
హర్యాణా: హర్యాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ...పాకిస్తాన్ ప్రధానమంత్రికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. పాకిస్తాన్ ఉగ్రవాదంపై పోరాడితే భారత్ మద్దతిస్తుందని, ఒకవేళ సైనిక సహాయాన్ని కోరినా ఇవ్వడానికి సిద్దమని ఆయన స్పష్టం చేవారు. జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్ కక్షపూరిత వైఖరి అవలంబిస్తున్న విషయం తెలిసిందే. గత నెలలో జరిగిన యుఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాలలో భవిష్యత్తులో అణుయుద్దం జరిగే అవకాశం ఉందంటూ ఇమ్రాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని రాజ్నాథ్ మండిపడ్డారు.
కశ్మీర్కు స్వేచ్చ కల్పిస్తామని ఇమ్రాన్ చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ వేదికలలో భారత్ను దోషిగా నిలబెట్టాలన్న పాక్ వ్యూహం బెడిసి కొట్టిందని ఆయన ఎద్దేవా చేశారు. అదే వేదికపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్నారని రాజ్నాథ్ కొనియాడారు. కాగా ఈ నెల 21న హర్యాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2014లో జరిగిన జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ 90 అసెంబ్లీ సీట్లకు గాను 47సీట్లు సాధించి అధికారం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.