
సాక్షి, ఢిల్లీ : తెలంగాణలో పొత్తులపై ఎట్టకేలకు బీజేపీ స్పష్టతనిచ్చింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆదివారం ప్రకటించారు. మొదటి విడతగా 50 నియోజకవర్గాల్లో బహిరంగ సభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టికెట్లు కేటాయింపులపై దృష్టి సారించమని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్షా సూచించారు పేర్కొన్నారు. ఈనెల 15వ తేదీన పాలమూరులో బహిరంగ సభ నిర్వహించి.. అమిత్ షా ఎన్నికల శంఖారావం పూరిస్తారని వెల్లడించారు. సభ అనంతరం టికెట్ల కేటాయింపులు జరుగుతాయని ప్రకటించారు.
కాంగ్రెస్తో పొత్తు అపవిత్రం..
తెలంగాణలో కుటుంబ పాలన పోవాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించినట్లు తెలిపారు. తమతో కలిసి వచ్చే వ్యక్తులు, సంస్థలను కలుపుకుని ఎన్నికల్లో పోటీ చేస్తామని అన్నారు. ఎన్నికలు ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్యనే జరుగుతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ అసలు ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పండితులు చెప్పినట్టు మూహుర్తం, జాతకం చూసి ఎన్నికలకు వెళ్లడం సరికాదని అన్నారు. గతంలో కాంగ్రెస్ను ఓడించడానికి అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్న టీడీపీ.. ఇప్పుడు కాంగ్రెస్తోనే పొత్తుకు సిద్దమైందని ఎద్దెవా చేశారు. టీడీపీ-కాంగ్రెస్ పొత్తు అపవిత్రమైనదని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో కాంగ్రెస్ కొన్ని చోట్ల కాంగ్రెస్ బలహీనంగా ఉందని, ఆ స్థానంలో తాము దృష్టి సారిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment