
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రముఖ నటుడు కమల్హాసన్ తమిళనాడులో తన రాజకీయ ప్రస్థానాన్ని బుధవారం ప్రారంభించనున్నారు. మదురైలో నిర్వహించనున్న భారీ బహిరంగసభలో కమల్ తన రాజకీయపార్టీ పేరును ప్రకటించి పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. మరోవైపు, మంగళవారం ఉదయం మదురై చేరుకున్న కమల్కు ఎయిర్పోర్టులో అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించింది.
కమల్ బుధవారం రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కుటుంబ సభ్యులను కలుసుకుని అక్కడి కలాం సమాధి వద్ద అంజలిఘటిస్తారు. తర్వాత సాయంత్రం మదురైలో నిర్వహించనున్న బహిరంగ సభలో పార్టీ పేరు, పతాకం, పార్టీ లక్ష్యాలను కమల్ ప్రకటిస్తారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాజరుకానున్నారు. పార్టీ ఏర్పాట్ల సన్నాహాల్లో భాగంగా ఇటీవల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం విజయన్లను, డీఎంకే నేతలు కరుణానిధి, స్టాలిన్లతోపాటు రజనీకాంత్, విజయ్కాంత్లను కమల్ కలుసుకున్నారు.