
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. శనివారం(అక్టోబర్ 20) రోజున 25 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నేతృత్వంలోని ఎన్నికల కమిటీ గురువారం సమావేశమైంది. ఈ భేటీలో ముఖ్యంగా 5 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 35 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చ జరిగింది. అందులో ఆరు స్థానాల్లోని అభ్యర్థుల పేర్లపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా సమాచారం. కాగా, మిగతా స్థానాలపై చర్చించడానికి శుక్రవారం ఉదయం మరోసారి సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది.
రేపు జరిగే సమావేశంలో ఆయా స్థానాల్లోని అభ్యర్థులతో తుది జాబితాను రూపొందించనున్నారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆ జాబితాతో రేపు రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో ఎల్లుండి బీజేపీ పార్లమెంట్ బోర్డు ద్వారా అభ్యర్థులను ప్రకటించనున్నారు.
సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చిన పేర్లు..
ఆదిలాబాద్- శంకర్
పెద్దపల్లి- గుజ్జుల రామకృష్ణారెడ్డి
కరీంనగర్- బండి సంజయ్
ముదోల్- రమాదేవి
నిజామాబాద్- యెండల లక్ష్మీనారాయణ
ఆర్మూర్- వినయ్రెడ్డి
బీజేపీ ఎన్నికల కమిటీ..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నేతృత్వంలో పార్టీ రాష్ట్ర ఎన్నికల కమిటీ ఏర్పాటయింది. ఈ కమిటీలో ఆయనతో పాటు 14 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్రావు, మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే కిషన్రెడ్డి, ఎమ్మెల్సీ రామచందర్రావు. రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయలతో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు సభ్యులుగా ఉన్నారు.