
సాక్షి, నిజామాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎంఐఎం నడిపిస్తోందని బీజేపీ ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు. నిజామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్కు అసదుద్దీన్ ఓవైసీ పెద్ద కొడుకులా మారారని ఎద్దేవా చేశారు. పూర్వీకుల గురించి బయట పడుతుందనే ఎన్ఆర్సీని ఓవైసీ వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. సీఎఎ, ఎన్ఆర్సీలపై కేంద్రం వెనక్కి తగ్గేది లేదని, ఖరాఖండిగా అమలు జరుగుతుందని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల దృష్ట్యానే ఓవైసీ సభ పెట్టారన్నారు. జనగణమన పాడని ఓవైసీ.. సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
నిజామాబాద్లో ముస్లిం మైనారిటీ ప్రాంతాల్లో కనీస మౌలిక వసతులు కూడా లేవని మండిపడ్డారు. మైనారిటీ ఏరియాలో తన పర్యటన వద్దని పోలీసులు చెబుతున్నారని.. ఈ దేశం ఎటు పోతోందని ప్రశ్నించారు. ఎంపీకే రక్షణ ఇవ్వలేకపోతే సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నట్లు అని మండిపడ్డారు. ఎన్ఆర్సీ పై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని నిప్పులు చెరిగారు. అభివృద్ధిని చూసి మైనారిటీలు ఓటు వేయాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్,ఎంఐఎం లకు ప్రజలు బుద్ధి చెబుతారని అరవింద్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment