
‘అసలు ప్రధాని ప్లాన్ ఏమిటి?’
పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంపై మరోసారి సీపీఎం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంపై మరోసారి సీపీఎం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ నేత సీతారాం ఏచూరి గురువారం పార్లమెంటు వద్ద మీడియాతో మాట్లాడుతూ నగదు రద్దు కారణంగా దాదాపు నాలుగు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని చెప్పారు. టెక్స్టైల్స్, ప్రభుత్వం రంగాల్లోని 3.19కోట్ల మంది ఉద్యోగులు జీతాలు పొందలేని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్ద నోట్లు రద్దును ప్రకటించిన తర్వాత వరుసగా మరో 16 కొత్త నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. అసలు తాను ఏం చేయాలనుకుంటున్నారో ప్రధాని నరేంద్రమోదీ ఒక్క మాట కూడా చెప్పకుంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు వాళ్ల సొంత డబ్బును కూడా అవసరాలకోసం ఉపయోగించుకోలేకపోతున్నారని బ్యాంకుల నుంచి తీసుకోలేకపోతున్నారని అన్నారు.