తమకు 135 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని బీజేపి చెబుతోంది. అయినప్పటికీ ఇంకా మరో పది మంది మద్దతు కావాలి. గవర్నర్ చెప్పిన ప్రకారం ప్రమాణస్వీకారం చేసిన తరువాత 15 రోజుల్లోగా బలాన్ని నిరూపించుకోవలసి ఉంటుంది. అప్పటికి ఆ పది మందిని సమకూర్చుకోగలమన్న ధీమాతో బీజేపి ఉంది. శివసేనతో చర్చలు ఫలించకపోతే బీజేపికి ఎన్సీపి మద్దతు తీసుకోవడం తప్పనిసరి అవుతుంది. ** -
మహారాష్ట్రలో 28న కొత్త ప్రభుత్వం?
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపి సిద్ధమైంది. బీజేపి నేత దేవేంద్ర ఫడ్నవీస్ గవర్నర్ విద్యాసాగర్ రావును ఈరోజు కలిశారు. మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో బీజేపి ఉంది. 122 శాసనసభా స్థానాలు గెలుచుకొని బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. అయితే 288 స్థానాలు గల సభలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 145 మంది శాసనసభ్యుల మద్దతు అవసరం ఉంది. బీజేపి మిత్రపక్షమైన రాష్ట్రీయ సమాజ్పక్ష ఒక్క స్థానం మాత్రమే గెలుచుకుంది. శివసేన 63, కాంగ్రెస్ 42, ఎన్సీపీకి 41 స్థానాలను సాధించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన145 మేజిక్ మార్క్ ను సాధించాలంటే బీజేపికి మరో 22 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ఈ నేపధ్యంలో తొలుత ఎన్సీపి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్న బీజేపి మనసు మార్చుకొని శివసేన మద్దతు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. శివసేన అడిగిన మంత్రి పదవులు ఇవ్వడానికి కూడా బీజేపి సిద్దపడినట్లు సమాచారం. బీజేపి శాసనసభా పక్షం సోమవారం సమావేశమై ప్రభుత్వం ఏర్పాటుపై ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఈ నెల 28న కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. మొదట అయిదుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది. ** -
అవినీతిపరుల కోసమే సర్కారుకు మద్దతా?
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైతే తాము బయటనుంచి మద్దతు ఇస్తామంటూ ఎన్సీపీ ప్రకటించడంతో శివసేన ఉలిక్కిపడింది. తమ అవినీతిని కప్పిపుచ్చుకోడానికి, అవినీతిపరులైన నాయకులను కాపాడుకోడానికే బీజేపీ సర్కారుకు మద్దతు ఇస్తామంటున్నారని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. వాస్తవానికి ఎన్నికలకు ముందే బీజేపీతో పొత్తును తెంచుకున్న శివసేన.. తీరా ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాబట్టలేకపోయింది. అనుకోకుండా ఎన్సీపీ నాయకులు బీజేపీవైపు మొగ్గు చూపడంతో తమ పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో ఆ పార్టీపై శివసేన మండిపడింది. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో అనేకమంది అవకాశవాదంతో వ్యవహరిస్తున్నారని, అందులో ఎన్సీపీ ముందుందని చెప్పింది. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ 123 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీకి మరో 22 స్థానాలు అవసరం. 41 స్థానాలు గెలుచుకున్న ఎన్సీపీ.. ఫలితాలు రాగానే తాము బేషరతుగా బీజేపీకి మద్దతిస్తామని తెలిపింది. కానీ బీజేపీ ఇంతవరకు దానిపై స్పందించలేదు. శివసేనకు 63 స్థానాలు రావడం, దాదాపు రెండు దశాబ్దాలుగా ఆ పార్టీకి బీజేపీతో సంబంధాలు ఉండటంతో ఎన్నికల అనంతర పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందని కొంతమంది నాయకులు భావిస్తున్నారు. అయితే.. ఎన్నికలకు ముందు శివసేన పెట్టే షరతులను అంగీకరించొద్దంటూ గట్టిగా పట్టుబట్టిన దేవేంద్ర ఫడ్నవిస్ లాంటి నాయకులను ముఖ్యమంత్రి చేయడానికి శివసేన ఎంతవరకు అంగీకరిస్తుందన్నది కూడా అనుమానమే. అవసరమైతే స్వతంత్రులు, ఇతర చిన్న పార్టీల మద్దతు తీసుకుని.. అటు శివసేన, ఇటు ఎన్సీపీ రెండు పార్టీల అవసరం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చన్న వాదనలు సైతం వచ్చాయి. ఇలాంటి తరుణంలో మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో.. దీపావళి తర్వాతే ఒక స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. అప్పటికి అందరూ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
టార్గెట్.. 165!
