
సాక్షి, రాయచోటి : వైఎస్సార్ జిల్లా రాయచోటిలో జరిగిన ప్రచార సభలో సీఎం చంద్రబాబునాయుడుకు చేదు అనుభవం ఎదురైంది. పసుపు-కుంకుమ అంతా మోసమని, ఈ పధకం లబ్ధిదారులకు చేరడం లేదని మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు షాక్ తిన్నారు. సీఎం వారించినా పాలకొండ్రాయుడు పట్టించుకోకుండా పసుపు కుంకుమ లోపాలను ఎత్తిచూపడంతో స్ధానిక టీడీపీ నేతలు ఆయన ప్రసంగాన్ని ఆపి పక్కకు తీసుకువెళ్లారు.
సాక్షాత్తూ సీఎం సభలోనే మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ పధకంపై చేసిన వ్యాఖ్యలు క్షేత్రస్ధాయిలో ఆయా పధకాల తీరుతెన్నుల గురించి ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఏకంగా తన ప్రచార సభలో పాలకొండ్రాయుడు చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు కంగుతిన్నారు.మరోవైపు డ్వాక్రా రుణాలను మాఫీ చేయని చంద్రబాబు ఎన్నికల ముందు పసుపు కుంకుమ పేరుతో మహిళలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారనే విమర్శలు వెల్లువెత్తాయి. పసుపు కుంకుమ పధకాన్ని పచ్చచొక్కాలకే పరిమితం చేసేలా తెలుగు తమ్ముళ్లు వ్యవహరిస్తున్న ఉదంతాలు కోకొల్లలుగా వెలుగు చూస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment