
మళ్లీ వరద భయం మాటున కేరళ తీరం..
కొచ్చి : కేరళను మరోసారి వరద భయం వెంటాడుతోంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ వారాంతంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) హెచ్చరికలతో ఇరు రాష్ట్రాలూ అప్రమత్తమయ్యాయి. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో పలక్కాడ్లోని మలంపుజ డ్యామ్ గేట్లను అధికారులు గురువారం ఎత్తివేశారు.
మలంపుజ డ్యామ్కు చెందిన నాలుగు గేట్లను 9 సెంమీ చొప్పున అధికారులు ఎత్తివేశారు. ఐఎండీ సూచనల నేపథ్యంలో మూడు తీర ప్రాంత జిల్లాల్లో ఈనెల ఏడున రెడ్ అలర్ట్ అమల్లో ఉంటుందని కేరళ సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు.
జాతీయ విపత్తు నిర్వహణ బలగాలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈనెల 5 నాటికి మత్స్యకారులు సురక్షిత తీర ప్రాంతానికి వెళ్లాలని ప్రభుత్వం కోరిందని సీఎం వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, విపత్తు నిర్వహణ అధికారులతో సమావేశమై పరిస్థితిని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.