లోకేశ్‌ టెన్త్‌ ఎలా పాస్ అయ్యాడో నాకు తెలుసు: నార్నే | Narne Srinivasa Rao lashes out at chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై రామ్మూర్తినాయుడే గెలుస్తాడు..

Published Sun, Apr 7 2019 2:34 PM | Last Updated on Sun, Apr 7 2019 4:48 PM

Narne Srinivasa Rao lashes out at chandrababu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకుని రాష్ట్రానికి అద్భుతమైన ముఖ్యమంత్రిని అందించబోతున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత నార్నే శ్రీనివాసరావు అన్నారు. ఆయన ఆదివారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ వల్లే ఏపీలో అభివృద్ధి సాధ్యమన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు 650 హామీలు ఇచ్చి అట్టర్‌ ప్లాప్‌ అయ్యారని, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం  ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని నార్నే స్పష్టం చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో వైఎస్‌ జగన్‌ బీసీలకు కూడా పెద్దపీట వేశారు. కార్పొరేషన్‌లు ఏర్పాటు చేసి అన్ని కులాలకు న్యాయం చేస్తారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్‌, వైఎస్సార్ మాదిరి సుపరిపాలన చేస్తారని అన్నారు.

‘చంద్రబాబు పచ్చి మోసగాడు. సొంత తమ్ముడికే ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వకుండా మోసం చేశాడు. తమ్ముడిని గొలుసులతో కట్టేసి పిచ్చి పట్టేలా చేశాడు. దమ్ముంటే రామ్మూర్తినాయుడు ఇప్పుడు ఎక్కడ, ఎలా ఉన్నాడో చూపించాలి. తమ్ముడి పరిస్థితి అలా కావడానికి బాబే కారణం. చంద్రగిరిలో ఓటింగ్‌ పెడితే చంద్రబాబు మీద రామ్మూర్తినాయుడే గెలుస్తాడు. అందుకే చంద్రబాబు తన మకాన్ని కుప్పానికి మార్చుకున్నాడు. అలాగే తిరుపతిలో చంద్రబాబు సొంత సోదరికి ప్రమాదం జరిగినా, ఇంతవరకూ ఆమెను ఎవరూ పరామర్శించలేదు. తోడబుట్టిన చెల్లిని చూడని చంద్రబాబు ఏపీ చెల్లెమ్మలను ఎలా చూసుకుంటాడు?.

చంద్రబాబు స్వంత బలంతో ఏరోజూ ఎన్నికల్లో గెలవలేదు. ఇక తన సుపుత్రుడు లోకేశ్‌ పదో తరగతి పాస్‌ కావడానికి ఏం చేశాడో నాకు తెలుసు. లోకేశ్‌ పాసయ్యేందుకు మంత్రి నారాయణ ఎలా సహకరించాడో కూడా తెలుసు. అప్పటి నుంచి ఆయనకు చంద్రబాబు ఎంత ముట్టచెబుతున్నాడో కూడా తెలుసు. చంద్రబాబు తన పాల డెయిరీని నిలబెట్టుకోవడానికి మిగతావారిని ఎలా నాశనం చేశాడో తెలుసు. ఏపీ ప్రజలను కోరుకుంటున్న చంద్రబాబు నమ్మొద్దు. చంద్రబాబు కాంగ్రెస్‌ నుంచి వలస వచ్చిన వ్యక్తి. మళ్లీ కాంగ్రెస్‌కే టీడీపీని తాకట్టు పెడతాడు. ఒకసారి ప్యాకేజీ అని, ఇంకోసారి ప్రత్యేక హోదా అని పూటకో మాట మారుస్తున్నాడు.

అమరావతికి ఇచ్చిన డబ్బులు, ప్యాకేజీ ద్వారా వచ్చిన నిధులు వీటన్నింటిని చంద్రబాబు ఏం చేశాడు. రాజధానిలో కేవలం రెండు తాత్కాలిక భవనాలు కట్టాడు. ఇక ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా చంద్రబాబే స్వయంగా అడ్డుకున్నాడు. ఆయన ఒక కంపెనకీ మాత్రమే సీఈవో, నాయకుడు కాదు. చంద్రబాబు ప్రాంతీయతను రెచ్చగొట్టి కేసీఆర్‌ను తిట్టి ఓట్లు రాబట్టుకుందామని అనుకుంటున్నాడు. కానీ హైదరాబాద్‌లో సెటిలర్లు సంతోషం, ప్రశాంతంగా ఉన్నారో అందరికీ తెలుసు. ఇదే హైదరాబాద్‌లో చంద్రబాబు కూడా ఉంటున్నారు అనే విషయం గుర్తు పెట్టుకుంటే మంచిది.’ అని నార్నే హితవు పలికారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement