
సాక్షి, హైదరాబాద్ : నల్లమల అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయంగా వాడుకుంటున్నాయని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం యూరేనియం సర్వే, తవ్వకాలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసిందని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా చేసిన చట్టాన్ని రేవంత్రెడ్డి అపహాస్యం చేసి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి, పవన్ ఇద్దరు చట్టసభలను అవమానించారని, అచ్చంపేటలో పుట్టిన రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా నియోజకవర్గం గురించి పట్టించుకోలేదని ఎమ్మెల్యే బాలరాజు విమర్శించారు.
యూరేనియం అంశం మీద రచ్చ జరుగుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం సోనియా గాంధీతో ఫోటోలు దిగుతున్నాడని ఎద్దేవా చేశారు. రాష్టంలో హీరోయిజం మాటు మాట్లాడి.. ఢిల్లీకి వెళ్లి ఫోటోలు దిగుతున్నాడని ఆయన విమర్శించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు అడవులు ఎక్కడ ఉంటాయో తెలియదు కానీ ఆయన కూడా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. పవన్కు రాజకీయంలో తిరిగే అర్హత లేదని అభిప్రాయపడ్డారు. నల్లమల మీద అసెంబ్లీలో తీర్మానం చేస్తే పవన్ దానికి విలువ లేదనట్లు మాట్లాడటం సిగ్గు చేటని ఆయన అన్నారు.