
సాక్షి, ఏపీ సచివాలయం : ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధానికి కఠినమైన చట్టాన్ని తెస్తున్నామని ఎక్సైజ్శాఖ మంత్రి నారాయణస్వామి తెలిపారు. గురువారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మద్యం బాటిల్ అక్రమంగా అమ్మితే ఆరు నెలల జైలు శిక్ష విధిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడైనా బెల్టు షాపులు కనిపిస్తే వాటిని నిర్వహించే వారిని జైలుకు పంపుతామని హెచ్చరించారు. త్వరలోనే ఈ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు వెల్లడించారు.
రాష్ట్రంలోని మహిళలందరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకోచ్చిన మద్యపాన నిషేధాన్ని స్వాగతిస్తే.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాత్రం వ్యతిరేకిస్తున్నారని ఎద్దేవాచేశారు. మద్యం ధరలు పెరిగితే చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పెరిగిన ధరల వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తోందని తెలిపారు. కంపెనీలకు, మద్యం ధరలకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు ఇన్నాళ్లు మద్యం కంపెనీల వద్ద నుంచి ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు.