
సాక్షి, అవనిగడ్డ: వచ్చే ఎన్నికల్లో కృష్ణాజిల్లా అవనిగడ్డ నుంచి పోటీ చేసేందుకు పవన్ కల్యాణ్ ఆలోచన చేస్తున్నారని ఆ జిల్లా జనసేన పార్టీ ఇన్చార్జ్ ముత్తంశెట్టి కృష్ణారావు తెలిపారు. మంగళవారం అవనిగడ్డలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేనను మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. సమావేశంలో ముత్తంశెట్టి విజయనిర్మల పాల్గొన్నారు.
కాగా, అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని గతంలో పవన్ కల్యాణ్ ప్రకటించారు. తిరుపతి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. పవన్ ఎక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారనే దానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. జనసేన పార్టీ దీనిపై ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.