
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో ప్రజల సమస్యలను సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారని కాంగ్రెస్ సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ప్రధాన సమస్యలపై ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ చర్చించకపోవడం ఆయన చిత్తశుద్థకి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ముస్లింలకు 12 శాతం, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ల సమస్యల గురించి అసలు పట్టించుకోక పోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. గొప్పలు చెప్పుకోవటానికే పరిమితమైన కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న సమస్యలను గాలికి వదిలేయడం బాధకరమని అన్నారు.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ద్వారా లక్షల మందికి ఉపాధి కలిగే విషయాలను కూడా సీఎం మర్చిపోయారని ఆరోపించారు. నీతి ఆయోగ్ సమావేశంలో వీటి గురించి మాట్లావకపోవడం దారుణమని, టీఆర్ఎస్ బీజేపీ బీ టీమ్ పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 50 ఏళ్ల పాలనలో అప్పుల వాటా రూ. 60వేల కోట్లు ఉండగా, టీఆర్ఎస్ పాలనలో అప్పుల వాటా రూ రెండు లక్షల కోట్లకు పెరిగిందని అంటే నాలుగు ఏళ్లలోనే రూ. 150000 వేల కోట్లు పెరిగిందని జీవన్ రెడ్డి తెలిపారు.