మహారాష్ట్ర ఎన్నికలకు సర్వం సిద్ధమైపోయింది. మరికొన్ని గంటలు గడిస్తే అక్కడ పోలింగ్ కూడా జరుగుతుంది. మహారాష్ట్రలో ఎన్నికలు అచ్చంగా రణరంగాన్ని తలపిస్తున్నాయి. అంతకుముందు మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలన్నీ.. ఇప్పుడు పరస్పరం కత్తులు దూసుకుంటున్నాయి. బీజేపీ - శివసేన, కాంగ్రెస్ - ఎన్సీపీ.. ఈ రెండు కూటములూ విచ్ఛిన్నం కావడంతో అక్కడ బహుముఖ పోటీ కనిపిస్తోంది. దాంతో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో, ఎవరు అధికార పగ్గాలను చేపడతారోనన్న విషయం చెప్పడం చాలా కష్టంగా మారింది. అంతకుముందు బీజేపీ- శివసేన కూటమిగా ఉంటే మాత్రం వాళ్లు అధికారంలోకి రావడం ఖాయమని ఎన్నికల పండితులు నిక్కచ్చిగా చెప్పారు. కాంగ్రెస్-ఎన్సీపీ పాలనను ప్రజలు భరించలేకపోయారని, పూర్తిగా విసుగెత్తిపోయారని అన్నారు. అయితే.. సీట్ల పంపకం విషయంలో ఇద్దరి మధ్య అంగీకారం కుదరలేదు. దాంతో ఈ రెండు పక్షాలు విడివిడిగానే పోటీ చేస్తున్నాయి. మరోవైపు ఇలా ప్రధాన కూటమి విడిపోవడాన్ని సొమ్ము చేసుకోవాల్సిన కాంగ్రెస్- ఎన్సీపీ కూడా మరోవైపు విడిపోయాయి. ఆ రెండు పార్టీలు కూడా అధికారం తమకు దక్కుతుందనే ఆరాటంతో విడివిడిగానే పోటీకి దిగాయి. దాంతో.. మొత్తం నాలుగు ప్రధాన పార్టీలు బరిలో నిలిచాయి. ఏది ఎలా ఉన్నా.. మహారాష్ట్రలో అధికారం సొంతం చేసుకోవాలన్న గట్టి పట్టుదలతో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. అక్కడ 165 స్థానాలు దక్కించుకోవాలని స్థానిక నాయకులకు టార్గెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీలో అధికారం దక్కించుకోవాలంటే కావల్సిన మేజిక్ నెంబర్.. 145. అయితే, పొరపాటున అటూ ఇటూ అయితే ఇబ్బంది కలగకూడదని, అందువల్ల కనీసం 165 సీట్లు దక్కించుకుని కుర్చీలో కూర్చోవాలని మోదీ మహారాష్ట్ర బీజేపీ నేతలకు నిర్దేశించారు. ఒకవైపు ఆరోగ్యం సహకరించకపోయినా.. గొంతు పూడిపోయినా కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో నరేంద్రమోదీ ప్రచారం చేశారు. పాకిస్థాన్ రేంజర్లు కాశ్మీర్ సరిహద్దుల్లో భారత చెక్పోస్టుల మీద భారీ స్థాయిలో కాల్పులు జరిపి, బాంబుదాడులు చేస్తున్న తరుణంలో మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ఏంటని శివసేన లాంటి పార్టీలు ఎద్దేవా చేసినప్పుడు.. వాళ్లకు సమాధానం ఇవ్వాల్సింది తాను కాదని, జవాన్ల చూపుడువేళ్లే వాళ్లకు జవాబు చెబుతాయని అన్నారు. ఎవరి జాతకం ఏంటో.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చూడాలంటే మాత్రం... ఆదివారం వరకు ఆగాల్సిందే!! -
పాతికేళ్ల బంధానికి విడాకులు
ఒకటి కాదు.. రెండు కాదు.. పాతికేళ్లుగా కొనసాగుతున్న బంధానికి రెండు పక్షాలు తూచ్ అనేశాయి. దాంతో బీజేపీ.. శివసేన విడాకులు తీసేసుకున్నాయి. త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న ఒకే ఒక్క అంశం.. ఈ రెండు పార్టీల మధ్య తెగతెంపులకు కారణం అయ్యింది. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో తాము కనీసం 130 స్థానాల్లో పోటీ చేస్తామని బీజేపీ.. తమకు 155 కావల్సిందేనని శివసేన పట్టుబట్టాయి. అయితే, 'మహాయుతి' పేరుతో కొన్ని చిన్న పార్టీలతో ఓ కూటమిని ముందుగానే ఏర్పాటు చేసుకున్న ఈ రెండు పక్షాలు.. వాళ్లకు ఎలా సీట్లు సర్దుబాటు చేయాలో అర్థం కాక.. ముఖ్యమంత్రి పదవిని ఎవరు పంచుకోవాలో తెలియక మొత్తానికి పొత్తు తెంచేసుకున్నారు. శివసేన మొండిఘటమని, ఎక్కడా సర్దుకుపోలేదని, తాము మాత్రం ఎంత సర్దుకుందామన్నా వాళ్లు వినిపించుకోకపోవడం వల్లే పొత్తు పటాపంచలు అయ్యిందని బీజేపీ నాయకులు అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ - ఎన్సీపీల మధ్య కూడా పదిహేనేళ్లుగా కొనసాగుతున్న బంధం తెగిపోయింది. ఇప్పుడు రెండు కూటములలోనూ చీలికలు రావడంతో.. మరాఠా రాజకీయాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. తమ కూటమి మాత్రం ఇప్పటికీ బాగానే ఉందని, సీట్ల పంపీణీ విషయంలో తమ మధ్య ఉన్న విభేదాలు త్వరలోనే తెగిపోతాయని ఎన్సీపీ నాయకుడు ప్రఫుల్ పటేల్ తొలుత ధీమా వ్యక్తం చేసినా.. అది ఏమాత్రం ఫలించలేదు. మహారాష్ట్రలో తమ బలాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించి తీరాలని కూడా ఆయన అన్నారు. చివరకు అనుకున్నట్లే అయ్యింది. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ.. ఇలా అన్ని పార్టీలూ వేటికవే విడివిడిగా పోటీ చేస్తున్నాయి. దాంతో ఈసారి అక్కడ ఎన్నికల వ్యవహారం ఎలా ఉంటుందోనని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. -
గొంతెమ్మ కోర్కెలొద్దు
ఈసారి తమకు మరిన్ని సీట్లు కేటాయించాలంటూ మహాకూటమి పక్షాలు డిమాండ్ మానేయాలని శివసేన అధిపతి ఉద్ధవ్ ఠాక్రే సూచిం చారు. ప్రతి ఒక్కరూ విజయంపైనే దృష్టి సారించాలని, అత్యాశలు వదు లుకోవాలన్నారు. మహాకూటమిలో సీట్ల పంపకాలపై విబేధాలు కొనసా గుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకు న్నా యి. శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో ఉద్ధవ్ పైవి ధంగా అన్నారు. దేశవ్యాప్తంగా మోడీ ప్రభావం బలంగా ఉన్నందున, ఈసారి తమకు మరిన్ని సీట్లు కేటాయించాలని బీజేపీ డిమాండ్ చేసింది. మహా కూటమిలోని ఆర్పీఐ, స్వాభిమాన్ శేత్కారీ వంటి ఇతర పార్టీలు కూడా అదనపు సీట్ల కోసం పట్టుబడుతున్నాయి. ఇక సీఎం పదవి గురించి ‘ఆజ్తక్’ న్యూస్చానెల్ ‘పంచాయత్ మహారాష్ట్ర’ అనే కార్యక్రమంలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ ముఖ్యమంత్రి పదవి చేపడితే తప్పేమిటని ప్రశ్నించారు. సీఎం ఎవరనేది నిర్ణయించేది ప్రజలేనని చెప్పారు. ‘దేశ ప్రధానిగా ప్రజలు నరేంద్ర మోడీని కోరుకున్నా రు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజ లు నన్ను కోరుకున్నా తప్పేం లేదు. నేను ముఖ్యమంత్రి అయితే నష్టం ఏం టి?’ అని అన్నారు. మరోవైపు మహా కూటమి సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయని, గత 25 ఏళ్లుగా తమ పొత్తు కొనసాగుతుందన్నారు. భవిష్యత్లో నూ ఇలాగే కొనసాగుతుం దని భావిస్తున్నామని ఉద్ధవ్ అన్నారు. -
మహాకూటమికే కుర్చీ
ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమికి అధికారం దక్కడం ఖాయమని ఒక మరాఠీ చానెల్ సర్వే ప్రకటించింది.బీజేపికి 103, శివసేనకు 64 స్థానాలు వరకు వచ్చే అవకాశాలున్నాయని తెలిపింది. కాంగ్రెస్, ఎన్సీపీకి 65 సీట్ల వరకు రావొచ్చని లెక్కగట్టింది. సాక్షి, ముంబై: వచ్చే నెలలో నిర్వహించబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి శివసేన, బీజేపీల మహాకూటమి అధికస్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని ఒక మీడియా సంస్థ సర్వేలో వెల్లడయింది.బీజేపీ అత్యధికంగా అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంటుందని పేర్కొం ది. ఏబీపీ మాజా చానెల్, నీల్సన్ సంస్థ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ సర్వే నిర్వహించాయి. ఎన్నికల తేదీల ప్రకటనకు ముందే ఈ అధ్యయనం నిర్వహించాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఒంట రిగా బరిలోకి దిగితే బీజేపికి 103, శివసేనకు 64 స్థానాలు వచ్చే అవకాశాలున్నాయని సర్వేలో తేలిం ది. మరోవైపు కాంగ్రెస్కు 49, ఎన్సీపీకి 40 స్థానాలు వచ్చేఅవకాశాలుండగా, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్)కు 11 స్థానాలు గెలుచుకునే అవకాశాలున్నాయని ఇది అంచనా వేసింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఉన్నట్టుగానే ప్రజాసామ్య కూట మి, మహాకూటమిగా పొత్తులతో పోటీ చేసినట్టయితే మహాకూటమికి (బీజేపీకి 107, శివసేన 86, ఆర్పీఐ 5, స్వాభిమాని శేత్కారికి రెండు) 200 సీట్లు వచ్చేఅవకాశాలున్నాయని సర్వేలో తేలింది. మరోవైపు ప్రజాసామ్య కూటమిలో కాంగ్రెస్కు 40, ఎన్సీ పీ 25కి సీట్లు వస్తాయని ఈ చానెల్ లెక్కిగట్టింది. అంటే ప్రజాస్వామ్య కూటమికి మొత్తం 65 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు ఎమ్మెన్నెస్కు 10 స్థానాలు వచ్చే సూచనలు ఉన్నాయని పేర్కొం ది. ఇటీవలి లోక్సభ ఎన్నికల సమయంలోనూ మీడియా సంస్థలు సర్వేలు నిర్వహించాయి. అన్ని సర్వేలూ స్వల్పతేడాతో నిజమయ్యాయి. దీంతో ఈ సర్వే కూడా నిజరూపం దాల్చుతుందన్న నమ్మకం మహా కూటమిలో కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల ఫలితాలు పునరావృతమవుతాయని, మహాకూటమి అధికారంలో వస్తుందని మహాకూటమి నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
శివసేనలోకి ఎన్సీపీ ఎమ్మెల్యే!
సాక్షి, ముంబై: లోక్సభ ఎన్నికల్లో రత్నగిరి సింధుదుర్గా లోక్సభ నియోజకవర్గంలో ఎన్సీపీలో కీలకంగా వ్యవహరించిన ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్ శివసేన తీర్థం పుచ్చుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. లోక్సభ ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత శివసేన నాయకులు చేసిన వ్యాఖ్యలు కూడా దీపక్ కేసర్కర్ శివసేనలో చేరనున్నారనే వార్తలను బలపరిచేలా కనిపిస్తున్నాయి. రత్నగిరి-సింధుదుర్గాలో నారాయణ రాణే కుమారుడైన సిట్టింగ్ ఎంపీ నీలేష్ రాణేను వినాయక్ రావుత్ ఓడించారు. ఎన్నికలకు ముందు ఉద్ధవ్ఠాక్రే ప్రచారంలో కూడా కేసర్కర్పై పెద్దగా ఎన్నడూ విమర్శలు చేయలేదు. వినాయక్ రావుత్ విజయం సాధించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేసర్కర్ మహాకూటమి టికెట్పై పోటీ చేస్తే మంత్రి పదవి కూడా లభిస్తుందని చెప్పారు. దీన్నిబట్టి ఆయనను చేర్చుకునేందుకు శివసేన కూడా ఆసక్తిగా ఉందని, వినాయక్ రావుత్ విజయానికి ఆయన కూడా పరోక్షంగా లాభం చేకూర్చినట్టు తెలుస్తోంది. -
ఈసారి 150 : గతంలో కంటే అధిక స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్న బీజేపీ
సాక్షి, ముంబై: సార్వత్రిక ఎన్నికల్లో మహా గెలుపును సాధించిన బీజేపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ మిత్రపక్షాలతో కలిసి సత్తా చాటాలనుకుంటోంది. ఇప్పటి నుంచే కనీసం 150 స్థానాలకు తక్కువ కాకుండా పోటీ చేయాలనుకుంటోంది. 288 అసెంబ్లీ సీట్లున్న రాష్ట్రంలో గత ఎన్నికల్లో శివసేన 171 స్థానాలు, బీజేపీ 117 స్థానాల్లో పోటీ చేసింది. శివసేన 45 సీట్లలో విజయం సాధించగా, బీజేపీ 46 స్థానాలు దక్కించుకుంది. దీంతో శివసేనకంటే ఒక్క స్థానం అధికంగా లభించడంతో ప్రతిపక్ష హోదా బీజేపీకి దక్కింది. 1994లో అధిక స్థానాలు దక్కించుకున్న శివసేనకు ముఖ్యమంత్రి పదవి, బీజేపీకి ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు. అనంతరం ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా అధిక స్థానాలున్న శివసేనకే ప్రతిపక్ష నాయకుడి పదవి లభించింది. అయితే 2009లో ఒక్కసీటు కారణంగా ప్రతిపక్ష హోదా బీజేపీకి దక్కింది. అయితే ఈసారి లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు సీన్ మరింతమారేలా చేసింది. అధిక స్థానాలతోపాటు ఓటింగ్ శాతం కూడా పెరిగింది. మహాకూటమికి మొత్తం 51 శాతం ఓట్లు వచ్చాయి. వీటిలో బీజేపీకి 27.57 శాతం, శివసేనకు 20.82 శాతం ఓట్లు లభించాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవిని కూడా చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉన్న బీజేపీ అధిక స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తోంది. మారనున్న ఫార్ములా..? సీట్ల పంపకాలలో కొత్త ఫార్ములాతో పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. గత 20 సంవత్సరాలకుపైగా శివసేన, బీజేపీల కూటమి కొనసాగుతోంది. దివంగత శివసేన అధినేత బాల్ఠాక్రే, దివంగత బీజేపీ నాయకులు ప్రమోద్ మహాజన్ల హాయాంలో లోక్సభలో బీజేపీకి అధికంగా, అసెంబ్లీలో శివసేనకు అధిక సీట్లు కేటాయించాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని 48 లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీ కోటాలోకి 26 రాగా, శివసేనకు 22 స్థానాలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాల్లో శివసేన కోటాలో 171, బీజేపీ కోటాలో 117 స్థానాలున్నాయి. అయితే గతంలో శివసేన, బీజేపీలే మిత్రపక్షాలుగా ఉండగా, ఈసారి మహాకూటమిగా మారిన ఈ కూటమిలో ఆర్పీఐ, శివసంగ్రామ్, స్వాభిమాని షేత్కారీ పార్టీ తదితరాలున్నాయి. దీంతో ఫార్ములా మార్చాల్సి రానుంది. శివసేన, లేకపోతే బీజేపీ నుంచి కొన్ని స్థానాలను వీరికి కేటాయించాల్సిన అవసరం ఏర్పడింది. మరోవైపు బలం పెరగడంతో బీజేపీ 150 స్థానాల్లో పోటీచేస్తే శివసేన, ఇతర పార్టీలకు ఎన్ని స్థానాలు కేటాయించనున్నారనే విషయమై చర్చలు జరుగుతున్నట్టు సమచారం. అయితే కొత్తఫార్ములాకు శివసేన ససేమిరా అంటుంది. పాతఫార్ములాతోనే పోటీ చేసినా కొన్ని స్థానాలను తమ మిత్రపక్షాలకు కేటాయిస్తామని శివసేన పేర్కొంటున్నట్టు తెలుస్తోంది. మారుతున్న సీన్...? కాషాయ కూటమిలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దివంగత నేత బాల్ఠాక్రే హాయాంలో ఏ నిర్ణయమైన ఆయనతో సంప్రదింపుల అనంతరమే తీసుకునేవారు. శివసేనకు అంతటి ప్రాధాన్యత ఉండేది. అయితే బాల్ఠాక్రే మరణానంతరం మార్పువచ్చిందని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. సామ్నా దినపత్రికలో బాల్ఠాక్రే తనదైన శైలిలో ప్రత్యర్థులతోపాటు అవసరమైన సమయంలో మిత్రపక్షమైన బీజేపీపై కూడా విమర్శలు సంధించి తమ ప్రాధాన్యత ఏమిటన్నది చాటుకునేవారు. ఇటీవలే గుజరాతీయుల అంశంపై ప్రచురితమైన సామ్నా సంపాదకీయంపై నరేంద్ర మోడీ నిరసన తెలిపినట్టు సమాచారం. దీంతో వెంటనే ఉద్ధవ్ఠాక్రేతోపాటు ఇతర నాయకులు సామ్నా పత్రికలో రాసిన సంపాదకీయంతో పార్టీ నాయకత్వానికి సంబంధం లేదని ప్రకటించాల్సి వచ్చింది. ఈ ప్రభావంతో సంజయ్ రావుత్ అధికారాలను కూడా కొంచెం తగ్గించారు. దీన్నిబట్టి కాషాయకూటమి(మహాకూటమి)లో కొంత సీన్ మారిందని చెబుతున్నారు. అయితే అలాంటిదేమి లేదని శివసేన, బీజేపీలు పేర్కొంటున్నాయి. పాత పద్ధతిలోనే పోటీ: ఉద్ధవ్ సాక్షి, ముంబై: రాష్ట్రంలో త్వరలో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో బీజేపీ కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తామని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మహాకూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో మంగళవారం ఉద్ధవ్ఠాక్రే ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ఎన్డీయేతో సమావేశం తర్వాత ఉద్ధవ్ మీడియాతో మాట్లాడారు. దేశాన్ని పటిష్టం చేసేందుకు బీజేపీతో కలిసి పని చేస్తామని, మంత్రి పదవులపై ప్రస్తుతం ఎలాంటి చర్చ జరగలేదన్నారు. శాసనసభ ఎన్నికల్లో సీట్ల పంపకంలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. మంత్రి పదవులపై శివసేన తొందరపడడం లేదని, మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాతే చర్చిస్తామని అన్నారు. బీజేపీ ప్రభుత్వానికి తమ వంతుగా పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఎలాంటి నిర్ణయాలైన కలిసే తీసుకుంటామని అన్నారు. ఇది ఒక చారిత్రాత్మక విజయమని, దీంతో తమ కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. ఇదే ఐకమత్యంతో శాసనసభ ఎన్నికలకు వెళతామని అన్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పాలనను ఏ విధంగా తిరస్కరించారో లోక్సభ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైందని, ఓటమి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జైతాపూర్ అణు విద్యుత్ ప్రాజెక్టును ఇప్పటికీ తాము వ్యతిరేకిస్తున్నామన్నారు, ఒకవేళ అది మంచిది, సురక్షితమే అయితే దేశంలోని ఇతర ఏ రాష్ట్రాలకైనా తరలించాలి. కానీ ఈ ప్రాజెక్టు మాకొద్దు అని స్పష్టం చేశారు. ఒకవేళ విద్యుత్ అవసరమైతే ఈ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉందో అక్కడి నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. ‘మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయిన తర్వాత మహాకూటమి ఎంపీలు అపాయింట్మెంట్ తీసుకుంటారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలవల్ల నష్టపోయిన రైతుల అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళతార’న్నారు. ఇతర అంశాలతోపాటు నష్టపరిహారం గురించి చర్చించి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే గురించి విలేకరులడిగిన ప్రశ్నకు ఉద్ధవ్ నోరు విప్పలేదు. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక పాకిస్తాన్ ఏదైన అఘాయిత్యానికి పాల్పడితే తగిన బుద్ధి చెప్పాల్సిందేనన్నారు. -
'బీజేపీ- శివసేనల బంధానికి ఎప్పటికీ బ్రేక్ పడదు'
న్యూఢిల్లీ: బీజేపీ- శివసేనల మధ్య పొత్తు ఎప్పటిలాగే కొనసాగుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షడు రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. బీజేపీ-శివసేనల మధ్య పొత్తు అంశం తాజాగా పుట్టుకొచ్చినదేమీ కాదని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన రాజ్ నాథ్ సింగ్.. శివసేన-బీజేపీల విభేదాల అంశంపై వివరణ ఇచ్చారు. బీజేపీ-శివసేనల మధ్య పొత్తు ఇప్పటికాదని , ఎప్పట్నుంచో రెండు పార్టీల మధ్య పొత్తు ఆనవాయితీగా వస్తుందన్నారు. ఇప్పుడు శివసేన తమతో పొత్తు తెగదెంపులు చేసుకుంటుందని తాను భావించడం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. బీజేపీతో శివసేన ఎప్పటికీ దూరంగా ఉండదన్నారు. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య విభేదాలు పొడచూపాయి. ఎమ్మెన్నెస్ కు బీజేపీ దగ్గర కావటమే శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే ఆగ్రహానికి కారణం. కాగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణ ముంబై లోక్ సభ చతుర్ముఖ పోరుకు వేదిక కానుంది. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి, శివసేన-బీజేపీ, ఆర్పీఐ, స్వాభిమాన్ల మహాకూటమి, ఎమ్మెన్నెస్తో పాటు ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్)ల మధ్య తీవ్ర పోరు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, ఎమ్మెన్నెస్ల మధ్య రహస్య ఒప్పందాలున్నాయంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. నరేంద్ర మోడీకి మద్దతు ప్రకటించిన రాజ్ ఠాక్రే ఆ ఊహాగానాలకు బలం చేకూరేలా చేశారు. దాంతో బీజేపీ-శివసేన మధ్య పొరపొచ్చలు చోటుచేసుకున్నాయి. -
బీజేపీ శివసేన మధ్య విభేదాలు
ముంబయి : మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య విభేదాలు పొడచూపాయి. దాంతో శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే పార్టీ నేతలతో అత్యవసర సమావేశానికి పిలుపు నిచ్చారు. ఎంఎన్ఎస్కు బీజేపీ దగ్గర కావటమే ఉద్దవ్ ఆగ్రహానికి కారణం. మరోవైపు థాకరే వద్దకు బీజేపీ ఆపార్టీ నేత రాజీవ్ ప్రతాప్ రూడీని రాయబారిగా పంపారు. కాగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణ ముంబై లోక్ సభ చతుర్ముఖ పోరుకు వేదిక కానుంది. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి, శివసేన-బీజేపీ, ఆర్పీఐ, స్వాభిమాన్ల మహాకూటమి, ఎమ్మెన్నెస్తో పాటు ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్)ల మధ్య తీవ్ర పోరు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. దాంతో బీజేపీ, ఎమ్మెన్నెస్ల మధ్య రహస్య ఒప్పందాలున్నాయంటూ చర్చలు జరుగుతున్నాయి. నరేంద్ర మోడీకి మద్దతు ప్రకటించి ఈ ఊహాగానాలకు బలం చేకూరేలా ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే చేశారు. దాంతో బీజేపీ-శివసేన మధ్య పొరపొచ్చలు చోటుచేసుకున్నాయి. -
దక్షిణ ముంబైలో చతుర్ముఖ పోరు
సాక్షి, ముంబై: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణ ముంబై లోక్సభ చతుర్ముఖ పోరుకు వేదిక కానుంది. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి, శివసేన-బీజేపీ, ఆర్పీఐ,స్వాభిమాన్ల మహాకూటమి, ఎమ్మెన్నెస్తోపాటు ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్)ల మధ్య తీవ్ర పోరు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. పొత్తు పంపకంలో భాగంగా ఈసారి కూడా దక్షిణ ముంబై స్థానాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ అభ్యర్థిగా మిళింద్ దేవ్రాకే మళ్లీ అవకాశమిచ్చింది. గతంలో మాదిరిగా ఈసారి కూడా ఎమ్మెన్నెస్ వల్ల మిలింద్ దేవ్రాకే గెలుపు అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎమ్మెన్నెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలా నందగావ్కర్ ఈసారి గెలవాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో 1,59,729 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచిన బాలా నందగావ్కర్ స్థానిక ఓటర్లను ఆకట్టుకొనే విధంగా ప్రచార శైలిలో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆయన గెలుపు సంగతి దేవుడెరుగు? ఈసారి కూడా తమ విజయావకాశాలను ఎక్కడ దెబ్బతీస్తారోనని శివసేన అభ్యర్థి మోహ న్ రావులేలో ఆందోళన మొదలైంది. గత ఎన్నికల్లో 1,46,118 ఓట్లతో మూడో స్థానంలో నిలిచిన మోహన్రావులే ఈసారి గెలవడమే ధ్యేయంగా నియోజకవర్గాన్ని చుట్టుముట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఈ లోక్సభ స్థానాన్ని ఎమ్మెల్సీ మంగల్ప్రభాత్ లోధా కుమారుడు అభినందన్ లోధాకు కేటాయించాలని బీజేపీ చేసిన విజ్ఞప్తిని శివసేన నిరాకరించింది. దీంతో ఈ నియోజకవర్గంలోని బీజేపీ కార్యకర్తల్లో కొంత అసంతృప్తి నెలకొంది. ఇది శివసేన అభ్యర్థికి కొంత మైనస్ కాగా, పరోక్షంగా బాలా నందగావ్కర్కు వారు సహకరించే అవకాశాలు కూడా లేకపోలేదనే చర్చ మొదలైంది. దీనికితోడు బీజేపీ, ఎమ్మెన్నెస్ల మధ్య రహస్య ఒప్పందాలున్నాయంటూ చర్చలు జరుగుతున్నాయి. నరేంద్ర మోడీకి మద్దతు ప్రకటించి ఈ ఊహగానాలకు బలంచేకూరేలా ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే చేశారు. ఈ నేపథ్యంలో శివసేనకు కొంత నష్టం వాటిల్లే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎమ్మెన్నెస్తో కాంగ్రెస్కు లాభం...? దక్షిణ ముంబై లోక్సభ నియోజకవర్గంలో గతంలోమాదిరిగానే ఈసారి కూడా ఎ మ్మెన్నెస్ అభ్యర్థి కారణంగా కాంగ్రెస్ అభ్యర్థి లబ్దిపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎమ్మెన్నెస్ అభ్యర్థి బాలానాందగావ్కర్ కారణంగానే శివసేన ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ దేవ్రా సునాయాసంగా విజయం సాధించారు. ఈసారి కూడా అదే సీన్ పునరావృతం అయ్యే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత కొన్నేళ్లుగా బాలా నాందగావ్కర్కు కూడా నియోజకవర్గంలో మరింత పట్టు సంపాదించారు. ఈ నేపథ్యంలో గట్టిపోటీ ఇవ్వవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈసారి ఆప్ నుంచి మీరా సన్యాల్ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మీరా ఓటర్లను ఎంత వరకు ఆకట్టుకోనుందనేది వేచిచూడాల్సిందే. -
టీఎంసీ ఉపమేయర్పై దాడి
ఠాణే: నగరపాలక సంస్థ (టీఎంసీ) అనుబంధ రవాణా కమిటీ చైర్మన్ పదవికి సోమవారం జరిగిన ఎన్నికల్లో శివసేన అభ్యర్థి పప్పూకదమ్ పరాజయంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన కాషాయకూటమి కార్యకర్తలు ఉపమేయర్ మిలింద్ పాటంకర్పై దాడికి పాల్పడ్డారు. టీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ సభ్యుడు అజయ్ జోషి... బరిలోకి దిగిన కదమ్కి వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో ఎన్సీపీ తరఫున బరిలోకి దిగిన శైలేష్ భగత్ చైర్మన్గా ఎన్నికయ్యారు. భగత్కు నాలుగు ఓట్లు రాగా కదమ్కు కేవలం మూడు ఓట్లే పడ్డాయి. శివసేన అభ్యర్థి పరాజయం పాలయ్యాడనే వార్తతో టీఎంసీ పరిసరాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తీవ్ర ఆగ్రహానికి లోనైన బీజేపీ, శివసేన పార్టీలకు చెందిన కార్యకర్తలు మూకుమమ్మడిగా ఉపమేయర్ కార్యాలయంలోకి చొరబడ్డారు. అక్కడి కుర్చీలను ధ్వంసం చేశారు.దీనిని గమనించిన బీజేపీ నాయకుడు రాజు కాలే పాటంకర్కు రక్షణగా నిలిచారు. దాడికి పాల్పడిన వారిపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలవడంతో ఎన్సీపీ ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. కాగా ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా జిల్లా కలెక్టర్ పి.వేల్రసు వ్యవహరించారు. రాజీనామా చేసిన డిప్యూటీ మేయర్ నాలుగు గంటలపాటు తనను గదిలో బంధించడమే కాకుండా శివసేన, బీజేపీ కార్యకర్తలు దాడి చేయడంతో తీవ్రమనస్థాపానికి గురైన ఉపమేయర్, బీజేపీ నగర శాఖ అధ్యక్షుడు సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మేయర్కు అందజేవారు.